ప్రభుత్వం నుంచి సబ్సిడీలు రావడంలేదు..
సబ్సిడీ నగదు ప్రభుత్వం వద్దే ఆగిపోవడంతో బ్యాంకులు అదనపు రుణాలు ఇవ్వడం లేదు
ప్లాట్లకు నగదు చెల్లించే గడువు మరో నాలుగు నెలలు పొడిగించాలి
ప్రభుత్వానికి ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల కావాల్సిన రాయితీలు ఇస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) స్థలాలకు నగదు చెల్లించలేమని ఏపీ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు అనార్ బాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 1,600 మంది ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు జీవో 7 ద్వారా ప్లాట్లు కేటాయించిందని ఆయన గుర్తు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఏపీఐఐసీకి నగదు చెల్లించేందుకు మరో మూడు నెలలు మాత్రమే గడువు పొడిగించిందని ఆయన పేర్కొన్నారు.
మూడు నెలల గడువు ఈ నెల 8తో ముగుస్తున్నందున మరో నాలుగు నెలలపాటు గడువు పెంచాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి యువరాజ్కు అనార్ బాబు సోమవారం లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఆ లేఖను ముఖ్యమంత్రి, పరిశ్రమలశాఖ మంత్రికి కూడా పంపారు. నిర్దిష్టమైన కారణాల వల్ల జీవో 7 ద్వారా ప్లాట్లు పొందిన ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు నగదు చెల్లించలేకపోతున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు రావడం లేదని, సబ్సిడీ నగదు ప్రభుత్వం వద్దనే ఆగిపోవడంతో బ్యాంకులు అదనపు రుణాలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
జీవో 7 పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 1600 మంది ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులన్నారని, ఇందులో సగం మందికి నూరు శాతం సబ్సిడీలు రాలేదన్నారు. వారిలోనే ఎక్కువ మంది ఏపీఐఐసీకి నగదు చెల్లించాల్సిన వారు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రావాల్సిన సబ్సిడీ నగదు పరిశ్రమల శాఖ వద్దే ఉన్నందున ఆ నగదును ఏపీఐఐసీకి బదిలీ చేసి సర్దుబాబు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు. సబ్సిడీలు వచ్చేంత వరకు మరో నాలుగు నెలలపాటు గడువు పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వర్గాలకు జీవో నెంబర్ 7 కింద ఇచి్చన ప్లాట్లను రద్దు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.


