రూ.296.28 కోట్ల బకాయిల వసూళ్లపై దృష్టి పెట్టాలి
కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం
సాక్షి, అమరావతి: జాతీయ దళిత ఆర్థిక సంస్థ(ఎన్ఎస్ఎఫ్డీసీ), జాతీయ సఫాయి కర్మచారీస్ ఆర్థిక అభివృద్ధి సంస్థ (ఎన్ఎస్కెఎఫ్డీసీ) పథకాల కింద ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీల స్వయం ఉపాధి కోసం మంజూరు చేసిన రుణాలను వారి నుంచి ముక్కుపిండి వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మండల స్థాయిలో ప్రత్యేకంగా రికవరీ బృందాలను ఏర్పాటు చేసింది. మండల స్థాయిలో రికవరీ బృందాలను ఏర్పాటు చేసి ఆ రుణాలను వసూలు చేయాలని జిల్లా యంత్రాంగాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రికవరీ బృందాల పనితీరుపై దృష్టి సారించాలని కలెక్టర్లను ఆదేశించింది. కొన్ని సంవత్సరాలుగా ఎస్సీల స్వయం ఉపాధి కోసం రూ.396.96 కోట్లను రుణాలుగా మంజూరు చేశారు. ఇందులో ఇప్పటికే రూ.100.68 కోట్లను రికవరీ చేశారు. మిగతా 296.28 కోట్లను వసూలు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది.
గుంటూరు జిల్లాలో అత్యధికంగా రూ.30.69 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.25.10 కోట్లు, అనంతపురం జిల్లాలో రూ.7.68 కోట్లు ఎక్కువ బకాయిలున్నాయని, వాటిని రాబట్టాలని సూచించింది. ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, సిబ్బందితో మండలాల వారీగా రికవరీ బృందాలను ఏర్పా టు చేసి ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నారు.


