రెండేళ్లు అవుతున్నా.. హామీలకు దిక్కూమొక్కూ లేదని ప్రశ్నించడం నేరమా?
అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లపై దమనకాండ అత్యంత హేయం
చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరిన అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లపై చంద్రబాబు సర్కారు ప్రదర్శించిన దమనకాండ అత్యంత హేయమని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ‘ఛలో విజయవాడ’కు తరలివచ్చిన అంగన్వాడీ మహిళలను నిద్రిస్తున్న సమయంలో అత్యంత దారుణంగా అక్రమంగా అరెస్టులు చేయడాన్ని వైఎస్ జగన్ తప్పుబట్టారు. ఈ మేరకు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఎక్స్’లో వైఎస్ జగన్ మంగళవారం పోస్టు చేశారు.
అందులో ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు గట్టిగా అడగడం తప్పు అవుతుందా? రెండేళ్లు అవుతున్నా.. ఆ హామీలకు దిక్కూ మొక్కూ లేదని నిలదీయడం, ప్రశ్నించడం నేరం అవుతుందా? అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లపై మీ దమనకాండ అత్యంత హేయం. మహిళలని కూడా చూడకుండా వారిపై లాఠీఛార్జీ.. పోలీసుల చేత బలప్రయోగం.. ఎక్కడికక్కడ నిర్బంధం.. వారికి కనీస సౌకర్యాలు కూడా లేకుండా చేసి అత్యంత అమానవీయంగా వ్యవహరించారు.
ఇలా చేయడానికి మీకు సిగ్గనిపించడం లేదా? వాళ్లు ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే... ఈరోజు ఉదయం చర్చలకు పిలుస్తామని చెప్పి, ముందు రోజు రాత్రే నిరసన శిబిరాలకు కరెంటు తీసివేసి, కంచెలు వేసి, కనీసం ఆహారం, తాగునీళ్లు అందకుండా చేయడం దారుణం కాదా? ఏరుదాటాక తెప్పతగలేసే మీ ధోరణి, సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు ఎగరగొట్టి పచ్చి మోసాలు ఎలా చేస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారు.
ఒక్క అంగన్వాడీలకే కాదు.. రైతులకు, విద్యార్థులకు, మహిళలకు, ఉద్యోగులు సహా వివిధ వర్గాల వారికి మీరు చేస్తున్న అన్యాయాలు, వెన్నుపోట్లు శిశుపాలుడి పాపాల్లా పెరుగుతూనే ఉన్నాయి. దీనికి తప్పకుండా మీరు మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. చంద్రబాబుగారూ.. మీరు తక్షణం అంగన్వాడీలు, వర్కర్లకు క్షమాపణలు చెప్పాలని, వారికిచి్చన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నా!!


