నెలరోజులవుతోంది.. ఏం చేశారు సార్ ?
తప్పు చేసిన వాడు క్రికెట్ ఆడుకుంటున్నాడు
ఎవరూ లేని అనాథను.. ఇప్పుడు శ్రీధర్ చేతుల్లో మోసపోయి ఒంటరిదాన్ని అయ్యాను
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారూ స్పందించండి
రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు
సాక్షి టాస్క్ ఫోర్స్: రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనకు చేసిన అన్యాయంపై సాక్ష్యాలతో సహా నిరూపించి నెల అయిందని, కమిటీలు వేశారు గానీ చర్యలు తీసుకోలేదని బాధిత మహిళ తాజాగా వీడియో ఒకటి విడుదల చేశారు. ‘జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ప్రత్యేకంగా కమిటీ వేసి హడావుడి చేశారు. అయితే ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఒక మహిళకు అన్యాయం జరిగితే అధికారం అండతో చర్యలు తీసుకోవడం లేదు. అరవ శ్రీధర్పై కేసు నమోదు చేశారు.
నాపై కేసు నమోదు చేశారు.. అయితే ఏమి చేశారు..’ అని బాధిత మహిళ ప్రశ్నించింది. జనసేన పార్టీ టికెట్ ఇవ్వడం ద్వారానే అరవ శ్రీధర్ తనకు పరిచయమయ్యాడని, అతను ఎమ్మెల్యే కాకపోతే తన జీవితంలోకి వచ్చేవాడు కాదని, ఇందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి న్యాయం చేయాలని కోరారు.
తాను తల్లి, తండ్రీ లేని అనాథనని, ఇప్పుడు అరవ శ్రీధర్ చేతుల్లో మోసపోయి ఎవరూ లేని ఒంటరిదాన్ని అయిపోయానని వాపోయింది. తప్పు చేసిన వాడు దర్జాగా క్రికెట్ ఆడుతున్నాడని, అధికారం అండతో అతన్ని కాపాడుతున్నారని విమర్శించింది. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని వీడియో ద్వారా కోరారు.


