పోలవరంలో పెను విధ్వంసం బాబు తప్పిదమే..! | CAG report on Polavaram project works | Sakshi
Sakshi News home page

పోలవరంలో పెను విధ్వంసం బాబు తప్పిదమే..!

Mar 7 2026 5:27 AM | Updated on Mar 7 2026 5:27 AM

CAG report on Polavaram project works

2017–18 నుంచి 2023 మార్చి వరకూ పోలవరం ప్రాజెక్టు పనులపై కాగ్‌ నివేదిక

డీపీఆర్‌ షెడ్యూలు ప్రకారం స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్, కాఫర్‌ డ్యాంలు కట్టి గోదావరి వరదను మళ్లించాకే డయాఫ్రం వాల్‌ నిర్మించాలి 

కానీ.. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ చేయకుండానే పాక్షికంగా కాఫర్‌ డ్యాంలు చేసి డయాఫ్రం వాల్‌ను 2018 నాటికే పూర్తి చేశారు 

కాఫర్‌ డ్యాంలలో 600 మీటర్ల వెడల్పుతో వదిలిన ఖాళీ ప్రదేశాల్లో గోదావరి వరద ప్రవహించడంతో డయాఫ్రం వాల్‌ కోతకు గురై దెబ్బతింది 

దీనివల్ల రూ.399 కోట్లు ప్రజాధనం నష్టం.. ప్రాజెక్టు పనుల్లో తీవ్ర జాప్యానికి ఇదే కారణం 

నామినేషన్‌ పద్ధతిలో నవయుగకు రూ.2,019.67 కోట్ల పనులు అప్పగించారు 

జలవిద్యుత్కేంద్రం పనుల్లో నవయుగకు రూ.145.47 కోట్ల లబ్ధి చేకూర్చారు 

పోలవరం పనుల్లో చంద్రబాబు సర్కార్‌ తప్పిదాలను కడిగిపారేసిన కాగ్‌ 

సాక్షి, అమరావతి: పోలవరం పనుల్లో 2017, 2018లో చంద్రబాబు సర్కార్‌ పాల్పడిన తప్పిదాల వల్లే డయాఫ్రం వాల్‌ దెబ్బతినడంతోపాటు పెను విధ్వంసం చోటుచేసుకుందని కం్రప్టోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) తేల్చి చెప్పింది. ప్రాజెక్టు డీపీఆర్‌ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) నిర్మాణ షెడ్యూల్‌ ప్రకారం గోదావరి ప్రవాహాన్ని మళ్లించేలా స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలను పూ­ర్తి చేశాక.. ప్రధాన డ్యాం నిర్మాణం పునాది డయా­ఫ్రం వాల్‌ను నిర్మించాలని గుర్తు చేసింది. 

కానీ.. దానికి విరుద్ధంగా స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలను పూర్తి చేయకుండానే ప్రధాన డ్యాం పునాది డయాఫ్రం వాల్‌ పనులను 2017 ఫిబ్రవరిలో రూ.399.77 కోట్లతో ప్రారంభించి 2018 జూన్‌ నాటికి పూర్తి చేశారని పేర్కొంది. 2019 వర్షాకాలం ప్రారంభానికి ముందే ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలను పూర్తి చేయాలనే లక్ష్యంతో 2018 నవంబర్‌లో పనులు చేపట్టారని తెలిపింది. కానీ.. నిర్వాసితులకు పునరావాసం కల్పించలేకపోవడంతో ఎగువ కాఫర్‌ డ్యామ్‌కు ఇరువైపులా 600 మీటర్ల వెడల్పుతో ఖాళీలను వదిలేశారని పేర్కొంది. 

దీంతో 2,400 మీటర్ల వెడల్పుతో ప్రవహించాల్సిన గోదావరి వరద.. ఎగువ కాఫర్‌ డ్యాంలో వదిలిన 600 మీటర్ల ఖాళీ ప్రదేశంలో కుంచించుకుపోయి ప్రవహించాల్సి వచ్చిందని.. ఫలితంగా వర­ద ఉద్ధృతి మరింత పెరిగి డయాఫ్రం వాల్‌ కోతకు గురై దెబ్బతిందని, ప్రధాన డ్యాం గ్యాప్‌–2లో భారీ­గా కోతకు గురైందని స్పష్టం చేసింది. అదే.. నిర్మాణ షెడ్యూలు ప్రకారం పనులు చేపట్టి ఉంటే ఈ విధ్వంసం చోటుచేసుకునేది కాదని.. డయాఫ్రం వాల్‌ కోసం చేసిన రూ.399.77 కోట్ల వ్యయం వృథా అయ్యిందని కాగ్‌ స్పష్టం చేసింది. ప్రాజెక్టు పనుల్లో తీవ్ర జాప్యానికి ఇదే కారణమైందని పేర్కొంది.  

డయాఫ్రం వాల్‌ దెబ్బతినడంతో దానికి సమాంతరంగా కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణం, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని యధాస్థితికి తెచ్చే పనులకు రూ.2020.05 కోట్లతో 2023 ఏప్రిల్‌లో సర్కార్‌ పరిపాలన అనుమతి ఇచ్చిందని పేర్కొంది. పోలవరం పనులపై 2017–18 నుంచి 2023 మార్చి వరకూ అధ్యయనం జరిపి కాగ్‌ నివేదిక ఇచ్చింది. 

నిర్మాణ పనుల్లో తప్పిదాలు.. నామినేషన్‌ పద్ధతిలో భారీ ఎత్తున పనులు అప్పగించడం.. కాంట్రాక్టర్లకు భారీ ఎత్తున ప్రయోజనం చేకూర్చడం.. భూసేకరణలో జరిగిన లోటుపాట్లను కాగ్‌ తన నివేదికలో తూర్పారబడుతూ చంద్రబాబు సర్కార్‌ను కడిగిపారేసింది. ప్రధాన డ్యాం పనులు సజావుగా సాగేందుకు నిర్మాణ షెడ్యూలుకు కట్టుబడి ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చూడాలంటూ చంద్రబాబు సర్కార్‌కు అక్షింతలు వేసింది. కాగ్‌ నివేదికలో ప్రధానాంశాలు ఇవీ..  

అడ్డగోలుగా నిబంధనల ఉల్లంఘన.. 
పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌(జలాశయం) పనులను రూ.4,054 కోట్లకు ట్రాన్స్‌ట్రాయ్‌ 2013 మార్చిలో ఈపీసీ(ఇంజినీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌) విధానంలో దక్కించుకుంది. 2018 మార్చి నాటికి పనులు పూర్తి చేసేలా ట్రాన్స్‌ట్రాయ్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. విభజన చట్టం ప్రకారం కేంద్రమే నిరి్మంచాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను 2016 సెప్టెంబరులో రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుంది. ట్రాన్స్‌ట్రాయ్‌తో ప్రభుత్వం 2013లో కుదుర్చుకున్న ఒప్పందం 25వ నిబంధన ప్రకారం ప్రాజెక్టు పనులకు అవసరమైన సామగ్రి, పనిముట్లను కాంట్రాక్టరే సమకూర్చుకోవాలి. 

కానీ.. దానికి విరుద్ధంగా సామగ్రి, ఇతర ఖర్చుల కోసం కాంట్రాక్టర్‌కు 2017 మే నుంచి 2018 మే వరకూ రూ.170 కోట్లను ఇంప్రెస్ట్‌ అమౌంట్‌ కింద ప్రభుత్వం ఇచ్చింది. మొబిలైజేషన్‌ అడ్వాన్సుతో కలిపి రూ.446.32 కోట్లు కాంట్రాక్టర్‌కు ఇచ్చినట్లయింది. అందులో  2018 నవంబర్‌ నాటికి రూ.302.10 కోట్లను కాంట్రాక్టర్‌ నుంచి ప్రభుత్వం వసూలు చేసింది. మిగతా రూ.144.22 కోట్లలో బ్యాంకు గ్యారంటీల రూపంలో రూ.123.07 కోట్లను 2019 మార్చిలో వసూలు చేసింది. ఇప్పటికీ ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి ఇంకా రూ.21.15 కోట్లను వసూలు చేయాల్సి ఉందని కాగ్‌ పేర్కొంది.   

» 2018, జనవరి నాటికి రూ.1,755.05 కోట్ల విలువైన పనులను మాత్రమే ట్రాన్స్‌ట్రాయ్‌ చేసింది. పనుల్లో వేగం పెంచడం పేరుతో ఏపీడీఎస్‌ఎస్‌లో 60(సీ) నిబంధన ప్రకారం  రూ.2,019.67 కోట్ల విలువైన పనులను ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి తొలగించి.. ఈపీసీ పద్ధతిలో కాకుండా ఎల్‌ఎస్‌(లంప్సమ్‌)విధానంలో నవయుగకు నామినేషన్‌ పద్ధతిలో 2018 ఫిబ్రవరి 17న నామినేషన్‌ పద్ధతిలో చంద్రబాబు సర్కార్‌ అప్పగించింది. ఇది నిబంధనలకు విరుద్ధమని కాగ్‌ స్పష్టం చేసింది.  

»   ఏపీడీఎస్‌ఎస్‌లో 60(సీ) నిబంధన ప్రకారం పనుల ఒప్పందం విలువలో 5 శాతం అంటే రూ.269.29 కోట్లను ట్రాన్స్‌ట్రాయ్‌కు జరిమానాగా విధించి వసూలు చేయాలి. ఈపీడీఎసీఎల్‌కు రూ.26.02 కోట్లను ట్రాన్స్‌ట్రాయ్‌ చెల్లించాలి. ఇంప్రెస్ట్‌ అమౌంట్‌పై వడ్డీ రూ.30.61 కోట్లను కూడా కలుపుకొంటే మొత్తం రూ.331.90 కోట్లను ట్రాన్స్‌ట్రాయ్‌ నుంచి వసూలు చేయాలి. అయితే    ట్రాన్స్‌ట్రాయ్‌ దివాలా తీసింది. రూ.331.90 కోట్లను వసూలు చేయడానికి ఎన్‌సీఎల్‌టీలో ప్రభుత్వం దావా కూడా వేయకపోవడాన్ని కాగ్‌ ఆక్షేపించింది.  

»   నవయుగకు నామినేషన్‌ పద్ధతిలో అప్పగించిన పనులను నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసింది. వాటితోపాటు జలవిద్యుత్కేంద్రం పనులకు రివర్స్‌ టెండరింగ్‌ విధానంలో టెండర్‌ నిర్వహించడంతో ఖజానాకు రూ.628.43 కోట్లు ఆదా అయ్యిందని కాగ్‌ నివేదికలో వెల్లడించింది.   

జలవిద్యుత్కేంద్రం పనుల్లో నవయుగకు రూ.145.47 కోట్లు అనుచిత లబ్ది.. 
»    పోలవరం జలవిద్యుత్కేంద్రం పనులను 2017 డిసెంబర్‌లో రూ.3,220.28 కోట్లకు నవయుగ దక్కించుకుంది. టర్బైన్‌ నమూనా పరీక్ష విజయవంతంగా పూర్తయిన తర్వాత వడ్డీ లేని ముంద­స్తు చెల్లింపు కింద రూ.145.47 కోట్లను నవయుగకు చెల్లించింది. కానీ దీనికి జెన్‌కో బోర్డు ఆమోదంగానీ ప్రభుత్వం ఆమోదంగానీ లేదు. దీన్ని బట్టి చూస్తే నవయుగకు రూ.145.47 కోట్ల­ను అనుచితంగా లబ్ధి చేర్చారని కాగ్‌ తప్పుబట్టింది. 

»  కుడి, ఎడమ కాలువ తవ్వకంలో 12.02 కోట్ల క్యూ­బిక్‌ మీటర్ల మట్టి కాలువ గట్లపై ఉంది. దీని విలు­వ రూ.1,660.15 కోట్లు. మట్టిని అమ్మితే ప్ర­భు­త్వానికి ఆదాయం వస్తుంది. దొంగతనం కాకుండా చూడాలని ప్రభుత్వానికి కాగ్‌ సూచించింది.   

భూసేకరణలో లోపం... పునరావాసం కల్పనలో నిర్లక్ష్యం.. 
»  పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే భూమితోపాటు నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి మొత్తం 1,79,770 ఎకరాల భూమిని సేకరించాలని అంచనా వేశారు. ఇందులో 1,67,765 ఎకరాల భూసేకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 2023 మార్చి నాటికి 1,13,119 ఎకరాలు సేకరించారు. మరో 54,646 ఎకరాలు సేకరించాల్సి ఉంది.  

» పోలవరం కోసం సేకరించాల్సిన భూమిలో 8,185.27 ఎకరాలకు డీకేటీ పట్టాలు జారీ చేశారు. 1,838.64 ఎకరాల ఆక్రమణకు గురైంది. మొత్తం ఈ 10,023.91 ఎకరాల సేకరణకు రూ.619.83 కోట్లు పరిహారం చెల్లించి సేకరించాల్సి వచ్చిందని కాగ్‌ పేర్కొంది. 

» ప్రాజెక్టుతో 373 గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఈ గ్రామాల్లోని 1,06,006 కుటుంబాల­కు పునరావాసం కల్పించాలి. 2014 నాటికి 6 గ్రా­మా­ల్లోని 714 కుటుంబాలకు పునరావాసం కల్పిస్తే.. 2014–15 నుంచి 2018–19 వరకూ 11 గ్రామా­ల్లోని  3,066 కుటుంబాలకు.. 2019–20 నుంచి 2023, మార్చి వరకూ 21 గ్రామాల్లోని 7,897 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. ఇంకా 94,329 కుటుంబాలకు పునరావాసం కల్పించాలి. నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని కాగ్‌ ఆక్షేపించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement