నినదించిన ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యాలయం వద్ద ధర్నా
మా సమస్యలపై పవన్కళ్యాణ్ ఒక్కసారి కూడా మాట్లాడలేదు
ఎంపీపీల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు హనుమంతరావు, రెడ్డప్ప
తాడేపల్లి రూరల్: ప్రజా ప్రతినిధులమైన తమపట్ల చంద్రబాబు ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు ధ్వజమెత్తారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాల ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు శుక్రవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృది్ధశాఖ రాష్ట్ర కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ప్రజాప్రతినిధులందరికీ ఒకే రూలు ఉండాలని, వివక్ష సరికాదని నినదించారు. ఈ సందర్భంగా ఎంపీపీల సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మేకల హనుమంతరావు, రెడ్డప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన అందరికీ ఒకే నిబంధన ఉండాలన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలకు మాత్రం అవసరమైన అన్నింటిని సమకూర్చుకుని ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లకు మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం మొండిచేయి చూపిస్తోందని విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు రెండేళ్లవుతున్నా సీఎం అమలు చేయడంలేదన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృది్ధశాఖ మంత్రిగా పవన్కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తరువాత తమ సమస్యలపై ఒక్కసారి కూడా పెదవి విప్పలేదని విమర్శించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు నెలనెలా జీతాలు, అలవెన్సులు తీసుకుంటున్నారని, 30 నెలలుగా ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్లు, వార్డు సభ్యులకు ఒక్క రూపాయి వేతనం కూడా చెల్లించలేదని చెప్పారు. మండల పరిషత్ నిధులతో చేపట్టిన పనుల బిల్లులు కూడా చెల్లించలేదని తెలిపారు. ప్రభుత్వం వెంటనే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలన్నారు. నెలకు ఎంపీపీలకు రూ.25 వేలు, ఎంపీటీసీ సభ్యులకు రూ.10 వేలు వేతనాలివ్వాలని కోరారు. 15వ ఆర్థిక సంఘం నిధులను వినియోగించుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను వెంటనే ఎత్తేయాలన్నారు.
సొమ్మసిల్లిన కాకినాడ జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షుడు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృది్ధశాఖ కమిషనర్ కృష్ణతేజకు వినతిపత్రం ఇచ్చేందుకు వెళుతున్న ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో తీవ్ర ఆందోళనకు గురైన కాకినాడ జిల్లా ఎంపీపీల సంఘం అధ్యక్షుడు గొల్లపల్లి నరసింహమూర్తి సొమ్మసిల్లి కిందపడిపోయారు. ఆయన్ని వెంటనే స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై పోలీసులు ఒత్తిడి తీసుకురావడం వల్లే నరసింహమూర్తి అస్వస్థతకు గురయ్యారని ఎంపీపీలు చెప్పారు.


