సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలపై నేరాలు పెరిగిపోయాయని ఆమె నిలదీశారు. సీఎం సొంత జిల్లాలోనే 10 శాతం నేరాలు పెరిగాయన్న వరుదు కళ్యాణి.. హోంమంత్రి అనిత ఇంఛార్జిగా ఉన్న విజయనగరం జిల్లాలో మహిళలపై నేరాలు పెరిగాయని వివరించారు.
‘‘గంజాయి లేదని హోంమంత్రి చెబుతున్నారు. మదనపల్లిలో 7 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి డమ్ములో వేసి చంపేశారు. తిరుపతిలోనే డ్రగ్స్, గంజాయి పెరిగిపోయింది. 112కి ఫోన్ చేస్తే రావడానికి 25 నిమిషాలు తర్వాత స్పందిస్తున్నారు. ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయింది. కాపాడండని వేడుకుంటున్నా పట్టించుకున్న నాథుడు లేడు. కూటమి ఎమ్మెల్యే ఓ మహిళను గర్భవతిని చేసి ఐదు సార్లు అబార్షన్ చేయించాడు. ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది?. ఆడపిల్లలంటే ప్రభుత్వానికి ఎందుకింత నిర్లక్ష్యం’’ అంటూ వరుదు కల్యాణి ప్రశ్నించారు. వరుదు కళ్యాణి ప్రశ్నకు హోంమంత్రి అనిత సమాధానం చెప్పలేదు.
మండలిలో మైకుల సమస్య
ఏపీ శాసన మండలిలో మైకుల సమస్య ఏర్పడింది. వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రుల సమాధానం చెప్పినప్పుడు మైకులు మ్యూట్లోకి వెళ్తున్నాయి. మైకుల సమస్య పరిష్కరించాలని ఛైర్మన్ దృష్టికి శానమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీసుకెళ్లారు.
లా ఉంది.. కానీ ఆర్డర్ మాత్రం ఎక్కడా లేదు: భరత్
ఎమ్మెల్యే భరత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో లా ఉంది కానీ ఆర్డర్ మాత్రం ఎక్కడా లేదన్నారు. కొత్త చట్టాలు ఏయే రాష్ట్రాలు ఎలా అమలు చేస్తున్నాయో కేంద్రం ఓ నివేదిక ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన నివేదికలో ఏపీ 36వ స్థానంలో ఉంది. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తల వేధింపులపై పెట్టిన శ్రద్ధ పోలీసింగ్పై పెట్టాలి. అలా చేస్తే రాష్ట్రం పరువైనా మిగులుతుందని భరత్ అన్నారు.


