చెత్త కుప్పను ఆవాసంగా మార్చుకుని కాలం వెల్లదీస్తున్న అభాగ్యురాలు
ఆమె ఎవరో ... ఏ ఊరో తెలీదు.. ఆమెకు తెలుగు భాష కూడా రాదు.. ఇక్కడికే ఎందుకొచ్చిందో.. నా అన్నవాళ్లెవరైనా ఉన్నారో సమాచారం లేదు... చెత్తకుప్పే ఆవాసంగా మార్చుకుని.... మురికి కాలువ గట్టే పట్టు పాన్పుగా మలుచుకుని బతుకుతోంది. పగలు మండే ఎండలోనూ.. రాత్రయితే ఎముకలు కొరికే చలిలోనూ బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా కాలం వెల్లదీస్తోంది. సుమారు ఐదు పదుల వయస్సు.. ముడతలు పడిన దేహంతో.. ముసురుకున్న ఈగలతో ‘రోజు’ను భారంగా వెల్లదీస్తోంది.
ఈమె ఉండేది ఏ మారుమూల పల్లెలో కాదు.. పట్టణ శివారు అస్సలు కాదు.. మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం పక్కనే దీనంగా బతుకీడుస్తోంది. ఈ దారిలో నిత్యం వేలాదిమంది పోతుంటారు... సాక్షాత్తు కలెక్టర్, సబ్ కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ, గెజిటెడ్ ఉద్యోగులు, ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ దారిలోనే విధులకు వెళ్తుంటారు. ఆమెను చూశారో లేదో తెలీదు.. ఇప్పటికైనా మించిపోయింది లేదు.. మానవతాహృదయంతో స్పందించి కాస్త ఆశ్రయం కల్పిస్తే .. కాసింత నీడ కలిపిస్తే చాలు.. ఆ తల్లికి అదే పదివేలు..
మదనపల్లె టౌన్


