మోకాళ్లపై గంటల పాటు నిల్చోపెట్టిన వైనం
ప్రకాష్నగర్ ఆక్స్ఫర్డ్ పాఠశాల ప్రిన్సిపల్ దుశ్చర్య..
ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు, మద్దతు ఇచ్చిన విద్యార్థి సంఘాలు
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా నరసరావుపేట ప్రకాష్నగర్లోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినిని ప్రిన్సిపాల్ జుట్టు పట్టుకొని ఈడ్చికొట్టడంతో సోమవారం ఉద్రిక్తత చోటుచేసుకొంది. జరిగిన అవమానాన్ని విద్యార్థిని తల్లిదండ్రులకు తెలియజేయడంతో బంధువులు, విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగాయి. వివరాలు.. ఏనుగుల బజారుకు చెందిన బాలిక ప్రకాష్నగర్లోని ఆక్స్ఫర్డ్ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది.
పాఠశాల ప్రిన్సిపల్, డైరెక్టర్ శంకరరెడ్డి జుట్టు పట్టుకుని వీపుపై తీవ్రంగా కొట్టడంతో పాటు మోకాళ్లపై నిల్చోబెట్టి వేధించాడని తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు పాఠశాల వద్దకు చేరుకుని డైరెక్టర్ శంకరరెడ్డితో వాగ్వాదానికి దిగారు. విద్యార్థి సంఘాల నాయకులు చేరుకుని బాలిక తల్లిదండ్రులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సీఐ ఫిరోజ్, ఎస్ఐ వంశీకృష్ణ అక్కడికి చేరుకుని ఇరుపక్షాలను పోలీస్స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. గాయాలైన బాలికను వైద్యశాలకు చికిత్స నిమిత్తం పంపారు.


