చలో విజయవాడ విజయవంతం చేయాలి
ఎస్టీయూ ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు
చిలకలూరిపేట: ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చా లని కోరుతూ ఈ నెల 25న నిర్వహిస్తున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు, రాష్ట్ర డైరీ కమిటీ కన్వీనర్ పి.శ్రీనివాసరావు పిలుపు నిచ్చారు. ఎస్టీయూ ఆధ్వర్యంలో చలో విజయవాడ (సమరశంఖం) పోస్టర్ను పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల ఐక్య పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం మౌనం వహిస్తే సహించేది లేదని, ఇది హక్కుల కోసం జరుగుతున్న పోరాటంగా అభివర్ణించారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, 30 శాతం మధ్యంతర భృతి కల్పించలన్నారు. ఆర్ధిక బకాయిలకు వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులకు పెన్షన్ ప్రయోజనాలు వెంటనే చెల్లించాలన్నారు. ఉపాధ్యాయులపై బోధనేతర విధులు లేకుండా చూడాలన్నారు. ఇలాంటి ఎన్నో సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న చలో విజయవాడ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు బి.రవి, వి. అక్కయ్య, వి.జయప్రకాశ్, షేక్ మస్తాన్వలి, వి.రమణానాయక్, ఎ.శ్రీనివాసరావు, సోమ్లానాయక్, సీహెచ్ మల్లేశ్వరరావు పాల్గొన్నారు.


