Palnadu District News
-
అసలు రంగు బయటపడింది
పల్నాడురంగురాళ్ల కేసు నీరుగార్చేందుకు ‘పచ్చ’కుట్రలు సాక్షి, నరసరావుపేట: అక్రమంగా అటవీ సంపదను దోచుకుంటున్న ముఠాను పట్టుకున్న విజిలెన్స్, ఆటవీశాఖ అధికారులను బెదిరించి రంగురాళ్ల కేసును నీరుగార్చేందుకు అధికారపార్టీ నేతలు తమ అసలు రంగు బయటకపెట్టుకుని పచ్చ కుట్రలకు తెరలేపారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం శంకరపురం గ్రామ సమీపంలో దొరికే రంగురాళ్ల(క్రిస్టల్, క్వార్జ్జ్)ను దాచేపల్లి సమీపంలోని ఓ గోడౌన్లో దాచగా గత శుక్రవారం రాత్రి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈక్రమంలో శంకరపురం అటవీసమీపంలోని పలు గ్రామాల్లోని కూలీల ఇళ్లలో భారీ ఎత్తున రంగురాళ్లు నిల్వ చేశారన్న సమాచారంతో విజిలెన్స్, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. అయితే ఈ సమాచారం తెలియడంతో రంగురాళ్లు అధికారుల కంటపడకుండా రంగురాళ్ల మాఫియా జాగ్రత్తపడింది. విజిలెన్స్, అటవీ అధికారులు, సిబ్బంది సోదాలు నిర్వహించే సమయంలో టీడీపీ నేతల సన్నిహితంగా ఉండే కూలీలు హంగామా సృష్టించారు. సోదాలు నిర్వహించకూడదంటూ ఎదురుతిరిగారు. రంగురాళ్ల తవ్వకాలకు స్థానిక టీడీపీ నేతలకు ఓ ఫారెస్ట్ అధికారి, కొందరు సిబ్బంది బాగా సహకరిస్తున్నట్టు సమాచారం. సదరు ఫారెస్టు అధికారికి తెలియకుండా దాడులు నిర్వహించి రంగురాళ్ల పట్టుకోవడంతో అధికారపార్టీ నేతలతో కలసి కుట్రలకు తెరలేపినట్టు ఆ శాఖ అధికారులే చెప్పుకొస్తున్నారు. ఇందులో భాగంగా భట్రుపాలెంకు చెందిన కొందరు కూలీలతో సోదాలు నిర్వహించిన అధికారులపై దాచేపల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయించారు. షెడ్యూల్ తెగలకు చెందిన తమ ఇళ్లలోకి అటవీశాఖ అధికారులు, సిబ్బంది ప్రవేశించి కూలం పేరుతో దూషించి దౌర్జన్యం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారట. ● దీనిపై దాచేపల్లి సీఐ రాజేష్ను వివరణ అడగగా ఫిర్యాదు అందిందని, దానిపై విచారణ చేస్తున్నామని ‘సాక్షి’కి తెలిపారు. అయితే సోదాలు నిర్వహించే సమయంలో ఒకటి రెండు నిబంధనలు పాటించలేదన్న సాకుతో ఏ తప్పు చేయకపోయినా మాపై ఫిర్యాదుచేయడం ఏంటని అటవీశాఖ అధికారులు వాపోతున్నారు. ఇలా అయితే ఉద్యోగాలు ఎలా చేయగలమని, రంగురాళ్ల మాఫియా ఏ స్థాయిలో ఉందో చెప్పడానికే ఇదే నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగురాళ్ల మాఫియాతో చేతులు కలపి అటవీ సంపదను దోచుకోవడమే కాక సొంత సిబ్బందిపైనే ఫిర్యాదు చేయించిన అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు. అటవీశాఖ సిబ్బందిపై ఇచ్చిన ఫిర్యాదుపై సోమవారం పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావును అటవీశాఖ అధికారులు కలసినట్టు సమాచారం. రంగురాళ్ల నిల్వలున్నాయని పలువురు కూలీల ఇళ్లలో సోదాలు నిర్వహించిన విజిలెన్స్, అటవీ అధికారులు కులం పేరుతో తమను దూషించారంటూ అధికారులపై కూలీలతోనే ఫిర్యాదు చేయించిన రంగురాళ్ల మాఫియా అక్రమ కేసుపై పల్నాడు ఎస్పీని కలసిన అటవీ శాఖ అధికారులు రంగురాళ్ల కేసులో తెరవెనుక ఉన్న టీడీపీ నేతలు, సహకరించిన అధికారుల పాత్రపై విచారణను అడ్డుకునేందుకు కుట్ర అధికార పార్టీ నేతలు, అటవీ శాఖ అధికారులు కలసి రెండేళ్లలో రూ.కోట్ల విలువైన రాళ్లను విక్రయించిన వైనం రంగురాళ్లు పట్టుబడటం, దాని వెనుకున్న అధికారపార్టీ నేతలు, అవినీతి అధికారుల గుట్టు భయటపడుతుందన్న భయంతో కుట్రలకు తెరతీశారు. ఏకంగా అటవీశాఖ అధికారులపైనే ఫిర్యాదులు ఇవ్వడం ఆశ్చార్యానికి గురిచేస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రంగురాళ్ల మాఫియా కోట్లాది రూపాయల విలువచేసే రాళ్లు సేకరించి అక్రమార్జన చేశారు. ఇవన్ని బయటపడకుండా మాఫియా కుట్రలకు తెరలేపిందని సమాచారం. మరోవైపు దాచేపల్లి మండలంలోని శంకరపురం అటవీప్రాంతానికి ఆనుకొని ఉన్న కాట్రపాడు, భట్రుపాలెం తదితర గ్రామాలలో భారీస్థాయిలో రంగురాళ్లు ఉన్నాయని, వాటిపై దాడులు చేస్తే రంగురాళ్లు పెద్ద ఎత్తున బయటపడతాయని స్థానికులు చెప్పుకొస్తున్నారు. పిడుగురాళ్ల: పట్టణంలోని గంగమ్మ తల్లి దేవస్థానంలో సోమవారం వైభవంగా కల్యాణం నిర్వహించారు. వేద పండితులు అగ్నిహోమం నిర్వహించారు. -
ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి
జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా గుంటూరు ఎడ్యుకేషన్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో తప్పిన విద్యార్థులకు ప్రత్యేక రెమిడీయల్ శిక్షణతో నూరు శాతం ఉత్తీర్ణులయ్యే విధంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీమ్ బాషా పేర్కొన్నారు. పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్లో సోమవారం జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించారు. డీఈవో మాట్లాడుతూ ఇటీవల ప్రకటించిన పరీక్ష ఫలితాల్లో గుంటూరు జిల్లాలో 11 శాతమే ఫెయిల్ అయ్యారని, సమష్టి కృషితో వారందరినీ ఉత్తీర్ణులుగా తీర్చిదిద్ది, నూరు శాతం సాధించిన జిల్లాగా అగ్రస్ధానంలో నిలుపవచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మినిమం స్టడీమెటీరియల్తో కూడిన 20 రోజుల ప్రణాళికను ఇచ్చిందని, దానిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులందరినీ తరగతులకు హాజరయ్యే విధంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సమావేశంలో గుంటూరు ఉప విద్యాశాఖాధికారి జి.యేసురత్నం, తెనాలి ఉప విద్యాశాఖాధికారి శాంతకుమారి, డీసీఈబీ కార్యదర్శి ఏ.తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ గుంటూరు వెస్ట్: జలధార–జలహారతి పనులు త్వరగా ప్రారంభం కావాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో జలధార, పీజీఆర్ఎస్, రీ సర్వే, ఉపాధి హామీ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్న్స్ నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ జలధార– జలహారతి పనులు మంజూరైనప్పటికీ, పనులు ప్రారంభించడంలో జాప్యం జరుగుతున్నట్లు ఆన్లైన్లో కనిపిస్తున్నాయన్నారు. పనులు త్వరగా ప్రారంభం చేయడమే కాకుండా వాటిని వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలపై 48 గంటలలో చర్యలు చేపట్టాలని అన్నారు. జన గణన వేగవంతం చేయాలని, సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కారం చేసుకుంటూ చేయాలని సూచించారు. పట్టాదారు పాసుపుస్తకాలను బుధవారం నాటికి పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు. దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ దివ్యాంగులకు ఉపకరణాలను జేసీ అశుతోష్ శ్రీవాస్తవ సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ కార్యాలయంలో పంపిణీ చేశారు. నలుగురు దివ్యాంగులకు ఒక్కొక్కటి రూ.15 వేలు విలువ గల పరికరాలను అందించారు. ఉపకరణాలు సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్య అభ్యసనానికి కృషి చేయాలని జేసీ కోరారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జ్యోతిబసు, జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు ఎన్.వెంకటరవణప్ప పాల్గొన్నారు. -
వంటింట్లోకి యుద్ధం!
పశ్చిమాసియా యుద్ధం బూచిగా చూపి నిత్యావసరాల ధరల పెంపు సత్తెనపల్లి: పశ్చిమాసియ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధాన్ని బూచిగా చూపించి మార్కెట్లో నిత్యవసరాల ధరలను అమాంతం పెంచేస్తున్నారు. దీంతో పేద, మధ్యతరగతి వర్గాల ప్రజల జీవనం కష్టంగా మారుతోంది. పప్పుల నుంచి నూనెల వరకు అన్ని రకాల వస్తువుల ధరలు పెంచేయడంతో పేద ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ధరలను అదుపు చేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం గుడ్లప్పగించి చూస్తోంది. ఇదే అదునుగా వ్యాపారులు ధరలను అమాంతం పెంచేస్తూ నిలువునా దోచేస్తున్నారు. ధరలను కట్టడి చేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. యుద్ధాన్ని బూచిగా చూపి.. అమెరికా–ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల నూనెల దిగుమతి తగ్గిపోయిందని చెబుతూ వ్యాపారులు ధరలను పెంచేస్తున్నారు. కొందరు వ్యాపారులైతే సిండికేట్గా మారి కృత్రిమ కొరత సష్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వల్ల నూనె ధర లీటరుకు రూ. 20 నుంచి రూ. 30 వరకు పెరిగింది. పామాయిల్ ధర లీటరుకు రూ. 20, రిఫైండ్ ఆయిల్ ధర లీటర్కు రూ. 30 వరకు పెరిగింది. వివిధ రకాల పప్పుల ధరలు కూడా కేజీకి రూ.10 నుంచి రూ. 20 వరకు పెంచేశారు. ధరల కట్టడిలో విఫలం... నిత్యావసర ధరలు రెండు నెలల నుంచి పెంచి సామాన్యులను దోచుకుంటున్నప్పటికీ యంత్రాంగం పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ధరలను కట్టడి చేయాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అసలు వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు అటుగా కనీసం చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకిలా వ్యవహరిస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వ్యాపారులతో అధికారులు అంటకాగుతున్నారా? అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు పాలకులు యుద్ధప్రభావం ఏమీ లేదని చెబుతుంటేఏ మరోవైపు ఇలా ధరలు పెరగడం చూస్తుంటే అసలేం జరుగుతుందన్న ప్రశ్నలు సామాన్యుడిలో తలెత్తుతున్నాయి. ఏం కొనేటట్టు లేం.. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజల కొనుగోలు స్థితి పడిపోయింది. ఏ వంట చేయాలన్నా .. నూనె, గ్యాస్ కనీస అవసరం. నూనె లేనిదే, గ్యాస్ లేనిదే ఏ వంట చేయలేని దుస్థితి. ఈ పరిస్థితుల్లో నూనె ధరలు పెరగడం వల్ల వినియోగాన్ని తగ్గించుకుంటున్నారు. గ్యాస్ కొరత కారణంగా అసలు వంటకాలే తగ్గిస్తున్నారు. కొంత మంది రిఫైండ్ ఆయిల్ వాడిన వారు పామాయిల్తో సరిపెట్టుకుంటున్నారు. సామాన్యులకు వెజి ‘ట్రబుల్స్’... ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశాన్నింటి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒక్కసారిగా కూరగాయల ధరలన్నీ పెరిగిపోయాయి. కొద్దిరోజులుగా కూరగాయల ధరలు రూ. 20 పైగా పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. కిలో వంకాయలు రూ.30 నుంచి రూ. 60 వరకు పెరిగాయి. డజన్ నిమ్మకాయలు రూ. 120 పైనే విక్రయిస్తున్నారు. కూరగాయలు రకాన్ని బట్టి రూ 10 నుంచి రూ. 30 వరకు పెరిగినట్లు వినియోగ దారులు చెబుతున్నారు. రకం పాతధర(కిలో) కొత్త ధర వంకాయలు రూ. 40 రూ. 60 టమాటా రూ. 30 రూ. 40 గోరుచిక్కుళ్లు రూ. 30 రూ. 40 బెండకాయలు రూ. 40 రూ. 50 దొండకాయలు రూ. 30 రూ. 40 పచ్చిమిర్చి రూ. 30 రూ. 50 బీరకాయలు రూ. 40 రూ. 60 పప్పుల నుంచి నూనెల వరకు అదే తీరు సలసల కాగుతున్న వంట నూనెల ధరలు కూరగాయల ధరలకు సైతం రెక్కలు ఇంకా పూర్తిస్థాయిలో తీరని వంట గ్యాస్ కష్టాలు సామాన్య, పేద ప్రజలు బతికేదెలా? ఆందోళన వ్యక్తం చేస్తున్న పేద ప్రజలు పట్టించుకోని కూటమి పాలకులు పశ్చిమాసియా ఉద్రిక్తత కారణంగా ముఖ్యంగా హర్మూజ్ జలసంధి వద్ద రవాణా అంతరాయాలతో దేశంలో వంట గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. ఇదే అదునుగా కొందరు గ్యాస్ సిలిండర్లను మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గృహ వినియోగ సిలిండర్ ఇంకా పూర్తిస్థాయిలో అందడం లేదు. ఇదిలా ఉండగానే మరోవైపు కమర్షియల్ సిలిండర్ ఏకంగా రూ. 993 పెరిగింది. గ్యాస్ కొరత లేదని అధికారులు చెబుతున్నా గ్రామాల్లో గ్యాస్ కష్టాలు మాత్రం తప్పడం లేదు ధరలను నియంత్రించడంతోపాటు గ్యాస్ సరఫరా పై ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. -
చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో సదస్సు
గుంటూరు మెడికల్: చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలో బీపీ మండల్ ట్రస్ట్ అధ్యక్షుడు, గుంటూరుకు చెందిన ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు అనేకమంది మేధావులను, ఉద్యమకారులను కలిసి మద్దతు కోరారు. స్వరాజ్ అభియాన్ అధ్యక్షుడు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్, ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సుకుమార్, సీనియర్ జర్నలిస్ట్, రాజ్యసభ టీవీ మాజీ చైర్మన్ ఊర్మిలేష్, రాష్ట్రీయ జనతాదళ్ అధికార ప్రతినిధులు డాక్టర్ కాంచన యాదవ్, కుమారి ప్రియాంక భారతి, సమాజ్ వాది పార్టీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ లక్ష్మణ్, ఏఐసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ రాజేంద్రపాల్ గౌతమ్, ప్రొఫెసర్ సందీప్ తదితరులను డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు కలిశారు. ఈ సందర్భంగా తాను కలిసిన వారికి డాక్టర్ వెంకటేశ్వర్లు 1992లో ఆనాటి కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు, కేపీ రెడ్డయ్య యాదవ్ ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన ప్రతిని వారికి అందజేశారు. లోక్ సభలోను , అనేక రాష్ట్రాల అసెంబ్లీలలో ఓబీసీల సంఖ్య చాలా తక్కువగా ఉన్నదని, రిజర్వేషన్లు కల్పించకపోతే రానున్న కాలంలో వారి సంఖ్య మరీ తగ్గిపోయే అవకాశం ఉన్నట్లు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ ఆందోళన వ్యక్తం చేసినట్లు డాక్టర్ ఆలా వివరించారు. ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కోసం ఆగస్టు 7న ఢిల్లీలో మేధావుల సదస్సును నిర్వహించనున్నట్లు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సందీప్ వివరించినట్లు చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
వినుకొండ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్టణంలోని మార్కాపురం రోడ్డులో గల చెక్పోస్టు సెంటర్లో ఆదివారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. నాదెండ్ల మండలం సాతులూరు గ్రామానికి చెందిన శివరాత్రి మునెయ్య (30) వినుకొండ రూరల్ మండలం శివాపురం వద్ద జరిగే పాతపాటి పోలేరమ్మ తిరునాళ్ల సందర్భంగా హోటల్ నిర్వహించేందుకు సామగ్రి ఆటోలో వేసుకొని బయలుదేరాడు. చెక్పోస్టు సెంటర్ వద్దకు రాగానే జేసీబీ రోడ్డుపైకి రావడంతో ఆటో అదుపు తప్పి జేసీబీని ఢీకొట్టింది. ఈ ఘటనలో మునెయ్య మృతి చెందాడు. ఆటోలో ఉన్న మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మునయ్య మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భక్తజనసంద్రంగా ఇంద్రకీలాద్రి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వేసవి సెలవులు, నీట్ పరీక్ష నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు, యాత్రికులు, విద్యార్థులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం 9 గంటల నుంచే అంతరాలయ దర్శనం రద్దు చేసి రూ.300 టికెట్పై బంగారు వాకిలి దర్శనం కల్పించారు. దీంతో ఉదయం 11గంటల కల్లా క్యూలైన్లో వేచి ఉన్న భక్తులందరికీ అమ్మవారి దర్శనం పూర్తయ్యింది. మరో వైపున అమ్మవారి మహా నివేదన నిమిత్తం మధ్యాహ్నం అన్ని దర్శనాలు నిలిపివేయడంతో క్యూలైన్లలో రద్దీ పెరిగింది. మధ్యాహ్నం 12.20 గంటలకు తిరిగి దర్శనాలు ప్రారంభం కాగా, క్యూలైన్లో వేచి ఉన్న భక్తులకు త్వరగా దర్శనం అయ్యేలా దేవస్థాన అధికారులు చర్యలు తీసుకున్నారు. భక్తుల రద్దీతో ఘాట్రోడ్డులోని పార్కింగ్ ప్రదేశం పూర్తిగా వాహనాలతో నిండిపోవడంతో కార్లు ఇతర వాహనాలను కనకదుర్గనగర్కు మళ్లించారు. సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవల, పల్లకీ సేవలోనూ ఉభయదాతలు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో సూర్యోపాసన సేవ.. సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సూర్యోపాసన సేవ జరిగింది. లక్ష కుంకుమార్చన వేదిక వద్ద సూర్య భగవానుడి విగ్రహానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. సేవలో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. స్నాన ఘాట్, క్యూలైన్ల పరిశీలన.. దుర్గగుడి ఈవో శీనానాయక్ ఆదివారం పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తొలుత దుర్గాఘాట్ స్నానాల రేవులో అపరిశుభ్రంగా ఉండటంతో శానిటేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవులోని గట్టుపై మట్టి, వ్యర్థాలు నదిలో పడకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయాలని ఇంజినీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఎండల తీవ్రత నేపథ్యంలో భక్తులకు మజ్జిగ, మంచినీటితో పాటు చంటి పిల్లలకు బిస్కెట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. తెనాలిరూరల్: రైలు నుంచి జారి పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన తెనాలి– చుండూరు స్టేషన్ల మధ్య ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పట్టాల వెంబడి మృతదేహం ఉందన్న సమాచారంతో తెనాలి జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లారు. సుమారు 30 నుండి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్న వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. రైలు నుంచి జారి పడడం వల్ల మృతి చెందాడని ప్రాథమికంగా భావిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. జీఆర్పీ ఎస్ఐ ఎల్. సరస్వతి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఊళ్లకు వెళ్తే సమాచారం ఇవ్వండి
బాపట్లటౌన్: వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉన్నప్పుడే దొంగతనాల నివారణ సాధ్యమని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆదివారం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. వేసవి సెలవుల సందర్భంగా అనేక కుటుంబాలు విహారయాత్రలు, తీర్థయాత్రలు, సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్న బంధువుల ఇళ్లకు వెళుతుంటారని, ఈక్రమంలో ఇళ్లల్లో చోరీలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. ఊళ్లకు వెళ్లేవారు ముందస్తుగా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఇళ్లకు తాళాలు వేసి ఉండటం వల్ల, పరిస్థితులను గమనించి అపరిచితులు, దుండగులు తాళాలు వేసిన గృహాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. దొంగతనాలను నివారించేందుకు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విలువైన వస్తువులు, బంగారం, వెండి ఆభరణాలను తాళం వేసిన ఇంటిలో ఉంచకుండా బ్యాంక్ లాకర్లు, ఇతర సురక్షిత ప్రదేశాల్లో భద్రపరచాలన్నారు. సమాచారం అందినప్పుడు పోలీసులు ఆ గృహాలపై ప్రత్యేక నిఘా ఉంచి రాత్రి గస్తీ సమయంలో ఆ ఇళ్లను పర్యవేక్షిస్తారన్నారు. ఎక్కడైనా అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్కు, 112 నెంబర్కు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. ప్రజల సహకారంతోనే దొంగతనాలను సమర్థవంతంగా అరికట్టవచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా చోరీలను నియంత్రించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసి ఉన్న గృహాల వివరాలను సేకరించి, రాత్రి గస్తీ తిరిగే సిబ్బంది ఆ గృహాలను పర్యవేక్షించేలా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పోలీస్ సైరన్ వేస్తూ రాత్రి గస్తీ విధులు సమర్ధవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు భద్రతా భావన కలిగించాలన్నారు. అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులను క్షుణ్ణంగా విచారించి, అవసరమైతే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వారి వేలిముద్రలను సేకరించాలన్నారు. -
అగ్ని కీలలకు ఆహుతైన మొక్కజొన్న
ఇంకొల్లు(చినగంజాం): ప్రమాదవశాత్తూ పంట పొలాల్లో మంటలు చెలరేగడంతో పంటలు ఆహుతయ్యాయి. తహసీల్దార్ ఏవీఎస్ శ్రీనివాస్ అందించిన వివరాలు మేరకు.. మండలంలోని పావులూరు, చిన్ననక్కలపాలెం గ్రామాల మధ్య పంట పొలాల్లో ఆదివారం ఉదయం 9 గంటలు నుంచి 10 గంటల సమయంలో మూడు ప్రాంతాల్లో మంటలు చెలరేగడంతో సుమారు 100 ఎకరాల్లో పంట పొలాలు పూర్తిగా తగులబడిపోయాయి. సమాచారం అందుకున్న తహసీల్దార్ శ్రీనివాస్ చీరాల అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి వచ్చి సుమారు మూడున్నర గంటల పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోనికి తీసుకొనివచ్చారు. అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాద స్థలానికి ఇంకొల్లు సీఐ రామానాయక్, ఎస్ఐ జీ సురేష్, అగ్నిమాపక శాఖ జిల్లా అధికారులు హాజరయ్యారు. అగ్ని ప్రమాద ఘటనలో రైతు సింగంశెట్టి వెంకటరత్నానికి చెందిన 4 ఎకరాలు మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి కావడంతో తీవ్రంగా నష్టపోయాడు. మిగిలిన 96 ఎకరాల్లో రైతులు ముందుగానే పంటను కోయడంతో ఊపిరి పీల్చుకున్నారు. కాగా కోసిన తర్వాత మిగిలిన చొప్ప కూడా అగ్నిప్రమాదంలో తగలబడిపోయాయి. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సందర్శించి పంట నష్టపోయిన రైతుకు నష్టపరిహారం అందజేసేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాల్సిందిగా సూచించారు. -
మున్సిపల్ ట్రాక్టర్ను ఢీకొన్న కారు
పిడుగురాళ్ల: మున్సిపల్ ట్రాక్టర్ను వెనుక నుంచి కారు ఢీకొనటంతో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలైన సంఘటన పిడుగురాళ్ల పట్టణంలోని బైపాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... నరసరావుపేటకు చెందిన ఓ కుటుంబం కారులో తెలంగాణ రాష్ట్రంలోని జానపాడు దర్గా దర్గకు వెళ్తున్నారు. ఈక్రమంలో కొండమోడు డంపింగ్ యార్డులో చెత్తను వేసి పిడుగురాళ్లలోని ఓటర్ ట్యాంక్ వద్ద పార్క్ చేసేందుకు వస్తున్న ట్రాక్టర్ను పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి దగ్గరలో కారు వెనుకగా ఢీకొనడంతో కారు గాలిలో పల్టీలు కొట్టి కింద పడింది. ఘటనలో ఇమామ్ హుస్సేన్ (38) అక్కడిక్కడే మృతి చెందగా కరిముల్లా, షకీరా, నజీమా, నూర్జహాన్, హసీమా, జానీలకు గాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు, ఎస్ఐ శివనాగరాజు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా.. క్షతగాత్రులను పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం నరసరావుపేటకు తరలించారు. సీఐ శ్రీరాం వెంకట్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ముగిసిన జాతీయ నాటకోత్సవాలు
చీరాల: చీరాల కళాంజలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల జాతీయ 9వ నాటకోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. స్థానిక కస్తూర్బా గాంధీ మున్సిపల్ గరల్స్ హైస్కూల్ ఆవరణలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఆదివారం రాత్రి శింగమనేని సుబ్బారావు కళావేదికపై సుమ్రిత యూత్ అసోసియేషన్, మధిర వారి యయాతి అనే పౌరాణిక నాటకం ప్రదర్శించారు. ప్రతిరోజూ రెండు నాటికలతో పాటు కూచిపూడి నృత్య ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. వర్తమాన సమాజ స్థితిగతులకు నాటికలు అద్దంపట్టాయి. కార్యక్రమానికి ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన పలు సంస్థలు వారిచే నాటిక పోటీలను నిర్వహించారు. నాటకోత్సవాలు విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషించిన కళాంజలి కార్యదర్శి సాంబశివరావును అభినందిస్తూ గౌరవ సత్కారం నిర్వహించారు. కళాంజలి అధ్యక్ష, కార్యదర్శులు కోడూరి ఏకాంబరేశ్వరబాబు, సాంబశివరావు, బత్తుల బ్రహ్మారెడ్డి, వలివేటి మురళీకృష్ణ, పూర్ణా సత్యం, లూక, పొట్టి శ్రీనివాసరావు, దరియా సాహెబ్ తదితరులు తెలిపారు. -
నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్
నరసరావుపేట రూరల్: ప్రజల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ కృతిక శుక్లా తెలిపారు. అర్జీదారులు తమ సమస్య గురించి ఖచ్చితమైన, పూర్తి సమాచారంతో దరఖాస్తు చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి నేరుగా అర్జీలను స్వీకరిస్తారని తెలిపారు. అలాగే ప్రతి సోమవారం కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ముగ్గురు రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల తహసీల్దార్లు పాల్గొని వినతులు స్వీకరిస్తారని వివరించారు. రూ.25 లక్షల ఆస్తి నష్టం గుంటూరు రూరల్: ప్రత్తిపాడు మండలం గొట్టిపాడులో భారీ అగ్నిప్రమాదం ఆదివారం చోటుచేసుకుంది. పొలం సమీపంలో నాలుగు వరిగడ్డివాములు, ఒక లారీ దగ్ధం కావ్వటంతో భారీ నష్టం జరిగిందని బాధితులు గరికపాటి లక్ష్మయ్య తెలిపారు. పందెం ఎద్దులకు చెందిన వరిగడ్డి వాములు కావటం, దానితోపాటు ఒక లారీ, లారీలోని ఎద్దుల పందేలకు వినియోగించే సామగ్రి దగ్ధమయ్యాయి. సుమారు రూ.25 లక్షల వరకూ ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని బాధితులు తెలిపారు. ఘటనపై ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): కుడొ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ ఆధ్వర్యంలో స్థానిక టీజేపీఎస్ కళాశాలలో జిల్లా నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించినట్లు ఎన్నికల పర్యవేక్షకుడు రిషి వర్మ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఆర్ఆర్ ప్రసాద్, కార్యదర్శిగా సిద్ధార్థ, కోశాధికారిగా రిషి వర్మ రాజు ఎన్నికయ్యారు. ఎన్నికల నిర్వహణకు డిస్ట్రిక్ట్ స్పోట్స్ అథారిటీ నుంచి అబ్జర్వర్గా బాక్సింగ్ కోచ్ రామిశెట్టి విశ్వనాథ్, స్టేట్ అసోసియేషన్ నుంచి కోటిరెడ్డి హాజరయ్యారన్నారు. రిటర్నింగ్ ఆఫీసర్గా శ్రీనివాసరావు వ్యవహరించారని చెప్పారు. ‘మణిపాల్ లైవ్ బేరియాకాన్’లో ప్రముఖ వైద్యులు తాడేపల్లిరూరల్: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ‘మణిపాల్ లైవ్ బేరియాకాన్–2026’ పేరుతో ప్రత్యేక అకడమిక్ ఈవెంట్ను నిర్వహించారు. విజయవాడలోని వరుణ్ నోవాటెల్ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు, బేరియాట్రిక్ సర్జన్లు హాజరై తమ అనుభవాలను వివరించారు. మణిపాల్ హాస్పిటల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు మాట్లాడుతూ ఊబకాయం ప్రధాన సమస్య కాదని, దీనికి సరైన ప్లానింగ్, మల్టీ డిసిప్లినరీ అప్రోచ్తో చికిత్స అవసరమని తెలిపారు. మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ జె.రామాంజనేయరెడ్డి మాట్లాడుతూ బేరియాకాన్ ద్వారా ఆధునిక శస్త్రచికిత్స నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం, రోబోటిక్ సర్జరీ సేవలు, వైద్య సమాజానికి దగ్గర చేయడం తమ లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు బత్తిని రాజేష్, రాజేష్ చండ్ర, వరుణ్ దాసరి, రవి దాస్యం, అమిత్ , భానుప్రవీణ్ నాయుడు, మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు రూరల్: మండుతున్న ఎండల వేళ ఆదివారం వర్షం కురిసింది. కాకుమాను, పెదనందిపాడు, గుంటూరు రూరల్ మండలాల్లో మబ్బులతో కూడిన వర్షం పడింది. కాకుమాను గ్రామంలో అక్కడక్కడ చిన్నపాటి వడగడ్లు పడ్డాయి.. -
రంగస్థల ప్రముఖులకు అవార్డుల ప్రదానం
తెనాలి: కొలంకపురి నాటక కళాపరిషత్, శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరు సంయుక్త నిర్వహణలో ఉభయ రాష్ట్రస్థాయి 12వ ఆహ్వాన నాటికల పోటీలు రెండోరోజైన ఆదివారం రాత్రి కొనసాగాయి. కొలకలూరు గ్రామపంచాయతీ పరిధిలోని ఖాజీపేట నాటకశాల వద్ద ప్రత్యేక వేదికపై జరుగుతున్న ఈ నాటిక పోటీలు గడ్డం ప్రకాష్ జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. ఇందులో భాగంగా హైదరాబాద్కు చెందిన ప్రముఖ రంగస్థల, టీవీ, సినీనటులు డాక్టర్ గోవాడ వెంకట్కు కరణం సురేష్ జ్ఞాపకార్థం ‘సవ్యసాచి’ అవార్డును ప్రదానం చేసి సత్కరించారు. విజయనగరానికి చెందిన ప్రముఖ రంగస్థల నటి ఎస్.జ్యోతిరాణికి గోపరాజు హేమలత జీవిత సాఫల్య పురస్కారాన్ని గోపరాజు శివరామకృష్ణ హనుమత్ శేఖర్, కుటుంబసభ్యులు ప్రదానం చేశారు. సభకు ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ మాజీ కార్యదర్శి డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు అధ్యక్షత వహించారు. కళారంగ ప్రముఖులు డాక్టర్ ముత్తవరపు సురేష్బాబు (చిలకలూరిపేట), గుదె పాండురంగారావు (అనంతపురం), కూచి రామాంజనేయులు (వినుకొండ), ఏటూరి రోహిణీకుమార్ (హైదరాబాద్), చెరుకూరి సాంబశివరావు (గుంటూరు) పాల్గొన్నారు. కళారంగంలో కొలంకపురి నాటక కళాపరిషత్, శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరు చేస్తున్న కృషిని ప్రశంసించారు. గోపరాజు రమణ, గోపరాజు విజయ్, వైఎస్కేఎన్ స్వామి, సుంకర శ్రీనివాసరావు, సుద్దపల్లి మురళీధర్ పర్యవేక్షించారు. నాటక పోటీల్లో భాగంగా తొలుత కళానికేతన్, వీరన్నపాలెం వారి ‘దీపం కింద చీకటి’ నాటికను ప్రదర్శించారు. అగస్త్య రచనకు వైబీ చౌదరి దర్శకత్వం వహించారు. తదుపరి హేలాపురి కల్చరల్ అసోసియేషన్–ఏలూరు వారి ‘అనగనగా ఓ రాత్రి’ నాటికను ప్రదర్శించారు. పీవీ సత్యనారాయణ రచనకు మహమ్మద్ ఖాజావలి దర్శకత్వం వహించారు. చివరగా ఎస్ఎంఆర్ క్రియేషన్స్–అనకాపల్లి వారి ‘మలిసంధ్య’ నాటికను ప్రదర్శించారు. గోవిందరాజుల నాగేశ్వరరావు రచనకు ముత్యాలరావు దర్శకత్వం వహించారు. -
ఆక్రమించి తీరాల్సిందే..!
చీరాల అర్బన్: ఈపురుపాలెం స్ట్రయిట్కట్ మాదిరిగా వేటపాలెం స్ట్రయిట్కట్ సీమౌత్ వద్ద మార్పునకు వ్యూహం పన్నారు. ఆ ప్రాంత మత్స్యకారుల నుంచి వ్యతిరేకత రాకుండా స్ట్రయిట్కట్లో జెట్టీ నిర్మాణం జరుగుతుందని నమ్మబలుకుతున్నారు. ఆ ప్రాంత ప్రైవేటు వ్యక్తుల భూమి వెంట ప్రభుత్వ నిధులతో రోడ్డు ఏర్పాటుకు పథక రచన చేశారు. ఈ క్రమంలో పొట్టిసుబ్బయ్యపాలెం తీరం నుంచి స్ట్రయిట్కట్ కాలువ వరకు వారు అనుకున్నది జరిగితే సుమారు 50 ఎకరాల తీరప్రాంత భూమి అనధికారికంగా వారి ఆధీనంలోకి వెళుతుందని, దాని విలువ సుమారు రూ.100 కోట్లు ఉంటుందని చెప్పుకుంటున్నారు. అందుకు స్థానిక పచ్చనేత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అభివృద్ధి పేరుతో... అక్కడ జరిగే లోపాలను, ఆక్రమణల ఆలోచన బయట పడకుండా అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నారు. ఆ క్రమంలో సదరు భూములు వెంట ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.2.50 కోట్లతో రోడ్డు నిర్మాణం జరుగుతోందని.. కలెక్టర్ నిధుల మంజూరుకు సానుకూలంగా స్పందించారని.. సీమౌత్ వద్ద వాలు మలుపు తిప్పుతామని చెబుతున్నారు. అందుకు డ్రైనేజీ శాఖ పరంగా నిధులు మంజూరు చేస్తారని.. లేదంటే తామే నిధులు సమకూర్చి అధికారుల పర్యవేక్షణలో వాలు మలుపు చర్యలు చేపట్టే విధంగా అడుగులు వేస్తున్నామంటున్నారు. కాలువ దగ్గర జెట్టీ నిర్మాణం జరుగుతోందని.. మత్స్యకారులకు ఇబ్బంది ఉండదని పేర్కొంటున్నారు. అప్పుడు తీరం నుంచి మా భూముల పక్కన వచ్చే రోడ్డు వరకు ఎత్తు, పల్లాలుగా ఉన్న ఇసుకను చదును చేస్తామని.. ఇలా ప్రస్తుతం ఆ ప్రాంతంలో జరుగుతున్న ప్రచారం. సీఆర్జెడ్ పరిధి పట్టించుకోవాలి.. ఆ ప్రాంతంలో తీరం నుంచి సీఆర్జెడ్ పరిధి, అభివృద్ధి పేరుతో జరుగుతున్న ప్రచారంలో చేపట్టే పనులు తదితర విషయాలపై సంబంధిత అధికారులు సమగ్రంగా సమాచారాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ఈపురుపాలెం స్ట్రయిట్ కట్ వివాదంలో అధికారులు మీనమేషాలు లెక్కించారు. తీరా సమస్య తీవ్ర రూపం దాల్చిన తరువాత పరిష్కార చర్యలు చేపట్టారు. చివరకు విషయం కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. తాజాగా వేటపాలెం స్ట్రయిట్కట్ వాలు మలుపుకు సంబంధించి ఆ ప్రాంతవాసుల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ముందస్తుగా అధికారులు స్పందించి వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలి. తీరం పరాధీనం కాకుండా కాపాడాలి. ప్లాట్లు విక్రయించేందుకు అడుగులు వీరిలో వస్త్ర వ్యాపారి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి అనుమతులు రాకుండానే ప్లాట్లు వేసి విక్రయించేందకు అడుగులు వేశారు. విషయం బహిర్గతం కావటంతో ఆయన తాత్కాలికంగా వెనకడుగు వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం కొత్త ఆలోచనతో ముందుకెళుతున్నారు. అందుకు పచ్చనేత చేసిన హితోపదేశమే కారణమని సమాచారం. సునామీ సమయంలో... గతంలో సునామీ వచ్చినప్పుడు పొట్టిసుబ్బయ్యపాలెం తీరంలో భయంకరమైన అలల తాకిడికి సుమారు 9 మంది మృత్యువాత పడ్డారు. అప్పట్లో ఆ ప్రాంతంలో భారీ ఇసుక తిన్నెలు ఉండేవి. దీంతో ప్రమాదస్థాయి ఒకింత తగ్గింది. తరువాత ఇసుక తిన్నెలు మానవ చర్యలతో కనుమరుగయ్యాయి. ఈ క్రమంలో సీ వ్యూ పేరుతో తాత్కాలిక లబ్ధి కోసం చేపట్టే చర్యలు భవిష్యత్లో ప్రమాద హేతువులు కాకుండా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో తహసీల్దార్ గీతారాణిని వివరణ అడగ్గా ఆమె పరిశీలించి తగిన చర్యలు చేపడతామన్నారు. -
ముగిసిన అండర్–11 చెస్ పోటీలు
గుంటూరు వెస్ట్(క్రీడలు): స్థానిక ఇన్నర్ రింగ్ రోడ్డులోని విజేత ఐఐటీ స్కూలులో ఆదివారం నైట్ క్యాజిల్ చెస్ అకాడమీ ఆధ్వర్యాన నిర్వహించిన అండర్–11 చిన్నారుల చెస్ పోటీలు ముగిశాయని టోర్నమెంట్ డైరెక్టర్ వైవీకే చక్రవర్తి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 50 మందికిపైగా చిన్నారులు పోటీల్లో పాల్గొన్నారన్నారు. బాలికల విభాగంలో పి.లాలిత్య, పి.భవిష్య, బాలురలో ఎం.చేతన్, శౌర్యదీప్ సింగ్లు ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించి విజేతలుగా నిలిచారన్నారు. నలుగురు చిన్నారులు ఈ నెల 9, 10 తేదీల్లో విశాఖపట్నంలో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు సీహెచ్ రవీంద్రరాజు, విజేత స్కూల్ డైరెక్టర్ నిమ్మల సురేష్, ఇన్చార్జి సంధ్యలు విజేతలకు బహుమతులు అందించారని తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నగరం: భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి మీ భూమి–మీ హక్కు కార్యక్రమం దోహదపడుతుందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. బాపట్ల జిల్లా నగరం మండలం పూడివాడ గ్రామంలో ఆదివారం జరిగిన పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మీ భూమి–మీ హక్కు కార్యక్రమంలో భాగంగా చేపట్టిన రీ సర్వేతో రైతులకు స్పష్టమైన భూ హక్కులు లభిస్తున్నాయన్నారు. రీసర్వే పూర్తయిన తర్వాత శాసీ్త్రయంగా రూపొందించిన భూ హక్కు పత్రాలు పట్టాదార్ పాస్పుస్తకాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ బి.వినోద్కుమార్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భూముల హద్దులు, విస్తీర్ణం కచ్చితంగా నిర్ధారించడంతో భూ వివాదాలు తగ్గడమే కాకుండా రైతులకు బ్యాంక్ రుణాలు, ప్రభుత్వ పథకాలు సులభంగా పొందవచ్చన్నారు. భూహక్కు పత్రాలు, పాస్ పుస్తకాలను రైతులు భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భావన వశిష్ట, ఆర్డీవో శ్రీదేవి, తహసీల్దార్ నాంచారయ్య, ఎంపీడీవో శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు. యడ్లపాడు: మండల పరిధిలోని సొలస గ్రామంలో వెలసిన శ్రీ భూ సమేత రంగనాయక స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు ఆదివారం పవళింపు సేవతో ముగిశాయి. ఉత్సవాల ముగింపులో భాగంగా ఆలయ అర్చకులు పర్చూరి రామకృష్ణమాచార్యుల నేతృత్వంలో స్వామి వారికి పూలంగి సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం ద్వాదశ ప్రదక్షిణలు చేశారు. ఆలయ ఈఓ నెమలిరెడ్డి పర్యవేక్షణలో ధర్మకర్తలు అర్వపల్లి మనోహర్– నాగజ్యోతి దంపతులు, అర్వపల్లి బ్రదర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చి రంగనాథుని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా సాగిన ఈ కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు. భక్తుల గోవింద నామస్మరణతో సొలస క్షేత్రం మార్మోగింది. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 525.40 అడుగులకు చేరింది. ఇది మొత్తం 159.3072 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 450 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
రంగురాళ్ల కేసు నీరుగార్చేందుకు యత్నం
సాక్షి, టాస్క్ ఫోర్స్: రంగురాళ్ల కేసును నీరుగార్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండల పరిధిలోని శంకరాపురం అటవీ భూముల్లో టీడీపీ నాయకులు తవ్వితీసిన రంగురాళ్లను ఆ శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గత మూడు రోజుల క్రితం దాచేపల్లిలో ఓ గోడౌన్లో పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న రంగరాళ్లను వినుకొండకు తరలించి భద్రపరిచారు. అయితే స్వాధీన పరుచుకున్న రంగురాళ్ల వివరాలను నేటికీ పూర్తిస్థాయిలో అధికారులు వెల్లడించకపోగా... ఈ కేసుపై నీలినీడలు కమ్ముకునేలా వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాచేపల్లిలో దొరికిన రంగరాళ్లను టీడీపీకి చెందిన కీలక నేతల పాత్ర ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. టీడీపీలో కీలకంగా ఉన్న సదరు నాయకులపై కేసులు పెట్టకుండా జోరుగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలిసింది. రాష్ట్రస్థాయిలో ఓ ముఖ్య నేత ద్వారా ఫారెస్ట్ అధికారులపై ఒత్తిడి చేస్తూ టీడీపీ నాయకులను కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తవ్వకాలు చేసే కూలీలపైనే కేసులు పెట్టేలా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం. సూత్రధారులను విడిచిపెట్టేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు వినికిడి. అధికారుల పాత్రే కీలకం దాచేపల్లిలో పట్టుబడిన రంగురాళ్లు సుమారుగా రూ.కోటి పైనే ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇంత భారీ స్థాయిలో రంగురాళ్లు పట్టుబడటం ఇదే మొదటిసారి. అటవీ భూముల్లో యథేచ్ఛగా రంగురాళ్ల కోసం తవ్వకాలు నిర్విరామంగా జరుగుతుంటే అధికారులు చూడకపోగా.. కేసులు కూడా నీరుగార్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఆ శాఖ అధికారులు కూడా తాయిలాలు అందినట్టు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓ కారులో లభించిన రంగురాళ్లను స్వాధీనం చేసుకున్న అధికారులు కారును వదిలి పెట్టేందుకు భారీ స్థాయిలో ముడుపులు తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. శాఖాపరమైన విచారణ జరిగినట్లు కూడా సమాచారం. రంగు రాళ్లు తవ్వించే అక్రమార్కులకు పూర్తిస్థాయిలో అటవీశాఖ అధికారుల సహకారం ఉండటం వల్లనే కొండకు సొరంగాలు వేస్తున్నారు. సహజసిద్ధమైన సంపదను కాపాడాల్సిన అధికారులే అక్రమార్కులతో చేతులు కలిపారు. శంకరాపురం కొండలలో రంగురాళ్ల తవ్వకాల వ్యవహారం పైస్థాయి అధికారులకూ తెలుసని సమాచారం. ఇకనైనా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
వైద్యానికి పాట్లు
సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2026వసతులకు తూట్లు..ప్రజా వైద్యానికి చంద్రబాబు సర్కారు తూట్లు పొడుస్తోంది. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ వైద్యశాల నిర్వహణ తీరు గాడితప్పుతోంది. సిబ్బంది కొరత పీడిస్తోంది. ఉన్న వారిపై అదనపు భారం పడుతోంది. సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలను గురువారం సాక్షి ఫీల్డ్ విజిట్ చేసింది. పేదలకు వైద్య సేవలు మొక్కుబడిగా అందడాన్ని గుర్తించింది. ఓపీ వద్ద కిటకిటలాడుతున్న రోగులుసత్తెనపల్లి: ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు పలు వ్యాధులతో ప్రభుత్వ వైద్యశాలను ఆశ్రయిస్తున్నారు. చికిత్సల సంగతి దేవుడెరుగు అవసరమైన మందులు కూడా అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నారు. ఔషధాలు బయట కొనుగోలు చేయాల్సి రావడంతో ఆర్థిక భారంతో అల్లాడుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు వైద్యశాలలకు పరుగులు పెడుతున్నారు. పల్నాడు ముఖద్వారమైన సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల వైద్యశాలలో వైద్యులు, సిబ్బంది కొరత రోగులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రభుత్వ వైద్యశాలల్లో ప్రసవాలను పెంచాలని ఆదేశిస్తున్న ప్రభుత్వం అందుకు అవసరమైన సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉంచటంలో విఫలమవుతోంది. ప్రసూతి సేవలకు అవసరమైన పాడ్స్ వంటివి కూడా ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. బాలింతలు, గర్భిణులు, శిశువులకు అవసరమైన మందులు కూడా అందుబాటులో ఉండడం లేదనే విమర్శలు ఉన్నాయి. గత నెల ప్రసవాల లక్ష్యం 100 కాగా ఇక్కడ 129 జరిగాయి. మహిళల స్కానింగ్కు సంబంధించి ప్రధానంగా రేడియాలజిస్ట్ లేక కష్టాలు తప్పడం లేదు. దీంతో ప్రైవేట్ వైద్యశాలను ఆశ్రయించాల్సి వస్తోంది. వైద్యశాలలో ఒక సీఎస్ఆర్ ఎంఓ, మరో సీఏఎస్, ఒక ల్యాబ్ టెక్నీషీయన్, జనరల్ డ్యూటీ అటెండర్స్ మూడు పోస్టులు, డీఆర్ఏ ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయి. బ్లడ్ స్టోరేజీ యూనిట్ ఉన్నప్పటికీ దానిలో సేవలందించే రెండు ల్యాబ్ టెక్నీషీయన్ పోస్ట్లు ఖాళీగా ఉన్నాయి. ఇవి కాక రెండు డేటాఎంట్రీ పోస్ట్లు సైతం భర్తీ చేయలేదు. నిత్యం ఉన్న వారిపైనే పని భారం పడుతోంది. సెంట్రల్ డ్రగ్స్ నుంచి అరకొర మందులు... ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు ప్రతిరోజు 600 నుంచి 700 వరకు ఓపీలు వస్తున్నాయి. సీజనల్ ప్రభావంతో జ్వరం కేసులు తాకిడి పెరిగింది. అయితే ఇందుకు తగ్గట్టు మందులు, మాత్రలు సెంట్రల్ డ్రగ్స్ నుంచి సరఫరా కావడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో వాడేవి కూడా లేవని తెలుస్తోంది. చిన్నపిల్లలకు ఇచ్చే సిరప్లు లేవు. వృద్ధులకు ఆయాసానికి సంబంధించి సిరప్ లేదు. వైఎస్సార్ సీపీ సర్కారు హయాంలో వైద్యసేవల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. గత ప్రభుత్వం పేదల వైద్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సేవలను విస్తృతం చేసింది. పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించింది. ఖాళీ పోస్టులను భర్తీ చేసి వైద్య సేవలను అందించింది. పోస్టులు ఖాళీ పడితే వెను వెంటనే భర్తీ చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ విషయాన్ని శాఖలోని పలువురు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. వంద పడకల ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. రేడియాలజిస్ట్తోపాటు మరికొన్ని పోస్ట్లు ఖాళీ ఉన్నాయి వాటి భర్తీకి ప్రభుత్వానికి నివేదించాం. మందుల కొరత గత నెల మార్చి కావటంతో చివరిలో ఇబ్బంది ఉన్నప్పటికీ అధిగమించేలా లోన్బేసిస్లో మందులు తెచ్చాం. మందులకు ఎలాంటి కొరత లేకుండా చూస్తున్నాం. బాలింతలు, నవజాత శివులకు వేడినీళ్లకు సంబంధించి మరో రెండు గీజర్లు వచ్చాయి. వాటిని ఏర్పాటు చేస్తున్నాం. ఆక్సిజన్ ప్లాంట్లు పని చేయడం లేదు. – డాక్టర్ బి.లక్ష్మణరావు, సూపరింటెండెంట్, ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల, సత్తెనపల్లి -
ప్రశాంతంగా నీట్
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా పరిధిలో నీట్–2026 ఆదివారం ప్రశాంతంగా సాగింది. జిల్లా పరిధిలో మూడు కేంద్రాలలో పరీక్ష నిర్వహించారు. ఆయా కేంద్రాలలో 1,323 మంది విద్యార్థులకుగాను 1,285 మంది హాజరయ్యారు. జేఎన్టీయూ–ఎన్ ఇంజినీరింగ్ కళాశాలలో 696 మందికిగాను 674, ఇర్లపాడు కేంద్రియ విద్యాలయంలో 480 మందికిగాను 469, శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాలలో 147 మందికిగాను 142 మంది హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచే కేంద్రాలలోకి విద్యార్థులను అనుమతించారు. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాత లోనికి పంపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష కొనసాగింది. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆయా కేంద్రాల నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. -
బంగారం వ్యాపారిపై దాడి కేసులో నిందితుల అరెస్టు
గురజాల: వ్యాపారిపై దాడి చేసి బంగారం దొంగిలించి పరారైన నిందితులను అరెస్టు చేసినట్లు పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు తెలిపారు. గురజాల డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. వినుకొండకు చెందిన బంగారం వ్యాపారి యక్కల శ్రీనివాసరావు రెడీమెడ్ బంగారం వస్తువులు అమ్మడం కోసం ప్రతి సోమవారం కారంపూడి వస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 27వ తేదీన కారంపూడికి వచ్చాడు. మధ్యాహ్నం సమయంలో అంకాళమ్మ దేవాలయం వద్ద యూనియన్ బ్యాంకు సమీపంలో నడుచుకుంటూ వెళ్తుండగా పథకం ప్రకారం అతనిపై దాడి చేసి అతని వద్ద ఉన్న బంగారం వస్తువులను తీసుకుని పరారయ్యారు. కారంపూడిలోని శివరామకృష్ణ జ్యూయలర్స్లో గుమాస్తాగా పనిచేస్తున్న గోసుల సాంబయ్య పన్నిన పథకం ప్రకారం నాదెండ్ల మండలం సాతులూరు గ్రామం బండారు అజిత్, గుంటూరు అంబేడ్కర్ నగర్కు చెందిన కాండ్రగుంట శశికుమార్, కాండ్రకుంట సాయికిరణ్, అన్నం నిఖిల్, గుంటూరులోని గుజ్జనగుండ్లకు చెందిన గోగుల పవన్, పమిడిపాడు గ్రామానికి చెందిన గోసుల సాంబయ్యలు ఒక ప్లాను ప్రకారం వ్యాపారి యక్కల శ్రీనివాసరావుపై దాడి చేసి బంగారం వస్తువులను దొంగిలించి పరారయ్యారు. ఆ ప్రాంతంలోని సీసీ పుటేజీలు ద్వారా నిందితులను పోలీసులు గుర్తించి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులను కారంపూడిలోని పేటసన్నెగండ్ల కాలువ వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.60 లక్షల విలువ కలిగిన 566.60 గ్రాముల బంగారం, యమహా–ఎంటీ 15, హీరో గ్లామర్ ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులను చాకచాక్యంగా పట్టుకుని అరెస్టు చేసిన పోలీసులను ఎస్పీ అభినందంచారు. సమావేశంలో డీఎస్పీ ఎంఎ మహేశ్వరరావు, సీఐ పి శరత్బాబు, ఎస్ఐ ఎం వాసులు పాల్గొన్నారు. -
మూలకు చేరిన రెండు ఆక్సిజన్ ప్లాంట్లు....
ఆక్సిజన్ విలువ కరోనా సమయంలో అందిరికీ తెలిసి వచ్చింది. అంతటి ప్రాధాన్యత కలిగిన ఆక్సిజన్ పేదరోగులకు అందించాలనే ఉద్దేశంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రెండు ప్లాంట్లు ఏర్పాటు చేస్తే వాటిని మూలకు చేర్చారు. ఐటీసీ సహకారంతో 300 లీటర్లు, ప్రభుత్వం మెగా కంపెనీ నుంచి 500 లీటర్ల ఆక్సిజన్ ప్లాంట్లను వేరువేరుగా సత్తెనపల్లి ప్రాంతీయ వైద్యశాలలో ఏర్పాటు చేసింది. ఈ రెండు ప్రస్తుతం పనిచేయడం లేదు. వైద్యశాలలో జరుగుతున్న అభివృద్ధి పనుల నేపథ్యంలో ప్లాంట్ల నుంచి వైద్యశాలకు వెళ్లే కేబుల్స్ కట్ కావడంతో మూలకు చేరాయి. అయినప్పటికీ పాలకులు పట్టించుకోకపోవడం లేదు. అంతేగాక చిన్న పిల్లలకు, బాలింతలకు వేడి నీళ్లు అవసరం. ఒక గీజర్ మాత్రమే ఉండడంతో ఆ నీటిని బయట హోటల్స్లో కొనుగోలు చేయాల్సి న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వేసవికాలం అయినప్పటికీ బాలింతలకు, నవజాత శిశువులకు వేడి నీటిని ఉపయోగించాల్సి ఉంది. వైద్యశాల ప్రాంగణంలో వాహనాల నిలుదలకు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్ధితి నెలకొంది. -
స్వర్ణ ప్రకాశ రూపిణిగా బగళాముఖి అమ్మవారు
బాపట్ల: ప్రసిద్ధిగాంచిన చందోలులోని బగళాముఖి అమ్మవారు స్వర్ణ ప్రకాశ రూపిణిగా దర్శనమిచ్చారు. దివ్యక్షేత్రం వార్షిక ఉత్సవాలలో భాగంగా శనివారం ప్రాచీన స్వర్ణ ఆభరణాల శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆభరణాలను అమ్మవారికి అలంకరింపజేశారు. అమ్మవారిని దర్శించడానికి జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు విచ్చేశారు. తొలుత ఆలయం నుంచి దేవాదాయ, పోలీస్, రెవెన్యూ పంచాయతీ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో చందోలు స్టేట్ బ్యాంకు వద్దకు శోభాయాత్రగా చేరుకొనగా బ్యాంక్ మేనేజర్కు అనుమతి లెటర్ ఇచ్చి అందరూ సంతకాలు చేసి బ్యాంకు నుంచి సీల్డు నగలు బాక్స్ను స్వీకరించి ఆలయానికి చేరుకున్నారు. ఆలయం వద్దకు చేరుకొని అందులో ఉన్న ఆభరణాలను అధికారుల సమక్షంలో అమ్మవారి అలంకారం నిమిత్తం ఆలయ పూజారులకు అప్పగించారు. అప్పటి నుంచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. దర్శనానికి వచ్చిన భక్తులకు కొనకాల బుల్లిబాబు ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అందరికీ చల్లటి మజ్జిగ అందజేశారు. ప్రముఖుల సందర్శన స్వర్ణాభరణముల అలంకారంలో అమ్మవారిని దర్శించటానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి సుజాత, పెనుగొండ వాసవి పీఠాధిపతులు పరమ శ్రీప్రజ్ఞ భారతిస్వామి, బాపట్ల ఎస్పీ బి ఉమామహేశ్వర్, బాపట్ల డీఆర్ఓ జి గంగాధర్గౌడ్, ట్రాన్స్ఫోర్ట్ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. పంచలోహ సింహాలు వితరణ బాపట్ల శాసనసభ్యుడు వేగేశ న నరేంద్ర వర్మ రాజు కుటుంబ సమేతంగా అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించారు. రూ.9 లక్షల వెచ్చించి తయారు చేయించిన గ్రానైట్ రాతి పద్మ పీఠం, పంచలోహ సింహాలను అమ్మవారి ఆలయానికి సమర్పించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ ఎం భాగ్యలక్ష్మి, తహసీల్దార్ డి వెంకటేశ్వరరావు, ఎస్ఐ ఎంవీ శివకుమార్, పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ బి సుజాత, వీఆర్ఓ అరుణకుమారి, ఆలపాటి వెంకటరమణారావు, భవనం బసవరెడ్డి, దోమ నాగేశ్వరరెడ్డి, కేతరాజు, పట్టాభిరామారావు ట్రస్ట్ బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్రెడ్డి సభ్యులు వక్కలగడ్డ ప్రసాద్, అయినంపూడి వెంకట పద్మజ, నక్క సముద్రాలు, ఎనకపల్లి వెంకటప్పయ్య తదితరులు ఉన్నారు. -
ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది..!
సత్తెనపల్లి: ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల సందడి మొదలైంది.పదో తరగతి తర్వాత అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఎదురుచూసే అవకాశమిది. ఈ సంస్థలో పేద, మధ్యతరగతి విద్యార్థులు చేరేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో టాపర్లు ట్రిపుల్ ఐటీలో సీట్లు పొందుతున్నారు. ఇక్కడ చేరితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు నమ్ముతున్నారు. ఈ క్రమంలో 2026–27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల చూపు ట్రిపుల్ ఐటీ వైపు మళ్లింది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్లో భాగంగా రాష్ట్రంలో ఉన్న 4 వేల ట్రిపుల్ ఐటీ సీట్లలో జిల్లాకు ఎన్ని కేటాయిస్తారు. అందులో జిల్లాకు ఎన్ని వస్తాయన్నది తెలియాల్సి ఉంది. శుక్రవారం నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించారు. స్పెషల్ కేటగిరి (పీహెచ్/ఎన్సీసీ/ స్పోర్ట్స్/ భారత్ స్కౌట్స్) సర్టిఫికెట్ వెరిఫికేషన్లు జూన్ మొదటి వారంలో చేపట్టి ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభించను న్నారు. రాష్ట్రంలో నాలుగు ట్రిపుల్ ఐటీలు ... రాష్ట్రంలో నాలుగు ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి. శ్రీకాకుళం, ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలులో విద్యార్థులు చేరేందుకు అవకాశం ఉంది. ఒక్కో విద్యాసంస్థలో సుమారు వెయ్యి సీట్లు ఉన్నాయి. ఏటా 60 శాతం దాటి బాలికలు సీట్లు సాధిస్తున్నారు. సమీకృత ఇంజనీరింగ్ కోర్స్ ఆరేళ్లు కాగా .. అందులో రెండేళ్ల పీయూసీ (ప్రీ యూనివర్సిటీ కోర్స్), నాలుగేళ్ల ఇంజనీరింగ్లో చేరుతారు. నూతన విద్యా విధానం –2020 మేరకు పీయూసీ పూర్తి చేసిన విద్యార్థులు రిలీవ్ కావచ్చు. ఇంజనీరింగ్ సైతం ఏటా రిలీవ్ కావచ్చు. విద్యార్హత ఆధారంగా ధ్రువీకరణ పత్రం ఇస్తారు. ఇంజనీరింగ్లో సివిల్, మెకానికల్, ఈఈఈ, సీఎస్ఈ, ఈసీఈ వంటి బ్రాంచ్లు నిర్వహిస్తున్నారు. రిలీవ్ అయ్యే విద్యార్థులు ప్లేస్మెంట్లు సాధించడంతోపాటు గేట్ వంటి ర్యాంకులు సాధించి ఉన్నత విద్య సైతం అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో మెరుగైన ఉద్యోగాలు సాధిస్తున్నారు. దరఖాస్తులు స్వీకరణ...ఎంపిక ప్రక్రియ 2026–27 విద్యా సంవత్సరానికిగాను రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వ విద్యాలయం (ఆర్జీయూ కేటీ)లో ఆరేళ్ల సమీకృత బీటెక్ కోర్సులో ప్రవేశాల కోసం శుక్రవారం నుంచి దరఖాస్తుల స్వీకరణకు నోటిఫికేషన్ విడుదల చేశారు. పదో తరగతి ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ప్రవేశాలను వేగవంతం చేస్తూ అడ్మిషన్లు చైర్మన్, యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కె మధుమూర్తి సౌజన్యంతో అడ్మిషన్ల కన్వీనర్ డాక్టర్ అమరేంద్ర కుమార్ చండ్రా ఈ షెడ్యూల్ విడుదల చేశారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇద్దరికి సమాన మార్కులు వస్తే ముందు గణితం, తరువాత జనరల్ సైన్స్, ఇంగ్లీషు, సోషల్, చివరిగా ఫస్ట్ లాంగ్వేజీలో మార్కులు పరిగణనలోకి తీసుకుని సీట్లు కేటాయిస్తారు.అప్పటికీ సమ ఉజ్జీగా ఉంటే పుట్టిన తేదీ, హల్ టిక్కెట్ నంబర్ నుంచి పొందిన అత్యల్ప సంఖ్య ఆధారంగా ఎంపిక చేస్తారు. నాడు వైఎస్సార్ చలవతో... గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యున్నత సాంకేతిక విద్యనందించేందుకు 2008లో అప్పటి ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి ఇడుపులపాయ, నూజివీడు, తెలంగాణ రాష్ట్రంలోని బాసరలో ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేశారు. ప్రారంభంలో అధిక సీట్లు కేటాయించగా, 2010లో ఒక్కో ట్రిపుల్ ఐటీలో వెయ్యి సీట్లు ఉండేలా కుదించారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం బాసర ట్రిపుల్ ఐటీ తెలంగాణకు వెళ్లడంతో 2016లో ఒంగోలు, శ్రీకాకుళంలో ట్రిపుల్ ఐటీలు ప్రారంభించారు. ట్రిపుల్ ఐటీల్లో 26 జిల్లాల విద్యార్థులకు సమానంగా సీట్లు ఇచ్చేందుకు వర్సిటీ అధికారులు నిర్ణయించి 4 వేల సీట్లలో ఓపెన్ కేటగిరిలో 600 సీట్లను స్థానికేతరలు, తెలంగాణ, ఎన్ఆర్ఐ తదితరులకు కేటాయిస్తారు. మిగిలిన 3,400 సీట్లను 26 జిల్లాల వారికి సమానంగా కేటాయిస్తారు. దరఖాస్తులను మే ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్( డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఆర్జీయుకేటీ.ఇన్/ ఏపీ వెబ్సైట్) ద్వారా స్వీకరించనున్నారు. బీసీ, ఈడబ్ల్యూఎస్, ఓసీ విద్యార్ధులకు దరఖాస్తు రుసుం రూ.400, ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు రూ.250 నిర్ధా రించారు. జూన్ 12వ తేదీన ఎంపిక జాబితా విడుదల చేయనున్నారు. జూలై 1వ తేదీ నుంచి తరగతులను ప్రారంభించనున్నారు. గతేడాది జూలై 15వ తేదీ నుంచి తరగతుల ప్రారంభమైనప్పటికీ..ఈసారి 15 రోజులు ముందుగానే అంటే జులై 1 నుంచే పీయూసీ–1 తరగతులను ప్రారంభించాలని విశ్వవిద్యాలయం నిర్ణయించింది. పాత విద్యార్థులకు జూన్ 29 నుంచే 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నందున, కొత్త విద్యార్థులు కూడా వారితో కలిసి చదువు కొనసాగించేలా ఈ మార్పు చేశారు. -
వైభవంగా సాక్షి భావనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు
పొన్నూరు: పట్టణంలోని సుందరవల్లీ రాజ్యలక్ష్మి సమేత సాక్షి భావనారాయణస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం ఉదయం వసంతోత్సవం, చక్రస్నానం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాత్రి ధ్వజారోహణం, హేయ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ అధికారులు, ధర్మకర్తలమండలి సభ్యులు శిఖాకొల్లి గుర్నాధరావు, కాట్రగడ్డ రామచంద్రరావు, గుడివాడ పవన్, ధరణికోట పద్మావతి, ఆకురాతి అనురాధ, ఊటుకూరి బాజీ శిరీష, కూరాకుల సత్యనారాయణ, సింహాద్రి వెంకటలక్ష్మి, పరాశరం రంగవల్లి, ఎక్స్ అఫీషియో సభ్యులు పొన్నూరు బాలగంగాధరతిలక్ పర్యవేక్షించారు. ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూ దూరవిద్య కేంద్రం పరిధిలో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగిన పలు యూజీ కోర్సుల పరీక్ష ఫలితాలను వర్సిటీ ఇన్చార్జి వీసీ ఆచార్య కె గంగాధరరావు శనివారం విడుదల చేశారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ఆచార్య వంకాయలపాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీఏ, బీబీఏ, ఐదవ సెమిస్టర్, బీకాం జనరల్, కంప్యూటర్ సైన్స్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వెల్లడించామన్నారు. ఈనెల 13వ తేదీలోగా రీవాల్యుయేషన్కు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. యూజీ కోర్సులకు ప్రతి పేపర్కు రూ.1200 చొప్పున ఫీజు చెల్లించాలన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈనెల 16వ తేదీలోగా పరీక్షల కోఆర్డినేటర్ కార్యాలయానికి అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్సైట్ నుంచి పొందవచ్చన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య జి సింహాచలం, ఐసీటీ డైరెక్టర్ ప్రభాకర్, పరీక్షల విభాగ డిప్యూటీ రిజిస్ట్రార్ జైనలుద్దీన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు కోదండపాణి, సూపరింటెండెంట్ టంకశాల వెంకటేశ్వర్లు, ఉద్యోగులు మురళి, వలి, మోహన్ తదితరులు పాల్గొన్నారు. వినుకొండ: మహిళపై లైంగికదాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న సీఐ చిన్నమల్లయ్యపై పోలీస్ ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు చేపట్టారు. వినుకొండకు చెందిన ఓ మహిళపై లైంగికదాడితోపాటు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐను శనివారం సస్పెండ్ చేశారు. కేసు నమోదు నేపథ్యంలో సీఐ పరారీలో ఉన్నాడు. ఆయనను పట్టుకునేందుకు నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు ఆంధ్ర, తెలంగాణల్లోని పలు ప్రాంతాల్లో వెతుకులాట ప్రారంభించారు. ఏ క్షణమైన ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. నగరంపాలెం: పోలీస్ విధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు దృష్ట్యా ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు (హెచ్సీ), ఒక కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. విధుల్లో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు, అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో తాడేపల్లి పోలీస్స్టేషన్న్ హెచ్సీ ఏవీ.రమణ, కానిస్టేబుల్ సీహెచ్.రాము, తెనాలి గ్రామీణ పోలీస్స్టేషన్ హెచ్సీ చెంగల రాయుడుని సస్పెండ్ చేశారు. జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరించాలని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ప్రజలతో మర్యాదగా మెలగాలని చెప్పారు. అవినీతి, అసాంఘిక కార్యకలాపాలు, విధుల దుర్వినియోగానికి పాల్పడవద్దని సూచించారు. ఎవరైనా గీత దాటితే శాఖాపరమైన చర్యలు కఠినంగా ఉంటాయని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. -
అంతర్ జిల్లా బాస్కెట్బాల్ చాంపియన్షిప్ జిల్లా జట్టు ఎంపిక
గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామచంద్రపురంలో జరగనున్న అంతర్ జిల్లాల జూనియర్ బాల, బాలికల బాస్కెట్ బాల్ చాంపియన్షిప్కు గుంటూరు జిల్లా జట్టు ఎంపిక శుక్రవారం నిర్వహించారు. లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య సీబీఎస్ఈ పాఠశాలలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో ఏపీ స్టేట్ బాస్కెట్బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ జీఎస్సీ బోస్, కోశాధికారి రేవతి, జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పాటిబండ్ల విష్ణువర్ధన్, చీఫ్ సెలెక్టర్ గుంటుపల్లి హరగోపాల్ సమక్షంలో శిక్షకులు సీహెచ్ శ్రీనివాసరావు, అనిల్, రవికుమార్ పర్యవేక్షించారు. అంతర్ జిల్లాల జూనియర్ బాల, బాలికల బాస్కెట్బాల్ చాంపియన్షిప్కు గుంటూరు జిల్లా జట్టు తరుపున బాలుర విభాగం నుంచి షణ్ముఖ్, రూపేష్, మణికంఠ, అఖిల్, జాన్ ప్రడ్డి పాల్, జయ రామ్, అఖిల్, విజయ్, ప్రత్యుష, సత్య, ఈశ్వర్ దినేష్ స్టాండ్ బై గా గిరి, హర్షిత్, ఆకాష్, రుత్విక్, బాలికల విభాగం నుంచి యోగ శ్రీ, మానస, అక్షయ, కుండానే, కావ్య, జుబేరియా, శ్రీ లక్ష్మి, ఫర్హానా, ఈషా, ప్రణతి, సహస్ర, సాయి శ్రీ స్టాండ్ బైగా బృంద, జస్విత, ప్రణీత, బ్లేస్సిలను ఎంపిక చేశారు. డాక్టర్ తనపై దాడి చేశాడంటూ విభాగాధిపతి ఫిర్యాదు గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో విధుల కేటాయింపులో వివాదం ఏర్పడి ఓ డాక్టర్ ఓ విభాగాధిపతిపై దాడిచేసిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. తనపై దాడిచేసిన వైద్యుడిపై చర్యలు తీసుకోవాలంటూ విభాగాధిపతి లిఖితక పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జీజీహెచ్ ఆర్ధోపెడిక్ విభాగాధిపతిగా, ఎమర్జెన్సీ మెడిసిన్ ఇన్చార్జిగా డాక్టర్ పాటిబండ్ల అనిల్బాబు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఎమర్జెన్సీ మెడిసిన్ ఇన్చార్జి విధులు చేపట్టిన డాక్టర్ అనిల్బాబు ఎమర్జెన్సీ మెడిసిన్లో రోగులకు సత్వర వైద్య సేవలు అందించేందుకు రోడ్డు ప్రమాద బాధితులు, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పలువురు క్యాజువాల్టి మెడికల్ ఆఫీసర్లకు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (సీఏఎస్) విధులు కేటాయించారు. జీజీహెచ్లో క్యాజువాల్టీలో పనిచేస్తున్న సీఏఎస్లను క్యాజువాల్టి మెడికల్ ఆఫీసర్ అని కూడా పిలుస్తారు. వీరు మూడు షిఫ్ట్లు క్యాజువాల్టిలో అందుబాటులో ఉండి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మే నెలకు సంబంధించి డ్యూటీ రోస్టర్ వేసిన పిదప క్యాజువాల్టిలో విధులు నిర్వహించకుండా ఆర్ఎంఓ రూములో డాక్టర్ గురుప్రసాద్ ఉండటంపై డాక్టర్ అనిల్కుమార్ ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య వాదోపవాదాలు జరిగి డాక్టర్ గురుప్రసాద్ తనను అసభ్యంగా మాట్లాడి, కర్రతో దాడి చేసేందుకు ప్రయత్నించారని, డ్యూటీలు సక్రమంగా నిర్వహించేలా తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆసుపత్రి అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఉన్నవ గ్రామంలో చోరీ యడ్లపాడు: మండల పరిధిలోని ఉన్నవలో పట్టపగలే గర్తు తెలియని దుండగులు ఇంట్లో చోరీ చేసినట్లు యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చెన్నుపాటి కృష్ణవేణి రోజువారీ కూలి పనులకు వెళ్లి, సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. ఆ సమయంలో పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్లారు. ఆమె ఇంటి లోపలికి వెళ్లి చూడగా, అల్మారాలోని దుస్తులు చిందరవందరగా పడి ఉన్నాయి. అల్మారా తలుపులు తీసి ఉండటంతో పాటు, లోపల ఉన్న లాకర్ కూడా తెరిచి ఉండటాన్ని ఆమె గమనించారు. ఆందోళనతో లాకర్ను పరిశీలించగా, అందులో దాచిన సుమారు 48 గ్రాముల బంగారం గొలుసు, చెవిపోగులు వంటి విలువైన ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు. బాధితులరాలి ఫిర్యాదు మేరకు ఎస్ఐ టి.శివరామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి శావల్యాపురం: మండలంలోని కనమర్లపూడి గ్రామం శివారు పరిధిలోని వెంకటేశ్వర నగర్ సమీపాన జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలై మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై మోర్ల వెంకటేష్బాబు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని శానంపూడి గ్రామానికి చెందిన దాసరి మరియబాబు (35) బైకుపై వినుకొండ నుంచి స్వగ్రామానికి వస్తుండగా మార్గంమధ్యలోని వెంకటేశ్వరనగర్ సమీపాన ఏదురుగా వస్తున్న ఆర్టీసీ ఢీకొనటంతో రోడ్డుపై పడి కుడి కాలు విరిగిపోవటంతో సత్వరమే 108 అత్యవసర వాహనంలో వినుకొండ ప్రభుత్వ వైద్యశాల తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రక్తం అధికంగా పోవటంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై మోర్ల వెంకటేష్బాబు తెలిపారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.ఆర్టీసి డ్రైవరు సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. -
బ్రేకుల్లేని అద్దె కార్ల దందా
చేతిలో స్టీరింగ్.. కళ్లకు కూలింగ్ గ్లాస్.. పక్కన ఫ్రెండ్స్తో చిట్ చాట్.. ఆకాశమే హద్దుగా డ్రైవింగ్.. ఈ రకమైన ఎంజాయ్మెంట్కు యువత ఆకర్షితులవుతుంటే.. అద్దె కార్ల ఆఫీసులు ప్రోత్సాహక కేంద్రాలుగా మారుతున్నాయి. డ్రైవింగ్ నిబంధనలు కూడా తెలియని జోరులో యువత రయ్మంటూ రోడ్లపై దూసుకుపోతుంటే అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. చేతిలో కాసులు పడితే.. ఎవరికై నా కీస్ అందిస్తామంటూ రూల్స్ను కార్ల చక్రాల కింద తొక్కిపెడుతుంటే.. బిడ్డల నిండు ప్రాణాలు కోల్పోయిన తల్లిదండ్రుల కన్నీళ్లు అధికారుల నిద్రమత్తును నిలదీస్తున్నాయి. నరసరావుపేట కేంద్రంగా సాగుతున్న అద్దె కార్ల దందా మూడు పువ్వులు ఆరు కాయలు కాగా.. అనుభవం లేని యువత చేతిలో చక్రాలు రోడ్లపై నెత్తుటి ధారలు పారిస్తున్నాయి. నరసరావుపేట టౌనన్్ : అద్దె కార్ల నిర్వాహకుల ఇష్టారాజ్యం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. కనీస నిబంధనలు పాటించకుండా మైనర్ యువకులకు, డ్రైవింగ్ లైసెనన్స్ లేని వారికి సైతం అద్దె కార్లు ఇస్తుండటంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. రెండు రోజలు క్రితం మాదల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడిన ఘటన అద్దె కార్ల బాగోతాన్ని బట్టబయలు చేసింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీస్ అధికారులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ వచ్చిన ఇంజనీరింగ్ విద్యార్థి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ప్రమాదానికి కారణమైన విషయాలపై తీగ లాగితే అద్దె కార్ల అక్రమ డొంక వెలుగులోకి వచ్చిందని ముప్పాళ్ల ఎస్ఐ అనిల్ తెలిపారు. నరసరావుపేట పట్టణంలో సెల్ఫ్ డ్రైవింగ్ కోసం కారు అద్దెకు తీసుకున్నాడని, డ్రైవింగ్ చేసిన విద్యార్థికి కనీసం లైసెనన్స్ కూడా లేదని స్పష్టం చేశారు. ఆ వ్యక్తికి కారు అద్దెకు ఇచ్చినందుకు యజమానిపై కేసు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. గతంలో పెట్లూరివారిపాలెం వద్ద మరో వ్యక్తిని ఢీకొట్టిన వైనం వెలుగుచూసింది. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో అద్దె కార్ల వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే పలువురు నిర్వాహకులు కార్యాలయాలు ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో కార్లను అద్దెకు ఇస్తున్నారు. కార్లు బాడుగకు ఇచ్చే సమయంలో డ్రైవింగ్ లైసెన్న్స్ గానీ, వారి అనుభవంగానీ పరిశీలించడం లేదు. చేతిలో కాసులు పడితే చాలు కారు కీస్ అందిస్తున్నారు. ఒక్కో కారుకు రోజుకు రూ.2 వేలు, లగ్జరీ కారుకు రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. ప్రైవసీ ఉంటుందని ట్రావెల్స్ కార్ల కంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వైపే యువత ఆకర్షితులవ్వడంతో నిర్వాహకులు అవకాశంగా మలుచుకుంటున్నారు. కొందరు కార్లు అద్దెకు తీసుకుని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. అద్దె కార్లు తీసుకొని మితిమీరిన వేగంతో వెళ్లటం వల్ల రోజురోజుకూ ప్రమాదాలు పెరుగుతున్నాయి. 20 రోజుల క్రితం పెట్లూరివారిపాలెం వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని అద్దె కారు తీసుకొని సెల్ఫ్ డ్రైవింగ్తో వచ్చిన యువకుడు ఢీకొనడంతో మృతి చెందాడు. గతంలో ప్రకాష్నగర్ సెయింట్ జోసఫ్ పాఠశాల వద్ద మైనర్ కారుతో బీభత్సం సృష్టించాడు. సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా ముప్పాళ్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంతో భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువకులను కారు రూపంలో మృత్యువు కబళించింది. ఇలాంటి వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి ఈ వ్యవహారంలో నియంత్రణ పెంచాల్సిన అవసరం ఉంది. రోడ్డుపై వెళ్లే ప్రతి వాహనం లైసెన్స్, ఫిట్ నెస్, వాహనాన్ని నడిపే వ్యక్తికి డ్రైవింగ్ లైసెనన్స్, ఇన్సూరెన్స్... ఇలా అన్ని నిబంధనలు పరిశీలించాలి. అలాంటిది నరసరావుపేట కేంద్రంగా అద్దె కార్ల దందా కొనసాగుతుంటే అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం వెనుక ఉన్న ఆంతర్యమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తాజాగా జరిగిన ప్రమాదంలో అద్దె కార్ల కారణంగా ఇద్దరి నిండు ప్రాణాలు బలయ్యాయి. వారి తల్లిదండ్రుల తీరని శోకానికి ఎవరు సమాధానం చెప్పాలని ప్రజలు నిలదీస్తున్నారు. ఇప్పటికై నా అద్దె కార్ల దందాపై పోలీసులు, రవాణా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అద్దె కార్ల ఆఫీసులు ఏర్పాటు చేసే క్రమంలో కనీసం నిబంధనలు పాటిస్తున్నారా .. లేదా .. అనే విషయాలను పరిశీలించాలి. వాహనాల ఫిట్నెస్తోపాటు ఎవరికి అద్దెకు ఇస్తున్నారో రికార్డులు నిర్వహించేలా చూడాలని కోరుతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపటం చట్ట విరుద్ధమే కాకుండా అత్యంత ప్రమాదకరం. కారు నడిపే వ్యక్తికి లైసెన్స్ లేకుంటే అనుకోని సంఘటన జరిగి మృత్యువాత పడినప్పుడు వారి కుటుంబాలకు ప్రభుత్వపరంగా, న్యాయపరంగా ఎటువంటి పరిహారం అందదు. ముఖ్యంగా డ్రైవింగ్ అనుభవం లేకపోవటం వల్ల వాహనం నడిపే వ్యక్తితోపాటు ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయి. కారు నడిపే మోజులో యువత అద్దె కారులు తీసుకొని మితిమీరిన వేగంతో వెళ్తున్నారు. వచ్చీరాని డ్రైవింగ్ చేస్తూ ఎదుటి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. -
గృహ గణన సర్వే పారదర్శకంగా చేపట్టాలి
● జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ● సత్తెనపల్లి మండలం అబ్బూరులో పర్యటన సత్తెనపల్లి: జనగణనలో భాగంగా మొదటి విడతలో ప్రారంభమైన గృహ గణన సర్వే పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. సత్తెనపల్లి మండలం అబ్బురు గ్రామంలో శుక్రవారం ఆమె పర్యటించారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లతో కలిసి గృహ గణన జరుగుతున్న తీరును పరిశీలించారు. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణతో కలిసి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి అంగన్వాడీ చిన్నారులకు, బాలింతలకు అందుతున్న పౌష్టికాహారం, పిల్లల హాజరును పరిశీలించారు. చిన్నారులకు నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డేలో ఆమె పాల్గొని చిన్నారులను ప్రత్యేకంగా అభినందించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పుట్టగొడుగుల పెంపకం కుటీర పరిశ్రమ వద్దకు వెళ్లి పరిశ్రమ నడుపుతున్న తీరును, మార్కెటింగ్ జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సత్తెనపల్లి ఆర్డీవో కె.శ్రీరాములు, తహసీల్దార్ కెఎస్ చక్రవర్తి, ఎంపీడీవో బండి శ్రీనివాసరెడ్డి, ఏపీ బట్రాజు కార్పొరేషన్ చైర్మన్ సరికొండ వెంకటేశ్వరరాజు, నాయకులు మన్నెం శివనాగమల్లేశ్వరరావు, భీమినేని వందనాదేవిపాల్గొన్నారు. సాగర్ నీటిమట్టం వివరాలు విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 525.70 అడుగులకు చేరింది. ఇది 159.8751 టీఎంసీలకు సమానం. ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 450 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
ముగిసిన నరసింహుని జయంతి వేడుకలు
రాజాధి రాజ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న నృసింహుని జయంతి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఉదయం ఆలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నారసింహస్వామి ఉత్సవమూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాపూర్ణాహుతి హోమం, నరసింహ మూలమంత్ర హోమం అనంతరం శాంతి కల్యాణం చేశారు. సాయంత్రం రాజాధిరాజ వాహనంపై స్వామివారు గ్రామోత్సవంలో దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. జయంతి ఉత్సవాల శాశ్వత కై ంకర్యపరులుగా మాల్యవంతం లక్ష్మీ నరసింహాచార్యులు, శేషమ్మ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్కుమార్ పర్యవేక్షించారు. కమనీయం రంగనాథుడి కల్యాణం యడ్లపాడు: సొలస గ్రామంలోని శ్రీభూదేవి సమేత రంగనాయకస్వామి దేవస్థానం ఆధ్యాత్మిక శోభతో పరవశించిపోయింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ మండపాన్ని సుగంధభరిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేదికపై నూతన వధూవరులుగా ముస్తాబైన శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథుడి కల్యాణ మహోత్సవం గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. అర్చకులు పర్చూరి రామకృష్ణమాచార్యులు నేతృత్వంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, ఉలూఖల గౌరీ పూజల అనంతరం వేదమంత్రోచ్ఛారణలు, మేళతాళాల నడుమ శాస్త్రోక్తంగా సాగిన కల్యాణం భక్తులు తిలకించి పులకించిపోయారు. ఎదుర్కోలు ఉత్సవం సందర్భంగా గ్రామ భక్త బృందం చేసిన కోలాట నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శుక్రవారం కల్యాణానంతరం హోమం, బలిహరణ కార్యక్రమాలు జరిగాయి. స్వామివారు గరుడ వాహనంపై రథోత్సవంలో పురవీధుల్లో ఊరేగుతుండగా, గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో నీరాజనాలు అర్పించారు. ఈవో నెమలిరెడ్డి పర్యవేక్షణలో ధర్మకర్తలు అర్వపల్లి మనోహర్–నాగజ్యోతి దంపతులు, అర్వపల్లి బ్రదర్స్, గ్రామ పెద్దలు ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ గుంటూరు వెస్ట్: వేసవి క్రీడా శిక్షణకు తమ పిల్లల్ని పంపించి వారిలోని సృజనాత్మతకు, ప్రతిభకు తల్లిదండ్రులు దోహదపడాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సమ్మర్ క్రీడా కోచింగ్ క్యాంప్ల పోస్టర్ను శుక్రవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్, జేసీ అశుతోష్ శ్రీవత్సవ ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారులకు సెలవుల్లో కనీస ఆటవిడుపుతోపాటు చక్కని ఆరోగ్యం కూడా వేసవి శిక్షణ ద్వారా లభిస్తాయన్నారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఫ్రోజ్ ఖాన్ పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింపజేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా బెల్లంకొండ: జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింప చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. బెల్లంకొండ, నాగిరెడ్డిపాలెం గ్రామాలలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను కలెక్టర్ అధికారులతో కలసి శుక్రవారం పరిశీలించారు. జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ కె.అమలకుమారి మండల వ్యాప్తంగా సాగవుతున్న ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలు, న్యూట్రి గార్డెన్లు, సెరీకల్చర్ విధానాలను వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి అంగన్వాడీ కేంద్రంలో న్యూట్రి గార్డెన్లను ఏర్పాటు చేయాలని, అధికారులు తమ పరిధిలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. న్యూట్రి గార్డెన్, కిచెన్ గార్డెన్స్ ద్వారా ప్రతి కుటుంబానికి పోషకాహారం అందించడమే లక్ష్యమని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు ఖర్చులు తగ్గి రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు, జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వరనాయక్, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారి ఆంజనేయులు, డ్రామా పీడీ సిద్ధలింగమూర్తి, ఏపీడీ నారాయణ, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. భద్రయ్యకుంట పనులు పరిశీలన రాజుపాలెం: జలధార పథకం ద్వారా చెరువుల అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. మండలంలోని రెడ్డిగూడెం పరిధిలోని భద్రయ్యకుంటలో జరుగుతున్న ఉపాధి పనులను జిల్లా కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెండు నెలలో చెరువుకుంట పనులను పూర్తిచేయాలని ఆదేశించారు. రాజుపాలెం సమీపంలో జ్యోతి నాగేశ్వరరావు సూర్య మండల నమూనాను సందర్శించి అభినందించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ సిద్ధలింగమూర్తి, ఏపీడీ పొత్తూరి వెంకటనారాయణ, ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అమలకుమారి,ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ మాట్లాడుతూ దైనందిన జీవితంలో కార్మికుల పాత్ర ముఖ్యమైనదన్నారు. సమాజంలో కార్మికులకు భద్రతా, పనికి సరిపడా వేతనం కార్మికుల హక్కులని తెలిపారు. ప్రజలందరూ చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. బాలకార్మిక వ్యవస్థ సమాజంలో ఎక్కువగా ఉందని, ఫ్యాక్టరీలు, హోటళ్లలో పిల్లలు కార్మికులుగా మారుతున్నారన్నారు. పేదరికం, అవగాహనా లోపం వలన తల్లిదండ్రులు పిల్లల చదువులు మాన్పించి కార్మికులుగా మారుస్తున్నారని తెలిపారు. బార్ ప్రెసిడెంట్ మధిర నాగేశ్వరరావు, ప్యానెల్ అడ్వకేట్, కార్మిక దినోత్సవంపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ పాండురంగారావు, ఎం.మాధురి, ఏ.సంతోష్కుమార్, ఆర్.చేతన్, పి.వీరాంజనేయులు, స్టేక్ హోల్డర్స్, సోప్ వర్కర్స్, మునిసిపల్ వర్కర్స్, ప్యానెల్ అడ్వకేట్స్ పాల్గొన్నారు. -
నీట్కు విస్తృత ఏర్పాట్లు
గుంటూరు ఎడ్యుకేషన్ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 3వ తేదీన జరగనున్న జాతీయస్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్ యూజీ–2026)కు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసిన 8,417 మంది విద్యార్థులకు 24 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్లైన్ విధానంలో పరీక్ష జరగనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిబంధనల మేరకు ప్రతి ఒక్క విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉండటంతో విద్యార్థులు ఉదయం 11 గంటల కల్లా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం 1.30 తరువాత కేంద్రాల్లోనికి అనుమతించరు. నీట్ దరఖాస్తు సమయంలో అందజేసిన ఇన్స్ట్రక్షన్ మాన్యువల్లో పొందుపర్చిన నియమావళిని విధిగా పాటించాల్సి ఉంటుంది. విద్యార్థుల వస్త్రధారణపై ఆంక్షలు నీట్కు హాజరయ్యే విద్యార్థుల వస్త్రధారణపై ఎన్టీఏ ఆంక్షలు విధించింది. విద్యార్థినులు ముక్కుపుడక సహా చెవులకు దిద్దులు, చేతులకు గాజులు సహా ఎటువంటి ఆభరణాలను ధరించరాదు. విద్యార్థులు వీటిని వెంట తెచ్చుకోవాలి విద్యార్థులు ప్రింటవుట్ అడ్మిట్కార్డుతో పాటు నీట్ దరఖాస్తు సమయంలో ఆన్లైన్లో అప్లోడ్ చేసిన పాస్పోర్ట్ సైజు ఫొటోను తమ వెంట తెచ్చుకోవాలి. మరొక పాస్పోర్ట్ సైజు ఫొటోను ఎగ్జామినేషన్ హాల్లో విద్యార్థుల హాజరు నమోదు చేసే సమయంలో అటెండెన్స్ షీట్పై అతికించాల్సి ఉంటుంది. దీంతోపాటు పోస్ట్కార్డ్ సైజు వైట్ బ్యాక్గ్రౌండ్తో కూడిన కలర్ ఫొటోను అడ్మిట్కార్డుతో పాటు డౌన్లోడ్ చేసుకున్న ప్రొఫార్మాపై అతికించి ఇన్విజిలేటర్కు అందజేయాలని నియమావళిలో పొందుపర్చారు. అదే విధంగా ప్రభుత్వం జారీ చేసిన ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, 12వ తరగతి అడ్మిషన్ కార్డులో ఏదో ఒక ఒరిజినల్ గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి. శారీరక వైకల్యం గల విద్యార్థులు సంబంధిత ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాన్ని వెంట తీసుకెళ్లాలి. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ను తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. పరీక్ష రాసేందుకు అవసరమైన పెన్నులను ఆయా కేంద్రాల్లోనే ఇస్తారు. -
టెన్త్ ఫలితాల్లో ఆక్స్ఫర్డ్ విజయకేతనం
గుంటూరు ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో గుంటూరు ఆక్స్ఫర్డ్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్. విజయభాస్కర్రెడ్డి శుక్రవారం తెలిపారు. గుంటూరు బృందావన్గార్డెన్స్లోని ఆక్స్ఫర్డ్ మెయిన్ క్యాంపస్లో జరిగిన విద్యార్థుల అభినందన సభలో విజయభాస్కర్రెడ్డి మాట్లాడుతూ తమ విద్యార్థులు 600 మార్కులకు అత్యధికంగా 597, 594 కై వసం చేసుకున్నారని చెప్పారు. అదే విధంగా ముగ్గురు విద్యార్థులు 593 సాధించగా, 592 మరో ముగ్గురు, ఐదుగురు విద్యారులు 591 కై వసం చేసుకున్నట్లు వివరించారు. 590కు పైగా 17 మంది, 580 పైన 74 మంది, 570 పైన 176 మంది, 560 పైన 271, 550కు పైగా 344, 540కి పైగా 423, 530కి పైగా 490, 520కి పైగా 543 మంది, 510కి పైగా 593, 500కు పైగా 641, 500లోపు 641 మంది విద్యార్థులు విజయం సాధించారని చెప్పారు. 1200 మంది విద్యార్థులకు గాను మ్యాథ్స్లో 104 మందికి 100 మార్కులు, 248 మందికి 95 పైన మార్కులు, తెలుగులో 108 మందికి 100 మార్కులు, 357 మందికి 95 మార్కులపైన మరియు సోషల్లో 71 మందికి 100 మార్కులు, 351 మందికి 95 పైన మార్కులు, సైన్స్లో 19 మందికి 100 మార్కులు, 243 మందికి 95 పైగా మార్కులు, హిందీలో 19 మందికి 100 మార్కులు, 230 మందికి 95 పైగా మార్కులు, ఇంగ్లీష్లో 230 మందికి 95కు పైగా మార్కులు సాధించినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల నిరంతర కృషి, తల్లిదండ్రుల సహకారంతో ఆక్స్ఫర్డ్ ఘన విజయం సాధించిందని కొనియాడారు. పాఠశాల చైర్మన్ డాక్టర్ ఎస్.ప్రాన్సిస్రెడ్డి, వైస్ చైర్మన్ అరోన్రెడ్డి, డైరెక్టర్ జోసఫ్రెడ్డి, ఇన్చార్జ్లు మనోజ్, భాస్కర్ విద్యార్థులను అభినందించారు. -
రంగురాళ్ల డంపు స్వాధీనం
దాచేపల్లి: భారీ స్థాయిలో రంగురాళ్ల గుట్టును అధికారులు రట్టు చేశారు. దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని ఓ గోడౌన్లో భద్రపరిచిన రంగురాళ్లను అటవీ శాఖ, విజిలెన్స్ అధికారులు శుక్రవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో స్థానిక పోలీసుల సహాయంతో అటవీ శాఖ, విజిలెన్స్ అధికారులు గోడౌన్లో భద్రపరిచిన రంగురాళ్లు (క్రిస్టల్ క్వార్జ్) స్వాధీనం చేసుకున్నారు. దాచేపల్లి మండలం శంకరాపురం గ్రామ సమీపంలో ఉన్న కొండ నుంచి ఈ రంగురాళ్లు వెలికి తీసినట్లు అధికారులు గుర్తించారు. రంగురాళ్ల వివరాలు అధికారులు సేకరిస్తున్నారు. పూర్తిస్థాయిలో ఆధారాలు సేకరించిన తరువాత వీటి విలువ ఎంత అనేది తెలుస్తుంది. స్థానికుల సమాచారం సుమారు రూ.కోటి పైనే రంగురాళ్ల విలువ ఉంటుందంటున్నారు. స్థానిక సీఐ రాజేష్, అటవీశాఖ అధికారులు, విజిలెన్స్ అధికారులు సంఘటనా స్థలంలో ఉండి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులను వివరణ కోరగా, పంచనామా నిర్వహిస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. -
పల్నాడు
శనివారం శ్రీ 2 శ్రీ మే శ్రీ 2026అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.9760 టీఎంసీలు. నగరంపాలెం: విశ్వశాంతిని కాంక్షిస్తూ బృందావన్ గార్డెన్స్లోని వేంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో శుక్రవారం భక్తిశ్రద్ధలతో చండీహోమం నిర్వహించారు. తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.4000, గరిష్ట ధర రూ.8200, మోడల్ ధర రూ.6000 వరకు పలికింది. 7 -
నాడు అన్న.. నేడు తమ్ముడు..
ఇద్దరూ సరస్వతీ పుత్రులే రొంపిచర్ల: నాడు అన్న.. నేడు తమ్ముడు... ఇరువురు చదువులో సరస్వతీదేవికి కవలలు. పదవ తరగతి పరీక్షల్లో తమ సత్తా చాటి మండలంలో టాపర్లుగా నిలిచారు. గురువారం విడుదలై పది పబ్లిక్ పరీక్షల్లో గోగులపాడు జెడ్పీ హైస్కూల్ విద్యార్థి యర్రగుంట్ల నితీష్కుమార్ 587 మార్కులతో మండలంలో టాపర్గా నిలిచారు. గత ఏడాది నిర్వహించిన పది పబ్లిక్ పరీక్షల్లో నితీష్కుమార్ సోదరుడు నిరాజిత్కుమార్ 589 మార్కులతో మండలంలో టాపర్గా నిలిచి నూజివీడు ట్రిపుల్ ఐటీలో చదువుతున్నాడు. అన్నదమ్ములిద్దరూ మండలంలో టాపర్లుగా నిలవటంతో గోగులపాడులో పలువురు సదరు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభావతి, నాగరాజులను అభినందించారు. తండ్రి నాగరాజు రొంపిచర్లలోని ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా, తల్లి ప్రభావతి గృహిణిగా బాధ్యతలు నెరవేరుస్తున్నారు. -
హెచ్టీ పత్తి విత్తనాలు నిల్వ చేసినా కఠిన చర్యలు
సత్తెనపల్లి: హెచ్టీ పత్తి విత్తనాల నిల్వలు, అమ్మకాలకు రాష్ట్రంలో అనుమతి లేదని పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారి ఎం జగ్గారావు అన్నారు. కమిషనర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ గుంటూరు వారి ఆదేశాల మేరకు కమిషనర్ కార్యాలయ ఏడిఏ ప్రేమ్శేఖర్, వ్యవసాయ అధికారి సుకుమార్తో కలిసి పట్టణంలోని పలు విత్తన దుకాణాల్లో గురువారం తనిఖీలు నిర్వహించారు. జగ్గారావు మాట్లాడుతూ విత్తన డీలర్లు కలుపు మందులు తట్టుకునే హెచ్టీ పత్తి విత్తనాలు నిల్వలు, అమ్మకాలకు మన రాష్ట్రంలో అనుమతి లేదన్నారు. అటువంటి పత్తి విత్తనాల విక్రయం చట్టరీత్యా నేరమన్నారు. నిషేధిత పత్తి విత్తనాలు ఎవరైనా విత్తన డీలర్లు నిల్వలు, అమ్మకాలు జరుపుతున్నారా అని తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో విత్తన డీలర్ల దగ్గర ఇప్పటివరకు ఎటువంటి హెచ్టీ లక్షణాలు ఉన్నటువంటి పత్తి విత్తనాలు లేవని గుర్తించారు. పత్తి విత్తనాల నిల్వలు వచ్చిన వెంటనే విత్తన డీలర్లు మండల వ్యవసాయ అధికారి వారికి తెలియజేసి వారి అనుమతి మేరకు విక్రయాలు జరపాలన్నారు. ప్రతి విత్తన డీలర్ రైతులకు తప్పనిసరిగా విత్తన కొనుగోలు రసీదు ఇవ్వాలన్నారు. సత్తెనపల్లి మండల వ్యవసాయ అధికారి బి సుబ్బారెడ్డి మాట్లాడుతూ విత్తన డీలర్లు అందరూ గుర్తింపు పొందిన డిస్ట్రిబ్యూటర్ వద్ద నుండి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. రైతులు లైసెన్సు ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. గుర్తింపు లేని మధ్యవర్తుల వద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దన్నారు.అలాంటి మధ్యవర్తుల సమాచారం ఉంటే అధికారులకు తెలియజేయాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎం. జగ్గారావు -
టెన్త్ ఫలితాల్లో బాలికల హవా
నరసరావుపేట ఈస్ట్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో బాలికలు హవా చాటారు. పల్నాడు జిల్లా రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలల నుంచి 24,919 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 21,808 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 12,666 మందికిగాను 85 శాతం ఉత్తీర్ణతతో 10,770 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికల్లో 12,253 మందికిగాను 90.08 శాతంతో 11,038 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర కంటే బాలికలు 5 శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యారు. కాగా, గత ఏడాది 84.15 శాతం ఉత్తీర్ణతతో 11వ స్థానంలో నిలిచిన పల్నాడు జిల్లా ఈ ఏడాది 3.37 శాతం అధిక ఉత్తీర్ణతతో 87.52 శాతం ఉత్తీర్ణత సాధించింది. ఒక స్థానం దిగజారి 12వ స్థానంలో నిలిచింది. సత్తా చాటిన ప్రభుత్వ బడుల విద్యార్థులు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో అచ్చంపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థి వి.సాయినాయక్ 600 మార్కులకుగాను 592 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచాడు. గిరిజన సంక్షేమ పాఠశాల (వినుకొండ) విద్యార్థి వీఎస్ఎస్ పార్థు 591, జెడ్పీ హైస్కూల్ (ఉప్పలపాడు) విద్యార్థిని ఎ.మహాలక్ష్మి , జెడ్పీ హైస్కూల్ (దమ్మాలపాడు) విద్యార్థిని కె.భార్గవి 590 మార్కులతో టాపర్లుగా నిలిచారు. జిల్లాలో అత్యధికంగా 93.51 ఉత్తీర్ణత శాతంతో శావల్యాపురం, 93.03 శాతంతో బెల్లంకొండ, 91 శాతంతో క్రోసూరు, 90.59 శాతంతో మాచవరం మండలాలు నిలువగా, అత్యల్పంగా రెంటచింతల 65.79, కారంపూడి 68.76 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో బీసీ సంక్షేమ పాఠశాలలు 92.7 శాతం, కేజీబీవీ 89.14, ఏపీ మోడల్ స్కూల్స్ 89.14, ఆశ్రమ పాఠశాలలు 85.95, సోషల్ వెల్ఫేర్ 84.78, గురుకుల 84.62, జెడ్పీ హైస్కూల్స్ 81.5, ఎయిడెడ్ 79.51, మున్సిపల్ 78.73, ప్రభుత్వ 75, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో 73.94 శాతం ఉత్తీర్ణత సాధించాయి. నరసరావుపేట రూరల్: తల్లి మరణాన్ని తట్టుకుని పదవ తరగతిలో ప్రతిభ కనబరిచి ఉత్తమ మార్కులు సాధించింది కోటప్పకొండ జెడ్పీ హైస్కూల్ విద్యార్ధిని నేలపాటి చంద్రిక. వినుకొండ మండలం ఉమ్మడివరానికి చెందిన చంద్రిక కోటప్పకొండలోని కాకతీయ సత్రంలోని వసతి గృహంలో ఉంటూ జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. పది పరీక్షలకు నాలుగు రోజుల ముందు ఇంటి సమీపంలో పాము కాటుకు చంద్రిక తల్లి నాగమణి మృతి చెందింది. ఆ బాధను దిగమింగి పది పరీక్షలపై దృష్టి సారించింది చంద్రిక. గురువారం విడుదలైన పది పరీక్ష ఫలితాలలో 582 మార్కులు సాధించింది. చంద్రికను సత్రం నిర్వాహకులు, ఉపాధ్యాయులు అభినందించారు. -
మద్యం మత్తులో కారు బీభత్సం
వినుకొండ: పట్టణ శివారులోని వెల్లటూరు రోడ్డులో బుధవారం రాత్రి మద్యం మత్తులో కొందరు యువకులు కారుతో బీభత్సం సృష్టించారు. అతి వేగంగా కారు నడుపుతూ రోడ్డుపై వెళ్తున్న ఒక వ్యక్తిని ఢీకొట్టడమే కాకుండా వరుస ప్రమాదాలకు కారణమయ్యారు. మద్యం సేవించి అదుపు లేకుండా కారు నడిపిన యువకులు తొలుత ఒక వ్యక్తిని ఢీకొట్టారు. ఆపై వేగంగా వెళ్లి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టడంతో అది ముక్కలైంది. ఒక ద్విచక్రవాహనాన్ని, తోపుడు బండిని కూడా కారుతో బలంగా ఢీకొట్టించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకొని పోలీస్స్టేషన్కు తరలించి డ్రైవర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇళ్ల గణనకు అందరూ సహకరించాలి
నరసరావుపేట రూరల్: జనగణన– 2027ను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. అధికారులతో గురువారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ జనాభా గణన ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 23వేలకు పైగా స్వీయ గణనాలు నమోదయ్యాయని తెలిపారు. ఈ సారి జనగణన పూర్తిగా మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ పద్ధతిలో జరుగుతుందన్నారు. ఎక్కడా కాగితంపై రాసే పని ఉండదని స్పష్టం చేశారు. జిల్లాలో 3,824 మంది ఎన్యుమరేటర్లు, 668మంది సూపర్వైజర్లను నియమించినట్టు తెలిపారు. ప్రతి ఎన్యుమరేటర్కు సుమారు 150 నుంచి 160 ఇళ్లు కేటాయించినట్టు పేర్కొన్నారు. జనగణన ప్రారంభించే ముందు ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన ప్రాంతం లే అవుట్ను సిద్ధం చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందని వివరించారు. ప్రజలు ఇచ్చే వ్యక్తిగత సమాచారం సురక్షితంగా ఉంటుందన్నారు. సెన్సస్ చట్టంలోని సెక్షన్ 15, 11 ప్రకారం ఈ సమచారాన్ని ఎవరికి బహిర్గతం చేయరని, ఇది ఆర్టీఐ పరిధిలోకి కూడా రాదని స్పష్టం చేశారు. సరైన సమాచారం ఇవ్వడం వలన భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు, అంగన్వాడీ కేంద్రాలు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన తదితర ప్రణాళికలు రూపొందించేందుకు వీలవుతుందని తెలిపారు. జనాభా గణణనలో వివరాలు ఇవ్వడం వలన ప్రభుత్వ పథకాలు కోల్పోతారనేది కేవలం అపోహ మాత్రమేనని తెలిపారు. ప్రజలందరూ ధైర్యంగా కచ్చితమైన సమాచారాన్ని ఎన్యుమరేటర్లకు అందించాలని కోరారు. జనగణనలో వచ్చే సమస్యల పరిష్కారం కోసం 1855 నెంబర్కు కాల్ చేయవచ్చని సూచించారు. -
విజయకీలాద్రిపై నృసింహ జయంతి
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరంలో ఉన్న విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై గురువారం నృసింహ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళగశాసనాలతో ఉదయం 9 గంటలకు దుష్ట గ్రహ నివారణ, ఆయురా రోగ్యాభివృద్ధి కోసం లక్ష్మీ నారసింహ ఇష్టి కార్యక్రమాలు వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. సాయంత్రం లక్ష్మీనృసింహ స్వామి వారికి అభిషేకం, విశేష అలంకరణ, లక్ష్మీ నృసింహస్వామి కల్యాణం, అష్టోత్తర శతనామార్చన, నివేదన, మంగళాశాసనం, తిరు నక్షత్ర తనియన్ విన్నపం, తీర్థ ప్రసాద గోష్టి, వేద ఆశీర్వచనం, తదియారాధన కార్యక్రమాలు కనుల పండువగా నిర్వహించామని తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని లక్ష్మీ నరసింహ స్వామి వారి అనుగ్రహాన్ని పొందారని పేర్కొన్నారు. దుర్గి: దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలోని నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి హుండీ కానుకలు లెక్కించగా రూ.26,72,462 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణా ధికారి, అసిస్టెంట్ కమిషనర్ కె. ఆదిశేషు నాయుడు తెలిపారు. గురువారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ధర్మకర్త యాగంటి మల్లికార్జునరావు, కారంపూడి గ్రూప్ దేవదాయశాఖ కార్యనిర్వహణాధికారి హనుమంతరావుల సమక్షంలో 51 రోజులపాటు భక్తులు అమ్మవారికి సమర్పించిన హుండీ లెక్కింపు చేపట్టారు. కానుకల రూపంలో వచ్చిన ఆదాయాన్ని బ్యాంకు అధికారులకు అందజేసి సంబంధిత రసీదును తీసుకున్నట్లు అధికారులకు వివరించారు. కార్యక్రమంలో ఎన్ఎంఆర్ సిబ్బంది, అర్చక, పరిచారక, నాయీ బ్రాహ్మణులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. తెనాలిరూరల్: మండలంలోని పెదరావూరు గ్రామంలోగల అభయ హస్త సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కేంద్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ వి.రామసుబ్రమణియన్ దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యా గణపతి, బాలాంబిక సమేత సర్వ హితేశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు చింతపల్లి సుబ్రహ్మణ్యశర్మ, సహాయకుడు పోలేపెద్ది రామకృష్ణ, ఆలయ అర్చకుడు శుభం శర్మ, మార్కెట్ యార్డు వైస్చైర్మన్ పాలడుగు సురేంద్ర, కిక్కూరి శ్రీనివాసరెడ్డి తదితరులు జస్టిస్ రామసుబ్రమణియన్ దంపతులకు స్వాగతం పలికారు. మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా మంగళాద్రిలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామి వారి జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ముఖ మండపంలో గురువారం ఉదయం విశేష అభిషేకం, విశేష అలంకరణ నిర్వహించారు. అనంతరం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, పార మాత్మిక నారసింహ హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం స్వామి నామకరణ మహోత్సవం నిర్వహించారు. ఉత్సవ మూర్తులను శేష వాహనంపై అధిష్ఠింప జేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి కె.సునీల్కుమార్ పర్యవేక్షించారు. -
అన్నదాతకు అందని సేవలు
నాదెండ్ల: వ్యవసాయం లాభసాటిగా జరగాలంటే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులే కీలకం. విత్తనం బాగుంటే నాణ్యమైన పంట, సరైన ఎరువులు, పురుగుమందులు వినియోగిస్తే అధిక దిగుబడి సాధించవచ్చు. నాణ్యమైన పంట దిగుబడులతో అన్నదాతల మోముపై చిరునవ్వు చూడాలనే సంకల్పంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిచ్చింది. నాబార్డ్ సౌజన్యంతో రాష్ట్రంలో 147 డాక్టర్ వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్లు ఏర్పాటు చేసింది. ఈ ల్యాబ్లలో విత్తనాలు, పురుగుమందులు, ఎరువుల నాణ్యత పరీక్షలు నిర్వహించి నకిలీల బారి నుంచి రైతులను కాపాడేందుకు ఏర్పాట్లు చేసింది. డీఎన్ఏ ప్రింట్ టెక్నాలజీతో విత్తన జన్యు పరీక్ష, ఎరువులు, పురుగుమందుల్లో నాణ్యతను ధ్రువీకరిస్తూ నిర్ధారణ పత్రాలు అందించే ఏర్పాటు చేశారు. రైతులు తాము సాగు చేయదలచిన పంట విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అగ్రి టెస్టింగ్ ల్యాబ్లలో పరీక్షించుకునేవారు. దీంతో నకిలీల బెడద నుంచి తప్పించుకుని నాణ్యమైన వాటినే వినియోగించేవారు. నెలకు సరాసరి 50 పరీక్షలు నిర్వహించాలనే లక్ష్యంతో ల్యాబ్లు పనిచేస్తున్నాయి. అప్పట్లో రైతులకు విస్త్రతంగా ల్యాబ్ ద్వారా సేవలందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అగ్రి టెస్టింగ్ ల్యాబ్లపై సవతి తల్లి ప్రేమ చూపుతోంది. దీనికితోడు క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల ఉదాసీనతతో అగ్రిటెస్టింగ్ ల్యాబ్లు రైతులకు సేవలందించటంలో వెనుకబడిపోయాయి. పనిచేయని అగ్రి టెస్టింగ్ ల్యాబ్ 2021 జులై 8వ తేదిన అప్పటి మాజీ మంత్రి విడదల రజిని చిలకలూరిపేటలోని నూతన మార్కెట్ యార్డులో రూ.80 లక్షల వ్యయంతో డాక్టర్ వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. రైతులకు ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు సబ్సిడీపై అందించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ల్యాబ్లపై సీతకన్ను వేయటంతో రైతులకు ఇబ్బందులు తప్పటం లేదు. కొన్ని నెలలుగా ల్యాబ్ తెరవటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ల్యాబ్ చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి అపరిశుభ్రంగా మారిపోయింది. భవనంలో ఉన్న యంత్రపరికరాలు సైతం దెబ్బతినే పరిస్దితి నెలకొంది. 2024 ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ అమలు కావటంతో మాజీ మంత్రి రజిని ప్రారంభించిన శిలాఫలకానికి నల్లరంగు పులిమారు. అప్పటి నుండి పునరుధ్ధలేకపోవటం ల్యాబ్ పనితీరుకు నిదర్శనంగా ఉంది. నకిలీల బెడద మార్కెట్లో యథేచ్ఛగా నకిలీ విత్తనాలు, పురుగుమందులు రాజ్యమేలుతుండటంతో రైతులకు నష్టాలు తప్పటం లేదు. ఒడిదొడుకుల వ్యవసాయంలో పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుతానికి ఏమాత్రం స్పందన లేకపోవటం శోచనీయమని రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి రైతులకు మేలు చేకూరేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అగ్ని టెస్టింగ్ ల్యాబ్లో పనిచేస్తున్న టెక్నిషియన్ ప్రస్తుతం మెటర్నిటీ సెలవులో ఉన్నారు. సెలవు ముగిశాక అగ్ని టెస్టింగ్ ల్యాబ్లో తిరిగి సేవలు ప్రారంభిస్తాం. ఖరీఫ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు ఉపయోగపడే సేవలను అందిస్తాం. – టి.సరిత, చిలకలూరిపేట వ్యవసాయాధికారి. -
గరుడ పోటీలకు తెనాలి నాటికలు ఎంపిక
తెనాలి: తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ సంస్థ శ్రీవేంకటేశ్వర నాట్య కళాపరిషత్ తిరుపతిలో ఏటా నిర్వహించే గరుడ నాటక పోటీలకు తెనాలి నుంచి రెండు నాటికలు ఎంపికయ్యాయి. సాంఘిక నాటికల విభాగంలో అద్దేపల్లి–ఆరాధ్యుల ఆర్ట్స్, తెనాలి వారి ‘ఎవరు’ నాటిక, బాలల పద్యనాటక విభాగంలో బృందా అవ్యాన్ ఆర్ట్స్ శ్రీసరస్వతి శిశుమందిర్, తెనాలి వారి ‘వైకుంఠం’ నాటిక ఎంపికయ్యాయి. తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో జరిగే పోటీల్లో మే నెల 22వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు ఎవరు నాటిక, 8.30 గంటలకు వైకుంఠం పద్యనాటిక ప్రదర్శనకు అవకాశం కల్పించినట్టు సంబంధిత కమిటీ కార్యదర్శి గజేంద్ర సమాచారం పంపినట్టు నాటికల నిర్వాహకుడు ఆరాధ్యుల కన్నా బుధవారం సాయంత్రం తెలిపారు. రెండు నాటికలను పట్టణానికి చెందిన యువనర్తకి, నాట్యగురువు ఆరాధ్యుల తేజస్విప్రఖ్య రచించగా, నటుడు, దర్శకుడు అద్దేపల్లి లక్ష్మణశాస్త్రి దర్శకత్వంలో ప్రదర్శిస్తారని తెలిపారు. సహకరించిన సుల్తానాబాద్లోని శ్రీ సరస్వతి శిశుమందిర్ స్కూల్ ఫౌండర్ సెక్రటరీ కోడూరు రమాదేవి, శిశుమందిర్ అధ్యక్షులు అవ్వారు లత, హెచ్ఎం వలివేటి రాజేంద్ర కుమార్, యర్రంశెట్టి హనుమంతరావులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాటక సమాజాల నిర్వాహకులు తేజస్వి ప్రఖ్య, లక్ష్మణశాస్త్రిని పట్టణ రంగస్థల కళాకారుల సంఘం మాజీ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణశెట్టి, షేక్ జానీబాషా, దేవిశెట్టి కృష్ణారావు, ఆర్ అండ్ బీ రాజు, బద్దుల తిరుమలయ్య, హార్మోనిస్టు యోహాను, ఫ్రాన్సిస్, పరిశుద్ధరావు తదితర కళాకారులు అభినందించారు. వాసవి కాంప్లెక్సులో అగ్ని ప్రమాదం పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): గుంటూరు నగరంలో వస్త్ర దుకాణ కాంప్లెక్సులో అగ్ని ప్రమాదం జరిగింది. అగ్నిమాపక శాఖ అధికారులు, పాత గుంటూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకానిరోడ్డులోని వాసవి కాంప్లెక్సులో ఉన్న దుర్గా సిల్క్స్ సముదాయంలో బుధవారం అగ్నిప్రమాదం జరిగింది. మంటలు వ్యాపించాయి. గుంటూరు–2 అగ్నిమాపక శాఖ అధికారి పి.శ్రీనివాసరావుకు వచ్చిన సమాచారం మేరకు సిబ్బందితో వచ్చి మంటలు అదుపు చేశారు. వాసవి కాంప్లెక్సులో అన్నీ వస్త్ర దుకాణాలే ఉండటంతో భయాందోళనలు నెలకొన్నాయి. మంటలు వ్యాప్తి చెందుతున్న సమయంలో దుకాణదారులు షాపు షట్టర్లు మూసివేయడంతో ప్రమాదం తప్పిది. దుకాణంలోని నాలుగు బ్లాకుల్లో మంటలు వ్యాపించడంతో వస్త్రాలు కాలిపోయాయి. సుమారు రూ. 40 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని షాపు యజమానులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితుల అరెస్ట్ రెంటచింతల: మండలంలోని పశర్లపాడులో ఈ నెల 27న పర్యటించిన మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డిపై బీరు సీసాలతో దాడి ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ సీహెచ్ నాగార్జున బుధవారం తెలిపారు. నిందితులైన పశర్లపాడు గ్రామానికి చెందిన జక్కి గోపాల్, రాజు ఇద్దరిని గురజాల కోర్టులో హాజరుపరచగా జడ్జి వారికి రిమాండ్ విధించినట్లు చెప్పారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు విజయపురిసౌత్: బాలికను వేధించిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు విజయపురిసౌత్ ఎస్ఐ అశోక్ బుధవారం తెలిపారు. మాచర్ల మండలం అనుపు చెంచుకాలనీకి చెందిన ఆటో డ్రైవర్ మన్నే లక్ష్మణ్, చింతల తండాకు చెందిన 17 ఏళ్ల ఓ బాలికను వేధిస్తున్నాడు. ఈ ఘటనపై బాలిక తల్లి విజయపురిసౌత్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. -
చిన్నారిపై లైంగికదాడికి యత్నించిన వ్యక్తికి రిమాండ్
నాదెండ్ల: ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన వ్యక్తికి బుధవారం న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఈ నెల 19న గణపవరంలో ఆరేళ్ళ చిన్నారిపై ఒడిశాకు చెందిన ప్రసాద్దాస్మాలిక్ లైంగిక దాడికి యత్నించాడు. ఒంటరిగా ఇంట్లో ఉన్న బాలికను తన గదిలోకి తీసుకెళ్ళి అసభ్యంగా ప్రవర్తించాడు. జరిగిన విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు తెలియజేయటంతో స్థానికులు నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి వాతలు పెట్టారు. పోలీసులకు సమాచారమివ్వటంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో కేసు నమోదు చేశారు. గాయాలైన నిందితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం బుధవారం అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచగా, న్యాయమూర్తి నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించారు. లివర్ మార్పిడి కోసం ఆర్థిక సహాయం చేయండి శావల్యాపురం: మండలంలోని మతుకుమల్లికి చెందిన మల్నీడి సుస్మిత లివర్ డ్యామేజ్ కావటంతో గత కొద్ది కాలంగా చికిత్స పొందుతోంది. నిరుపేద రైతు కుటుంబలో జన్మించిన సుస్మిత ప్రస్తుతం గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల్లో 9వ తరగతి చదువుతోంది. తండ్రి మూగవాడు కావటం రెక్కడితే డొక్కాడిన కుటుంబ కావటం ఇప్పుటికే వైద్య ఖర్చుల నిమిత్తం రూ.8 లక్షల వెచ్చించారు. లివర్ మార్పిడి నిమిత్తం వైద్యసేవలు కోసం రూ.30 లక్షలు అవసరమని వైద్యులు చెబుతున్నట్లు కుటుంబ సభ్యులు వాపోతున్నారు. దాతలు సాయం చేసి తమ బిడ్డ ప్రాణాలు కాపాడాలని కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా అభ్యర్థించారు. వివరాల కోసం 6301041236 నంబరు సంప్రదించాలన్నాని కోరారు. ద్విచక్రవాహనం ఢీకొని మహిళ మృతి పిడుగురాళ్ల రూరల్: అతివేగంగా వస్తున్న స్పోర్ట్స్ బైక్ ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన పిడుగురాళ్ల శివారులోని అయ్యప్పనగర్ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. అయ్యప్పనగర్కు చెందిన యు.రాజ్యలక్ష్మి రోడ్డు దాటుతున్న సమయంలో హైదరాబాద్ వైపు నుంచి స్పోర్ట్స్ బైక్పై వేగంగా వచ్చి ఢీకొట్టాడు. ప్రమాదంలో రాజ్యలక్ష్మి ఘటనా స్థలంలోనే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వావిలాల ఆదర్శనీయుడు
సత్తెనపల్లి: స్వాతంత్య్ర సమరయోధుడు, సత్తెనపల్లి మాజీ శాసన సభ్యుడు, ఆంధ్ర గాంధీగా పేరు పొందిన వావిలాల గోపాలకృష్ణయ్య అందరికీ ఆదర్శప్రాయుడని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు కొనియాడారు. వావిలాల గోపాలకృష్ణయ్య వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలోని వావిలాల స్మృతి వనంలో బుధవారం నివాళులర్పించారు. అంబటి మాట్లాడుతూ దేశం కోసం వావిలాల గోపాలకృష్ణయ్య చేసిన పోరాటాలు, ఉద్యమాలను తెలుగు వారందరూ స్మరించుకోవాలని ఆకాంక్షించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, సీనియర్ న్యాయవాది పక్కాల సూరిబాబు మాట్లాడుతూ గ్రంథాలయ ఉద్యమానికి, తెలుగు భాషాభివృద్ధికి ఆయన అవిరళ కృషి చేశారని కొనియాడారు. తొలుత మాజీ మంత్రి అంబటి రాంబాబు, పార్టీ నాయకులు వావిలాల గోపాలకృష్ణయ్య విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వావిలాల మనవడు మన్నవ సోడేకర్, పార్టీ సత్తెనపల్లి రూరల్ మండల అధ్యక్షుడు రాయపాటి పురుషోత్తమరావు, పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి, ముప్పాళ్ళ మండల అధ్యక్షుడు నక్కా శ్రీనివాసరావు, రాజుపాలెం మండల నాయకుడు మర్రి సుబ్బారెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చిలకా జైపాల్, ట్రేడ్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు వల్లెం నరసింహారావు, ధూళ్ళిపాళ్ల ఆంధ్ర బ్యాంక్ మాజీ చైర్మన్ నల్లబోతు శివన్నారాయణ ఉన్నారు. -
క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడిన తొమ్మిది మంది అరెస్ట్
నగరంపాలెం: క్రికెట్ బెట్టింగ్కు పాల్పడిన తొమ్మిది మందిని నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.10 లక్షలు, ఏడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఆయన కథనం మేరకు... సోమవారం రాత్రి శ్రీరామ్నగర్ ఒకటో వీధిలోని వెంకటేశ్వర టీ స్నాక్స్ దుకాణం వెనుక ఖాళీ స్థలంలో ఆన్లైన్ యాప్స్ ద్వారా క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్నారనే సమాచారంతో నగరంపాలెం పీఎస్ సీఐ సత్యనారాయణ తనిఖీలు చేశారు. తనిఖీల్లో వర్రా మణికంఠ (ఏటీ అగ్రహారం 12వ వీధి), రామిశెట్టి సురేష్ (నెహ్రూనగర్ ఆరో వీధి), కాసినేడి నటరాజ్కుమార్, కుంచాల సాయికుమార్, బొడ్డు ఇస్సాక్ (శ్రీరామ్నగర్ ఒకటో వీధి), షేక్.బాజీ (రామిరెడ్డినగర్ 4వ వీధి), పైడి ఎర్రంనాయుడు, పైడి అశిరినాయుడు (శ్రీరామ్నగర్ రెండో వీధి) యంపటి కోటిరెడ్డి (ఎన్జీవో కాలనీ)లను అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు రుజువు కావడంతో తొమ్మిది మందిని అరెస్ట్ చేసి, ఏడు సెల్ఫోన్లు, రూ.1.10 లక్షలు స్వాధీనం చేసుకున్నారని అన్నారు. ఈ తొమ్మిది మంది ఆన్లైన్లో ఏపీబుక్.ఇన్, లక్కీ కిస్మత్.కామ్, గల్లీబెట్స్.ఇన్, వీల్బుక్.కామ్లలో బెట్టింగ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించారని అన్నారు. క్రికెట్ను ఆటగా వీక్షించాలని, ఎవరూ జూదంగా మార్చవద్దని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. కేసుని ఛేదించిన సీఐ సత్యనారాయణ, ఎస్ఐలు రాంబాబు, ఎ.రామచంద్రరెడ్డి, కానిస్టేబుళ్లు ఎ.శ్రీనివాసరావు, పి.గంగరాజు, సీహెచ్.ఉదయచంద్, షేక్ షకీల్ అహ్మద్లను జిల్లా ఎస్పీ అభినందించారు. వారికి ప్రశంసాపత్రాలు అందించారు. -
అంగన్వేడి కేంద్రాలు
సత్తెనపల్లి: భానుడి భగభగలకు అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు అల్లాడిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజు రోజుకూ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో చిన్నారులు వేసవి తాపాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచి వేడిగాలులు మొదలు కావడంతో కేంద్రాల్లో ఫ్యాన్లు తిరుగుతున్నా చెమటలు పడుతున్నాయని చిన్నారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో సీలింగ్ ఫ్యాన్లు పనిచేయకపోవడంతో ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. మండే ఎండల్లో కాళ్లకు చెప్పుల్లేకుండా ఇళ్లకు వెళ్లడానికి నానా అవస్థలు పడుతున్నారు. చిన్నారుల అష్ట కష్టాలను చూసి చంద్రబాబు ప్రభుత్వం స్పందించడం లేదు. పక్కనున్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించినా రాష్ట్రంలో అలాంటివేమీ లేవు. పైగా ఎండలు మండుతున్న ప్రస్తుత వేసవిలో పలు రకాల ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. చాలీచాలని గదులు... రాష్ట్రంలో దాదాపు అన్ని విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించారు. అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇవ్వకపోవడంతో ఎండలకు చిన్నారులను కేంద్రాలకు పంపేందుకు తల్లిదండ్రులు విముఖత చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించినా అంగన్వాడీ కేంద్రాలకు సెలవును ప్రకటించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో చాలీచాలని ఇరుకు గదుల్లో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాల్లో తీవ్ర ఉక్కపోతతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. కాగా అంగన్వాడీ కార్యకర్తలకు 15 రోజులు, హెల్పర్లకు 15 రోజులు సెలవులు మంజూరు చేసినా, ఎవరో ఒకరు మాత్రం కేంద్రాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఆ దిశగా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ● పైపెచ్చు అంగన్వాడీ కేంద్రాల్లో ఫ్యాన్లు ఉన్నప్పటికీ ఉక్కపోతతో పిల్లలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యుత్ సరఫరాలో పలు ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న అంతరాయంతో చిన్నారులు సతమతమవుతున్నారు. అలాగే గర్భిణులు, బాలింతలు కూడా పౌష్టికాహారం కోసం ఎండలోనే అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎండలు మండుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్ట్లు : 09 అంగన్వాడీ కేంద్రాలు : 2,031 గర్భిణులు : 9,548 బాలింతలు : 9,414 3 నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు : 38,261 7 నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు : 49,778 ఆరు నెలలలోపు చిన్నారులు : 9,453 అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల ‘ఉక్క’రిబిక్కిరి కేంద్రాలకు సెలవులు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం పక్క రాష్ట్రాల్లో ముందస్తు చొరవ తీసుకున్న ప్రభుత్వాలు జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న ఎండలు అంగన్వాడీ కేంద్రాల్లో అల్లాడిపోతున్న చిన్నారులు -
బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు
యడ్లపాడు: బాల్య వివాహం అనే సామాజిక మహమ్మారి బారి నుంచి ఓ బాలిక భవితను ఐసీడీఎస్ అధికారులు సమయస్ఫూర్తితో కాపాడారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం ఉప్పరపాలెంలో ఓ బాలికకు పెళ్లి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్న సమాచారంతో యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. బుధవారం రోజు బాలికకు నిశ్చయ తాంబూలాలు చేస్తున్నట్లు ముందురోజు రాత్రి బాలిక బంధువుల నుంచి అందిన ఫోన్ కాల్పై తక్షణమే స్పందించారు. ఐసీడీఎస్ వంకాలయపాడు సూపర్వైజర్ ఆర్.సామ్రాజ్యం, తన సిబ్బంది, ఇతర శాఖల అధికారులతో కలిసి బుధవారం ఉదయాన్నే ఆ ఇంటికి చేరారు. బాలిక తల్లిదండ్రులతో ముఖాముఖి మాట్లాడి, చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల కలిగే శారీరక, మానసిక అనర్థాలను వివరించారు. చట్టపరంగా వారు ఎదుర్కోవాల్సిన కఠిన చర్యలను తెలియజేస్తూ హెచ్చరించారు. అధికారుల కౌన్సెలింగ్తో మనసు మార్చుకున్న తల్లిదండ్రులు, తమ కుమార్తెకు మైనారిటీ తీరే వరకు ఎలాంటి వివాహ ప్రయత్నాలు చేయబోమని అధికారులకు లిఖితపూర్వక హామీ ఇచ్చారు. కానిస్టేబుల్ ఆర్.వెంకటేశ్వర్లు, డీసీపీయూ సభ్యులు నానమ్మ, వంకాయలపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శి బాపిరాజు, నీడ్ సంస్థ ఎన్జీవో ప్రేమ్కుమార్, అంగన్వాడీ కార్యకర్తలు సుబ్బాయమ్మ, కోటేశ్వరి ఉన్నారు. -
పల్నాడు
గురువారం శ్రీ 30 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026విజయం కన్నా ప్రాణం మిన్న ● టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాల నేపధ్యంలో.. ● విద్యార్థులు, తల్లిదండ్రులు సంయమనం పాటించాలి ● పరీక్షలు, మార్కులే జీవితంగా భావించొద్దు ● ఓటమి విజయానికి తొలిమెట్టుగా భావించాలి ● సమాజంలో మార్పుతెచ్చే మార్గాలు ఎన్నో.. ● జిల్లాలో టెన్త్ పరీక్ష రాసిన 25,167 మంది రెగ్యులర్, 1,087 మంది దూరవిద్య విద్యార్థులు సత్తెనపల్లి: ప్రస్తుత పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు తమ పిల్లల మార్కులనే వారి పరువు, ప్రతిష్టలుగా భావిస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను ఇతర విద్యార్థుల మార్కులతో పోల్చుతూ వారూ అలా సాధించాలని ఒత్తిడి చేస్తున్నారు. దీంట్లో కొందరు విద్యార్థులు విజయం సాధిస్తున్నప్పటికీ చాలామంది వెనుకబడిపోతూ తల్లిదండ్రుల అంచనాలను అందుకోలేకపోతున్నామనే ఆత్మన్యూనతా భావనతో ఆందోళనలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే పరీక్షల్లో మార్కులు పిల్లల భవితను, వారి సామర్థ్యాన్ని నిర్ణయించే కొలమానంగా చూడొద్దని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. పదో తరగతిలో ఒకసారి, ఇంటర్లో రెండుసార్లు ఫెయిలైన రాజస్థాన్కు చెందిన అంజుశర్మ కుంగిపోకుండా పట్టుదలతో చదివి డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించారు. అదే ఊపుతో ఎంబీఏ పూర్తి చేసి సివిల్స్లో సత్తా చాటి ఐఏఎస్కు ఎంపికయ్యారు. జిల్లావ్యాప్తంగా పదో తరగతి విద్యార్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గత నెల 16న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలకు జిల్లాలో 25,167 మంది రెగ్యులర్ విద్యార్ధులు, 1,087 మంది దూరవిద్య విద్యార్థులు పరీక్షలు రాశారు. వారు అంతా ప్రస్తుతం ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. విద్యార్థులు ఒక విషయం గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతిభను నిర్ణయించేంది ఒక పేపర్ మీద ఉండే అంకెలు కాదని, ప్రతి విద్యార్థిలో ఉండే పట్టుదల, పోరాట గుణమని విద్యావేత్తలు సూచిస్తున్నారు. మార్కులే జీవితం కాదనే అంశంపై పిల్లలను చైతన్య పరచాలని మేధావులు, విద్యావేత్తలు అంటున్నారు. పలు కారణాలతో పరీక్ష తప్పిన వారు క్షణికావేశంతో అనాలోచిత నిర్ణయాలు తీసుకోరాదని, మార్కులే జీవితం కాదని సూచిస్తున్నారు. ఓటమి కూడా భవిష్యత్తు విజయానికి తొలిమెట్టు లాంటిదని అంటున్నారు. పరీక్షల్లో ఎందుకు తప్పాం? లోపం ఎక్కడ ఉంది? అనే అంశాలను విశ్లేషించుకుని అడుగు ముందుకేస్తే అడ్వాన్స్ సప్లిమెంటరీలో తిరిగి ఉత్తీర్ణత సాధిస్తారని అంటున్నారు. ● పరీక్ష మీ తలరాతను మార్చలేదు ● అపజయం అనేది మరింత నేర్చుకునేందుకు ఒక అవకాశం ● మీ ప్రాణం, ఆరోగ్యం ముందు ఏదీ విలువైనది కాదు ● పిల్లలు వారి సమస్యలు చెప్పుకునే చొరవ ఉండేలా చిన్నతనం నుంచే స్నేహ పూర్వకంగా వారితో తల్లిదండ్రులు మెలగాలి. ● ఓటమి నుంచే విజయం వరిస్తుందని .. స్ఫూర్తి పొందే విజయ గాథలు వివరించాలి. ● పరీక్షల్లో ఫెయిలైనా .. మార్కులు తక్కువొచ్చినా .. తర్వాత ప్రయత్నించవచ్చని ప్రోత్సహించాలి. ● జీవితంలో, చదువులో ప్రతికూల ఫలితాలు సర్వసాధారణమనే విషయాన్ని వారికి చెప్పాలి. ● అపజయాలకు కుంగిపోతే జీవితం ఎలా నాశనం అవుతుందో ఉదాహరణలతో వివరించాలి. ● ఏ అంశంలోనూ ఇతర పిల్లలతో పోల్చి చూడకూడదు. ● అపజయం ఎదురైనప్పుడు పిల్లల్లో వివిధ అంశాల్లో ఉండే ప్రతిభను వివరిస్తూ ధైర్యం నింపాలి. ● ఓటమి తర్వాత వచ్చే గెలుపు రుచి ఎలా ఉంటుందో అనుభవిస్తేనే తెలుస్తుందని ప్రోత్సహించాలి. తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ టెలి మానసన్ అందుబాటులోకి తెచ్చింది. 14416 నెంబర్ కు ఫోన్ చేసి కుంగుబాటు, మానసిక ఆందోళన, నాకు జీవితం ఎందుకు అనిపించినా, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు చుట్టుముడుతున్నా వెంటనే టెలిమానస్కు ఫోన్ చేస్తే.. కౌన్సిలర్లు ఫోన్ ద్వారా కౌన్సెలింగ్ ఇస్తారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయమట్టం బుధవారం 525.70 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 450 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతోంది. ఫలితం ఎలా వచ్చినా .. ఆత్మాన్యూనతా భావంతో మానసికస్థైర్యం కోల్పోరాదు. ఆశలన్నీ పిల్లలపైనే పెట్టుకున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చరాదు. ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ముందున్న విస్త్రృత అవకాశాలు తెలిసే అవకాశముంటుంది. ఓటమి కూడా భవిష్యత్తులో సాధించబోయే విజయానికి తొలిమెట్టు. పాస్, ఫెయిల్ సాధారణ విషయాలే అయినా వ్యక్తిగత ప్రతిష్టకు పోయి తల్లిదండ్రులు కూడా పిల్లల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయరాదు. విద్యార్థులు సైతం ప్రతికూలంగా ఉన్న ఫలితాలపై ఎలాంటి ఆందోళన చెందకుండా పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలని అంటున్నారు. -
2 నుంచి ఆహ్వాన నాటికల పోటీలు
● తల్లిదండ్రులు ఉంటున్న ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన వైనం ● త్రుటిలో తప్పించుకున్న కన్నవారు ● ఆస్తివివాదాల నేపధ్యంలో ఘటన 7మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ముఖ మండపంలో బుధవారం స్వామికి ఆలయ అర్చకులు లక్ష పుష్పార్చన కనుల విందుగా నిర్వహించారు. వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మల్లెలు, చేమంతి, గులాబి, తులసి దళాలతో పుష్పార్చన చేశారు. రాత్రి చతుర్వేద పారాయణం, తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. పుష్పార్చన వల్ల పాపాలు తొలగించి మంచి ఫలితాలు పొందవచ్చని అర్చకులు వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్కుమార్ పర్యవేక్షించారు. దుగ్గిరాల: దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామంలో వేంచేసి ఉన్న వేణుగోపాలస్వామివారి దేవస్థానంలో బుధవారం నూతన జీవ ధ్వజ స్తంభం పునఃప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ఈవో మంతెన విఠల్ శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ నూతన జీవ ధ్వజ స్తంభ పునః ప్రతిష్టా కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి వారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారని తెలిపారు. అన్నసంతర్పణ కార్యక్రమాన్ని కమిటీ వారు నిర్వహించారని తెలిపారు. మాచవరం: పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామంలో అంకమ్మ తల్లి దేవాలయ ప్రతిష్ట మహోత్సవం బుధవారం వైభవంగా నిర్వహించారు. వేద పండితుల సమక్షంలో వేదమంత్రోచ్ఛరణలతో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. బంధువుల రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆలయ నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెనాలిరూరల్: ప్రైవేటు వ్యక్తులు సాగు చేసుకుంటున్న సుమారు రూ.ఐదు కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా జగ్గడిగుంటపాలెం టిడ్కో గృహాల వెనుక పొలాల్లో 2012లో ప్రభుత్వం సేకరించిన 61 సెంట్ల భూమి ఉంది. అనేక కారణాలతో అది ఖాళీగా ఉండడంతో అక్కడ పొలాలు సాగు చేసే రైతులే ఈ భూమిలోనూ సాగు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రైతు రత్తయ్య తాను కౌలుకు తీసుకున్న పొలాలతో పాటు ఈ భూమిలోనూ సాగు చేసుకుంటున్నాడు. ఇటీవల జరిపిన రీ సర్వేలో 61 సెంట్లు ప్రభుత్వ భూమి ఉన్నటు తహసీల్దార్ గుర్తించారు. ఈ నేపథ్యంలో సాగుదారుడితో మాట్లాడి భూమిని బుధవారం స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో భూమి విలువ సుమారు రూ. ఐదు కోట్లు ఉంటుంది. యడ్లపాడు: మండలంలోని సొలస గ్రామంలో కొలువైన శ్రీభూ సమేత రంగనాయకస్వామి ఆలయ వార్షిక కళ్యాణ మహోత్సవాలు బుధవారం కొనసాగాయి. మూడో రోజు ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకుడు పరుచూరి రామకృష్ణ చార్యుల నేతృత్వంలో మూలవిరాట్లతో పాటు నవవధువరులుగా ఉత్సవ మూర్తులను విశేష అలంకరణ చేశారు. అనంతరం స్వామివారికి సుప్రభాతసేవ, బిందతీర్థం, నిత్యార్చన, హోమ, గ్రామబలిహరణ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీలక్ష్మీ అమ్మవారికి నిర్వహించిన సామూహిక సహస్రనామ కుంకుమార్చన పూజల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిప్రపత్తులు చాటుకున్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టంగా రాత్రివేళ స్వామివారి ఉత్సవమూర్తిని భారీ విద్యుత్ అలంకరణ చేసిన హనుమత్ వాహనంపై అధిష్టింపజేసి గ్రామోత్సవం నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ సాగిన ఈ వాహనసేవను వీక్షించేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయ ధర్మకర్తలు అర్వపల్లి మనోహర్ –నాగజ్యోతి, అర్వపల్లి బ్రదర్స్తో పాటు గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు. కన్నకూతురు ఘాతుకం చిలకలూరిపేట: ఆస్తి, కుటుంబ కలహాల నేపథ్యంలో కన్న తల్లిదండ్రులను కుమార్తె కాల్చి హతమార్చేందుకు యత్నించిన సంఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో చోటు చేసుకుంది. బాధిత తల్లిదండ్రులు గౌరిశెట్టి సుకన్య, మల్లిఖార్జునరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సుకన్య, మల్లిఖార్జునరావు దంపతులకు ఇరువురు కుమార్తెలు. చిన్న కుమార్తె చంద్రికకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమెకు ఆరేళ్ల పాప దేవసేన ఉంది. భర్తతో వివాదాల నేపథ్యంలో మూడేళ్ల కిందట విడాకులు తీసుకుంది. పాపతో కలసి రెండేళ్ల కిందిటి వరకు పట్టణంలోని గుర్రాలచావిడిలో ఉన్న తల్లిదండ్రుల వద్దే ఉండేది. తల్లిదండ్రుల ఆరోపణ ప్రకారం.. ఏడాది నుంచి మరో వ్యక్తితో సహజీవనం కొనసాగిస్తూ పాపను తల్లిదండ్రుల వద్దే వదిలివేసి ఉంటుంది. ఈ క్రమంలో తాత నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తిలో తనకు వాటా ఇవ్వాలని తరుచూ తల్లిదండ్రులతో గొడవ పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం రాత్రి 9గంటల సమయంలో తన తల్లిదండ్రుల ఇంటికి వచ్చి గొడవకు దిగింది. దీంతో తల్లిదండ్రులు మనవరాలిని తీసుకొని లోనికి పరిగెత్తి తలుపులు మూసుకున్నారు. దీంతో ఆగ్రహించిన చంద్రిక పంచలో ఉన్న గ్రిల్స్ నుంచి లోపలికి పెట్రోల్ చల్లి నిప్పు పెట్టింది. మంటలు, పొగ రావడంతో చుట్టుపక్కల వారు గమనించి నీళ్లు పోసి మంటలను చల్లార్చారు. ఇంటి పంచలో ఉన్న మంచాలు, బ్యాగులు తగలబడి పోయాయి. అయితే స్థానికులు సకాలంలో స్పందించి మంటలు ఆర్పడంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఈ విషయమై తల్లి సుకన్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి పరిశీలించి, చంద్రికను విచారిస్తున్నారు. ఇక ఆటవిడుపు ఆంధ్ర ప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఆదేశాల నేపథ్యంలో జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ఏర్పాటకు కార్యాచరణ సిద్ధం చేశాం. జిల్లా మొత్తంగా 27 శిబిరాలు ఏర్పాటు చేయనున్నాం. 14 రకాల క్రీడా అంశాలను నిర్వహించనున్నాం. ఈ మేరకు క్రీడా సంఘాలు, వ్యాయామ ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించాం. ఎంపిక చేసిన ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహిస్తాం. – పి.నరసింహారెడ్డి, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారిసత్తెనపల్లి: వేసవి వచ్చిందంటే చాలు పిల్లలకు ఆటలు గుర్తుకొస్తాయి. ఏడాదంతా పుస్తకాలు, ప్రాజెక్టులు, పరీక్షలు అంటూ ఒత్తిడిలో ఉన్న విద్యార్థులు వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత సేద తీరుతుంటారు. వేసవి సెలవుల్లో స్వేచ్ఛాయుత వాతావరణంలో గడపాలని ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. కొందరు చిన్నారులు సెల్ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్నారు. వారి దృష్టి మళ్లించి క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు శాప్ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. మే 1 నుంచి 31 వరకు జిల్లాలోని 27 నిర్ణీత ప్రాంతాల్లో నిర్వహించేందుకు శిక్షకులను నియమించనున్నారు. ఒక్కో శిబిరానికి రూ.10 వేలు శాప్ కేటాయించనుంది. జిల్లాలో 27 ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహణకు శాప్ అనుమతులు జారీ చేసింది. ● 8 నుంచి 16 సంవత్సరాల లోపు వయసుగల బాల బాలికలకు అవకాశం కల్పిస్తారు. ● అర్చరీ, అథ్లెటిక్స్, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, షటిల్ బ్యాడ్మింటన్, ఫుట్బాల్, ఫెన్సింగ్, హ్యాండ్బాల్, ఖోఖో, కబడ్డీ, కరాటే, సాఫ్ట్బాల్, తైక్వాండో, వాలీబాల్, రెజ్లింగ్ క్రీడాంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ● ఏ ఏ ప్రాంతాల్లో ఏ క్రీడాంశంలో శిక్షణ ఇస్తారనేది జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ప్రకటించనుంది. ● ఇందుకోసం శిక్షకులను ఎంపిక చేశారు. శిక్షకులకు, క్రీడా సామాగ్రికి అయ్యే ఖర్చును శాప్ భరిస్తుంది. ఆటలు ఆడించడానికి ఒక్కో శిబిరంలో ఒక కోచ్ లేదా ఒక సీనియర్ పీఈటీ ఉంటారు. శిబిరాలు నిర్వహించే మైదానాల్లో మంచినీటి వసతి, మెడికల్ కిట్ అందుబాటులో ఉంచుతారు. తెనాలి: కొలకలూరులో కొలంకపూరి నాటక కళాపరిషత్, శ్రీసాయి ఆర్ట్స్, కొలకలూరు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉభయ రాష్ట్రస్థాయి 12వ ఆహ్వాన నాటికల పోటీలు మే నెల 2,3,4,5 తేదీల్లో జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి (భాషా సాంస్కృతిక శాఖ) సౌజన్యంతో జరిగే ఈ పోటీలు ఈసారి కొలకలూరు పంచాయతీ పరిధిలోని ఖాజీపేట నాటకశాల వద్ద ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటల్నుంచి జరుగుతాయని కళాపరిషత్ కార్యదర్శి గోపరాజు విజయ్ బుధవారం ప్రకటించారు. ఈ పోటీల్లో భాగంగా తొలిరోజున గోపరాజు బాల త్రిపురసుందరమ్మ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల నటీమణి దాసరి రమాదేవి (హైదరాబాద్కు ప్రదానం చేస్తారు. 3వ తేదీ రాత్రి కరణం సురేష్ జ్ఞాపకార్ధం ఏటా ఇస్తున్న సవ్యసాచి అవార్డును ప్రముఖ రంగస్థల, టీవీ, సినీనటుడు డాక్టర్ వెంకట్ గోవాడ (హైదరాబాద్), గోపరాజు హేమలత జీవిత సాఫల్య పురస్కారాన్ని రంగస్థల నటి ఎస్.జ్యోతిరాణి (విజయనగరం)లకు బహూకరిస్తారు. 4వ తేదీన కొలంకపురి కళాపరిషత్ రచనల పోటీల విజేతలకు నగదు బహుమతుల ప్రదానోత్సవం ఉంటుంది. చివరిరోజున గోపరాజు చక్రపాణి జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ రంగస్థల, టీవీ, సినీ నటుడు డాక్టర్ సీఎస్ ప్రసాద్ (కాకినాడ)కు అందజేసి సత్కరిస్తారు. మైదానానికి రండి...ఆటల్లో మెరవండి రేపటి నుంచి జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నెలరోజుల పాటు నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి 14 క్రీడాంశాల్లో శిక్షణ జిల్లాలో 27 శిబిరాల్లో శిక్షణకు కార్యాచరణ తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.6000, గరిష్ట ధర రూ.9600, మోడల్ ధర రూ.7200 వరకు పలికింది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.9320 టీఎంసీలు. -
మరణంలోనూ వీడని స్నేహబంధం
● కారు – బైక్ ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి ● ముప్పాళ్ల మండలం బొల్లవరం అడ్డరోడ్డు సమీపంలో ఘటన ● మృతులు ఇరువురూ స్నేహితులు ముప్పాళ్ళ: కారు–ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ద్విచక్రవాహనంపై వస్తున్న స్నేహితులైన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండలంలోని బొల్లవరం అడ్డరోడ్డు సమీపంలో బుధవారం జరిగింది. సంఘటన సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. సత్తెనపల్లి పట్టణంలోని వడ్డవల్లికి చెందిన గంపా ఆంజనేయరాజు(26), నాగార్జున నగర్కు చెందిన వేజెండ్ల ఇమేష్(24)లు ముప్పాళ్లలోని ఓ ప్రైవేటు బ్యాంకులో పని ముగించుకొని ద్విచక్రవాహనంపై సత్తెనపల్లికి బయలుదేరారు. సత్తెనపల్లి – నరసరావుపేట ప్రధాన రహదారిపై నాల్గవ మైలు మలుపు వద్దకు రాగానే సత్తెనపల్లి వైపు నుంచి వస్తున్న కారు ఎదురుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనం పై ఉన్న ఇరువురు ఎగిరి రోడ్డు మార్జిన్లో పడి అక్కడికక్కడే మృతి చెందారు. కారు సైతం మార్జిన్లో ఉన్న చెట్టును ఢీకొట్టి నిలిచిపోయింది. కారులో నరసరావుపేట ఎన్ఈసీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఆరుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు. వీరంతా సత్తెనపల్లి మండల పరిధిలోని గ్రామంలో జరిగిన ఆలయ ప్రతిష్టా మహోత్సవానికి వెళ్లి తిరిగి వస్తు న్నారు. కారు నడుపుతున్న బత్తుల అజయ్కుమార్ అనే విద్యార్థికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలాన్ని ముప్పాళ్ళ ఎస్ఐ పి.అనిల్కుమార్ పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. ఇరు కుటుంబాల్లో విషాదఛాయలు... మృతులు ఇరువురూ మంచి మిత్రులు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతిచెందడంతో ఆయా కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న మృతుల కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరి మృతదేహాలపై పడి రోదిస్తున్న తీరు చూపరులను కలచివేసింది. ఇమేష్ (ఫైల్) ఆంజనేయరాజు (ఫైల్) -
అసిస్టెంట్ ప్రొఫెసర్ వేధింపులపై కేసు నమోదు
పెదకాకాని: రాజధాని ప్రాంతంలోని ఓ ప్రైవేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ ఉబైద్ ముస్తాఖ్ సహోద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడంపై పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి పట్ల మరో విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉబైద్ ముస్తాఖ్ గత కొంతకాలంలో అసభ్యకరమైన మెసేజ్లు పెట్టడం, ఇంటికి ఆహ్వానించాలని ఒత్తిడి చేయడం, వానిష్మోడ్ ఫ్యూచర్ని ఉపయోగించి ఖాతా నెంబర్కు మెసేజ్లు చేయడం వంటి చర్యలకు పాల్పడ్డాడు. ఇరువురూ పెదకాకాని మండలంలోని నంబూరు ఏరియాలోని బహుళ అంతస్తుల సముదాయంలో ఉంటున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెదకాకాని సీఐ టి. పెద నారాయణస్వామి తెలిపారు. మంగళగిరి టౌన్ : గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వేంచేసియున్న ఎగువ సన్నిధి శ్రీ పానకాల లక్ష్మీనరసింహునికి పానక నివేదన పథకాన్ని ప్రారంభించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్కుమార్ బుధవారం ఒక ప్రకటలో పేర్కొన్నారు. భక్తులు కోరిన రోజున వారి గోత్ర నామాలతో స్వామి వారికి పానకం నివేదిస్తామని ఆయన తెలిపారు. ఒక బిందెకు రూ. 40, 11 బిందెలకు రూ. 440, 27 బిందెలకు రూ. 1080, 108 బిందెలకు రూ. 4320, 365 బిందెలు (రోజుకు ఒక బిందె చొప్పున సంవత్సరానికి) రూ. 14,600 లతో పథకాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో భక్తులు ప్రత్యక్ష, పరోక్ష సేవలు పొందేందుకు ఆర్జిత సేవలను కూడా అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. ఊంజల్ సేవ, బంగారు గరుడోత్సవం, పెద్ద శేషవాహనం, చిన్నశేష వాహనం సేవలకు రూ.5 వేల చొప్పున, సుదర్శన హోమం, నరసింహ హోమం, లక్ష్మీ హోమానికి రూ. 3500 చొప్పున, శాంతి కల్యాణం రూ. 1500, నిత్య గోత్ర నామార్చనకు (సంవత్సరం) రూ. 516 గా ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ ఆర్జిత సేవల కోసం రుసుము చెల్లించుటకు ఆన్లైన్ ద్వారా ‘సిటీ యూనియన్ బ్యాంక్, మంగళగిరి శాఖ, అకౌంట్ నెం. 500 101 014 411 599, ఐఎఫ్ఎస్సీ సీఐయూబీ 0000 688’కు చెల్లించవచ్చని తెలియజేశారు. నిత్యాన్నదాన ప్రసాదాలకు విరాళాలు ఇచ్చే వారు మహారాజ పోషకులు రూ. 1,01,116 పైన, రాజపోషకులు రూ. 50,116 పైన, పోషకులు రూ. 25116 పైన, ఒక్కరోజు అన్నప్రసాదానికి విరాళం ఇచ్చేవారు రూ. 10116 గా నిర్ణయించామని వివరించారు. విరాళాలు ఆన్లైన్ ద్వారా ‘మంగళగిరి సిటీ యూనియన్ బ్యాంక్ అకౌంట్ నెం. 500 101 042 919 33, ఐఎఫ్ఎస్సీ సీఐయూబీ 0000 686’లో చెల్లించవచ్చని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
ప్రైవేటు టీచర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
లక్ష్మీపురం: విద్యారంగంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. ప్రైవేటు టీచర్స్, లెక్చర్స్, ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యాన స్థానిక రెవెన్యూ కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన సభలో రాష్ట్ర వ్యాప్తంగా 72 మంది ప్రైవేటు టీచర్లకు సీవీ రామన్ ప్రతిభా పురస్కారాలు అందజేశారు. అసోసియేషన్ కన్వీనర్ ఎం.సూర్యారావు అధ్యక్షతన జరిగిన సభలో లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపు 36 లక్షల మందికిపైగా విద్యార్థులకు ప్రైవేటు ఉపాధ్యాయులు బోధిస్తున్నారని, అధికారిక లెక్కల ప్రకారం 1.20 లక్షల మంది ప్రైవేటు రంగంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారన్నారు. కానీ వారిలో చాలా మందికి కనీస వేతనాలు అమలు కావట్లేదన్నారు. ప్రభుత్వ పరంగా వారి కోసం చేపట్టాల్సిన చర్యలేవీ చేపట్టట్లేదన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం గుర్తింపు కార్డులు, హెల్త్కార్డులు మంజూరు చేయాలన్నారు. ముఖ్యంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 20 సంవత్సరాలుగా ప్రైవేటు విద్యారంగం శరవేగంగా పెరుగుతుందని, కానీ టీచర్ల పరిస్థితి ఘోరంగా ఉందన్నారు. ఎం.సూర్యారావు మాట్లాడుతూ హక్కులు సాధించుకోవటానికి ఉపాధ్యాయులు ఐక్యంగా ఉండాలన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయుల సంక్షేమం, హక్కుల కోసం తమ అసోసియేషన్ నిరంతరంగా కృషి చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి.లక్ష్మణరావు, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వి.నాగేశ్వరరావు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ జేఏసీ ఆర్గనైజెంగ్ సెక్రటరీ ముజఫర్ అహ్మద్, పిటిఎల్పిడబ్ల్యూఎ రాష్ట్ర నాయకులు కిరణ్, శ్రీనివాసరెడ్డి, ఎం.శ్రీనిను, శ్రీవాణి, సదరన్ ప్రైవేటు టీచర్స్ అసోసియేసన్ అధ్యక్షులు డాక్టర్ నాగయ్య, తదితరులు పాల్గొన్నారు. -
ఇన్నర్ రింగ్రోడ్డు బాధితులను ఆదుకోండి
గుంటూరు రూరల్: ఇన్నర్ రింగ్రోడ్డు ఫేజ్–3లో ఇళ్లు కోల్పోయిన బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కోరారు. స్వర్ణభారతినగర్ ఇన్నర్ రింగ్రోడ్డు ఫేజ్–3 బాధితులు మంగళవారం ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని ఆయన కార్యాలయంలో కలసి వినతి పత్రం అందజేశారు. గతంలో సుమారు 300 ఇళ్లను కూల్చివేశారని, నేటికీ వారికి ఇళ్ల స్థలాలు కానీ, ఇళ్లు కాని ఇచ్చిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. నేటికీ ఎందరో చిన్నపిల్లలతో రోడ్డున పడ్డారని వాపోయారు. కొంత మందికి ఇళ్ల స్థలాలను లాం తదితర ప్రాంతాల్లో చూపారని కానీ అక్కడ ఇప్పటికే గతంలో స్థలాలు కేటాయించగా అందులో ఇళ్ల నిర్మాణాలు చేసుకుని జీవిస్తున్నారని వాపోయారు. వాళ్లు ఉంటున్న స్థలాలు మరలా మాకు ఇచ్చి మమ్మల్ని ఉండమంటే ఏవిధంగా న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు స్పందించిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ బాధితులకు న్యాయం జరిగే విధంగా ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్వర్ణభారతినగర్ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
తాడికొండ: మంగళగిరి– తుళ్లూరు మండలాల పరిధిలో జాతీయ రహదారులపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో చర్యలు ప్రారంభమయ్యాయి. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, నార్త్ డీఎస్పీ మురళీకృష్ణ, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, ఇతర అధికారులతో కలిసి కీలక ప్రమాద ప్రదేశాలను మంగళవారం పరిశీలించారు. కాజా టోల్ ప్లాజా, వెస్ట్ బైపాస్లోని మురుగన్ హోటల్ సమీప ప్రాంతం, వెంకటాయపాలెం టోల్ప్లాజా, సీడ్ యాక్సెస్ రోడ్లను సందర్శించి, అక్కడి రోడ్డు పరిస్థితులు, వాహన రాకపోకలు, ప్రమాదాలకు దారితీసే అంశాలను సమగ్రంగా అధ్యయనం చేశారు. అధిక వేగంతో వాహనాలు నడపడం, సరైన హెచ్చరిక బోర్డులు లేకపోవడం, రాత్రివేళల్లో తగినంత లైటింగ్ లేకపోవడం, రోడ్డు నిర్మాణంలో కొన్ని లోపాలు ప్రమాదాలకు దారితీస్తున్నాయని అధికారులు గుర్తించారు. ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ప్రమాదాలు అధికంగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని జాతీయ రహదారి అధికారులకు, కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వాహనదారులు వేగాన్ని తగ్గించేలా అవసరమైన ప్రదేశాల్లో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, ముందస్తు హెచ్చరికగా ప్రతిబింబించే (రిఫ్లెక్టివ్) సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. రాత్రి వేళల్లో ప్రమాదాలను నివారించేందుకు హైమాస్ట్ లైటింగ్, స్ట్రీట్ లైటింగ్ సదుపాయాలను మెరుగుపరచాలని, టోల్ ప్లాజాలు, బైపాస్ రోడ్ల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ చర్యలను మరింత కట్టుదిట్టం చేసి, అధిక వేగంతో వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే స్పీడ్ గన్్స్, సీసీ కెమెరాల వినియోగాన్ని పెంచాలని తెలిపారు. -
చోరీ సొత్తు కలిగి ఉన్న వ్యక్తులకు జైలు
నరసరావుపేట టౌన్ : చోరీసొత్తు కలిగి ఉన్నట్లు నేరం రుజువు అవడంతో నిందితులకు ఒక్కొక్కరికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. 2022వ సంవత్సరంలో మండలంలోని బసికాపురం గ్రామంలో వేంపూడి అనంతమ్మ మెడలోనీ బంగారు గొలుసును ముగ్గురు ఆగంతకులు బలవంతంగా లాక్కొని వెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న నరసరావుపేట రూరల్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు అనంతరం నిందితులైన నరసరావుపేటకు చెందిన దేవర భవానీ ప్రసాద్, ఉయ్యాల విష్ణు, పాలపర్తి ప్రవీణ్లను అరెస్టు చేసి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. విచారణలో చోరీసొత్తు కలిగి ఉన్నట్లు నేరం రుజువు అవడంతో పై విధంగా కోర్టు తీర్పు వెలువడింది. రెంటచింతల: పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన ఓ వివాహితపై కొద్దిరోజుల కిందట లైంగికదాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జీవనోపాధి కోసం భార్యాభర్తలు కొంతకాలంగా విశాఖ పట్టణంలో జీవిస్తున్నారు. ఈ నెల 26వ తేదీ సాయంత్రం 4 గంటల సమయంలో ఆ వివాహిత విశాఖ–నడికుడికి టికెట్ తీసుకుని విశాఖ ఎక్స్ప్రెస్లో బయలుదేరింది. జనరల్ భోగీలో ప్రయాణిస్తున్న ఈ మహిళను గుర్తు తెలియని వ్యక్తి ఏసీ భోగీలోకి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. మంగళవారం బాధిత మహిళ రెంటచింతల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వైద్య పరీక్షల నిమిత్తం మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి పంపించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వెల్దుర్తి: మండలంలోని లోయపల్లి గ్రామంలో పిడుగుపాటుకు గురై పూరి గుడిసె పూర్తిగా దగ్ధమైన సంఘటన మంగళవారం జరిగింది. లోయపల్లి మధ్యాహ్నం వరకు విపరీతంగా ఎండకాసినంతరం, మధ్యాహ్నం 3గంటల తరువాత మాచర్ల నియోజక వర్గంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి వర్షం కురిసింది. మండలంలో మాత్రం దాని ప్రభావం కారణంగా పలుమార్లు ఉరుములు మెరుపులు వచ్చాయి. సాయంత్రం సమయంలో లోయపల్లి గ్రామంలో మండ్లి నాసరయ్యకు చెందిన పూరి గుడిసె మీద పిడుగు పడటంతో గుడిసె పూర్తిగా కాలిపోయి ఆ కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు. రోజువారీ పనులు చేసుకొని జీవించే వారు దిక్కుతోచని స్థితిలో కట్టుబట్టలతో నిలిచారు. తహసీల్దార్ రాజశేఖర్ నాయక్ వచ్చి పరిశీలించి కుటుంబ సభ్యులకు రోజు వారీ నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. వేమూరు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై విచారణ జరిపినట్లు రేపల్లె డీఎస్సీ ఆవుల శ్రీనివాసరావు తెలిపారు. వేమూరు మండం కాకర్లమూడి గ్రామంలో జగనన్న కాలనీలో కాపు కులానికి చెందిన సాయిలక్ష్మి, ఎస్టీ కులానికి చెందిన మొగలి వెంకటేశ్వర్లు ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. ఈ నెల 26వ తేదీన ఇద్దరూ మురుగు నీరు, నడక దారి వద్ద గొడవ జరిగింది. ఇరు వర్గాలకు చెందిన వ్యక్తులు కొట్టుకున్నారు. బొల్లిముంత సాయిలక్ష్మి, వేమూరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. మొగలి వెంకటేశ్వరరావు కులం పేరుతో ధూషించి, కొట్టినట్లు సాయిలక్ష్మిపై ఫిర్యాదు చేశాడు. బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు మంగళవారం కాకర్లమూడి గ్రామం వెళ్లి విచారణ చేసినట్లు డీఎస్సీ తెలిపారు. విచారణ తర్వాత అట్రాసీటీ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వేమూరు ఎస్ఐ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి
నకరికల్లు: ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతిచెందిన సంఘటన మండలంలోని తురకపాలెం సమీపంలో జరిగింది. ఎస్ఐ కె.సతీష్ తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి.. మండలంలోని రూపెనగుంట్ల గ్రామానికి చెందిన గోగా రామ సుబ్బారావు (42) ట్రాక్టర్ నడుపుకొని జీవనం సాగిస్తుంటాడు. సోమవారం వ్యవసాయ పనుల నిమిత్తం ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్తుండగా అదుపుతప్పిన ట్రాక్టర్ తురకపాలెం సమీపంలోని పిల్లవాగులో బోల్తాపడింది. దీంతో తీవ్రగాయాలపాలైన సుబ్బారావు అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనపై మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఈదా శ్రీనివాసరెడ్డి బాపట్ల: రైతులకు డీజిల్ సమస్య రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ రైతువిభాగం జిల్లా అధ్యక్షులు ఈదా శ్రీనివాసరెడ్డి కోరారు. జిల్లా కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ భావన వశిష్టను మంగళవారం ఆయన కలిశారు. మొక్కజొన్న రైతులకు ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉన్నాయని, జిల్లాలో 1700 కుటుంబాలు మొక్కజొన్న సాగుపై ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. రైతులకు అవసరమైన పనులకు డీజిల్ కొరత లేకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో రైతు విభాగం జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పె పూర్ణచంద్రరావు, రాష్ట్రకార్యదర్శి ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, చీరాల నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షులు కావూరి రమణారెడ్డి తదితరులు ఉన్నారు. -
మూడు మట్టి లారీలు సీజ్
వినుకొండ: మండల పరిధిలో కౌజుల వాగు వద్ద అక్రమంగా మట్టిని తరలిస్తున్న ముఠాపై వినుకొండ పోలీసులు మెరుపుదాడులు చేశారు. ఈ దాడుల్లో మట్టిని తరలిస్తున్న మూడు భారీ లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా వివరాల్లోకి వెళ్తే... వినుకొండ మండలం తిమ్మాపాలెం మరియు శ్రీరాంపురం గ్రామాల మధ్య ఉన్న కౌజుల వాగు నుంచి సోమవారం రాత్రి నుంచి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో సీఐ ప్రభాకర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మంగళవారం రాత్రి సమయంలో తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తున్న మూడు లారీలను అధికారులు గుర్తించి వాటిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. సహజ వనరులను అక్రమంగా తరలిస్తే సహించేది లేదని, ప్రభుత్వ అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ఈ ఘటనపై వినుకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అక్రమ రవాణా వెనుక ఎవరి హస్తం ఉంది? ఈ మట్టిని ఎక్కడికి తరలిస్తున్నారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు మహిళలు, ఒక నిర్వాహకుడు అరెస్ట్ గుంటూరు రూరల్: గుట్టు చప్పుడు కాకుండా స్పా సెంటర్లలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు నల్లపాడు పోలీస్స్టేషన్ పోలీసులు స్పా సెంటర్లపై మంగళవారం దాడులు నిర్వహించారు. నగరాలులోని లోటస్ సెలూన్ అండ్ స్పా సెంటర్పై టాస్క్ఫోర్స్ బృందం నల్లపాడు పోలీసులతో కలిసి దాడులు నిర్వహించగా స్పా సెంటర్ నిర్వాహకుడు, అతనితోపాటు ముగ్గురు మహిళలు, కండోమ్స్, ఒక వ్యక్తి, ఐదు సెల్ఫోన్లు అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. శ్రీకాకుళానికి చెందిన వంశీ అనే వ్యక్తి స్పా పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులను విచారణ కోసం నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించామన్నారు. -
ఏటీఎంలో పెట్టాల్సిన రూ. 87.84 లక్షలు స్వాహా
పిడుగురాళ్ల: ఆన్లైన్ బెట్టింగ్కు బానిసై ఏటీఎంలో పెట్టాల్సిన రూ. 87.84లక్షలను సీఎంఎస్ ఉద్యోగి స్వాహా చేసినట్లు గురజాల డీఎస్పీ మల్లా మహేశ్వరరావు తెలిపారు. పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు... సీఎంఎస్వో కంపెనీ మేనేజర్ అనిల్కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేయటం జరిగిందని, క్యాస్ కస్టోడీగా పని చేసే మామిడి నరేష్ రూ. 87,84,900 నగదును తన సొంత అవసరాలు, ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లలో పెట్టింగ్లు పెట్టాడని విచారణ తెలిసిందన్నారు. నరేష్ ఇదే కంపెనీలో 15 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడన్నారు. సీఎంఎస్ కంపెనీ వారు వారానికి ఒక సారి నిర్వహించే ఆడిట్లో రూ. 87,84,900లు తేడా ఉన్నట్లు గుర్తించి ఫిర్యాదు చేయటం జరిగిందన్నారు. పిడుగురాళ్ల సీఐ శ్రీరాం వెంకట్రావు, ఎస్ఐ శివనాగరాజు, సిబ్బంది ఉదయం బైపాస్ రోడ్డులో మామిడి నరేష్ను పట్టుకోవటం జరిగిందన్నారు. అతని వద్ద నుంచి రూ. 25,53,000లను స్వాధీనం చేసుకోవటం జరిగిందన్నారు. ఆ నగదును అతని ఖాతా, అతని భార్య ఖాతాలో ఉంచుకుని వాడుకొని ఆన్లైన్ బెట్టింగ్ చేస్తూ మొత్తం ఖర్చు చేసుకున్నట్లు విచారణ తెలిసిందన్నారు. నిందితుడు మామిడి నరేష్ను కోర్టులో హాజరు పరచనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో సీఐ శ్రీరాం వెంకట్రావు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా
మాచర్ల రూరల్: కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తాపడి ఆరుగురు తీవ్రంగా గాయపడిన సంఘటన మండల పరిధిలోని రాయవరం జంక్షన్లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం మాచర్ల నెహ్రూనగర్కు చెందిన 11 మంది కూలీలు ఆత్మకూరు గ్రామానికి చేలో కూలీ నిమిత్తం ఆటోలో బయలుదేరి వెళ్ళారు. పోలేపల్లి గ్రామ సమీపంలో పెట్రోల్ బంకు దాటిన తరువాత ఆటో డ్రైవర్ పక్కనే ఉన్న మహిళా కూలీ తను డ్రైవింగ్ చేయాలని అడుగగా ఆమెకు స్టీరింగ్ ఇచ్చాడు. ఆమె వేగంగా నడుపుతూ స్టీరింగ్ కంట్రోల్ కాకపోవటంతో ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో జంగం కార్తీక్, మున్నా పాపమ్మ, షేక్ మలాం బీ, షేక్ సైదా బీ, గంగమ్మ తదితర ఆరుగురికి తీవ్రగాయాలు కాగా ఇద్దరిని మెరుగైన చికిత్స నిమిత్తం నర్సరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు రూరల్ ఎస్ఐ సంధ్యారాణి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
అభివృద్ధి చేయలేక చిల్లర రాజకీయాలు
మాచర్ల: ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లు అవుతున్నా నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేక చిల్లర రాజకీయాలు చేస్తూ తన వక్రబుద్ధిని జూలకంటి బ్రహ్మారెడ్డి బయటపెడుతున్నారని, తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వైఎస్సార్సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జూలకంటి అసత్య ప్రచారాలను తిప్పికొట్టారు. ప్రైవేటు సైన్యంతో దాడులు చేయించుకొని బినామీలతో అక్రమ సంపాదన చేకూర్చుకుంటూ తమ పార్టీపై నిందలు వేసి బతుకుతున్నారని పేర్కొన్నారు. అక్రమ మద్యం, బెల్టుషాపులు, గ్రావెల్తోపాటు అనేక అక్రమాలు చేయిస్తూ ఫ్యాక్షన్ సంస్కృతిని మళ్లీ తీసుకురావడం నిజం కాదా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే చేతకానితనం వలన వారి పార్టీలో అంతర్గత పోరు కారణంగా గుండ్లపాడు, అడిగొప్పలలో హత్యలు జరిగాయని తెలిపారు. తమకు సంబంధం లేని కేసులో అక్రమంగా జైలుకు పంపి, పైకి శాంతి వచనాలు చెబుతున్నారని మండిపడ్డారు. బహిరంగ చర్చకు సిద్ధం.. మాట్లాడితే మగతనం, దమ్ము అని ఎమ్మెల్యే అంటున్నారు... 2009లో ఓడిపోయిన తరువాత 15 ఏళ్లు ఎక్కడ దాక్కున్నారో తెలియదా? ఎవరో మద్యం తాగి బాటిల్ విసిరేస్తే అది వైఎస్సార్సీపీపైకి నెడుతున్నారు. ఇలా మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. రెచ్చగొట్టేలా వ్యవహరించి డైవర్షన్ రాజకీయాలు చేయడం మానుకోవాలి. గుంటూరులో స్కూటర్ మీద తిరిగి, అడవుల్లో ఆకులు తెచ్చి, కార్ఖానా పెట్టి బతికిన ఎమ్మెల్యే ప్రస్తుతం ఎంత లగ్జరీగా ఉన్నారో అందరికీ తెలుసు. రెండేళ్లలో గుంటూరు, హైదరాబాద్లో ఎన్ని ఆస్తులు సంపాదించారో చెప్పమంటారా? ఎమ్మెల్యే తల్లి అధికారంలో ఉన్నప్పుడు 7 హత్యలు చేసిన చరిత్ర ఉంది కదా? నువ్వే దాడి చేయించి ఎదుటివారిపై నింద వేస్తూ, సినిమా స్క్రిప్ట్ తయారు చేయించి నటించడం సాధారణంగా మారింది. ఎమ్మెల్యేకు 45 ఏళ్ల రాజకీయం ఉందని చెబుతున్నారు... మరి అధికారంలో ఆయన ఏం చేశారో చెప్పాలి. గుండ్లపాడు పట్లవీడు, రచ్చమల్లపాడు, మర్సపెంటలో ఎమ్మెల్యే దాడులు చేయించిన సంఘటన మర్చిపోయారా? మేం 20 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేశాం. ఫ్యాక్షన్ రాజకీయాలు చేయలేదు. విద్యాసంస్థలు, జాతీయ రహదారులు, వరికపూడిసెల అనుమతులు, ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధి, విద్యుత్ సబ్ స్టేషన్లు తెచ్చాం. ఎమ్మెల్యే సొంత ఊరుకు తిరుగుతున్న రోడ్డు కూడా మా ప్రభుత్వ హయాంలో వేయించిందే. రూ. 3,045 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం చేశాం. గణాంకాలతో చెబుతా. ఎక్కడికి వస్తారో ఎమ్మెల్యే చెబితే బహిరంగ చర్చకు సిద్ధం. టీడీపీకి వరికపూడిసెల గురించి మాట్లాడే హక్కు లేదు. 1996లో శంకుస్థాపన చేసి ఆ ప్రాజెక్టు సాధ్యం కాదన్న చరిత్ర వారిది. వైఎస్సార్, వైఎస్ జగన్ హయాంలో అనుమతులు తెచ్చాం. ఆట మొదలుపెడతా.. అందరి సంగతి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. పోలీసు వ్యవస్థను కూడా సొంత అవసరాల కోసం ఉపయోగించుకొని భ్రష్ఠు పట్టించారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే మారాలని’’ హితవు పలికారు. ఇంకా పిన్నెల్లి మాట్లాడుతూ... ‘‘మేం చట్టాన్ని నమ్ముతాం. ఎమ్మెల్యేలా పైకి శుద్ధ మాటలు చెప్పి లోపల ప్రైవేటు సైన్యం ద్వారా దాడులు చేయించటం మా నైజం కాదు. వైఎస్సార్ స్టిక్కర్ బైకుపై ఉందని ప్రైవేటు సైన్యంతో దాడి చేయించలేదా? దుకాణాలు, రెస్టారెంట్లుపై దాడులు ఎమ్మెల్యే పర్యవేక్షణలో జరగలేదా? వీటితో టీడీపీలోనే బ్రహ్మారెడ్డికి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాన్ని తప్పించుకునేందుకు దాడి పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. నిన్న పశర్లపాడు గ్రామంలో 20 ఏళ్ళ కుర్రాడు మద్యం తాగి పరస్పరం ఘర్షణ పడ్డారు. బాటిళ్లు విసురుకుంటే అది వైఎస్సార్సీపీకేం సంబంధం? గ్రామాల్లో అక్రమ మద్యం దొరికేలా చేసింది స్వయంగా ఎమ్మెల్యేయే. జూలకంటి కాన్వాయ్ మీద బీరు బాటిల్ పడిందని చిల్లర రాజకీయాలు చేయడమేంటి? -
హోరాహోరీగా ఎడ్ల పోటీలు
దాచేపల్లి: వీర్ల అంకమ్మతల్లి కొలుపుల తిరునాళ్ల సందర్భంగా దాచేపల్లిలో జరుగుతున్న రాష్ట్రస్థాయి ఎడ్ల బలప్రదర్శన పోటీలు మంగళవారం హోరహొరీగా సాగాయి. అంకమ్మతల్లి ఆలయం ప్రాంగణంలో నాలుగు పళ్ల విభాగంలో జరిగిన ఎడ్ల బలప్రదర్శన పోటీలో బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెంకి చెందిన అత్తోట శిరీష చౌదరి, శివకృష్ణ చౌదరి ఎడ్ల జత 5591 అడుగుల దూరం బండలాగి విజేతగా నిలిచాయి. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం దొండపాడుకి చెందిన యర్రం రాజశేఖర్, యశ్వంత్ ఎడ్ల జత 5550 అడుగుల దూరం బండలాగి రెండవ స్థానం, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడుకి చెందిన పిడుగురాళ్ల జెడ్పీటీసీ జంగా వెంకటకోటయ్య, జంగా సురేష్ ఎడ్ల జత 5000 అడుగుల దూరం బండలాగి మూడవస్థానం, పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారంపూడికి చెందిన బొమ్మిన పద్మావతి నాయుడు, శివమణి నాయుడు ఎడ్ల జత 4750 అడుగుల దూరం బండలాగి నాలుగవ స్థానం, పల్నాడు జిల్లా రెంటచింతల మండలం జెట్టిపాలెంకి చెందిన అంబటి ఆంజనేయులు ఎడ్లజత 3,339 అడుగుల దూరం బండలాగి ఐదవస్థానం, పల్నాడు జిల్లా గురజాల మండలం అంబాపురంకి చెందిన చుండూరి సీతారామయ్య ఎడ్లజత 1500 అడుగుల దూరం బండలాగి ఆరవ స్థానంలో నిలిచాయి. విజేతలుగా నిలిచిన ఎడ్లజత రైతులకు నగదు, షీల్డ్స్ని నిర్వహకులు, కమిటీ సభ్యులు అందజేశారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా గుడా శ్రీనివాసరావు వ్యవహరించారు. కమిటీ సభ్యులు కొప్పుల గిరి, కూరకుల దిలీప్, కానుకొళ్లు ప్రశాంత్, తోట వెంకటేశ్వర్లు, యలమల నరేష్ తదితరులు ఈ పోటీలను పర్యవేక్షించారు. బలప్రదర్శన పోటీల్లో పెదగొట్టిపాడు ఎడ్ల సత్తా మాచవరం: మండలంలోని కొత్తపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ పార్వతి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి 21వ కల్యాణ ఉత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న రెండు తెలుగు రాష్ట్రాలస్థాయి ఎడ్ల బలప్రదర్శన బండలాగుడు పోటీల్లో సబ్ జూనియర్ విభాగంలో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామానికి చెందిన గరికపాటి లక్ష్మయ్య చౌదరి ఎడ్ల జత 3522 అడుగుల దూరాన్ని లాగి ప్రథమ స్థానంలో నిలిచి బహుమతులు అందుకున్నాయి. అత్తోట శిరీష చౌదరి శివకృష్ణ చౌదరి (వేటపాలెం, చుండూరు మండలం బాపట్ల జిల్లా) ఎడ్లు 3511 అడుగుల దూరాన్ని లాగి రెండవ స్థానంలో, బోని గళ్ళ గాయత్రి (పొట్లపాడు, కురిచేడు మండలం ప్రకాశం జిల్లా) ఎడ్లు 3359 అడుగుల దూరాన్ని లాగి మూడవ స్థానంలో, సంపటం వీరబ్రహ్మం నాయుడు ( ఉయ్యందున, క్రోసూరు మండలం గుంటూరు జిల్లా) ఎడ్లు 3009 అడుగులు, యామిని రామారావు (కొత్తపాలెం మాచవరం మండలం పల్నాడు జిల్లా) ఎడ్లు 2773 అడుగుల దూరం లాగి వరుస స్థానాల్లో నిలిచాయి. విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. నాలుగు పళ్ల విభాగం విజేత బాపట్ల జిల్లా వేటపాలెం ఎడ్లజత -
ఘరానా దొంగల ముఠా అరెస్ట్
బాపట్ల టౌన్: వరుస దొంగతనాలకు పాల్పడుడిన ఘరానా దొంగల ముఠాను జిల్లా పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఎస్పీ బి. ఉమామహేశ్వర్ కేసు వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ... ఈ ఏడాది జనవరిలో చీరాల మండలం, గాంధీనగర్ ఎంజీహెచ్ కాలనీలో బచ్చు వెంకట సుబ్బసత్య రామాంజనేయులు ఇంటిలోకి ముగ్గురు ప్రవేశించారన్నారు. రామాంజనేయులతోపాటు ఏపీపీగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన చెల్లిపై దాడి చేసి వారి నుంచి 64 గ్రాముల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారని చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు చీరాల వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారన్నారు. అదే తరహాలో రాష్ట్రంలోని బాపట్ల, తెనాలి, ఒంగోలు, కావలి, కొవ్వూరు, గుత్తి తదితర ప్రాంతాల్లో నేరాలు జరిగాయని తెలిపారు. దీంతో వేలిముద్రలు, సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారాల ప్రకారం దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం హోలి బోయిడా గ్రామానికి చెందిన భురు మక్వానా, జుందాం గ్రామానికి చెందిన రమేష్ మాచర్, భూటియా గ్రామానికి చెందిన సంతోష్ భూరియాలను నిందితులుగా గుర్తించామన్నారు. వారిని మంగళవారం అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తే ఇదే తరహాలో మొత్తం 18 నేరాలకు పాల్పడినట్లు అంగీకరించారని తెలిపారు. వాటిలో బాపట్ల, చీరాల, గూడూరు, తెనాలి, ఒంగోలు తదితర మొత్తం 10 ప్రదేశాల్లోరీ నేరాలు చేసినట్లు వారు అంగీకరించారన్నారు. వారి నుంచి 137 గ్రాముల బంగారం, 1.50 కేజీల వెండి వస్తువులు, రూ. 5 లక్షల నగదు, నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వాటి మొత్తం విలువ రూ. 30.88 లక్షలు ఉంటుందన్నారు. కేసుల ఛేదనలో ప్రతిభ చూపిన సీసీఎస్, చీరాల సబ్ డివిజన్, ఐటీ కోర్ పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
కదలని బతుకు చక్రం
సాక్షి, నరసరావుపేట: జిల్లాలో డీజిల్, పెట్రోల్ కష్టాలు మంగళవారం కొనసాగాయి. ఆదివారం, సోమవారాలతో పోల్చితే తెరుచుకున్న పెట్రోల్ బంకుల సంఖ్య పెరిగినప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో ఇంధన సరఫరా జరగడం లేదు. జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ సరఫరా రేషన్ పద్ధతిలో పంపిణీ జరుగుతుండగా.. మంగళవారం సైతం జిల్లాలో చాలా బంకుల్లో డీజిల్ పంపిణీ నిలిచిపోయింది. పూర్తిస్థాయిలో డీజిల్ అందుబాటులో లేదని, నో స్టాక్ బోర్డులు పెట్టారు. దీంతో ఆటో, సరుకు రవాణా వాహనాలు, వ్యవసాయ యంత్రాల బతుకు చక్రాలు కదలని పరిస్థితి నెలకొంది. మూడు నాలుగు రోజులుగా వాహనాలకు సరిపడా ఇంధనం దొరక్క ఇంటి వద్దే నిలిచిపోయాయి. జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో రెవెన్యూ, పోలీసు అధికారులు, సిబ్బంది పర్యవేక్షణలో ఇంధన సరఫరా జరుగుతోంది. అధికారులు వెళ్లగానే బంక్లో ఆయిల్ లేదంటూ వాహనాలకు నింపడం లేదని ప్రజలు వాపోతున్నారు. ఒక్కోక్కరికి పది లీటర్ల వరకు డీజిల్ సరఫరా చేస్తుండటంతో రైతులకు పూర్తిస్థాయిలో ఆయిల్ అందుబాటులో లేక సాగు పనులు వాయిదా పడుతున్నాయి. కలెక్టరేట్ ప్రాంగణంలోని డీఆర్ఓ పర్యవేక్షణలో నడుస్తున్న పెట్రోల్ బంకులో మంగళవారం సైతం ఆయిల్ అందుబాటులోకి రాకపోవడంతో వాహనదారులు నిరాశతో వెనుదిరిగారు. నాలుగు బంకులు సీజ్ ఓ వైపు కంపెనీలు సరిపడా ఇంధనం సరఫరా చేయడం లేదని అంటూనే.. మరో వైపు స్థానిక పెట్రోల్ బంక్ యజమానులు డీజిల్ డిమాండ్ ఆధారంగా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. లీటర్ డీజిల్కు రూ.40 వరకు అదనంగా వసూలు చేసి విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా ఇంధన అమ్మకాలు చేపట్టిన విషయం తెలుసుకొని జిల్లా ఉన్నతాధికారులు మంగళవారం నాలుగు పెట్రోల్ బంకులను సీజ్ చేశారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా నరసరావుపేట పట్టణంలోని శ్రీనిధి ఫిల్లింగ్ స్టేషన్, పిడుగురాళ్లలో తిరుమల ఫిల్లింగ్ స్టేషన్, చిలకలూరిపేటలోని జనతా ఫిల్లింగ్ స్టేషన్లను సీజ్ చేశారు. కలెక్టర్ మంగళవారం జిల్లా వ్యాప్తంగా పలు బంకులను స్వయంగా తనిఖీ చేశారు. అధికారుల పర్యవేక్షణలోనే ఇంధన సరఫరా జరుగుతుందన్నారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరుపుతున్న రొంపిచర్లలోని మురళీధర ఫిల్లింగ్ స్టేషన్ను జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన సింహ సీజ్ చేశారు. ప్రతి ఏడాది 40 ఎకరాల విస్తీర్ణంలో మెట్ట, మాగాణిలో వివిధ పంటలను సాగు చేస్తా. పంట చేతికి వచ్చాక గిట్టుబాటు ధర కోసమో, కొనుగోలు కేంద్రాల కోసమో రైతులు రోడ్డెక్కడం చూస్తుంటాం. విచిత్రంగా ఈసారి సాగు ప్రారంభానికి ముందే సమస్యలు చుట్టుముట్టాయి. అవసరమైన డీజిల్ అందుబాటులో లేకపోవడం కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని చాటుతోంది. డ్రైవర్ల కొరతతో ఒకవైపు ఇబ్బంది పడుతుంటే, ఇప్పుడు ఇంధన కొరత తోడవ్వడం గోరుచుట్టుపై రోకలిపోటులా మారింది. – ఘంటా రాము, రైతు, జాలాది గ్రామం, యడ్లపాడు మండలం నరసరావుపేటలో పూర్తిస్థాయిలో డీజిల్ అందుబాటులో రాలేదు. కొన్ని బంకుల్లో ఒక్కో వాహనానికి రూ.1,000 డీజిల్ పోస్తుండగా మరికొన్నింటిలో పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉందని చెబుతున్నారు. పది లీటర్ల డీజిల్తో వాహనాలు రోడ్డెక్కే పరిస్థితి లేదు. దీంతో నా మినీ లారీ తునిలో గోతాల లోడ్ ఉన్నప్పటికీ దారిలో డీజిల్ దొరకదన్న భయంతో నరసరావుపేటకు రాకుండా అక్కడే నిలుపుకొని ఉన్నా. ఇదే పరిస్థితి కొనసాగితే వాహనాలు కిస్తీలు కట్టలేక, కుటుంబాలకు కష్టాలు తప్పవు. – గోతాల బాజీ, మినీ లారీ ఓనర్, నరసరావుపేట -
నాణ్యమైన విద్య అవసరం
బాపట్ల: ప్రతి వ్యవసాయ విద్యార్థికి నాణ్యమైన విద్యను నైపుణ్యంతో కలిపి అందించే ప్రణాళికతో ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ముందడుగు వేస్తోందని ఉప కులపతి డాక్టర్ పి.వి. సత్యనారాయణ అన్నారు. ప్రతి పట్టభద్రుడికి ఉద్యోగ కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ‘‘పరిశోధన మరియు వాస్తవాల మధ్య వారధి: స్థిరమైన రైతులు, ఆహార వ్యవస్థలు, సమాజ సంక్షేమం కోసం స్మార్ట్ ఆవిష్కరణలు’’ అనే అంశంపై బాపట్ల వ్యవసాయ కళాశాలలో మంగళవారం పీజీ విద్యార్థుల జాతీయ సదస్సు ప్రారంభమైంది. దీనికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో దేశ జనాభా 37 కోట్లని, నేటికి 6.5 రెట్లు జనాభా పెరిగినప్పటికీ 540 బిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి శాస్త్రవేత్తలు, రైతుల వలన సాధ్యమైందని తెలిపారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది ప్రపంచ స్థాయిలో 18 శాతం ఉంటే, భారత్లో అది 12 శాతంగా ఉండటం గర్వించదగ్గ విషయమన్నారు. అధిక మోతాదుతో నేలపై దుష్ప్రభావం వ్యవసాయ విద్యార్థుల వాస్తవిక గణాంకాలను తెలుసుకుంటే క్షేత్ర స్థాయిలోని సమస్యలు అవగతం అవుతాయన్నారు. పూర్వీకులు సేంద్రియ వ్యవసాయ విధానం చేయడం వలన పౌష్టికాహారాన్ని తీసుకోగలిగారని చెప్పారు. ప్రస్తుతం ఆహారంలో పోషక విలువలు తక్కువగా ఉంటున్నాయని తెలిపారు. అధిక మోతాదులో ఎరువులను, పురుగు మందులను వాడటం వలన నేలపై దుష్ప్రభావం పెరుగుతుందని చెప్పారు. భూమి యొక్క ఉత్పాదకత, సారవంతతను కోల్పోయే తీవ్రమైన పర్యావరణ సమస్యగా ఇది పరిణమిస్తుందని తెలిపారు. భూగర్భ జలాల వాడకం విషయంలో కూడా జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. నేలలు నిస్సారంగా మారి, వ్యవసాయానికి పనికిరాకుండా పోతాయన్నారు. రైతు సంక్షేమానికి చాలా కీలకమైన నీటిపారుదల సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అధిక దిగుబడులను ఇచ్చే రకాలను రూపొందించుకునేలా పరిశోధనలు సాగాలన్నారు. నేచురల్ ఫార్మింగ్ డిగ్రీని దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టామని తెలిపారు. కార్యక్రమంలో పరిశోధనల ముఖ్యాంశాలతో కూడిన ప్రతులను ముఖ్య అతిథులు, మాజీ ఉప కులపతి డా.సూరపనేని కోటేశ్వరరావు ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా 14 విశ్వ విద్యాలయాలకు చెందిన 810 మంది పి.జి. విద్యార్థులు పరిశోధన పత్రాలను సమర్పించి, సంబంధిత పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీన్ ఆఫ్ పీజీ స్టడీస్ డాశ్రీశ్రీ ఏవీ రమణ, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ డాశ్రీశ్రీ జి.రామచంద్ర రావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ డాశ్రీశ్రీ డి.సంపత్ కుమార్, అసోసియేట్ డీన్ డాశ్రీశ్రీ పి. ప్రసూనారాణి తదితరులు సదస్సు ముఖ్య ఉద్దేశాలను వివరించారు. సదస్సు ఆర్గనైజింగ్ కార్యదర్శి డాశ్రీశ్రీ కె. శ్రీనివాసులు, స్టూడెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ బాలాజీ, డాశ్రీశ్రీ ఎన్.టి.ఆర్. కాలేజీ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అసోసియేట్ డీన్ డాశ్రీశ్రీ డి.డి.స్మిత్, డాక్టర్ ఎన్.టి.ఆర్. కాలేజీ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అసోసియేట్ డీన్ డాశ్రీశ్రీ ఎం.సర్దార్ బేగ్, డాశ్రీశ్రీ లాల్ అహమద్ మొహమ్మద్, డాశ్రీశ్రీ టి.వి.శ్రీధర్, స్టూడెంట్ టీచర్ కో ఆర్డినేటర్ డాశ్రీశ్రీ డి.వి.ఎస్. అక్షయ్, స్టూడెంట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా నృసింహుని జయంత్యుత్సవాలు
మంగళగిరి టౌన్: గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో నృసింహుని జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ ముఖ మండపంలో మంగళవారం ఉత్సవమూర్తులకు అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించారు. ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం పంచసూక్త హోమం అనంతరం రాత్రి సహస్ర దీపాలంకరణ సేవ చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లు ఈవో సునీల్కుమార్ పర్యవేక్షించారు. యడ్లపాడు: మండలంలోని సొలస గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూసమేత రంగనాయకస్వామి ఆలయం వార్షిక కల్యాణ మహోత్సవం రెండోరోజైన మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు పర్చూరి రామకృష్ణ చార్యులు ఆధ్వర్యంలో మూలవిరాట్, ఉత్సవ మూర్తులకు విశేష అలంకరణలు చేశారు. ఉదయం నుంచి స్వామి వారికి గ్రామ బలిహరణ, హోమం, రంగనాయక స్వామి సహస్ర నామార్చన, రాత్రికి హంస వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో నెమలిరెడ్డి పర్యవేక్షించారు. ఆయా కార్యక్రమాల్లో ధర్మకర్తలు అర్వపల్లి మనోహర్–నాగజ్యోతి, అర్వపల్లి బ్రదర్స్, భక్తులు భాగస్వాములయ్యారు. నగరంపాలెం: గుంటూరు నగరంలోని ఆర్.అగ్రహారం శ్రీకన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి జయంతి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకుడు విశ్వనాఽథ్ ఆధ్వర్యంలో లక్ష మలెలతో పూజ చేపట్టారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు హాజరై, అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు, మిర్చియార్డు డైరెక్టర్ కొనకళ్ల సత్యం, కోట శేషగిరిరావు, జుజ్జూరి శ్రీనివాసరావు, యక్కల నాగభూషణం, మాగులూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఎర్రబాలెం(క్రోసూరు): వేసవి తాపానికి అడవి నుంచి తప్పిపోయి జనసంచారంలోకి వచ్చిన జింక బిక్కుబిక్కుమంటూ బావిలో పడింది. స్థానికులు చూసి రక్షించారు. పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం మండలంలోని ఎర్రబాలెం గ్రామంలోని ప్రధాన రహదారి పక్కన పొలాలలో ఈ సంఘటన చోటుచేసుకుందని ఎస్ఐ రవిబాబు తెలిపారు. జింకను పిడుగురాళ్ల అటవీశాఖ అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 525.70 అడుగులకు చేరింది. ఇది 159.8751 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 450 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
అవయవదానం అభినందనీయం
తాడేపల్లిరూరల్: అవయవదానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు రావడం అభినందనీయమని మణిపాల్ హాస్పిటల్ వైద్యులు సోమవారం పేర్కొన్నారు. చిలకలూరి పేటకు చెందిన పెడవల్లి నాగేశ్వరరావు (45) ఈనెల 23వ తేదీ తన కుమార్తెతో బైక్పై ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు చేర్పించారు. ఆరోగ్యపరిస్థితిలో మార్పులేకపోవడంతో 24వ తేదీ గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లగా, వైద్యుల సలహా మేరకు తాడేపల్లి పట్టణ పరిధిలోని మణిపాల్ హాస్పిటల్కు తీసుకువచ్చారు. వైద్యపరీక్షల అనంతరం నాగేశ్వరరావుకు బ్రెయిన్లో రక్తస్రావం ఉందని తెలిపి చికిత్స ప్రారంభించారు. అయితే ఆయన ఆరోగ్యపరిస్థితిలో ఎటువంటి మార్పు కనిపించలేదు. ఏప్రిల్ 26వ తేదీ సాయంత్రం బ్రెయిన్డెడ్గా పరిగణించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. నాగేశ్వరరావు తండ్రి ఆదినారాయణ, కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు ఆంధ్రప్రదేశ్ జీవన్దాన్ చైర్మన్ డాక్టర్ కె.రాంబాబు, హాస్పిటల్ డైరెక్టర్ రామాంజనేయ రెడ్డిల ఆధ్వర్యంలో ఒక కాలేయం, ఒక కిడ్నీని మణిపాల్ హాస్పిటల్లో అవసరమైన వారికి ట్రాన్స్ప్లాంటేషన్ నిర్వహించారు. కార్నియాను విజయవాడ ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తరలించారు. మంచి కార్యక్రమానికి ముందుకు వచ్చిన దాత కుటుంబానికి మణిపాల్ హాస్పిటల్స్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం నల్లగొండ: కారులో వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొని మృతిచెందాడు. ఈ ఘటన నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని పానగల్లు వద్ద సోమవారం జరిగింది. నల్లగొండ టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ముల్కలపల్లి గ్రామానికి చెందిన గంగాధర్ సాయిసందీప్(28) హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. శని, ఆదివారాలు సెలవులు ఉండడంతో ఈ నెల 25న స్వగ్రామానికి వెళ్లాడు. సోమవారం తెల్లవారుజామున తిరిగి కారులో హైదరాబాద్కు బయల్దేరాడు. కాగా.. చైన్నె నుంచి బొగ్గులోడుతో వస్తున్న లారీ నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని పానగల్లు ఫ్లైఓవర్ వద్దకు రాగానే టైరు పగిలిపోవడంతో ఎటువంటి లైట్లు వేయకుండా డ్రైవర్ లారీని రోడ్డుపైనే నిలిపివేశాడు. అదే సమయంలో కారులో వస్తున్న సాయిసందీప్ లారీని గమనించకుండా వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సాయిసందీప్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది. సమాచారం తెలుసుకున్న నల్లగొండ టూటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి తండ్రి సుబ్బారావు ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ తిరుపతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ ఎస్ఐ సైదులు తెలిపారు. ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్ గుంటూరు రూరల్: వివాహితను ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటనలో నల్లపాడు పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఇంచార్జి సౌత్ డీఎస్పీ బివి.మధుసూదన్రావు తెలిపారు. సోమవారం నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో నిందితుల వివరాలను వెల్లడించారు. తాడికొండ మండలంకు చెందిన మిక్కిలి అనిత (33)కు 2020 సంవత్సరంలో జొన్నలగడ్డ గ్రామానికి చెందిన నాలాది మల్లికార్జునరావుతో వివాహం జరిగింది. పెళ్ళి సమయంలో ఆమె తల్లిదండ్రులు రూ.లక్షన్నర నగదు, 6 గ్రాముల బంగారం కట్నంగా ఇచ్చారు. వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో గ్రామంలో స్థలాన్ని కొనాలని అందుకు అనితను తన తల్లిదండ్రుల నుంచి డబ్బులు తేవాలని మల్లిఖార్జునరావు, నాలాది శివశంకరరావు, నాలాది మాథంగిషైనీలు తరచూ వేధించారు. దీంతో అనిత మళ్లీ తల్లిదండ్రులనుంచి మరో రూ.లక్ష తీసుకురాగా స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇదిలా ఉండగా మల్లిఖార్జునరావు తన మరదలైన మాథంగి షైనితో వివాహేతర సంబంధం పెట్టుకుని అనితను శారీరకంగా, మానసికంగా వేధిస్తూ, డబ్బులు తీసుకురాకపోతే రెండో వివాహం చేసుకుంటానని బెదిరించేవాడు. దీంతో వేధింపులు భరించలేక అనిత ఈనెల 9వ తేదీన పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. సంఘటనపై మృతురాలి సోదరుడు మిక్కిలి ధర్మతేజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు దర్యాప్తు చేపట్టి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారించగా నిందితులు చేసిన నేరం ఒప్పుకోవటంతో నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. కేసు ఛేదించటంలో ప్రతిభ చూపిన పోలీసులను అభినందించారు. -
అన్ని మండలాలు స్టాక్ పాయింట్లు సిద్ధం చేసుకోవాలి
పిడుగురాళ్ల: జిల్లాలోని అన్ని మండలాలు వెంటనే స్టాక్ పాయింట్లను సిద్ధం చేసుకోవాలని సమగ్రశిక్ష సీఎంవో పి. పద్మారావు, ఏపీవో పి.శంకర్రాజు తెలిపారు. పట్టణంలోని మండల విద్యా వనరుల కేంద్రంలోని స్టాక్ పాయింట్ను సోమవారం పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ... మే 1వ తేదీ నుంచి జిల్లా నుంచి మండలాలకు సరఫరా అయ్యే మెటీరియల్, పాఠ్యపుస్తకాలను జాగ్రత్తగా తీసుకొని భవిష్యత్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవాలని అన్నారు. పాఠశాలలకు చేరాల్సిన పుస్తకాలు, కిడ్స్కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆ దిశగా జిల్లాలకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల విద్యా శాఖ అధికారులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లాకు మంచి పేరు వచ్చే విధంగా కృషి చేయాలని ఆయన తెలిపారు. దీనిలో భాగంగానే నకరికల్లు, పిడుగురాళ్ల, రాజుపాలెం మండలాల స్టాక్ పాయింట్లను పరిశీలించటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో ఎండీ ఖాశీం, ఎంఐఎస్ కో–ఆర్డినేటర్ వీర నారాయణమ్మ, సీఆర్పీలు నాగేశ్వరరావు, చాంద్బి, పార్వతయ్య, సాగర్రాజు తదితరులు ఉన్నారు. జిల్లా సమగ్ర శిక్ష సీఎంవో పి.పద్మారావు, ఏపీవో పి.శంకర్రాజు -
ఇన్నర్ రింగ్రోడ్డులో ఇళ్లు కూల్చివేత
గుంటూరు రూరల్: కూలీనాలీ చేసుకుని ఒక పూట తిని మరోపూట పస్తులుండి దాచుకున్న డబ్బుతో ఇళ్ళు నిర్మించుకున్నాం. ఇప్పుడు ఇన్నర్ రింగ్రోడ్డు ఫేజ్ 3 పేరుతో పేదల ఇళ్ళను కూల్చి రోడ్డున పడేశారని స్వర్ణభారతినగర్ 20వ లైను బాధితులు వాపోయారు. సోమవారం ఇన్నర్ రింగ్రోడ్డు ఫేజ్ 3లో నగర మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు పోలీసుల అండతో ఇళ్ళ కూల్చివేతకు పూనుకున్నారు. ఫేజ్ 3కి చెందిన బాదితులు కూటమి ప్రభుత్వం కేటాయించిన స్థలాలవద్దకు వెళ్ళగా అక్కడ వేరేవాళ్ళు ఇళ్ళు నిర్మించుకుని నివశిస్తుండటంతో తాము మోసపోయామని వాపోతున్నారు. ఒకే స్థలాన్ని నలుగురు ఐదుగురికి కేటాయించి బాధితులను మోసం చేస్తున్నారని స్థానిక ప్రజలు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఇళ్ళను కూల్చినవారికి ప్రత్యామ్నాయం చూపే వరకూ అద్దెగా నెలకు రూ 3000 చెల్లిస్తామని చెప్పి ఇళ్ళను కూల్చివేశారు. కానీ నేటికి అతీగతి లేదని అద్దె ఇవ్వక పోగా ఇళ్ళు లేక రోడ్డున బతుకుతున్నామని బాధితులు వాపోతున్నారు. పత్నామ్నాయం చూపకుండా రోడ్డున పడేశారంటున్న బాదితులు బాధితులకు వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు ఇంచార్జ్ బలసాని భరోసా స్వర్ణభారత్ నగర్ కాలనీ 20వ లైన్లో గత 25 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారి ఇళ్లను, హైవే పనులకు అడ్డంగా ఉన్నాయని ఎటువంటి సమాచారం లేకుండా కూల్చి వేయటం దుర్మార్గపు చర్య. అని వైఎస్సార్ సీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్కుమార్ ధ్వజమెత్తారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకుని బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. కనీసం బాధితులకు నిలువ నీడను కూడా చూపకుండా ఇళ్ళను కూల్చివేయటం కూటమి ప్రభుత్వం నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. స్థానిక ఎమ్మెల్యే సైతం పేదలను ఆదుకోలేకపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం చెల్లించాలని, వెంటనే పునరావం అందించాలని డిమాండ్ చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులతో మాట్లాడి వెంటనే వారికి తగిన స్థలం ఏర్పాటు చేయాలని సూచించారు. పోలీస్ అధికారులు స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. -
మట్టి మాఫియాపై చర్యలకు ఆదేశాలు
వినుకొండ: ‘అక్రమ మట్టి మాఫియాపై స్థానికుల కన్నెర్ర’ శీర్షికన ఈ నెల 26వ తేదీన సాక్షి ప్రచురితమైన కథనానికి స్పందించిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయు లు, అధికారులు స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జీవీ మాట్లాడుతూ అక్రమ మట్టి మాఫియాపై చర్యలు చేపట్టాలని జేసీని ఆదేశించారు. అక్రమ మైనింగ్పై రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనిపై స్పందించిన జేసీ సంజనా సింహ మాట్లాడుతూ అక్రమంగా మైనింగ్కు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అక్రమ మైనింగ్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలతో పాటు జరిమానాలు వేయడం జరుగుతుందని హెచ్చరించారు. -
మే 1 నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు మే 1 నుంచి 31వ తేదీ వరకు జిల్లాలో క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్టు పల్నాడు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి తెలిపారు. సత్తెనపల్లిరోడ్డులోని డీఎస్ఏ స్టేడియంలో ఉన్న తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పల్నాడు జిల్లా పరిధిలో 27 క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి శిబిరంలో 30 మంది చొప్పున 8 నుంచి 14 సంత్సరాల వయస్సు గల బాలబాలికలకు వివిధ క్రీడాంశాలలో శిక్షణ ఇస్తారని వివరించారు. ప్రతి మండలంలో ఒక శిబిరం, మున్సిపాలిటీలలో రెండు శిబిరాలకు అనుమతించినట్టు తెలిపారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ఐదు శిక్షణ కేంద్రాలను డీఎస్ఏ స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆయా శిబిరాలలో ఆట్యాపాట్యా, వాలీబాల్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, అథ్లెటిక్స్, ఫుట్బాల్, ఖోఖో, కబడ్డీ, రెజ్లింగ్, క్రికెట్ తదితర 14 క్రీడాంశాలలో శిక్షణ ఇస్తున్నట్టు వివరించారు. ఈఏడాది శాప్ ఆధ్వర్యంలో క్రీడలను ప్రోత్సహించే దిశగా అకాడమీలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. శిబిరంలో మెరుగైన ప్రదర్శన చేసిన చిన్నారులను అకాడమీల ద్వారా మరింత శిక్షణ ఇచ్చి ప్రతిభ గల క్రీడాకారులుగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. శిబిర నిర్వాహకులు, శిక్షణకు హాజ రయ్యే క్రీడాకారులు తమ వివరాలను క్రీడా యాప్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. కాగా, ప్రతి శిబిరానికి వారు శిక్షణ ఇచ్చే క్రీడాంశాలు, క్రీడాకారుల నమోదు మేరకు శాప్ ఆయా క్రీడలకు సంబంధించిన క్రీడా సామాగ్రి అందచేయనున్నట్టు తెలిపారు. సమావేశంలో స్టెప్ సూపరింటెండెంట్ పి.వి.రమణ, జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎన్.సురేష్, స్టేడియం, సిబ్బంది, కోచ్లు పాల్గొన్నారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి నరసింహారెడ్డి జిల్లాలో 27 శిబిరాలు ఏర్పాటు -
పోలీసుల అదుపులో గంజాయి ముఠా
నగరంపాలెం: గంజాయి ముఠాను మంగళగిరి గ్రామీణ పీఎస్, దుగ్గిరాల పీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయా కేసుల్లో నిర్వాహాకులు, 11 మంది పలు కళాశాలల విద్యార్థులు, ఒక మైనర్ ఉండగా, సుమారు 4.6 కిలోల గంజాయి, రూ.3,600 స్వాధీనం చేసుకున్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. మంగళగిరి, విజయవాడలోని యువత, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయించే ముఠాను మంగళగిరి రూరల్ పోలీసులు గుర్తించారని అన్నారు. మంగళగిరిలో ఉంటున్న విజయవాడ కృష్ణలంకకు చెందిన రావి మహేష్కుమార్ను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. అతనిపై 12 కేసులు ఉన్నాయని, అందులో పీడీ యాక్ట్ ఉందన్నారు. అనీల్పై తాడేపల్లి పీఎస్లో రెండు కేసులు నమోదైనట్లు తెలిపారు. అతని అనుచరులు పాడేరు వెళ్లి గంజాయి కొనుగోలు చేసి, వాటిని చిన్న ప్యాకెట్లగా చేసి మంగళగిరి పరిసర ప్రాంతాల్లో విక్రయించే వారని చెప్పారు. వీరిలో శశి అనే అతనికి చాన్నాళ్లుగా ఇదే వ్యాపారమని అతనిపై ఐదు కేసులు ఉన్నాయని అన్నారు. సోమవారం చినకాకాని వద్ద నలుగురు నిర్వాహాకులు, కాజ గ్రామంలో గంజాయి తాగే 11 మందిని అరెస్ట్ చేశారని అన్నారు. అలాగే దుగ్గిరాల పోలీస్స్టేషన్ పరిధిలో 15 మందిని అరెస్ట్ చేశారని అన్నారు. వీరంతా మంగళగిరి, విజయవాడ, దుగ్గిరాల, కాజా, అమరావతికి చెందిన వారని చెప్పారు. గంజాయి తాగడం, ఆర్థిక అవసరాలకై గంజాయి వ్యాపారం చేసేవారని అన్నారు. ఒడిశా రాష్ట్రం రాయగడ నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయించేవారని అన్నారు. చిలువూరు గ్రామం వద్ద 15 మందిని అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ 27 మందిలో 11 మంది పలు కళాశాలల విద్యార్థులు, ఒక మైనర్ ఉన్నారన్నారు. ఈ కేసుని చేధించిన మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, మంగళగిరి గ్రామీణ పీఎస్ సీఐ ఏవీ.బ్రహ్మం, ఎస్ఐ చిరుమామిళ్ల వెంకట్, దుగ్గిరాల పీఎస్ ఎస్ఐ వెంకటరవి, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంస పత్రాలు అందించారు. చిన్న ప్యాకెట్లుగా చేసి క్రయ విక్రయాలు పాడేరు, రాయగడ నుంచి మంగళగిరికి రవాణా 11 మంది పలు కళాశాలల విద్యార్థులు, ఒక మైనర్ -
ప్రజా సమస్యలకు చట్టబద్ధ పరిష్కారం
నరసరావుపేట రూరల్: ప్రజా సమస్యలను వేగంగా, చట్టబద్ధంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్టు జిల్లా అదనపు ఎస్పీ జేవీ సంతోష్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. అదనపు ఎస్పీ సంతోష్ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ సమస్యలు, పలు మోసాలకు సంబంధించిన సమస్యలు, బెదిరింపులు, ఆక్రమణలు వంటి పలు అంశాలకు సంబంధించిన 66 ఫిర్యాదులు అందాయి. పీజీఆర్ఎస్కు వచ్చిన మహిళలు, వృద్ధులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. విచారణను వేగంగా పూర్తిచేసి చట్ట ప్రకారం న్యాయం చేయాలని అధికారులకు ఆదేశించారు. జిల్లా అదనపు ఎస్పీ జేవీ సంతోష్ జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్ఎస్ వివిధ సమస్యలపై 66 ఫిర్యాదులు -
బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు
పట్టణంలో పెట్రోల్ బంకులకు ఆయిల్ ట్యాంకర్లు వస్తున్నాయి. కానీ బండ్లకు ఆయిల్ కొట్టడం లేదు. అదేమంటే ఆయిల్ లేదంటారు. తెలిసిన వాళ్లకే అయిల్ కొడుతున్నారు. ఏ రోజుకు ఆ రోజుకు ఆటో నడుపుకుని బతుకుతున్న ఆటోవాళ్లకు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతికే వారికి ఆయిల్ లేదని చెప్పి ఇబ్బందికి గురిచేస్తున్నారు. అధికారులొచ్చినప్పుడే కొడతాడు. ఆ తరువాత లేదు పొమ్మంటూ బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. అధికారులు నిశితంగా పర్యవేక్షించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. –దేవళ్ల శ్రీనివాస్, మాచర్ల నివాసి -
కారెంపూడిలో పట్టపగలు దోపిడీ
కారెంపూడి: రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై దాడి చేసి అతని వద్ద ఉన్న బంగారు ఆభరణాల బ్యాగ్ను దోపిడీ చేసిన ఘటన కారెంపూడిలో సోమవారం పట్టపగలు జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన యక్కల శ్రీనివాసరావు అనే బంగారు నగల వ్యాపారి ఆభరణాలను జ్యూవెలరీ షాపులకు విక్రయించే వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో కారెంపూడి వచ్చాడు. ప్రధాన రహదారి కొట్ల బజారులో నగల బ్యాగ్తో వెళ్తుండగా దుండగులు విత్తనాల షాపుల వద్దదాడి చేశారు. కొడుతున్న వారి నుంచి తప్పించుకుని ఆంఽధ్రాబ్యాంక్ సందులోకి పరుగుతీశాడు. మళ్లీ ఆయనను వెంబడించి ఏటీఎం వద్ద మళ్లీ దాడి చేశారు. వ్యాపారిని కిందపడేసి కొట్టి నగల బ్యాగ్ను లాక్కుని బైక్పై పరారయ్యారు. ఈ దృశ్యాలన్నీ షాపుల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. రెండు బైక్లపై నలుగురు దొంగలు వచ్చినట్లుగా తెలుస్తోంది. మెయిన్ రోడ్డులో తప్పించుకుని బ్యాంక్ సందులోకి వెళ్లిన తర్వాత వెనుక నుంచి ముందు వైపు నుంచి దొంగలు ఎటాక్ చేసినట్లుగా దృశ్యాలున్నాయి. పోయిన నగలు ఎంతనేది తెలియాల్సి ఉంది. బాధితుడు శ్రీనివాసరావు జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గురజాల డిఎస్పీ మహేశ్వరరావు, సీఐ శరత్బాబు, ఎస్ఐ వాసు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేస్తున్నారు. సోమవారం ఎరువుల దుకాణాలు బంద్ పాటించడంతో మూడువంతుల షాపులు మూసి ఉన్నాయి. మధ్యాహ్నం రెండున్నర గంటల సమయం కావడంతో వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. అడపాదడపా వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. అయినా దొంగలు యథేచ్ఛగా తమ పని ముగించుకు వెళ్లిపోయారు. -
పల్నాడు
మంగళవారం శ్రీ 28 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.9760 టీఎంసీలు. అంకమ్మతల్లికి పూజలు దాచేపల్లి:స్థానిక వీర్ల అంకమ్మతల్లి కొలుపు ల తిరునాళ్ల సందర్భంగా సోమవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు. నిమ్మకాయల ధరలు తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.5,500, గరిష్ట ధర రూ.10,000, మోడల్ ధర రూ.7,000 వరకు పలికింది. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు అన్నపురెడ్డి రంగమోహనరెడ్డి, ముప్పాళ్ల మండలం బొల్లవరం గ్రామం. ప్రస్తుతం ఏడెకరాల్లో మొక్కజొన్న, వరి పంట సాగు చేశాడు. అవి కోత దశలో ఉన్నాయి. డీజల్ లేకపోవడంతో కోత మిషన్లు రాలేదు. మొక్కజొన్న కోత నిలిచిపోయింది. అవసరాల కోసం కొన్న ట్రాక్టర్ సైతం ఇంటి వద్దే ఉంచుకోవాల్సి వచ్చింది. రైతు అవసరాలకు సరిపడా డీజల్ను కూడా సరఫరా చేయలేకపోవడం విచారకరం. ఈ పరిస్థితి కొనసాగితే తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఫొటోలో కనిపిస్తోంది పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయ పరిసరాలలో జిల్లా రెవెన్యూ శాఖ స్వయంగా నిర్వహిస్తున్న పెట్రోల్ పంపు. జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజల్ కొరత లేదంటూ జిల్లా అధికారులు ఓ వైపు ప్రకటనల మీద ప్రకటనలు ఇస్తుంటే మరో పక్క ఈ బంక్లో మాత్రం నోస్టాక్ బోర్డు పెట్టారు. ప్రతి మండలానికి ఇంధన కొరత లేకుండా మానటరింగ్ చేసేందుకు ప్రత్యేక అధికారులను నియమించిన జిల్లా ఉన్నతాధికారులు.. కలెక్టరేట్లో ఎందుకు పెట్రోల్ పంపు తెరిపించలేకపోయారంటూ సోమవారం ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చిన అర్జీదారులు ప్రశ్నించారు. ప్రభుత్వం, అధికారులు చెబుతున్న వాటికి క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పొంతన లేదంటున్నారు. డీజల్ కొరత కారణంగా రెండు రోజులుగా ఆటో తిప్పడం లేదు. దీంతో ఇంట్లో గడవడమే కష్టంగా ఉంది. సోమవారం కలెక్టర్ వస్తున్నారని కొన్ని బంకుల్లో రెండు మూడు లీటర్ల డీజల్ కొట్టారు. ఆ డీజిల్ ఒకపూట ఆటో తిప్పడానికే సరిపోతుంది. ఇప్పటికే ఫ్రీ బస్సు ద్వారా ఆటో డ్రైవర్ల పూట గడవటం కష్టంగా ఉన్న తరుణంలో డీజల్ కొరతతో ఆటోల మీద ఆధారపడిన లక్షలాది మంది జీవితాలు ప్రమాదంలో పడనున్నాయి. –దుమ్మాల ఏలియా, ఆటోడ్రైవర్, ఇరుకుపాలెం, సత్తెనపల్లి మండలం7 -
కలెక్టరేట్లో పీజీఆర్ఎస్
నరసరావుపేట రూరల్: పీజీఆర్ఎస్లో అందిన అర్జీల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టితో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి నారదముని తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. డిఆర్వో నారదముని కార్యక్రమంలో పాల్గొని అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలతో 232 అర్జీలు అధికారులకు అందాయి. ఈ సందర్భంగా డీఆర్వో నారదముని మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలన్నారు. జిల్లా అధికారులు అర్జీలను సకాలలో పరిష్కరించి ఆయా శాఖల పరిధిలోని పీజీఆర్ఎస్ గ్రీవెన్స్పై ఆడిట్ నిర్వహించాలని సూచించారు. జిల్లా అధికారులు వారి పరిధిలోని ఎలాంటి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు అర్జీలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. -
‘ఉపాధి’ బకాయిలు చెల్లించాలి
నరసరావుపేట రూరల్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీల వేతనాలు వెంటనే చెల్లించాలని, ఉపాధి హామీ పథకంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ నాయకులు సోమవారం ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్లో వినతిపత్రం సమర్పించారు. తొలుత జిల్లా పోలీసు కార్యాలయం నుంచి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవరెడ్డి తదితర నాయకులు కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీగా వచ్చారు. అనంతర మీడితో మాట్లాడారు. – డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బకాయిలు వెంటనే కూలీలకు చెల్లించాలని డిమాండ్ చేశారు. గత ఐదు నెలలుగా వేతనాలు చెల్లించలేదని తెలిపారు. ఇప్పటికే దాదాపు రూ.234 కోట్లు బకాయిలు ఉన్నట్టు వివరించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేవని, కూలీల వలసల నివారించేందుకు ఏర్పాటు చేసిన జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో వేతనాలు చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షలు ఐ.రామమూర్తి, రాష్ట్ర కార్యదర్శి పగడాల వెంకటరామిరెడ్డి, జిల్లా ప్రదాన కార్యదర్శి పడాల చక్రారెడ్డి, జిల్లా నాయకులు ఆళ్ల లక్ష్మీనారాయణ, నియోజకవర్గ అధ్యక్షుడు ముండ్రు హరినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
● బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనం ● డీజిల్ తెస్తే కోతలు అంటున్న యంత్రాల యజమానులు ● తప్పనిసరై బ్లాక్లో కొనుగోలు ● డీజిల్, పెట్రోల్ కొరత లేదంటూ ప్రకటనలతో సరిపెడుతున్న అధికారులు ● డీజిల్ కొరతతో నిలిచిన సరుకు రవాణా ● పెట్రోల్ బంకుల వద్ద అవస్థలు పడు
సాక్షి, నరసరావుపేట : పల్నాడు జిల్లా వ్యాప్తంగా డీజల్, పెట్రోల్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వం, జిల్లా అధికారులు ఇంధన కొరత లేదంటూ పదే పదే ప్రకటనలు ఇస్తున్నా క్షేత్రస్థాయిలో ఇంధన కొరత వేధిస్తోంది. ముఖ్యంగా రైతులు, ఆటో, లారీ ఓనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతికొచ్చిన పంట కోత కోయాలంటే రైతుల తల ప్రాణం తోకకు వస్తోంది. గతంలో కేవలం బాడుగ ఇస్తే యంత్రాలు వచ్చి కోత కోసి వెళ్లేవి. మూడు రోజులుగా బాడుగతోపాటు కోతకు అవసరమైన ఇంధన రైతే తెచ్చుకోవాలంటూ నిబంధనలు పెడుతున్నారు. దీంతో రైతులు క్యాన్లు తీసుకొని పెట్రోల్ బంకుల చూట్టూ తిరుగుతున్నారు. నిబంధనల పేరుతో రైతులకు క్యాన్లలో ఇంధనం నింపడం లేదు. ఈ పరిస్థితుల్లో రైతులు చేసేదేమీలేక కోతలను వాయిదా వేస్తున్నారు. మరికొందరు బ్లాక్లో డీజల్ కొనుగోలు చేసి కోతలను పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే పంటలకు గిట్టుబాటు ధరలేక ఇబ్బందిపడుతుంటే ఈ అదనపు ఖర్చుతో మరింత రైతు నష్టపోయే ప్రమాదముందంటున్నారు. ఆగని ఇంధన కష్టాలు సత్తెనపల్లి: నరసరావుపేటకు చెందిన ఓ విద్యార్థిని గుంటూరులో నీట్కు ప్రిపేర్ అవుతోంది. సోమవారం నీట్ ప్రిపరేషన్ పరీక్ష రాసేందుకు కళాశాలకు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. డీజిల్ కొరత కారణంగా రాలేనని క్యాబ్ నిర్వాహకుడు సమాధానం చెప్పాడు. చివరకు ఆ విద్యార్థిని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంది. జిల్లా వ్యాప్తంగా 195 డీజల్, పెట్రోల్ బంకులు ఉండగా సుమారు 70కి పైగా బంకుల్లో ఆయిల్ సరఫరా సక్రమంగా చేయడం లేదు. మిగిలిన వాటిలో అరకొరగా వినియోగదారులకు నింపి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. బంక్ తెరిచారన్న సమాచారం రాగానే క్షణాల్లో వాహనదారులు వాలిపోతున్నారు. ఏ బంక్లో చూసినా వందలాది వాహనాలు క్యూ కట్టి దర్శనమిస్తున్నాయి. శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లి వస్తున్న యాత్రికులు వినుకొండ, నరసరావుపేట, చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని బంకుల్లో ఆయిల్ కోసం నానా అవస్థలు పడుతున్నారు. జిల్లా అధికారులు మండలాలకు ప్రత్యేకాధికారులుగా వెళ్లినా వారు ఉన్న కాసేపు అరకొరగా ఇంధనం నింపి వెళ్లిపోతున్నారని ప్రజలు వాపోతున్నారు. పక్క రాష్ట్రాలలో ఎక్కడా లేని ఇంధన కొరత ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉందని, ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని ఆరోపిస్తున్నారు. -
నృసింహుని గరుడ సేవ
మంగళగిరి టౌన్ : మంగళగిరి పట్టణ పరిధిలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి జయంత్యుత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఆలయ ముఖ మండపంపై నరసింహస్వామి వారికి అర్చకులు ఉదయం విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్ఠ, నారసింహ మూల మన్య హోమం నిర్వహించారు. సాయంత్రం అగ్ని ప్రణయనం, కుమ్భారాధన, నారసింహ హోమం అనంతరం స్వామి వారికి గరుడ సేవ నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సునీల్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. వైభవంగా శ్రీ వాసవీ అమ్మవారి గ్రామోత్సవం రెంటచింతల: ఆర్యవైశ్యుల ఇలవేల్పు, జగజ్జనని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన వేడుకలలో భాగంగా ఆదివారం రాత్రి అమ్మవారి ఉత్సవ విగ్రహంతో గ్రామోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్థానిక కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి భక్తులు పెద్దసంఖ్యలో గ్రామ పురవీధులలో భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన నిర్వహించారు. గ్రామోత్సవంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దీవెనలు పొందారు. సోమిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో భక్తులు కోలాటం ప్రదర్శించారు. దేవస్థానం చైర్మన్ నాళం చినబాబు, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. చెన్నకేశవ స్వామిని తాకిన సూర్య కిరణాలు వేమూరు: జంపని గ్రామంలో వేంచేసి ఉన్న భూసహిత చెన్నకేశవ స్వామి వారి దేవస్థానంలో సోమవారం ఉదయం మూలవిరాట్ స్వరూపం చెన్నకేశవుడిని సూర్యకిరణాలు తాకాయి. పాదాల నుంచి కీరీటం వరకు స్వామి వారిని 40 నిమిషాలకు పైగా సూర్య భగవానుడు స్పృశించాడు. ఈ సుందరమైన అనుభూతిని కలిగించే దృశ్యాన్ని చూసి భక్తులు తన్మయం చెందారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో తరచూ స్వామి వారిపై సూర్య కిరణాలు పడుతుంటాయని అర్చకులు శ్రీనివాస మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారికి సూర్య అష్టకం పంచసూక్తాలను పఠించి సూర్య నమస్కారాలు చేశారు. రేపటి నుంచి చందోలు బగళాముఖి అమ్మ తిరునాళ్ల చందోలు(కర్లపాలెం): బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన బగళాముఖి అమ్మవారి వార్షిక తిరునాళ్ల ఈనెల 29 నుంచి వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కలకోట చక్రధర్రెడ్డి, ఈవో నరసింహమూర్తి తెలిపారు. తిరునాళ్లకు తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధికంగా భక్తులు హాజరవుతారని తెలిపా రు. మే 2వ తేదీన బగళా ముఖి అమ్మవారికి ప్రాచీన కాలంనాటి బంగారు ఆభరణాలు అలంకరణ చేయటం జరుగుతుందని చెప్పారు. మే 3వ తేదీన పలు గ్రామాల నుంచి భక్తులు భారీ విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేసుకుని పసుపు బండ్లతో ఆలయానికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారన్నారు. సాగర్ నీటిమట్టం విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయమట్టం సోమవారం 525.80 అడుగులకు చేరింది. సాగర్ నుంచి ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది.దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి 450 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
ఏబీఎన్ రాధాకృష్ణను తక్షణమే అరెస్ట్ చేయాలి
నరసరావుపేట రూరల్: ఏబీఎన్ రాధాకృష్ణపై తక్షణమే కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మహిళలను కించపరిచే విధంగా ఏబీఎన్ ఛానల్లో ప్రసారమైన కథనంపై వెంటనే చర్యలు చేపట్టాలని సోమవారం జిల్లా అదనపు ఎస్పీ జేవీ సంతోష్కు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం నుంచి జిల్లా పోలీసు కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవరెడ్డిలు పాల్గొన్నారు. అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేసిన అనంతరం పిన్నెల్లి మీడియాతో మాట్లాడుతూ మహిళలను కించపరిచే విధంగా అసభ్యపదజాలంతో ఏబీఎన్ ఛానెల్లో ప్రసారమైన కథనానికి నిరసనగా ఈనెల 9వ తేదీన జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో రాధాకృష్ణపై ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. దీనిపై పోలీసులు స్పందించకుండా ఫిర్యాదులను బుట్టదాఖలు చేశారని పేర్కొన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు అధికారులను కోరినట్టు తెలిపారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టబోమని పోలీసులు చర్యలు తీసుకోని పక్షంలో న్యాయపరంగా ముందుకు వెళ్తామని తెలిపారు. అధికారం అండతో లక్షలాది మంది కార్యకర్తల మనోభావాలు దెబ్బతిసేలా మాట్లాడటం దారుణమన్నారు. ప్రభుత్వంపై చిన్న విమర్శ చేస్తేనే కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని, లక్షలాది మంది కార్యకర్తలను కించపరిచిన వ్యక్తిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నాయకుల భార్యలను అవమానించిన ఏబీఎన్ రాధాకృష్ణను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఇప్పటి వరకు క్షమాపణ చెప్పకపోగా, మరింత దిగజారి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ పరిశీలకులు రేపాల శ్రీనివాసరావు, మాచర్ల నియెజకవర్గ పరిశీలకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు, చిలకలూరిపేట నియోజకవర్గ పరిశీలకులు చిట్టా విజయభాస్కరరెడ్డి, పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకులు ఎనముల మురళీధర్రెడ్డి, గురజాల నియోజకవర్గ పరిశీలకులు పడాల శివారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జునయాదవ్, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
యువకళారత్న పురస్కారాల ప్రదానం
నగరంపాలెం: గుంటూరు నగరంలోని బృందావన్గార్డెన్స్లో ఉన్న వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై నిర్వహిస్తున్న మహామంజీరనాదం–26 వైభవంగా కొనసాగుతున్నాయి. సాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ 16వ అంతర్జాతీయ నృత్య వేడుకలు ఆదివారం జరగ్గా, ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు లంకా విజయబాబు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం డాక్టర్ హనీ ఉన్నికృష్ణన్ (కర్ణాటక) మోహినీ అట్టం, తరిత్ సర్కార్ (జార్ఖండ్) కఽథక్ నృత్యం, క్షితిజా కాసరవల్లి (కర్ణాటక) భరత నాట్యం, గోపాల్ సింగ్ (మణిపుర్) మణిపురి నృత్యాలను విభిన్న విన్యాసాలతో నర్తించారు. కళాకారుల నృత్యాలు సభికులను అలరించాయి. కళాకారులను యువ కళారత్న పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ కాజు వేంకటసుబ్రహ్మణ్యం, కోశాధికారి వేంకటగిరి నాగలక్ష్మీ, నారా రాధిక పాల్గొన్నారు. గుంటూరు వెస్ట్(క్రీడలు): ఏడు రోజులుగా విశాఖపట్నంలో జరుగుతున్న టీ–20 సీనియర్ క్రికెట్ ఆంధ్ర జోనల్ టోర్నీలో గుంటూరు జిల్లా జట్టు విజేతగా నిలిచిందని జీడీసీఏ త్రీమెన్ కమిటీ సభ్యుడు టి.వి.శివరామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా జట్టు నార్త్ జోన్, సౌత్ జోన్, సెంట్రల్ జోన్, విశాఖపట్నం, అనంతపురం జట్లపై వరుస విజయాలతో విజయ పరంపర కొనసాగించిందన్నారు. ఆంధ్ర జోనల్ విన్నర్గా నిలిచిందన్నారు. ముఖ్యంగా యువ క్రీడాకారులు సమష్టిగా రాణించి అద్భుత విజయాలు నమోదు చేశారని తెలిపారు. సుదీర్ఘకాలం తర్వాత గుంటూరు జిల్లా క్రీడాకారులు విజేతగా నిలవడం అభినందనీయమన్నారు. జట్టు సభ్యులకు త్రీ మెన్ కమిటీ సభ్యులు జీవీ శరత్బాబు, సిహెచ్.వి.నాగరాజు అభినందనలు తెలిపారు. చీరాల రూరల్: థాయ్లాండ్లో నిర్వహించిన ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో చీరాలకు చెందిన క్రీడాకారులు సిహెచ్.నాగరాజు, జి.ఉమామహేశ్వరరావు, ఎ.సాంబశివరావు 40 ప్లస్, 45 ప్లస్, 50 ప్లస్ విభాగంలో పాల్గొని పతకాలు సాధించారు. ఆదివారం స్థానిక ఎన్ఆర్ అండ్ పీఎం హైస్కూలు క్రీడా మైదానంలో చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. అసోసియేషన్ అధ్యక్షుడు పోలుదాసు రామకృష్ణ మాట్లాడారు. 100, 200 మీటర్లు పరుగు పందెంలో, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్, షాట్పుట్, జావెలిన్ త్రోలో బంగారు పతకాలు, సిల్వర్ మెడల్స్ సాధించి చీరాలకు కీర్తి ప్రతిష్టలు తెచ్చారని క్రీడాకారులను కొనియాడారు. పోలుదాసు రామకృష్ణ, చారుగుళ్ల గురుప్రసాద్, సుధాకరరావు, నారాయణమూర్తి, శ్రీరాం రమేష్, పూర్ణా, మద్దు వెంకట సుబ్బారావు, రవి, భాస్కరరావు, రామబ్రహ్మం పాల్గొన్నారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 525.80 అడుగులకు చేరింది. ఇది 160.0644 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 900 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
దుర్గమ్మకు కానుకగా బంగారు హారం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు హైదరాబాద్కు చెందిన భక్తులు ఆదివారం రూ.3.54 లక్షల విలువైన బంగారంహారాన్ని కానుకగా సమర్పించారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన వేమూరి శివరామప్రసాద్ కుటుంబం అమ్మవారి దర్శనానికి ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసి సుమారు 23 గ్రాముల బంగారం, రూ. 3,54,292 విలువ కలిగిన బంగారు హారాన్ని అమ్మవారికి కానుకగా సమర్పించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు తిరుపతమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ పెనుగంచిప్రోలు: స్థానిక శ్రీతిరుపతమ్మ వారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావటంతో పాటు పలు శుభకార్యాలు ఉండటంతో అమ్మవారి దర్శనానికి వివిధ జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. ఆలయ క్యూలైన్లు, పరిసరాలు కిక్కిరిశాయి. వేకువ జాము నుంచే భక్తులు పాలు, పొంగళ్లతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి భక్తులకు ఆలయ వేద పండితులు దిలీప్కుమార్ సౌజన్యంతో ఆలయం వారు నిరంతరాయంగా మజ్జిగ పంపిణీ చేశారు. భక్తులు మధ్యాహ్న సమయంతో మునేరు అవతల మామిడి తోటల్లో సేద తీరారు. పెద్ద సంఖ్యలో వాహనాలు రావటంతో గ్రామంలో ట్రాఫిక్ సమస్యలు కూడా ఏర్పడ్డాయి. -
గ్రామీణ వైద్యులకు గుర్తింపు ఇచ్చిన ఘనత డాక్టర్ వైఎస్సార్దే
గుంటూరు మెడికల్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆర్ఎంపీ, పీఎంపీ గ్రామీణ వైద్యులకు గుర్తింపు ఇచ్చేందుకు ప్రత్యేకంగా కోర్సును ప్రవేశపెట్టి, వారి గుర్తింపు కోసం ఎంతో కృషి చేశారని ఏపీఆర్జేసీ న్యాయ సలహాదారు డాక్టర్ లోక్నాథ్ అన్నారు. ఆదివారం గుంటూరు నాజ్సెంటర్లో సౌత్ ఇండియన్ ఫస్ట్ ఎయిడర్స్ అసోసియేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ లోక్ నాథ్ మీడియా తో మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆర్ఎంపీ, పీఎంపీలకు గుర్తింపు ఇచ్చే ప్రక్రియ మరుగున పడిపోయిందన్నారు. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ మాట్లాడుతూ గ్రామీణ రోగులను పరీక్షించి ప్రథమ చికిత్స చేసేందుకు ఆర్ఎంపీ వైద్యులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో గ్రామీణ వైద్యులు చేసే సేవ మరువలేనిదన్నారు. ప్రభుత్వం వెంటనే గ్రామీణ వైద్యులను గుర్తించి వారికి గుర్తింపు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షుడు గోవిందరాజులు, అధ్యక్షుడు సాంబశివరావు, అమర్ రెడ్డి, నిర్గుణ రావు, శ్రీనివాసరావు, వలి, జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షుడు డాక్టర్ వి.బ్రహ్మరెడ్డి, అఖిల భారత ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ ప్రదాతల ఆర్ఎంపీ, పీఎంపీల సంఘం, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, సెయింట్ జాన్ అంబులెన్స్ ఇండియా గౌరవ రాష్ట్ర కార్యదర్శి, డాక్టర్ ఎం.మహేంద్ర కుమార్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాది వి.బి.సుమంత్ లు మాట్లాడుతూ.. 24 గంటలూ గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారికి ఆర్ఎంపీలు వైద్యసేవలు అందిస్తున్నారని కొనియాడారు. గుర్తింపు ఉన్నా లేకపోయినా ధైర్యంగా ప్రజలకు వైద్యం అందించాలని, అది ప్రథమ చికిత్సకు కట్టుబడి మాత్రమే పనిచేయాలని సూచించారు. ఎన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినా, ఎన్ని పీహెచ్సీలు పెరిగినా, అర్థరాత్రి అయినా ఆర్ఎంపీలకు ఎప్పటికీ గుర్తింపు ఉంటుందన్నారు. -
క్రమశిక్షణ లోపిస్తే కఠిన చర్యలు
నరసరావుపేట రూరల్: పోలీసు శాఖకు అప్రతిష్ట తీసుకువచ్చే ఎటువంటి ఘటనలు చోటుచేసుకున్నా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు హెచ్చరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం మార్చి నెల నేర సమీక్ష నిర్వహించారు. మాచర్ల ప్రాంతంలోని పోలీసు అధికారులు, సిబ్బందిపై వచ్చిన ఆరోపణలపై సమావేశంలో ఎస్పీ ఘాటుగా స్పందించారు. పోలీసు సిబ్బంది క్రమశిక్షణ ఉల్లంఘిస్తే సంబంధిత ఎస్హెచ్వోలే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. రోల్కాల్ను క్రమతప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో పలు అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. శాంతి భద్రతల పరిరక్షణ, పెండింగులో ఉన్న కేసుల విచారణ పురోగతి, రోడ్డు ప్రమాదాలు, మాదక ద్రవ్యాల నివారణ, రౌడీషీటర్లపై చర్యలు, పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై సమీక్షించారు. పీజీఆర్ఎస్లో వచ్చే ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా రోడ్డు భద్రతా నియమాలు ఉల్లఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. రౌడీషీటర్లను ప్రతి వారం స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. బైండోవర్ చేయించి వారిపై నిఘ ఉంచాలని సూచించారు. ప్రతి ఒక్క పోలీసు అధికారి నూతన చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. పలు నేరాలను ఛేదించడంలో, కేసులను సమగ్ర దర్యాప్తులో విశేష ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులను, ఎస్బీ సిబ్బందిని ప్రశంసా పత్రాలతో ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ జేవీ సంతోష్, ట్రైనీ ఎస్పీ నిరంజన్, డీఎస్పీలు, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆ ప్లాట్లకు తప్పని పాట్లు
చిలకలూరిపేట: పురోగమనం నుంచి తిరోగమనం వైపు అన్న చందంగా ఉంది కూటమి పాలకుల తీరు. ఒకసారి రెసిడెన్షియల్ అని ప్రకటించి, అధికారికంగా వెలువడిన ఉత్తర్వుల ఆధారంగా ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి మళ్లీ పాట్లు తప్పని పరిస్థితి ఎదురైంది. వివరాలు.. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణ పరిధిలోని బాలాజీ థియేటర్, పెదనందిపాడురోడ్డు, ఆర్టీసీ కాలనీ, ఎన్ఆర్టీ రోడ్డులోని గోల్కొండ గార్డెన్స్, సంజీవనగర్, పండరీపురం, కోండ్రుపాడు, చీరాల రోడ్డులోని కక్కెర దాసయ్య గోడౌన్లు వంటి మొత్తం 12 ప్రదేశాలను 2024 మార్చి 13న ప్రభుత్వం ఇండస్ట్రియల్ ఏరియా నుంచి రెసిడెన్షియల్కు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సవరించిన మాస్టర్ ప్లాన్ను విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ఆధారంగా కొంతమంది స్థల యజమానులు ప్లాట్లు వేసి విక్రయాలు చేశారు. రెసిడెన్షియల్గా మారిన నేపథ్యంతో పాటు, సంబంధిత స్థలాలు నివేశ ప్రాంతాల మధ్యలో ఉండటంతో ఆ ప్లాట్లలో ఇళ్లు నిర్మించుకునేందుకు ప్రజలు కొనుగోలు చేశారు. హఠాత్తుగా ఇండస్ట్రియల్లోకి... అయితే ఉరమని ఉరుములా హఠాత్తుగా ఈ 12 ప్రదేశాలను రెసిడెన్షియల్ నుంచి తిరిగి ఇండస్ట్రియల్/కమర్షియల్లోకి మారుస్తూ ఈ నెల రెండో తేదీన ప్రభుత్వం గెజిట్(రాజపత్రం) జారీ చేసింది. దీంతో సంబంధిత ప్రదేశాల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. విషయం తెలుసుకున్న సంబంధిత ప్లాట్ల కొనుగోలు దారులు, స్థల యజమానులు డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్లో తమకు జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేశారు. అవి రెసిడెన్షియల్ జోన్లోనే కొనసాగించాలని తమ అభ్యంతాలను తెలియజేశారు. అత్యధిక శాతం ప్లాట్లుగా ... గతంలో రెసిడెన్షియల్కు మారిన 12 ప్రదేశాల్లో అత్యధిక స్థలాల్లో ఇప్పటికే ప్లాట్లు వేసి విక్రయాలు చేయడం కూడా జరిగింది. ఉదాహరణకు చీరాల రోడ్డులో ఉన్న కక్కెర దాసయ్య గోడౌన్ల స్థలానికి సంబంధించి 10.60 ఎకరాలకు గాను గతంలో ఆ స్థలాల వెనుక భాగంలో 1.5 ఎకరాలను స్థల యజమానులు విక్రయించగా అందులో ఇప్పటికే గృహాలు నిర్మాణం చేసుకొని పలువురు నివాసం ఉంటున్నారు. మరో 6.25 ఎకరాలు రెసిడిన్షియల్గా మారగా మరో 2.85 ఎకరాల్లో గోడౌన్లు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మొత్తం భూమిని ఇండస్ట్రీయల్కు మారుస్తూ గెజిట్ జారీ కావడంతో బెంబేలెత్తడం ప్లాట్లు కొనుగోలు చేసిన వారి వంతయింది. దీంతో ఇక్కడ ప్లాట్లు కొన్నవారు వాసవి గార్డెన్స్ పేరుతో సంఘం ఏర్పాటు చేసుకొని ప్రజా ప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో వీరు డీటీసీపీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 21న పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన టీపీఎస్ లక్ష్మణస్వామి, స్థానిక టౌన్ప్లానింగ్ అధికారులతో కలసి విచారణ నిర్వహించారు. అయితే ఏమవుతుందోనన్న ఆందోళనలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారితో పాటు, స్థల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థలాలను రెసిడెన్షియల్ జోన్లోనే కొనసాగించి తమకు న్యాయం చేకూర్చాలని కోరుతున్నారు. పాత ఉత్తర్వులకు భిన్నంగా ఉన్నపళంగా కొత్త గెజిట్ జారీ చేయాల్సి రావడం వెనుక ఓ ప్రజా ప్రతినిధి చక్రం తిప్పినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెసిడెన్షియల్ నుంచి ఇండస్ట్రియల్/ కమర్షియల్లోకి మార్చి సంబంధిత స్థల యజమానులపై ఒత్తిడి తేవడం ద్వారా వారి నుంచి ప్రయోజనం పొందడమే లక్ష్యంగా ఈ వ్యవహారం కొనసాగిందని ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సంబంధిత అధికారులు 2024లో వెలువడిన మాస్టర్ ప్లాన్కు సంబంధించి రెండేళ్లకే తిరిగి సంబంధిత స్థలాలను ఇండస్ట్రియల్లోకి మార్చేలా ప్రణాళిక రూపొందించటం వివాదస్పదంగా మారింది. 12 ప్రదేశాలకు సంబంధించి రెండు స్థలాల వారు రెసిడెన్షియల్గా మారినప్పటికీ అక్కడ ఉన్న గోడౌన్లను తొలగించటకపోవడం ఆసరాగా చేసుకొని తిరిగి అన్ని స్థలాలను ఇండస్ట్రీయల్గా చేయడం ఎక్కడి న్యాయమని ప్లాట్లు కొనుగోలు చేసినవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఇద్దరు విద్యార్థుల దుర్మరణం
యడ్లపాడు: చిన్నారులకు సెలవులు.. అసలే ఆదివారం.. సరదాగా గడుపుతున్నారు.. చెరువుకు వెళ్లి మృత్యువాత పడిన ఘటన యడ్లపాడులో చోటుచేసుకుంది. వివరాలు... బోయపాలేనికి చెందిన షేక్ ఇమాంసా, అమినాబి దంపతులకు కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. కొంతకాలంగా వీరు యడ్లపాడు గ్రామానికి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు. వీరిలో చిన్నవాడు షేక్ మొహమ్మద్ అహమ్మద్(17) గుంటూరులోని ఓ కళాశాలలో ఇంటర్ చదవుతున్నాడు. వీరి నివాసానికి సమీపానే ఉన్న యడ్లపాడుకు చెందిన ప్రైవేటుగా విద్యుత్ పనులు చేసుకుని జీవనం సాగించే షేక్ మస్తాన్వలి, మునీరాబేగం దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో పెద్దవాడైన షేక్ అమానుల్లా(13) స్థానిక జెడ్పీహైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. వీరిద్దరు ఆదివారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో సైకిల్పై గ్రామంలోని జగ్గాపురం రోడ్డులో ఉన్న చవిటిచెరువు వద్దకు వెళ్లారు. ఆ చెరువు లోతుపై అవగాహన లేకపోవడం, అడుగున ప్రమాదకరమైన ఊబి ఉండటంతో ప్రాణాపాయం పొంచి ఉందని వారు ఊహించలేకపోయారు. నీటిలోకి దిగిన కొద్దిసేపటికే ఆ ఊబి వారిని మృత్యువు వైపు లాగేసింది. చీకటి పడుతున్నా బిడ్డలు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు వెతుకులాట ప్రారంభించారు. చెరువు ఒడ్డున ఉన్న సైకిల్, చెప్పులు వారి గుండెల్లో రాయి వేశాయి. సమాచారం అందుకున్న ఎస్ఐ టి.శివరామకృష్ణ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టగా, రెండు గంటల తర్వాత ఆ ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. అప్పటి వరకు తమ బిడ్డలు క్షేమంగా తిరిగి వస్తారని ఆశించిన ఆ పేద కుటుంబాలకు, విగతజీవులుగా పడి ఉన్న వారిని చూశాక గుండెలు బాదుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒక్క క్షణం సరదా.. రెండు నిండు ప్రాణాలను బలితీసుకుని ఆ కుటుంబాల్లో తీరని చీకటిని మిగిల్చింది. -
ఇంధన సెగలు!
సత్తెనపల్లి: ఇంధనం మంట పుట్టిస్తోంది. ఇన్నాళ్లు గ్యాస్ దడ పుట్టించగా.. ఇప్పుడు డీజిల్, పెట్రోల్ గుబులు రేకెస్తోంది. తగినంతగా డీజిల్, పెట్రోల్ సరఫరా లేకపోవడం.. అవసరానికి దొరకదేమోనని ఆందోళనతో వాహన చోదకులు పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ కడుతున్నారు. ఆయిల్ ఏ బంకులో ఉంటే అక్కడ కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరడం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది. సరఫరాకు తీవ్ర అంతరాయం... జిల్లాలో 194 పెట్రోల్, డీజిల్ బంకులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజు పెట్రోల్, డీజిల్ సాధారణ వినియోగం రెట్టింపు అయింది. అయితే ప్రస్తుతం సగం కూడా సరఫరా కావడం లేదని సమాచారం. జిల్లాలో పెట్రోల్ లేక 5 బంకులు, డీజిల్ లేక 60 బంకులు ఇప్పటికే మూతబడ్డాయి. ఆందోళన చెందుతున్న వాహనదారులు ముందు జాగ్రత్తగా అవసరానికి మించి డీజిల్, పెట్రోల్ కొట్టిస్తున్నారు. దీంతో ఒక్క సారిగా డిమాండ్ పెరిగి గంటల వ్యవధిలోనే బంకుల్లో నిల్వలు ఖాళీ అవుతున్నాయి. మరో వైపు కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదు. ఎన్నికలు ముగుస్తున్న తరుణంలో మోదీ సర్కార్ వీటి ధరలను పెంచేస్తుందనే భయంతో కూడా ప్రజలు ముందస్తుగా డీజిల్, పెట్రోల్కు ఎగబడుతున్నారు. ఇదే అదునుగా కొన్ని బంకుల యజమానులు బ్లాక్ మార్కెట్కు పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పరిమితంగా అమ్మకాలు... ఈ నేపథ్యంలో పలు బంకుల్లో డీజిల్, పెట్రోల్ విక్రయాలను యాజమాన్యాలు పరిమితం చేశాయి. ఆటోలకు రూ. 200, కార్లకు రూ.500, భారీ వాహనాలకు రూ.1000 విలువైన డీజిల్ మాత్రమే పోస్తున్నారు. ద్విచక్ర వాహనానికి రూ. 200, కారుకు రూ. 500 పెట్రోల్ మాత్రమే పోస్తున్నారు. అంతకన్నా అవసరమైన వారు మరో బంకును ఆశ్రయించాల్సి వస్తుంది. దీంతో దూర ప్రాంతాలకు వెళుతున్న వారు ఒకటి, రెండు బంకుల వద్ద డీజిల్, పెట్రోల్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. కొరత ఎందుకంటే... యుద్ధం మొదలైన తర్వాత ఇతర దేశాల నుంచి వచ్చే చమురు తగ్గడం, స్థానికంగా ఉన్న బఫర్ స్టాక్ను పెద్ద ఎత్తున వినియోగించడం వంటి కారణాలతో సరఫరా చైన్ తెగిపోయింది. కంపెనీలకు ఆర్డర్ పెడుతుంటే నెల ఆఖరి వరకు డీజిల్ వచ్చే అవకాశం లేదని చెబుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు క్రూడ్ ఆయిల్ ధర పెరగడంతో ఇప్పుడున్న రేట్లకు అమ్మితే నష్టపోతామనే ఉద్దేశంతో కంపెనీలు తగినంత సరఫరా చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. సత్తెనపల్లిలో 5 పెట్రోల్ బంకులు ఉంటే 2 బంకుల్లో మాత్రమే అరకొరగా డీజిల్ ఆదివారం లభించింది. దీంతో ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. రైతులకు తప్పని కష్టాలు జిల్లాలో ప్రస్తుతం రబీ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. యంత్రాలతో వరికోతల కోయిస్తున్నారు. ఈ యంత్రాలతో అవసరమైన డీజిల్ లభించక పోవడంతో వరి కోతలకు ఆటంకం కలుగుతుంది. అది కూడా ఖాళ్లీ టిన్నులు, సీసాల్లోకి డీజిల్ కొట్టవద్దని పౌరసరఫరాల శాఖ అధికారులు ఆదేశించారు. వరి కోత యంత్రాలను పెట్రోల్ బంకుల వద్దకు తీసుకుని వెళ్లే పరిస్థితి ఉండదు. వాటికి టిన్నుల ద్వారానే డీజిల్ పోయాలి. దీంతో చేసేది లేక లీటర్కు రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా చెల్లించి బ్లాక్ మార్కెట్లో డీజిల్ కొనుక్కోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. మరోవైపు డీజిల్ కొరతను సాకుగా చూపి, వాటి అద్దెలను యజమానులు భారీగా పెంచారు. గతంలో ఎకరాకు రూ.2,500 అద్దె ఉండేది. ఇప్పుడు దాన్ని రూ.3 వేలకు పెంచేశారు. డీజిల్ కొరత కారణంగా అన్ని రంగాలపై ప్రభావం కనిపిస్తోంది. డీజిల్, పెట్రోల్ కోసం జిల్లాలోని ప్రజలు, వినియోగదారులు ఎటువంటి భయాందోళనకు లోను కావాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం కారణంగా అనవసరమైన డిమాండ్ సృష్టిస్తున్నారు. నిల్వలు లేక అడుగంటిపోయిన బంకులకు ఆయిల్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు ఇబ్బంది కలగకుండా డీజిల్ అవసరాలు ఉన్న పెట్రోల్ బంకులకు 10 శాతం అదనంగా పంపించే ఏర్పాట్లు చేస్తున్నాం. రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో ఆయిల్ అందుబాటులో ఉంటుంది. బంకుల యాజమాన్యాలు వాణిజ్య అవసరాల కొరకు ఆయిల్ విక్రయించినట్లు గుర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – ఎంవీ ప్రసాద్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, పల్నాడు -
విద్యాభివృద్ధికి దాతల సాయం మరువలేనిది
నెహ్రూనగర్: విద్యాభివృద్ధికి దాతల సాయం మరువలేనిదని ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి కొనియాడారు. స్తంభాల గరువులోని ఉడుముల కోటి రత్నం, సాంబిరెడ్డి రెడ్ల బాలికల నూతన వసతి గృహ ప్రారం భోత్సవం ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ రెడ్ల బాలికల హాస్టల్ నిర్మాణం కోసం బండి సాహితీ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బండి అశోక్ రెడ్డి, సుధారాణి దంపతులు రూ.కోటి, ఉడుముల కోటి రత్నం రూ.కోటి, మరి కొంతమంది దాతలు రూ.2కోట్లు ఇచ్చి చేయూతనివ్వడం అభినందనీయమన్నారు. దాతలు ఇచ్చిన సహకారంతో విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ రెడ్డి హాస్టల్లో చదువుకునే ప్రతి విద్యార్థి ఉన్నత స్థానాలకు చేరుకున్న తర్వాత మీ ఉన్నతికి సహకరించిన హాస్టల్ అభివృద్ధికి సహాయ సహకారం అందించాలన్నారు. రెడ్డి హాస్టల్లో మరిన్ని వసతులు కల్పించి మరింత మందికి వసతి కల్పించి విద్యాభివృద్ధికి సహకరించేందుకు రెడ్డి సామాజిక వర్గం తగిన సహకారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పెదకూరపాడు నియోజకవర్గ పరిశీలకులు యెనుముల మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి హాస్టల్ అభి వృద్ధికి అనవేమా ట్రస్ట్ చేస్తున్న కృషి చిరస్మరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఉడుముల శ్రీనివాసరెడ్డి, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, భీమవరపు పిచ్చిరెడ్డి, గుంటూరు వేమారెడ్డి, మోదుగుల వాసుదేవ రెడ్డి, దుగ్గెంపూడి వెంకట్రామిరెడ్డి, కంది సంజీవరెడ్డి, చల్లా అంజిరెడ్డి, వనుకూరి సూరారెడ్డి, రోళ్ళ మాధవి, అచ్చాల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రెడ్డి బాలికల నూతన వసతి గృహ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి -
ప్రకృతి సేద్యంపై అవగాహన కల్పించాలి : జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్
నరసరావుపేట రూరల్: ప్రకృతి సేద్యంపై రైతుల్లో అవగాహన కల్పించాలని జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.అమలకుమారి తెలిపారు. సాగు విషయాన్ని రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రచారం చేయాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందన్నారు. జిల్లా ప్రకృతి వ్యవసాయ కార్యాలయంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. అందులో అమలకుమారి మాట్లాడుతూ.. ఈ ఏడాది 82,595 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రీ–మాన్సూన్ డ్రై సోయింగ్ కోసం 30 రకాల విత్తనాలతో ఎకరానికి 15 కిలోల కిట్లను బయోరీసోర్స్ సెంటర్లు, రైతు సేవ కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా భూమి సారవంతం పెరగడంతో పాటు నీటి నిల్వ సామర్ధ్యం మెరుగుపడుతుందని తెలిపారు. రసాయన ఎరువులు, పురుగు మందులు పూర్తిగా వదిలి, సేంద్రియ సాగుతో కషాయాల వినియోగం ద్వారా భూమి ఆరోగ్యం మెరుగవుతుందని వివరించారు. దీని వలన రైతులకు ఖర్చులు తగ్గడంతో పాటు ఆదాయం పెరుగుతుందని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో వరి, పత్తి, మిర్చి, ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు ప్రధాన పంటలతో పాటు అంతర పంటలు వేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా ఎన్ఎఫ్ఏలు నందకుమార్, అప్పలరాజు, మేరి, ఎంఎంటీఎల్ పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పల్నాడు
ఆదివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026●రాష్ట్ర ప్రభుత్వం పాలన గాలికొదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేసే పనిలో నిమగ్నమయ్యింది. దీనిలో భాగంగానే తమపై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందుతోంది. ఒక్క మొక్కజొన్నకే కాకుండా ఏ పంటకు కనీసం మద్దతు ధర లేకుండా పోయింది. గత ప్రభుత్వంలో ప్రతి ఏడాది రైతుకు క్రమం తప్పకుండా న్యాయం జరిగేది, ఇప్పుడు ఆ లోటు వారికి తెలుస్తుంది. – పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షులు కనీస మద్దతు ధరలేక, ప్రభుత్వ సాయం అందక ఇబ్బందులు పడుతున్న రైతులకు మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాకతో మంచి రోజులొస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం వద్ద మొక్క జొన్న కొనేందుకు డబ్బులు లేవనడం వారి చేతకాని తనానికి నిదర్శనం. టీడీపీ ప్రభుత్వ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న విషయం ప్రజలకు తెలీదనుకుంటున్నారా..? – అంబటి రాంబాబు, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు, -
అంతం కాదు... ఆరంభం
మొక్కజొన్న ఽగిట్టుబాటు ధర కోసం అంబటి మురళీ కృష్ణ రగిలించిన పోరాట స్ఫూర్తికి ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర స్థాయి ఉద్యమంలా మార్చేస్తాం.చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులు కరవుతో అల్లాడిపోతారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రైతుల కోసంరూ.3000 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఆదుకున్నారు. ఈ ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కూడా రైతులకు దక్కనివ్వడం లేదు. – లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ ● -
మంగళగిరిలో అదనపు కోర్టు ప్రారంభం
మంగళగిరి టౌన్ : గుంటూరు జిల్లా మంగళగిరిలో అదనంగా నిర్మించిన కోర్టును శనివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనరావు న్యాయమూర్తులతో కలసి ప్రారంభించారు. తొలిరోజు నాలుగు కేసులను విచారించారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తులను మంగళగిరి బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ డి. కృష్ణమోహన్, జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ వి. సుజాత, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, మంగళగిరి కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రియదర్శిని, జస్టిస్ సురేష్బాబు, జిల్లా జడ్జి కల్యాణ చక్రవర్తి, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. యడ్లపాడు: మండలంలోని సొలస గ్రామంలో వేంచేసి ఉన్న భూసమేత రంగనాయకస్వామి ఆలయం శనివారం భక్తులతో కళకళ లాడింది. బ్రహ్మోత్సవాలకు నాలుగు రోజులు ముందుగా స్వామి వారి నిజరూప దర్శనం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మరుసటి రోజైన శనివారం ఆలయ అర్చకులు పర్చూరి రామకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి, రంగనాయక స్వామి మూలవిరాట్లకు పంచామృత అభిషేకాలు చేశారు. అనంతరం చందన అలంకరణలో భక్తులకు దర్శనమివ్వగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాచేపల్లి : స్థానిక వీర్ల అంకమ్మ తల్లి కొలుపుల తిరుణాల శనివారం ప్రారంభమైంది. అమ్మవారి ఆలయంలో కమిటీ సభ్యులు, భక్తులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. కొలుపులు తిరుణాల ప్రారంభ సందర్భంగా గ్రామంలోని బొడ్రాయికి జలాభిషేకం చేశారు. అనంతరం మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారి కొలుపులు తిరుణాల సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. తాడేపల్లిరూరల్ : తాడేపల్లి పట్టణ పరిధిలోని భరతమాత సెంటర్ వద్ద బకింగ్హామ్ కెనాల్కు అనుసంధానంగా ఉన్న డ్రైనేజీలోకి ఓ కారు దూసుకు వెళ్లింది. శనివారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనలో కారు కాలువకు, డ్రైనేజీకి మధ్యలో మురుగునీటిలో కూరుకుపోయింది. కానిస్టేబుల్ ఒకరు ఉండవల్లి సెంటర్ నుంచి బైపాస్ వైపు కారులో అతివేగంగా వెళుతుండగా, భరత మాత సెంటర్ వద్ద కాంక్రీట్ దిమ్మను ఢీకొని 15 అడుగుల లోతులో కారు పడిపోయింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. కారు బెలూన్స్ ఓపెన్ కావడంతో కానిస్టేబుల్కు స్వల్ప గాయాలయ్యాయి. గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జెడ్పీ కార్యాలయంలో శనివారం స్థాయీ సంఘ సమావేశాలను నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా ఛాంబర్లో నిర్వహించిన సమావేశంలో ప్రణాళిక–ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, పనులకు సంబంఽధించిన స్థాయీ సంఘ సమావేశాల అజెండాలపై చర్చించారు. -
చికిత్స పొందుతూ తండ్రీకుమారుడు మృతి
బొల్లాపల్లి : ఇరువురు కుమారులకు గడ్డి మందు తాపించి తానూ తాగిన సంఘటనలో చికిత్స పొందుతూ తండ్రి, చిన్న కుమారుడు మృతి చెందారు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి బండ్లమోటు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలోని గంగుపల్లి తండాకు చెందిన చిన్ని నాయక్ తన భార్య కాపురానికి రాలేదని మనస్తాపానికి గురై వారం రోజుల కిందట తన ఇరువురు కుమారులకు కూల్ డ్రింక్లో గడ్డి మందు కలిపి తాపించాడు. అనంతరం తానూ తాగాడు. దీంతో అస్వస్థతకు గురైన వారిని తండావాసులు చికిత్స నిమిత్తం వినుకొండలోని ఓ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. వారం రోజులుగా మృత్యువుతో పోరాడి తండ్రి బాణావత్ చిన్ని నాయక్ (28), చిన్న కుమారుడు ఈశ్వర నాయక్ (6)లు మృతి చెందారు. మరో కుమారుడు ఏడేళ్ల శివానాయక్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. భార్య బుజ్జి భాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సయ్యద్ సమీర్ బాషా తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు అందజేశామని తెలిపారు. -
ఇంటి లెక్క తేలుద్దాం
● ‘జనగణన’కు కసరత్తు ● మే 31 వరకు మొదటి దశ ‘గృహగణన’ ● రెండో దశలో జనాభా లెక్కల సేకరణ ● జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి ● డిజిటల్ పద్ధతిలో వివరాల నమోదు ప్రక్రియ ● జిల్లా జనాభా 20.41 లక్షలు స్వీయ గణన.. ఎలా నమోదు చేయాలంటే... 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లా సమాచారం -
డీజిల్ నిల్
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లాలో ఇంధన కొరత తీవ్ర రూపం దాల్చుతోంది. డీజిల్ దొరక్క రైతులు, రవాణా దారులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని పెట్రోల్ బంకులు ఇప్పటికే మూతబడ్డాయి. శనివారం ఉదయం నుంచే పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్న దృశ్యాలు పరిస్థితి తీవ్రతను చాటుతుంది. ఇక రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందేమోనన్నా ఆందోళనతో వాహనదారులు ట్యాంక్లను ఇందనంతో నింపుకుంటున్నారు. పెట్రోల్ బంకుల వద్ద బారులుతీరిన వాహనదారులతో రద్దీ నెలకొంది. కొన్ని పెట్రోల్ బంక్ల్లో డీజిల్ను పూర్తిగా నిలిపి వేసి నోస్టాక్ బోర్డులను ఏర్పాటు చేశారు. పెట్రోల్ మాత్రమే విక్రయిస్తున్నారు. జిల్లాలో సుమారు 135 పైగా పెట్రోలు బంక్లు ఉండగా డిమాండ్కు సరిపడా సరఫరా అందించలేక నిర్వాహకులు చేతులెత్తేశారు. రోజుకు సుమారు 7 లక్షల లీటర్ల డీజీల్, 6 లక్షల లీటర్ల పెట్రోల్ వినియోగిస్తున్న పల్నాడు జిల్లాలో కంపెనీల నుంచి సరఫరా అంతరాయం ఏర్పడటంతో సంక్షోభం మరింత ముదిరింది. హైవే పై రవాణా చేస్తూ డీజిల్ కోసం బంకులవద్దకు వెళ్లిన వాహనదారులకు నోస్టాక్ బోర్డు దర్శనం ఇవ్వటంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని వాహనాల్లో డీజిల్ అయిపోవటంతో వాహనాలను పక్కన పార్క్ చేసుకొని ఇంధన సేకరణ కోసం యజమానులు నానా అగచాట్లు పడటం కనిపించింది. రైతాంగానికి గట్టిదెబ్బ.. డీజిల్ కొరత రైతాంగానికి గట్టిగా దెబ్బతీసింది. ఇంధనం లేక వరికోత యంత్రాలు నిలిచిపోవటంతో పంట కోత పనులు ఆగిపోయాయి. దీంతో పాటు మొక్కజొన్న కోతకు ఆటంకం కలిగింది. ఇక రవాణా రంగ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. జిల్లాలో సుమారు 2500 లారీల ద్వారా జరుగుతున్న ఇసుక రవాణ నిలిచిపోయింది. ఇలానే కొనసాగితే కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఉంది. పెట్రోల్ బంకుల్లో ఎక్కడైనా ఇంధన నిల్వలు అడుగంటి ఉంటే వాటి వివరాలు సేకరించి మార్కెట్ ఏజెన్సీలతో మాట్లాడి సకాలంలో ఆయిల్ నిల్వల లోడ్లను పంపించేందుకు తగు ఆదేశాలు జారీ చేశాం. ఎక్కడైతే రైతులకు డీజిల్ అవసరం ఉందో అక్కడ పెట్రోల్ బంకులకు పది శాతం అదనంగా ఇంధనం పంపించటం జరుగుతుంది. – కృతికా శుక్లా, పల్నాడు జిల్లా కలెక్టర్ పల్నాడు జిల్లాలో చమురు మంటలు పెట్రోల్, డీజిల్ కోసం ప్రజల పాట్లు ఉదయం నుంచి పెట్రోల్ బంకుల వద్ద క్యూ జిల్లాలో 135కు పైగా పెట్రోల్ బంక్లు సగటునా 7 లక్షల లీటర్ల డీజిల్ వినియోగం 6 లక్షల లీటర్ల పెట్రోల్ వాడకం కంపెనీల నుంచి పూర్తి స్థాయిలో సరఫరా కానీ ఇంధనం కీలక సమయంలో డీజిల్ అందక రైతుల ఇక్కట్లు ముందుకు కదలని వరి, మొక్కజొన్న కోత యంత్రాలు -
గృహ నిర్మాణ పనులు ప్రారంభం కావాలి
గుంటూరు వెస్ట్: జిల్లాలో గృహ నిర్మాణ పనులు ప్రారంభం కావాలని, ప్రతీ గృహం యొక్క నిర్మాణ పనులు దశ మారాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి కాంత్ వర్మ స్పష్టం చేశారు. శనివారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో శనివారం జిల్లా కలెక్టర్ గృహ నిర్మాణ ఇంజనీర్లు, గుత్తేదారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గుత్తేదారులు వారికి గతంలో జరిగిన చెల్లింపుల మేరకు పనులు తక్షణం పూర్తి చేసి తదుపరి దశకు తీసుకురావాలన్నారు. 26న సెన్సస్ 5 కే రన్ జనాభా గణనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 26న ‘సెన్సస్ 5 కె రన్‘ నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ తెలిపారు. వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శనివారం సమావేశం నిర్వహించారు. సెన్సస్ 5 కె రన్ ఆదివారం ఉదయం 6 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభం అవుతుందని తెలిపారు. స్వీయ గణన సదుపాయంలో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములైన వాస్తవ వివరాలు పొందుపరచేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు స్వీయ గణన అందుబాటులో ఉంటుందన్నారు. స్వీయ గణన ద్వారా సమర్పించిన వివరాలను సంబంధిత ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు ధృవీకరిస్తారని స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 2027 జనాభా గణన రెండు దశల్లో నిర్వహిస్తారన్నారు. మొదటి దశగా ఇండ్ల జాబితా మరియు గృహ గణన నిర్వహిస్తారని చెప్పారు. ఇందులో ప్రతి ఇంటి వివరాలు, గృహ పరిస్థితులపై సమాచారం సేకరించడం జరుగుతుందని అన్నారు. 5 కే రన్ లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ కోరారు. -
ముగిసిన సమావేశం
గుంటూరు రూరల్: నగర శివారులోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం నందు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గత రెండు రోజులుగా జరుగుతున్న కృష్ణ మండలం వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశం శనివారంతో ముగిసింది. కార్యక్రమంలో ఏడీఆర్ డాక్టర్ దుర్గాప్రసాద్ గత ఏడాది నిర్వహించిన కార్యక్రమాల వివరాలను తెలిపారు. గత ఏడాది సూచనల ఆదారంగా చేపట్టిన కార్యక్రమాల వివరాలను సాయిల్ సైన్స్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి. శైలజ తెలిపారు. భూసార పరిరక్షణ కోసం జీవన ఎరువుల వినియోగం, అందుబాటులో ఉన్న నూతన యంత్రపరికరాలు, రానున్న సీజన్లో ఎన్నినో ప్రభావం వర్షపాతం, పంటల సాగుపై ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలను రైతులు, శాస్త్రవేత్తలు చర్చించారు. వివిధ పంటల ప్రధాన శాస్త్రవేత్తలు ఆయా పంటల్లో నూతన రకాలు, టెక్నాలజీలను వివరించారు. 2026–27 సంవత్సరానికి నిర్వహించాల్సిన పరిశోధనలు, కార్యక్రమాల కార్యాచరణపై చర్చించారు. కార్యక్రమంలో పరిశోధన ఇంచార్జ్ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, విస్తరణ సంచాలకుడు డాక్టర్ జి శివన్నారాయణ, వివిధ జిల్లాల డీఏవోలు, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. -
మట్టి మాఫియాపై స్థానికుల కన్నెర్ర
వినుకొండ: రేయింబవళ్లు భారీ యంత్రాలతో, పెద్ద టిప్పర్లతో రూ.కోట్లాది విలువైన మట్టి తరలిస్తున్న అక్రమార్కులను శనివారం ఉదయం గ్రామస్థులు అడ్డుకున్నారు. సర్వే నంబర్ 1లో సుమారు 89 ఎకరాల విస్తీర్ణంలో రూ.కోట్లాది విలువైన మట్టిని అక్రమంగా తవ్వి, వినుకొండ ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కొందరు వ్యక్తులు అక్రమ లాభాలు పొందుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అదే సమయంలో, గ్రామానికి అవసరమైన ఒక తట్ట మట్టిని కూడా తీసుకెళ్లనివ్వకుండా స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు తెలిపారు. ఈ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు కానీ, సంబంధిత శాఖలు కానీ స్పందించకపోవడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్కు అధికారుల అండ వెంకుపాలెం వద్ద అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని మీడియాలో వచ్చిన కథనాలకు స్పందించిన వినుకొండ ఎస్ఐ పుల్లారావు, డిప్యూటీ తహసీల్దార్ మురళితోపాటు సిబ్బంది వెళ్లి దర్యాప్తు చేపట్టారు. కానీ మట్టి లారీలను విడిచి పెట్టాలని ఎస్సై పుల్లారావు గ్రామస్తులను హెచ్చరించారు. అదేమని ప్రశ్నించిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై కేసులు నమోదు చేస్తామని బెదిరించినట్లు గ్రామస్తులు ఆరోపించారు. అక్రమార్కులకు పోలీసులు అండగా ఉండటం గ్రామస్తులను విస్మయానికి గురిచేశారు. నాడు అక్రమం నేడు సక్రమం.. గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వల్లభ ఫ్యాక్టరీ వద్ద తన సొంత భూముల్లో మట్టిని ఫ్యాక్టరీ అవసరాలకు తరలించారు. ప్రస్తుత ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాత్రం ఫిర్యాదు చేసిన వారిపై కార్యకర్తలతో వెళ్లి నానా గందరగోళం సృష్టించారు. అయితే అదే ప్రాంతంలో ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వకాలు జరుగుతుంటే నోరు మెదకపు మెదపకపోవడం గమనార్హం. ఇప్పటికై నా అధికారులు వెంటనే స్పందించి అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోవాలని, లేకపోతే గ్రామస్తులంతా కలిసి ఉద్యమం చేపడతారని తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ మురళికి వినతిపత్రం అందజేశారు. -
కళ్లుండీ చూడలేని కబోదిలా..
పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతుంటే ప్రభుత్వం కళ్లుండీ చూ డలేని కబోదిలా మా రింది. మొక్కజొన్నకు కేంద్ర ప్రకటించిన మద్దతు ధర ప్రకారం రూ.2,400కు కొనుగోలు చేయాల్సిన సర్కారు కొనుగోలు కేంద్రాలను తెరవకపోవడంతో దళారులకు రూ. 1200 నుంచి రూ.1400లకు అమ్ముకోవాల్సిన దుస్థితి. టీడీపీ నేతలు దళారులతో కుమ్మకై ్క తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో రైతులు నష్టపోతున్నారు. పంటకు గిట్టుబాటు ధరలు లేవు. – మేరుగ నాగార్జున, మాజీ మంత్రి ● -
కోటప్పకొండ అభివృద్ధిపై మాస్టర్ప్లాన్
నరసరావుపేట రూరల్: కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనుల మాస్టర్ప్లాన్పై శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ కృతిక శుక్లా, ఎస్పీ బి.కృష్ణారావు, డిఎఫ్వో కృష్ణప్రియ, ఆలయ ఈవో డి.చంద్రశేఖర్లు సమావేశంలో పాల్గొన్నారు. ధృమతరు కన్సల్టెంట్స్ సంస్థ అర్కిటెక్ సభ్యులు చేతనా జైన్, కె.రాజ్కుమార్లు మాస్టర్ప్లాన్ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వాహనాల పార్కింగ్ కాంప్లెక్స్, అన్నదాన సత్రం, షాఫింగ్ కాంప్లెక్స్ ప్రతిపాదనలను తెలియజేశారు. పాత మెట్ల మార్గానికి పక్కనే కొత్త మెట్ల మార్గం ప్రతిపాదించారు. ఇందులో ల్యాండింగ్ స్థలాలు, తాగునీటి పాయింట్లు, వాష్రూమ్లు, రిఫ్రెష్మెంట్ కియోస్క్లు ఏర్పాటు చేశారు. స్వామి వారి దర్శనానికి వచ్చే యాత్రికులు, వీఐపీల కోసం డార్మిటరీలు, ప్రైవేటు గదులు, వీఐపీ కాటేజీలను మాస్టర్ప్లాన్లో పొందుపరిచారు. ఆలయ ప్రవేశ, నిష్కమణ మార్గాలు, సామాన్లు భద్రపర్చుకునే గదులు, ట్రాఫిక్ నావిగేషన్ ప్లాన్లపై సమావేశంలో చర్చించారు. మాస్టర్ ప్లాన్ అధ్యయనం చేసి అదనపు సూచనలు ఉంటే తెలియజేయాలని అన్ని శాఖలను కలెక్టర్ ఆదేశించారు. దీనిపై ప్రణాళికలు సిద్ధం చేసి పనులను త్వరిగతిన పూర్తిచేయాలని తెలిపారు. సమీక్ష చేసిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, ఎస్పీ కృష్ణారావు -
అక్రమ కేసులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవు
● మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి పట్టుదలతో బెయిలు మంజూరు ● మాబు తల్లిదండ్రులు షేక్ బడేసాహెబ్, ఖాశీంబి పిడుగురాళ్ల రూరల్: అక్రమ కేసులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవని, న్యాయం కాస్త ఆలస్యమైనా కచ్చితంగా న్యాయం గెలుస్తుందని పల్నాడు జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షులు షేక్ మాబు తల్లిదండ్రులు షేక్ బడేసాహెబ్, ఖాశీంబిలు అన్నారు. అక్రమ కేసులు బనాయించి పీడీయాక్ట్ ఓపెన్ చేయించి మార్చి 12వ తేదీన రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లిన పల్నాడు జిల్లా సోషల్ మీడియా ఉపాధ్యక్షులు షేక్ షేక్ మాబుకు పీడియాక్ట్ కేసులో శుక్రవారం బెయిల్ మంజూరు అయింది. వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ...గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి కృషితోనే ఈ రోజు బెయిల్ మంజూరు అయిందన్నారు. ఆయన ప్రతిక్షణం ఈ కేసుపై దృష్టి పెట్టి మా కుమారుడు సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చేందుకు కృషి చేశారన్నారు. మా కుటుంబ సభ్యులందరు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డికి రుణపడి ఉన్నామని ఆయన తెలిపారు. అనేక అక్రమ కేసులు బనాయించి జైలు శిక్ష అనుభవించటమే కాకుండా చివరకు పీడియాక్ట్ కూడా కట్టి మార్చి 12వ తేదీన రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించారని 44 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించాడని వారు అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మా కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు జరుగుతూనే ఉన్నాయి. న్యాయం గెలుస్తుందని, కుట్రలు ఓడిపోయి నీతి నిలబడిందని వారు తెలిపారు. -
మద్దతుపై దగా.. రైతులపై పగ
ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని పండించిన పంటలకు మార్కెట్లో మద్దతు ధర లభించడం లేదు. దిగుబడి అరకొరగా వచ్చినా పెట్టుబడి ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెక్కల కష్టానికి విలువ లేదా అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. మొక్కజొన్న దిగుబడులను ఇళ్ల వద్ద రాశులుగా పోసుకుని మద్దతు ధర కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. పంట పండించడమే కష్టం.. అమ్ముకోవడం మరింత సమస్య అనే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. రైతులు ఇబ్బంది పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించడం లేదు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించాల్సిన కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా చోద్యం చూస్తున్నారు. ఈ ఏడాది నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తున్నా. దిగుబడి ఎకరానికి 41 క్వింటాళ్లు వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా రూ.1,700కి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. మద్దతు ధరకు కొనుగోలు చేస్తే నష్ట రాకుండా ఉంటుంది. – యర్రాకుల వీరాంజనేయ రాజు, వీరనాయకునిపాలెం, చేబ్రోలు మండలం సాక్షి ప్రతినిధి, గుంటూరు: బర్లీ పొగాకు, పత్తి పంటలు సాగు చేయవద్దు.. ప్రత్యామ్నాయంగా శనగ, మొక్కజొన్న సాగు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం చెప్పింది. ఆ మాటలు విని మొక్కజొన్న సాగు చేసిన రైతులను పట్టించుకునే వారే కరువయ్యారు. ఆటుపోట్లను తట్టుకుని పండించినా గిట్టుబాటు ధర లేక రైతులు విలవిల్లాడుతున్నారు. దళారులు అడిగిన కాడికి విక్రయించాల్సిన పరిస్థితి దాపురించింది. పెట్టుబడులు కూడా రాక, అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో చేతులెత్తేసింది. గుంటూరు జిల్లాలో ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారులు రూ.1,400 నుంచి రూ.1,700కే అడుగుతున్నారు. దిక్కులేని స్థితిలో నష్టపోవాల్సిన పరిస్థితి రైతులకు తప్పడం లేదు. ప్రభుత్వమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మొక్కజొన్న క్వింటాకు రూ.2,400 మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో చేయూతనిచ్చారు. దళారులు సైతం అంతకన్నా ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేయడంతో రైతులు లాభాలు గడించారు. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాల సహాయంతో మద్దతు ధర వచ్చేలా చూశారు. ఈ ఏడాది గుంటూరు జిల్లాలో 79,202.50 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఎకరాకు సుమారు రూ.60 వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. చంద్రబాబు సర్కారు పట్టించుకోకపోవడంతో రైతులు అప్పులపాలు కావాల్సిన పరిస్థితి నెలకొంది. కౌలు రైతులే అధికంగా ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మార్చి 16 నుంచి 25వ తేదీ వరకు రైతన్నా మీ కోసం అంటూ కార్యక్రమం నిర్వహించింది. మొక్కజొన్నకు ధర లేదని, మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో కొనుగోలు చేయాలని అన్ని గ్రామాల్లో రైతులు కోరారు. ఈ కార్యక్రమానికి కూటమి ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు. రైతులు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. కానీ నేటికీ ప్రయోజనం దక్కలేదు. తెలంగాణలో 2025–26 ఖరీఫ్ సీజన్తో పాటు రబీ సీజన్లో పండించిన మొక్కజొన్నలను అక్కడి ప్రభుత్వం మద్దతు ధర క్వింటా రూ.2,400 ప్రకారం కొనుగోలు చేస్తోంది. గుంటూరు జిల్లాలో మొక్కజొన్న రైతులు రూ.210 కోట్ల నుంచి రూ.270 కోట్లు నష్టపోయే పరిస్థితి ఉంది. తొమ్మిదిన్నర ఎకరాల్లో సాగు చేస్తున్నా. ఖరీఫ్లో వరి ధర పతనంతో తీవ్రంగా నష్టపోయా. ప్రస్తుతం మొక్కజొన్నకు ఎకరానికి 40 వేల వరకు పెట్టుబడి పెట్టా. క్వింటా రూ.1,650 మాత్రమే ఉంది. – మాతంగి ఆశీర్వాదం, శేకూరుపాలెం, చేబ్రోలు మండలం మంగళగిరి టౌన్ / పొన్నూరు/ గుంటూరు వెస్ట్: రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ శనివారం గుంటూరు కలెక్టరేట్ వద్ద ఉన్న ధర్నాచౌక్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ‘మొక్క జొన్న రైతు పోరాట దీక్ష ’ నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరులోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం దీక్షపై వివరాలను మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న రైతులు ధరలేక ఇబ్బందు పడుతున్నారని అన్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో విస్తృత స్ధాయిలో మొక్కజొన్న పండించారని పేర్కొన్నారు. కేవలం 1600 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని, మద్దతు ధర రూ. 2400 ఉందని, 800 తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని విమర్శించారు. ఈ నేపథ్యంలో గుంటూరు కలెక్టరేట్ వద్ద పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో ‘మొక్కజొన్న రైతు పోరాట దీక్ష ’ చేయనున్నట్లు తెలిపారు. పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని పేర్కొన్నారు. జిల్లాలోని జొన్న, మొక్కజొన్న రైతులు అన్ని నియోజకవర్గ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు విచ్చేసి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా ప్రభుత్వ దృష్టికి రైతుల ఇబ్బందులను తీసుకువెళ్లే ప్రయత్నానికి సహకరించాలని కోరారు. మద్దతు ధర అందించిన వైఎస్సార్సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ... గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులకు మద్దతు ధర కింద రూ. 2,400 ప్రకటించి నాలుగు సంవత్సరాలపాటు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచారని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ. 2,400లకు కొనుగోలు చేయాలని కోరుతూ ఈ దీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పొన్నూరు నియోజకవర్గంలో 40 వేల ఎకరాల్లో మొక్కజొన్న పండించారని అన్నారు. ఎమ్మెల్యే తమ సంగం సంస్థ పేరిట నిల్వ చేసి పశువులకు దాణాగా మార్చటంతో మరికొంత మారుబేరానికి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. గుంటూరులో నిర్వహిస్తున్న దీక్షకు జిల్లాలోని నియోజకవర్గ సమన్వయకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు పోతిన మహేష్, గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా, తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతున్న అంబటి రాంబాబు, మురళీకృష్ణ -
పరిశోధన విస్తరణ సలహా మండలి సమావేశం
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో శుక్రవారం కృష్ణ మండలం వ్యవసాయ పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశాన్ని నిర్వహించారు. – సమావేశంలో నూతన ఉపకులపతి డాక్టర్ పీవీ సత్యనారాయణ మాట్లాడుతూ విస్తరణ, పరిశోధన శాస్త్రవేత్తల కృషిని అభినందించారు. రైతుల సమస్యల పరిష్కారానికి వ్యవసాయశాఖ, విశ్వవిద్యాలయం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతు స్థాయిలో క్షేత్ర పరిశీలనలు, విత్తనోత్పత్తి చేపట్టాలన్నారు. 2026–27 సంవత్సరం వ్యవసాయ భవిష్యత్తు ప్రణాళిక రూపకల్పనకు అన్ని అనుబంధ శాఖలతో చర్చించి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ● పరిశోధన సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ వ్యవసాయంలో మితిమీరిన రసాయనాల వినియోగం తగ్గించాలన్నారు. ● విస్తరణ సంచాలకుడు డాక్టర్ జి.శివన్నారాయణ మాట్లాడుతూ వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని వివిధ విస్తరణ కార్యక్రమాలను రూపొందించాలన్నారు. ● పత్తిపంటలో గులాబి రంగు పురుగుల యాజమాన్యం, అపరాల పంటల్లో సమగ్ర యాజమాన్యం పద్ధతులు, వరిలో కలుపు యాజమాన్యం, పశుపెంపకం, వంటి ప్రచురణలను విడుదల చేశారు. వివిధ పంటల ప్రధాన శాస్త్రవేత్తలు పంటల్లో ఉత్తమ యాజమాన్య పద్ధతులు వివరించారు. కార్యక్రమంలో ఏపీఎస్సీఆర్ డైరెక్టర్ డాక్టర్ వై సతీష్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, మార్కాపురం జిల్లాల వ్యవసాయ అధికారులు, ఆర్ఈఏసీ సభ్యులు, అభ్యుదయ రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ స్టేడియానికి విద్యుత్తు సరఫరా బంద్
లక్ష్మీపురం: గుంటూరు నడిబోడ్డున ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో విద్యుత్ బిల్లు సకాలంలో చెల్లించక పోవడంతో అధికారులు రంగంలోకి దిగారు. బృందావన్ గార్డెన్స్లోని ఎన్టీఆర్ స్టేడియం, శ్యామలానగర్లో ఉన్న స్విమ్మింగ్ పూల్లో ఫ్యూజులు తీసేయడంతో క్రీడాకారులు తీవ్ర అసౌకర్యాన్ని గురయ్యారు. తొలి నుంచీ క్రీడాకారుల జీవితాలతో చంద్రబాబు సర్కార్ ఆటలాడుతోంది. శుక్రవారం విద్యుత్ శాఖ అధికారులు ఫ్యూజులు తీయడంతో సరఫరా నిలిచిపోయినట్లు సమాచారం. శ్యామలానగర్లోని ఎన్టీఆర్ స్విమ్మింగ్ పూల్లో సాయంత్రం ఇలా చేయడంతో క్రీడాకారులుగా సభ్యత్వం ఉన్న వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే స్విమ్మింగ్ పూల్కు సకాలంలో నీటి సరఫరా అందడం లేదు. ఇప్పటికే నంబర్ షిప్కు రూ.50వేల చొప్పున సుమారు రూ.2 కోట్లు ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఇంకో రెండు వందల మందికి సభ్యత్వాలు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వసతుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. -
ఖైదీ పరారీపై జైళ్ల శాఖ డీఐజీ విచారణ
రేపల్లె: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి నుంచి రిమాండ్ ఖైదీ భీముడు అజిత్కుమార్ పరారైన ఘటనపై జైళ్ల శాఖ ఉన్నతాధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ నిమిత్తం జైళ్ల శాఖ గుంటూరు రేంజ్ డీఐజీ వరప్రసాద్ శుక్రవారం రేపల్లె సబ్జైలును సందర్శించారు. ఈ సందర్భంగా డీఐజీ సబ్జైలులోని రికార్డులను, సీసీ టీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఇప్పటికే సస్పెండ్కు గురైన జైలు సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావుతో పాటు ఇతర సిబ్బందిని విడివిడిగా విచారించారు. పరారీ వెనుక ఎవరి పాత్ర ఉందనే కోణంలో ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఐజీ వరప్రసాద్ మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. గతంలోనే ఇతర జైలు నుంచి తప్పించుకున్న చరిత్ర ఉన్న అజిత్కుమార్ను రేపల్లె సబ్జైలుకు తీసుకురావడానికి నిబంధనలు అంగీకరించవన్నారు. అయినప్పటికీ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు అతనికి ఇక్కడ రిమాండ్ ప్రవేశం కల్పించడంపై విచారణ చేస్తున్నామన్నారు. ఖైదీ అజిత్కుమార్ అధికారులకు రూ. లక్షల్లో లంచం ఇచ్చాడన్న ఆరోపణలను అవాస్తవమన్నారు. అయితే విచారణలో కొంతమంది సిబ్బందికి కొంత మేర నగదు అందినట్లు ప్రాథమికంగా తేలిందని ధృవీకరించారు. ఈ వ్యవహారంపై జైలు సిబ్బంది, సూపరింటెండెంట్కు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, ఆర్థిక వ్యవహారాలను పూర్తిగా తనిఖీ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కేసులో బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
ఉపాధి హామీ కూలీలకు గరిష్ట వేతనం అందాలి
డ్వామా పీడీ సిద్ధ లింగమూర్తి నూజండ్ల: ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న ప్రతి కూలీకి ప్రభుత్వం నిర్దేశించిన గరిష్ట వేతనం అందేలా చర్యలు చేపట్టాలని అఽందుకు అధికారులు సూచనలు అందించాలని డ్వామా పీడీ సిద్ధ లింగమూర్తి ఆదేశించారు. మండల పరిధిలోని టి.అన్నవరం, తెల్లపాడు, పమిడిపాడు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి పనులను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. క్షేత్ర స్థాయిలో జరిగిన పనులను వాటి కొలతలు పరిశీలించారు. కూలీలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూలి వేతనం తక్కువగా వస్తుందని గరిష్టంగా అందేలా చూడాలని ఉపాధి కూలీలు ఆయనను కోరారు. గుంటూరు ఎడ్యుకేషన్ : ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మలి విడత ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఈనెల 25, 26, 27 తేదీల్లో విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలను విజయవంతం చేయాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ కె. నరసింహారావు పిలుపునిచ్చారు. శుక్రవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఫ్యాప్టో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈనెల 26న గుంటూరు జిల్లా నుంచి రిలే నిరాహార దీక్షకు జిల్లా ఫ్యాప్టో నాయకులు, కార్యకర్తలు, ఫ్యాప్టో పోరుబాటకు మద్దతిస్తున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనే విధంగా కృషి చేయాలని జిల్లా ఫ్యాప్టో కార్యవర్గం పిలుపునిచ్చింది. సమావేశంలో గుంటూరు జిల్లా ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ యు.రాజశేఖర్, జి.దాసు, ఫ్యాప్టో జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.కళాధర్, షేక్ బాజీ,ప్యాప్టో జిల్లా నాయకులు జి. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: ఓ యువతి సమయస్ఫూర్తితో అర్ధరాత్రి ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆటోడ్రైవర్ అసభ్య ప్రవర్తనకు పాల్పడుతుండగా పోలీసులకు సమాచారం అందించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ యువతిని పోలీసులు రక్షించారు. ఈ ఘటన మంగళగిరి మండలంలో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... పెదకాకాని మండలం నంబూరు గ్రామానికి చెందిన ఓ యువతి బాపట్లలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో నాల్గవ సంవత్సరం చదువుతోంది. ఇంటర్నషిప్ కోసం బెంగళూరు వెళ్లింది. తాను చదివే కళాశాలలో శుక్రవారం జరిగే పరీక్షకు హాజరయ్యేందుకు 23వ తేదీ ఉదయం బెంగళూరు నుంచి బస్సులో బయలుదేరింది. మధ్యాహ్నానికి కుప్పం చేరుకుంది. కుప్పం రైల్వేస్టేషన్లో విజయవాడకు వెళ్లే శాతవాహన రైలు ఎక్కి గురువారం అర్ధరాత్రి 12.30 గంటలకు విజయవాడ చేరుకుంది. రైల్వేస్టేషన్ నుంచి ఆటోలో బస్టాండ్కు చేరుకుంది. బస్సు కోసం ఎదురు చూడసాగింది. ఎంతసేపటికీ బస్సులు రాకపోవడంతో తన తండ్రికి ఫోన్ చేసింది. ఆరోగ్యం బాగోలేదంటూ కాజ టోల్గేటు వరకు వస్తే అక్కడ ఎదురు చూస్తానని తండ్రి చెప్పాడు. విజయవాడ బస్టాండ్లో ఓ ఆటో డ్రైవర్ యువతి వద్దకు వచ్చి ఎక్కడికి వెళ్లాలంటూ అడిగాడు. అవసరం లేదు.. బస్సులో వెళతానని యువతి బదులిచ్చింది. జాగ్రత్తగా తీసుకువెళతానంటూ ఆటో డ్రైవర్ యువతిని నమ్మబలికి ఆటో ఎక్కించాడు. విజయవాడ కనకదుర్గ వారధి దాటిన తరువాత ఆటోడ్రైవర్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. దీంతో యువతికి భయం వేసి ఫోన్లో శక్తి యాప్ను ఇస్టాల్ చేసుకుని వివరాలను యాప్ ద్వారా పోలీసులను అలర్ట్ చేసింది. ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించసాగాడు. పరిస్థితి ప్రమాదకరంగా మారుతోందని గమనించిన యువతి మధ్యమధ్యలో ఫోన్లు చేస్తూ ఉంది. పోలీస్ ఉన్నతాధికారుల నుంచి స్థానిక పోలీసులకు సమాచారం వచ్చింది. స్థానిక పోలీసులు యువతికి ఫోన్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉన్నారు. మంగళగిరి దాటిన తరువాత చినకాకాని సమీపంలో ఆటోను వేరే మార్గంలోకి మళ్లించే ప్రయత్నం చేశాడు. యువతి పెద్దగా కేకలు వేయడంతో డ్రైవర్ మధ్యమధ్యలో ఆపుతూ వెళ్లాడు. అప్పటికే యువతి లొకేషన్ తెలుసుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వస్తున్నారని గమనించిన ఆటో డ్రైవర్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఎస్ఐ వెంకట్ తన సిబ్బందితో ఆటోను వెంబడించి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. యువతిని సురక్షితంగా స్వస్థలానికి చేర్చారు. ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటో డ్రైవర్ తాడేపల్లి సీతానగరానికి చెందిన బోయిన ఫణీంద్రగా పోలీసులు గుర్తించారు. -
మే 1 నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు
డీఎస్డీఓ అఫ్రోజ్ ఖాన్ గుంటూరు వెస్ట్ (క్రీడలు): జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మే1వ తేదీ నుంచి 31 వరకు వివిధ క్రీడల్లో వేసవి శిక్షణనిస్తామని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఫ్రోజ్ ఖాన్ తెలిపారు. శుక్రవారం స్థానిక బీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరలు సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 18 మండలాల్లో 8నుంచి14 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలకు శిక్షణ ఏర్పాటు చేస్తున్నామన్నారు. శిబిరంలో ప్రతిభ కనబరచిన వారిని గుర్తించి క్రీడా హాస్టల్స్కు ఎంపిక చేస్తామన్నారు. వివరాలకు బీఆర్ స్టేడియంలో సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో స్టెప్ మేనేజర్ బి.రాధిక, మేనేజర్ సీహెచ్ కొండయ్య పాల్గొన్నారు. గుంటూరు లీగల్: జిల్లాలో కుటుంబ వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో న్యాయవ్యవస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఉన్న ఫ్యామిలీ కోర్టుకు తోడు, అదనంగా మరో కుటుంబ వివాదాల న్యాయస్థానం ఏర్పాటు చేశారు. నూతన కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఉదయం 10 గంటలకు గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రఘునందన్ రావు కోర్టును ప్రారంభించనున్నారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బి.కృష్ణమోహన్, జస్టిస్ వెంకటేశ్వర్లు నిమ్మగడ్డ, జస్టిస్ వడ్డిబోయిన సుజాత, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ కార్యక్రమానికి హాజరుకానున్నారు. గుంటూరు జిల్లా, సెషన్న్స్ జడ్జి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో, గుంటూరు బార్ అసోసియేషన్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏఎన్యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ ఆధ్వర్యంలో శనివారం యువ న్యాయవాదులకు డ్రాఫ్టింగ్, ప్లీడింగ్, కన్వేయన్సింగ్ వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు విభాగం హెడ్ ప్రొఫెసర్ ఎస్.విజయలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 10 గంటలకు న్యాయవిభాగంలో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్,కామర్స్ అండ్ లా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం సురేష్ అధ్యక్షత వహిస్తారన్నారు. కీనోట్ స్పీకర్ గా జిల్లా మాజీ జడ్జి జీవీ కృష్ణయ్య, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు డాక్టర్ బి. వెంకట రమణారెడ్డి, నర్రా శ్రీనివాసరావులు హాజరవుతారన్నారు. విద్యార్థులు, యువన్యాయవాదులు వారి అనుభవాన్ని, అమూల్యమైన వృత్తి సలహాలను సద్వినియోగం చేసుకోవాలని విభాగాధిపతి ప్రొఫెసర్ విజయలక్ష్మి కోరారు. నిర్కా డైరెక్టర్ డాక్టర్ శేషు మాధవ్ కొరిటెపాడు(గుంటూరు): రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ కమర్షియల్ అగ్రికల్చర్ (నిర్కా) ప్రధాన లక్ష్యమని ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ శేషుమాధవ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం మిర్చియార్డు ఎదుట ఉన్న నిర్కా(పూర్వ సీటీఆర్ఐ) ప్రాంగణంలో జిల్లాలోని గిరిజన రైతులకు సబ్ ప్లాన్ కింద నానో బయోటెక్ ఎరువులు, టార్పాలిన్ పట్టల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి నిర్కా గుంటూరు ఇన్చార్జి డాక్టర్ వి.వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ శేషుమాధవ్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో రైతులు ఎక్కువగా పొగాకు, పసుపు, మిర్చి వంటి వాణిజ్య పంటలను సాగు చేస్తుంటారని తెలిపారు. అయితే అధిక మోతాదులో ఎరువులు వినియోగిస్తోన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీని వల్ల మట్టిలో పోషకాలు లేక భూమి సారం కోల్పోతుందన్నారు. అందుకు ప్రత్యామ్నాయంగా ఈ నానో బయోటెక్ ఎరువులను తాము గిరిజన రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. వీటి వల్ల సూక్ష్మజీవులు బాగా పెరిగి పోషకాలు పుష్కలంగా అందడంతో పాటు, పంట ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. కార్యక్రమంలో నిర్కా శాస్త్రవేత్త జె.పూర్ణబిందు, టెక్నికల్ ఆఫీసర్ ఎంవీ జయకృష్ణ, సుబ్బారావు, బాపట్ల ఏసు, దీపక్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు మెడికల్: గుంటూరు మెడికల్ కాలేజీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయకుండా జాప్యం చేయడంపై ‘సాక్షి’ దినపత్రిక ఈనెల 15న ‘నో.. ఫిటికేషన్!’ శీర్షిన జిల్లా ఎడిషన్లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్వర్మ త్వరితగతిన గుంటూరు జీజీహెచ్, గోరంట్ల ప్రభుత్వ జ్వరాల ఆసుపత్రి, గుంటూరు వైద్య కళాశాలలో భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ను స్క్రూట్ని చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్టు విడుదల చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం గుంటూరు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారీ ప్రొవిజనల్ మెరిట్ లిస్టును విడుదల చేశారు. వైద్య కళాశాలలో గత ఏడాది సెప్టెంబరు 9న 61 పోస్టులకు కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం 858 దరఖాస్తులు వచ్చాయి. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారు ప్రొవిజనల్ మెరిట్ లిస్టును గుంటూరు మెడికల్ కాలేజ్ అధికారిక వెబ్సైట్లో, జిల్లా కలెక్టర్ కార్యాలయం వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. అభ్యంతరాలు ఉంటే నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారీ వెల్లడించారు. -
విజ్ఞాన్, ఇంటెల్ మధ్య అవగాహన ఒప్పందం
చేబ్రోలు: గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ, ప్రముఖ టెక్ దిగ్గజం బెంగళూరులోని ఇంటెల్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ల మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరిందని ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను ఇంటెల్ ఇండియా కంపెనీ ఆసియా పసిఫిక్ అండ్ జపాన్ రీజియన్ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ సలోని సింఘాల్కు వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పీఎంవీ రావు అందజేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జి వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్ మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో వేగంగా పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలకు అనుగుణంగా విద్యార్థులకు కృత్రిమ మేధస్సు (ఏఐ) నైపుణ్యాలను అందించడం ఈ అవగాహన ఒప్పందం ప్రధాన లక్ష్యమన్నారు. ఫ్యాకల్టీ, ట్రైనర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, విద్యార్థులకు కో–బ్రాండెడ్ సర్టిఫికెట్లు అందించడం, ఉపాధి అవకాశాలపై మార్గదర్శకత కల్పించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఇంటెల్ ఇండియా ఆసియా పసిఫిక్–జపాన్ రీజియన్ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ సలోని సింఘాల్ మాట్లాడుతూ, విజ్ఞాన్ యూనివర్సిటీతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందని, డిజిటల్ యుగానికి అనుగుణంగా విద్యార్థులను సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాల వైపు దారితీస్తూ, ముఖ్యంగా ఏఐ నైపుణ్యాలను అందించి వారిని భవిష్యత్తుకు సిద్ధం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఇంటెల్ ఇండియా రూపొందించిన కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన 601 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. అలాగే ‘ఏఐ స్మార్ట్ క్యాంపస్ హ్యాకథాన్’లో ప్రతిభ చాటిన విద్యార్థులకు నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఇంటెల్ ఇండియా నేషనల్ ఆపరేషన్స్ మేనేజర్ విక్రమ్ పర్మార్, విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య, రిజిస్ట్రార్ పీఎంవీ రావు, డీన్లు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. -
పల్నాడు
శనివారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026గజలక్ష్మీదేవి అలంకరణ పిడుగురాళ్ల: పట్టణంలోని జానపాడు రోడ్డులో ఉన్న వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవాలలో భాగంగా శుక్రవారం అమ్మవారు గజలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. నిమ్మకాయల ధరలు తెనాలి: మార్కెట్ యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3,500, గరిష్ట ధర రూ.9,000, మోడల్ ధర రూ.6,000 వరకు పలికింది. అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.5360 టీఎంసీలు. 7 -
అక్రమ మట్టి తవ్వకాలు నిలిపివేత
నాదెండ్ల: తూబాడు గ్రామంలో ‘టీడీపీ నేతల బరితెగింపు’ శీర్షికన శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన కథానానికి అధికారులు స్పందించారు. ఇన్చార్జి తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. సంఘటనా స్థలానికి చేరుకుని తవ్వకాలను నిలిపివేయించారు. ఈ నెల 13వ తేదీ నుంచి రక్షిత మంచినీటి చెరువు సర్వే నెం.402లో 38.58 సెంట్ల విస్తీర్ణంలో అక్రమ మట్టి తవ్వకం జరుగుతున్నట్లు గుర్తించారు. అదేవిధంగా గ్రామంలోని స్మశాన వాటిక స్థలంను కొందరు ఆక్రమించేందుకు యత్నిస్తున్నారంటూ ఈ నెల 20న కొందరు గ్రామస్తులు జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన గడిపూడి నాగేంద్రం స్థలంతో పాటు పక్కనే ఉన్న స్మశానవాటిక స్థలాన్ని కొంతమేర ఆక్రమించి చెరువు మట్టి తోలి చదును చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జిల్లా పంచాయతీరాజ్ అధికారి ఆదేశాల మేరకు స్మశానవాటిక ఆక్రమణబారిన పడకుండా చర్యలు తీసుకున్నారు. -
ఆంగ్రూ వీసీగా బాపట్ల పూర్వవిద్యార్థి
బాపట్ల టౌన్: ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం నూతన ఉప కులపతిగా బాపట్ల వ్యవసాయ కళాశాల 1983 బ్యాచ్ విద్యార్థి డాక్టర్ పాలడుగు వెంకట సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం ఏజీ విశ్వవిద్యాలయంలో కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి. ప్రసూనరాణి ఆధ్వర్యంలో అధ్యాపకులు సత్యనారాయణను శాలువాతో సత్కరించారు. ప్రసూనారాణి మాట్లాడుతూ బాపట్ల వ్యవసాయ కళాశాలలో 1983లో బీఎస్సీ చేరి, అంచలంచెలుగా ఎదిగి, పరిశోధన సంచాలకులు స్థాయికి సత్యనారాయణ చేరుకున్నారన్నారు. 40కిపైగా అధిక దిగుబడినిచ్చే వరి వంగడాలు రూపొందించి ఆంధ్ర రైస్ మాన్గా పేరు సాధించారని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు మొబైల్ వ్యాన్ గుంటూరు లీగల్: ప్రజలకు న్యాయ సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర న్యాయ సేవా సంస్థ అందజేసిన మొబైల్ లీగల్ అవేర్నెస్ వ్యాన్ను గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కోర్టు న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ పాల్గొన్నారు. ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ మొబైల్ వ్యాన్ ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో న్యాయ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. పేద, బలహీన వర్గాలకు న్యాయ సేవలు సులభంగా అందుబాటులోకి తీసుకువడానికి ఈ వ్యాన్ కీలకంగా మారనుందని తెలిపారు. ఐదు వెండి గంగాళాలు బహూకరణ పెదకాకాని: స్థానిక మల్లేశ్వరస్వామి వారి నిత్యాభిషేక సేవకు వినియోగించేందుకు 1.174 కిలోల తూకం కలిగిన ఐదు వెండి చిన్న గంగాళాలను చినకాకాని గ్రామానికి చెందిన రావెళ్ళ సత్యనారాయణ దంపతులు బహూకరించారు. వీటిని శుక్రవారం ఉప కమిషనరు గోగినేని లీలాకూమార్కు అందజేశారు. ఉచిత అన్నప్రసాద వితరణకు విశాఖపట్నానికి చెందిన ఎం.నారాయణ, శివపార్వతి దంపతులు రూ. 40 వేలు, గుంటూరుకు చెందిన చింతా రవీంద్రరెడ్డి, సునీత దంపతులు రూ.60 వేలు విరాళంగా అందించినట్లు ధర్మకర్తల మండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. దర్మకర్తల మండలి సభ్యుడు దూపాటి శివశంకరరావు సిబ్బంది పాల్గొన్నారు. దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ సాధారణం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగానే కనిపించింది. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు ఓ మోస్తరు రద్దీ కనిపించగా, సాయంత్రం ఆరు గంటల నుంచి సాధారణ భక్తుల తాకిడి కనిపించింది. మరో వైపున తెల్లవారుజామున అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చన, ఉదయం ఆలయంలో జరిగే లక్ష కుంకుమార్చన, చండీయాగం, శ్రీచక్ర నవార్చన వంటి ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. రద్దీ సమయాల్లో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేసి, శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉండటంతో మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత తిరిగి ప్రారంభించారు. -
పదోన్నతులపై పిల్లిమొగ్గలు
గుంటూరు మెడికల్: అంతా మా ఇష్టం... ఏది చేసినా అడిగెదెవ్వరు... అన్నట్లుగా గుంటూరు జీజీహెచ్ పరిపాలన అధికారులు వ్యవహరిస్తున్నారు. వారికి నచ్చక పదేళ్లుగా పోస్టు ఖాళీగా ఉన్నా ప్రమోషన్ ద్వారా భర్తీ చేయలేదు. ప్రమోషన్లు ఇస్తామని కిందిస్థాయి ఉద్యోగుల్లో ఆశలు రేకెత్తిస్తూ నోటిఫికేషన్లు ఇచ్చారు. ఏడాదిలోగా భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ గడువు ముగిసే వరకు సాగదీసి, మరోసారి నోటిఫికేషన్ ఇస్తామని పదోన్నతులు రాకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నారు. వారి పక్షపాత ధోరణితో సకాలంలో ప్రమోషన్లు రావటం లేదని పలువురు వాపోతున్నారు. ముచ్చటగా మూడోసారీ.. గుంటూరు జీజీహెచ్లో రికార్డు అసిస్టెంట్ పోస్టులు 2021 నుంచి రెండు ఖాళీగా ఉన్నాయి. కిందిస్థాయి ఉద్యోగుల్లో చాలా మంది అర్హులున్నారు. గతంలో రెండు సార్లు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. తాజాగా మళ్లీ నోటిఫికేస్ ఇచ్చారు. ఈ నెల 26లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ పోస్టులు ఐదుకుపైగానే ఖాళీగా ఉన్నాయి. కొన్నింటిని ఇక్కడి ఉద్యోగులకు ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాలి. పది సంవత్సరాలుగా అధికారులు తాత్సారం చేస్తున్నారు. దీనివల్ల పలు కిందిస్థాయి పోస్టులు రద్దయ్యాయి. కోర్టుకు వెళ్లిన వారికి మాత్రమే ప్రమోషన్లు ఇచ్చారు. మిగతావారు కూడా కోర్టును ఆశ్రయించారు. జిల్లా కలెక్టర్కు, ఉద్యోగుల స్పందన కార్యక్రమాల్లో సైతం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా పరిస్థితి మారలేదు. నాలుగో తరగతి ఉద్యోగుల ప్రమోషన్స్లో కోర్టుకెళితేనే పని అవుతుందన్నట్లు వ్యవహరిస్తున్నారు. వారికి మాత్రం ఓకే... గుంటూరు జీజీహెచ్, గుంటూరు మెడికల్ కాలేజ్ల అధికారులు సమన్వయంతో పనిచేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఆ దిశగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గతంలో జిల్లాలోనే పరిపాలన అధికారులుగా (ఏఓ)పనిచేసిన ఇరువురు నేడు జీజీహెచ్, వైద్య కళాశాల అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)లుగా ఉన్నారు. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్కు ఈనెల 13న అడిషనల్ డీఎంఈగా, వైద్య కళాశాల ప్రిన్సిపాల్కు 2024 అక్టోబర్లో అడిషనల్ డీఎంఈగా ప్రమోషన్ ఇచ్చారు. జిల్లా కలెక్టర్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ సీఎం సాయికాంత్వర్మ ఈ విషయంపై దృష్టి సారించి న్యాయం చేయాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు. -
దాచేపల్లిలో ఘర్షణ
వ్యక్తిని చితకబాదటంతో ఉద్రిక్తత దాచేపల్లి : భార్యాభర్తల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పల్నాడు జిల్లా దాచేపల్లిలోని శివాలయం వద్ద ఓ వ్యక్తిపై గురువారం రాత్రి పలువురు మూకుమ్మడిగా దాడికి పాల్పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో బాధితుడి తరఫున బంధువులు దాడి చేసిన వ్యక్తులపై ప్రతిదాడికి దిగారు. ఇరువర్గాలను చెదరగొడుతున్న సమయంలో దాచేపల్లి సీఐ రాజేష్కు స్వల్పగాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. దాచేపల్లిలోని శివాలయం సమీపంలో నివసిస్తున్న పఠాన్ రాజ్బుడే అనే వ్యక్తి మద్యంమత్తులో తన భార్య, కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతూ ఘర్షణ పడుతున్నాడు. రాజ్బుడే తననే దుర్భాషలాడుతున్నాడని ఇంటి పక్కనే ఉన్న జానీబేగం అనే మహిళ వాగ్వివాదానికి దిగింది. ఈ క్రమంలో రాజ్బుడే తనను దుర్భాషలాడుతున్నాడని పిడుగురాళ్లలో ఉన్న తన బంధువులకు ఆమె ఫోన్లో చెప్పింది. పిడుగురాళ్ల నుంచి కొంతమంది వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై దాచేపల్లి శివాలయం వద్దకు చేరుకుని రాజ్బుడేపై విచక్షరహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రాజ్బుడే తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో రాజ్బుడే బంధువులు, స్థానికులు దాడికి పాల్పడిన వ్యక్తులపై ప్రతిదాడికి దిగారు. ఇరువర్గాలు దాడులు చేసుకుంటున్న క్రమంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను చెదరగొడుతున్న క్రమంలో సీఐ రాజేష్కు కూడా స్వల్ప గాయాలయ్యాయి. దీంతో పోలీసులు లాఠీలతో ఇరువర్గాలను చెదరగొట్టారు. రాజ్బుడేపై దాడి చేసి పారిపొతున్న వారిలో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. తీవ్రంగా గాయపడిన రాజ్బుడేని వైద్యం కోసం తొలుత గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు పంపించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన రాజ్బుడే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ రాజేష్ చెప్పారు. -
నరసరావుపేట 13వ అదనపు జిల్లా జడ్జిగా రమేష్
నరసరావుపేట టౌన్ : నరసరావుపేట 13వ అదనపు జిల్లా కోర్టు న్యాయాధికారిగా ఎన్. రమేష్ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 17 మంది అదనపు జిల్లా జడ్జిలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో భాగంగా రమేష్ నరసరావుపేటకు బదిలీ అయ్యారు. ఇప్పటివరకు చిత్తూరు మొదటి అదనపు జిల్లా సెషన్స్ న్యాయ అధికారిగా రమేష్ విధులు నిర్వహించారు. మే 7వ తేదీలోగా న్యాయాధికారులు నూతన స్థానంలో బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వినుకొండ: రాష్ట్ర పురపాలక సంఘాల మొత్తంలో ఆస్తి పన్ను వసూళ్లలో వినుకొండ పురపాలక సంఘం 95 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్కుమార్, సీడీఎంఏ సంపత్కుమార్ చేతుల మీదుగా వినుకొండ పురపాలక సంఘం కమిషనర్ కె.శివరామ్ప్రసాద్ను బుధవారం విజయవాడలో జరిగిన వర్క్షాప్లో శాలువాతో, మెమోంటోతో ఘనంగా సత్కరించారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం గురువారం 526.00 అడుగులకు చేరింది. ఇది 160.4330 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 1,800 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 1,800 క్యూసెక్కులు విడుదల అవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 1,800 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
మార్కులు పెంచుకోండి
సీనియర్ ఇంటర్ విద్యార్థులకూ ఇంప్రూవ్మెంట్ పరీక్షకు అవకాశంసత్తెనపల్లి: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంటర్ బోర్డు శుభవార్త అందించింది. ఇంటర్ సెకండియర్ విద్యార్థులు సైతం మార్కులు పెంచుకునేందుకు ‘ఇంప్రూవ్మెంట్’ పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. సప్లిమెంటరీ పరీక్షలకు ఈనెల 27వ తేదీలోగా ఫెయిల్ అయిన విద్యార్థు లతో పాటు ఇంప్రూవ్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు జిల్లా అధికారులు సూచిస్తున్నారు. మే 21వ తేదీ నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మొదలుకానున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఫస్టియర్కు మాత్రమే... ఇంటర్మీడియెట్ బోర్డు చరిత్రలో ఇప్పటి వరకు ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు మాత్రమే ఇంప్రూవ్మెంట్కు అవకాశం ఉండేది. ఏటా మార్చి నెలలో జరిగే పబ్లిక్ పరీక్షల్లో తక్కువ మార్కులు సాధించిన పేపర్ల (సబ్జెక్టులు)కు ఇంప్రూవ్మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవడం, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ కి పరీక్ష ఫీజులు చెల్లించి, పరీక్షలకు హాజరు కావడం జరుగుతుంది.అయితే ఈ ఇంప్రూవ్మెంట్ విధానాన్ని ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు సైతం అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీచేసింది. మే నెల 21 నుంచి జరిగే ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో సీనియర్ ఇంటర్ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ఉత్తర్వులు వెలువరించింది. ఎక్కువ మార్కులకే ఫిక్స్... మార్చిలో జరిగిన ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఏదైనా సబ్జెక్టులో సాధించిన మార్కులు ... ఇంప్రూవ్మెంట్ పరీక్షల్లో సాధించిన మార్కులు, ఏవి ఎక్కువ అయితే వాటినే ఇంటర్ బోర్డు పరిగణనలోకి తీసుకోనుంది. అయితే ఇది కేవలం ఫీజులు దండుకునేందుకు వేసిన ఎత్తుగడ అని కొందరు విద్యార్థి సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి... జిల్లాలో మొత్తం 30,326 మంది ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 14,381 మంది పరీక్షలు రాయగా 11,114 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో కనీసం 4 వేల మంది వరకు ఇంప్రూవ్మెంట్కు దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు అంచనా వేస్తున్నారు. -
టీడీపీ నేతల బరితెగింపు
మాచవరం: మండలంలోని కొత్తపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న పార్వతి సమేత నీలకంఠేశ్వర స్వామి 21వ కల్యాణోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. స్వామి వారిని ఆలయ పూజారులు ప్రత్యేకంగా అలంకరించి కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామానికి చెందిన పలువురు దంపతులు పీటలపై కూర్చొని స్వామి వారి కల్యాణం వైభవంగా జరిపించారు. పలు గ్రామాల ప్రజలు స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామ పెద్దల సహకారంతో మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నాదెండ్ల: మండలంలోని తూబాడు గ్రామంలోని రక్షిత మంచినీటి చెరువులో కూటమి నేతలు అక్రమంగా మట్టి మైనింగ్ చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. అంతేకాక పక్కనే ఉన్న స్మశానవాటికలో కొంతభాగాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్నారు. ప్రభుత్వ అధికారుల అనుమతి లేకుండా గత కొద్దిరోజులుగా రెండు పొక్లయినర్లు, 40 ట్రాక్టర్లతో యథేఛ్ఛగా మట్టి తవ్వుతున్నారు. ఒక్కో ట్రాక్టర్ లోడుకు రూ.800ల వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. -
పాస్ పుస్తకాల జారీకి వేగవంతమైన చర్యలు
గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ గుంటూరు వెస్ట్: సర్వే పూర్తయిన రెండు గ్రామాల్లో పట్టాదార్ పాసుపుస్తకాల జారీకి సంబంధించి ఈ–కేవైసీ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి సీసీఎల్ఏ గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేసి, ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్న్స్లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజావలి, జడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు, జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ వెంకట రత్నం, గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్ కె.కళ్యాణ చక్రవర్తి, అధికారులు పాల్గొన్నారు. విజయ పతాకం ఎగురవేయాలి.. పారా సిట్టింగ్ క్రికెట్లో గుంటూరు జిల్లా నుంచి టీమ్ జాతీయ జట్టుకు ఎంపికై న కంఠ ఈశ్వరరావు, షేక్ నాగూర్ వల్లి, బండపల్లి మహేష్, బండారు దుర్గారావులను జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ గురువారం స్థానిక కలెక్టరేట్లో అభినందించారు. టీమ్ ఇండియాకు ఎంపికై న అభ్యర్థులు గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కు మర్యాదపూర్వకంగా కలిసారు. విజయ పతాకతో తిరిగిరావాలని జిల్లా కలెక్టర్ ఆకాక్షించారు. కఠోర పరిశ్రమకు మారుపేరు భగీరథ మహర్షి.. కఠోర పరిశ్రమకు మారుపేరు భగీరథ మహర్షి అని జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ కొనియాడారు. భగీరథ మహర్షి జయంతి వేడుకలు గురువారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డీఆర్ఓ ఎన్.ఎస్.కె.ఖాజావలి బి.సి సంఘాల నాయకులతో కలిసి భగీరథ మహర్షి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కె.మయూరి, బీసీ సంఘాల నాయకులు వేములకొండ శ్రీనివాస్, జంపని నాగేశ్వర రావు, షేక్ షూకుర్, రాజకొండ నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు వేగవంతం కావాలి.. అభివృద్ధి పనులు వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో గురువారం వీడియో సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా అన్ని శాఖలు పనిచేయాలని స్పష్టం చేశారు. శాఖల మధ్య సమన్వయం అవసరమన్నారు. రహదారులు, గృహ నిర్మాణం వంటి పనులు ప్రజలకు ఎంతో అవసరమని వాటి పట్ల దృష్టి సారించి త్వరితగతిన పూర్తి అయ్యేటట్లుగా అధికారులు శ్రద్ధ వహించాలన్నారు. జిల్లాలో మంజూరైన రహదారులు వాటి పరిస్థితుల వివరాలను పరిశీలించి తక్షణం పనులు పూర్తి చేసేందుకు అవకాశం ఉన్న వాటిని అతివేగంగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో పలుశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
దేశం గర్వించేలా క్రీడల్లో ఎదగాలి
మంగళగిరి టౌన్: దేశం గర్వించేలా క్రీడల్లో ఎదగాలని ఇందుకోసం పట్టుదలతో కూడిన సాధన ఎంతో అవసరమని అంతర్జాతీయ మహిళా రెజ్లర్, రియో ఒలంపిక్స్ పతక విజేత సాక్షి మాలిక్ సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో గురువారం ఉద్గమ్ 2026 పేరిట జాతీయ స్థాయి క్రీడోత్సవాలను సాక్షి మాలిక్ ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. తాను 12వ ఏట నుంచి రెజ్లింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టానని, ఎప్పటికై నా ఒలంపిక్స్లో పతకం సాధించాలని కోరిక ఉండేదని వెల్లడించారు. 2016 రియో ఒలింపిక్స్లో ఆ కోరిక నెరవేరిందని, భారత జాతీయ పతాకం అంతర్జాతీయ క్రీడావేదికపై ఎగురుతుంటే కలిగే ఆనందం వర్ణించలేనిదన్నారు. ఎంచుకున్న క్రీడారంగంలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని కఠోర శ్రమ, సాధనతో దానిని అధిగమించాలని క్రీడాకారులకు సూచించారు. వర్సిటీ వైస్ చాన్స్లర్ ఆచార్య సతీష్కుమార్ మాట్లాడుతూ ఎస్ఆర్ఎంలో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని, విద్యార్థులు చదువులతో పాటు క్రీడా రంగంలో రాణించాలన్నారు. వర్శిటీ క్రీడాకారులు ఆదిత్య, అనామిక, ముబాసినాలకు వర్శిటీ తరఫున రూ. 20 లక్షల ప్రోత్సాహక పారితోషికాన్ని అందజేశారు. వీరు ఇటీవల జరిగిన ఆలిండియా ఇంటర్ యూనివర్శిటీ అథ్లెటిక్స్ పోటీల్లో బంగారు పతకాలు కై వసం చేసుకున్నారని పేర్కొన్నారు. అనంతరం సాక్షి మాలిక్, గౌరవ అతిథిగా హాజరైన అర్జున్ అవార్డు గ్రహీత సత్యవ్రత్లను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను ప్రదానం చేశారు. వర్శిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వినాయక్, అసోసియేట్ డైరెక్టర్ సుస్మితా సింగ్, వర్శిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఒలింపిక్స్ పతక విజేత సాక్షి మాలిక్ -
బాధ్యతలు స్వీకరించిన సూర్యసాయి ప్రవీణ్ చంద్
తాడికొండ: సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ (ఫుల్ అడిషనల్ చార్జి)గా జి.సూర్యసాయి ప్రవీణ్ చంద్ గురువారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. రాయపూడిలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం 1వ ఫ్లోర్లోని తన చాంబర్లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఆయనకు కమ్యూనికేషన్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జి.రామరాజు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రవీణ్ చంద్కు సీఆర్డీఏ కమిషనర్ వి.విజయ రామరాజు, అడిషనల్ కమిషనర్లు ఎ.భార్గవ తేజ, కొల్లాబత్తుల కార్తీక్, ఆఫీస్ మేనేజ్మెంట్ డైరెక్టర్ వల్లభనేని శ్రీనివాసరావు, ఐటీ విభాగ డైరెక్టర్ బి.మల్లికార్జున రెడ్డి, ఇతర ముఖ్య అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. పొన్నూరు: స్వర్ణపురి పట్టణంలో వేంచేసియున్న సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత సాక్షి భావనారాయణ స్వామివారి బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమాలను ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి ప్రతినిధులు శిఖాకొల్లి గురునాథరావు, కాట్రగడ్డ రామచంద్రరావు, గుడివాడ పవన్, ధరణికోట పద్మావతి, ఆకురాతి అనూరాధ, ఊటుకూరి బాజీ శిరీష, కూరాకుల సత్యనారాయణ, సింహాద్రి వెంకటలక్ష్మి, పరాశరం రంగవల్లి, పొన్నూరు బాలగంగాధర తిలక్ తదితరులు పర్యవేక్షించారు. నకరికల్లు: మండలంలోని అడ్డరోడ్డు గ్రామంలో వేంచేసి ఉన్న అభయాంజనేయ స్వామి వార్షిక తిరునాళ్ల గురువారం కనుల పండువగా జరిగింది. ధర్మకర్త కాళంగి వెంకట నర్సింహారావు, అర్చకులు వినుకొండ కొండమాచార్యులు ఆధ్వర్యంలో 25వ వార్షిక వేడుకలు ఘనంగా జరిపించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ స్వామి వారికి లక్ష తమల పాకులతో అర్చన చేశారు. స్వామి వారిని విశేషంగా అలంకరించారు. పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాత్రికి స్వామి వారి గ్రామోత్సవం జరిగింది. గుంటూరు రూరల్: నల్లపాడు, చల్లావారిపాలెం గ్రామాల ఆరాధ్యదైవం సీతారామాంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవాన్ని గురువారం కనుల పండువగా నిర్వహించారు. రెండు గ్రామాల ప్రజలు, భవనం కొండారెడ్డి సహాయ సహకారాలతో నిర్వహించిన ఉత్సవాల్లో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకాలు, హోమాలను నిర్వహించారు. స్వామి వారి తీర్థ ప్రసాదం మహా అన్నదాన కార్యక్రమాన్ని మండలం ఎంపీపీ ఇంటూరి పద్మావతి అంజిరెడ్డి ప్రారంభించారు. 20 వేల మందికిపైగా భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. -
ష్.. నిధులు నిశ ్శబ్దం
యడ్లపాడు: విజ్ఞాన గనిగా నిలిచే గ్రంథాలయాలు నేడు వెలుగు తగ్గిన ప్రమిదల్లా కునారిల్లుతున్నాయి. సాంకేతిక విప్లవం నేపథ్యంలో సైతం గ్రంథ పరిమళాన్ని ఆస్వాదిస్తూ విజ్ఞానాన్ని సముపార్జించే పాఠకుల సంఖ్య మాత్రం తగ్గలేదు. ఆ పాఠకులకు కనీస సౌకర్యాలు కల్పించలేని, దినపత్రికల బిల్లులు కూడా చెల్లించలేని దయనీయ స్థితిలోకి వ్యవస్థ జారిపోవడం అక్షర సేద్యంపై పాలకులకున్న చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది. ప్రజల నుంచి వసూలు చేసే ఆస్తి పన్నులో 8 శాతం గ్రంథాలయాల నిర్వహణకు ‘సెస్’ (పన్ను) రూపంలో చెల్లించాల్సి ఉండగా, ఆ నిధులు సకాలంలో గ్రంథాలయ సంస్థలకు చేరడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పేరుకుపోయిన రూ. 64.34 కోట్ల బకాయిలే ఈ వ్యవస్థ నిర్వీర్యానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. పైసా విదల్చని పురపాలికలు.. ప్రతి నియోజకవర్గానికి ఒక మోడల్ గ్రంథాలయం ఏర్పాటు చేస్తామన్న వాగ్దానం స్వాగతించదగ్గదే అయినా, క్షేత్రస్థాయిలో ఉన్న వేల కోట్ల బకాయిలను వసూలు చేయడంలో చూపుతున్న జాప్యం ఆశయాలకు ఆటంకంగా మారుతోంది. ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఈ పెండింగ్ నిధులను రాబట్టకపోతే, గ్రంథాలయాలు కేవలం నామమాత్రపు భవనాలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. -
న్యూట్రీ గార్డెన్ల అభివృద్ధికి యాక్షన్ ప్లాన్
జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా నరసరావు పేట: జిల్లాలో పెద్ద ఎత్తున న్యూట్రీ గార్డెన్ల అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో న్యూట్రీ గార్డెన్ల అభివృద్ధిపై గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయ విధానంతో న్యూట్రీ గార్డెన్లను అభివృద్ధి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక, సామూహిక ఆరోగ్య కేంద్రాల్లో న్యూట్రీ గార్డెన్లను అభివృద్ధి చేయాలన్నారు. ఈ నెలాఖరు నాటికి న్యూట్రీ గార్డెన్ల సాగుకు అనువుగా నేలలను తయారు చేసుకోవాలన్నారు. మే నెల మొదటి బుధవారం రోజున జిల్లావ్యాప్తంగా న్యూట్రీ గార్డెన్లను ప్రారంభించేందుకు సమాయత్తం అవ్వాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో కిచెన్ గార్డెన్లు, పట్టణ ప్రాంతాల్లో మిద్దె తోటల కోసం విత్తన పంపిణీ చేపట్టాలన్నారు. మండలానికి ఒకటి చొప్పున కమ్యూనిటీ న్యూట్రీ గార్డెన్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. గార్డెన్లు లాభసాటి వ్యాపారంలా మలుచుకునేలా స్వయం సహాయక సంఘాల మహిళలకు, కమ్యూనిటీ గార్డెన్ నిర్వాహకులకు ప్రత్యేక శిక్షణ అందచేయాలన్నారు. కలెక్టరేట్ లో కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ప్రయోగాత్మకంగా న్యూట్రీ గార్డెన్లను అభివృద్ధి చేసి సందర్శకులకు అందుబాటులో ఉంచాలన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాధవి, అమల కుమారి, డ్వామా పీడీ సిద్ధ లింగమూర్తి, డీఎంహెచ్ఓ రవి, ఐసీడీఎస్ పీడీ ఉమాదేవి, డీఆర్డీఏ పీడీ ఝాన్సీ రాణి తదితరులు పాల్గొన్నారు. -
ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్లు
నగరంపాలెం: ఐపీఎల్కి సంబంధించి క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడే 15 మందిని లాలాపేట, పాతగుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.2 లక్షలు, 13 సెల్ఫోన్లను సీజ్ చేశారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో కేసుల వివరాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ముందస్తు సమాచారంతో బుధవారం రాత్రి ఏటుకూర్రోడ్డు చాకలిగుంట ఒకటో వీధిలోని ఓ ఇంట్లో లాలాపేట పోలీసులు తనిఖీలు చేపట్టారు. మొబైల్ఫోన్లతో గ్రూప్లుగా క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్నారని గుర్తించి, 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ బెట్టింగ్లో ఇస్లావత్ జయరామ్నాయక్ నిర్వాహాకుడు అని విచారణలో వెల్లడైందన్నారు. ఆన్లైన్ వెబ్సైట్లో లాగినై, అనంతరం మిగతా బెట్టింగ్ రాయుళ్లకు లాగిన్ సృష్టించి, ఇచ్చేవాడని చెప్పారు. వారిలో ఇస్లావత్ జయరామ్నాయక్, గుమనంపాటి రామారావు, తోట గీతవెంకటగోపీనాథ్, షేక్.చిన్న జిన్నాసాహెబ్, పాలపర్తి గోపికృష్ణ, నేలకుర్తి నాగయ్య, భోగ్యం హనుమంతురావు, షేక్.షుకుర్, షేక్.నాగుల్మీరా, కుటాల వెంకట్, దార్ల కోటేశ్వరరావును అరెస్ట్ చేసి, పది సెల్ఫోన్లు, రూ.1.25 లక్షలు సీజ్ చేశామని చెప్పారు. అలాగే నందివెలుగురోడ్లో గురువారం చిన్నారి కిళ్లీ దుకాణంలో పాతగుంటూరు పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో షేక్.రియాజ్, సుర చిన్నకేశవులు అలియాస్ చిన్నారి, తుమ్మూరు రవీంద్రనాధ్కుమార్రెడ్డి అలియాస్ రవి, బల్ల వెంకటేశ్వరరెడ్డిలను అరెస్ట్ చేసి, రూ.75 వేలు, మూడు సెల్ఫోన్లు, ఒక బుక్ స్వాధీనం చేసుకున్నారని అన్నారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లకు సంబంధించి ఓవర్కు ఎన్ని పరుగులు తీస్తారనే అంశాలపై ఫ్యాన్సీ బెట్టింగ్లు నిర్వహించేవారని అన్నారు. విద్యానగర్లో ఉంటున్న రియాజ్ బెట్టింగ్ నిర్వహకుడని, అతని ద్వారా చిన్నకేశవులు, రవీంద్రనాధ్, బల్ల వెంకటేశ్వరరెడ్డిలు బెట్టింగ్లు వేస్తారని చెప్పారు. ఈ కేసులు చేధించిన తూర్పు డీఎస్పీ షేక్. అబ్దుల్అజీజ్, సీఐలు ఏవీ.శివప్రసాద్ (లాలాపేట పీఎస్), కె.వెంకటప్రసాద్ (పాతగుంటూరు పీఎస్), ఎస్ఐలు షేక్.హసీం, అబ్దుల్రెహమాన్, కానిస్టేబుళ్లు కిరణ్కుమార్, పి.శంకర్, షేక్.మీరావలి, కె.బాబురావు, జిల్లా టాస్క్ఫోర్స్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి, ప్రశంస పత్రాలు అందించారు. 15 మంది అరెస్ట్ -
పోరాడుదాం.. నారీశక్తిని చాటుదాం
పెడన: సమస్యలపై ప్రజాపోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని, చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరించడానికి వైఎస్సార్ సీపీలోని ప్రతి మహిళా కూడా ఒక ఆదిపరాశక్తిగా మారాలని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి పిలుపునిచ్చారు. బుధవారం కృష్ణాజిల్లా పెడనలో ఐదు జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్, ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక అధ్యక్షతన వైఎస్సార్ సీపీ మహిళల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతినిధులు, ఆయా విభాగాలకు చెందిన మహిళా నాయకులు తొలుత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జగనన్నను సీఎం చేయడమే లక్ష్యం.. సభను ఉద్దేశించి వరుదు కల్యాణి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో వైఎస్సార్సీపీని బలోపేతం చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. అందరి ఆలోచనలు, సూచనలు, సలహాలు తీసుకుని, రానున్నకాలంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా ముందుకు అడుగులు వేద్దామన్నారు. జగనన్న మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ఎంత చక్కటి పరిపాలన అందించారో స్వయంగా చూశామన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా ఎవరిపై ఆధారపడకుండా ఇచ్చిన ప్రతి పథకం కూడా మహిళల పేరు మీద ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చేస్తున్న అరాచాకాలపై ఒక చిరుతపులిలా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబుది రెండు నాల్కల ధోరణి.. మహిళలపై చంద్రబాబుకు చిన్నచూపని, అందుకు నిదర్శనం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా బిల్లు విషయంలో చంద్రబాబునాయుడు రెండు నాలుకల ధోరణియేనని వరుదు కల్యాణి దుయ్యబట్టారు. మహిళా బిల్లును వ్యతిరేకించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో టీడీపీ ఎంపీలు విందులు, వినోదాల్లో పాల్గొనడం గమనిస్తే మహిళా బిల్లును వ్యతిరేకించారనే విషయం తేటతెల్లమవుతుందన్నారు. మావిగన్ ప్రతిపాదన అద్భుతం.. మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ప్రాంతాలను అనుసంధానిస్తూ పోర్టు, విమానాశ్రయం, పరిశ్రమలున్న ప్రాంతాలను అనుసంధానం చేస్తూ మావిగన్ను రాజధానిగా చేస్తే బాగుంటుందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రతిపాదన బ్రహ్మాండంగా ఉందనే విషయాన్ని ప్రజలు గుర్తించారని వరుదు కల్యాణి అన్నారు. అమరావతి వెనుక అవినీతి నెలకొందనే విషయాన్ని ప్రశ్నిస్తున్నందుకు డైవర్స్ పొలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో కృష్ణాజిల్లా మహిళా అధ్యక్షురాలు, మాజీ మేయర్ శీలం భారతి, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర మహిళా సెక్రటరీ పేరం త్రివేణిరెడ్డి, స్టేట్ మహిళా విభాగం సమాచార విభాగం అధ్యక్షురాలు సంపత్తి విజిత, మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ కందుకూరి జ్యోతి, జాయింట్ సెక్రటరీ మునుపురి హరీష్య, గుంటూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు బూరెల్లా నాంచారమ్మ, బాపట్ల జిల్లా మహిళా అధ్యక్షురాలు అశ్వినిరెడ్డి, గన్నవరం జెడ్పీటీసీ అన్నవరపు ఎలిజబెత్ రాణి, చీరాల నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు మద్దులూరి సీతామాలక్ష్మి, పల్నాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు డాక్టర్ పి. గీతా హాసంతి, పెడన నియోజకవర్గ నాయకురాలు మైలా రత్నకుమారి, రాజులపాటి వాణి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ గీతా హాసంతికి సత్కారం సత్తెనపల్లి: వైఎస్సార్ సీపీ మహిళా విభాగం పల్నాడు జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ గీతా హాసంతికి అరుదైన సత్కారం లభించింది. పెడన నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన వైఎస్సార్ సీపీ మహిళా సదస్సులో రాష్ట్రంలోని మహిళా అధ్యక్షులను సత్కరించారు. ఇందులో భాగంగా పల్నాడు జిల్లా అధ్యక్షురాలైన డాక్టర్ గీతా హాసంతిని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల హారిక , మహిళా నాయకులు కలిసి ఆమెను పూలమాలలు, దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. -
గౌరవ వేతనం ఇచ్చేస్తా.. టాయిలెట్లు నిర్మించండి
జెడ్పీ సమావేశంలో అచ్చంపేట జెడ్పీటీసీ విజయప్రతాప్రెడ్డి అచ్చంపేట: మండల కేంద్రమైన అచ్చంపేటలో పబ్లిక్ టాయిలెట్స్ లేక 30 గ్రామానుంచి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తన 5 సంవత్సరాల గౌరవ వేతనం ఉదారంగా ఇస్తానని.. వాటితో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలని అచ్చంపేట మండల జెడ్పీటీసీ సభ్యుడు తుమ్మా విజయప్రతాప్రెడ్డి కోరారు. గుంటూరు జెడ్పీ సమావేశపు హాలులో బుధవారం జరిగిన సాధారణ సమావేశంలో ఆయన మాట్లాడారు. తనకు గౌరవవేతనంగా నెలకు రూ.6వేలు ఇస్తున్నారని, 5 సంవత్సరాల గౌరవవేతనంగా యేడాదికి రూ.72వేలు చొప్పున 5 సంవత్సరాలకు వచ్చే రూ.3.36లక్షలను అచ్చంపేటలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించేందుకు ఉదారంగా ఇస్తానని జెడ్పీటీసీ చెప్పారు. అచ్చంపేటలో 30 గ్రామాలకు కలిపి ఒక్కటే పీహెచ్సీ ఉందని, దూర గ్రామాలనుంచి వైద్యంకోసం రావాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వాస్తవానికి మాదిపాడులో రెండో పీహెచ్సీ మంజూరై అందులో సిబ్బంది కూడా మంజూరు అయినప్పటికీ పీహెచ్సీ భవనం లేకపోవడంతో అక్కడ పనిచేయాల్సిన సిబ్బంది కూడా అచ్చంపేటలోని పనిచేస్తున్నారన్నారు. వైద్యశాలకు పక్కా భవనం నిర్మించేంతవరకు తాడువాయి – మాదిపాడు మధ్యలో ఒక తాత్కాలిక భవనాన్ని అద్దెకు తీసుకుని పీహెచ్సీని నడపాలన్నారు. అలాట్ అయిన వైద్యసిబ్బందిని అక్కడకు తరలించాలని సమావేశంలో కోరారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జగ్గారావు సత్తెనపల్లి: అంతర్జాతీయ పరిణామాల (ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం) నేపథ్యంలో ఎరువుల కొరతపై అపోహలతో రైతులు ఆందోళన చెందవద్దని, జిల్లాలోని ఎరువులు దుకాణాల్లో ఎరువులు సమృద్ధిగా ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం. జగ్గారావు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని పలు ఎరువుల దుకాణాల్లో బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జగ్గారావు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఎరువుల నిల్వలను స్థానిక వ్యవసాయ శాఖ అధికారి అమ్మకాలు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. రైతులు ఎవరికై నా ప్రస్తుతం సాగు చేస్తున్నటువంటి పంట లకు ఎరువుల అవసరమైతే స్థానిక వ్యవసాయ అధికారి అనుమతితో డీలర్లు ఎరువులు అమ్మకాలు జరపాలన్నారు. మండల వ్యవసాయ అధికారి అనుమతి లేకుండా ఎవరైనా రైతులకు ఎరువుల అమ్మకాలు జరిపిన యెడల అటువంటి డీలర్ల పై నిత్యావసర వస్తువుల చట్టం (ఇసీ చట్టం) 1955 ప్రకారం శాఖా పరమైన కఠిన చర్యలు తీసుకోబడతాయన్నారు. ముందుగా ఎరువుల దుకాణాల్లోని భౌతిక నిల్వలు, అమ్మకాలు పరిశీలించారు. ఆయనతోపాటు సత్తెనపల్లి సహాయ వ్యవసాయ సంచాల కులు బి.రవిబాబు, సత్తెనపల్లి మండల వ్యవసాయ అధికారి బి. సుబ్బారెడ్డి, తదితరులు ఉన్నారు. మాచర్ల: పట్టణ పోలీసు స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేస్తూ అనేకమందిపై లైంగిక వేధింపులకు పాల్పడి వీడియోలు తీయించి సస్పెండ్ అయిన ఏఎస్ఐ శ్రీనివాస్ తరఫున పనిచేసిన ఆటో డ్రైవర్ రాం సైదులును పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. ఈ సందర్భంగా సైదులు తనకు ఏఎస్ఐ శ్రీనివాస్లు డబ్బులు ఇచ్చి, ప్రతి రోజూ హైవేపై తీసుకెళ్ళి తిప్పాడని చెప్పినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎవరిని పట్టుకున్నా వీడియోలు తీయాలని చెప్పి ఆ తరువాత ఆయన సెల్ఫోన్ లోకి ఎక్కించుకొని లైంగిక వేధింపులకు పాల్పడేవాడని ఒప్పుకొన్నట్లు సమాచారం. ఇదంతా డబ్బులు కోసమే చేశానని సైదులు ఒప్పుకున్నాడని, పోలీసులు విచారణ చేసి నిందితుడి సెలఫోన్ను స్వాధీనం చేసుకొని ఆటోను సీజ్ చేశారు. పోలీసులను వివరణ అడిగేందుకు ప్రయత్నించగా స్పందించలేదు. మాచర్ల రూరల్: కుటుంబ కలహాల నేపథ్యంలో విద్యార్థి పురుగుమందు తాగి మృతి చెందిన సంఘటన మండలంలోని తాళ్లపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఎల్లాల వెంకటేశ్వర్లు (22) పట్టణంలోని ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తల్లి చిన్నతనంలో మృతిచెందగా, తండ్రి గోవిందు ఉన్నాడు. ఇంట్లో ఏర్పడిన చిన్న వివాదంతో గడ్డి మందు తాగి తండ్రితో చెప్పాడు. వెంటనే మాచర్ల ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్కి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు విజయపురిసౌత్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
డ్రగ్స్, గంజాయి అరికట్టాలి
నరసరావుపేట: డ్రగ్స్, గంజాయి అరికట్టడంలో అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పని చేయాలని, జిల్లాను డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో మాదక ద్రవ్యాలు, గంజాయి నియంత్రణ చర్యలు – అవగాహన కార్యక్రమాల సమీక్షకు సంబంధించి ఎన్సీఓఆర్డీ (నార్కో కోఆర్డినేషన్ సెంటర్) జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావుతో కలిసి నిర్వహించారు. ప్రమాద రహిత జిల్లాగా .. నరసరావుపేట: పల్నాడును రహదారి ప్రమాద రహిత జిల్లాగా చేయటమే తమ ముందున్న లక్ష్యమని, అందుకు అవసరమైన ప్రణాళికలు, ముందస్తు చర్యలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి రహదారి భద్రత కమిటీ సమీక్ష సమావేశం కమిటీ సెక్రటరీ అయిన రవాణాశాఖ అధికారి జి.సంజీవకుమార్ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ ప్రమాదం జరిగిన అక్కడ బ్లాక్ స్పాట్స్ గుర్తించి మరోసారి అక్కడ జరగకుండా లాక్ బోర్డులను ఏర్పాటు చేయించాలని అన్నారు. జిల్లా రవాణా శాఖ అధికారి సంజీవకుమార్, జిల్లా రోడ్డు ప్రమాదాల గణాంకాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేయగా, పోలీస్ శాఖ నుంచి జిల్లా ఎస్పీ కృష్ణారావు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రధాన మంత్రి రహత్ పథకం వాల్పోస్టర్ ఆవిష్కరించారు. ఎకై ్సజ్ ఈఎస్ మణికంఠ, ఆర్డీఓ కె.బాలకృష్ణ, రోడ్డుసేఫ్టీ ఎన్జీఓ కన్వీనర్ దుర్గా కుమారి, ఎంవీఐ మల్లేశ్వరరావు అధికారులు పాల్గొన్నారు. మలేరియా వ్యాప్తి నివారణకు కృషి చేయాలి నరసరావుపేట: మంచినీటిలో పెరిగే ఎనాఫిలిస్ దోమ ఇళ్ల పరిసరాలలో నిల్వ ఉన్న నీటిలో పెరిగి కుట్టడం వల్ల మలేరియా వ్యాపిస్తుందని, ప్రతి ఒక్కరూ దోమతెరలు వాడుతూ నీటి నిల్వలు లేకుండా చూడాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ నజీర్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ఈనెల 25 నుంచి నిర్వహించే ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్యానర్, వాల్పోస్టర్, కరపత్రాలను కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్ల ఆవిష్కరించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ పద్మావతి, అసిస్టెంట్ మలేరియా అధికారి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, హెల్త్ సూపర్వైజర్ చంద్రశేఖర్ రెడ్డి, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొని యువకుడు మృతి
పిడుగురాళ్ల: స్నేహితుడి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించేందుకు డబ్బుల కోసం వెళ్లి వస్తూ ప్రమాదవశాత్తు యువకుడు మృతి చెందగా మరో యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన పట్టణంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి మీద చోటు చేసుకుంది. వివరాల ప్రకారం...పిడుగురాళ్లకు చెందిన హసనెన్, అల్లాబడేలు ద్విచక్ర వాహనంపై కొండమోడులోని వీరమ్మ కాలనీలోని అల్లాబడే నాయనమ్మ ఇంటికి స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా డబ్బులు తీసుకొనివచ్చేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా పిడుగురాళ్ల రైల్వే ఓవర్ బ్రిడ్జి మీద విద్యుత్ పోల్కు తగిలి షేక్ హసనెన్(19) అక్కడిక్కడే మృతి చెందగా అల్లాబడేకి తీవ్ర గాయాలయ్యాయి. పట్టణంలోని ఓప్రైవేటు వైద్యశాలలో చికిత్స నిర్వహించి మెరుగైన చికిత్స కోసం నర్సరావుపేట తరలించారు. పట్టణ ఎస్ఐ శివనాగరాజు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎల్నినో ప్రభావాన్ని అధిగమించవచ్చు
డీపీఎం అమలకుమారినరసరావుపేటరూరల్: ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది కరవు పరిస్థితులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, దీనికి ప్రత్యామ్నాయంగా రైతులు ప్రకృతి వ్యవసాయ సాగు చేపట్టాలని జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.అమలకుమారి తెలిపారు. రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్లో భాగంగా ఐసీఆర్పీ, ఎఫ్ఎంటీలకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమం బృందావనం సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు. నరసరావుపేట, చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు, రొంపిచర్ల, పిడుగురాళ్ల, కారంపూడి మండలాల సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా ట్రైనర్ సైదయ్య, ఎన్ఎఫ్ఏలు అప్పలరాజు, నందకుమార్, మేరి, సౌజన్య, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
శాప్ ఫుట్బాల్, బాక్సింగ్ జిల్లా జట్లు ఎంపిక
నరసరావుపేట ఈస్ట్: సతైనపల్లి రోడ్డులోని డీఎస్ఏ స్టేడియంలో బుధవారం శాప్ లీగ్ పోటీల్లో భాగంగా ఫుట్బాల్, బాక్సింగ్ జిల్లా జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు అండర్–15, యూత్ అండర్–21 బాలబాలికలకు ఫుట్బాల్, అలాగే అండర్– 15, అండర్– 19 బాలబాలికలకు బాక్సింగ్ పోటీలను నిర్వహించి జిల్లా జట్లు ఎంపిక చేశారు. నాదెండ్ల: ఓ పక్క అప్పుల బాధ, మరోపక్క కుటుంబ కలహాల నేపధ్యంలో ఒడిషా కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గణపవరం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు ఒడిశా రాష్ట్రం భద్రక్జిల్లా కాన్ప్డ్ గ్రామానికి చెందిన నిదానిధర్దాస్ (46) భార్య అలియాదాస్, తమ్ముడు జలంధర్తో కలిసి గ్రామంలోని చవిటిపాలెంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ స్ధానిక స్పిన్నింగ్ మిల్లుల్లో కూలిపనులు చేసుకుని జీవిస్తున్నారు. కొంతకాలంగా పరిశ్రమల్లో పనులు లేకపోవటంతో అప్పుల సమస్యల్లో చిక్కుకున్నారు. ఆర్థిక విషయాల్లో భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. బుధవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు నమోదు చేసుకున్నారు. భార్య అలియాదాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నరసరావుపేట టౌన్ : ఇంటి తాళాలు పగులగొట్టి గృహంలోకి చొరబడిన దుండగులు బీరువాను ధ్వంసం చేశారు. నగదు, విలువైన వస్తువులు లభ్యం కాకపోవటంతో వెనుతిరిగారు. ప్రకాష్నగర్లో బుధవారం వెలుగు చూసిన చోరీ యత్నం సంఘటనకు సంబంధించి వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాష్నగర్ జిల్లా రిజిస్టార్ కార్యాలయం వెనుక ప్రాంతంలో నివాసం ఉంటున్న రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి యలవర్తి రాంప్రసాద్ కుటుంబ సభ్యులతో మూడు రోజుల క్రితం షిరిడీ యాత్రకు వెళ్తూ ఇంటికి తాళాలు వేసి వెళ్లాడు. బుధవారం ఉదయం ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు విషయాన్ని వన్టౌన్ పోలీసులకు తెలియజేశారు. సీఐ ఫిరోజ్ ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడకు చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఇంటి కింద, పై అంతస్తులోని రెండు తలుపుల తాళాలను పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు. బీరువాను ధ్వంసం చేసి, అందులోని సామాన్లను చిందరవందరుగా పడేసి ఉండటాన్ని గమనించారు. షిరిడీ యాత్రలో ఉన్న ఇంటి యజమానితో సీఐ మాట్లాడారు. ఇంట్లో విలువైన వస్తులు, నగదు ఏమీ లేవని చెప్పటంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకొని ప్రాథమిక ఆధారాలు, వేలిముద్రలను సేకరించారు. గృహ సమీపంలోని సీసీ పుటేజ్లను పరిశీలించి నిందితుల ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేశారు. -
సీఆర్డీఏ ఏసీగా బాధ్యతలు స్వీకరించిన కె.కార్తీక్
తాడికొండ: సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్గా కొల్లాబత్తుల కార్తీక్ బాధ్యతలు చేపట్టారు. రాయపూడిలోని సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం 3వ ఫ్లోర్లోని ఆయన చాంబర్లో బుధవారం శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు తొలుత సీఆర్డీఏ కమ్యూనికేషన్స్ విభాగ జాయింట్ డైరెక్టర్ జి.రామరాజు స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కార్తీక్కు కమిషనర్ వి.విజయ రామరాజు, అడిషనల్ కమిషనర్ ఎ.భార్గవ తేజ, ఆఫీస్ మేనేజ్మెంట్ డైరెక్టర్ వల్లభనేని శ్రీనివాసరావు, ఐటీ విభాగ డైరెక్టర్ బి. మల్లికార్జున రెడ్డి, ఇతర ముఖ్య అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ అధికారుల సంఘం జిల్లా ప్రెసిడెంట్గా శైలజారాణి కొరిటెపాడు(గుంటూరు) : గుంటూరు జిల్లా వ్యవసాయ అధికారుల సంఘం ప్రెసిడెంట్గా మంగళగిరి మండలం ఏఓ జంపని శైలజారాణి ఎన్నికయ్యారు. స్థానిక కృషీ భవన్లో బుధవారం జరిగిన సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం జిల్లా ప్రెసిడెంట్గా శైలజారాణితో పాటు వైస్ ప్రెసిడెంట్గా దుగ్గిరాల మండలం ఏఓ రాగాల విజయబాబు, జనరల్ సెక్రటరీగా పెదకాకాని ఏఓ కె.రమణకుమార్, జాయింట్ సెక్రటరీగా పి.సంధ్యారాణి, కోశాధికారిగా బి.కిశోర్లు ఎన్నికయ్యారు. నూతన కమిటీ మూడు సంవత్సరాల పాటు కొనసాగనుంది. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.పద్మావతి, ఆత్మా ప్రాజెక్టు డైరెక్టర్ జి.వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ అధికారుల సంఘం ప్రెసిడెంట్ బాల భాస్కర్, కార్యదర్శి బి.ప్రవీణ్, కోశాధికారి మురళీ కిషోర్ల ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అనంతరం నూతన సభ్యులను సత్కరించి, అభినందనలు తెలిపారు. గుంటూరులో మోడల్ లా సెట్ గుంటూరు లీగల్: ఈ నెల 26వ తేదీన ఏపీ బీసీ అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఉచిత మోడల్ లా సెట్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో అఫీషియల్ రిసీవర్ పి.టి.కోటేశ్వరరావు, మాజీ గవర్నమెంట్ ప్లీడర్ పోకల వెంకటేశ్వర్లు, అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ పీపీ పల్లపు కృష్ణ, గుంటూరు బార్ అసోసియేషన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ కొండవీటి శ్రీనివాసరావులు ఆవిష్కరించారు. న్యాయవాది పల్లపు కృష్ణ మాట్లాడుతూ గుంటూరు శ్యామలానగర్లో ఉన్న మాంటిస్సోరి ఇంగ్లిష్ మీడియం స్కూల్ లో ఆదివారం ఉదయం 10 గంటలకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంటూరు బార్ అసోసియేషన్ లైబ్రరీ సెక్రటరీ రాజేష్ లింగం, న్యాయవాదులు కె.వీరభాస్కర్, ఓర్సు జనార్దన్రావు తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి సాక్షి భావ నారాయణ బ్రహ్మోత్సవాలు పొన్నూరు: పట్టణంలోని శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మీసమేత సాక్షి శ్రీ భావనారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 23 నుంచి మే 5వ తేదీ వరకు జరుగుతాయని ధర్మకర్తల మండలి సభ్యులు తెలిపారు. 23వ తేదీ రాత్రి 10 గంటలకు ధ్వజారోహణం కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయన్నారు. 24వ తేదీ నుంచి ప్రతి రోజు ఉదయం 10 గంటలకు స్వామి, అమ్మవార్లకు పంచామృత స్నపన తిరుమంజన ఉత్సవం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. ధర్మకర్తల మండలి డైరెక్టర్ గున్నాథరావు, సభ్యులు కాట్రగడ్డ రామచంద్రరావు, గుడివాడ పవన్, ధరణికోట సాయికిరణ్, ఆకు రాతి అనూరాధ, ఊటుకూరి బాజీ శిరీష, సింహాద్రి రాము తదితరులు పాల్గొన్నారు. -
పల్నాడు
గురువారం శ్రీ 23 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026పులిచింతల సమాచారం అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.4920 టీఎంసీలు. ప్రాజెక్టు సామర్థ్యం 45.77 టీఎంసీలు. నిమ్మకాయల ధరలు తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో బుధవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.8,000, గరిష్ట ధర రూ.12,500, మోడల్ ధర రూ.10,000 వరకు పలికింది. ఈవీఎం గోడౌన్ తనిఖీ నరసరావుపేట: స్థానిక మార్కెట్ యార్డులో ఈవీఎం గోడౌన్ను పార్టీల ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టరు డాక్టర్ కృతికా శుక్లా బుధవారం తనిఖీ చేశారు. అక్రమాలకు అండగా టీఢీపీజంగా వెంకట కోటయ్య రైతుల ఆశలు ఆవరిగ్రంథాలయంలో పుస్తక పఠనంలో చిన్నారులు 7జెడ్పీ వార్షిక బడ్జెట్తో సంబంధం లేకుండానే భవిష్యత్తులో చెల్లింపులు జరిపేందుకు ప్రణాళిక లేకుండా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో రూ.44.73 కోట్ల విలువైన పనులకు చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా ఏకపక్షంగా గతంలో అనుమతులు ఇచ్చేశారు. ఈ వ్యవహారానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వైఎస్సార్ సీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు ప్రస్తుత సర్వసభ్య సమావేశంలోనూ అదే విధానాన్ని కొనసాగించారు. రొంపిచర్ల జెడ్పీటీసీ సభ్యుడు పిల్లి ఓబుల్రెడ్డి ఈ విషయమై గట్టిగా తన గళం వినిపించారు. కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులకు మించి రూ.38 కోట్ల పనులు ముందస్తుగా అనుమతులు ఇవ్వడంతో జెడ్పీని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశారని అన్నారు. దీనిపై తాము గత సమావేశాల్లోనూ అభ్యంతరం చెప్పామని, జెడ్పీటీసీలతో చర్చించకుండా ఏకపక్షంగా అనుమతులు ఇవ్వడం సరికాదన్నారు. ఈ నిధులతో సంబంధం లేకుండా రూ.38 కోట్లు, గత మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి జెడ్పీ సాధారణ నిధుల నుంచి రూ.2,35,15,668 తోపాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన రూ.4.38 కోట్లను కలుపుకొని రూ.44.73 కోట్ల పనులకు చైర్పర్సన్ ఏకపక్షంగా అనుమతులు ఇచ్చేశారన్నారు. నిధుల లభ్యత లేకుండా ఇలా చేస్తే భవిష్యత్తులో పూర్తయిన పనులకు ఏ విధంగా చెల్లింపులు జరుపుతారని ఓబుల్రెడ్డి ప్రశ్నించారు. దీంతోపాటు రూ.32 కోట్ల మేరకు స్టాంప్ డ్యూటీ సర్చార్జ్ నిధులు విడుదల చేయని టీడీపీ సర్కారు తీరుపై జెడ్పీటీసీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ. 44.73 కోట్ల ముందస్తు అనుమతులకు ఆమోదం గుంటూరు ఎడ్యుకేషన్ జెడ్పీటీసీ సభ్యుల అంగీకారం లేకుండా ముందస్తు అనుమతులు ఇచ్చేసిన పనులకు జెడ్పీ సర్వసభ్య సమావేశం ఆమోదం తెలిపింది. నిధులు లేకుండా రూ.కోట్ల విలువైన పనులను ఇష్టారాజ్యంగా కేటాయించేస్తూ, జెడ్పీ ఖజానాకు తీవ్ర ఆర్థిక భారంగా మారిన విధానాన్ని అడ్డుకునేందుకు వైఎస్సార్ సీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ టీడీపీ ప్రజా ప్రతినిధులు అంతా ఒక్కటై ఆమోదింప చేసుకున్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మూడు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు సమావేశానికి హాజరయ్యారు. పిడుగురాళ్లలో జూన్ నుంచి ఓపీ సేవలు పిడుగురాళ్ల వైద్య కళాశాలలో జూన్ నుంచి ఓపీ సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు చెప్పారు. పలువురు జెడ్పీటీసీ సభ్యులు అడిగిన ప్రశ్నలపై ఆయన స్పందిస్తూ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా నిర్మించిన మెడికల్ కళాశాలను ఇప్పుడు అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఇందులో రెండు ప్రభుత్వాల సహకారం ఉందన్నారు. జూన్లో అకడమిక్ తరగతులు ప్రారంభం అవుతాయని చెప్పారు. సమస్యలపై గళమెత్తిన ప్రజాప్రతినిధులు ప్రజల ఇబ్బందులపై సభ్యుల నిలదీత పిడుగురాళ్ల జెడ్పీటీసీ సభ్యుడు జంగా వెంకట కోటయ్య మాట్లాడుతూ గత ఐదేళ్లలో 15వ ఆర్థిక సంఘం నుంచి జెడ్పీకి వచ్చిన నిధులు, పూర్తి చేసిన పనులతోపాటు రద్దు చేసిన పనుల వివరాలు చెప్పాలని అడిగారు. దీనిపై జెడ్పీ సీఈవో వి.జ్యోతిబసు సమాధానమిస్తూ రూ.180 కోట్ల పనులు మంజూరు చేశామని, ఇప్పటి వరకు రూ.142 కోట్లు వచ్చాయని చెప్పారు. మిగిలిన రూ.38 కోట్ల పరిస్థితి ఏంటని నిలదీయడంతో పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతారంటూ సమాధానం దాటవేశారు. వర్క్ ఆర్డర్ ఇచ్చి ఏడాది ముగిసినా ప్రారంభం కాని పనులను రద్దు చేయాలని చట్టంలో స్పష్టంగా ఉందని, ఆ విధంగా రద్దు చేసిన పనులకు సైతం నిధులు కేటాయించినట్లు చూపుతున్నారని కోటయ్య నిలదీశారు. అధికారులు సరైన సమాధానం చెప్పలేదు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ ఇరువురు జెడ్పీటీసీలను వారించారు. నిధుల విషయమై చర్చ ముగించాలని సూచించారు. మరో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా... జెడ్పీటీసీ సభ్యులను మాట్లాడనీయలేదు. దీంతో చేసేది లేక వారు మౌనం వహించారు. అజెండా ఆమోదించినట్లుగా ప్రకటించుకున్న చైర్పర్సన్ సమావేశాన్ని ముగించారు. జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, పల్నాడు జేసీ సంజనా సింహ, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, నక్కా ఆనంద్ బాబు, వేగెశ్న నరేంద్రవర్మ, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. -
కష్టంపై గెలిచి.. తోడై నిలిచి...
● పంక్చర్ దుకాణం పనుల్లో వివాహిత ● సమస్యల పరిష్కారంలో దంపతుల ప్రయాణం ● విమర్శలు ఎదురైనా వెనుదిరగని షంషున్ సంప్రదాయాలను పక్కన పెట్టిన ఆమె.. తన జీవిత భాగస్వామికి తోడై నిలిచారు. అప్పుల్లో కూరుకుపోయిన కుటుంబాన్ని ఒడ్డెక్కించేందుకు ఏకంగా పంక్చర్ దుకాణంలో పనులు నేర్చుకున్నారు. భర్తకు చేదోడుగా ఉంటూ చాలావరకు అప్పులు తీర్చారు. ఆమే షంషున్. ద్విచక్ర వాహనాల నుంచి భారీ లారీల వరకు చిటికెలో పంక్చర్ వేసి.. చకచకా టైరు బిగిస్తూ జీవితమనే వాహనం సక్రమంగా సాగేలా కష్టపడుతున్నారు.యడ్లపాడు: ముసుగు దాటని ముచ్చట్లు, ఇంటి గడప దాటని అడుగులు.. సగటు ముస్లిం గృహిణి గురించి సమాజం రాసుకున్న నిర్వచనమిది. కానీ యడ్లపాడు మండలం బోయపాలెం దగ్గర జాతీయ రహదారిపై వెళ్తుంటే భారీ టిప్పర్ల టైర్లను అవలీలగా విప్పుతూ, ఇనుప రాడ్లతో తిరిగే ఓ మహిళ సగర్వంగా కనిపిస్తుంది. బురఖా ముసుగును పక్కన పెట్టి, టైర్ల మధ్య తన జీవిత చక్రం ఆగిపోకుండా పోరాడుతున్న ఆ వనిత పేరు ‘షంషున్’. వివరాలు ఆమె మాటల్లోనే... ‘నా పేరు షేక్ షంషున్. మస్తాన్వలి, రంజాన్బీ దంపతులకు మేం ముగ్గురం ఆడపిల్లలం. మాది ఫిరంగిపురం స్వస్థలం. ఐదో తరగతి వరకు చదువుకున్న. పన్నెండేళ్ల కిందట యడ్లపాడు మండలం బోయపాలెంకు చెందిన దరియాతో వివాహం చేశారు. భర్త చిన్నప్పటి నుంచే పంక్చర్ల పని నేర్చుకుని, బోయపాలెం పెట్రోల్ బంక్ వద్ద దుకాణం పెట్టారు. తొలుత అప్పు చేసి లారీ కొన్నాం. విధి వెక్కిరించింది. భారీ నష్టాలు వచ్చి రూ.పది లక్షల అప్పు మిగిలింది. ఇచ్చిన వారు అడుగుతుంటే , మా గురించి ఆలోచించే వారే లేకుండాపోయారు. నీళ్లు తాగి కడుపు నింపుకొన్నాం. ఆకలితో పిల్లలు ఏడుస్తుంటే కన్నీళ్లు ఆగలేదు. ఆ కన్నీళ్లే నా జీవితాన్ని మార్చేశాయి.’’ ‘‘నేను పని మొదలుపెట్టిన కొత్తలో చాలామంది వింతగా చూశారు. ‘ఆడపిల్లవి ఇదేం పని?’ అని నన్ను, నా భర్తను ఎద్దేవా చేశారు. నేను పట్టించుకోలేదు. సొంతంగా కష్టపడుతున్నామనే తృప్తి మాకుంది. కష్టంలోనూ పైసా వృథా కాకుండా పొదుపు చేస్తూ అప్పులు తీరుస్తున్నాం. ఇప్పటికే సగానికి పైగా బాకీలు తీరిపోయాయి. నిఖా సమయంలో ‘భార్యాభర్తలు సమానం’ అని చెబుతారు. ఆ మాటను నేను చేతల్లో చూపిస్తున్నాను. మా పిల్లలు మా తల్లిదండ్రుల దగ్గర చదువుకుంటున్నారు. భర్తకు సహచరిగా, బిడ్డలకు ఆసరాగా నిలబడటంలో ఉన్న సంతృప్తి కంటే పెద్ద విజయం ఇంకేముంటుంది? ఒక మహిళ అనుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు.’’ నీతి లేని పోలీసుల రీతి -
రెచ్చిపోతే గుణపాఠం తప్పదు
నరసరావుపేట రూరల్: వన్ టైం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు అండదండలతో రెచ్చిపోయి దాడులకు పాల్పడే వారు భవిష్యత్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైఎస్సార్సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. జిల్లా ఎస్పీ బి.కృష్ణారావును జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఆయన కలిశారు. వైఎస్సార్సీపీ పట్టణ సోషల్ మీడియా అధ్యక్షుడు హన్నుపై దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని కోరారు. నిందితులపై సెక్షన్ 324 కింద కేసు నమోదు చేశారని, దీనిని 307గా మార్చాలన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ... లింగంగుంట్ల రాజుపాలెంలో హన్నుపై టీడీపీ గూండాలు జరిపిన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఎమ్మెల్యే అండతోనే... హన్నుపై దాడి వెనుక ఎమ్మెల్యే ప్రొద్బలం ఉందన్నారు. ఘటనా స్థలంలో నిందితులు వినియోగించిన బులెట్ మీదనే ఎమ్మెల్యే తన పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారని తెలిపారు. విశ్వామిత్ర టీ స్టాల్ యజమాని పొట్లూరి వెంకి ఈ దాడికి ముఖ్య సూత్రధారిగా వ్యవహరించాడని ఆరోపించారు. వరుస దాడులు వెంకి ఆధ్వర్యంలో జరుగుతున్నాయని తెలిపారు. భవిష్యత్లో వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అనంతరం ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హన్నును పరామర్శించారు. కార్యక్రమంలో జిల్లా వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షురాలు రోళ్ల మాధవి, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ కరీముల్లా, వర్కింగ్ అధ్యక్షుడు అచ్చి శివకోటి, ఖాజావలి మాస్టారు, సోషల్ మీడియా నియోజకవర్గ అధ్యక్షుడు బూదాల కల్యాణ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు. జిల్లా వైఎస్సార్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి -
నాటు బాంబులు స్వాధీనం
బెల్లంకొండ: మండలంలోని పాపాయపాలెం గ్రామంలో మంగళవారం నాటుబాంబులు కలకలం సృష్టించాయి. గ్రామంలోని శ్రీకృష్ణ దేవాలయం సమీపంలో గ్రామానికి చెందిన సంక్రాంతి కోటయ్య అనే వ్యక్తి ఇంటి వద్ద ఐదు నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక ఎస్ఐ పి.గోపి తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం... కోటయ్య ఇంటి వద్ద నాటు బాంబులు గుర్తించిన గ్రామ వీఆర్వో పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. పోలీసులు తనిఖీ నిర్వహించగా ఇంటివద్ద మరుగుదొడ్డిలో ఒక ప్లాస్టిక్ డబ్బాలో వరిపొట్టులో ఉన్న ఐదు నాటు బాంబులను లభ్యమయ్యాయి. వెంటనే సత్తెనపల్లి డీఎస్పీ ఎం. హనుమంతరావు, క్రోసూరు సీఐ ప్రత్తిపాటి సురేష్లు బాంబు స్క్వాడ్, క్లూస్ టీం, ఆర్ఎఫ్ఎస్ఎల్ సభ్యులతో గ్రామానికి చేరుకున్నారు. బాంబులను స్వాధీనం చేసుకుని, ఊరి చివరకు వెళ్లి వాటిని పరిశీలించారు. బాంబులను సీజ్ చేసి సంబంధిత నైపుణ్యుల నిర్ధారణ కోసం పంపారు. ఘటనపై విచారణ చేపట్టి పూర్తి వివరాలను వెల్లడిస్తామని డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. -
పరీక్ష రోజున కేంద్రం మార్పు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: పరీక్ష రోజునే కేంద్రాన్ని మార్చి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. ఏఎన్యూ పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షల్లో తొలుత రేపల్లె ప్రాంతంలోని నాలుగు కళాశాలలకు బాపట్లలోని ఒక సెంటర్ను పరీక్ష కేంద్రంగా కేటాయించారు. పరీక్ష జరిగిన ఈ నెల 21వ తేదీన సెంటర్ను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాపట్లలోని సెంటర్కు బదులుగా మరో సెంటర్ను కేటాయించారు. గతంలో వీటిలో ఒక కళాశాలకు సెల్ఫ్ సెంటర్ను కేటాయించేవారు. ఇలా మార్చటంలో ఔచిత్యం ఏంటో వర్సిటీ అధికారులకే తెలియాలి. 21వ తేదీన పరీక్ష ఉండగా, అదే రోజున సెంటర్ మార్చినట్లు ఉత్తర్వులు ఇవ్వడం వర్సిటీ పనితీరుకు నిదర్శనం. మార్చిన సెంటర్లో హాల్ టికెట్లను పరీక్షా కేంద్రంలోనే అందజేశారు. నూతనంగా మార్చిన కేంద్రంలో కేటాయించిన కొన్ని కళాశాలల్లో గతంలో పీజీ కోర్సులను తొలగించినట్లు సమాచారం. ఒక కళాశాల కోసమే ఇతర కళాశాలలను కూడా మార్చినట్లు, విద్యార్థులు లేకపోయినా సెంటర్ కేటాయించినట్లు సమాచారం. ఏఎన్యూ పీజీ నాలుగో సెమిస్టర్ పొలిటికల్ సైన్స్ విద్యార్థుల హాల్ టికెట్లలో తప్పిదాలు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్ నెలలో పరీక్షలు జరుగుతుండగా, జూన్ నెలలో పరీక్షలు అన్నట్లు ‘6’ నెలగా ముద్రించారు. వారాల వివరాలు కూడా తప్పుగా ముద్రించడం గమనార్హం. ఏఎన్యూలో మరో మాయాజాలం -
ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదుగుతా
మా స్వస్థలం వినుకొండ మండలం ఏనుగుపాలెం. అమ్మానాన్న పుష్పలత, శ్రీనివాసరావు. వినుకొండ మండలంలోని మండల పరిషత్ పాఠశాలల్లో ఎస్జీటీలుగా పని చేస్తున్నారు. సీనియర్ ఇంటర్లో 987 మార్కులు సాధించాను. జేఈఈ మెయిన్స్లో 100 పర్సంటైల్ కై వసం చేసుకున్నాను. మే 17న జరగనున్న జేఈఈ అడ్వాన్స్డ్కు సన్నద్ధం అవుతున్నాను. అడ్వాన్స్డ్లో టాప్ ర్యాంకు కై వసం చేసుకుని, ముంబై ఐఐటీలో సీఎస్ఈలో సీటు సాధించాలనే లక్ష్యంతో ఉన్నాను. తదుపరి స్టార్టప్ ప్రారంభించి, ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకోవాలని నిర్ణయించుకున్నా. – తుంగా దుర్గా సుప్రభాత్, ఓపెన్ కేటగిరీ 11వ ర్యాంకు -
కలెక్టర్ను కలిసిన టీడీపీ ఎమ్మెల్యే కన్నా...
టీడీపీ నేత కోడెల శివరాం ఇచ్చిన ఫిర్యాదుపై చర్చ సాక్షి, నరసరావుపేట : పల్నాడులో జరుగుతున్న అక్రమ మైనింగ్పై టీడీపీ నేత కోడెల శివరాం ఏకంగా ఎనిమిది పేజీల లేఖను సోమవారం జిల్లా కలెక్టర్కు అందించినట్టు తెలియవచ్చింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, షాడో ఎమ్మెల్యేలు చేసిన అక్రమ మైనింగ్, కోట్ల రూపాయల అవినీతికి సంబంధించి ఆధారాలతో కలెక్టర్, విజిలెన్స్ అధికారులకు సమర్పించినట్టు తెలిసింది. దీంతో దాడులు జరుగుతాయన్న ముందస్తు సమాచారంతో అక్రమ మైనింగ్ను మంగళవారం నిలిపివేశారు. శివరాం ఇచ్చిన ఫిర్యాదుతో కంగుతిన్న సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనాయణ, షాడో ఎమ్మెల్యేగా పేరొందిన దరువూరి నాగేశ్వరరావులు మంగళవారం పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను కలిసి శివరాం ఇచ్చిన ఫిర్యాదుపై చర్చించినట్టు సమాచారం. దాచేపల్లి : ౖరెల్వే ట్రాక్ విస్తరణలో భాగంగా భూ సేకరణకు రెవెన్యూ అధికారులు మంగళవారం గ్రామ సభ నిర్వహించారు. గుంటూరు నుంచి బీబీ నగర్ వరకు చేపట్టే డబ్లింగ్ పనులకు సంబంధించి దాచేపల్లి మండల పరిధిలో 9.32 ఎకరాల పట్టాభూమి అవసరం కానుంది. ఈ నేపథ్యంలో కేసానుపల్లి, పెదగార్లపాడు గ్రామాల పరిధిలో అవసరమైన భూమి సేకరణ కోసం గురజాల ఆర్డీవో మురళీకృష్ణ అధ్యక్షతన కేసానుపల్లి గ్రామ సచివాలయంలో రైతులతో గ్రామ సభ నిర్వహించి అభిప్రాయాలు సేకరించారు. భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఆధార్కార్డులు, సంబంధిత రైతు బ్యాంక్ అకౌంట్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. సేకరించిన వివరాలను జిల్లా కలెక్టర్కు పంపిస్తామని ఆర్డీవో మురళీకృష్ణ చెప్పారు. తహసీల్దార్ శ్రీనివాస్, వీఆర్వో గిరి, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు. సత్తెనపల్లి: జగద్గురువులు ఆది శంకరాచార్యుల జయంతి వేడుకలు సత్తెనపల్లిలో వేదగాయత్రీ పురోహిత సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరిగాయి. సంఘ బాధ్యులు అత్తలూరు అనిల్కుమార్ శర్మ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీబొమ్మల సెంటర్ విఘ్నేశ్వరుడి ఆలయంలో ముందుగా పూజా కార్య క్రమాలు చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టారు. వేదగాయత్రీ పురోహిత సంఘం బాధ్యులు డాక్టర్ గుండ్లపల్లి శ్రీధర్, కొనంకి మారుతీ, అంపిరాయని రాజశేఖర్ శర్మ, గుండవరపు అమర్నాథ్, మణికంఠ, రవి, గోవర్ధన్, ధ్రువ కుమార్ పాల్గొన్నారు. తాడేపల్లి రూరల్ : గుంటూరు జిల్లా సీతానగరం విజయకీలాద్రిపై వేంచేసిన యున్న శ్రీ విఘ్న విమోచక హనుమాన్కు మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై ఉన్న 27 అడుగుల ఏకశిలా మూర్తి శ్రీ విఘ్న విమోచక హనుమాన్ విగ్రహానికి గులాబీ పూలతో విశేష సహస్రనామార్చన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. సినిమా కొరియెగ్రాఫర్ శేఖర్ మాస్టర్ సతీసమేతంగా అర్చన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలిపారు. -
మా కుటుంబానికి ప్రాణ హాని
నరసరావుపేట రూరల్: బెయిల్పై విడుదలైన నిందితులతో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని వినుకొండలో దారుణహత్యకు గురైన షేక్ రషీద్ సోదరుడు ఖాదర్బాషా తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ బి.కృష్ణారావును ఖాదర్బాషా కలిసి ఫిర్యాదు చేశారు. 2024 జులై 17వ తేదీన రషీద్ను వినుకొండలోని మెయిన్రోడ్డులో దారుణంగా నరికి హత్య చేసిన విషయం విదితమే. ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో మొదటి నిందితుడు మినహా మిగిలిన వారు బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసులో ఏ–2 పఠాన్ సిద్దిక్, ఏ 5 అంబులెన్స్ రఫీ, ఏ 8 కొమ్మా వెంకటసాయి, ఏ 12 పఠాన్సైదా నుంచి నా కుటుంబానికి ప్రాణహని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వీరి బెయిల్ రద్దు చేయమని హెకోర్టులో క్రిమినల్ పిటీషన్ దాఖలు చేయగా, గత నెల 17వ తేదీన బెయిల్ను రద్దు చేసినట్టు వివరించారు. ఈ కేసులో ఏ 2, ఏ 5, ఏ 8, ఏ 12 నిందితులను వారం రోజుల్లోపు కోర్టులో లొంగిపోవాలని తీర్పునిచ్చినట్టు తెలిపారు. నేటి వరకు నిందితులు కోర్టులో హాజరుకాలేదని, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఖాదర్ బాషా కోరాడు. -
నా స్థలం వేరొకరికి రిజిస్ట్రేషన్ చేశారు
సాక్షి టాస్క్ఫోర్స్: ప్లాట్ను మరొకరికి రిజిస్ట్రేషన్ చేసి, వచ్చిన సొమ్ములో సగభాగం చెల్లించకుండా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మోసగించాడని టీడీపీ మహిళా కార్యకర్త మీడియా ఎదుట బోరున విలపించింది. సోమవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ(డీపీఓ) ఆవరణలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మంగళగిరి బేతపూడి గ్రామం బాపూజీనగర్లో నివాసం ఉంటున్నట్లు బొక్కా సుధారాణి తెలిపింది. ప్రస్తుతం పూల విక్రయిస్తూ జీవిస్తున్నట్లు పేర్కొంది. 2017 కురగల్లు గ్రామ పరిధిలో 150 గజాల స్థలాన్ని నూతక్కిలో విధులు నిర్వర్తించే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి వద్ద కొనుగోలు చేశానని తెలిపింది. 2021లో ప్లాట్గా మారడంతో ఆ ఉపాధ్యాయుడు స్వాధీన అగ్రిమెంట్ రాసిచ్చాడని పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో తమకు తెలియకుండానే నా 150 గజాల స్థలంతోపాటు అందులోని మిగతా స్థలం కలిపి ఉపాధ్యాయుడు వేరొకరికి విక్రయించి రిజిస్ట్రేషన్ చేయించాడని వాపోయింది. రూ.50 లక్షలు ఉపాధ్యాయుడు చెల్లించాల్సి ఉందని తెలిపింది. డబ్బుల విషయమై అతన్ని పలుమార్లు అడిగినా సరైన సమాధానం లేదని వాపోయింది. దీనిపై మంగళగిరి గ్రామీణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని టీడీపీలో కార్యకర్తగా పనిచేస్తున్న న్యాయం జరగడంలేదని వాపోయింది. లోకేష్తోపాటు ఎవరూ వద్దకెళ్లినా న్యాయం జరగదని అవతల వారు బెదిరిస్తున్నారని రోదించింది. -
ఆరేళ్ల చిన్నారిపై లైంగికదాడికి యత్నం
నాదెండ్ల: ఆరేళ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించిన సంఘటన గణపవరంలో సంచలనం రేపింది. గ్రామంలోని సినిమాహాల్ రోడ్డులో యర్రం శ్రీధర్రెడ్డి స్పిన్నింగ్ మిల్లులో ఆదివారం ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజమండ్రికి చెందిన దంపతులు స్పిన్నింగ్ మిల్లు క్వార్టర్స్లో నివాసం ఉంటున్నారు. ఒడిశా రాష్ట్రంలోని బాలాపూర్ ప్రాంతానికి చెందిన ప్రసాద్దాస్ మాలిక్ ఇదే కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఏడేళ్ల కిందట ఒడిశా నుంచి ఉపాధి కోసం వచ్చిన ప్రసాద్దాస్మాలిక్ నాలుగేళ్లు వేరే కంపెనీలో పనిచేసి, మూడేళ్లుగా స్పిన్నింగ్మిల్లు క్వార్టర్స్లో ఒంటరిగా ఉంటున్నాడు. చిన్నారికి మాయమాటలు చెప్పి.. ఆదివారం ఉదయం చిన్నారి తల్లిదండ్రులు ఇరువురూ పనులకు వెళ్లటంతో ఒంటరిగా ఉన్న చిన్నారికి ప్రసాద్ దాస్ మాలిక్ మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంటికి తిరిగి వచ్చిన బాలిక జరిగిన సంఘటనను తల్లిదండ్రులకు వివరించింది. విషయం చుట్టుప్రక్కల కార్మికులకు తెలియటంతో వారు ప్రసాద్ దాస్ మాలిక్ను నిలదీశారు. నిందితుడికి దేహశుద్ధి చేసి ఒంటిపై వాతలు పెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నాదెండ్ల ఎస్సై ఆర్ వెంకటేశ్వరరావు, రూరల్ ఎస్సై రేఖాప్రియాంక బాలికను వైద్య పరీక్షల నిమిత్తం సోమవారం ఆసుపత్రికి తరలించారు. పల్నాడు జిల్లా క్లూస్టీం బృందం స్పిన్నింగ్ మిల్లు చేరుకుని స్థానికుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. ట్రైనీ ఐపీఎస్ నిరంజన్ బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు. నిందితుడు ప్రసాద్దాస్మాలిక్పై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చిలకలూరిపేట టౌన్: రోడ్డు దాటే క్రమంలో ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన పట్టణంలో జరిగింది. సుభానినగర్కు చెందిన వెంకట నారాయణ (40) సోమవారం వేకువజామున కాలనీకి సమీపాన ఉన్న ఓగేరు పాత అయ్యప్ప గుడి వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో వరి పొట్టు లోడు ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటరమణ కు తీవ్ర గాయాలు ఘటనాస్థలిలోనే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో అర్బన్ పోలీసులు ఘటనా స్థలం సందర్శించి మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. తెనాలిరూరల్: గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ నాయబ్ రసూల్ వివరాలు వెల్లడించారు. జనవరి 30న మండలంలోని పెదరావూరు గ్రామ శివారులో గంజాయి తాగుతున్నారన్న సమాచారంతో రూరల్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1600 గ్రాముల గంజాయిని స్వాధీనపర్చుకున్నారు. వీరిలో బాపట్ల మండలం స్టువర్టుపురానికి చెందిన వల్లాగి విజయ్, తెనాలి నాజరుపేటకు చెందిన వడ్లమూడి గోపికిరణ్, మండలంలోని జగ్గడిగుంటపాలెంకు చెందిన దేవరకొండ మనుశివశంకర్(గతంలో రెండు గంజాయి కేసుల్లో నిందితుడు), తెనాలి నందులపేట మండా వారి వీధికి చెందిన దేవిశెట్టి బసవేశ్వరరావు(గతంలో రెండు గంజాయి కేసుల్లో నిందితుడు), మారిస్పేటకు చెందిన షేక్ జాకీర్ హుస్సేన్ గంజాయి విక్రయిస్తున్నట్టు పోలీసులు గర్తించారు. పట్టణ చెంచుపేటకు చెందిన మైనేని రోహిత్ చౌదరి, నందులపేటకు చెందిన తుమ్మలపెంట లక్ష్మీసూర్యప్రకాష్, మారిస్పేట రెండు గేట్ల ప్రాంతానికి చెందిన గంపల వెంకట శివనాగమణికంఠ కొనుగోలు చేసి సేవిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అప్పట్లో వీరిని అరెస్ట్ చేయగా, ఇదే కేసులో నిందితులైన పట్టణ మారిస్పేట మఠం బజారుకు చెందిన షేక్ ఫిరోజ్, నందులపేటకు చెందిన కోటిసాయి మంజునాథ్ పరారీలో ఉన్నారు. వారిని సోమవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్టు సీఐ తెలిపారు. గంజాయి వినియోగంపై డయల్ 100/112 ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వొచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని సీఐ చెప్పారు నరసరావుపేట ఈస్ట్: కేంద్ర ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం–2027 సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులకు అర్హులైన క్రీడాకారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి సోమవారం తెలిపారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ వైస్ ఛైర్మన్ ఎస్.భరణి ఉత్తర్వులు జారీ చేసినట్టు వివరించారు. అర్హులైన క్రీడాకారులు తమ నామినేషన్, సిఫారసులను httpr://awardr.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. తమ దరఖాస్తులను మే 15వ తేదీ సాయంత్రం 5గంటల లోపు rportrinap@ bmai.com, dranrtpanadudirtrict@fmai.com పంపాలని తెలిపారు. వివరాలకు జిల్లా క్రీడాభివృద్ధి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. తాడికొండ: రాజధాని అమరావతి ప్రాంత యువత, నిరుద్యోగులకు విస్తృతంగా ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి–శిక్షణ శాఖ, ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సీఆర్డీఏ సోషల్ డెవలప్మెంట్ అధికారుల సౌజన్యంతో జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు సీఆర్డీయే అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీఎస్ఎస్డీసీ సమన్వయంతో ఈనెల 25న ఉదయం 10 గంటల నుంచి తుళ్లూరులోని ఏపీ సీఆర్డీయే స్కిల్ హబ్ కార్యాలయంలో జరుగుతుందని తెలిపారు. 10వ తరగతి, ఐటీఐ, డిప్లమో, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ పూర్తిచేసి 18 నుంచి 40 ఏళ్లలోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ జాబ్మేళాలో పాల్గొనవచ్చని, ఫ్రెషర్స్ – ఉద్యోగ అనుభవం ఉన్నవారికి సైతం ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు htt pr://naipunyam.ap.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకుని, విద్యార్హతల సర్టిఫికెట్లు, ఆధార్ తదితర గుర్తింపు పత్రాలు, బయోడేటాతో హాజరు కావాలన్నారు. పూర్తి వివరాల కోసం రాజధాని గ్రామాలలోని సీఆర్డీయే ఫెసిలిటేటర్ను సంప్రదించవచ్చని, లేకుంటే శ్రీకర్ 9963425999 నంబర్కు కాల్ చేయవచ్చని తెలిపారు. -
బైక్ను ఢీకొన్న కోళ్ల వ్యాన్
కారెంపూడి: కోళ్ల వ్యాన్ బైక్ను ఢీకొనడంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన దుర్ఘటన మండలంలోని పేటసన్నెగండ్ల బ్రిడ్జి వద్ద సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. అడిగొప్పల అమ్మవారి దర్శనానికి వెళ్లి తిరిగి బైక్పై ఇంటికి వెళ్తున్న వీరిని ఎదురుగా వచ్చిన వ్యాన్ వేగంగా ఢీకొంది. ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న పిడుగురాళ్లకు చెందిన చెవుల దాసు (25), మేకల శివాజీ (30) అక్కడికక్కడే మృతి చెందారు. సాంబశివరావు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. వీరు ముగ్గురు అడిగొప్పల సమీపంలోని శ్రీనిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని తిరిగి స్వగ్రామం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పేటసన్నెగండ్ల శివారులో ఉన్న సాగర్ కాల్వ బ్రిడ్జి సమీపంలో ఉన్న రోడ్డు డౌన్లో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. పిడుగురాళ్ల వైపు నుంచి అతి వేగంగా వస్తున్న కోళ్లు రవాణా చేసే బొలోరో వాహనం వీరు ప్రయాణిస్తున్న బైక్ను ఎదురుగా అతి వేగంగా ఢీకొన్నట్లు తెలుస్తోంది. దీంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు వాహనం టైర్ల కింద పడి నలిగిపోయారు. ఇద్దరూ తీవ్రగాయాలై రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని నర్సరావుపేట హాస్పటల్కు తరలించారు. ఘటనా స్థలాన్ని సీఐ శరత్బాబు, ఎస్ఐ వాసులు పరిశీలించి విచారిస్తున్నారు. పోలీసులు తగిన సహాయక చర్యలు తీసుకుంటున్నారు. బంధువులకు సమాచారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వ్యాన్ మండలంలోని ఒప్పిచర్ల గ్రామంలోని కోళ్లఫారం యజమానిదిగా తెలుస్తోంది. -
బైక్ను ఢీకొన్న కోళ్ల వ్యాన్
కారెంపూడి: కోళ్ల వ్యాన్ బైక్ను ఢీకొనడంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన దుర్ఘటన మండలంలోని పేటసన్నెగండ్ల బ్రిడ్జి వద్ద సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. అడిగొప్పల అమ్మవారి దర్శనానికి వెళ్లి తిరిగి బైక్పై ఇంటికి వెళ్తున్న వీరిని ఎదురుగా వచ్చిన వ్యాన్ వేగంగా ఢీకొంది. ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న పిడుగురాళ్లకు చెందిన చెవుల దాసు (25), మేకల శివాజీ (30) అక్కడికక్కడే మృతి చెందారు. సాంబశివరావు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. వీరు ముగ్గురు అడిగొప్పల సమీపంలోని శ్రీనిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుని తిరిగి స్వగ్రామం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పేటసన్నెగండ్ల శివారులో ఉన్న సాగర్ కాల్వ బ్రిడ్జి సమీపంలో ఉన్న రోడ్డు డౌన్లో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. పిడుగురాళ్ల వైపు నుంచి అతి వేగంగా వస్తున్న కోళ్లు రవాణా చేసే బొలోరో వాహనం వీరు ప్రయాణిస్తున్న బైక్ను ఎదురుగా అతి వేగంగా ఢీకొన్నట్లు తెలుస్తోంది. దీంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇద్దరు వాహనం టైర్ల కింద పడి నలిగిపోయారు. ఇద్దరూ తీవ్రగాయాలై రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని నర్సరావుపేట హాస్పటల్కు తరలించారు. ఘటనా స్థలాన్ని సీఐ శరత్బాబు, ఎస్ఐ వాసులు పరిశీలించి విచారిస్తున్నారు. పోలీసులు తగిన సహాయక చర్యలు తీసుకుంటున్నారు. బంధువులకు సమాచారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వ్యాన్ మండలంలోని ఒప్పిచర్ల గ్రామంలోని కోళ్లఫారం యజమానిదిగా తెలుస్తోంది. -
మా కుటుంబానికి ప్రాణ హాని
నరసరావుపేట రూరల్: బెయిల్పై విడుదలైన నిందితులతో తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని వినుకొండలో దారుణహత్యకు గురైన షేక్ రషీద్ సోదరుడు ఖాదర్బాషా తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ బి.కృష్ణారావును ఖాదర్బాషా కలిసి ఫిర్యాదు చేశారు. 2024 జూలై 17వ తేదీన రషీద్ను వినుకొండలోని మెయిన్రోడ్డులో దారుణంగా నరికి హత్య చేసిన విషయం విదితమే. ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో మొదటి నిందితుడు మినహా మిగిలిన వారు బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసులో ఏ–2 పఠాన్ సిద్దిక్, ఏ 5 అంబులెన్స్ రఫీ, ఏ 8 కొమ్మా వెంకటసాయి, ఏ 12 పఠాన్సైదా నుంచి నా కుటుంబానికి ప్రాణహని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వీరి బెయిల్ రద్దు చేయమని హెకోర్టులో క్రిమినల్ పిటీషన్ దాఖలు చేయగా, గత నెల 17వ తేదీన బెయిల్ను రద్దు చేసినట్టు వివరించారు. ఈ కేసులో ఏ 2, ఏ 5, ఏ 8, ఏ 12 నిందితులను వారం రోజుల్లోపు కోర్టులో లొంగిపోవాలని తీర్పునిచ్చినట్టు తెలిపారు. నేటి వరకు నిందితులు కోర్టులో హాజరుకాలేదని, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఖాదర్ బాషా కోరాడు. -
గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు దారుణం
తాడేపల్లిరూరల్: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి ప్రజలను నమ్మించే విధంగా దుష్పచారం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు అన్నారు. సోమవారం తాడేపల్లి పోలీస్స్టేషన్లో సీఐ వీరేంద్రకు బుచ్చయ్య చౌదరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ‘మాకు అధికారం ఉంది, మేం తల్చుకుంటే నరికేయగలం’ అంటూ మాట్లాడారని, అది ప్రసార మాధ్యమాలు, సోషల్మీడియాలో ప్రచారమైందని అన్నారు. బుచ్చయ్యచౌదరి చేసిన వ్యాఖ్యలు ప్రత్యక్ష హింసను ప్రేరేపించేలా ఉన్నాయని, ప్రజల్లో భయాందోళనలు పెంచేలా ఉన్నాయని అన్నారు. బుచ్చయ్యచౌదరిపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సీఐ వీరేంద్రకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ముదిగొండ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
విజయకీలాద్రిపై మండలాభిషేక మహోత్సవాలు
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీల్రాదిపై వేంచేసి ఉన్న 27 అడుగుల ఏకశిల విఘ్న విమోచక హనుమంతునికి మండలాభిషేక మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి స్వీయ పర్యవేక్షణలో ఉదయం 9 గంటలకు 108 కలశాలతో అభిషేక మహోత్సవం, అనంతరం విశేష అర్చనలు, తీర్థ ప్రసాద గోష్ఠి అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో మైహోమ్ గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావు, కుమారి దంపతులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్ని స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. బాపట్ల: న్యూఢిల్లీలో ఈనెల 21న జరిగే 18వ సివిల్ సర్వీసెస్ డే వేడుకల్లో భాగంగా నిర్వహించే జాతీయ స్థాయి ఐఏఎస్ అధికారుల వర్క్షాప్నకు బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఎంపికయ్యారు. కేంద్ర పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ వర్క్షాప్లో దేశవ్యాప్తంగా అమలవుతున్న ఉత్తమ పరిపాలనా విధానాలు, వినూత్న కార్యక్రమాలపై చర్చించనున్నారు. రాష్ట్రం తరఫున ఎంపికై న అధికారుల జాబితాలో బాపట్ల కలెక్టర్కు చోటు దక్కడం విశేషం. కలెక్టర్ ఢిల్లీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసి, ఆ కాలాన్ని ఆన్ డ్యూటీగా పరిగణించింది. నరసరావుపేట రూరల్: మే నెలలో జిల్లా వ్యాప్తంగా కిసాన్ మేళాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా వ్యవసాయ అధికారులకు సూచించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కిసాన్ మేళా, అభ్యుదయం కార్యక్రమాలపై సోమవారం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ వ్యవసాయంలో అధునాతన పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం, యాంత్రీకరణ, బ్యాంక్ సబ్సిడీ రుణాలపై రైతులకు అవగాహన కల్పిస్తూ కిసాన్ మేళాలను నియోజకవర్గ, మండల స్థాయిలో నిర్వహించాలని తెలిపారు. మండలానికో ఒక ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ క్లస్టర్ అభివృద్ధి చేసి ఎఫ్పీవోలతో అనుసంధానం చేసే ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. ఒక్కో క్లస్టర్కు రూ.3కోట్లు వరకు, సబ్సిడీతో రూ.5కోట్లు వరకు రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు. ఉచిత ప్రసాద వితరణకు విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న ఉచిత ప్రసాద వితరణకు విజయవాడ మాచవరానికి చెందిన గోవి పాండురంగారావు, కోటేశ్వరి రూ. 1,01,116 విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 526.30 అడుగులకు చేరింది. ఇది 161.0148 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ఫ్లోగా 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 450 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. -
గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు దారుణం
తాడేపల్లిరూరల్: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి ప్రజలను నమ్మించే విధంగా దుష్పచారం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు అన్నారు. సోమవారం తాడేపల్లి పోలీస్స్టేషన్లో సీఐ వీరేంద్రకు బుచ్చయ్య చౌదరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ రాజమహేంద్రవరం రూరల్ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ‘మాకు అధికారం ఉంది, మేం తల్చుకుంటే నరికేయగలం’ అంటూ మాట్లాడారని, అది ప్రసార మాధ్యమాలు, సోషల్మీడియాలో ప్రచారమైందని అన్నారు. బుచ్చయ్యచౌదరి చేసిన వ్యాఖ్యలు ప్రత్యక్ష హింసను ప్రేరేపించేలా ఉన్నాయని, ప్రజల్లో భయాందోళనలు పెంచేలా ఉన్నాయని అన్నారు. బుచ్చయ్యచౌదరిపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సీఐ వీరేంద్రకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎస్సీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ముదిగొండ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నం
నాదెండ్ల: ఆరేళ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించిన సంఘటన గణపవరంలో సంచలనం రేపింది. గ్రామంలోని సినిమాహాల్ రోడ్డులో యర్రం శ్రీధర్రెడ్డి స్పిన్నింగ్ మిల్లులో ఆదివారం ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజమండ్రికి చెందిన దంపతులు స్పిన్నింగ్ మిల్లు క్వార్టర్స్లో నివాసం ఉంటున్నారు. ఒడిశా రాష్ట్రంలోని బాలాపూర్ ప్రాంతానికి చెందిన ప్రసాద్దాస్ మాలిక్ ఇదే కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఏడేళ్ల కిందట ఒడిశా నుంచి ఉపాధి కోసం వచ్చిన ప్రసాద్దాస్మాలిక్ నాలుగేళ్లు వేరే కంపెనీలో పనిచేసి, మూడేళ్లుగా స్పిన్నింగ్మిల్లు క్వార్టర్స్లో ఒంటరిగా ఉంటున్నాడు. చిన్నారికి మాయమాటలు చెప్పి.. ఆదివారం ఉదయం చిన్నారి తల్లిదండ్రులు ఇరువురూ పనులకు వెళ్లటంతో ఒంటరిగా ఉన్న చిన్నారికి ప్రసాద్ దాస్ మాలిక్ మాయమాటలు చెప్పి తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంటికి తిరిగి వచ్చిన బాలిక జరిగిన సంఘటనను తల్లిదండ్రులకు వివరించింది. విషయం చుట్టుప్రక్కల కార్మికులకు తెలియటంతో వారు ప్రసాద్ దాస్ మాలిక్ను నిలదీశారు. నిందితుడికి దేహశుద్ధి చేసి ఒంటిపై వాతలు పెట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నాదెండ్ల ఎస్సై ఆర్ వెంకటేశ్వరరావు, రూరల్ ఎస్సై రేఖాప్రియాంక బాలికను వైద్య పరీక్షల నిమిత్తం సోమవారం ఆసుపత్రికి తరలించారు. పల్నాడు జిల్లా క్లూస్టీం బృందం స్పిన్నింగ్ మిల్లు చేరుకుని స్థానికుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. ట్రైనీ ఐపీఎస్ నిరంజన్ బాలిక తల్లిదండ్రులతో మాట్లాడారు. నిందితుడు ప్రసాద్దాస్మాలిక్పై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు -
వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా అధ్యక్షుడిపై దాడి
నరసరావుపేట: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా పట్టణ అధ్యక్షుడు హన్నూపై సోమవారం రాత్రి దాడి జరిగింది. ద్విచక్రవాహనంపై వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు రెండు ద్విచక్రవాహనాలపై వచ్చి రాడ్లు, కర్రలతో దాడిచేశారు. దాడిలో హన్ను తల, చేతులకు తీవ్రగాయమైంది. వారి నుంచి తప్పించుకొని గాయాలతో ప్రభుత్వాసుపత్రిలో చేరారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వైద్యశాలకు వచ్చి హన్నూకు తగిలిన గాయాలను సెల్ఫోన్ లైటు సహాయంతో పరిశీలించారు. తాను వ్యక్తిగత పనిపై లింగంగుంట్ల గ్రామం వెళ్లి వస్తుండగా జై టీడీపీ, బాస్ అని రాసి ఉన్న నంబర్ ప్లేటు కలిగి ఉన్న బుల్లెట్ బండిపై వచ్చిన వ్యక్తులు తనపై రాడ్లు, కర్రలతో దాడిచేశారని బాధితుడు హన్ను విలేకర్లకు తెలిపారు. దీనిపై డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ దాడిని తీవ్రంగా ఖండించారు. సుమారు ఆరుగురు టీడీపీ గూండాలు దాడిచేశారని, తలకు, చేతులకు గాయాలయ్యాయన్నారు. రెడ్బుక్ రాజ్యాంగం అమలులో భాగంగానే ఈ దాడి జరిగిందన్నారు. పోస్టులు పెట్టే వారిపై దాడిచేసి గొంతు నొక్కే కార్యక్రమంలో భాగంగానే ఈ దాడి జరిగిందన్నారు. స్థానిక శాసనసభ్యులు, ఆయన కుమారుడు ఒక పథకం ప్రకరం జాబితా తయారుచేసి దాడులకు పాల్పడుతున్నారన్నారు. 24వ వార్డుకు చెందిన బాధితుడిని వెంబడించి దాడిచేశారన్నారు. వచ్చే తమ ప్రభుత్వంలో తాము జాబితా తయారుచేస్తామన్నారు. ఎవరు దాడిచేసింది, ఎవరు ప్రేరేపించారనేది తమ వద్ద సమాచారం ఉందన్నారు. గత ప్రభుత్వంలో తమపై అనేక పోస్టులు పెట్టినా తాము దాడులు చేయలేదని చెప్పారు. దాడికి పాల్పడిన వ్యక్తికి చెందిన బుల్లెట్ బండిపై స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడతో కూడిన వీడియోను డాక్టర్ గోపిరెడ్డి విలేకర్లకు చూపించారు. తమ కార్యకర్తలపై దాడిచేయాలనే ముందస్తు ప్లాన్తో టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై వెంటనే కేసు నమోదుచేసి అరెస్టు చేయాలని, ఇటువంటి చర్యలు పునరావృతం గాకుండా జిల్లా ఎస్పీ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా లీగల్ సెల్ అధ్యక్షురాలు రోళ్ల మాధవి, రాష్ట్ర కార్యదర్శి పడాల శివారెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్ కరిముల్లా, వరవకట్ట పెద్దబుజ్జి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పల్నాడు
మంగళవారం శ్రీ 21 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో సోమవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.8000, గరిష్ట ధర రూ.13,700, మోడల్ ధర రూ.10,500 వరకు పలికింది.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడంలేదు. దిగువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నిల్వ 33.2280 టీఎంసీలు.రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ సౌత్ రీజియన్ ఏడీ జ్ఞానసుందరం చీరాల: అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, సరైన జాగ్రత్తలు పాటిస్తే ఆస్తి, ప్రాణ నష్టాన్ని నివారించవచ్చని రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ సౌత్ రీజియన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.జ్ఞానసుందరం పేర్కొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం స్థానిక ఐటీసీ కంపెనీలో అగ్ని ప్రమాదాల నివారణపై జరిగిన వర్క్షాపులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఫైర్ సర్వీసెస్ సౌత్ రీజియన్ ఏడీ మాట్లాడుతూ.. వారం రోజులపాటు నిర్వహించిన కార్యక్రమాలను వర్క్షాపులో వివరించారు. గృహాలు, పరిశ్రమలు, పెట్రోలు బంకులు, హాస్పిటళ్లు, సినిమా హాళ్లలో అగ్ని నిరోధకాలు తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. విద్యుత్, గ్యాస్ కారణంగా సంభవించే ప్రమాదాల్లో ఎక్కువగా ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకుంటోందన్నారు. తమ సిబ్బంది ఇచ్చే సూచనలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని చెప్పారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోగా అందుబాటులో ఉన్న అగ్ని నిరోధకాలతో మంటలు అదుపు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం అగ్నిమాపక పరికరాల గురించి వివరించారు. కార్యక్రమంలో ఐటీసీ వైస్ ప్రెసిడెంట్ కేఎన్రావు, జిల్లా అగ్నిమాపక అధికారి కె.వినయ్, చీరాల సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి వీవీ రామకృష్ణ, ఐటీసీ జీఎం శ్యామ్సుందర్, ఈహెచ్ఎస్ సీనియర్ మేనేజర్ ఎంఎస్ఎన్ రెడ్డి, జిల్లాలోని వివిధ కంపెనీల ప్రతినిధులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. మట్టిలో మౌనం.. శతాబ్దాల ధ్యానం.. నాగలి స్పర్శతో భక్తులకు దర్శనం అలంకారం వీడి..ఆత్మరూపం చూపి తరాల సేవ..తరగని భక్తి... అర్జీలను ప్రత్యేక దృష్టితో పరిష్కరించాలిఆసుపత్రిపై అర్ధరాత్రి దాడి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా7 -
వైభవంగా శివపార్వతుల కల్యాణం
అమృతలూరు(భట్టిప్రోలు): అమృతలూరు మండలం గోవాడలో ప్రసిద్ధి గాంచిన శైవక్షేత్రమైన గంగా పార్వతి సమేత బాలకోటేశ్వరస్వామి దేవాలయంలో ఐదు రోజులుగా నిర్వహిస్తున్న మహా కుంభాభిషేకం సోమవారంతో ముగిసింది. దేవాలయ అర్చకులు చావలి శ్రీధర్శర్మ పండిత బృందం హోమ కార్యక్రమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశాయి. అనంతరం దేవాలయాల శిఖరాలకు విద్యా పీఠం పీఠాధిపతి పజ్ఞానంద సరస్వతి (బాల స్వామిజీ) మహా కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణం నిర్వహించారు. సుమారు 10 వేల మంది భక్తులు పాల్గొని తిలకించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు, అన్న ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం వేద పండితులు, దాతలు, కార్యకర్తలను సత్కరించారు. కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ పావులూరి రమేష్, కార్యనిర్వాహణాధికారి మంతెన విఠల్ శ్రీనివాసవర్మ, మంతెన అనుపమ, పావులూరి సుబ్బారావు, గడ్డిపాటి శ్రీనివాసరావు (వాసు), నిర్వాహకులు ఉప్పల పద్మజ, అరుణ, తమ్మన సాంబశివరావు, నన్నపనేని పద్మ, పావులూరి వరలక్ష్మి, ఆర్యవైశ్య అన్నదాన సత్రం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
నా స్థలం వేరొకరికి రిజిస్ట్రేషన్ చేశారు
సాక్షి టాస్క్ఫోర్స్: ప్లాట్ను మరొకరికి రిజిస్ట్రేషన్ చేసి, వచ్చిన సొమ్ములో సగభాగం చెల్లించకుండా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మోసగించాడని టీడీపీ మహిళా కార్యకర్త మీడియా ఎదుట బోరున విలపించింది. మాకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో జరిగిన పీజీఆర్ఎస్లో బాధితురాలు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మంగళగిరి బేతపూడి గ్రామం బాపూజీనగర్లో నివాసం ఉంటున్నట్లు బొక్కా సుధారాణి తెలిపింది. ప్రస్తుతం పూల విక్రయిస్తూ జీవిస్తున్నట్లు పేర్కొంది. 2017 కురగల్లు గ్రామ పరిధిలో 150 గజాల స్థలాన్ని నూతక్కిలో విధులు నిర్వర్తించే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి వద్ద కొనుగోలు చేశానని తెలిపింది. 2021లో ప్లాట్గా మారడంతో ఆ ఉపాధ్యాయుడు స్వాధీన అగ్రిమెంట్ రాసిచ్చాడని పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో తమకు తెలియకుండానే నా 150 గజాల స్థలంతోపాటు అందులోని మిగతా స్థలం కలిపి ఉపాధ్యాయుడు వేరొకరికి విక్రయించి రిజిస్ట్రేషన్ చేయించాడని వాపోయింది. దీనికిగాను నా 150 గజాల స్థలానికి రూ.50 లక్షలు ఉపాధ్యాయుడు చెల్లించాల్సి ఉందని తెలిపింది. డబ్బుల విషయమై అతన్ని పలుమార్లు అడిగినా సరైన సమాధానం లేదని వాపోయింది. దీనిపై మంగళగిరి గ్రామీణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు. టీడీపీలో కార్యకర్తగా పనిచేస్తున్న తమకు న్యాయం జరగడంలేదని వాపోయింది. లోకేష్తోపాటు ఎవరూ వద్దకెళ్లినా న్యాయం జరగదని అవతల వారు బెదిరిస్తున్నారని రోదించింది. ఇక మరణమే తనకు దిక్కు అని సుధారాణి మీడియా ఎదుట కన్నీటిపర్యంతమైంది. -
సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలి
నరసరావుపేట రూరల్: తన మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుగా పోస్టు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం నరసరావుపేట రూరల్ పోలీసు స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బానిస అని వ్యాఖ్యనించడం జరిగిందన్నారు. మా పార్టీ అధ్యక్షుడిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ టీడీపీకి దాసి లాగా షర్మిల పనిచేస్తున్నారని విమర్శించినట్టు వివరించారు. దీనిని దురుద్దేశంతో టీడీపీ నాయకులు, టీడీపీ ట్రెండ్స్, స్వాతిరెడ్డి తదితరులు తప్పుదారి పట్టిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నా రాజకీయ ప్రతిష్టను దెబ్బతీస్తూ వదంతులు వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మహేష్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ షర్మిలపై తాను చేసిన విమర్శలకు కాంగ్రెస్ నాయకులు స్పందించలేదని, టీడీపీ నాయకులు మాత్రం దానిని వక్రీకరించి సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దీనిపై దుష్ప్రచారం చేస్తున్న వారి వివరాలు పోలీసులకు అందజేశామని తక్షణం వారిపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు పేర్కొన్నారు. దాసి అనే దానికి అర్థాన్ని టీడీపీ నాయకులు తెలుసుకోవాలని సూచించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు నటించిన పౌరాణిక చిత్రంలోని వీడియోను ప్రదర్శించి దాసి అంటే సేవకురాలు అని అర్థం అని తెలిపారు. ‘మాకు అధికారం ఉంది మేమే నరుకుతాం’ అంటూ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, చంద్రబాబుతో జాగ్రత్తగా ఉండాలని, సొంత మామను వెన్నుపోటు పొడిచి చనిపోయే వరకు చంద్రబాబు తీసుకెళ్లాడని గుర్తుచేశారు.


