దర్శి కమిషనర్ గృహాలపై ఏసీబీ దాడులు
● ఆదాయానికి మించి
అక్రమ ఆస్తులు గుర్తింపు
● 729 గ్రాములు బంగారం,
9 కిలోల వెండి స్వాధీనం
నరసరావుపేట: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే కారణంతో ప్రకాశం జిల్లా దర్శి ధర్డ్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ యడల మహేశ్వరరావు నివాస గృహాలపై అవినీతి నిరోధకశాఖ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల మేరకు...ఈ దాడుల్లో అతను ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లుగా గుర్తించామన్నారు. దర్శిలోని అతని కార్యాలయం, నరసరావుపేట, సత్తెనపల్లిలోని ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అతని అక్రమ ఆస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. స్థిరాస్తులకు సంబంధించి తొమ్మిది ఇళ్ల స్థలాలు, రెండు నివాస గృహాలు, 89 సెంట్ల వ్యవసాయ భూమిని గుర్తించారు. చరాస్తులకు సంబంధించి రూ.2.60 లక్షల నగదు, రూ.55వేల బ్యాంకు బాలెన్స్, 729 గ్రాముల బంగారు ఆభరణాలు, 9.275 కేజీల వెండి, ఒక కారు, మూడు మోటారు సైకిళ్లు, విలువైన గృహోపకరణాలు ఉన్నాయి. తన అక్రమ ఆస్తులను భార్య, కుమారుడు, తల్లి పేరిట కొనుగోలు చేశాడు.
● సత్తెనపల్లిరోడ్డులోని సాయినగర్లో గల రామా డ్రీమ్ హోమ్స్ అపార్టుమెంట్ 101 ప్లాట్లో మహేశ్వరరావు కుటుంబం నివాసం ఉంటుంది. దాడి సమయంలో మహేశ్వరరావు ఇంటిలో లేరు. ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. సుమారు 10మంది సభ్యులు గల ఏసీబీ బృందం ఇంటి మొత్తాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
● దర్శి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా స్థానిక టీడీపీ సీనియర్ నాయకుడి కోడలు వ్యవహరిస్తూ ఇక్కడే నివాసం ఉంటుండగా ఆ నియోజకవర్గానికి చెందిన వ్యక్తిపై ఏసీబీ దాడి జరగటం గమనార్హం..
● మహేశ్వరరావు 1998లో కారుణ్య నియామకంపై బిల్లు కలెక్టర్గా సత్తెనపల్లిలో పనిచేశారు. 2014–19 మధ్యకాలంలో నరసరావుపేట పురపాలక సంఘంలో ఆర్ఐగా పనిచేస్తూ ఆర్ఓగా పదోన్నతి పొందారు. సత్తెనపల్లి, వినుకొండ పురపాలక సంఘాల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. రెవెన్యూ ఆఫీసర్గా వినుకొండలో పనిచేస్తూ పదోన్నతిపై దర్శి మున్సిపాల్టీకి ఇన్చార్జి కమిషనర్గా మూడేళ్ల నుంచి పనిచేస్తున్నారు.
దర్శి కమిషనర్ గృహాలపై ఏసీబీ దాడులు


