breaking news
Palnadu District Latest News
-
ప్రకృతి మాతా ప్రణామం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో మూడు రోజులుగా జరుగుతున్న శాకంబరీ ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి. ఉత్సవాలలో మూడో రోజున అమ్మవారికి డ్రై ఫ్రూట్స్తో అలంకరించగా, అమ్మవారి ప్రధాన ఆలయాన్ని వివిధ రకాల పండ్లు, కాయలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. మరో వైపున ఆషాఢ పౌర్ణమి నేపథ్యంలో తెల్లవారుజామున దుర్గగుడి ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ ప్రారంభమైంది. సుమారు 8 కిలోమీటర్ల మేర సాగిన ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణలో పెద్ద ఎత్తున భక్తులు, అమ్మవారి సేవకులు, సిబ్బంది పాల్గొన్నారు. శాకంబరీ ఉత్సవాలలో మూడు రోజులలో 45 టన్నుల కూరగాయలను ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయం, ఇతర ఉపాలయాల అలంకరణకు వినియోగించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. మూడు రోజుల ఉత్సవాలలో మొత్తం 2.50 లక్షల మంది భక్తులు అమ్మవారికి శాకంబరీగా దర్శించుకున్నారని పేర్కొన్నారు. ఉత్సవాలలో మొదటి రెండు రోజులు ఆకుకూరలు, కాయగూరలతోనూ, మూడో రోజున డ్రైఫ్రూట్స్తో అలంకరించారు. బంగారు గోపుర ప్రాకారం చుట్టూ బత్తాయిలు, కమలాలు, పైనాపిల్, డ్రాగన్ ఫ్రూట్స్, యాపిల్, ఆల్బక్రా, ద్రాక్షలతో అలంకరించారు. శాకంబరీ ఉత్సవాలను పురస్కరించుకుని మూడు రోజుల పాటు జరిగిన కదంబ ప్రసాద వితరణపై భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు నిర్విరామంగా కదంబ ప్రసాదాన్ని భక్తులకు అందించామని ఆలయ ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. రాజగోపురం ఎదుట మంచుతో ఏర్పాటు చేసిన శివలింగం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. వైభవంగా గిరి ప్రదక్షిణ ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం తెల్లవారుజామున ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ ఘాట్రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైంది. కామథేను అమ్మవారి ఆలయం వద్ద దేవస్థాన ప్రచార రథానికి ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణలతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి గిరిప్రదక్షిణను ప్రారంభించారు. -
గ్రానైట్ అక్రమ రవాణాపై క్రిమినల్ కేసులు
నరసరావుపేట: జిల్లాలో గ్రానైట్ అక్రమ రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా హెచ్చరించారు. గ్రానైట్ అక్రమ రవాణా, మైనింగ్ నివారణ దిశగా వివిధ శాఖల అధికారులతో బుధవారం కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ... జీఎస్టీ చెల్లించకుండా రవాణా చట్టరీత్యా నేరమని అన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, సిబ్బందితో నిరంతరం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత వాహనాలను సీజ్ చేయడంతోపాటు ఆయా వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసు, గనుల శాఖ అధికారులను ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, రవాణా, జీఎస్టీ అధికారులు కమిటీగా ఏర్పడి రాష్ట్ర, జిల్లా సరిహద్దుల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. చెక్పోస్ట్ల వద్ద విస్తృత తనిఖీ చేయాలని, మూడు షిఫ్టుల్లో పని చేయాలని అన్నారు. గతేడాది జూలై నుంచి ఇప్పటివరకు మొత్తం ఎనిమిది కేసులు నమోదయ్యాయని అధికారులు పేర్కొన్నారు. అందులో దాచేపల్లి 4, కారంపూడి, నకరికల్లు, మాచెర్ల, మాచవరంలలో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయని చెప్పారు. వారిపై తీసుకున్న చర్యలను గురించి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అడిషనల్ ఎస్పీ సంతోష్, డీఆర్ఓ అద్దయ్య, అధికారులు పాల్గొన్నారు.అధికారులతో సమీక్షలో కలెక్టర్ -
ఆర్టీసీ కండక్టర్పై ప్రయాణికులు, గ్రామస్తుల దాడి
నరసరావుపేట: స్థానిక ఆర్టీసీ డిపో కండక్టర్ జి.పూర్ణచంద్రరావుపై ఫిరంగిపురం మండలం మేరికపూడి గ్రామంలో బుధవారం దాడి జరిగింది. దీనిని నిరసిస్తూ డిపో జేఏసీ నాయకులు నరసరావుపేట–గుంటూరు మార్గంలో తిరిగే పల్లెవెలుగు బస్సులను గ్రామం నుంచి కాకుండా బైపాస్గుండా మాత్రమే తిప్పుతామని, దాడిచేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ డీపీటీఓ టి.అజితకుమారికి వినతిపత్రం సమర్పించారు. దీనిపై యూనియన్ నాయకుడు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు గుంటూరు బస్టాండ్లో పాయింట్ లో నిలిపే సమయంలో బస్సుకు ఎదురుగా వచ్చి ఎక్కే ప్రయత్నం చేసిన ఏబు అనే ప్రయాణికుడిని కండక్టర్ పూర్ణచంద్రరావు వారించారన్నారు. దీంతో కండక్టర్పై వాగ్వివాదానికి దిగిన ఏబును అక్కడే ఉన్న బస్టాండ్ అవుట్ పోస్ట్ పోలీసులు తప్పని చెప్పి కౌన్సెలింగ్ ఇచ్చి అదే బస్సు ఎక్కించి పంపారన్నారు. దారిపొడవునా కండక్టర్ను బెదిరిస్తూ తన స్వగ్రామమైన మేరికపూడిలోని తన మిత్రులు, బంధువులకు సమాచారం ఇచ్చాడన్నారు. బస్సు మేరికపూడి గ్రామానికి చేరుకునే సమయానికి సుమారు 50 మంది మహిళలు, పురుషులు బస్సుకు అడ్డు నిలబడి ఆపారన్నారు. గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు బస్సులో వెనక భాగాన టిక్కెట్లు ఇస్తున్న కండక్టర్ పూర్ణచంద్రరావుపై విచక్షణారహితంగా దాడిచేసి టిక్కెట్లు ఇచ్చే టిమ్ మిషన్, క్యాష్ బ్యాగ్, ఫోన్ లాక్కొని కొట్టారన్నారు. ప్రయాణికుల నుండి వసూలు చేసిన క్యాష్ బ్యాగ్లోని డబ్బులు, ప్రభుత్వ ఆస్తిఅయిన టిక్కెట్లు ఇచ్చే మిషన్ను అపహరించారన్నారు. బస్సులోని ప్రయాణికుల సహాయంతో కండక్టర్, డ్రైవర్ ఫిరంగిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, క్షతగాత్రుడైన కండక్టర్ నరసరావుపేటలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్చారన్నారు. ఆర్టీసీ అన్ని యూనియన్ నాయకులు ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా వారికి కఠిన శిక్షలు విధించాలని ఆర్టీసీ యాజమానం, పోలీసులు, ప్రభుత్వానికి నాయకులు విజ్ఞప్తి చేశారు. -
ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మృతి
నరసరావుపేట టౌన్: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మృతి చెందిన సంఘటన బుధవారం నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్లో చోటుచేసుకుంది. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ జీరో జెడ్ 0456 నంబరు గల బస్సు విజయవాడ వెళ్తూ మార్గమధ్యంలో వినుకొండ మీదుగా నరసరావుపేటకు చేరింది. అందులో బొల్లాపల్లి మండలం సరిగొండపాలెం గ్రామానికి చెందిన బోయిన ఆదాము (55) ప్రయాణిస్తూ మృతి చెందాడు. నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల గమనించి విషయాన్ని ఆర్టీసీ సిబ్బందికు తెలియజేశారు. సమాచారం అందుకున్న వన్టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. చిలకలూరిపేటలో అనారోగ్యంతో ఉన్న తన భార్య మరియమ్మను చూసేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మృతుడి ఆరోగ్య పరిస్థితిపై బంధువులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు అనుమానస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఫిరోజ్ తెలిపారు. రొంపిచర్ల: మండలంలోని విప్పర్ల గ్రామ సమీపంలో కాసు బ్రహ్మానందరెడ్డి ఎక్స్ప్రెస్వేపై ఓ చూడిగేదెను బుధవారం రాత్రి లారీ ఢీకొట్టడంతో గేదె అక్కడికక్కడే మృతి చెందింది. గమనించిన స్థానికులు వెంటనే లారీని నిలుపుదలచేసి పోలీసులు సమాచారం అందించారు. మిన్నీ జాతికి చెందిన ఈ గేదె విలువ రూ.2లక్షల వరకు ఉంటుందని స్థానిక రైతులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న రొంపిచర్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. గురజాల: గురజాల పట్టణానికి చెందిన వంకాయల అక్షయ్ కుమార్ టీటీడీ శ్రీవారి దర్శన టికెట్లు ఇప్పిస్తానని నమ్మబలికి కొంతమంది వ్యక్తుల వద్ద నుంచి డబ్బులు తీసుకుని టికెట్లు ఇప్పించకుండా పలుమార్లు తప్పుడు హామీలు ఇస్తూ తప్పించుకొని తిరుగుతూ మోసానికి పాల్పడినట్లు సీఐ ఎం.మురళీ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ తమకు అందిన ఫిర్యాదు మేరకు గురజాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశామన్నారు. ఫిర్యాదులోని ఆరోపణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు గురజాల పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ టీటీడీ దర్శన టికెట్లు, ప్రభుత్వ సేవలు లేక ఇతర సౌకర్యాలు ఇప్పిస్తామని చెప్పే వ్యక్తులను నమ్మి నగదు చెల్లించవద్దని, ముందుగా వారి విశ్వసనీయతను నిర్ధారించుకోవాలన్నారు. వారు చెప్పే మోసపూరిత మాటలకు లొంగి నగదును ఇవ్వాల్సిన సంఘటనలు ఎదురైతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు. పిడుగురాళ్ల: భవన నిర్మాణ కార్మికుడు విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. సంఘటనకు సంబంధించిన పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు తెలిపిన వివరాల మేరకు... పశ్చిమ బెంగాల్ రాష్ట్రం 24 పరగణాల జిల్లా షుతి గ్రామానికి చెందిన మనోజ్ బిశ్వాస్ (38) గత కొంత కాలంగా పట్టణంలోని రజక కాలనీకి సమీపంలోని ఎస్సీ స్మశాన స్థలంలో నిర్మిస్తున్న మురుగునీటిని శుద్ధి చేసే ప్రాజెక్టులో పనిచేసేందుకు వచ్చాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి అక్కడ ట్యాంక్లో వర్షపునీరు నిల్వ ఉండటం, ఆ వర్షపు నీటిని మోటర్ ద్వారా బయటికి పంపించే క్రమంలో మోటార్ వైర్ జాయింట్ ఉండటంతో ఆ జాయింట్ మనోజ్ బిశ్వాస్కు తగిలి విద్యుత్ షాక్కు గురై అక్కడిక్కడే మృతి చెందాడు. తోటి కార్మికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు పట్టణ సీఐ సంఘటనా స్థలానికి చేరుకొని సంఘటనకు సంబంధించిన కారణాలను తెలుసుకున్నారు. మృతుడి స్నేహితుడు, తోటి కార్మికుడైన సుశాంత్ బిశ్వాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎస్.వెంకట్రావు పేర్కొన్నారు. కారెంపూడి: చారిత్రక ప్రసిద్ధి చెందిన మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలోని సింగరుట్ల క్షేత్రంలో కొలువై ఉన్న స్వయంభు శ్రీనారసింహాస్వామి ఆలయ పునఃనిర్మాణానికి రూ.2 కోట్లు సీజీఎఫ్ నిధులు విడుదలైనట్లు దేవదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులిచ్చారని దేవాలయ వంశపారంపర్య ధర్మకర్త గుండాల శ్రీనివాసరావు బుధవారం రాత్రి విలేకర్లకు తెలిపారు. మ్యాచింగ్ గ్రాంటు కింద రూ. 20 లక్షలు జమ చేయాల్సి ఉందన్నారు. మ్యాచింగ్ గ్రాంటు మొత్తం జమ కాగానే సీజీఎఫ్ నిధులు దేవాలయ బ్యాంకు ఖాతాలో జమ అవుతాయన్నారు. నెల రోజుల గడువు లోగా మ్యాచింగ్ గ్రాంటు జమ చేయాల్సి ఉందన్నారు. గుణదల(విజయవాడ తూర్పు): మితిమీరిన వేగంతో వెళుతున్న ఓ వాహన చోదకుడి నిర్లక్ష్యానికి ఓ మహిళ మృతి చెందిన ఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన దాసరి సత్యనాగ కుమారి (63) గృహిణి. వ్యక్తిగత పనుల నిమిత్తం బుధవారం విజయవాడ నగరానికి చేరుకుంది. బందరురోడ్డు పీవీపీ మాల్ వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వైపు వేగంగా వెళుతున్న మట్టా భాను ప్రకాష్ తన ద్విచక్రవాహనంతో ఢీకొట్టాడు. దీంతో రోడ్డుపై పడిపోయిన సత్యనాగ కుమారి తలకు బలమైన గాయమై అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికులు మాచవరం పోలీసులకు సమాచారం అందించారు. వివరాలు సేకరించిన పోలీసులు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యుల కోరిక మేరకు మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి తాడేపల్లి మున్సిపల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన వైద్యులు ఆ వృద్ధురాలు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహన చోదకుడిని అదుపులోకి తీసుకుని బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. సత్యనాగకుమారి మృతితో ఆమె కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. -
వసూళ్ల రోగం.. ఫిర్యాదుల పర్వం
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్ పరిపాలన కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులపై ఆస్పత్రి అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. కొంతమంది ఉద్యోగులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులు వస్తున్నా, సాక్షాత్తూ జిల్లా కలెక్టర్కు సైతం ఫిర్యాదులు వెళ్లినా, ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదు. ఆస్పత్రి ఉద్యోగులు వర్గాలుగా విడిపోయి పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటూ ఆస్పత్రి పరువును బజారున పడేస్తున్నారు. మామూళ్ల మత్తులో... కార్యాలయ ఉద్యోగుల్లో కొంతమంది మామూళ్ల మత్తులో మునిగితేలుతున్నారు. సదరు ఉద్యోగులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులు కూడా వెళ్లాయి. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో కేవలం సీట్ల మార్పులతోనే సరిపెట్టేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులపై ఆస్పత్రి అధికారులు ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. దీంతో వారి తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు వచ్చినప్పుడు విచారణ పేరుతో కమిటీలు వేసి కాలయాపన చేయడమే తప్ప, కఠిన చర్యలు తీసుకోవడం లేదు. సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు అవినీతికి పాల్పడుతున్న కొంతమందిపై ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఆస్పత్రి ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. కొంతమంది కార్యాలయంలోనే కూర్చొబెట్టి పంచాయితీలు పెడుతున్నారు. ఉద్యోగులు ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని ఫైళ్లు క్లియర్ చేశారు, ఏవి ఎప్పటి నుంచి పెండింగ్లో ఉన్నాయి, వాటికి కారణాలేమిటి, త్వరగా క్లియర్ చేయాలని ఆదేశాలు ఇవ్వడం వంటి విధులు నిర్వర్తించాల్సిన అధికారులు తనిఖీలు కూడా చేయడం లేదు. తమ గదుల్లోనే కూర్చుండిపోవడంతో పరిపాలన కార్యాలయంలో ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయి. పాలన కుంటుపడుతోంది. అవినీతి వాటాల పంపకాల్లో తేడాల రావడం వల్లే సోషల్ మీడియా వేదికగా ఉద్యోగులు గ్రూపులుగా విడిపోయి ఆరోపణలు చేసుకుంటున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి క్రమశిక్షణ పెంచి, సకాలంలో ఫైళ్లు క్లియర్ అయ్యేలా చూడటంతోపాటు అవినీతిని నిర్మూలించాల్సి ఉంది. -
రైతులు పంటల బీమా నమోదు చేసుకోవాలి
స్వాతంత్య్ర వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు.. నరసరావుపేట: స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహణకు అధికారులు సమన్వయంతో పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. కలెక్టరేట్లో స్వాతంత్య్ర దినోత్సవం నిర్వహణకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లపై బుధవారం అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 15న స్థానిక పెరేడ్ గ్రౌండ్లో నిర్వహించే వేడుకల్లో.. జెండా వందన కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు, వేదికను అందంగా అలంకరించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు, స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబ సభ్యులు, ఇతర అతిథులను వేడుకలకు ప్రత్యేకంగా ఆహ్వానించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. జాతీయ పతాక ఆవిష్కరణ, పోలీసుల మార్చిఫాస్ట్లో ఎన్సీసీ కేడెట్లను భాగస్వామ్యం చేయాలని సూచించారు. అదనపు ఎస్పీ జేవీ సంతోష్, డీఆర్ఓ అద్దెయ్య, ఇతర అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
బెదిరించి నగదు వసూలు చేసిన ముగ్గురు నిందితులు అరెస్టు
మంగళగిరి రూరల్: మంగళగిరి మండలం యరబ్రాలెం గ్రామంలో సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని అనంతరం బెదిరింపులకు పాల్పడి నగదు వసూలు చేసిన ముగ్గురు నిందితులను మంగళగిరి రూరల్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.90 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని, నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు రూరల్ సీఐ చిరుమామిళ్ల వెంకట్ తెలిపారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం ఒడిశాకు చెందిన ఉదయ్ బెహరా యరబ్రాలెం పారిశ్రామికవాడ లో అల్యుమినియం కంపెనీలో పనిచేస్తున్నాడు ఇతను సోషల్ మీడియాలో పోలో గే అనే డేటింగ్ యాప్ ద్వారా విజయవాడ కు చెందిన మహంకాళి కిషోర్, పచ్చిగోళ్ళ మోషే, పల్లేటి క్రాంతికుమార్లతో పరిచయం పెంచుకున్నారు. ఈ ముగ్గురు జూలై 26 అర్ధరాత్రి యరబ్రాలెంలోని ఉదయ్ బెహరా గదికి వెళ్లి బెదిరింపులకు పాల్పడి ఫోన్న్ పే ద్వారా రూ.90 వేలు, మరో బాధితుడి నుంచి రూ.800 బదిలీ చేయించుకున్నారని తెలిపారు. బాధితుడు ఫిర్యాదు మేరకు సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలతో నిందితులను గుర్తించి జూలై 28న అరెస్ట్ చేశారు. అనంతరం మంగళగిరి కోర్టులో హాజరుపరచగా, వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. తాడేపల్లి రూరల్ : తాడేపల్లి రూరల్ పరిధిలోని ఉండవల్లి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున తాడేపల్లి పోలీసులు ఎటువంటి అనుమతులు, బిల్లులు లేకుండా మట్టి తరలిస్తున్న నాలుగు లారీలను సీజ్ చేశారు. సాయంత్రం వరకు ఎటువంటి కేసు నమోదు చేయలేదు. కొంతమంది టీడీపీ నాయకులు విజయవాడ నుంచి తాడేపల్లి పోలీస్స్టేషన్కు వచ్చి తిష్టవేసి లారీలను వదలాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. లారీలు అతివేగంగా వెళుతున్నాయని ఒక కారును ఢీకొట్టారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఈ లారీలను సీజ్ చేశారు. సాయంత్రం 6 గంటల వరకు పట్టుకున్న లారీలపై ఎటువంటి కేసు నమోదు చేయలేదు. -
సామాన్యుడిపై ధరవు
జిల్లాలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర భారం పడుతోంది. బియ్యంతో పాటు వంటనూనెలు, పప్పుధాన్యాలు, వేరుశనగ గుళ్లు, పంచదార తదితర వస్తువుల ధరలు అమాంతం పెరగడంతో రెండు పూటలా కుటుంబాన్ని నెట్టుకొచ్చే పరిస్థితి కూడా కష్టంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల ధరలు సైతం భారీగా పెరగడంతో పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సత్తెనపల్లి: ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సన్న బియ్యం నుంచి దొడ్డ బియ్యం వరకు నెల రోజుల్లోనే 20 నుంచి 40 శాతం వరకు ధరలు పెరిగాయి. పెరిగిన ధరలతో పప్పుధాన్యాలు, అపరాలు, పంచదార వంటి వస్తువులు కొనలేని పరిస్థితి ఏర్పడిందని వినియోగదారులు వాపోతున్నారు. ఈ వారం మార్కెట్ ధరలను పరిశీలిస్తే చాలా వస్తువులపై కిలోకు రూ.10 నుంచి రూ.30 వరకు పెరిగినట్లు కనిపిస్తోంది. వంటనూనెల ధరలు కూడా మరింత భారంగా మారాయని ప్రజలు చెబుతున్నారు. ఇష్టానుసారంగా విక్రయాలు జిల్లాలోని అనేక కిరాణా దుకాణాల్లో వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలు నిర్ణయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే వస్తువు ఒక దుకాణంలో ఒక ధరకు, మరో దుకాణంలో మరో ధరకు విక్రయిస్తున్నారు. గతంలో రూ.1,350 ఉన్న 25 కిలోల సన్న బియ్యం బస్తా ప్రస్తుతం రూ.1,550కు చేరింది. కర్నూలు రకం బియ్యం గత నెలలో రూ.1,050 ఉండగా ప్రస్తుతం రూ.1,500కు విక్రయిస్తున్నారు. అంటే క్వింటాకు దాదాపు రూ.800 వరకు ధర పెరిగినట్లు తెలుస్తోంది. హోల్సేల్, రిటైల్ వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి ఇష్టానుసారంగా ధరలు నిర్ణయిస్తున్నప్పటికీ పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జీఎస్టీ తగ్గినా పాత ధరలే నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ తగ్గింపు అమలు కావడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కొత్త జీఎస్టీ స్లాబులు మార్కెట్లో అమలు కావడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా దుకాణాల్లో ఇప్పటికీ పాత ధరలకే విక్రయాలు కొనసాగుతున్నాయి. సరుకుల ధరలు, సబ్బులు, ఇతర వస్తువులపై జీఎస్టీ తగ్గింపును అమలు చేయాలని వినియోగదారులు ప్రశ్నిస్తే, వంటనూనెలకు జీఎస్టీ తగ్గలేదంటూ కొందరు వ్యాపారులు సమాధానం చెబుతున్నారు. ఆన్లైన్లో ఒక ధర, క్షేత్రస్థాయిలో మరో ధర ఉండటంతో వినియోగదారులు అయోమయానికి గురవుతున్నారు. ప్రతి దుకాణంలో నిత్యావసర వస్తువుల ధరల పట్టికను తప్పనిసరిగా ప్రదర్శించాలని అధికారులు ఆదేశించినప్పటికీ, జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఈ నిబంధన అమలు కావడం లేదు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ధరల పట్టికలు లేకుండానే వ్యాపారులు విక్రయాలు కొనసాగిస్తున్నారు. ధరలపై ప్రశ్నించిన వినియోగదారులకు ‘ఇంకా కొత్త ధరలు అమల్లోకి రాలేదు‘ అంటూ వ్యాపారులు సమాధానం ఇస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. మరోవైపు, చౌకధరల దుకాణాల్లో రాయితీపై అందించే కందిపప్పు సరఫరాను 2025 ఫిబ్రవరి నుంచి ప్రభుత్వం నిలిపివేయడంతో ప్రజలు బహిరంగ మార్కెట్పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పనులు లేక కూలీలు, పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు, వేతనాలు పెరగని స్కీం వర్కర్లు పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
శాకంబరీదేవిగా బాల చాముండేశ్వరి
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతి బాల చాముండికా సమేత అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం బాలచా ముండేశ్వరి దేవిని శాకంబరి మాతగా అలంకరించారు. ఆషాఢ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారిని అన్నిరకాల కూరగాయలతో ఎంతో ఆకర్షణీయంగా అలంకరించారు. లోక కల్యాణార్థం పాడి పంటలతో రైతులంతా సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రకృతిలో దొరికె అన్నిరకాల కూరగాయలతో అలంకరించామని ఆలయ స్థానాచార్యుడు కౌశిక చంద్రశేఖరశర్మ తెలిపారు. అలాగే ఆలయంలోని జ్వాలాముఖి దేవి అమ్మ వారిని కూడా శాకబరీదేవిగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాల చాముండేశ్వరి దేవి అమ్మ వారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. నరసరావుపేట రూరల్: లింగంగుంట్ల కాలనీ రాజునగర్లోని మానసాదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం అమ్మవారికి ఆషాఢం సారె సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రతేక అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, గాజులు, గోరింటాకు ప్యాకెట్లు, స్వీట్లు, పండ్లు తదితరాలు సమర్పించారు. కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ చక్రానికి కుంకుమ పూజ నిర్వహించారు. ఆలయ నిర్వాహకుడు రంగావజ్జుల కోటేశ్వర శాస్త్రి ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు జరిగాయి. అమరావతి: అమరావతి గ్రామ దేవత పెద్దింటమ్మకు ఆషాఢ పౌర్ణమి సారె సమర్పించే కార్యక్రమాన్ని బుధవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయాన్నే అమ్మవారికి పంచామృత అభిషేకం చేశారు. అనంతరం గ్రామంలోని మహిళా భక్తులు అమ్మవారికి సారె సమర్పించేందుకు మేళాతాళాలతో ఊరేగింపుగా బయలుదేరారు. ఆలయానికి చేరుకుని అమ్మవారికి సారె సమర్పించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ రూరల్ పరిధిలోని పలు దేవాయాలలో బుధవారం గురుపూర్ణిమ వేడుకలను వైభవంగా నిర్వహించారు. సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై గురుపూర్ణిమ వేడుకల్లో భాగంగా ఉదయం 9 గంటలకు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్ద జీయర్ స్వామి వారికి అభిషేకం, 10 గంటలకు విద్యామూర్తి శ్రీలక్ష్మీ హయగ్రీవ హోమం, 10.30 గంటలకు అస్మత్ ఆచార్య ఆరాధన, అష్టోత్తర శతనామార్చన, తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. ● తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం చెట్టుకింద ఆంజనేయ స్వామి వారి ఆలయంలో గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హనుమంతుడిని ఆయనకు ప్రీతిపాత్రమైన 5 వేల గారెలతో అలంకరించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
పులిచింతలు తప్పవా?
అచ్చంపేట: అచ్చంపేట మండల సరిహద్దులోని పులిచింతల ప్రాజెక్టు రిజర్వాయర్లో నీటి నిల్వలు రోజు రోజుకు తగ్గుతున్నాయి. ప్రాజెక్టు సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 28 టీంసీలకు చేరింది. ప్రాజెక్టుకు దిగువకు తెలంగాణ వైపు ఉన్న జల విద్యుత్ ఉత్పత్తి యూనిట్కు రోజుకు 400 నుంచి 1000 క్యూసెక్కులు వదులుతున్నారు. జులై మాసం ముగుస్తున్నా సరైన వర్షాలు లేకపోవడంతో ఎగువన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండి, మిగులు నీరు వచ్చే పరిస్థితులు కనిపించడంలేదు. గతంలో పులిచింతల ప్రాజెక్టుకు దిగువ కృష్ణా, డెల్టా ప్రాంతాలలో ఉన్న 13 లక్షల హెక్టార్ల ఆయకట్టు భూములకు ప్రాజెక్టు నుంచే సమృద్ధికి సాగునీరు అందేది. ఆయా ప్రాంతాల రైతులు ఏడాదిలో రెండు పంటలు పండించుకున్నారు. కాని ఈ ఏడాది పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రతి ఏటా జులై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాలలో వర్షాలు పుష్కలంగా కురవడంతో ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గేవి కావు. సాగునీటి కోసం రోజుకు 10,000 క్యూసెక్కులకు పైగా వదిలినప్పటికి ప్రాజెక్టులో 43 నుంచి 45 టీఎంసీల నిల్వ ఉండేది. ఈ ఏడాది ఇంత వరకు ఆయకట్టు భూములకు చుక్క నీటిని వదలలేదు. వరి పంట వేయకపోతే అన్నదాతలకు కష్టాలే... కృష్ణా, డెల్టా ప్రాంతాల రైతులు ఈ ఏడాది వరి వేయవద్దని సాక్షాత్తు సీఎం చంద్రబాబు ప్రకటించడంపై రైతులలో ఆందోళన తీవ్ర తరమైంది. ఒక వైపు ఎల్నినో ప్రభావం ముంచుకొస్తుంది. తీవ్ర సంక్షోభం ఏర్పడబోతుందని ముందే చెబుతున్న సీఎం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో శ్రద్ధ చూపించలేక పోతున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. వారు చెప్పిన ప్రకారం వరి పంట వేయకపోతే రైతుల పరిస్థితి ఏంటో అగమ్య గోచరంగా ఉంది. ఇప్పటికి బియ్యం క్వింటా రూ.6వేలకు చేరింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ నాటినుంచి నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయి. నిత్యావసర దినుసులు ఏవి కొనాలన్నా కిలో రూ.150 పైనా ఉన్నాయి. వీటికి తోడు బియ్యం ధరకూడా పెరిగితే అన్ని వర్గాలవారికి ఇబ్బందులు తప్పేటట్లు లేవు. నిల్వ డెడ్ స్టోరేజీకి చేరితే... ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరితే భూగర్భ జలాలు అడుగంటుతాయి. ఇప్పటికే ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న అచ్చంపేట, బెల్లంకొండ మండలాలలో భూగర్భ జలాలు అడుగంటాయి. ప్రాజెక్టు పూర్తిగా ఖాళీ అయితే 500 అడుగులలో బోరు వేసినా చుక్కనీరు పడే అవకాశాలుండవు. దీనివల్ల కృష్ణా డెల్టా ప్రాంత రైతాంగానికే కాకుండా పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని భూములకు సాగునీటి కష్టాలు తప్పవు. కృష్ణానదిలో నీటిలెవెల్స్ తగ్గిపోతే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు, రక్షిత మంచి నీటి పథకాలు పనిచేయవు. కరవు విలయతాండవం చేయక మునుపే ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని రైతాంగం కోరుతోంది. పులిచింతల ప్రాజెక్టులో తగ్గిన నీటి నిల్వ నీటి నిల్వ 43 టీఎంసీలు -
భక్తిశ్రద్ధలతో వేదవ్యాసునికి ఆరాధన
అమరావతి: ప్రముఖ వైష్ణవక్షేత్రమైన వైకుంఠపురంలోని భవఘ్ని ఆరామంలో ఉన్న శ్రీ వేదవ్యాస సనాతన ధర్మక్షేత్రంలో నిర్వహిస్తున్న గురుపూర్ణిమ మహోత్సవాల రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం వేకువజామున వ్యాసభగవానునికి సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, వ్యాసారాధన కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా భవఘ్ని గురూజీ భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆధునికత, నాగరికత పేరుతో మానవాళి చెడు మార్గంలో పడకుండా వ్యాసభగవానుడు అందించిన భగవద్గీత శాశ్వత మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. వ్యాసభగవానుడు ప్రసాదించిన వేదాలు, పురాణాలను భావితరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా అలరించింది. అలాగే వ్యాసదేవులు ప్రసాదించిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టుకున్న తర్వాత తమ జీవితాల్లో వచ్చిన మార్పులను భక్తులు అందరితో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సీతమ్మ వారికి సారె మంగళగిరి టౌన్: పట్టణంలోని కొప్పురావు కాలనీ 9వ లైన్లో ఉన్న అభయ ఆంజనేయస్వామి వారి దేవస్థానంలో మంగళవారం దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మహిళలు సీతమ్మ వారికి సారె సమర్పించారు. స్థానికంగా ఉన్న మహిళలు మేళ తాళాలతో సీతారాముల వారి నామాలను, హనుమాన్ చాలీసాను పారాయణం చేసుకుంటూ ఊరేగింపు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి కుంకుమ, పసుపు, గాజులు, చీర, పూలు సమర్పించారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో గురుపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవస్థానం కమిటీ అధ్యక్షుడు రాము, ప్రధాన కార్యదర్శి పంచుమర్తి చిన్న, కోశాధికారి రాజేంద్ర ప్రసాద్లతో పాటు సభ్యులు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట రూరల్: కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానానికి తొలి ఏకాదశి సందర్భంగా రూ.12.02 లక్షల ఆదాయం లభించినట్టు ఆలయ ఈవో డి.చంద్రశేఖర రావు తెలిపారు. ఆలయ ఆవరణలో మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ప్రధాన హుండీల ద్వారా రూ.11,62,024, అన్నదానం హుండీ ద్వారా రూ.40,342 కలిపి మొత్తం రూ.12,02,366 నగదు కానుకగా వచ్చింది. బంగారం 500 మిల్లీ గ్రాములు, వెండి 78 గ్రాములు, కొంత విదేశీ కరెన్సీ వచ్చినట్లు వివరించారు. దేవదాయ శాఖ అధికారి కె.మంజూష లెక్కింపును పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ యల్లమంద శాఖ సిబ్బంది, ఆలయ సూపరిండెంటెంట్ చల్లా శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు. భట్టిప్రోలులో గురుపౌర్ణమి వేడుకలు భట్టిప్రోలు: భట్టిప్రోలు సాయిబాబా మందిరంలో సాయినాథ – దత్తాత్రేయ స్వామి వార్ల గురుపౌర్ణమి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం, అష్టోత్తర పూజలు జరిగాయి. పూజా కార్యక్రమాలను వేద బ్రాహ్మణులు మురికిపూడి దుర్గాప్రసాద్ శర్మ నిర్వహించారు. సాయి నామ ప్రచార కార్యక్రమంలో భాగంగా భక్తులు పురవీధులలో భిక్షాటన నిర్వహించారు. కమిటీ అధ్యక్షుడు తమ్మన రమేష్బాబు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సాంబశివరావు, కోశాధికారి బి.కిరణ్కుమార్, కమిటీ సభ్యులు సీహెచ్ పాపారావు, బి. రమేష్బాబు, కె. రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నిరసన గళం
డీఎస్సీ అక్రమాలపై జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అవినీతి రాష్ట్ర ప్రజలందరూ చూశారన్నారు. నియామకాల్లో స్పోర్ట్స్ కోటాలో రూ.15 లక్షల లంచం తీసుకొని ఉద్యోగాలు అమ్ముకొని ప్రజలను మోసం చేసి బహిరంగ చర్చకు వైఎస్ జగన్మోహన్రెడ్డిని రమ్మని లోకేష్ అడగటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిరంగ చర్చకు జగన్మోహన్రెడ్డి అవసరం లేదని, తామే వస్తామని, లోకేష్కు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. డీఎస్సీలో అవకతవకలపై లోకేష్ సమాధానం చెప్పాలని నిలదీస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు ఇంకా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పార్లమెంటు సాక్షిగా ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.26 వేల కోట్లు మాత్రమేనని, ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 26 వేలే మాత్రమేనని కేంద్రం సమాధానమిచ్చిందని గుర్తుచేశారు. మీరు చెబుతున్నట్లుగా రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల కాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యార్థులకు కేవలం ఒక్క ఇన్స్టాల్మెంట్ మాత్రమే ఇచ్చారని, అసెంబ్లీలో రూ.వేయి కోట్లు విడుదల చేస్తున్నామని చెప్పారని, తమ పార్టీ ధర్నా అనగానే రూ.600 కోట్లు రిలీజ్ చేశామని ప్రకటన చేశారే కానీ ఇంతవరకు రూపాయి కూడా చెల్లించలేదని అన్నారు. ఈ ప్రభుత్వం యువతను, విద్యార్థులను పచ్చిగా మోసం చేస్తోందన్నారు. తల్లికి వందనం పథకంలో అర్హులైన విద్యార్థులు 84 లక్షల మంది ఉంటే కేవలం 64 లక్షల మందికే నగదు ఇచ్చారన్నారు. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందనే కారణంతోనే నియోజకవర్గంలో సుమారు ఐదు వేల మందికి తల్లికి వందనం ఎగ్గొట్టారని, ఇది ప్రజలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. నరసరావుపేట: డీఎస్సీలో అక్రమాలకు నైతిక బాధ్యత వహించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్సార్ సీపీ నరసరావుపేట, వినుకొండ, పెదకూరపాడు సమన్వయకర్తలు, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకరరావు డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, డీఎస్సీ అక్రమాలపై పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో పార్టీ విద్యార్థి, యువత విభాగాల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ర్యాలీ, ప్రదర్శనలో యువజనులు, విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి వందలాది మంది యువత, విద్యార్థులతో కలిసి ద్విచక్రవాహనాల ర్యాలీగా డాక్టర్ గోపిరెడ్డి, నంబూరు శంకరరావులు కలెక్టరేట్ రోడ్డులోని వైఎస్సార్ రహదారి వద్దకు చేరారు. అక్కడున్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అక్కడకు చేరుకున్న పార్టీ పీఏసీ మెంబర్, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో కలిసి ముందుకు సాగారు. డీఎస్సీ స్కామ్కు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలని బ్యానర్తో వందలాది మంది యువత వెంటరాగా కాలినడకన నిరసన ప్రదర్శనగా కలెక్టరేట్ ప్రవేశద్వారం వద్దకు చేరారు. లోకేష్ రాజీనామా చేయాలని, ‘‘ఇదేమి రాజ్యం – దోపిడీ రాజ్యం – దొంగల రాజ్యం’’, ‘‘డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం’’, ‘‘ మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ’’ అంటూ నినాదాలు చేశారు. ‘డీఎస్సీలో స్కామ్ చేయకపోతే సీబీఐ విచారణకు భయమెందుకు?’’, ‘‘నేతల చేతిలో స్పోర్ట్స్ సర్టిఫికెట్లు, అర్హులైన క్రీడాకారులకు కన్నీళ్లు’’ ‘‘పరీక్ష రాయకుండానే బాబు జమానాలో ఉద్యోగాలు’’, ‘‘రాత్రింబవళ్లు చదివిన వారు రోడ్డుపై, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమా?’’, ‘‘నిరుద్యోగ భృతి ఎప్పుడు?’’, ‘‘ఉద్యోగులకే కాదు నిరుద్యోగులకూ వెన్నుపోటు’’ అంటూ ప్లకార్డులు దారిపొడవునా ప్రదర్శించారు. పార్టీ జెండాలు చేబూని పార్టీ నాయకులు, యువత ప్రదర్శనలో పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శి, గురజాల నియోజకవర్గ పరిశీలకుడు పడాల శివారెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్ కరిముల్లా, రొంపిచర్ల, నరసరావుపేట మండలాల కన్వీనర్లు కురుగుంట్ల శ్రీనివాసరెడ్డి, తన్నీరు శ్రీనివాసరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు కనకా పుల్లారెడ్డి, గంటెనపాటి గాబ్రియేలు, మోరబోయిన శ్రీనివాసరావు, విద్యార్థి విభాగ రాష్ట్ర కార్యదర్శి ఉప్పతాళ్ల వేణుమాధవ్, యువజన విభాగ జిల్లా ఉపాధ్యక్షుడు ఆంజనేయులు యాదవ్, రాష్ట్ర అంగన్వాడీ విభాగ కార్యదర్శి హెల్డా ప్లోరెన్స్, నకరికల్లు మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి, మాజీ ఎంపీపీ టి. మంగమ్మ, మాజీ కౌన్సిలర్ బత్తుల లక్ష్మీపద్మలత, బొగ్గరం మూర్తి, పలు నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. పేదలకు విద్య దూరం విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యావ్యవస్థను మంత్రి లోకేష్ తుంగలో తొక్కుతున్నారని అన్నారు. ఈ విధంగా ఏ రాష్ట్రంలోనూ జరగట్లేదన్నారు. షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదన్నారు. పేద ప్రజలకు విద్యను దూరం చేస్తున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగులకు అన్యాయం చేసిన లోకేష్ వెంటనే తన మంత్రి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో ఢిల్లీని తాకే విధంగా నిరసన చేపడతామని హెచ్చరించారు. విద్యావ్యవస్థ నాశనం యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు కందుల శ్రీకాంత్ మాట్లాడుతూ మెగా డీఎస్సీ పేరుతో ఆర్భాటపు ప్రచారం చేసి అనేక అవకతవకలకు పాల్పడ్డారన్నారు. స్పోర్ట్స్ కోటా కింద ఉన్న 400 ఉద్యోగాలను అర్హతలేని తమ అనుచరులకు మంత్రి ఇచ్చారన్నారు. విద్యావ్యవస్థను వైఎస్ జగన్మోహన్రెడ్డి మెరుగు పరిస్తే, కూటమి ప్రభుత్వంలో ఒక పథకం ప్రకారం నాశనం చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించటంలో ఉన్న ఆసక్తి పేద విద్యార్థులు, యువతకు న్యాయం చేయటంలో లేదని ధ్వజమెత్తారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ కూటమి నాయకులు వెన్నుపోటు పొడవటంలో ఘనులని అన్నారు. ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాల అమలులో ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. ప్రతి మహిళకు రూ.15 వేలు అని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని పేర్కొన్నారు. సచివాలయాలు, హెల్త్ సెంటర్లు, ఆర్బీకేలు తాము నిర్మిస్తే వాటికి వారు బోర్డులు పెట్టుకోవడం వెన్నుపోటేనన్నారు. పేద, మధ్యతరగతి వర్గీయులకు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా వారి రక్తం తాగుతున్నారని తెలిపారు. ప్రతి దానిలో లంచాలు డిమాండ్ చేస్తూ కూటమి నాయకులు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడుతూ గతంలో వైఎస్ జగన్ ఒకేసారి 1.35 లక్షల సచివాలయ ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా చేపట్టారన్నారు. కేవలం 16 వేల మెగా డీఎస్సీలో ఉద్యోగాలు ఇవ్వటానికి లోకేష్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. యువగళంలో తనతో తిరిగిన వారికి స్పోర్ట్స్ కోటాలో మంత్రి లోకేష్ ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఇది దారుణమని పేర్కొన్నారు. చదువుకున్న విద్యార్థులు, మెరిట్ కలిగిన వారు ఏమైపోతారని ప్రశ్నించారు. దీనిపై వెంటనే సీబీఐతో విచారణ చేయించి నిజాలు నిగ్గుతేల్చాలన్నారు. లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
నాడు కళకళ.. నేడు వెలవెల
యడ్లపాడు: సమాజ నిర్మాణంలో విద్య ఎంత ముఖ్యమో, వ్యక్తిత్వ వికాసంలో కళలు అంతే కీలకం. ఈ దూరదృష్టితో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2008 డీఎస్సీ ద్వారా ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సంగీత ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో సంగీత విద్యకు బలమైన పునాది వేశారు. ఆ నిర్ణయం వేలాది మంది విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించడంతో పాటు సంగీత ఉపాధ్యాయులకు ఉపాధి కల్పించింది. శాసీ్త్రయ కళలకు ఆయన అందించిన రాజపోషణ సంగీత విద్యకు స్వర్ణయుగంగా నిలిచింది. అనంతరం పోస్టుల భర్తీ లేకపోవడంతో సంగీత విద్య నిర్లక్ష్యానికి గురై, కళాకారులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడింది. వలస వెళ్లాల్సిన దుస్థితి తెలుగు నేల త్యాగరాజు, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు, అన్నమాచార్య వంటి మహనీయుల సంగీత వారసత్వానికి నిలయం. కూచిపూడి, కర్ణాటక సంగీత సంప్రదాయాలు ఈ నేల గర్వకారణాలు. నాట్యశాస్త్ర పితమహుడు కొండవీటిరాజు కుమారగిరిరెడ్డి, శార్గదేవుడు వంటి మహనీయులు ఈ గడ్డకు చిరస్థాయి కీర్తిని తెచ్చిపెట్టారు. అయితే నేడు కళాకారులకు తగిన ప్రోత్సాహం లేక పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన నాదస్వర విద్వాంసుడు కలైమామణి చిన పీరు సాహెబ్ కుటుంబం వంటి వారు తమిళనాడుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ కళాకారులకు ప్రత్యేక ప్రోత్సాహం లభిస్తుండగా, మన రాష్ట్రంలో ప్రణాళికాబద్ధమైన విధానాల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. డిజిటల్ యుగంలో సాంకేతికత పెరిగినా మానసిక ఒత్తిడి, వ్యసనాలు పెరుగుతున్నాయి. సంగీతం, నాట్యం వంటి కళలు క్రమశిక్షణ, సహనం, సృజనాత్మకత, మానవీయ విలువలను పెంపొందిస్తాయి. అందుకే కళలను జీవన విద్యగా చూడాలి. ప్రభుత్వం డీఎస్సీల్లో సంగీత ఉపాధ్యాయ పోస్టులను క్రమం తప్పకుండా భర్తీ చేయాలి. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో సంగీత విద్యను బలోపేతం చేయడంతో పాటు జిల్లా స్థాయిలో సంగీత, నాట్య అకాడమీలు, యువ కళాకారులకు ప్రోత్సాహక పథకాలు అమలు చేయాలి. తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, కళా సంస్థలు, సమాజం కలిసి సంప్రదాయ కళల పరిరక్షణకు కృషి చేయాలి. -
టీటీలో స్ఫూర్తి..పేదరికమే అడ్డంకి
● టేబుల్ టెన్నిస్లో స్ఫూర్తి నైనా ప్రతిభ ● స్టేట్ ర్యాంకింగ్స్లో వరుసగా తొమ్మిదిసార్లు నంబర్వన్ ● జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు పేదరికం అడ్డంకి ● తండ్రి ప్రైవేటు స్కూల్లో పీఈటీ ● దాతలు స్పాన్సర్ చేస్తే జాతీయస్థాయిలో సత్తా చాటుతానంటున్న స్ఫూర్తికారెంపూడి: జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో పాల్గొని సత్తా చాటాలని కారెంపూడి మండలంలోని ఒప్పిచర్ల గ్రామానికి చెందిన గిరిజన బాలిక చదల స్ఫూర్తి నైనా కలలు కంటోంది. అయితే ఆ చిన్నారి కలల సాకారానికి పేదరికం అడ్డువస్తోంది. ఇప్పటి వరకు 15 ఏళ్ల లోపు విభాగాలలో వరుసగా తొమ్మిది సార్లు స్టేట్ ర్యాంకింగుల్లో నంబర్ వన్ స్థానంలో ఆమె కొనసాగింది. ఈ ఏడాది సెప్టెంబర్ 14 నుంచి పాండిచ్చేరిలో జరగనున్న జాతీయ క్రీడలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో అవసరమయ్యే శిక్షణకు క్రీడా సామగ్రికి ఇతర ఖర్చులు ఆ కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్నాయి. పాప తాత ఏడుకొండలు ఆటో డ్రైవర్. తండ్రి ప్రైవేటు స్కూల్లో పీఈటీ. వీరి సంపాదన కుటుంబాల పోషణకే అంతంతమాత్రంగా ఉన్నాయి. కుమార్తెకు మెరుగైన శిక్షణ ఇప్పించడానికి తండ్రి ఆర్థిక స్థోమత సరిపోవడం లేదు. తల్లి అనిత, తండ్రి ఏసుబాబుకు టేబుల్ టెన్నిస్లో ప్రవేశం ఉండడంతో వారే శిక్షణ ఇస్తూ కుమార్తెను ఈ స్థాయికి తీసుకువచ్చారు. ఇక జాతీయ పోటీలకు వెళ్లాలంటే గ్రామీణ ప్రాంతంలో ఉంటే కష్టమని మకాంను ఏసుబాబు హైదరాబాదుకు మార్చారు. అక్కడే మదీనాగూడలోని జనసిస్ స్కూల్లో 8వ తరగతిలో స్ఫూర్తి నైనాను చేర్చి తను కూడా ప్రైవేటు స్కూల్లో పీఈటీగా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వచ్చే జీతంతో కుటుంబం గడవడం, శిక్షణ ఇప్పించడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే మరో వైపు జాతీయ పోటీలకు స్ఫూర్తి నైనా సిద్ధం అవుతోంది. తొమ్మిదిసార్లు ఫస్ట్ ర్యాంక్ వరుసగా తొమ్మిది సార్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ర్యాంకింగ్స్లో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ఇప్పటికే 2023లో 11 ఏళ్ల లోపు విభాగంలో జాతీయస్థాయిలో ప్రీ క్వార్టర్ ఫైనల్స్కు చేరి రాణించింది. తెలంగాణ రాష్ట్ర స్కూల్ గేమ్స్ 2025లో బంగారు పతకాన్ని స్ఫూర్తి సాధించింది. అంతకుముందు మన రాష్ట్రంలో 2023 నుంచి 2024 వరకు జరిగిన 9వ రాష్ట్రస్థాయి పోటీల్లో తొమ్మిదిసార్లు కూడా ఫస్ట్ ర్యాంక్లో నిలిచి సత్తాచాటింది. -
6,7 తేదీల్లో కృత్రిమ చేతులు పంపిణీ
పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ట్రస్ట్ నిర్వాహకులు నరసరావుపేట: చేతులు లేని దివ్యాంగులకు ప్రాణదానం ట్రస్ట్ ద్వారా ఉచితంగా చేయూత అందజేయటం అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. ఆగస్టు 6, 7వ తేదీల్లో నరసరావుపేటలోని రాధా సుందర్ కల్యాణమండపంలో నిర్వహించే కృత్రిమ చేతుల పంపిణీలో అవసరమైన వారు పాల్గొని చేతులు పొందాలని సూచించారు. ఈ మేరకు కార్యాలయంలోని తన చాంబర్లో నిర్వాహకులతో కలిసి మంగళవారం పోస్టర్ ఆవిష్కరించారు. లక్షల ఖరీదుతో బ్యాటరీతో నడిచే ఆధునాతన కృతిమ చేతులను సుమారు 200 మందికి నరసరావుపేట ప్రాణదానం ట్రస్ట్ నిర్వాహకులు రావిపాటి శ్రీనివాస్( కిరణ్ ) ఉచితంగా అందచేయడం సంతోషకరమని కలెక్టర్ అన్నారు. విద్యుత్ షాకులు, రహదారి ప్రమాదాలు, కర్మాగారాలలో సంభవించే ప్రమాదాలలో చేతులు కోల్పోయిన బాధితులకు వీటి అవసరం చాలా ఉంటుందన్నారు. ప్రాణదానం ట్రస్ట్ గౌరవ సలహాదారులు కేపీ రంగారావు మాట్లాడుతూ చేతులు కోల్పోయి తమ జీవన మనుగడ కష్టంగా ఉన్నవారికి ఈ కృత్రిమ చేతుల అమరిక ద్వారా వారి జీవితాలలో నూతన వెలుగులు ఇచ్చినవారమవుతామన్నారు. ఈ సేవా కార్యక్రమం నిర్వహించడానికి లక్షలాది రూపాయల వ్యయమవుతుందని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. అవసరమైనవారు ఉచితంగా చేతులు పొందేందుకు 70134 63637 నెంబరులో సంప్రదించాలని కోరారు. వినుకొండ: మద్యం వ్యసనానికి బానిసైన ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వినుకొండ మండలం చాట్రగడ్డపాడులో చోటుచేసుకుంది. బాధితురాలి తల్లి (అత్త) సీతారావమ్మ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన వంకాయలపాటి కోటయ్య నిత్యం మద్యం తాగి భార్య, పిల్లలను వేధించేవాడు. ఇటీవల ప్రభుత్వం నుంచి పిల్లల చదువుల కోసం భార్య ఖాతాలో జమ అయిన ‘తల్లికి వందనం’ నగదును దొంగిలించి మద్యానికి తగలేశాడు. ఈ విషయమై భార్య నిలదీయడంతో ఆమైపె కత్తితో దాడికి యత్నించాడు. అంతేకాకుండా మంగళవారం ఉదయం మద్యం కోసం ఇంట్లోని వాటర్ మోటార్ను అమ్ముకుని తాగాడు. అనంతరం ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతూ, వెంట తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన కోటయ్య ప్రస్తుతం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
జీజీహెచ్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లోని షాపులను మంగళవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేశారు. ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ నరసింహుడు, జిల్లా విజిలెన్న్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ చదలవాడ హరిబాబు, బీరాల నాగేశ్వరరావులు షాపులు తనిఖీ చేశారు. షాపుల్లో కాల పరిమితి దాటిన శీతల పానియాలు అమ్ముతున్నట్లు సోమవారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మంగళవారం వారు తనిఖీలు నిర్వహించి నాలుగు షాపుల్లో ఏ ఒక్కరికి ఫుడ్లైసెన్సు లేదనే విషయాన్ని గుర్తించారు. ప్యాకెట్లపై నిబంధనల ప్రకారం ఉండాల్సిన వివరాలు లేవని, ఫుడ్ లైసెన్సు లేకుండా వ్యాపారం చేస్తున్న నాలుగు షాపులకు నోటీసులు జారీ చేశారు. ఒక దుకాణంలో టీ పొడిలో రంగు కలిపినట్లు గుర్తించి నమూనాలు సేకరించి ఆహార ప్రయోగశాలకు పంపించారు. పాల ఉత్పత్తులు, ఇతర వస్తువులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఆహార భద్రత ప్రమాణాల చట్ట ప్రకారం ఫుడ్లైసెన్సు తీసుకోకుండా వ్యాపారం చేయడం తీవ్రమైన ఉల్లంఘన అని, విజిలెన్స్ కమిటీ సభ్యుడు హరిబాబు తెలిపారు. జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు నమోదు చేసి హాజరు పరిస్తే రూ. 10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. -
గంజాయి,మత్తు పదార్థాల విక్రేతలు అరెస్టు
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్) :చెడు వ్యసనాలకు బానిసలు గా మారి గంజాయి, మత్తు పదా ర్థాలు విక్రయిస్తున్న ఇరువురిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. పాతగుంటూరు పోలీసు స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఈస్ట్ డీఎస్పీ తాండ్ర సీతారామ్, పాతగుంటూరు సీఐ కె.వెంకటప్రసాద్ వివరాలు వెల్లడించారు. పాతగుంటూరు ఆనందపేటకు చెందిన షేక్ మస్తాన్, అలీనగర్కు చెందిన షేక్ మస్తాన్ అలియాస్ మున్నా ఇరువురు స్నేహితులు. చెడు వ్యసనాలకు బానిసగా మారి అక్రమ సంపాదనకు అలవాటు పడి గంజాయి, మత్తు పదార్ధాల విక్రయాలు చేస్తున్నారు. వీరికి పాతగుంటూరు మాచిరాజువారివీధికి చెందిన బిలాల్తో పరిచయం ఏర్పడింది. గోవా, పలు ప్రాంతాల నుంచి తెచ్చిన గంజా యి, మత్తు బిళ్లలు రూ. 300 లకు విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు పాతగుంటూరు శివారు ప్రాంతంలోని ప్రగతినగర్లో ఇరువురిని అదుపులోకి తీసుకున్నా రు. వారి వద్ద గంజాయి, మ త్తు బిళ్లలు ఉండటం గుర్తించా రు. 11 గ్రాముల గంజాయి, 90 మత్తు బిళ్లలు, రూ. 9వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరికి సహకరిస్తున్న బిలాల్ పరారీలో ఉన్నట్లు సమాచారం. గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించే వ్యవసాయ, విత్తన సాంకేతిక, సేంద్రియ వ్యవసాయ డిప్లమో కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు నాలుగు సంవత్సరాల బీఎస్సీ అగ్రి కల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే అగ్రిసెట్– 2026 ప్రవేశ పరీక్షను 2026–27 విద్యా సంవత్సరానికి ఆగస్టు– 18వ తేదీన నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎ.మణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్లను ఆగస్టు 14వ తేదీనుంచి విశ్వవిద్యాలయం వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ను సందర్శించాలని కోరారు. గుంటూరు జిల్లాలో ఐదు కేంద్రాలు గుంటూరు ఎడ్యుకేషన్: ఆగస్టు 5వ తేదీ నుంచి 16 వరకు జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీ టెట్–2026)కు గుంటూరు జిల్లాలో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రోజుకు రెండు విడతలుగా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటలు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (సీబీటీ) జరగనున్నాయని తెలిపారు. చేబ్రోలులోని ఆర్వీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులోని ప్రియదర్శిని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మేడికొండూరు మండలం పేరేచర్లలోని ఎన్నారై ఇంజినీరింగ్ కళాశాల, మేడికొండూరు మండలం పేరేచర్లలో యూనివర్సల్ ఇంజినీరింగ్ కళాశాలలోని అయాన్ డిజిటల్ జోన్, చిలకలూరిపేట హైవే మార్గంలోని తుమ్మలపాలెంలో మిట్టపల్లి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. అభ్యర్థులు అధికారిక సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసు కోవాలని, హాల్ టికెట్లలో ఏమైనా తప్పులు ఉన్నా, సమాచారం కోసం డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్లైన్ నంబర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు సందేహాల నివృత్తి కోసం డీఈవో కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు హెల్ప్ డెస్క్ను కార్యాలయ పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు 90521 52920, 93473 10671 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. -
ఇద్దరు విద్యార్థినులు పరారీ
నకరికల్లు: పాఠశాల గోడ దూకి విద్యార్థినులు పారిపోయిన సంఘటన పల్నాడు జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. సకాలంలో స్పందించిన పోలీస్ అధికారులు ఆధునిక టెక్నాలజీ ద్వారా విద్యార్థినుల ఆచూకీ కనుగొని తల్లిదండ్రుల వద్దకు క్షేమంగా చేర్చడంతో ఉత్కంఠకు తెరపడింది. వివరాలు... పల్నాడు జిల్లా నకరికల్లులోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థిని, ఆరోతరగతి విద్యార్థిని కలిసి మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో పాఠశాల గోడదూకి పారిపోయారు. కొద్దిసేపటికే గమనించిన ప్రిన్సిపల్ జి.జ్యోత్స్నదీప్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకుని వచ్చిన తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏమవుతుందోనని ఆందోళన చెందారు. క్షేమంగా పిల్లలను తీసుకురావాలని అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. సత్తెనపల్లి రూరల్ సీఐ పి.కిరణ్ ఆధ్వర్యంలో నకరికల్లు ఎస్ఐ కె.సతీష్తోపాటు నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. పోలీస్ అధికారులు సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా పాఠశాల నుంచి బయటకు వచ్చిన విద్యార్థినులు ఎటు వెళ్లారు, ఎక్కడ ఉన్నారనే సమాచారాన్ని సేకరించారు. చిలకలూరిపేట పట్టణంలో ఎన్ఆర్టీ సెంటర్లో వారి ఆచూకీని స్పష్టంగా గుర్తించారు. వెంటనే సిబ్బందితో బయలుదేరారు. విద్యార్థినులకు నచ్చజెప్పి వారిని వెంట తీసుకొని నకరికల్లు చేరుకున్నారు. తల్లిదండ్రులకు అప్పగించారు. చదువుపై ఆసక్తి తగ్గడంతో ఇలా చేశారని గుర్తించారు. సత్తెనపల్లి రూరల్ సీఐ పి.కిరణ్, సమగ్ర శిక్ష అభియాన్ అడిషనల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్ శ్యాంప్రసాద్, ఎస్ఐ కె.సతీష్, ప్రిన్సిపల్లు విద్యార్థినులకు, తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేశారు. గంటల వ్యవధిలోనే విద్యార్థినుల ఆచూకీ కనుకొని క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చిన ఎస్ఐ కె.సతీష్ను, సిబ్బందిని రూరల్ సీఐ పి.కిరణ్ అభినందించారు. -
కూటమిలో భగ్గుమన్న విభేదాలు
రెంటచింతల: రెంటచింతలలో బీజేపీ జెండా దిమ్మె ధ్వంసం చేయడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహించారు. మాచర్ల–గుంటూరు రహదారిపై సోమవారం నిరసన తెలిపారు. టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య వివాదానికి దారి తీసింది. జాతీయ రహదారి పక్కనే రెండు నెలల కిందట బీజేపీ మండల అధ్యక్షులు ఇగుటూరి రాజశేఖర్రెడ్డి ఏర్పాటుచేసిన బీజేపీ దిమ్మెను సోమవారం కొందరు ధ్వంసం చేశారు. దీనిపై బీజేపీ నాయకులు ఆగ్రహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశికుమార్ నేతృత్వంలో నాయకులు మాచర్ల–గుంటూరు ప్రధాన రహదారిపై కొంత సమయం నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ స్తంభాలు ఏర్పాటుకు జెండా దిమ్మెను తొలిగించినట్లు స్థానిక టీడీపీ నాయకులు బదులివ్వడంతో ఇరు పార్టీల నాయకులు వాగ్వాదానికి దిగారు. బీజేపీ మహిళానేత లక్ష్మి విద్యుత్ స్తంభం కోసం తీసిన గుంతలోకి దిగి నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేసింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కారంపూడి సీఐ శరత్బాబు, స్థానిక ఎస్ఐ నాగార్జున ఇరు పార్టీల నేతలతో చర్చలు జరిపారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రధాన రహదారి విస్తరణ పనులు పూర్తి అయిన వెంటనే బీజేపీ జెండా దిమ్మె ఏర్పాటుకు రహదారి వెంబడే స్థలం కేటాయిస్తామని వారు హామినిచ్చి సమస్యను పరిష్కరించారు. -
గోమాతకు జాతీయ గౌరవం ఇవ్వాలి
నరసరావుపేట: ఆవులకు రాష్ట్ర మాత లేదా అంతర్జాతీయ ఆరాధ్య దేవత అనే రాజ్యాంగ హోదాను కల్పించి జాతీయ గౌరవం ఇవ్వాలని గో సన్మాన్ ఆహ్వాన్ అబియాన్ ప్రతినిధులైన ఉత్తరప్రదేశ్కు చెందిన రాధారమణదాస్ కోరారు. ఈ మేరకు పీజీఆర్ఎస్లో కలెక్టర్ను కలిసి విన్నవించారు. గో వధను నిషేధించాలని, గోశాలలకు ప్రభుత్వ బడ్జెట్ కేటాయించి వాటిని పెంచి పోషించాలని కోరారు. నరసరావుపేట, చిలకలూరిపేట గోశాల ప్రతినిధులు శివనాగేశ్వరరావు, కృష్ణచంద్ర, ప్రతినిధులు పాల్గొన్నారు. పెదకాకాని: శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో సహస్ర ఘటాభి షేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి ఆలయ అర్చకులు, వేదపండితులచే విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మట్టి కుండలతో మల్లేశ్వరస్వామి వారికి మహన్యాసపూర్వక సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. పూజా కార్యక్రమంలో ఆలయ ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్, పాలకమండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు దంపతులు, సభ్యులు బండారు మల్లేశ్వరి దంపతులు, భైరపనేని ధనలక్ష్మీ దంపతులు, ఉల్లం రాజేశ్వరి దంపతులు, ధూపాటి శివశంకరరావు, కొమ్మూరి మల్లిఖార్జునరావు, పలువురు భక్తులు పాల్గొన్నారు. భక్తులందరికీ తీర్ధ ప్రసాదాలు పంపిణీ చేశారు. అమరావతి: ప్రపంచాన్ని సన్మార్గంలో నడిపించి అందరికీ మార్గదర్శకంగా నిలిచే గురువులను పూజించాలని భవఘ్నిగురూజీ అన్నారు. మండల పరిధిలోని వైకుంఠపుర భవఘ్ని అరామంలో గురిపూర్ణిమ మహోత్సవాలలో తొలిరోజు సోమవారం కార్యక్రమాలను భక్తిప్రపత్తులతో నిర్వహించారు. ఈసందర్భంగా భవఘ్ని గురూజీ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఆధ్యాత్మిక జ్ఞాన సంపద భారతదేశం సొంతమన్నారు. ఋషులు, మునులు మనకు అందించిన మహోన్నతమైన జ్ఞాన సంపదను సామాన్యునికి సైతం అర్ధమయ్యే రీతిలో బోధించే గురువులను స్మరించుకోవటం అదృష్టంగా భావించాలన్నారు. తొలుత వేకువజామున వ్యాసభగవానులకు సుప్రభాతసేవ, వ్యాసభగవానుడి ఉత్సవమూర్తికి రథోత్సవం, అనంతరం ఆదిగురువు వ్యాసభగవానునికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈవేడుకలలో పలు జిల్లాల నుంచి భక్తులు భారీగా పాల్గొన్నారు. ఈసందర్భంగా భక్తులందరికీ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిర్వాహకులు ఏర్పాట్లను పరవ్యవేక్షించారు. నగరంపాలెం(గుంటూరు వెస్ట్): స్థానిక విద్యానగర్ శ్రీసాయినాధ సన్నిధానంలో నిర్వహిస్తోన్న గురుపూర్ణిమ మహోత్సవాలు సోమవారం ఐదో రోజుకి చేరాయి. సాయినాధునికి శ్రద్ధాసక్తులతో రుద్రాభిషేకం నిర్వహించారు. మహిళలు హాజరవ్వగా, సాప్తాహిక అఖండ సాయినామ సంకీర్తన కొనసాగించారు. ఆలయ గౌరవాధ్యక్షుడు యడ్లపాటి అశోక్కుమార్, అధ్యక్షుడు వడ్లమూడి శివ రామకృష్ణయ్య, స్వరూపరాణి, సంజీవరావు, అప్పారావు పాల్గొన్నారు. -
వీఆర్ఓలుగా పదోన్నతులు కల్పించాలి
గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్ఏ)కు వన్టైం సెటిల్మెంట్ ద్వారా అర్హులను గుర్తించి వీఆర్వోలుగా పదోన్నతులు కల్పించి, జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బందగీ సాహెబ్ కోరారు. ఈ మేరకు జిల్లా వీఆర్ఏల సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాకు వినతిపత్రం అందజేశారు. బందగీ సాహెబ్ మాట్లాడుతూ గత ఎనిమిదేళ్లుగా వీఆర్ఏలకు జీతాలు పెరగలేదని, వెంటనే పే స్కేలు అమలు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ జీతాల పెంపు అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని, డీఆర్ఓ అద్దెయ్యతో మాట్లాడి వీఆర్వో ప్రమోషన్ల భర్తీకి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సంఘం సత్తెనపల్లి, అమరావతి, నకరికల్లు, చిలకలూరిపేట, రొంపిచర్ల మండల అధ్యక్షులు రవి, రాజు, కాసులు, ఆనంద్ కుమార్, జీవమణి, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. -
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
నకరికల్లు: నకరికల్లు శివారు ఎస్సీ కాలనీలో కొంతమంది వ్యక్తులు కోతముక్క పేకాట ఆడుతుండగా ఎస్ఐ కె.సతీష్, సిబ్బందితో దాడి చేసి నలుగురు వ్యక్తులను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి 3 మొబైల్ ఫోన్లు, రూ.5,770 నగదు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు ఎస్ఐ తెలిపారు. పిడుగురాళ్ల: రోడ్డుపై నడుస్తున్న మహిళను వెనుక నుంచి టిప్పర్ ఢీకొనటంతో మహిళ అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన పట్టణంలోని బైపాస్ రజక కాలనీ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....బుడిగందుల రమణ రజక కాలనీ నుంచి విజయవాడ వెళ్లేందుకు బైపాస్లో బస్టాండ్కు నడుచుకుంటూ వెళ్తుండగా పిడుగురాళ్ల నుంచి దాచేపల్లి వైపు వెళ్తున్న టిప్పర్ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో రమణ (51) అక్కడిక్కడే మృతి చెందింది. రమణ కుమార్తె ప్రభావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్ఐ శివనాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రమణ గత కొంత కాలంగా భర్త చనిపోవటంతో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తుంది. ఆమె కుమార్తె ప్రభావతి కూడా తల్లి రమణ వద్దనే ఉంటుంది. పిడుగురాళ్ల: లారీని రోడ్డు పక్కన ఆపి టైర్లు పరిశీలిస్తుండగా వెనుక నుంచి వచ్చిన మరో లారీ వేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొనటంతో ఆగి ఉన్న లారీ డ్రైవర్ మృతి చెందిన సంఘటన పట్టణంలోని బైపాస్ రైల్వే బ్రిడ్జి సమీపంలో అర్థరాత్రి జరిగింది. పట్టణ ఎస్ఐ డి.శివనాగరాజు తెలిపిన వివరాల మేరకు...రాయపూర్ నుంచి చైన్నె వెళ్తున్న లారీని డ్రైవర్ నిద్ర రావటంతో రోడ్డు పక్కన ఆపాడు. ఆపిన తర్వాత టైర్లు పరిశీలిస్తుండగా హైదరాబాద్ నుంచి చైన్నె వెళ్తున్న మరో లారీ వేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఆగి ఉన్న లారీ డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తి మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కావటంతో పూర్తి వివరాలు అందాల్సి ఉందన్నారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడని పేర్కొన్నారు. గద్వాల క్రైం: నిర్లక్ష్యంగా కారు నడుపుతూ బైక్ను ఢీకొట్టిన ప్రమాదంలో ఏపీకి చెందిన ఓ యువకుడు మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు..పల్నాడు జిల్లా మల్లాది గ్రామానికి చెందిన సునీల్ (24) మూడు నెలల క్రితం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో టెక్నీషియన్గా చేరాడు. సోమవారం తెల్లవారుజామున సొంతూరు వెళ్లేందుకు రైల్వేస్టేషన్కు బైక్పై వెళ్తుండగా వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రధాన గేట్ వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సునీల్ తీవ్రంగా గాయపడగా గమనించిన స్థానికులు 108 వాహనంలో చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనపై సునీల్ తండ్రి రామారావు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రమాదానికి కారకుడైన వ్యక్తి గద్వాలకు చెందిన సత్యారెడ్డిగా గుర్తించినట్లు సమాచారం. మద్యం మత్తే కారణమా? మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడుపుతూ అతి వేగంతో బైక్ను ఢీకొట్టినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. కారులో ప్రమాదానికి కారకుడైన వ్యక్తితోపాటు మరో ఇద్దరు ఉన్నట్లు తెలిపారు. బైక్ను ఢీకొట్టిన అనంతరం కారు నిలపకుండా తప్పించుకున్నారని వివరించారు. సత్తెనపల్లి: రైల్వేట్రాక్ పై ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తిని పట్టణ పోలీసులు కాపాడిన సంఘ టన సోమవారం రాత్రి పట్టణ శివారులో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి మండ లం పాకాలపాడు గ్రామానికి చెందిన పోతల మరియబాబు కుటుంబ సమస్యల నేపథ్యంలో రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు యత్నిస్తుండగా డయల్ 100 ద్వారా వచ్చిన సమాచారం మేరకు పట్టణపోలీస్టేషన్లో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ రమేష్, హోంగార్డు రాజేష్ కన్నా హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకొని మరియబాబును కాపాడారు. సత్వ రమే స్పందించి వ్యక్తి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ రమేష్, హోంగార్డు రాజేష్ కన్నాలను పట్టణ సీఐ నరహరి నాగమల్లేశ్వరరావు, సిబ్బంది ప్రత్యేకంగా అభినందించారు. పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): విద్యుత్ షాక్కు కేబుల్ ఆపరేటర్ మృతి చెందిన సంఘటనపై కేసు నమోదైంది. గుంటూరు లాలాపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏటీ అగ్రహారానికి చెందిన కావలి రామకృష్ణ (45) ఐపీడీ కాలనీ పరిసర ప్రాంతాల్లో కేబుల్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. సోమవారం ఐపీడీ కాలనీలో కేబుల్ వైర్ల మరమ్మతులు నిర్వహిస్తున్న సమయంలో విద్యుత్ వైర్ రామకృష్ణపై పడింది. విద్యుత్ షాక్కు గురైన రామకృష్ణ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడి భార్య అరుణకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పీజీఆర్ఎస్లో 90 ఫిర్యాదులు
నరసరావుపేట రూరల్: ౖరెల్వేలో ఉద్యోగం, సీఆర్డీఏలో రికార్డు అసిస్టెంట్ కొలువు, ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసినట్టు పలువురు బాధితులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో 90 ఫిర్యాదులు అందాయి. జిల్లా అదనపు ఎస్పీ(అడ్మిన్) రోహిత్ కుమార్ చౌదరి పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. డ్వాక్రా గ్రూప్ లీడర్ మోసం – సభ్యుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి బ్యాంక్కు చెల్లించకుండా డ్వాక్రా గ్రూపు లీడర్ మోసం చేసినట్టు వినుకొండకు చెందిన మహిళలు ఫిర్యాదు చేశారు. బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాన్ని గ్రూప్ లీడర్ రుబీనా చెల్లించకుండా రూ.13 లక్షలు మోసానికి పాల్పడినట్టు వివరించారు. ఐదుగురి సభ్యుల పోర్జరీ సంతకాలతో పొదుపు డబ్బులు కూడా డ్రా చే సినట్టు తెలిపారు. తమకు న్యాయం చేయాలని అదనపు ఎస్పీని కోరారు. రేపల్లె: పట్టణ శివారులోని ఓ హోటల్లో సోమవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ పి.శ్రీనివాస్ వివరాల మేరకు పెనుమూడి రోడ్డులోని దేవగిరి రమేష్బాబుకు చెందిన పల్లె రుచులు హోటల్లో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్న సమయంలో నిప్పురవ్వలు ఎగసిపడ్డాయి. హోటల్లోని తాటాకు పందిళ్లకు మంటలు వ్యాప్తి చెందాయి. నిర్వాహకుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారని పేర్కొన్నారు. -
పీజీఆర్ఎస్లో 154 అర్జీలు
నరసరావుపేట: కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధ్యక్షత వహించి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారిచే 154 అర్జీలు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ క్లినిక్ ద్వారా 38 అర్జీలను జాయింట్ కలెక్టర్ సంజనా సింహ స్వీకరించారు. నరసరావుపేట డివిజన్ నుంచి 21, సత్తెనపల్లి నుంచి 14, గురజాల నుంచి మూడు అర్జీలను బాధితులు అందజేశారు. భూసమస్యలు, గృహ హింస, అధికారుల చేతివాటం, ప్రభుత్వ పథకాలు అందలేదంటూ తదితర సమస్యలపై అర్జీదారులు అర్జీలు అందజేశారు. డీఆర్ఓ అద్దెయ్య, డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, మూడు డివిజన్లకు చెందిన ఆర్డీఓలు అర్జీల స్వీకరణలో పాల్గొన్నారు. -
ప్రాజెక్టు ఎంపికే కీలకం
జిల్లా స్థాయి ఇన్స్పైర్ మనాక్లో ప్రదర్శించిన ప్రాజెక్టుల్లో 10 శాతం రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ నుంచి 10 శాతం జాతీయ స్థాయికి ప్రాజెక్టులు వెళతాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులను సైన్న్స్ ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తూ ప్రాజెక్టుల నమోదులో కీలకంగా ఉండాలి. అన్ని పాఠశాలల నుంచి ప్రాజెక్ట్లు వెళ్లేలా సైన్న్స్ ఉపాధ్యాయు లు కృషి చేయాలి. ఏవైనా సందేహాలు ఉంటే జిల్లా సైన్స్ అధికారిని సంప్రదించాలి. – పీవీజే రామారావు, జిల్లా విద్యాశాఖ అధికారి, పల్నాడు -
పల్నాడులో గ్రానైట్ వార్
సాక్షి, నరసరావుపేట: అక్రమ గ్రానైట్ దందాపై ఆధిపత్య పోరు పల్నాడు జిల్లాలో వీధికెక్కింది. గ్యాంగ్ వార్ తరహాలో రొడ్డుకెక్కి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే స్థాయికి చేరింది. గ్రానైట్ మాఫియా పోరు సవాళ్ల స్థాయి దాటి భౌతికదాడులకు చేరింది. చంద్రబాబు ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రానైట్ అక్రమ రవాణాపై అధిపత్యం కోసం పల్నాడు, ప్రకాశం జిల్లాలకు చెందిన రెండు గ్రూప్లు పోటీపడ్డాయి. పక్క జిల్లాకు చెందిన ఓ మంత్రి అనుచరులు గత కొంతకాలంగా గ్రానైట్ అక్రమ రవాణాలో గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారు. దీనిపై పల్నాడు జిల్లా అధికారపార్టీ నేతలు కొందరు గుర్రుగా ఉన్నారు. వీరి పోరు నేపథ్యంలో గ్రానైట్ యజమానులే ఇటీవల నేరుగా రవాణా వ్యవహారాలు చూస్తున్నారు. తమ ఆదాయ మార్గాలు దెబ్బతినడంతో ప్రకాశం జిల్లా గ్యాంగ్ ప్రత్యక్ష యుద్ధానికి తెరదీశారు. ఆయన సారధ్యంలోనే... గ్రానైట్ అక్రమ రవాణా దందా పక్క జిల్లాకు చెందిన ఓ మంత్రి వద్ద పనిచేసే వ్యక్తి సారధ్యంలోనే జరుగుతుందని సమాచారం. అయితే అక్రమ బిల్లులతో సరిహద్దులు దాటిస్తామని చెప్పి పెద్దమొత్తంలో వసూళ్లు చేస్తున్న ఈ గ్యాంగ్ అధికారులు పట్టుకుంటే తమకు సంబంధం లేదని చేతులెత్తుస్తున్నారట. ఇటీవల పల్నాడు జిల్లాకు చెందిన మరో గ్యాంగ్ గ్రానైట్ అక్రమ రవాణా వ్యవహారాలు చూస్తున్నారు. దీంతో కొత్త గ్యాంగ్ పంపుతున్న అక్రమ గ్రానైట్ వాహనాల వివరాలను తెలంగాణ జీఎస్టీ అధికారులకు సమాచారం ఇచ్చి పట్టుకునేలా చేశారని సమాచారం. ఈ సమాచారం అందించిన వ్యక్తులపై దాడులు సైతం చేశారు. ఈ క్రమంలో గత వారం ప్రకాశం జిల్లాకు చెందిన అక్రమ రవాణా మాఫియాకు చెందిన వ్యక్తి పిడుగురాళ్లకు వచ్చి సినీ ఫక్కీలో సెల్పీలు తీసుకొని సవాళ్లు విసిరాడు. తిరుగుమార్గంలో బొప్పూడి వద్ద సదరు వ్యక్తిని ప్రత్యర్థులు పట్టుకొని తీవ్రంగా దేహశుద్ధి చేయడంతో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. దీనిపై చిలకలూరిపేట రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. వీరిని పరామర్శించేందుకు వచ్చిన పిడుగురాళ్లకు చెందిన కారుపై ప్రకాశం జిల్లా గ్యాంగ్ ప్రతికారదాడి చేసి ధ్వంసం చేశారు. గ్రానైట్ ఆధిపత్య దాడులు హత్యల వరకు దారి తీస్తాయోమోనన్న ఆందోళనలు గ్రానైట్ పరిశ్రమ వర్గాల్లో నెలకొంది. -
నవ్యాంధ్ర రాజధానిలో ఫిజియోథెరపీ కళాశాల ఏర్పాటు చేయాలి
గుంటూరు మెడికల్: ఆర్థోపెడిక్ వైద్యుల ఆపరేషన్ల అనంతరం రోగికి పూర్తి స్వస్థత చేకూర్చే ఫిజియోథెరపిస్టుల గౌరవానికి తగ్గట్టు నవ్యాంధ్ర రాజధాని పరిధిలో ప్రభుత్వ ఫిజియోథెరపీ కళాశాలను ఏర్పాటు చేయాలని ది ఫిజియోథెరఫిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ బి వి. హరికృష్ణ, డాక్టర్ షేక్ సుభాని పేర్కొన్నారు. స్థానిక అరండల్పేటలోని ది ఫిజియోథెరఫిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఏపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన అత్యవసర కార్యవర్గ సమావేశంలో డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ సుభాని మాట్లాడుతూ 2003లో స్థాపించిన ఫెడరేషన్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో 98 కళాశాలలు ఉన్నాయన్నారు. ఏటా 2000 మంది విద్యార్థులు పట్టభద్రులై బయటకు వస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా 60 వేలకు పైగా ఫిజియోథెరపీ పట్టభద్రులు సరైన ప్రోత్సాహకాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు డాక్టర్ ఏడుకొండలు, డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ దయాకర్, డాక్టర్ శిరీష, డాక్టర్ మహినా, డాక్టర్ అనీస్ గ్రేస్, డాక్టర్ రవి వర్మ, డాక్టర్ తిరుపతిరావు, డాక్టర్ జనార్దన్, డాక్టర్ దుర్గా వరప్రసాద్, డాక్టర్ నూర్ భాష బాజీ, షేక్ షరీఫ్ ఉస్మాన్, డాక్టర్ పసల వినయ్ కుమార్, వివిధ జిల్లాల నుంచి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ది ఫిజియోథెరఫిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఏపీ అధ్యక్ష, కార్యదర్శులు -
నిరసన విజయవంతం చేయండి
మాచర్ల: రాష్ట్రంలో డీఎస్సీ పరీక్షలో జరిగిన అక్రమాలతో పాటు, రెండేళ్లుగా ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ విద్యార్థులు, యువతను, ప్రజలను మోసం చేస్తున్న టీడీపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నర్సరావుపేటలో భారీ స్థాయిలో నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ జిల్లా విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా విద్యార్థులు, యువత పాల్గొనాలని పిలుపునిచ్చారు. డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా పేరుతో రూ.లక్షలు తీసుకుని అనర్హులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి, రాష్ట్రంలోనే అతిపెద్ద స్కామ్కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ పాల్పడ్డారన్నారు. ఈకారణంగా అర్హులైన ఎంతో మంది యువత ఉద్యోగాలు రాక తీవ్రంగా నష్టపోయారన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా నిరూపించినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. నీట్ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని, అదేవిధంగా రాష్ట్రంలో డీఎస్సీ అవకతవకలపై నారా లోకేష్ సైతం రాజీనామా చేయాలన్నారు. డీఎస్సీ అవకతవకలపై కేంద్రం స్పందించి సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మూడేళ్లయినా దాని గురించి ప్రభుత్వం మాట్లాడడం లేదన్నారు. యువతకు లక్షల సంఖ్యలో ఉద్యోగాలు అని చెప్పి, నేడు మొండిచేయి చూపించారన్నారు. వీటన్నిటికి నిరసనగా నర్సరావుపేటలో జరిగే ర్యాలీలో యువత, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు తరలిరావాలని పిలుపునిచ్చారు. -
ఆలోచనకు పదును.. సృజనకు అదును
● విద్యార్థుల ఉజ్వల భవితకు ఇన్స్పైర్ ● సెప్టెంబర్ 15 వరకు నమోదుకు గడువు సత్తెనపల్లి: పరిశోధనలపై విద్యార్థుల ఆసక్తిని పెంచి వారిని పాఠశాల స్థాయి నుంచే రేపటి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్, కేంద్ర ప్రభుత్వ ముఖ్య లక్ష్యం. దీనిలో భాగంగా భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డీఎస్టీ) ప్రతి ఏటా పాఠశాల ఉన్నత స్థాయి విద్యార్థులకు ఇన్స్పైర్ మనాక్ పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 2026–27 విద్యా సంవత్సరానికి ఇన్స్పైర్ మనాక్ అవార్డుల నామినేషన్స్ను ఆహ్వానిస్తోంది. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు సంబంధించిన ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్, ప్రైవేట్ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఇందుకు అర్హులు. వీరంతా తమ సైన్స్ టీచర్స్ను గైడ్గా ఏర్పాటు చేసుకొని పరిశోధనలో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులు ఎంపిక చేస్తారు. ప్రోత్సాహకాలు... జిల్లా స్థాయిలో ఇన్స్పైర్ మనాక్లో ప్రదర్శించిన ప్రాజెక్టుల్లో నుంచి 10 శాతం రాష్ట్ర స్థాయికి పంపుతారు. రాష్ట్ర స్థాయిలో ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లో నుంచి కూడా 10 శాతం ఎంపిక చేసి జాతీయ స్థాయికి పంపుతారు. అత్యుత్తమ ప్రాజెక్టుల్లో జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎంపికై తే రాష్ట్రపతి భవన్ సందర్శనతోపాటు జపాన్ దేశానికి వెళ్లే అవకాశం కూడా లభిస్తుంది. అలాగే ప్రాజెక్టులను మరింత అభివృద్ధి చేయడానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ రూ.25 వేల నిధులు మంజూరు చేస్తుంది. ఈ దరఖాస్తుకు సెప్టెంబర్ 15 వరకు గడువు ఉంది. దరఖాస్తు చేసుకునే విధానం ఇలా.. ఇన్స్పైర్ మనాక్ అవార్డులో పాల్గొనేందుకు విద్యార్థులు ముందుగా ఆన్లైన్లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఇన్స్పైర్అవార్డ్స్.డీఎస్టీ.గౌ.ఇన్ ద్వారా వెబ్సైట్ తెరవాలి. స్కూల్ అథార్టీ ఆప్షన్ను ఎంపిక చేయాలి. అందులో న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ను ఎంపిక చేయాలి. పాఠశాలకు సంబంధించిన వివరాలు పొందుపరిచి సేవ్ చేయాలి. సంబంఽధిత దరఖాస్తు జిల్లా అథారిటీకి చేరుతుంది. ఆమోదించిన తరువాత మనం ఇచ్చిన మెయిల్ ఐడీకి యూజర్ ఐడీతో కూడిన లింక్ వస్తుంది. ఆ ఐడీతో పాస్వర్డు క్రియేట్ చేయాలి. అనంతరం విద్యార్థుల ప్రాజెక్టు వివరాలను అందులో నమోదు చేయాలి. (లేదా) ఇన్స్పైర్ మనాక్ యాప్లో విద్యార్థి ఆధార్ నెంబర్,బ్యాంకు వివరాలు, పాస్పోర్టు సైజు ఫోటో ద్వారా స్కూల్ లాగిన్లో ఓపెన్ చేసి ప్రాజెక్టు వివరాలు నమోదు చేయాలి. అది కూడా 100 లోపు పదాలు ఉండేటట్లు చూసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. -
క్వాంటమ్ కంప్యూటింగ్తో ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు
చేబ్రోలు: భవిష్యత్ వైద్యరంగంలో క్వాంటమ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ(ఏఐ), మెషిన్ లెర్నింగ్ సమన్వయంతో మరింత సమర్థమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, ఆ దిశగా యువ పరిశోధకులు పరిశోధనలు చేపట్టాలని ఏపీలోని ఐఐఐటీ శ్రీ సిటీ ఫ్యాకల్టీ అఫైర్స్ డీన్, ప్రొఫెసర్ పి.విశ్వనాథ్ సూచించారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘నేషనల్ సెమినార్ ఆన్ నెక్ట్స్ జెన్ హెల్త్కేర్: బయో మెడికల్ ఇమేజింగ్ థ్రూ క్వాంటమ్ డ్రివెన్ డీప్ లెర్నింగ్’ అనే అంశంపై ఐదు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయస్థాయి సదస్సు సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ విశ్వనాథ్ మాట్లాడుతూ క్వాంటమ్ కంప్యూటింగ్ ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతోందన్నారు. సంప్రదాయ కంప్యూటర్లు పరిష్కరించడానికి ఎక్కువ సమయం తీసుకునే క్లిష్టమైన వైద్య సమస్యలను క్వాంటమ్ కంప్యూటింగ్ అత్యంత వేగంగా విశ్లేషించగలదని వివరించారు. వ్యక్తిగత వైద్య సేవలు, ఔషధాల రూపకల్పన, జీనోమిక్ డేటా విశ్లేషణ, క్యాన్సర్ వంటి క్లిష్ట వ్యాధుల నిర్ధారణలో క్వాంటమ్ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఎన్ఐటీ వరంగల్ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రకాష్ కొడాలి మాట్లాడుతూ భారీ స్థాయిలో డేటా విశ్లేషణ, సైబర్ సెక్యూరిటీ, బయోమెడికల్ ఇమేజింగ్ వంటి రంగాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ విశేష అవకాశాలను సృష్టిస్తోందని చెప్పారు. క్వాంటమ్ టెక్నాలజీపై విద్యార్థులు ఇప్పటి నుంచే అవగాహన పెంచుకొని పరిశోధనల వైపు అడుగులు వేయాలని సూచించారు. రాజస్థాన్లోని సెంట్రల్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ప్రకాష్ చౌదరి మాట్లాడుతూ ఆసుపత్రుల్లో రోగ నిర్ధారణ, వైద్య చిత్రాల విశ్లేషణ, రోగుల ఆరోగ్య పర్యవేక్షణ, చికిత్సా ప్రణాళికల రూపకల్పన, ఔషధాల అభివృద్ధి వంటి అనేక విభాగాల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్లో ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, డీప్ లెర్నింగ్ సమన్వయంతో ఆరోగ్యరంగంలో వినూత్న ఆవిష్కరణలు చోటుచేసుకుంటాయని, విద్యార్థులు పరిశోధనల ద్వారా ఈ మార్పుకు నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్, రిజిస్ట్రార్ పీఎంవీ రావు పాల్గొన్నారు.ఐఐఐటీ శ్రీ సిటీ ఫ్యాకల్టీ అఫైర్స్ డీన్ విశ్వనాథ్ -
రిజిస్ట్రేషన్ చిక్కులు
జీవో నంబర్ 396పై ఆగ్రహావేశాలుదస్తావేజు లేఖర్ల పొట్ట కొట్టే జీవో 396 ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలి. ఆర్ఎస్కేలతో ప్రైవేట్ సంస్థలకు లాభం చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నాం. – పోతంశెట్టి వెంకటేష్, అధ్యక్షుడు, దస్తావేజు లేఖర్ల సంఘం, సత్తెనపల్లి సత్తెనపల్లి: రిజిస్ట్రేషన్ అంటే ఒక వేడుకే. కొనేవాళ్లకు ఆస్తి వస్తుందనే సంతోషం.. అమ్ముకొనే వాళ్లకు డబ్బు వస్తుందనే ఆనందం. అయితే ఈ ప్రక్రియ సంక్షిష్టంతో ఉంటుంది. ఇప్పటి వరకు దస్తావేజు లేఖర్లు ప్రతి అంశాన్ని పరిశీలించి ఎలాంటి తప్పొప్పులు లేకుండా సజావుగా రిజిస్ట్రేషన్ చేయించి ఆస్తి పత్రాలు చేతులకు అందించేవారు. కానీ నేడు టీడీపీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు ఈ పని అప్పగిస్తూ జీఓ నంబర్ 396 విడుదల చేసి ఆ దిశగా సన్నాహాలు మొదలు పట్టింది. ఇది ఎలాంటి ముసలం తెస్తుందోననే ఆందోళన అన్ని వర్గాల్లో నెలకొంది. 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియతో ప్రమాదం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు (ఆర్ఎస్కే) ఇప్పుడు టెన్షన్ తెప్పిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం రూ. 2 వేలు రుసుము చెల్లిస్తే 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిపోతుందని చెబుతోంది. అయితే రిజిస్ట్రేషన్ చేయాలనుకునేవారు ఎంత పరపతి ఉన్నవారైనా ఒక పూటంతా సమయం వెచ్చించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటిది 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేస్తామన్న కూటమి ప్రభుత్వం చెప్పే అబద్ధాలు నమ్మే పరిస్థితి లేదని క్రయ విక్రయదారులు చెబుతున్నారు. పోనీ ఈ వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వ పరం చేసినా లబ్ధిదారులకు ఉపయోగం ఉండేది. కానీ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఓ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించి కమీషన్ కొట్టేసి, తద్వారా డబ్బులు సంపాదించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వందేళ్లకు పైగా ఉన్న వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలన్న కూటమి పాలకుల ఆలోచనలను విరమించుకోవాలని కోరుతూ దస్తావేజు లేఖర్లు ఈ నెల 6,7 తేదీల్లో ఆందోళనలు, శాంతియుత నిరసనలు చేపట్టారు. అయినప్పటికీ ప్రభుత్వం మొండి వైఖరితో ఉండడంతో ఈ నెల 20 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా పెన్డౌన్ నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. జిల్లాలో రూ.36 కోట్ల ఆదాయానికి గండి నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల, పిడుగురాళ్ల, క్రోసూరు, అమరావతి లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి నిత్యం ప్రభుత్వానికి రూ. 3 కోట్ల ఆదాయం వస్తోంది. ఈ నెల 20 నుంచి 25 వరకు ఆరు రోజులపాటు దస్తావేజు లేఖర్లు, స్టాంపు వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, దస్తావేజు లేఖర్ల సహాయకులు పెన్డౌన్ నిరసన చేపట్టడంతో రూ.30 కోట్ల పైగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. ఈ నెల 6,7న నిరసనలతో రూ. 6 కోట్లు ప్రభుత్వం ఆదాయం కోల్పోయింది. న్యాయపరమైన చిక్కులు తప్పవు మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో తీసుకొస్తామని ప్రకటించినట్లుగా కూటమి ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలో పీపీపీ విధానంలో రిజిస్ట్రార్ కార్యాలయాలను పాస్పోర్టు కార్యాలయాలుగా ఏర్పాటు చేస్తామని చెబుతోంది. ఈ విధానం ప్రకారం క్రయ, విక్రయదారులు ఇద్దరు ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలకు (ఆర్ఎస్కేకి) వెళ్లి వారి దస్తావేజులు తయారు చేసుకొని, సబ్రిజిస్ట్రార్ దగ్గరకు వెళితే ఆయన పరిశీలించి రిజిస్ట్రేషన్ చేస్తారు. అయితే ఈ విధానం వలన భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురుకానున్నాయని దస్తావేజు లేఖర్లు అంటున్నారు. క్రయ, విక్రయదారుల్లో ఎవరికై నా రిజిస్ట్రేషన్ విధానంపై సరైన అవగాహన లేకపోయినా, చట్టపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోయినా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని, న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. వందేళ్ల చరిత్ర ఉన్న దస్తావేజు లేఖర్ల బతుకులు రోడ్డున పడేయడం సరికాదు. జీవో 396 అమలు చేస్తే కుటుంబాలను పోషించుకునేందుకు దస్తావేజు లేఖరులు ఇబ్బంది పడతారు. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చు కోవాలి. – డోగిపర్తి శివకేశవ, ట్రెజరర్, దస్తావేజు లేఖర్ల సంఘం, సత్తెనపల్లి జిల్లాలోని 10 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో దస్తావేజు లేఖర్లు 300 మంది, స్టాంప్వెండర్లు 100 మంది, డీటీపీ ఆపరేటర్లు 200 మంది, దస్తావేజు లేఖర్ల సహాయకులు 600 మందికి పైగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా 1200 మంది ఉన్నారు. పరోక్షంగా వీరిపై వారి కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. ఒక్కో దస్తావేజు లేఖరు వద్ద ఐదు కుటుంబాలు పనిచేస్తుంటాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 396 జీఓ తీసుకురావడం వలన ప్రత్యక్షంగా 1200 కుటుంబాలు, పరోక్షంగా మరో 200 కుటుంబాలకు పైగా రోడ్డున పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయి యువత పెడదారి పడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం 396 జీవోను ప్రభుత్వం తీసుకు రావడంతో మొత్తం మీద జిల్లాలో రూ. 36 కోట్ల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడిన పరిస్థితి నెలకొంది. -
బియ్యం షాపులో విజిలెన్స్ అధికారుల తనిఖీ
గుంటూరు మెడికల్: పాత గుంటూరులోని శ్రీ దుర్గా భావన బెస్ట్ రైస్ షుగర్ ఫ్రీ రైస్ షాప్లో సోమవారం జిల్లా విజిలెన్న్స్ కమిటీ సభ్యులు, ఫుడ్ సేఫ్టీ అధికారి నరసింహుడు తనిఖీలు నిర్వహించారు. షాపు నిర్వాహకులు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ మున్సిపల్ ట్రేడ్ లైసెన్సు, లేబర్ లైసెన్సు లేకుండా విక్రయాలు జరుపుతున్నట్లు గుర్తించారు. ఎలాంటి లైసెన్సు లేకుండా అమెరికన్ జనరల్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఐ సీ ఎం ఆర్ ధ్రువీకరించినట్లుగా బియ్యాన్ని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. అక్కడ ఉన్న బియ్యాన్ని శాంపిల్స్ తీసి షాపు నిర్వాహకులకు నోటీసులు ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. షాపు తనిఖీ చేసిన వారిలో జిల్లా విజిలెన్న్స్ కమిటీ సభ్యులు డాక్టర్ చదలవాడ హరిబాబు మునిపల్లి కవిత, అధికారులు ఉన్నారు. బాపట్ల టౌన్: బాపట్ల మండలం వెదుళ్ళపల్లి గ్రామంలో గంజాయి తాగుతున్న నలుగురు వ్యక్తులు అరెస్ట్ చేశారు. సోమవారం వెదుళ్ళపల్లి పోలీస్స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో సర్కిల్ సీఐ బి. హరికృష్ణ వివరాలను వెల్లడించారు. గంజాయి తాగుతున్న చీరాల పట్టణం, రామ్నగర్కు చెందిన పేరం సాయిచంద్, చిలకలూరిపేటటౌన్ ఎన్టీఆర్ కాలనీకి చెందిన దేవరకొండ హేమంత్కుమార్, కడప టౌన్ నాగరాజుపేటకు చెందిన రావినూతల అచ్యుత్సాయికుమార్లను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు తనదైన శైలిలో విచారించగా వారికి మండలంలోని వెదుళ్ళపల్లి గ్రామానికి చెందిన దేవి ఏడుకొండలరెడ్డి గంజాయి సరఫరా చేశారన్నారు. మొత్తం నలుగురిని అరెస్ట్చేసి కోర్టుకు హాజరు పరిచామన్నారు. వారి వద్ద నుంచి 190 గ్రాముల గంజాయి, వివో రెడ్ హ్యాండ్రైడ్ ఫోన్, రెండు నోకియా కీబోర్డ్ ఫోన్లు, ఒక లావా కీప్యాడ్ ఫోన్, రూ. 600 నగదు, టీవీఎస్ జూపీటర్ స్కూటర్ స్వాధీనం చేసుకున్నామన్నారు. వెదుళ్ళపల్లి ఎస్ఐ ఎం. వెంకటేశ్వర్లు, విధుల్లో ప్రతిభ కనపరిచిన హెడ్కానిస్టేబుల్ తిరుపతిరాజు, అంకయ్య, కానిస్టేబుల్స్ రమేష్, రాజేష్లను ప్రత్యేకంగా అభినందించారు. -
కొండవీడుకోటపై ఉరుసు వైభవం
మూడు దశాబ్దాల తర్వాత పురాతన హజరత్ సయ్యద్ షా ఔలియా రహమతుల్లా దర్గాలో ఉత్సవాలుయడ్లపాడు: చారిత్రక కొండవీడుకోట కొండలపై వెలసిన పురాతన హజరత్ సయ్యద్ షా ఔలియా రహమతుల్లా బాబా దర్గా ఆదివారం భక్తజన సందోహంతో కళకళలాడింది. కొండపైకి సరైన మార్గం లేక దాదాపు మూడు దశాబ్దాలుగా నిలిచిపోయిన ఉరుసు ఉత్సవాలు, మళ్లీ అత్యంత వైభవంగా పునఃప్రారంభం కావడం భక్తుల్లో ఆనందోత్సాహాలు నింపింది. చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యమున్న ఈ ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతీకగా నిలిచాయి. ఉదయం నుంచే ఉత్సవాలు.. ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో కొండపైకి చేరుకుని బాబావారిని దర్శించుకున్నారు. ఫకీర్లు ఇస్లామీయ భక్తిగీతాలు ఆలపిస్తూ, మేళతాళాల నడుమ పూల చాదర్లతో నిర్వహించిన ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం దర్గా వద్దకు చేరుకుని బాబావారి సమాధిపై పూల చాదర్ కప్పి, గంధం సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు తమ గ్రామాల తరఫున చాదర్లను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జుమ్మా మసీదు ఇమాంగా బాబావారి సేవలు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాఖ్ అహ్మద్ స్థానిక మతపెద్దలతో కలిసి ఖురాన్ పఠనం, దువా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సయ్యద్ షా ఔలియా రహమతుల్లా బాబా జుమ్మా మసీదులో ఇమాంగా విశిష్ట ఆధ్యాత్మిక సేవలు అందించారని గుర్తు చేశారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ జుమ్మా మసీదు నుంచి సర్వాంగసుందరంగా అలంకరించిన గుర్రంపై గంధాన్ని ఊరేగింపుగా తీసుకువచ్చి దర్గాలో సమర్పించినట్లు వివరించారు. ఉరుసు ఉత్సవాల సందర్భంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంటూరుకు చెందిన నౌ అవర్ హిస్టరీ సంఘం అధ్యక్షుడు సూఫీ ఇమ్రాన్ ఆధ్వర్యంలో దర్గా కమిటీ సభ్యులు షేక్ గౌస్, షేక్ అల్లాబక్షు, నూర్ అహ్మద్, అజ్హర్ తదితరులు ఉత్సవాల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. -
తల్లికి వందనం ఏది బాబూ..?
బొల్లాపల్లి: ఆ కుటుంబంలో ఉద్యోగులు లేరు... పన్ను చెల్లింపుదారులు కానరారు. విద్యుత్ బిల్లులు అసలే లేవు. కానీ తల్లికి వందనం పథకం మాత్రం వర్తించదు. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం గండిగనముల గ్రామానికి చెందిన నీనావతు బాలకోటి నాయక్, పద్మాబాయి దంపతులకు నలుగురు సంతానం. వీరు ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. పెద్ద కుమార్తె హర్షిణి 6వ తరగతి, గోపిక, దీపిక లు (కవలలు) వినుకొండ పట్టణంలోని ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో 4వ తరగతి , కుమారుడు జోగేశ్వరరావు నాయక్ స్థానిక గండిగనుమల గ్రామంలో రెండో తరగతి చదువుతున్నారు. అయితే తల్లికి వందనం పథకం అర్హుల జాబితాలో ఒక్కరి పేరూ లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. అదేమని అధికారులను అడిగితే పొంతనలేని సమాధానం చెబుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పథకం ఇచ్చారని, అప్పట్లో లేని నిబంధనలు ఇప్పుడు ఎలా వచ్చాయని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మాది పేద కుటుంబం. రెక్కల కష్టంపై ఆధారపడి పిల్లలను చదివించుకుంటూ జీవనం సాగిస్తున్నాం. సొంతం అర ఎకరం పొలంతోపాటు మరో ఎకరన్నర పొలం కౌలుకు తీసుకొని సాగు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నాం. ఉద్యోగుల కుటుంబం కాదు, ఇతరత్రా పన్ను చెల్లింపులు లేవు. 200 యూనిట్లలోపు ఎస్సీ, ఎస్టీ ఉచిత విద్యుత్ పథకం కింద ఉన్నాం కాబట్టి కరెంటు బిల్లులు లేవు. కానీ తల్లికి వందనం అర్హుల జాబితాలో పేరు లేదు. ప్రభుత్వం అర్హత గల ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం ఇస్తామన్నారు. పలుమార్లు అధికారులను దీనిపై అడిగితే పొంతన లేని సమాధానం చెబుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకం వచ్చింది. ఇప్పుడెందుకు రాలేదో అర్ధం కావడం లేదు. అధికారులు న్యాయం చేయాలి. – నీనావతు బాలకోటి నాయక్, పద్మాబాయి -
కృష్ణా–గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎస్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థి సుధీర్భాబు
సత్తెనపల్లి: రానున్న శాసనమండలి ఎన్నికలలో కృష్ణా–గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజక వర్గం నుంచి ఎస్టీయూ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని ఎస్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థి సీహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు అన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ప్రజ్ఞ కాన్సెప్ట్ స్కూల్ ఆవరణలో శనివారం రాత్రి జరిగిన ఎస్టీయూ ప్రాంతీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. సమావేశానికి ఎస్టీయూ సత్తెనపల్లి ఏరియా కార్యదర్శి వల్లూరి నాగరాజు అధ్యక్షత వహించారు. జోసెఫ్ సుధీర్బాబు మాట్లాడుతూ ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్గా, రాష్ట్ర ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్ గా వివిధ హోదాల్లో మూడు దశాబ్దాల పాటు ఉద్యోగ, ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారం కోసం ఐదుగురు ముఖ్యమంత్రులకు ప్రాతినిధ్యాలు చేయడమే కాకుండా ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేశానన్నారు. ఎస్టీయూ పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఎల్.వి.రామిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి ఉద్యమ నేపథ్యం, విద్యారంగ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న సుధీర్ బాబును గెలిపిస్తే శాసనమండలిలో సైతం ఉపాధ్యాయ వాణిని వినిపించి ఉద్యోగుల హక్కులను పరిరక్షించగలరన్నారు. ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.ఏమండి, ఆర్థిక కార్యదర్శి షేక్ మహబూబ్ సుభాని, రాష్ట్ర కౌన్సిలర్ ఎస్.ఎం.సుభానీ, జిల్లా అదనపు ప్రధాన కార్యదర్శి కుంభా రామలింగయ్య, జిల్లా గౌరవ అధ్యక్షుడు కోలా యేసయ్య, పెన్షనర్ల సంఘం ప్రధాన కార్యదర్శి కెబీఆర్జే .ప్రసాద్ , ఎస్టీయూ మాజీ నాయకుడు సలగాల మృత్యుంజయరావు, ఎస్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కె.సురేష్, కార్యదర్శి తురకా రాజు, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ జె.వెంకటేశ్వరరావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఒకరి పరిస్థితి విషమం చిలకలూరిపేటటౌన్: పట్టణంలోని విజయ బ్యాంక్ సెంటర్ సమీప హైవేపై శనివారం రాత్రి రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్న రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భూక్యా శ్రీసాయితోపాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు శ్రీసాయి తలకు బలమైన గాయమై చెవుల్లోంచి రక్తం కారడంతో పరిస్థితి అత్యంత విషమంగా మారింది. స్థానికులు వెంటనే స్పందించి బాధితులను ఒక ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం గుంటూరు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అర్బన్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, ట్రాఫిక్ ప్రమాదానికి కారణమైన వాహనాల్ని తొలగించి ట్రాఫిక్ను నియంత్రించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
నరసరావుపేట టౌన్: ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ రాజమోహన్రావు ఆదివారం తెలిపారు. రైల్వే పోలీస్ పరిధిలోని సంతమాగులూరు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు పట్టాలు పక్కన సుమారు 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి మృతి చెంది పడి ఉన్నాడన్నా సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్నామన్నారు. మృతదేహం ఆనవాళ్లను బట్టి రైలు నుంచి జారిపడి మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడి ఆనవాళ్లు తెలిసిన వారు రైల్వే పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని ఎస్ఐ కోరారు. నాదెండ్ల: ప్రమాదవశాత్తూ కాలుజారి పడిన యువకుడు దుర్మరణం పాలైన సంఘటన కనపర్రు శివారు మల్లాయపాలెంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మల్లాయపాలెం గ్రామానికి చెందిన దార్ల కిరణ్కుమార్ (31) నరసరావుపేటలో ట్రావెల్స్ ఏజెన్సీలో డ్రైవర్గా పనిచేస్తుంటాడు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో బహిర్భూమికి వెళ్లిన కిరణ్ కాలుజారి చెరువులో పడ్డాడు. స్థానిక రైతులు చూసి చెరువులో పడిన కిరణ్ను బయటకు తీసి 108 వాహనంలో ఆసుపత్రికి తరలించేలోగా మార్గంమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య వందన, నాలుగేళ్ల కుమారుడు మోహన్రాయ్, మూడు వారాల కిందట జన్మించిన కుమార్తె ఉన్నారు. భార్య వందన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు గన్మెన్లతో ఇన్నోవా కారులో తిరుగుతూ మోసాలు ఒంగోలు టౌన్: సైబర్ క్రైంలో డబ్బులు పోగొట్టుకున్న బాధితుడికి నేను డీఎస్పీగా పనిచేస్తున్నాను..నీ డబ్బులు ఇప్పిస్తానని నమ్మించి మోసం చేసిన ఒక నకిలీ డీఎస్పీ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...ఒంగోలు మండలం ముక్తినూతలపాడుకు చెందిన గ్రానైట్ వ్యాపారి ముంగులూరి రఘుపతికి ఇన్స్ట్రాగాంలో ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. కొంతకాలం స్నేహంగా నటించిన సదరు వ్యక్తి ఆన్లైన్ యాప్లో పెట్టుబడులు పెడితే రెట్టింపు డబ్బులు వస్తాయని ఆశ చూపారు. అతడి మాయమాటలు నమ్మిన రఘుపతి విడతల వారీగా రూ.1.23 కోట్ల వరకు పెట్టుబడి పెట్టాడు. ఆ తరువాత ఫోన్ స్విచాఫ్ కావడంతో మోసపోయినట్లు గ్రహించిన రఘుపతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో పోలీసుస్టేషన్ చుట్టూ తిరుగుతున్న క్రమంలో నరసరావుపేటకు చెందిన కొత్తపల్లి ప్రదీప్ పరిచయమయ్యాడు. తాను సైబర్ క్రైంలో డీఎస్పీగా చేస్తున్నానంటూ పరిచయం చేసుకున్న ప్రదీప్ నువ్వు పోగొట్టుకున్న డబ్బులు తిరిగి ఇప్పిస్తానంటూ నమ్మించాడు. ఇందుకుగాను రూ.5 లక్షల నగదు, బుల్లెట్ తీసుకున్నాడు. అయితే రోజులు గడుస్తున్నా తన డబ్బులు రాకపోవడంతో ప్రదీప్ మోసం చేసినట్లు గ్రహించిన రఘుపతి విచారించడంతో అసలు విషయం బయటపడింది. దాంతో ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. శనివారం రాత్రి ప్రదీప్ మీద కేసు నమోదు చేశారు. పోలీసులకు శిక్షణ ఇచ్చిన ప్రదీప్... నరసరావుపేటకు చెందిన కొత్తపల్లి ప్రదీప్, అతడి సోదరుడితో కలిసి సైబర్ నేరాలు, క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతుంటాడని సమాచారం. అంతేకాకుండా ఏడాది క్రితం ఒంగోలు పోలీసులకు నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొని పోలీసులకు శిక్షణ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పోలీసు ఉన్నతాధికారులతో పరిచయాలు పెంచుకొని తెరవెనుక నేరాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. పోలీసు శాఖలో సైబర్ డీఎస్పీగా చేస్తున్నట్లు నమ్మించి పలువురి దగ్గర నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఒక ఇన్నోవా కారులో ఇద్దరు ప్రైవేటు గన్మెన్లను పెట్టుకొని తిరుగుతుంటాడని చెబుతున్నారు. -
ప్రగడ కోటయ్యకు ఘననివాళి
నరసరావుపేట రూరల్: స్వాతంత్య్ర సమరయోధుడిగానే కాకుండా చేనేత కార్మికుల హక్కులు, సంక్షేమ కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు ప్రగడ కోటయ్య అని జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) రోహిత్ కుమార్ చౌదరి తెలిపారు. చేనేత ఉద్యమ స్ఫూర్తి ప్రధాత ప్రగడ కోటయ్య జయంతిని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. కోటయ్య చిత్రపటం వద్ద అదనపు ఎస్పీ రోహిత్ కుమార్ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రగడ కోటయ్య జీవితాన్ని అంకిత చేసారని తెలిపారు. చేనేత రంగాన్ని దేశవ్యాప్తంగా అభివృద్ధి చేసేందుకు, కార్మికులకు గౌరవప్రదమైన జీవనోపాధి కల్పించేందుకు చిరస్మరణీయమైన కృషి చేసారని పేర్కొన్నారు. కలెక్టరేట్లో .. నరసరావుపేట: కలెక్టర్ కార్యాలయంలో చేనేత ఉద్యమ పితామహుడు ప్రగడ కోటయ్య జయంతి ఉత్సవాలు ఆదివారం నిర్వహించారు. జిల్లా పరిశ్రమల అధికారి జి.సురేష్ ఆధ్వర్యంలో అధికారులు, చేనేత నాయకులు కోటయ్య చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు. ఫణిదం చేనేత సహకార సంఘం అధ్యక్షుడు కట్టా శివ దుర్గారావు సమక్షంలో జాతీయ చేనేత అవార్డు విజేత కర్నాటి మురళిని సత్కరించారు. చేనేత నాయకులు దండ కోటేశ్వరరావు, హ్యాండ్లూమ్, టెక్స్టైల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉమామహేశ్వరరావు, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాఘవరావు పాల్గొన్నారు. వినుకొండ: పట్టణంలోని ఏడీబీ బ్యాంక్ రోడ్డు డ్రైనేజీలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. మృతుడిని శృంగారపు వనానికి చెందిన నల్లగట్ల శేషాద్రిగా పోలీసులు గుర్తించారు. శేషాద్రి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని పోలీసులు తెలిపారు. సీపీ టీవీ దృశ్యాలను పరిశీలించగా, ఉదయం 6:14 గంటల ప్రాంతంలో నిలబడి ఉన్న శేషాద్రి ఒక్కసారిగా కుప్పకూలి పక్కనే ఉన్న డ్రైనేజీలో పడిపోయినట్లు నమోదైంది. కిందపడిన తర్వాత ఆయనలో ఎలాంటి కదలిక లేదు. హఠాత్తుగా స్ట్రోక్, మూర్ఛ లేదా మద్యం మత్తు వల్ల పడిపోయి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరమే మృతికి గల పూర్తి కారణాలు తెలుస్తాయని పోలీసులు పేర్కొన్నారు. ఈపూరు: మండలంలోని బొమ్మరాజుపల్లి కనుమ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరికి గాయాలయ్యాయి. బొల్లాపల్లి మండలం జయంతిరామాపురం గ్రామానికి చెందిన కోసూరు శ్రీనివాసరావు(32), తోకల వెంకటేష్, చిన్నిలు ద్విచక్ర వాహనంపై ఈపూరు వైపు వస్తుండగా బొమ్మరాజపల్లి కనుమ వద్దకు రాగానే రోడ్డు పక్కనే ఉన్న ఫెన్సింగ్ స్తంభాన్ని వేగంగా ఢీకొట్టడంతో కోసూరు శ్రీనివాసరావు తలకు తీవ్ర గాయాలయ్యాయి. తోకల వెంకటేష్, చిన్నికు స్వల్ప గాయాలయ్యాయి. 108 అంబులెన్స్లో క్షతగాతులను వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోసూరు శ్రీనివాసరావు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మిగిలిన ఇద్దరికీ చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. -
వైభోగ బోనం
● కనుల పండువగా ఊరేగింపు ● కొనసాగిన ఆషాఢ సారె సంబరాలు ● ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తుల తాకిడి ● అన్ని దర్శన టికెట్ల విక్రయాలు రద్దు ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ తరఫున హైదరాబాద్లోని భాగ్యనగర్ శ్రీమహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆదివారం బంగారు, వెండి బోనాలను సమర్పించింది. ఈ ఏడాది నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి, వానలు పుష్కలంగా కురియాలని, ఉభయ తెలుగు రాష్ట్రాలలో పాడి పంటలతో రైతులు, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ అమ్మవారికి బోనం సమర్పించినట్లు జోగిని అవికా పేర్కొన్నారు. 17 ఏళ్ల్లుగా ఏటా ఆషాఢ మాసంలో దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని ఉమ్మడి దేవాలయాల కమిటీ పేర్కొంది. భక్తితో బయలెల్లి.. బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి ఆవరణలోని రావిచెట్టు వద్ద అమ్మవారి ఉత్సవమూర్తి వద్ద తెలంగాణ బంగారు బోనానికి కమిటీ ప్రతినిధులు, దుర్గగుడి ఈవో శీనానాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, తీన్మార్ డప్పులు, బేతాళ నృత్యాలు, కళాకారులు విన్యాసాలు, వివిధ వేషధారణలు, పోతరాజుల విన్యాసాలతో వైభవంగా ఊరేగింపు ప్రారంభమైంది. తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ సుమారు 5 వందల మంది కళాకారులు తమ కళలను ప్రదర్శిస్తూ ఇంద్రకీలాద్రికి వైపు సాగారు. అమ్మవారికి ప్రణమిల్లి.. జోగిని అవికా బంగారు బోనాన్ని తలపై పెట్టుకుని ఊరేగింపులో ముందుకు సాగగా.. వెండి తదితర బోనాలతో మిగిలిన వారు అనుసరించారు. బంగారు బోనాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు బ్రాహ్మణ వీధి, రథం సెంటర్, ఇంద్రకీలాద్రి పరిసరాలను తరలివచ్చారు. దుర్గాఘాట్కు చేరుకున్న తర్వాత కృష్ణమ్మకు గంగ తెప్ప, పట్టుచీర, పూలు, పండ్లు, పూజా సామగ్రి తదితరాలను సమర్పించారు. దుర్గాఘాట్, ఘాట్రోడ్డు మీదగా ఊరేగింపు ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. సుమారు 700 మంది కళాకారులు, కమిటీ ప్రతినిధులు చేరుకోవడంతో ఘాట్రోడ్డుపై పండుగ వాతావరణం కనిపించింది. ఆలయ ప్రాంగణంలోని గాలి గోపురం వద్ద బంగారు బోనానికి ఆలయ ఈవో, చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు, అర్చకులు స్వాగతం పలికారు. కమిటీ ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల అనంతరం బంగారు, వెండి బోనాలతోపాటు పూజ సామగ్రి, పట్టువస్త్రాలు, పసుపుకుంకుమలను ఆలయ ఈవో, ఆలయ అర్చకులకు అందజేశారు. అమ్మవారి దయతో ఇరు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బుల్లెట్ శ్రీధర్, మాజీ అధ్యక్షులు పేర్కొన్నారు. కొనసాగిన సారె సంబరం ఆదివారం రికార్డు స్థాయిలో భక్త బృందాలు ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి ఆషాఢ సారెను సమర్పించాయి. భక్తుల రద్దీ కనిపించడంతో దర్శనానికై విక్రయించే అన్ని టికెట్ల విక్రయాలను అధికారులు రద్దు చేశారు. ఆదివారం 70 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారని భావిస్తున్నారు. -
మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి
నరసరావుపేట: డీఎస్సీ నియామకాల్లో అవకతవకలకు సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగాల జిల్లా అధ్యక్షులు కందుల శ్రీకాంత్, గుజ్జర్లపూడి ఆకాష్కుమార్లు డిమాండ్ చేశారు. పార్టీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నరసరావుపేటలో ఈ నెల 28వ తేదీన నిర్వహించే నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని వారు కోరారు. జిల్లా పార్టీ కార్యాలయంలో కార్యక్రమ పోస్టర్ను పలువురు నాయకులతో కలసి ఆదివారం వారు ఆవిష్కరించారు. దగా డీఎస్సీ, ఫీజు రీయింబర్స్మెంట్లపై సీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిజాలు నిగ్గు తేల్చి యువజనులు, విద్యార్థులకు న్యాయం జరిగేంతవరకు పార్టీ తరఫున పోరాటం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థి విభాగ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ ఉప్పుతోళ్ల వేణుమాధవ్, జిల్లా యువజన విభాగ ఉపాధ్యక్షుడు వెంకట యాదవ్, నియోజకవర్గ, పట్టణ విద్యార్థి విభాగం అధ్యక్షులు విజయరెడ్డి, మణీంద్రరెడ్డి, నరసరావుపేట, రొంపిచర్ల మండలాల విద్యార్థి విభాగ అధ్యక్షులు శాంత కుమార్ (బంటి), గెల్లి తేజరెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శులు షోయబ్ అక్తర్, జానీబాషా, నాయకులు పాల్గొన్నారు. -
జీవో 396 ఉపసంహరించుకునే వరకు పోరాటం
నరసరావుపేట: దస్తావేజు లేఖరుల పనిని ప్రైవేటుపరం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 396ను ఉపసంహరించుకువరకు తమ పోరాటం కొనసాగిస్తామని ఏపీ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంఘం నాయకులు, నరసరావుపేట సీనియర్ డాక్యుమెంట్ రైటర్లు సింగం యోగాంజనేయశర్మ, పిల్లుట్ల వెంకటరమణమూర్తి తెలిపారు. దస్తావేజుల లేఖరుల పెన్డౌన్ సందర్భంగా ప్రకాష్నగర్లోని రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఆదివారం జిల్లా స్థాయి కార్యాచరణ సమావేశం నిర్వహించారు. యోగాంజనేయశర్మ మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీ వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. జీవో రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనివల్ల సామాన్య ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఆస్తి గొడవలు, శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయన్నారు. జిల్లాలోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోని దస్తావేజు లేఖరులు ఆయా స్థానిక ఎమ్మెల్యేలను కలిసి వినతిపత్రలు సమర్పిస్తామన్నారు. ఆరు రోజులుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోయాయని తెలిపారు. ప్రజలు తమకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించారన్నారు. పిల్లుట్ల రమణమూర్తి మాట్లాడుతూ ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ విభాగంలో ప్రభుత్వాలు తీసుకొచ్చిన ప్రతి మార్పునకు సహకరించామన్నారు. ఈ జీవో అమల్లోకి వస్తే రిజిస్ట్రేషన్ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుందని హెచ్చరించారు. నరసరావుపేట సంఘ అధ్యక్షుడు నాగభూషణరావు, ప్రధాన కార్యదర్శి జేవీ సుబ్బాచార్యులు, జిల్లాలోని నియోజకవర్గాలకు చెందిన దస్తావేజు లేఖరులు పాల్గొన్నారు. -
ఏకపక్షంగా వైఎస్సార్ సీపీ ప్రభ తొలగింపు
అనుమతులు తీసుకున్నా ఇదేంటని నేతల ఆవేదన మేడికొండూరు: మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామంలోని వరదరాజస్వామి ఆలయం సమీపంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ప్రభను తొలగించిన వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. ఎంపీటీసీ మదమంచి శ్రీనివాసరావు, పలుకూరి రామకృష్ణారావు పేరేచర్ల గ్రామంలో దీనిని ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఒత్తిళ్లతోనే పోలీసులు ఈ చర్య తీసుకున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నాయకులు తెలిపిన వివరాల ప్రకారం... తొలి ఏకాదశి సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సంప్రదాయబద్ధంగా ప్రభను ఏర్పాటు చేయాలని ముందుగానే నిర్ణయించామన్నారు. ప్రభ ఏర్పాటుకు సంబంధించి పోలీసు శాఖతోపాటు సంబంధిత అధికారుల నుంచి అన్ని అనుమతులు తీసుకున్నామని తెలిపారు. నిబంధనలను పాటించామని చెప్పారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా, ప్రజలకు అసౌకర్యం లేకుండా ప్రభను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అనుమతులు మంజూరైన తర్వాత భారీ వ్యయంతో ప్రభ నిర్మాణం చేపట్టి విద్యుత్ అలంకరణలు, ఆధ్యాత్మిక సందేశాలతో సిద్ధం చేసినట్లు నాయకులు తెలిపారు. ఏర్పాట్లు ముగిసిన అనంతరం పోలీసులు అక్కడికి చేరుకుని ప్రభను తొలగించాలని ఆదేశించారని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. అనుమతులు ఇచ్చి, ఇలా అకస్మాత్తుగా తొలగించాలని చెప్పడం వెనుక కారణం ఏమిటని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీల సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలపైనా పోలీసుల ద్వారా వివక్ష చూపుతోందని ఆరోపించారు. అధికార పార్టీ ఒత్తిళ్ల కారణంగానే పోలీసులు నిర్ణయాన్ని మార్చుకున్నారని వారు విమర్శించారు. ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. పండుగలు రాజకీయాలకు అతీతమని, తొలి ఏకాదశి వంటి పవిత్ర పర్వదినాల్లో ప్రజల ఆధ్యాత్మిక భావాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నాయకులు అన్నారు. దీనిపై భక్తులు, స్థానిక ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైందని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, వాస్తవాలు ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. -
మహంకాళి అమ్మవారికి గాజుల అలంకరణ
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహంకాళి అమ్మవారిని ఆదివారం ప్రత్యేక గాజులతో అలంకరించారు. దేవస్థానం భక్తులతో కళకళలాడింది, ఆషాఢ మాసం రెండవ ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయానికి తరలివచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లను ఆలయ ఈఓ పర్యవేక్షించారు. పెదకాకాని: స్థానిక శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో సహస్ర ఘటాభిషేక పూజలను ఆదివారం అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. వరుణ జపాలు, రుష్యశృంగ జపం,వరుణ మంత్ర హోమాలు నిర్వహించినట్లు ఆలయ ఉపకమిషనరు గోగినేని లీలాకుమార్, పాలకమండలి చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా చివరి రోజు సోమవారం సహస్ర ఘటాభిషేకం, ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావలసినదిగా విజ్ఞప్తి చేశారు. సోమవారం అభిషేకాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. పాలకమండలి సభ్యులు కొమ్మూరి మల్లికార్జునరావు, ధూపాటి శివశంకరరావు తదితరులు పాల్గొన్నారు. నగరంపాలెం: గుంటూరు జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలో ఆదివారం రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ చేపట్టారు. సత్ ప్రవర్తనతో జీవించాలని రౌడీషీటర్లకు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు సూచించారు. నేరప్రవృత్తికి దూరంగా ఉండాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. నగరంపాలెం: సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన ఉండాలని సీఐడీ ఎస్పీ డాక్టర్ కేవీ శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్స్లోని రోటరీ భవన్లో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సీఐడీ ఎస్పీ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ కష్టపడి సంపాదించిన సొమ్ము సైబర్ నేరాలతో క్షణాల్లో మాయమవుతుందని పేర్కొన్నారు. ఏటీఎం పిన్ నంబర్లు, ఓటీపీ, పాస్వర్డ్లు ఇతరులకు చెప్పొద్దని కోరారు. తెలియని లింకులపై క్లిక్ చేయవద్దని చెప్పారు. అనుమానిత ఫోన్కాల్స్పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసం జరిగితే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని లేదా 1930 నంబర్కు కాల్ చేయాలని అన్నారు. అనంతరం ఎస్పీ శ్రీనివాసరావును సత్కరించారు. ఈ సదస్సులో క్లబ్ అధ్యక్షుడు పొందూరి శివప్రసాద్, కార్యదర్శి తుమ్మల శ్రీనివాసరావు, కోశాధికారి కొల్లి అరవింద్కుమార్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమంలోనూ పొరుగు వారే!
ఒకటో తేదీ వచ్చిందంటే అకౌంట్లో పడే జీతానికి, అయ్యే ఖర్చులకు లెక్క సరిపోదు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగమంటూ పెదవులపై ప్లాస్టిక్ నవ్వులు పులుముకుని ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పే ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఇంట అప్పుల కుంపటి ఆరదు. వేతనాలు పెంచండని వేడుకున్నా చంద్రబాబు ప్రభుత్వం మనసు కరగడం లేదు. ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖల్లో కీలకమైన విధులు నిర్వర్తిస్తున్నా, అరకొర వేతనాలతో కుటుంబాలను కన్నీటితో వారు నెట్టుకొస్తున్నారు. కనీసం సంక్షేమం కూడా దరి చేరడం లేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అంగన్వాడీలకు సైతం అమలు చేసి, చిరు ఉద్యోగులకు మాత్రం ఇవ్వకపోవడంతో వారు ఆవేదన చెందుతున్నారు.నరసరావుపేట టౌన్: ఒకవైపు ప్రభుత్వ శాఖల్లో ఏళ్ల తరబడి సేవలందిస్తున్నారు... మరోవైపు అదే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మాత్రం అనర్హులుగా మిగిలిపోతున్నారు. ఇదే రాష్ట్రంలో వేలాది మంది పొరుగు సేవల సిబ్బంది దీనస్థితి. దాదాపుగా అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలలో ఔట్సోర్సింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తాజాగా తల్లికి వందనం పథకం కింద అర్హులైన తల్లుల ఖాతాల్లో పిల్లల చదువుల కోసం నగదు జమ చేసింది. తమకు మాత్రం సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందడం లేదని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ఆవేదన మరోసారి తెరపైకి వచ్చింది. సీఎఫ్ఎంఎస్ ఐడీ మెడలో వేలాడుతుండగా కనీస వేతనాలు గానీ, సంక్షేమం గానీ అమలు కాక ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీవితం డీలా పడిపోతోంది. ఇప్పటికై నా మా జీతాలు చూసి జీవితాల్లో మార్పు తీసుకురావాలని వేడుకుంటున్నారు. పేరుకే ప్రభుత్వ కొలువు.. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నెలకు రూ.15 వేల వేతనం చెల్లిస్తున్నప్పటికీ, పీఎఫ్, ఈఎస్ఐ మినహాయింపుల తర్వాత చేతికి అందేది కేవలం రూ.13,087 మాత్రమే. పెరుగుతున్న ధరలు, అద్దె, పిల్లల చదువులు, వైద్య ఖర్చుల మధ్య ఈ మొత్తంతో కుటుంబాన్ని పోషించడం భారంగా మారిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు కాకపోయినా, సీఎఫ్ఎంఎస్ పోర్టల్లో మాత్రం ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదై ఉందని అంటున్నారు. అదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారిందని వాపోతున్నారు. సీఎఫ్ఎంఎస్లో ప్రభుత్వ ఉద్యోగులుగా నమోదవడంతో తల్లికి వందనంతో పాటు ఇతర సంక్షేమ పథకాలకు కూడా అనర్హులుగా పరిగణిస్తున్నారని చెబుతున్నారు. తాజాగా ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసింది. అయితే ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు ఉన్నప్పటికీ, సీఎఫ్ఎంఎస్ నమోదును కారణంగా చూపుతూ పథకం వర్తింపజేయడం లేదని వారు చెబుతున్నారు. తక్కువ వేతనం పొందుతున్న తమలాంటి కుటుంబాలకు ఈ సాయం అత్యంత అవసరమని పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు లభించే వేతనాలు, ఉద్యోగ భద్రత, ఇతర సౌకర్యాలు తమకు లేవని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. పేద కుటుంబాలకు అందించే సంక్షేమ పథకాలూ అందక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను గత సోమవారం ఆంధ్రప్రదేశ్ ఔట్సోర్సింగ్ పారామెడికల్ అసోసియేషన్ సభ్యులు పీజీఆర్ఎస్లో కలసి వినతిపత్రం అందజేశారు. ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని తల్లికి వందనం సహా అన్ని అర్హత ఆధారిత సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి సంక్షేమ పథకాలను నిలిపివేస్తున్నారని వాపోయారు. శాశ్వత ఉద్యోగులకు ఉండే వేతనాలు, డీఏ, హెచ్ఆర్ఏ, ఉద్యోగ భద్రత, పదవీ విరమణ ప్రయోజనాలు కల్పించాలని కోరారు. ఈ మేరకు ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లి న్యాయం చేయాలని విన్నవించారు. -
చేనేత రంగానికి ప్రగడ సేవలు ఆదర్శం
చీరాల: చేనేతల పితామహుడు ప్రగడ కోటయ్య అని రాష్ట్ర చేనేత, జౌళి, బీసీ సంక్షేమ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. ఆదివారం స్థానిక పద్మశాలి బహూత్తమ సంఘ కల్యాణ మండపంలో ప్రగడ కోటయ్య 111వ జయంతి వేడుకలను నిర్వహించారు. చేనేత రంగ అభివృద్ధికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా మంత్రి ఎస్.సవిత హాజరయ్యారు. చేనేత వస్త్ర ప్రదర్శనను తిలకించారు. అనంతరం వేదికపై ఏర్పాటు చేసిన ప్రగడ కోటయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చేనేత రంగానికి సహకార సంఘాలు ఎంతో ప్రయోజనం చేస్తాయని ప్రగడ కోటయ్య నమ్మారని అన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు వారి గళాన్ని వినిపించిన వ్యక్తి అని కొనియాడారు. రాష్ట్ర చేనేత కార్మికుల సొసైటీలు, సహకార సంఘాలు వ్యవస్థాపకులుగా ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు. రాష్ట్ర చేనేత, జౌళి ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ఆర్పీ సిసోడియా, సంచాలకులు రేఖరాణి, ఉపసంచాలకులు బి.వెంకటేశ్వరరావు, సహాయ సంచాలకులు వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ వి.వినోద్కుమార్, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య, ఎమ్మెల్సీ పోతుల సునీత, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ అబద్దయ్య, ఆప్కో ఎండీ కన్నబాబు పాల్గొన్నారు. -
రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు
గుంటూరు మెడికల్: గుంటూరు జిల్లాకు చెందిన ఇరువురికి కరోనా నిర్ధారణ అయింది. తుళ్లూరు మండలం ఉద్దండరాయనిపాలెంకు చెందిన 18 ఏళ్ల యువతికి, తాడేపల్లికి చెందిన 32 సంవత్సరాల మహిళకు విజయవాడ జీజీహెచ్ వైద్యులు శనివారం కరోనా ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో జిల్లాలో బాధితుల సంఖ్య 8కి చేరింది. గుంటూరు జీజీహెచ్లో నలుగురికి కరోనా పరీక్షలు చేయగా, ఒకరికి కూడా నిర్ధారణ కాలేదు. జీజీహెచ్లో కరోనా టెస్టింగ్ కిట్లు 330, ఎన్ 95 మాస్క్లు 9,650, పీపీఈ కిట్లు 1,865 అందుబాటులో ఉన్నట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ గిరిజవోలు దుర్గాప్రసాద్ తెలిపారు. బాపట్ల జిల్లా గుండిపాలెంకు చెందిన 32 ఏళ్ల మహిళకు విజయవాడ గర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ వచ్చినట్లు శనివారం నిర్ధారించారు. -
మరో ప్రాణం బలి
ఖాకీ కావరానికి కూటమి పాలనలో ఖాకీల ఇష్టారాజ్యం నడుస్తోంది. పోలీసుల వేధింపులకు మరో నిండు ప్రాణం బలైంది. ప్రేమ వ్యవహారంలో టీపీపీ నేతలకు వత్తాసు పలుకుతూ ఓ సీఐ వేధించడంతో పల్నాడు జిల్లా, అచ్చంపేట మండలం, కొండూరు పంచాయతీ శివారు నిండుజర్లకు చెందిన కడివెళ్ల నాగరాజు (50) సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. శనివారం ఉదయం ఈ వీడియో వైరల్ అయింది. మృతుని బంధువులు తమకు న్యాయం చేసేదాకా మృతదేహాన్ని తీసుకునేది లేదంటూ సత్తెనపల్లి ప్రభుత్వం వైద్యశాల వద్ద ఆందోళన చేపట్టారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కొండమోడు – పేరేచర్ల జాతీయ రహదారిపై శనివారం ఆందోళన నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. – అచ్చంపేట /సత్తెనపల్లి -
వ్యవసాయాభివృద్ధికి శాసీ్త్రయ పరిశోధనలు అవసరం
బాపట్ల టౌన్: వ్యవసాయాభివృద్ధికి శాసీ్త్రయ పరిశోధనలు అవసరమని, సహజ సాగు పద్ధతులు భవిష్యత్కు మార్గమని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో శనివారం ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 58వ స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించిన గవర్నర్, పట్టభద్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న వాతావరణ మార్పులు, సహజ వనరుల క్షీణత వంటి సవాళ్లను అధిగమించేందుకు శాసీ్త్రయ పరిశోధనలు, సుస్థిర వ్యవసాయ విధానాలు, సహజ సాగు విధానాలు అత్యంత అవసరమన్నారు. ఆరు దశాబ్దాలుగా వర్సిటీ వ్యవసాయ విద్య, పరిశోధనలు, విస్తరణ సేవల ద్వారా రైతులకు, సాగులో ప్రగతికి విశేష సేవలు అందిస్తోందన్నారు. ఈ స్నాతకోత్సవం విద్యార్థుల కృషి, పట్టుదల, అంకితభావానికి నిదర్శనమని చెప్పారు. వారి విజయాల్లో తల్లిదండ్రులు, అధ్యాపకులు, శాస్త్రవేత్తల పాత్ర అమూల్యమన్నారు. ప్రధాన అతిథిగా విచ్చేసిన ఐసీఏఆర్ భారతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం సంచాలకులు డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావును గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. సహజ వనరుల నిర్వహణ, సుస్థిర వ్యవసాయం, వాతావరణ మార్పులకు అనుగుణమైన వ్యవసాయ విధానాల అభివృద్ధిలో ఆయన చేసిన కృషి దేశానికి మార్గదర్శకమన్నారు. పత్తి సాగు అభివృద్ధికి విశేష సేవలు అందించి పదవీ విరమణ పొందిన పత్తి శాస్త్రవేత్త కె. రవీంద్రనాథ్కు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ (హానోరిస్ కాజా) ప్రదానం చేయడం అభినందనీయమన్నారు. వ్యవసాయం కేవలం ఆర్థిక కార్యకలాపం మాత్రమే కాదన్నారు. దేశ సంస్కృతి, ఆహార భద్రత, సమాజ శ్రేయస్సుకు పునాదిగా నిలుస్తుందన్నారు. సవాళ్లు పరిష్కరించాలి ప్రస్తుతం సాగు రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని, వాటిని పరిష్కరిస్తూ సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. లక్షలాది మంది రైతులు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందుతున్నారని తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించేలా, వారి అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు చేయాలని విద్యార్థులకు సూచించారు. 50 మందికి డాక్టరేట్, 240 మంది పీజీ విద్యార్థులు, 1385 మంది గ్రాడ్యుయేట్లతోపాటు పలువురికి పతకాలు, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ పి.వి. సత్యనారాయణ, కళాశాల ప్రిన్సిపాల్ ప్రసన్న రాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు, జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్, కళాశాల అధ్యాపకులు, పెద్దసంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ -
కోటప్పకొండలో తొలి ఏకాదశి సందడి
● త్రికోటేశ్వరునికి విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ ● స్వామి వారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు నరసరావుపేట రూరల్: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో భక్తుల సందడి నెలకొంది. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి త్రికోటేశ్వరుడిని దర్శించుకొని తరించారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ అర్చకస్వాములు బిందెతీర్థంతో స్వామి వారికి తొలి అభిషేకాలను నిర్వహించారు. పంచామృతాలు, ఫలాలు, విశేష ద్రవ్యాలతో స్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం వైభవంగా జరిపారు. అనంతరం ప్రత్యేక అలంకరణ చేసి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఉదయం భక్తుల రద్దీ నెలకొంది. ఉచిత, శీఘ్ర, ప్రత్యేక, అభిషేక దర్శనాన్ని కల్పించారు. ఉచిత, శీఘ్ర దర్శనం క్యూలైన్లు రద్దీగా కనిపించాయి. మూలవిరాట్ అభిషేకాలను నిలిపివేశారు. అభిషేక మండపంలో ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. సోపాన మార్గంలో మెట్ల పూజ చేసుకుంటూ కొండ మీదకి చేరుకొని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు ఆలయం వెనుక రావిచెట్టు, మహనందీశ్వరుడి వద్ద దీపాలు వెలిగించారు. ధ్యానశివుడు, నాగేంద్రుడి పుట్ట వద్ద భక్తులు పూజలు నిర్వహించారు. నరసరావుపేట నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపింది. కొండ మీద పార్కింగ్ స్థలం వాహనాలతో నిండిపోయింది. స్వచ్ఛంద సంస్థలు, దిగువ సత్రాల వద్ద ఉచిత ప్రసాద పంపిణీ నిర్వహించారు. ఆలయ ఈవో డి.చంద్రశేఖరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు తొలిపూజలో పాల్గొన్నారు. -
దుర్గమ్మకు మనసారె సమర్పణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఆలయ ట్రస్ట్ బోర్డు, ఉత్తరాంధ్ర నుంచి భారీగా భక్త బృందాలు అమ్మవారికి సారె సమర్పించారు. శనివారం ఉదయం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు, కుటుంబ సభ్యులు మహా మండపం నుంచి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి సన్ని ధికి చేరుకున్న బోర్డు సభ్యులకు ఈవో శీనానాయక్, అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తికి సారెను సమర్పించారు. ఉత్తరాంధ్ర నుంచి భారీగా భక్త బృందాలు విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, గజపతి నగరం, శ్రీకాకుళం నుంచి శనివారం భారీగా భక్తులు బృందాలుగా అమ్మవారికి సారె సమర్పించారు. భక్తులతో ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్ల కిటకిటలాడాయి. రద్దీ నేపథ్యంలో ఉదయం పది గంటల నుంచి అంతరాలయ దర్శనం, మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి అన్ని టికెట్ల విక్రయాలు నిలిపివేశారు. దీంతో భక్తులు బంగారు వాకిలి, రూ. 300, 100 టికెట్ క్యూలైన్లతో పాటు రెండు సర్వ దర్శనం క్యూలైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నేడు వీఐపీ దర్శనాలు రద్దు తెలంగాణ నుంచి దుర్గమ్మకు ఆదివారం బంగారు బోనం, ఆషాఢ సారె నేపథ్యంలో అన్ని వీఐపీ, ప్రొటోకాల్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు దుర్గగుడి ఈఓ శీనానాయక్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ బోనం సమర్పణకు సుమారు మూడు వేల మంది కళాకారులు, ఉత్సవ కమిటీ సభ్యులు వస్తారని తెలిపారు. గత ఆదివారం ఒక్క రోజే సుమారు 85 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. ఈ ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నామని వివరించారు. మరో వైపున కొండపైకి ఎటువంటి ప్రయివేటు వాహనాలను అనుమతించేది లేదని, దేవస్థానం బస్సులను పూర్తి స్థాయిలో నడుపుతామని తెలిపారు. దివ్యాంగులు, వృద్ధులు, చంటి బిడ్డల తల్లులు ఉదయం ఎనిమిది గంటల్లోపు, మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు రావాలని సూచించారు. భక్తులందరూ సహకరించాలని ఆయన కోరారు. -
విజయకీలాద్రిపై తొలి ఏకాదశి వేడుకలు
నరసరావుపేట రూరల్: గురుపౌర్ణమి సందర్భంగా ఈనెల 29వ తేదీ ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో మేధాదక్షిణామూర్తి హోమం, గిరి ప్రదక్షిణ, అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో డి.చంద్రశేఖరరావు శనివారం తెలిపారు. ఆలయ అవరణలో నిర్వహించే అక్షరాభ్యాసం, ఇతర కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. తెనాలిటౌన్: స్థానిక చినరావూరు ఐటీఐ ప్రాంగణాన్ని శనివారం గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ పరిశీలించారు. తెనాలి పర్యటనలో భాగంగా ఐటీఐ కళాశాలను సందర్శించినట్లు చెప్పారు. ప్రాంగణంలోని మౌలిక వసతులు పరిశీలించి అధికారుల నుంచి సమాచారం తెలుసుకున్నారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టి ప్రాంగణంలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ ఆవరణంలో ఎంఎస్ఎంఈ పార్కు వంటి ఏర్పాట్లకు సాధ్యసాధ్యాలను పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీవో కె.శ్రీరమణి, తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, మండల సర్వేయర్ ఎం.శ్రీనివాసరావు, ఐటీఐ ప్రిన్సిపల్ చిన వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. తాడేపల్లిరూరల్ : ఉండవల్లి గుహల వద్ద రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శనివారం తెలుగు మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగు, సంస్కృత అకాడమి చైర్మన్ ఆర్.డి.విల్సన్ మాట్లాడుతూ తెలుగు భాషను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, సాంస్కృతిక శాఖ అధ్యక్షులు తేజస్వి, ఎడిమల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ శ్రీనివాస్, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్, డీసీపీ సరిత, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గద్దె అనూరాధ, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. -
మైదవోలు యువకుడికి అంతర్జాతీయ గుర్తింపు
వాలీబాల్ కోచ్గా ప్రత్యేకత చాటుతున్న శ్రీనివాసరావు యడ్లపాడు: పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం మైదవోలు గ్రామానికి చెందిన వాలీబాల్ కోచ్ నక్కా శ్రీనివాసరావు అరుదైన గుర్తింపు దక్కించుకున్నాడు. దేశం తరఫున చైనాలో నిర్వహించిన కోచ్ల శిక్షణ కోర్సు పూర్తి చేసి అంతర్జాతీయ కోచ్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. లింగారావుపాలెం జెడ్పీహైస్కూల్ పూర్వ విద్యార్థి నక్కా శ్రీనివాసరావుకు చిన్ననాటి నుంచి క్రీడలంటే ఆసక్తి మెండు. వాలీబాల్ క్రీడాకారుడిగా జాతీయస్థాయిలో గుర్తింపు పొందాడు. కోచ్గా తర్ఫీదు ఇస్తుంటాడు. ఈ నేపథ్యంలో జూలై 16 నుంచి 24వ తేదీ వరకు చైనాలో ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాలీబాల్ డెవలప్మెంట్ లెవెల్–3 కోచెస్ కోర్సు కోసం దేశవ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానించారు. ఈ కోర్సుకు సంబంధించి శ్రీనివాసరావును వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్టీరింగ్ కమిటీ ఎంపిక చేసింది. చైనా వాలీబాల్ అసోసియేషన్ వద్దకు పంపింది. చైనా నుంచి అధికారిక ఆహ్వానం పొందిన శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, వాలీబాల్ అభిమానుల సహకారంతో చైనాకు వెళ్లాడు. ఇంటర్నేషనల్ కోచ్గా శిక్షణ విజయవంతంగా పూర్తి చేశాడు. ఆ మేరకు ధ్రువీకరణ పత్రం పొందాడు. ఆయన్ను గ్రామప్రజలు అభినందించారు. -
విద్యాసంస్థల బంద్ విజయవంతం
శనివారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 20261,559 పాఠశాలల్లో మెగా పీటీఎం నరసరావుపేట ఈస్ట్: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం 1,584 పాఠశాలలకు గాను 1,559 బడుల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించారు. మొత్తం 1.41 లక్షల మంది విద్యార్థులకుగాను 1.21 లక్షల మంది హాజరయ్యారు. అలాగే 1.26 లక్షల మంది తల్లిదండ్రులు, 19,862 మంది స్కూల్ కమిటీ ప్రతినిధులు, 1,303 మంది ప్రజాప్రతినిధులు, 1,117 మంది పూర్వ విద్యార్థులు, 959 మంది దాతలు, 985 మంది అధికారులు హాజరైనట్టు సంబంధిత వర్గాల తెలిపాయి. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు తదితరులు మండల కేంద్రమైన ఈపూరులోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, నరసరావుపేట నియోజకవర్గంలో నిర్వహించిన మెగా పీటీఎం కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని పలు మున్సిపల్ పాఠశాలలతో పాటు మండలంలోని యలమంద, కోటప్పకొండ జెడ్పీ పాఠశాలల్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. అలాగే శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా పీటీఎంలో పాల్గొన్నారు. నరసరావుపేట: పల్నాడు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన విద్యాసంస్థల బంద్ విజయవంతం అయిందని విద్యార్థి సంఘాల నేతలు తెలిపారు. ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్, డీవైఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ వంటి సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన విద్యార్థులపై పోలీసుల దాడిని ఖండిస్తూ ఈ బంద్ చేపట్టినట్లు వారు గుర్తుచేశారు. పలుచోట్ల ద్విచక్ర ర్యాలీలు నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద చేపట్టిన మోదీ దిష్టిబొమ్మ దహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. విద్యాసంస్థల యాజమాన్యాలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. జిల్లా వ్యాప్తంగా నరసరావుపేట, వినుకొండ, చిలకలూరిపేట, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల ప్రాంతాలలో బంద్ విజయవంతమైందని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు మహంకాళి సుబ్బారావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మేకపోతుల నాగేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సాయి, డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ ఆంజనేయరాజులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ఇంజినీరింగ్ కళాశాలలు, విద్యాసంస్థల బంద్ చేయించామన్నారు. కళాశాల నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించామని తెలిపారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఈవూరి గోపాల్రావు మద్దతు తెలిపారు. పీడీఎం సీనియర్ నేత నల్లపాటి రామారావు, ఎంఐఎం కార్యదర్శి షేక్ మస్తాన్వలి, బాదుగున్నల శ్రీనివాసరావు, విద్యార్థి నాయకులు జగదీష్, హేమంతు, శ్రీనివాస్, సన్నీ, అంజిరెడ్డి, రాజు, ఆనంద్, కొయ్య శీను, జిల్లా కార్యదర్శి ఆంజనేయ నాయక్ పాల్గొన్నారు. న్యాయవాదుల మద్దతు నరసరావుపేట టౌన్: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన దాడిని ఖండిస్తూ శుక్రవారం విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి నరసరావుపేట న్యాయవాద సంఘ సభ్యులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా విధులకు గైర్హాజరయ్యారు. కోర్టు ప్రాంగణం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ప్రదర్శనగా వెళారు. అక్కడ బైఠాయించి ఢిల్లీ ఘటనను ఖండిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాద సంఘ అధ్యక్షుడు జీవి సుబ్బారావు, న్యాయవాదులు కట్టా నారపరెడ్డి, జి అలెగ్జాండర్ సుధాకర్, బి సలీం, షేక్ అబ్దుల్ రజాక్, కె. విజయకుమార్, పలువురు సీనియర్, జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి సంఘాల నాయకులు -
సత్తెనపల్లిలో అరాచక పర్వం
సత్తెనపల్లి: టీడీపీ పాలనలో నియోజకవర్గంలో అరాచక పర్వం కొనసాగుతోందని వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పాలకుల అండదండలతో యథేచ్ఛగా సాగుతున్న పేకాట క్లబ్ వీడియో సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం వైరల్గా మారింది. దీనిపై డాక్టర్ గజ్జల ఓ వీడియోను రిలీజ్ చేశారు. అందులోని వివరాల మేరకు... పేకాట క్లబ్ నడుస్తున్న తీరును పక్కా ఆధారాలతో అధికారుల ముందు ఉంచినా చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యమేంటి? అని ప్రశ్నించారు. బహిరంగంగానే పేకాట క్లబ్లు నడుపుతుంటే శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసు ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయమన్నారు. జూదానికి బానిసలై సామాన్య, మధ్యతరగతి ప్రజలు తమ కష్టార్జితాన్ని కోల్పోతున్నట్లు తెలిపారు. గంజాయి మత్తుకు యువత బలవుతోందని పేర్కొన్నారు. మహిళలు, విద్యార్థినులతో వారు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నా చర్యలు తీసుకునే వారే కరువయ్యారని ఆరోపించారు. ఆధారాలతో ఫిర్యాదు చేసినా కఠిన చర్యలు తీసుకోకపోవడం వెనుక ఏ రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని నిలదీశారు. ప్రజల ప్రాణాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా అని ప్రశ్నించారు. పేకాట అడ్డాలను మూసివేసి, గంజాయి ముఠాలను వెంటనే అణచివేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. -
కోటప్పకొండలో తొలి ఏకాదశి ఏర్పాట్లు
నరసరావుపేట రూరల్: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఏర్పాట్లు చేశారు. తొలి ఏకాదశి సందర్భంగా శనివారం తెల్లవారుజామున 4 గంటలకు ఆలయాన్ని తెరిచి స్వామి వారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు నిర్వహించనున్నారు. అనంతరం భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఉచిత, ప్రత్యేక, శీఘ్ర, అభిషేక దర్శనాలు కల్పించనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మూలవిరాట్ అభిషేకాలను నిలిపివేశారు. అభిషేక మండపంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఆలయ ప్రాంగణంలో షామియానాలు ఏర్పాటు చేశారు. తాగునీరు అందుబాటులో ఉంచారు. స్వామి వారి ప్రసాదాలైన లడ్డూ, అరిసెలను సిద్ధం చేశారు. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ ఈఓ డి.చంద్రశేఖరరావు తెలిపారు. నరసరావుపేట నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను కోటప్పకొండకు నడిపేందుకు సిద్ధమైంది. పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
పారా లీగల్ వలంటీర్ల పాత్ర కీలకం
శాశ్వత న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పీవీ రాజీవ్ గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు పారా లీగల్ వలంటీర్లకు గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత శాశ్వత న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పి.ఆర్.రాజీవ్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో శాశ్వత న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పి.వి.రాజీవ్ పారా లీగల్ వలంటీర్ల ముఖ్యమైన బాధ్యతల గురించి వివరించారు. వాటిలో ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం అంశంపై అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ ప్రధానంగా మధ్యవర్తిత్వం, సంధానం, రాజీ విధానం ద్వారా న్యాయ పరంగా కేసుల పరిష్కారానికి ఉపయోగపడుతుందని తెలిపారు. సమాజంలో పారా లీగల్ వలంటీర్ల పాత్ర చాలా ముఖ్యమైనదన్నారు. న్యాయ సహాయం అవసరమైన వారిని గుర్తించి వారికి తగు సలహాలు, సూచనలు ఇచ్చి, చట్ట పరమైన సేవల గురించి కూడా అవగాహన కల్పించే బాధ్యత ఉందని తెలిపారు. చిన్న చిన్న ఉదాహరణలతో వలంటీర్లకు అర్ధమయ్యే రీతిలో సివిల్, క్రిమినల్ కేసులను ఎలా పరిష్కరించాలో వివరించారు. ప్యానెల్ అడ్వకేట్ కె.కాళిదాసు, సీనియర్ పారా లీగల్ వలంటీర్ షేక్ మొహమ్మద్ రఫీ మాట్లాడారు. సమన్వయంతోనే వినూత్న ఆవిష్కరణలు చేబ్రోలు: భవిష్యత్లో పరిశోధనలు ఇంటర్ డిసిప్లినరీ విధానంలో మరింత విస్తరించనున్నాయని, గణితం, కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్, జీవశాస్త్రం, వైద్యశాస్త్రం వంటి విభిన్న రంగాల సమన్వయంతో వినూత్న ఆవిష్కరణలు సాధ్యమవుతాయని ఐఐటీ తిరుపతి ప్రొఫెసర్ ఎస్.బాలకృష్ణ తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ‘కంప్యూటేషనల్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టికల్ సైన్సెస్ (ఐసీసీఎంఎస్ఎస్–2026)’ అంతర్జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. హైబ్రిడ్ విధానంలో (ఆన్లైన్, ఆఫ్లైన్) నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ముందుగా సదస్సుకు సంబంధించిన కాన్ఫరెన్స్ సావనీర్ను ఆవిష్కరించారు. ప్రొఫెసర్ ఎస్.బాలకృష్ణ మాట్లాడుతూ అనువర్తిత గణితం, కంప్యూటేషనల్ సైన్సెస్ రంగాలు నేటి సాంకేతిక ప్రపంచానికి వెన్నెముకగా నిలుస్తున్నాయన్నారు. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, హై–పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్, శాసీ్త్రయ అనుకరణలు వంటి రంగాల్లో వేగంగా జరుగుతున్న పరిశోధనలను వివరించారు. ఐఐటీ పాట్నా ప్రొఫెసర్ ఓం ప్రకాశ్ మాట్లాడుతూ సంక్లిష్టమైన శాసీ్త్రయ సమస్యలను విశ్లేషించడంలో, వాటికి ఖచ్చితమైన పరిష్కారాలను రూపొందించడంలో అధునాతన గణిత భావనలు కీలకంగా మారాయని తెలిపారు. -
మెడికల్ కాలేజీని పరిశీలించిన జిల్లా కలెక్టర్
పిడుగురాళ్ల రూరల్ పిడుగురాళ్లలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా గురువారం సందర్శించారు. అభివృద్ధి పనులు, వైద్య సేవలను పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మెడికల్ కాలేజీలో జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 15 నాటికి ఇన్–పేషెంట్ బ్లాక్, బ్లడ్ బ్యాంక్, ఆపరేషన్ థియేటర్లతోపాటు, విండోస్, సీలింగ్, ఎలక్ట్రికల్ పనులన్నీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావాలని ఆదేశించారు. విద్యార్థులకు అత్యంత కీలకమైన అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ల్యాబ్లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. మెడికల్, నర్సింగ్ విద్యార్థుల సౌకర్యార్థం వెంటనే మెస్ కోసం టెండర్లు పిలవాలని స్పష్టం చేశారు. పనుల్లో వేగం పెంచేందుకు అన్ని విభాగాల్లోనూ మ్యాన్ పవర్ను (సిబ్బందిని) మరింత పెంచాలని అన్నారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ గోవిందు, వైస్ ప్రిన్సిపాల్ సుధాకర్, వైద్యశాల సూపరింటెండెంట్ గౌరీ, ఆర్డిఓ మురళి, విమల శాఖల అధికారులు, మెగా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
టిప్పర్ ఢీకొని మహిళ మృతి
తాడికొండ: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను టిప్పర్ వెనుకనుంచి ఢీకొన్న ఘటనలో భార్య మృతిచెందగా.. భర్త గాయాలపాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వడ్డమాను గ్రామానికి చెందిన భార్యాభర్తలు గురువారం ద్విచక్రవాహనంపై వెళుతుండగా తుళ్లూరు మండలం రాయపూడి వద్ద వెనుకనుంచి వచ్చిన టిప్పర్ వీరి బండిని ఢీకొట్టడమే కాకుండా.. కొంతమేరకు ఈడ్చుకువెళ్లింది. ఘటనలో భార్య డేగల వెంకాయమ్మ (37) అక్కడికక్కడే మృతిచెందింది. భర్తకు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జల్జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయండి గుంటూరువెస్ట్:జిల్లాలో జల్ జీవన్ మిషన్ పనులను వేగంగా పూర్తి చేసి ప్రతి గ్రామీణ కుటుంబానికి సురక్షితమైన తాగునీటిని అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచే యాలని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో జల్ జీవన్ మిషన్ పనుల పురోగతి, పైప్లైన్ నిర్మాణం, గృహ కనెక్షన్లు, నీటి సరఫరా వ్యవస్థల నిర్వహణ, పెండింగ్ పనులపై జేసీ సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిర్దేశించిన గడువులోగా అన్ని పనులను పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సరఫరా చేసే తాగునీరు నాణ్యంగా ఉండేలా వాటర్ క్వాలిటీ టెస్టింగ్ను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. ప్రజలకు సురక్షితమైన, స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. -
కలలను ‘ఓపెన్’ చేద్దాం
సత్తెనపల్లి: కుటుంబం, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రెగ్యులర్గా పాఠశాలకు వెళ్లి చదువుకోలేని వారికి ఏపీ ఓపెన్ స్కూల్ విధానం అండగా నిలుస్తోంది. వివిధ పనులు, వృత్తులు, ఉద్యోగాలు చేసుకునే వారికి నేరుగా పదో తరగతి, ఇంటర్ చదివే అవకాశం కల్పిస్తోంది. 14 ఏళ్లు దాటితే పదో తరగతి, 15 ఏళ్లు దాటి, పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఇంటర్ పరీక్షలకు హాజరు కావచ్చు. కారుణ్య నియామకాలు, ఉద్యోగాల్లో పదోన్నతి కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి అవకాశం. పదవ తరగతి, ఇంటర్ మధ్యలో మానేసిన విద్యార్థులకు, ఫెయిల్ అయిన వారు రాసుకోవచ్చు. జిల్లాలో ఎస్సెస్సీకి 24, ఇంటర్కు 30 అధ్యయన కేంద్రాలు ఉన్నాయి. ఈ ఏడాది నుంచి పీఎం శ్రీ పాఠశాలల్లో కూడా నిర్వహించాలని ఆదేశాలు ఉన్నాయి. జిల్లాలో పీఎం శ్రీ ఉన్నత పాఠశాలలు 44 ఉన్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షణలో నిర్వహించే ఈ సార్వత్రిక విద్యా ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ప్రవేశాలు ఇలా... ఆన్లైన్లో అడ్మిషన్ల ప్రక్రియ జూన్ 12 నుంచి ప్రారంభమైంది. ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ఈనెల 31వ తేదీలోపు అడ్మిషన్ పొందవచ్చు. రూ.200 అపరాధ రుసుంతో ఆగస్టు ఒకటి నుంచి 15 వరకూ అవకాశం ఉంది. పదో తరగతికి సంబంధించి జనరల్ పురుషులకు రిజిస్ట్రేషన్, అడ్మిషన్ ఫీజు కలిపి రూ.1,550, అన్ని వర్గాల సీ్త్రలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పీహెచ్సీ పురుషులు రూ.1,150 చెల్లించాలి. ఇంటర్కు సంబంధించి జనరల్ పురుషులకు రూ.1,800, అన్ని వర్గాల మహిళలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీ, మైనార్టీ వారికి రూ.1,500 చొప్పున ఫీజు ఉంది. సార్వత్రిక పాఠశాలలో చదివి ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు అందించే సర్టిఫికెట్లకు ప్రభుత్వ గుర్తింపు ఉంటుంది. మార్కుల బదలాయింపు... పాఠశాలలు, కళాశాలల్లో పదో తరగతి, ఇంటర్ చదివి ఉత్తీర్ణులు కాలేకపోతున్న వారు కూడా సార్వత్రిక పాఠశాలల్లో చేరి సులభంగా ఉండే సబ్జెక్టులను ఎంపిక చేసుకొని ఉత్తీర్ణులు అయ్యేందుకు అవకాశం ఉంది. రెగ్యులర్ ఎస్సెస్సీ, ఇంటర్ ఫెయిలైనప్పటి నుంచి ఐదేళ్ల లోపు సార్వత్రిక పాఠశాలలో చేరితే రెగ్యులర్ ఎస్సెస్సీ, ఇంటర్లో ఉత్తీర్ణులైన సబ్జెక్టుల నుంచి ఏవైనా రెండు సబ్జెక్టుల మార్కులను బదిలాయించుకునే వీలుంటుంది.టెన్త్లో హిందీ మార్కులను మాత్రం బదలాయించరు. ఇలా బదలాయించుకున్న వారు మిగిలిన మూడు సబ్జెక్టుల పరీక్షలు రాస్తే సరిపోతుంది. మార్కులు బదలాయించుకునేవారు ఎస్సెస్సీకి అయితే సబ్జెక్టుకు రూ.100, ఇంటర్కు రూ.150 చొప్పున అడ్మిషన్ సమయంలో అదనంగా చెల్లించాలి. అడ్మిషన్ల ప్రారంభం : జూన్ 12 ఆన్లైన్ దరఖాస్తుకు గడువు : జులై 31 ఫీజు చెల్లింపునకు చివరి తేదీ : జులై 31 అపరాధ రుసుంతో చివరి తేదీ : ఆగస్టు 15 వెబ్సైట్: ఏపీఓపెన్స్కూల్.ఏపీ.జీవోవీ.ఇన్ జిల్లా టెన్త్ ఇంటర్ గుంటూరు 910 1,923 పల్నాడు 1,021 2,294 బాపట్ల 583 1,829 -
కోటప్పకొండ మండపంలోనే అభిషేకాలు
నరసరావుపేట: తొలి ఏకాదశి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్థానంలో ఈనెల 25 శనివారం నుంచి 27 సోమవారం వరకు మూడురోజులపాటు అభిషేకాలు అభిషేక మండపంలోనే నిర్వహించటం జరుగుతుందని సహాయ కమిషనర్, కార్యనిర్వాహణాధికారి డి.చంద్రశేఖరరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భక్తులు గమనించి సహకరించాలని కోరారు. సోషల్ మీడియా పోస్ట్ కేసులో యువకుడికి బెయిల్ చిలమత్తూరు: మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై సోషిల్ మీడియాలో పోస్టు పెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న గుంటూరు జిల్లా దాచేపల్లి మండలానికి చెందిన వీర ప్రతాప్రెడ్డికి హిందూపురం స్పెషల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మడకశిరకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రతాప్రెడ్డిని అరెస్ట్ చేసి హిందూపురంలోని స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. బాధితుడికి వైఎస్సార్సీపీ హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్ దీపిక అండగా నిలిచారు. ఆమె సూచన మేరకు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు వెంకటరెడ్డి బాధితుడి తరుఫున వాదనలు వినిపించారు. ఈ మేరకు న్యాయమూర్తి బాధితుడి సొంత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. కాగా బెయిల్ మంజూరు అయిన తర్వాత కూడా మడకశిర పోలీసులు బాధితుడిని పోలీసు జీపులో తీసుకెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వెంటనే బాధితుడిని విడుదల చేయాలని వైఎస్సార్సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక డిమాండ్ చేశారు. రాగితీగల చోరీ ముఠా గుట్టురట్టు మంగళగిరిరూరల్: నిర్మాణంలో ఉన్న భవనాల్లో విద్యుత్ వైర్లను చోరీ చేసి వాటి నుంచి కాపర్ను వేరు చేసి విక్రయిస్తున్న ముఠాను మంగళగిరి రూరల్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. మొత్తం 10 మంది నిందితులను కోర్టులో హాజరుపరిచారు. వారి వద్ద నుంచి 28 కిలోల రాగి తీగను స్వాధీనం చేసుకున్నట్లు మంగళగిరి రూరల్ సీఐ చిరుమామిళ్ల వెంకటేశ్వర్లు తెలిపా రు. స్వాధీనం చేసుకున్న రాగి తీగ విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందన్నారు. మండలంలోని కాజా టోల్గేట్ సమీపంలోని ఓ టెక్ పార్క్లో భద్రపరిచిన 20 బండిళ్ల ఎలక్ట్రికల్ వైర్లు చోరీకి గురయ్యాయని జూన్ 6న నిర్మాణ కాంట్రాక్టర్ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. దర్యాప్తులో కాజా, చినకాకాని ప్రాంతాల్లో నిర్మాణ భవనాల నుంచి వైర్లు చోరీ చేసి వాటిని కాల్చి కాపర్గా మార్చి పేరేచర్లకు చెందిన పాత సామాను వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నిందితులు గండాలయ్యపేట, తాడికొండ, పేరేచర్లలకు చెందిన మొగిలి మధు, జగన్నాథం, ఏసుబాబు, సాంబయ్య, నాగ తేజ, ఉయ్యాల సతీష్ లపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయటం జరుగుతుందన్నారు. -
కొత్త బైపాస్లో రోడ్డు ప్రమాదం
యడ్లపాడు: క్షణకాలపు నిద్రమత్తు... జీవితాన్నే చీకట్లోకి నెట్టేసేంత పెనుప్రమాదమై ముంచుకొచ్చింది. కనురెప్పల వెనుక చేరిన అలసట, వేగంగా వెళ్తున్న వాహనాన్ని ఆపలేకపోయింది సరే... ఏకంగా వాహనం ధ్వంసం కావడంతో పాటు దానిని నడుపుతున్న డ్రైవర్ను కూడా తీవ్రగాయాల పాలు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..యడ్లపాడు మండలం తిమ్మాపురం పరిధిలోని నూతన పెట్రోల్ బంకు సమీపంలో వేగంగా వెళ్తున్న కారు ముందు వెళ్తున్న కంటైనర్ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. 16వ నంబర్ జాతీయ రహదారి కొత్త బైపాస్పై గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ప్రమాదంలో కారు కంటైనర్ వెనుక భాగంలో ఇరుక్కుపోయింది. దానిని గమనించని కంటైనర్ డ్రైవర్ వాహనాన్ని కొద్దిదూరం ఈడ్చుకెళ్లాడు. ఈ క్రమంలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయి, టైర్లు వేడెక్కి అరిగిపోయాయి. స్థానికులు వెంటనే స్పందించి కంటైనర్ను నిలిపివేసి, కారులో చిక్కుకుపోయిన గుంటూరుకు చెందిన ఉప్పుటూరు హర్ష (33)ను ఎంతో శ్రమించి బయటకు తీశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హర్షను మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాధితుడు గుంటూరు నుంచి బాపట్ల జిల్లా మార్టూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, కారులో అతనొక్కడే ఉన్నాడని పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న యడ్లపాడు పోలీసులు, హైవే సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, ధ్వంసమైన వాహనాన్ని రహదారిపై నుంచి తొలగించి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. -
యూజీసీ పే స్కేల్ అమలు చేయాలి
ఏఎన్యూ వద్ద కొనసాగుతున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల రిలే నిరాహార దీక్షలు ఏఎన్యూ(పెదకాకాని): ఏఎన్యూలో కాంట్రాక్ట్ అధ్యాపకుల సేవలు క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం, యూజీసీ పేస్కేల్ అమలు చేయాలని అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ సీహెచ్ తిరుమలరావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఒప్పంద అసిస్టెంట్ ప్రొఫెసర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం ఏడవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా డాక్టర్ తిరుమలరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు ప్రకారం కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పరిగణించి యూజీసీ పే స్కేళ్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తొలుత ఏఎన్యూ ప్రాంగణంలో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. గురువారం రిలే నిరాహార దీక్షలో భాగంగా కె.సందీప్, డాక్టర్ వీడీ రాజాజీ, డాక్టర్ కె.శ్రీదేవి, డాక్టర్ ఎస్కే మస్తానమ్మ, డాక్టర్ సీహెచ్ రాధిక, డాక్టర్ ఎన్.ప్రసన్న కుమార్ విధులకు సెలవు తీసుకొని దీక్షా శిబిరంలో పాల్గొన్నారు. వీరికి సంఘీభావంగా మిగిలిన కాంట్రాక్ట్ అధ్యాపకులు తమ విధులు ముగించుకుని పెద్ద సంఖ్యలో నిరసన శిబిరానికి చేరుకొని దీక్షలో పాల్గొన్నవారికి మద్దతు తెలిపారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లపై వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కన్నెగంటి స్పోర్ట్స్ సొసైటీ వైస్ చైర్మన్గా సత్యనారాయణ గుంటూరు వెస్ట్ (క్రీడలు): కన్నెగంటి హనుమంతు స్పోర్ట్స్ సొసైటీ ఏపీ వైస్ చైర్మన్గా కనమర్లపూడి సత్యనారాయణను నియమించారు. గురువారం స్థానిక విశ్రాంత ఎస్పీ సిహెచ్ చక్రపాణి గృహంలో జరిగిన కార్యక్రమంలో ఈ ఎంపిక చేశారు. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపకుడు తిరుమలశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా సొసైటీ సభ్యుడిగా చక్కని సేవలందించిన సత్యనారాయణ నిబద్ధతను చూసి వైస్ చైర్మన్గా ఎంపిక చేశామన్నారు. సమాజంలో క్రీడాకారులను ప్రోత్సహించడం, క్రీడల అభివృద్ధికి తమ సొసైటీ కృషి చేస్తుందన్నారు. సత్యనారాయణకు విశ్రాంత ఎస్పీ చక్రపాణి చేతులమీదుగా నియామకపత్రాలను అందజేసారని చెప్పారు. సొసైటీ ప్రధాన కార్యదర్శి యర్రగోపు నాగేశ్వరరావు, ఎస్.ప్రసాద్, నాగరాజు, విజయలక్ష్మి పాల్గొన్నారు. -
వినుకొండలో దొంగల హల్చల్
వినుకొండ: వినుకొండ పట్టణ పరిధిలోని జగనన్న కాలనీలో దొంగలు తీవ్రస్థాయిలో రెచ్చిపోతున్నారు. రాత్రి వేళల్లో విద్యుత్ స్తంభాలు ఎక్కి వైర్లను దొంగిలిస్తుండటంతో స్థానికులతోపాటు విద్యుత్ శాఖ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సబ్స్టేషన్ సమీపంలోనే దుండగులు ఈ దౌర్జన్యానికి ఒడిగడుతుండటం గమనార్హం. విద్యుత్ తీగలను తెంచేయడమే కాకుండా, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను కిందకు తోసివేసి వాటిలోని విలువైన రాగి (కాపర్) పరికరాలను దోచుకెళ్తున్నారు. అంతేకాకుండా కాలనీలోని ఇళ్ల విద్యుత్ మీటర్లు, నీటి బోర్లకు సంబంధించి అమర్చిన వైర్లను కూడా చోరీ చేస్తున్నారు. దొంగల భయంతోపాటు విద్యుత్, తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో పలువురు బాధితులు తమ ఇళ్లను ఖాళీ చేసి అద్దె ఇళ్లకు వెళ్లిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, పోలీసులు స్పందించి కాలనీలో పోలీసు గస్తీ (పెట్రోలింగ్) పెంచి, దొంగతనాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. విద్యుత్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్లలో రాగి చోరీ.. -
మూతబడి పోతున్నాయ్..!
గ్రామీణ విద్యకు పట్టుగొమ్మలుగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ఒకదాని వెంట మరొకటి మూతపడుతున్నాయి. చంద్రబాబు సర్కారు నిర్వాకంతో పేద చిన్నారులకు విద్య దూరం అవుతోంది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో పలు పథకాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అయ్యాయి. దీంతో విద్యార్థులు ఉప్పెనలా పోటెత్తారు. నేడు చంద్రబాబు అధికారంలోకి వచ్చాక సర్కారు విద్యాసంస్థలకు ముప్పు తప్పడం లేదు. దాచేపల్లి: పేదలన్నా.. వారి బాగోగులు చూడాలన్నా చంద్రబాబుకు చిరాకనే విషయం ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఆయన ప్రైవేటీకరణ, కార్పొరేట్లకు కొమ్ముకాయడం మినహా చేసేది ఏమీ లేదు. ఎప్పటిలాగానే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యాలయాలు మూసివేతకు గురవుతున్నాయి. నాడు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రభుత్వ విద్య కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఆయన కొరడా ఝుళిపించడంతో కార్పొరేట్ విద్యాలయాలు దారికొచ్చాయి. పేదల బడులు కళకళలాడాయి. నాడు–నేడు, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద వంటి కార్యక్రమాలతో తల్లిదండ్రుల మనసు గెలుచుకున్నారు. టీడీపీ ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోకపోవడంతో అవి మూతపడుతున్నాయి. విద్యార్థుల ప్రవేశాలు గణనీయంగా తగ్గుతున్నాయి. దాచేపల్లి మండల పరిధిలోని పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోగా.. మరికొన్ని పాఠశాలలు మూతపడ్డాయి. తాజాగా పొందుగల గ్రామ పంచాయతీ పరిధిలోని శ్రీనివాసపురం ప్రభుత్వ పాఠశాలను మూసివేశారు. విద్యార్థుల చేరికలు లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. మరికొన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా ఆ జాబితాలో ఉన్నాయి. ఒకప్పుడు ఈ పాఠశాల ఏర్పాటు కోసం గ్రామస్తులు ఒకే తాటిపైకి వచ్చి కృషి చేశారు. ప్రస్తుతం గ్రామంలో సుమారుగా 60 మందికి పైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చేరారు. నిరుపేద విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. కానీ పాఠశాలలో సరైన వసతుల కల్పన లేకపోవడంతో వారు కూడా ఆసక్తి చూపలేదు. అత్యల్పంగా విద్యార్థుల సంఖ్య పొందుగల ఉర్దూ పాఠశాలలో కేవలం నలుగురు విద్యార్థులే చదువుకుంటున్నారు. కొత్తగా విద్యార్థుల చేరికలు లేకపోవడంతో పాఠశాలను మూసివేస్తామని విద్యాశాఖ అధికారులు సమాచారం అందించారు. దీంతో విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు భయం పట్టుకుంది. ఎప్పుడు ఈ పాఠశాలను మూసివేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. అదే విధంగా శ్రీనగర్ ప్రభుత్వ పాఠశాలలో 14 మంది విద్యార్థులు ఉన్నారు. దాచేపల్లిలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో 17 మంది మాత్రమే చదువుకుంటున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో కూడా అలుగుమల్లెపాడు, తక్కెళ్లపాడు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు. -
‘నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు... ముగ్గురు ఉంటే రూ.45 వేలు, ఇంటిలో ఎంతమంది పిల్లలు చదివితే అందరికీ తల్లికి వందనం వర్తింపజేస్తామంటూ’ చంద్రబాబు తదితర కూటమి నేతలు ఎన్నికల సమయంలో ఊదరగొట్టారు. అధికారం చేపట్టిన మొదట ఏడాది పథకం పూర్తిగా అటకెక్కించారు. ప్రజల న
నా భర్త పేరు షేక్ జాని. లారీడ్రైవర్గా పనిచేస్తున్నారు. నేను టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని నడుపుకొస్తున్నా. మా కుమారుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఏడేళ్ల క్రితం సొంత ఇంటి నిర్మాణానికి రుణం అవసరమై ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేశాం. కేవలం రూ.1,100 చెల్లించాం. అప్పటి ప్రభుత్వ నిబంధన ప్రకారం అమ్మఒడి తొలగించారు. వెంటనే ఆదాయపు పన్ను చెల్లించట్లేదని సర్టిఫికెట్ దాఖలు చేశాం. ఈ కూటమి ప్రభుత్వంలో దరఖాస్తు చేసినా కూడా తల్లికి వందనం కింద సాయం అందడం లేదు. మా బాబుకు సాయం అందించాలి. చాలా ఇబ్బందులు పడుతున్నాం. – షేక్ షాకీరా, ఏడో వార్డు, నరసరావుపేటసత్తెనపల్లి: బూటకపు హామీలతో అధికారం చేపట్టిన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో సామాన్యులకు తీరని అన్యాయం చేస్తోంది. మేనిఫెస్టోలో తల్లికి వందనం పథకంలో భాగంగా ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని నాడు కూటమి నేతలు చెప్పారు. రూ.13 వేలను మాత్రమే అందిస్తున్నారు. అదీ జిల్లాలో వేల మందికి అందడం లేదు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో 3,11,102 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందరికీ రూ.13 వేల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో రూ.404.43 కోట్లు జమ చేయాలి. జిల్లాకు రూ.345.39 కోట్లు మాత్రమే కేటాయించారు. ఫలితంగా 2,65,686 మంది విద్యార్థులు మాత్రమే పథకానికి అర్హత సాధించారు. 1,84,075 మంది తల్లులు ఖాతాల్లో నిధులు జమ చేసినట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. నిబంధనల పేరుతో 45,416 మంది పథకానికి దూరమైపోయారు. వారి తల్లులు రూ.59.04 కోట్లు కోల్పోయారు. ఫస్ట్ క్లాస్, ఇంటర్ వారికి ఎగనామం... జిల్లాలో ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కూడా ఎగనామం పెట్టారు. జిల్లాలో ఒకటో తరగతి 26,917 మంది, ఇంటర్ ప్రథమ సంవత్సరం 15,951 మంది చదువుతున్నారు. వీరికి నగదు ఎప్పుడు ఇస్తారో ఇంకా ప్రకటించలేదు. ప్రభుత్వాలు అమలు చేసే ఏ పథకాలకై నా లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హుల జాబితా సిద్ధం చేయాలి. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వమే అనర్హులంటూ కొందరి జాబితా సిద్ధం చేసి సచివాలయాల్లో పెట్టేస్తోంది. ఫలితంగా వేలాది మంది అర్హులకు అన్యాయం జరుగుతోంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అమ్మ ఒడి పథకం పొందిన వారిని కూడా ప్రస్తుతం అనర్హులు జాబితాలో చేర్చడం గమనార్హం. రూ. 2 వేలు చొప్పున మినహాయించి.... ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ కోసమని అమ్మ ఒడి పథకం పొందిన ఒక్కో విద్యార్థి నుంచి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.వేయి చొప్పున కేటాయించింది. ఆ విషయంపై చంద్రబాబు, లోకేష్ తదితర నేతలు, ఎల్లో మీడియా నానా యాగీ చేశాయి. ఇప్పుడు ఒక్కో విద్యార్థి నుంచి రూ. 2 వేల చొప్పున తీసుకుంటున్నారు. పథకంలో నగదు మొత్తాన్ని పెంచకపోగా కోత విధించారు. ఈ ఏడాది 2,65,686 మంది విద్యార్థుల నుంచి రూ. 2 వేల చొప్పున రూ.53.13 కోట్లను పాఠశాలల నిర్వహణ కోసం మినహాయించారు. నిబంధనల పేరుతో... సంక్షేమ పథకాల అమల్లో కనీస చిత్తశుద్ధి లేని చంద్రబాబు ప్రభుత్వం తల్లికి వందనం అర్హుల ఎంపికలో సచివాలయాల స్థాయి నుంచే కోతలు విధించింది. ముఖ్యంగా మ్యాపింగ్ సమయంలో జరిగిన తప్పిదాలు లబ్ధిదారులకు పెను శాపంగా మారాయి. అద్దె ఇళ్లల్లో ఉన్న వారి ఆధార్ కార్డులను కూడా ఆ ఇంటి ఆస్తి పన్ను, విద్యుత్ మీటర్తో లింక్ చేయడంతో ఆస్తి లేకున్నా ఉన్నట్లు చూపిస్తోంది. ఫలితంగా వేల మంది అనర్హుల జాబితాలోకి వెళ్లిపోయారు. లబ్ధిదారుల ఆధార్ నెంబర్తో పరిశీలిస్తే ఆస్తి ఉన్నట్లు చూపిస్తోంది. ఆ లింక్ తొలగించడానికి సచివాలయ సిబ్బంది నిరాకరిస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు సైతం ఈ విషయంపై దృష్టి సారించడం లేదని వాపోతున్నారు. ముఖ్యంగా నెలకు 300 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే పథకానికి అనర్హులని తేల్చేశారు. చాలా మంది అంత కంటే తక్కువ విద్యుత్తు వినియోగించినా సరే అర్హుల జాబితాలో పేరు లేదు. మరోవైపు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను సైతం అనర్హుల జాబితాలో చేర్చారు. విద్యుత్ బిల్లు పరిగణనలోకి తీసుకోవడం వల్ల మా బాబుకు తల్లికి వందనం కింద సాయం అందలేదు. కూటమి ప్రభుత్వం స్పందించి విద్యుత్ బిల్లులను లెక్కలోకి తీసుకునే నిబంధన ఎత్తివేయాలి. మా అబ్బాయి పీసపాటి కాలేష్ జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. గత ఏడాది తల్లికి వందనం కింద సాయం అందింది. ఈ ఏడాది విద్యుత్ బిల్లులు పరిగణనలోకి తీసుకోవడం వల్ల పడలేదు. – పీసపాటి దర్యాబీ, రెడ్డిగూడెం నా కుమార్తె ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నా రెండేళ్లుగా తల్లికి వందనం డబ్బులు ఖాతాలో జమ కావట్లేదు. నా కుమార్తె ఆరో తరగతి చదువుతోంది. ఆన్లైన్లో మా ఆధార్ నంబర్లు తప్పు వేశారు. డబ్బులు షేక్ హసీనా అనే మహళ పేరుపై పడ్డాయి. అర్జీ పెడితే సరిదిద్దే ఆప్షన్ లేదన్నారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలి. – బోరుగడ్డ పార్వతి, నరసరావుపేట పట్టణం అర్హులకు అందని రూ.15 వేలు -
కరకట్ట వెంట తప్పిన పెను ప్రమాదం
బకింగ్హామ్ కెనాల్ బ్రిడ్జిని ఢీకొట్టిన టిప్పర్ తాడేపల్లి రూరల్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లే మార్గంలో కృష్ణానది ఎగువ ప్రాంతంలోని బకింగ్హామ్ కెనాల్ వద్ద ఓ లారీ అదుపుతప్పి గురువారం బ్రిడ్జిని ఢీకొట్టింది. సేకరించిన వివరాల ప్రకారం.. ఉండవల్లి సెంటర్ నుంచి అమరావతి కరకట్ట వైపు లారీ వెళుతోంది. అక్కడ రోడ్డు పల్లంగా ఉండడంతో బ్రేకులు పడకపోవడంతో వేగంగా వెళ్లి బకింగ్హామ్ కెనాల్ హెడ్ స్లూయిస్ గేటు దిమ్మకు ఢీకొని లారీ నిలిచిపోయింది. లారీ క్యాబిన్ పూర్తిగా దెబ్బతింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లే మార్గం, వీవీఐపీలు తిరిగే మార్గం కావడంతో తాడేపల్లి పోలీసులు, ట్రాఫిక్ పోలీసుల, భద్రతా సిబ్బంది లారీని యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. ఈ సమయంలో 45 నిమిషాల పాటు ప్రకాశం బ్యారేజ్, మంగళగిరి రోడ్డు నుంచి కరకట్టవైపు వెళ్లే వాహనాలను, సచివాలయం నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపు వెళ్లే వాహనాలను నిలిపివేశారు. -
వరుణదేవుని కటాక్షం కోసం జలాభిషేకం
మంచాల(చేబ్రోలు): వరుణుడి కరుణ కోసం చేబ్రోలు మండలం మంచాల గ్రామంలోని గ్రామదేవత దేశమాంబకు మహిళలు గురువారం జలాభిషేకం చేశారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పసుపు బిందెలతో మేళతాళాల నడుమ ఊరేగింపుగా తొలతు గ్రామదేవత ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో జలాభిషేకం జరిగింది. అర్చకులు విశేష కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని మహిళలు మొక్కుబడులు చెల్లించుకున్నారు. సత్తెనపల్లి: పట్టణంలోని శ్రీ ఫిరోజి ఋషి ఇంద్రుల వారి మఠంలో వేంచేసియున్న వేదమాత గాయత్రి దేవస్థానంలో వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు, మహానవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. తొమ్మిది రోజులపాటు వారాహి మాత పూజలు, హోమాలు జరిగాయి. వేదమాత గాయత్రి అమ్మవారి ప్రధాన అర్చకులు బాల ఫిరోజి గురువారం అమ్మవారికి సాలగ్రామ అలంకార మహోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో భజనలు, కుంకుమ పూజలు చేశారు. పొంగళ్లు పొంగించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అన్నదానం జరిగింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా భక్తులు పద్మ, మమత, ఫిరోజి అంజలి, సుజాత, మల్లేశ్వరి, సుకన్య తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అమరావతి: వర్షాలు సమృద్ధిగా కురవాలని మండల కేంద్రమైన అమరావతికి చెందిన మహిళలు గురువారం గ్రామ నడిబొడ్డున ఉన్న మహాలక్ష్మమ్మ చెట్టుకు నీటితో వారు పోసి అభిషేకించారు. తొలుత పవిత్ర కృష్ణానది జలాలను బిందెలలో నింపుకొని ఊరేగింపుగా వచ్చి మహాలక్ష్మమ్మ చెట్టుకు అభిషేకించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వరుణ దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలను రక్షించాలని వేడుకుంటూ మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. పెదకాకాని: పెదకాకానిలోని ప్రసిద్ధ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో గురువారం హుండీలలోని కానుకలు లెక్కించారు. పర్యవేక్షణాధికారిగా తెనాలి వైకుంఠపురం పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఏసీ వి. అనుపమ హాజరయ్యారు. హుండీల ద్వారా 122 రోజులకు రూ.67,22,181 ఆదాయం లభించినట్లు డీసీ గోగినేని లీలాకుమార్ తెలిపారు. అన్నప్రసాద వితరణ హాల్లోని హుండీ ద్వారా రూ.3,97,918 సమకూరిందన్నారు. హుండీల ద్వారా బంగారం, వెండి కొంత వచ్చిందని పేర్కొన్నారు. ఇంకా అమెరికన్ డాలర్లు 72, ఇతర విదేశీ కరెన్సీ కూడా కానుకల్లో ఉన్నట్టు చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావు తెలియజేశారు. లెక్కింపు కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, ఎక్స్ అఫిషియో సభ్యుడు పేటేటి ధనమహేశ్వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పల్నాడు
శుక్రవారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 20267తెనాలి: స్థానిక మార్కెట్ యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2,000, గరిష్ట ధర రూ.3,500, మోడల్ ధర రూ.2,700 వరకు పలికింది.గుంటూరు లీగల్: హైకోర్టు జడ్జి జస్టిస్ దోనాడి రమేష్ గుంటూరు జిల్లా కోర్టును సందర్శించారు. జిల్లా కోర్టు ప్రధాన జడ్జి బి.సాయికళ్యాణ్ చక్రవర్తి, కలెక్టర్ సాయికాంత్ వర్మ స్వాగతం పలికారు.అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 29.280 టీఎంసీలు. విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం 400 క్యూసెక్కులు దిగువకు వదలుతున్నారు. -
జిల్లాలో 1.88 లక్షల ఓట్లు తొలగింపు
● అత్యధికంగా నరసరావుపేటలో 37,142 తొలగింపునకు ఏర్పాట్లు ● జిల్లా వ్యాప్తంగా చనిపోయిన 61,175 మంది ఓట్లు రద్దు నరసరావుపేట: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)లో జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటర్లు 17,41,798 ఉండగా.. 1,88,421 (10.82 శాతం) మంది ఓట్లు తొలగించనున్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేట నియోజకవర్గంలోనే అత్యధికంగా 37,142 ఓట్లు తగ్గనున్నాయి. జిల్లాలో మొత్తం తొలగించే పేర్లలో 61,175 ఓట్లు చనిపోయిన వారివే. సర్ కార్యక్రమం ఈ నెల 24వ తేదీతో ముగియనుంది. ఓటర్లు తమకు అందజేసిన ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్ఓలకు అందజేసేందుకు 24వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది. వాస్తవానికి బీఎల్ఓలు ఇంటికి వచ్చి ఫారాలు సేకరించాలి. అది ఎక్కడా జరగట్లేదు. ఫారాలు తమ వద్దకు తీసుకొచ్చి ఇవ్వాలని సూచిస్తున్నారు. జూలై 31వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురిస్తారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో మొత్తం 17,41,798 మందికి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశారు.. 15,53,377 ఫారాలు (89 శాతం) డిజిటలైజేషన్ చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో దీనిపై సమావేశం కూడా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ బూత్ స్థాయి అధికారులు ఈ నెల 24వ తేదీ వరకు ఇంటింటికీ వెళ్తారని చెప్పారు. జూలై 24వ తేదీ వరకు పోలింగ్ కేంద్రాల మార్పు, హేతుబద్ధీకరణకు అవకాశం ఉందని తెలిపారు. -
గొర్రెల కాపరిపై టీడీపీ నాయకుడి దాడి
పిడుగురాళ్ల: గొర్రల కాపరిపై టీడీపీ నాయకుడు దాడి చేసి గాయపరిచిన సంఘటన పిడుగురాళ్ల మండలం వీరాపురంలో బుధవారం జరిగింది. బాధితుడు తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్కు చెందిన పూసలపాడు బాలప్ప. ఆయన తెలిపిన వివరాల మేరకు.. సుమారు మధ్యాహ్న సమయంలో వీరాపురం గ్రామంలో గొర్రెలు మేత మేస్తున్నాయి. వీరాపురం గ్రామ టీడీపీ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు నారుమడిలోకి గొర్రెలు వచ్చాయని గొర్రెల కాపరులైన బాలప్ప, తిమ్మప్పలపై గొడవకు దిగాడు. గొర్రెల కాపరులు బతిమిలాడినా వినకుండా తన చేతిలో ఉన్న కర్రతో బాలప్ప తలపై బలంగా కొట్టాడు. తలపగిలి తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వటంతో గురజాల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స పొందారు. బాధితుడు పిడుగురాళ్ల పట్టణ పోలీస్స్టేషన్కు హాజరై నాదెండ్ల భాస్కర్పై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మోహన్ పేర్కొన్నారు. వ్యభిచార గృహంపై దాడి నరసరావుపేట టౌన్: వ్యభిచార గృహంపై దాడి నిర్వహించి ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వన్టౌన్ సీఐ షేక్ ఫిరోజ్ బుధవారం తెలిపారు. రామిరెడ్డిపేట పాతసమితి ఆఫీస్ సమీపంలోని ఓ అద్దె గృహంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని స్థానికుల నుంచి ఫిర్యాదు అందింది. ఆ గృహంపై దాడులు నిర్వహించి అక్కడ వ్యభిచార నేరానికి పాల్పడుతున్న మహిళ, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు. పట్టపగలు ఇంట్లో చోరీకి యత్నం ఈపూరు: పట్టపగలే ఓ ఇంటిలోకి ప్రవేశించి చోరీ చేస్తున్న దొంగలను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన ఈపూరు మండలం అంగలూరు గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చిత్తు కాగితాలు ఏరుకుంటూ సంచరిస్తున్న నలుగురు వ్యక్తులు బ్రహ్మం గారి గుడి వద్ద తాళం వేసి ఉన్న ఓ ఇంటి కిటికీ ఇనుప గ్రిల్స్ను తొలిగించి లోపలికి ప్రవేశించారు. రాగి, ఇత్తడి, స్టీలు వస్తువులను తీసుకుని వెళుతున్నారు. పక్క ఇంటి వారు గుర్తించి కేకలు వేశారు. దీంతో దొంగలు వస్తువులు అక్కడే వదిలేసి పరుగు లంకించుకున్నారు. గ్రామస్తులు వారిని వెంబడించగా సమీపంలోని మొక్కజొన్న పొలంలో దాక్కున్నారు. ఇది గమనించి పట్టు కోబోగా ఇద్దరు తప్పించుకుని పారిపోగా మిగి లిని పట్టుబడ్డారు. దొంగతనానికి వచ్చిన వారి లో ఇరువురు పురుషులు కాగా ఇద్దరు మహి ళలు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని దొంగలను అదుపులోనికి తీసుకుని స్టేషన్కు తరలించినట్లు తెలిసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జరిమానా దుర్గి: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా దుర్గి పోలీసులు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలలో మండలంలోని రాజా నగరానికి చెందిన చల్లంచర్ల హరి మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. దుర్గి పోలీస్స్టేషన్ ఎస్ఐ గోపాల్ వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి, నిందితుడిని మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఓ.నాగభూషన్ ముందు హాజరుపర్చారు. విచారణ అనంతరం నిందితులు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా విధించినట్లు తెలిపారు. హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం సత్తెనపల్లి: హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. పట్టణంలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహంలో ఉంటూ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివే 9వ తరగతి విద్యార్థిని ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. వివరాలు... ఈ నెల 15వ తేదీన వార్డెన్ అనుమతి తీసుకొని శుభకార్యం ఉండడంతో తన మేనమామతో కలసి బాలిక మాచర్ల వెళ్లింది. 20వ తేదీన కుమార్తెను వెంటబెట్టుకొని తల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్దకు వచ్చింది. బాగా చదువుకోవాలని కుమార్తెకు సూచించింది. తాను చదువుకోనని, మాచర్ల వస్తానంటూ బాలిక మొండికేసింది. ఎంత బతిమిలాడినా కుమార్తె మాట వినకపోవడంతో తల్లి ఆమె చెంపలపై రెండు దెబ్బలు వేసి లోపలికి పంపింది. పాఠశాల ముగిసిన తర్వాత సోప్ కొనుక్కోవాలని స్నేహితులకు చెప్పి బజారుకు వెళ్లిన విద్యార్థిని ఎలుకల మందు కొనుక్కొని వసతి గృహానికి చేరుకొంది. రాత్రి సమయంలో ఎలుకల మందు కొంత తినడంతో ఆమెకు రెండుసార్లు వాంతులయ్యాయి. ఈ నెల 21వ తేదీన ఉదయాన్నే ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా ఆయ న మందులు ఇచ్చాడు. కొద్దిసేపటికి ఎలుకల మందు తిన్నానని స్నేహితులతో చెప్పడంతో వారు విషయాన్ని వార్డెన్ దృష్టికి తీసుకు వెళ్లారు. పట్టణంలోని ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు ఆ విద్యార్థినిని తరలించారు. వైద్యులు అరగంటపాటు ఐసీయూలో ఉంచి అన్ని పరీక్షలు చేశారు. ఆరోగ్యం నిలకడగా ఉండడంతో జనరల్వార్డుకు తరలించారు. తల్లితో పాటు కుటుంబసభ్యులు వైద్యశాలకు చేరారు. -
మెప్మాలో మహిళా ఉద్యోగికి వేధింపులు
చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ నరసరావుపేట: పల్నాడు జిల్లా మెప్మా కార్యాలయంలో ఐబీగా విధులు నిర్వహిస్తున్న మహిళ జూనియర్ అసిస్టెంట్ రోశారావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ తాను ఐబీగాను, సత్తెనపల్లి, చిలకలూరిపేట సీఎంఎంగా పనిచేస్తున్నట్లు వెల్లడించారు. కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న రోశారావు ఇన్చార్జి అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నాడన్నారు. తాను ఏడాది కిందట బదిలీపై కార్యాలయానికి వచ్చానని, అప్పటి నుంచి ప్రతిరోజూ తనతోపాటు మహిళలను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించింది. మహిళా ఉద్యోగులను మేకప్లు వేసుకొని వస్తున్నారంటూ అవమానకరంగా మాట్లాడటం, వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, ‘కుక్కలాగా వాగుతున్నావు‘ వంటి అసభ్య పదజాలంతో దూషించడం, కారణం లేకుండా జీతాల్లో కోతలు విధించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొంది. ఆయనకు డబ్బులు ఇస్తే బయోమెట్రిక్ ఏ సమయంలో వేసినా అంగీకరిస్తాడని తెలిపారు. డబ్బులు ఇవ్వకపోతే జీతాలు కట్ చేస్తున్నాడన్నారు. తనకు వారం రోజుల జీతం తగ్గిస్తే ఎందుకు తగ్గించారని అడిగితే ఎందుకు కుక్కలాగా వాగుతున్నావు, నీకు చేతనైన చోట చెప్పుకో అని ధూషించాడని పేర్కొన్నారు. పీడీ అనుమతితో రెండురోజులపాటు హెడ్ఆఫీసుకు శిక్షణ కోసం తాను వెళ్లానని, జీతం తగ్గించి హెడ్ ఆఫీసుకు పంపాడన్నారు. ఎందుకు తగ్గించారని అడిగితే నోటికి వచ్చినట్లు తిట్టాడన్నారు. గతంలో ఒకసారి కూడా ఇదేవిధంగా మాట్లాడాడని చెప్పారు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా కార్యాలయంలోని తోటి ఉద్యోగుల కోరికపై మిన్నకుండి పోవాల్సివచ్చిందన్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. పనిచేసే మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న అధికారిపై తక్షణం విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరింది. అవసరమైతే పోలీసులకు అధికారిక ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేసింది. దీనిపై పీడీ మురళీకృష్ణను వివరణ కోరేందుకు ఫోన్లో ప్రయత్నించగా ఆయన ఫోన్ ఎత్తలేదు. -
జీతాలు సకాలంలో అందజేయాలి
ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు నరసరావుపేట: జిల్లాలో ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా డీడీఓలకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం బుధవారం నిర్వహించారు. ఇక నుంచి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ప్రతినెలా మూడవ శుక్రవారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జూన్ 23 జరిగిన సమావేశంలో అందిన ఫిర్యాదులను ఎండార్స్ చేసి అన్నీ జిల్లా అధికారులకు పంపించామని, వారి నుంచి ఎటువంటి యాక్షన్ తీసుకున్నది తెలియరాలేదన్నారు. రిపోర్టులను ఇన్టైంలో అందించాలన్నారు. కార్యాలయాల్లో కంప్లైంట్ బాక్సులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. మధ్యాహ్నం భోజన పథకం అమలు నిర్వహించే వారికి జూన్ వరకు చెల్లింపు జరిగాయని తెలిపారు. ఏఎన్ఎంల నుంచి సూపర్వైజర్గా ప్రమోషన్ పొందే విషయమై డీఎంహెచ్ఓ మాట్లాడుతూ గైడ్లైన్స్ ప్రకారం సీనియారిటీ ఉన్నవాళ్లకి ఏఎన్ఎం ప్రమోషన్ చేయవవచ్చని తెలిపారు. మృతి చెందిన ఉద్యోగస్తుల మట్టి ఖర్చులకు ట్రెజరీ అధికారులు డెత్ సర్టిఫికెట్ అడుగుతున్నారనే ఫిర్యాదుపై మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. పెన్షన్ పేపర్లు డీడీఓ లెవెల్లో ఆలస్యం కాకుండా సబ్మిట్ చేయాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వాష్రూమ్లు సరిగా లేవని ఫిర్యాదులు వస్తున్నాయని అవి సరిగా ఉండే విధంగా చూడాలని జిల్లా అధికారులకు సూచించారు. తాగునీరు, శానిటేషన్ సరిగా లేవని జిల్లా అధికారులు వీటిపై దృష్టి పెట్టాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో పరిష్కరించే సమస్యలు ఏమైనా ఉంటే చెప్పాలని, ప్రభుత్వానికి నివేదించే సమస్యలు ఉంటే ప్రపోజల్ పెట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు అన్నీ సౌకర్యాలు కల్పిస్తున్నాం నరసరావుపేట: సంక్షేమ హాస్టల్ విద్యార్థుల చదువుకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు సమకూర్చుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా తెలిపారు. బుధవారం సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో షెడ్యూల్ కులాలు చెందిన బాలికలకు నైట్ డ్రెస్సులు, టవల్స్, రగ్గులు పంపిణీ ప్రారంభించారు. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మయ్య మాట్లాడుతూ జిల్లాలో 29 సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయని, అందులో 18 బాలురు, 11 బాలికల వసతి గృహాలు ఉన్నాయని, అందులో మొత్తం 3500 మందికి పైగా విద్యార్థినీ విద్యార్ధులు ఉన్నారన్నారు. సాంఘిక సంక్షేమశాఖకు ప్రభుత్వ స్థలం కేటాయిస్తే హాస్టల్ బిల్డింగ్ నిర్మాణానికి ఏర్పాటు చేసుకుంటామని కలెక్టర్ను కోరారు. అనంతరం కలెక్టర్ హాస్టల్లో తనిఖీ చేశారు. వార్డెన్లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. తరగతి గదులు, టాయిలెట్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయండి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో అదనపు తరగతుల గదులు, టాయిలెట్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 80 శాతం పనులు పూర్తయిన 60 స్కూళ్లలో 218 అదనపు తరగతి గదులు నిర్మాణం, 23 టాయిలెట్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందులో 31 పాఠశాలలో 116 అదనపు తరగతి గదులు పూర్తయ్యాయని, 11 టాయిలెట్లు పూర్తయినట్లు విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు తెలిపారు. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో డీడీఓలకు సూచించిన కలెక్టర్ -
‘తల్లికి వందనం’లో తగ్గిన లబ్ధిదారులు
● జిల్లాలో 2,65,686 మంది విద్యార్థులు గుర్తింపు ● వాస్తవానికి దాదాపు 3 లక్షల మందికిపైగా అర్హులు నరసరావుపేట ఈస్ట్: కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన తల్లికి వందనం పథకం కింద నగదు జమ చేయటంలో కొందరు అర్హులైన వారికి కూడా సాయం అందలేదని విమర్శలు వినవస్తున్నాయి. ప్రభుత్వం బుధవారం తల్లికి వందనం నిధులను విడుదల చేసింది. పల్నాడు జిల్లా పరిధిలో 1 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులు దాదాపు 2.99 లక్షల మంది ఉన్నారు. వీరితో పాటు ఇంటర్ విద్యార్థులు మరో 30 వేల మంది ఉంటారని అంచనా. జిల్లా పరిధిలో అర్హత కలిగిన విద్యార్థులు 2,65,686 మంది ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. అర్హులైన తల్లులు 1,84,075 అని లెక్కలు తేల్చారు. ఈ విద్యా సంవత్సరం నుంచి అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు సైతం నగదు జమ చేస్తామని ప్రకటించారు. లబ్ధి పొందే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఖాతాలో నగదు చేస్తామని కూటమి ఎన్నికల హామీగా పేర్కొంది. రూ.13 వేలే తల్లుల ఖాతాలో జమ చేస్తున్నారు. అర్హత ఉన్నా అందలేదు... జిల్లా వ్యాప్తంగా దాదాపు 3 లక్షలకుపైగా అర్హత గల విద్యార్థులు ఉండగా ప్రభుత్వం మాత్రం 2,65,686 మంది అర్హులని పేర్కొంటోంది. వీరికి దాదాపు రూ.368 కోట్లు జమ కానున్నాయి. మరో రెండు రోజులు ఈ ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటించారు. గత ఏడాది అర్హత గల వారిని ఇప్పుడు అనర్హులుగా పేర్కొంటూ జమ చేయలేదు. ఇద్దరు పిల్లలు ఉన్న తల్లుల ఖాతాలో ఒక్కో చోట ఒక పిల్లాడికి మాత్రమే జమ చేశారు. దీంతో తల్లిదండ్రులు సచివాలయాలకు పరుగులు తీస్తున్నారు. సాంకేతిక కారణాల వలన నగదు జమ కాలేదని, రికార్డులను పరిశీలించి రెండవ విడతలో నగదు జమ చేస్తామని చెబుతున్నారు. -
రికార్డుల్లో సత్తెమ్మ ఆలయం చిన్నదే
అచ్చంపేట: మాదిపాడు పంచాయతీ పరిధిలోని అడవిలో స్వయంభు సత్తెమ్మ దేవాలయం చిన్న గుడి మాత్రమేనని, గుడికి ఎంత స్థలం కేటాయించారనే దానిపై ఫారెస్ట్ గెజిట్లో స్పష్టత లేదని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెంకటరమణ తెలిపారు. ‘సత్తెమ్మా... మన్నించమ్మా – సత్తెమ్మతల్లి ఆలయ అభివృదికి అటవీశాఖ మోకాలడ్డు ’ అనే శీర్షికతో సాక్షిలో బుధవారం ప్రచురితమైన వార్తకు ఫారెస్ట్ అధికారులు స్పందించారు. ఉదయాన్నే ఫారెస్ట్ రేంజ్ అధికారి వెంకటరమణ, డిప్యూటీ రేంజ్ అధికారి కుసుమ కుమారి, ఫారెస్ట్ గార్డు వరప్రసాద్ తదితరులు ఆలయం వద్దకు చేరుకుని దేవాలయ ఈఓ కోటేశ్వరరావుతో మాట్లాడారు. ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఇక్కడ గ్రామం ఉండేదని, వ్యవసాయ భూములు ఉండేవని కొంతమంది చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత ఫారెస్ట్ గెజిట్ రికార్డులను పరిశీలిస్తే అలాంటివేమీ లేవన్నారు. దేవాలయం 12 సంవత్సరాల క్రితం దేవదాయ శాఖలోకి వచ్చిందన్నారు. ఆలయానికి ఎంత స్థలం కేటాయించారనే దానిపై కూడా స్పష్టత లేదన్నారు. ఏ విధమైన కట్టడాలు నిర్మించాలన్నా అటవీశాఖ నుంచి అనుమతి తీసుకోవలసిందేనన్నారు. గతంలో ఎకో పార్కు నిర్మించాలనుకున్నామని, నిదులు మంజూరు కాకపోవడంతో నిర్మించలేదన్నారు. ఆన్లైన్ ద్వారా ఫారెస్ట్ శాఖకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఫారెస్ట్, దేవదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వెంకటరమణ -
ట్రాన్స్ఫార్మర్స్ దొంగల్ని పట్టుకున్న గ్రామస్తులు
పోలీసులకు అప్పగింత అచ్చంపేట: పొలాలలో అమర్చిన వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ కిందకు దించి అందులో ఉండే కాపర్ను దొంగలించేందుకు ప్రయత్నిస్తున్న ఆరుగురు దొంగల్ని చింతపల్లి గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. వారిని అచ్చంపేట పోలీసులకు అప్పగించిన ఘటన మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... చింతపల్లిలోని కృష్ణానది ఒడ్డునే ఉన్న స్కీము, ర్యాంప్ మధ్యలో ఉన్న పొలాలలో రైతులకు చెందిన రెండు వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ వద్ద కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ఉండటాన్ని గ్రామస్తులు గమనించారు. ట్రాన్స్ఫార్మర్స్కు అమర్చిన వైర్లను కట్చేసి, బోల్టులు ఊరదీసి కిందకు దించేందుకు కావలసిన కట్టర్స్, రెంచీలు వంటి పరికరాలతో సిద్ధంగా ఉన్న సమయంలో గ్రామస్తులు దాడిచేశారు. అప్పటికే రెండు ట్రాన్స్ఫార్మర్స్ బోల్టులు ఊడతీసి ఉన్నాయి. గ్రామస్తులు రావడాన్ని గమనించి వారు మినీ లారీలో పారిపోయేందుకు ప్రయత్నం చేశారు. గ్రామస్తులు వెంబడించారు. గ్రామం చివర్లో ఉన్న పెట్రోలు బంకు వద్ద ట్రాక్టర్ అడ్డుపెట్టి వాహనాన్ని అడ్డుకున్నారు. మినీ లారీలో ముగ్గురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. వారిని దేవాలయంలో బంధించి అచ్చంపేట పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. వీరు వచ్చిన మినీ లారీ తెలంగాణ రిజిస్ట్రేషన్తో ఉంది. వచ్చిన ఆరుగురు కూడా తెలంగాణ యాసలో మాట్లాడడాన్ని గ్రామస్తులు గమనించారు. పోలీసులు వచ్చి ఆరుగురు వ్యక్తులను, మినీ లారీని, ట్రాన్స్ఫార్మర్స్ ఊడదీసేందుకు ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. చింతపల్లి గ్రామస్తులు అదుపులోకి తీసుకుని తమకు అప్పగించిన వ్యక్తులు ట్రాన్స్ఫార్మర్స్ దొంగలించే వారు కాదు, గ్రామాలలో తిరిగి పాత స్క్రాప్ కొనుగోలు చేసేవారు. వీరికి ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలకు సంబంధంలేదు. – పి.శ్రీనివాసరావు, సీఐ, అచ్చంపేట. -
మట్టి మాఫియా దోపిడీ
పల్నాడుగురువారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2026సాక్షి, నరసరావుపేట: మంగళవారం అర్థరాత్రి నిద్రిస్తున్న డ్రైవర్ నాగరాజుపై టిప్పర్ వెళ్లడంతో మరణించిన ఘటన నేపథ్యంలో మట్టి మాఫియాపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. రాత్రివేళల్లో భారీ పొక్లెయినర్లతో చెరువులు, కొండల్లోని మట్టిని తవ్వి భారీ టిప్పర్లు, ట్రాక్టర్లలో మట్టిని తరలిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఈపూరు మండలం ముప్పాళ్ల వైపు, మండలంలోని సమీప గ్రామాలకు, నరసరావుపేట పట్టణానికి సైతం మట్టిని తరలిస్తున్నా ఏ అధికారి కంటపడకపోవడం శోచనీయం. మట్టిని కొల్లగొడుతున్నప్పటికీ రెవెన్యూ అధికారులు సంబంధం లేదన్నట్లు వ్యవహరించడం దారుణమని స్థానికులు వాపోతున్నారు. ప్రధానంగా అద్దంకి– నార్కట్పల్లి రాష్ట్ర రహదారి, చీరాల ఓడరేవు– నకరికల్లు రహదారి, గ్రామాల్లోని ప్రధాన రహదారుల గుండా మట్టి తరలిపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారిని భయపెట్టి, బుజ్జగించి అక్రమార్కులు మైనింగ్ వ్యవహారం సాగిస్తున్నారు. ఇప్పటికే వందలాది లారీల చెరువు మట్టి, కొండ మట్టి కొల్లగొట్టారు. ట్రాక్టర్కు రూ.1,500, లారీకి రూ.8 వేలు వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంకా కొనసాగితే చెరువుల భద్రతకు, కొండల ఉనికికే ముప్పు వాటిల్లే పరిస్థితి దాపురించింది. గతంలో కలెక్టర్ స్థాయి వరకు ఫిర్యాదులు వెళ్లినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. తమ పరిధి కాదంటూ అటవీ శాఖ, పంచాయతీరాజ్, మైనింగ్ శాఖలు పరస్పరం నెట్టుకుంటూ మాఫియాకు సహకరిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. మట్టి మాఫియాకు చెందిన భారీ వాహనాలు అధిక వేగంతో, అధిక లోడుతో వెళ్తుండడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏంటని ప్రశ్నించిన గ్రామస్తులపై మట్టి మాఫియా బెదిరింపులకు పాల్పడుతోంది. సహజ వనరులను కొల్లగొడుతున్న టీడీపీ నేతలు మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారుల దాసోహం నిత్యం భారీ వాహనాల రాకపోకల కారణంగా ప్రమాదాలువిజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ మట్టం బుధవారం 513.30 అడుగులకు చేరింది. ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. అక్రమ మట్టి మైనింగ్ టీడీపీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. సహజ వనరులను ఆస్తులను కాపాడాల్సిన టీడీపీ ప్రభుత్వం ఆ బాధ్యతనే మరచింది. జిల్లావ్యాప్తంగా మట్టిని అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నా అధికారుల కంటపడకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామంలోని నల్ల ఎర్ర చెరువుతోపాటు చేజర్ల గ్రామంలో కొండ మట్టిని తరలించి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. -
ప్రమాదకరంగా ఫ్లయ్ఓవర్ పనులు
చిలకలూరిపేట: జాతీయ రహదారి 16కు అనుసంధానంగా ఉన్న చిలకలూరిపేట బైపాస్ రోడ్డుపై ప్రమాదకర రీతిలో ఫ్లయ్ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ట్రాఫిక్ డైవర్షన్ చేయకుండా, ఎన్హెచ్ఏఐ అధికారుల అనుమతి లేకుండా పనులు నిర్వహిస్తున్నారని ఆ సంస్థ నోటీసు జారీ చేసినా పనులు కొనసాగించటం విశేషం. గతంలో ఇదే ప్రాంతంలో భారీ గడ్డర్ నేలకొరిగి పెను ప్రమాదం సంభవించింది. సంబంధిత కాంట్రాక్టు సంస్థ మాత్రం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్హెచ్ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ ఈ నెల 18న జారీ చేసిన నోటీసుకు విలువ లేకుండా పోయింది. ఏదైనా ప్రమాదం జరిగితే జవాబుదారీతనం ఎవరిదనే ప్రశ్న తలెత్తుతోంది. వాడరేవు నుంచి ... చీరాల వాడరేవు నుంచి చిలకలూరిపేట మీదుగా నకిరికల్లు వరకు 167ఏ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందులో ఓడరేవు నుంచి చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామం వరకు 47 కిలోమీటర్ల మేర ఓ నిర్మాణ సంస్థ కాంట్రాక్టు దక్కించుకొని పనులు నిర్వహిస్తోంది. బొప్పూడి సమీపంలో చైన్నె నుంచి కోల్కతా వెళ్లే 16వ నంబర్ జాతీయ రహదారికి సంబంధించి బైపాస్ రోడ్డుపై ఫ్లయ్ఓవర్ నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 17వ తేదీన నిర్మాణ పనులు పరిశీలించిన జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్... నిర్మాణంలో ఉన్న ఫ్లయ్ఓవర్ కింద వాహనాల రాకపోకలు ఎలా అనుమతిస్తారని, ట్రాఫిక్ డైవర్షన్ చేయకుండా పనులు నిర్వహించరాదని సంబంధిత కాంట్రాక్టు సంస్థకు ఈ నెల 18వ తేదీన స్టాప్ వర్క్(పనుల నిలిపివేత) నోటీసు జారీ చేశారు. అయినప్పటికీ నిబంధనలు పాటించకుండానే పనులు కొనసాగిస్తున్నారు. గతంలో కూలిన గడ్డర్... ఇదే నిర్మాణం కోసం రోడ్డుకు ఇరువైపులా పిల్లర్లపై ఐరన్ రాడ్లు, సిమెంట్తో నిర్మించిన గడ్డర్లను భారీ క్రేన్లతో ఏర్పాటు చేసేందుకు గతంలో యత్నించారు. అప్పుడు క్రేన్లకు అమర్చిన ఐరన్ రోప్లు జారడంతో వందల టన్నుల బరువైన గడ్డర్ నేలకొరిగింది. ఈ ఘటన గత మార్చి 7వ తేదీన జరిగింది. నాడు ట్రాఫిక్ డైవర్షన్ చేసినందున ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాంట్రాక్టర్కు సంబంధించిన క్రేన్కు మాత్రమే నష్టం జరిగింది. ఇలాంటి చేదు అనుభవం ఉన్నప్పటికీ సంబంధిత సంస్థ నిబంధనలు ఉల్లంఘించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే నిర్మాణం నిలిపివేయాలని ఎన్హెచ్ఏఐ నోటీసులు లెక్క చేయకుండా కొనసాగిస్తున్న కాంట్రాక్టు సంస్థ గతంలో పెను ప్రమాదం జరిగినా అదే నిర్లక్ష్యం ట్రాఫిక్ మళ్లించకుండా ప్రమాదకరంగా పనులు నిర్వహిస్తున్న విషయం మా పరిశీలనలో నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే పనులు నిలిపివేయాలని నోటీసు జారీ చేశాం. ఎన్హెచ్ఏఐ నుంచి అనుమతి పొంది ట్రాఫిక్ డైవర్షన్ ఇతర నిబంధనలు పాటించాకే పనులు పునఃప్రారంభించాల్సి ఉంటుంది. ఈ విషయమై చర్యలు తీసుకుంటాం. – వికాస్.ఎస్, ప్రాజెక్టు డైరెక్టర్, ఎన్హెచ్ఏఐ -
సమస్యల డాక్యుమెంట్
జిల్లా వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు సమస్యలకు నిలయాలుగా మారాయి. వాటిని పరిష్కరించకుండా టీడీపీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు సిద్ధం కావడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కార్యాలయాల్లో వసతుల లేమిపై క్రయవిక్రయదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గురజాల: కార్యాలయాల్లో ఇంటర్నెట్, సర్వర్లు తరచూ డౌన్ కావడం, ఆటో మ్యూటేషన్ ప్రక్రియలో జాప్యం వంటి సాంకేతిక సమస్యలతోపాటు పలు ఇబ్బందులు ఉన్నప్పటికీ పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం వచ్చే క్రయవిక్రయదారులు సర్వర్ సమస్యల కారణంగా కార్యాలయాల చుట్టూ పలుమార్లు తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. తమ పనులు మానుకుని రిజిస్ట్రేషన్ కోసం ఒకటికి రెండుసార్లు రావాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేపట్టడం విడ్డూరంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో పరిస్థితి ఇలా... పల్నాడు జిల్లాలో మాచర్ల, గురజాల, పిడుగురాళ్ల, వినుకొండ, పెదకూరపాడు, సత్తెనపల్లి, క్రోసూరు, అమరావతి, నరసరావుపేట, చిలకలూరిపేటల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో మాచర్ల, వినుకొండ, చిలకలూరిపేట, సత్తెనపల్లి, క్రోసూరు కార్యాలయాలు ప్రభుత్వ భవనాల్లో ఉన్నాయి. వాటిలో కొన్ని శిథిలావస్థకు చేరాయి. మిగిలిన గురజాల, పిడుగురాళ్ల, అమరావతి, పెదకూరపాడు, నరసరావుపేట కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. సర్వర్ సమస్యలు, ఇంటర్నెట్ అంతరాయాలు, ఆటో మ్యూటేషన్ ప్రక్రియలో ఆటంకాలు వంటివి తరచూ ఎదురవుతున్నాయి. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఒకటైనా, వాటి అభివృద్ధిపై నిర్లక్ష్యం కొనసాగుతోందని ప్రజలు అంటున్నారు. చలానాలు చెల్లించేందుకు, స్లాట్ బుకింగ్ చేసేందుకు సర్వర్ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను పరిష్కరించకుండా ప్రైవేటీకరణ చేపట్టడం సమంజసం కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ 396ను రద్దు చేసి, కార్యాలయాల్లో క్రయవిక్రయదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు. ఆదాయం వస్తున్నా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వసతుల కొరత సాంకేతిక ఇబ్బందులతో ఆలస్యమవుతున్న రిజిస్ట్రేషన్లు పరిష్కారంపై దృష్టి పెట్టని చంద్రబాబు సర్కార్ -
నేడు ఓలేరులో వారాహి మహా హోమం
భట్టిప్రోలు: మండల పరిధిలోని ఓలేరు శివానంద ఆశ్రమంలో శ్రీ వారాహి గుప్త నవరాత్ర మహోత్సవంలో భాగంగా బుధవారం బాలాజీ గురుకుల్ పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గురువారం మహాహోమం జరుగుతుందని పేర్కొన్నారు. ఉగ్రరూప ధారిణి అయిన అమ్మవారిని చూడటం ఉపాసన బలం ఉన్నవారికి మాత్రమే వీలవుతుందని... అది కూడా అమ్మవారు గ్రామ సంచారానికి వెళ్లినప్పుడు మాత్రమే కుదురుతుందని చెప్పారు. ఈ పూజలో పాల్గొంటే శత్రు బాధలు, దుష్ట శక్తుల పీడలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారని తెలిపారు. కుంచవరం (తెనాలి): కొల్లిపర మండల గ్రామం కుంచవరంలో వేంచేసియున్న శ్రీవారాహి అమ్మవారి ఆలయంలో గుప్త నవరాత్రులు బుధవారం ఎనిమిదో రోజుకు చేరాయి. తెల్లవారుజాము నుంచి అభిషేకాలు, ప్రత్యేక పూజలను పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీప్రజ్ఞానంద సరస్వతి పర్యవేక్షణలో నిర్వహించారు. ఉదయం హోమాలు, సాయంత్రం కుంకుమపూజ చేశారు. చక్రాయపాలెంకు చెందిన పసుపులేటి మాణిక్యాలరావు, సావిత్రి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశాక, సారె సమర్పించారు. ఆలయ ధర్మకర్త తన్నీరు శ్రీనివాసబాబు, నాగమల్లేశ్వరి దంపతులు నిర్వహణలో జరిగిన కార్యక్రమంలో ఎస్వీ యోగా కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య, భరత్స్వామి, హేమంత్కుమార్, జెట్టి వెంకట సాయితేజ, భక్తులు పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: ప్రజలను కరుణించాలని వరుణుడిని కోరుతూ మంగళగిరి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్ధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ కోగంటి సునీల్కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రం పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని, లోక కల్యాణార్థం సమృద్ధిగా వర్షాలు కురవాలని, కరువు పరిస్థితులు తొలగిపోవాలని 23 నుంచి 25వ తేదీ వరకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గుంటూరు ఎడ్యుకేషన్: యూటీఎఫ్ టెట్ మోడల్ టెస్ట్ పేపర్లను డీఈఓ షేక్ సలీమ్ బాషా బుధవారం డీఈవో కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ యూటీఎఫ్ తయారు చేసిన టెస్ట్ పేపర్లు ఇన్స్టెంట్గా చదువుకుని, ఉత్తీర్ణులయ్యేందుకు అనువుగా ఉన్నాయని అన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ 1ఏ, 2ఏలో తెలుగు, ఇంగ్లిషు, హిందీ, మాథ్స్, సోషల్ విడివిడిగా టెస్ట్ పేపర్లను పుస్తకాల రూపంలో అందుబాటులో తెచ్చామన్నారు. గతంలో జరిగిన ప్రశ్నపత్రాలు, ప్రాక్టీస్ కోసం అదనంగా మరికొన్ని మోడల్ పేపర్లను కలిపి పుస్తకాలను రూపొందించామని తెలిపారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజ శేఖరరావు, ఎం.కళాధర్లు మాట్లాడుతూ మోడల్ టెస్ట్ పేపర్లు కావలసిన వారు బ్రాడిపేట 2/6లోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు. కార్యక్రమంలో సంఘ జిల్లా సహాధ్యక్షుడు జి. వెంకటేశ్వర్లు, జిల్లా సహాధ్యక్షురాలు ఎండీ షకీలా బేగం, జిల్లా కార్యదర్శులు ఎం. గోవిందయ్య, కె.రంగారావు, బి.ప్రసాద్, ఎం.కోటిరెడ్డి, గఫార్ తదితరులు పాల్గొన్నారు. -
భర్తపై భార్య కత్తితో దాడి
ఆర్థిక వివాదాలే కారణం నరసరావుపేట టౌన్: భర్తపై భార్య కత్తితో దాడికి పాల్పడి సంఘటన మంగళవారం అర్థరాత్రి పట్టణంలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ శివారు గంటా లలిత కాలనీలో నివాసం ఉంటున్న చట్టు కోటేశ్వరరావు అరండల్పేటలో పెట్షాప్ నిర్వహిస్తుంటాడు. మొదటి భర్తతో విడిపోయి ఒంటరిగా నివసిస్తున్న ఆయన కాసా రామలక్ష్మిని మూడేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. ఆమె గుంటూరు రోడ్డులో వస్త్రదుకాణం నిర్వహిస్తుంది. మరో వ్యక్తితో భార్య సన్నిహితంగా మెలుగుతుందని భర్తకు అనుమానం ఉంది. దీంతోపాటు భార్య, భర్తల మధ్య ఆర్థిక వివాదం తలెత్తి కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కోట సెంటర్ నుంచి ద్విచక్రవాహనంపై గుంటూరు రోడ్డు మీదుగా లలితా కాలనీకు కోటేశ్వరరావు బయలు దేరాడు. మార్గ మధ్యలో కాసా రామలక్ష్మి మరో ఇద్దరు వచ్చి అడ్డగించారు. కత్తితో కోటేశ్వరరావుపై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రుడిని నరసరావుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు బాధితుడు బుధవారం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సిహెచ్ ప్రభాకర్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల భాగ్యనగర్ కాలనీ వద్ద మంగళవారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని రఘురామ్నగర్ ఏరియాకి చెందిన చెరుకూరి నరేష్ (35) పట్టణంలోని కట్టమూరువారివీధిలో గల నాని డ్రెస్సెస్లో గుమస్తాగా పనిచేస్తు జీవనం వెళ్లదీస్తున్నాడు. ప్రధాన రహదారిలోని గడియార స్తంభం సెంటర్లో గల శ్రీ విజయదుర్గ డ్రెస్సెస్ దుకాణ యజమానురాలు కనికుట్ల రాజ్యలక్ష్మిని నరేష్ తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని ధూళిపాళ్ల నుంచి సత్తెనపల్లి వైపు వస్తుండగా ఎదురుగా వస్తున్న సిమెంట్ లోడ్ లారీని ఢీకొట్టారు. నరేష్ అక్కడికక్కడే మృతి చెందగా రాజ్యలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన రాజ్యలక్ష్మిని సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరు జీజీహెచ్కు తరలించారు. నరేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. మృతడికి భార్య, ఇరువురు పిల్లలు ఉన్నారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి పెదకూరపాడు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని కన్నెగండ్ల గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కన్నెగండ్ల గ్రామానికి చెందిన వేదులాపురపు ఆనంద్(54) మంగళవారం వ్యక్తిగత పనుల నిమిత్తం పెదకూరపాడు వచ్చారు. పనులు ముగించుకుని రాత్రి పది గంటల సమయంలో కన్నెగండ్ల గ్రామానికి వెళుతుండగా మార్గమధ్యంలో లగడపాడు దాటిన తర్వాత ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో కింద పడ్డాడు. తల రోడ్డుకు బలంగా తాకడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. వ్యాపార పనులు ముగించుకున్న అటువైపుగా వెళుతున్న కొందరు గుర్తించి 108కి సమాచారం అందించారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి ఒక కుమార్తె, కుమారులు ఉన్నారు. కొంత కాలం కిందటే భార్య మృతిచెందింది. ఆనంద్ మృతదేహాన్ని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, అర్తిమల్ల రమేష్ తదితరులు సందర్శించి నివాళులర్పించారు. విషపు గుళికలు తిని వ్యక్తి ఆత్మహత్య మాచవరం: మద్యంలో విషపు గుళికలు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని వేమవరం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కొమరగిరి శ్రీను(57) చేపలు పట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసై మంగళవారం ఉదయం మద్యంలో విషపు గుళికలు కలుపుకొని సేవించాడు. కొంతసేపటి తర్వాత నోటి నుంచి దురద రావడంతో అతని తమ్ముడు వీరయ్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందా డు. వీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అందని జూలై నెల రేషన్ బొల్లాపల్లి: మండలంలోని బండ్లమోటు రేషన్ దుకాణం పరిధిలో జూలై నెల రేషన్ పంపిణీ చేపట్టలేదని కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. రేషన్ షాప్ పరిధిలో బండ్లమోటుతోపాటు శివారు గ్రామం మాలపాడుకు చెందిన సుమారు 450కి పైగా కార్డుదారులు ఉన్నారు. ఈ విషయంపై పౌరసరఫరాల డిప్యూటీ తహసీల్దార్ పి సునీతను వివరణ కోరగా ఈనెల 2న బండ్లమోటు రేషన్ షాప్ తనిఖీ చేశామని, సుమారు 25 క్వింటాల బియ్యం వ్యత్యాసం ఉందని తెలిపారు. 6ఎ కేసు నమోదు చేశామని తెలిపారు. -
పోలీసుల అదుపులో మైనింగ్ ట్రాక్టర్లు
నకరికల్లు: మండలంలోని నర్శింగపాడులో అక్రమంగా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు బుధవారం రాత్రి స్వాఽధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లను సీజ్చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. తహసీల్దార్ కె.పుల్లారావు మాట్లాడుతూ నర్శింగపాడు గ్రామంలోని పూరిబోడు ప్రాంతంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు పోలీసులు, సిబ్బందితో దాడులు నిర్వహించి రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అక్రమమైనింగ్ను అరికట్టేందుకు గట్టి నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. అక్రమంగా మట్టిని తరలించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దాడుల్లో ఆర్ఐ సిద్దయ్య, సిబ్బంది పాల్గొన్నారు. అక్రమ మైనింగ్ విషయమై కుంకలగుంట పెద్దఎత్తున నిరసనలు వచ్చిన రోజే నర్శింగపాడులో అక్రమమైనింగ్ జరగడంతో అధికారుల నిఘాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఘనంగా జాతీయ జెండా ఆమోద దినోత్సవం
మాదల(ముప్పాళ్ళ): మండలంలోని మాదల గ్రామంలో గల జ్యోతిబా పూలే బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను భారతరాజ్యాంగం ఆమోదించిన దినోత్సవం బుధవారం జరిగింది. కార్యక్రమంలో భాగంగా 120 మీటర్ల జాతీయ జెండాతో పాఠశాల నుంచి మాదలలోని మెయిన్సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జెండా రూపకర్త పింగళి వెంకయ్యకు నివాళులర్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీసునీత, హెల్ప్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కంచర్ల బుల్లిబాబు, విద్యాకమిటీ చైర్మన్ సాగర్, సభ్యుడు లక్ష్మణ్, హెల్ప్ ఫౌండేషన్ సభ్యులు ఈశ్వరరెడ్డి, నిర్మల్, విష్ణు, పద్మావతి, వ్యాయామ ఉపాధ్యాయురాలు అనూష తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులకు చట్టాలపై అవగాహన అవసరం
శావల్యాపురం: విద్యార్థులు చిన్నతనం నుంచే చట్టాలు, హక్కులు, బాధ్యతలపై అవగాహన కలిగిఉండాలని ఉమ్మడి గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి సయ్యద్ జియావుద్దీన్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు సూచనలకు అనుగుణంగా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా న్యాయమూర్తి సయ్యద్ జియావుద్దీన్ మాట్లాడుతూ నేటి సమాజంలో చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపులు, దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు పోక్సో చట్టం రూపొందించినట్లు వివరించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మధ్య ఉన్న తేడాను గుర్తించాలన్నారు. ఎవరైనా అసౌకర్యంగా, అనుమానస్పదంగా ప్రవర్తిస్తే వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియజేయాలన్నారు. పేదలు, మహిళలు, పిల్లలు, అణగారిన వర్గాలకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలు, ఉచిత న్యాయసేవలు అందుతాయన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్లో ఉన్నతస్థాయిలో ఎదగాలన్నారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పఠాన్ గౌస్ మొహిద్దిన్ ఖాన్, కట్టా కాళిదాసు, నాగపద్మ, రామాంజినేయులు, ఎస్ఐ మోర్ల వెంకటేష్బాబు, ఇన్చార్జి హెచ్ఎం సుభాష్, ఉపాధ్యా యుడు బెజవాడ వెంకట నాగేశ్వరరావు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ సయ్యద్ జియావుద్దీన్ -
దూరవిద్య ఎంతో మేలు
శ్యాంప్రసాద్, సమగ్ర శిక్ష ఏపీసీఓనరసరావుపేట ఈస్ట్: ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాలతో మధ్యలో చదువు మానివేసిన వారికి సార్వత్రిక (దూరవిద్య) ద్వారా ఎంతో మేలు జరుగుతుందని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పాలేటి శ్యాంప్రసాద్ తెలిపారు. సమగ్ర శిక్ష కార్యాలయంలో సోమవారం 2026–27 విద్యా సంవత్సరానికి గాను ఏపీఓఎస్ఎస్ అడ్మిషన్స్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దూరవిద్య ద్వారా 10వ తరగతి చదివేందుకు 14 సంవత్సరాలు, ఇంటర్మీడియెట్కు 15 సంవత్సరాలు వయస్సు నిండి ఉండాలని తెలిపారు. సార్వత్రిక విద్యాపీఠం జిల్లా కోఆర్డినేటర్ బి.హైమారావు మాట్లాడుతూ, దూరవిద్య పట్ల ఆసక్తి ఉన్న అభ్యాసకులు (విద్యార్థులు) ఈనెల 31వ తేదీ లోగా ప్రవేశాలు పొందాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, వయోజనులు, డ్వాక్రా సంఘాల మహిళలు, మధ్యలో చదువు మానివేసిన వారు ఓపెన్ స్కూల్ విధానం ద్వారా 10వ తరగతి, ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులయ్యేందుకు, పదోన్నతులు పొందేందుకు అవకాశం ఉంటుందని వివరించారు. దూరవిద్య విద్యా సంవత్సరంలో 30 తరగతులకు హాజరు కావాలనీ, మండలాలలో అధ్యయన కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఏఎంఓ పూర్ణచంద్రరావు, జిల్లా జీసీడీఓ డి.రేవతి, ఐఈఆర్పీ కో–ఆర్డినేటర్ సెల్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
యువ వైద్యుడి ప్రాణాలు తీసిన కల్వర్టు
వేటపాలెం: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కల్వర్టులోకి పల్టీ కొట్టిన ఘటనలో యువ పీజీ వైద్యుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని ఓడరేవు నుంచి రామాపురం సముద్రతీరం కల్వర్టు వద్ద ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. బాపట్ల బీమావారిపాలెం చెందిన డాక్టర్ లేళ్ల వెంకట అనిరుద్దీన్ (24) తన స్నేహితుడితో కలసి ఆదివారం రామాపురం బీచ్కు వచ్చారు. ఆనందంగా గడిపిన తర్వాత బైక్పై తిరుగు ప్రయాణమయ్యారు. రామాపురం నుంచి ఓడరేవు వెళ్లే రహదారి మధ్యలో మరమ్మతులో ఉన్న కల్వర్టు వద్ద బైక్ అదుపుతప్పింది. కల్వర్టులో పల్టీ కొట్టింది. అనిరుద్దీన్ తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మరో యువకుడిని 108లో చీరాల అసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం గుంటూరు వైద్యశాలకు తరలించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కష్టాల ఖరీఫ్
సాక్షి, నరసరావుపేట: వరుణుడి జాడ లేకపోవడంతో జిల్లా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సేకరించిన విత్తనాలను కొందరు రైతులు వర్షాభావ పరిస్థితులు చూసి ఆయా వ్యాపారులకు తిరిగి ఇచ్చేసే ఆలోచనలో ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సాధారణ సాగు 4,00,345 ఎకరాలు కాగా... ప్రస్తుతం 71,140 ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఇది 17.7 శాతమే. ఇందులో 68,273 ఎకరాలు పత్తి పంట సాగే ఉంది. ముందు పత్తి సాగు చేసి తర్వాత రెండో పంటగా మొక్కజొన్న వేయవచ్చని రైతులు భావించారు. అయితే పత్తి కూడా ప్రస్తుతం ప్రమాదంలో పడింది. తొలకరి వర్షాలతోనే వరుణుడు సరిపెట్టడంతో పంట ఎండిపోతోంది. కొందరుపత్తి పంటను దున్నేస్తుండటం ఆందోళన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఈపాటికి వరి నారుమళ్లు, కంది సాగు పుంజుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో అది సాధ్యమయ్యేలా లేదు. పది శాతమే వర్షపాతం... ఎల్నినో ప్రభావం పల్నాడు జిల్లాపై అధికంగా కనిపిస్తోంది. జిల్లాలో ఈ నెల 20వ తేదీ నాటికి సాధారణ వర్షపాతం 236.50 సెం.మీ. నమోదు కావాలి. కానీ 24.4 సెం.మీ. మాత్రమే నమోదైంది. నాదెండ్ల, చిలకలూరిపేట, యడ్లపాడు, శావల్యాపురం, బొల్లాపల్లి మండలాల్లో వర్షాభావ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. ఇక్కడ 10 శాతానికి కూడా వర్షపాతం మించలేదు. ముఖ్యంగా కంది పంట సాగుకు రైతులు వెనుకడుగేస్తున్నారు. మరోవైపు గతేడాది ఇదే సమయంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నీటితో కళకళలాడుతూ క్లస్టర్ గేట్ల నుంచి నీరు ప్రవహించింది. ఈ ఏడాది సాగర్లోకి ఇప్పటి వరకు కనీసం ఒక్క టీఎంసీ కూడా రాకపోవడం ఆందోళనకరంగా మారింది. ఎగువనున్న ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లోకే నీరు రాకపోవడంతో పరిస్థితి తీవ్రంగా మారనుంది. వరి, ఇతర వాణిజ్య పంటల సాగుకు రైతులు వెనుకడుగు వేస్తున్నారు. ఖరీఫ్ సీజన్ రైతుల్లో కన్నీరే మిగులుస్తోంది. ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం, జలాశయాల్లో నీరు చేరకపోవడంతో సీజన్ ప్రారంభమై 50 రోజులు పూర్తయినా సాధారణ సాగులో కనీసం 18 శాతం కూడా పూర్తి కాలేదు. తొలకరి చినుకులతో ఆశగా దుక్కులు దున్నిన రైతులు వారాలుగా వర్షం కోసం ఎదురుచూసి ఎక్కడి పనులు అక్కడే ఆపేశారు. జిల్లాలోని 28 మండలాల్లో లోటు వర్షపాతం నెలకొనడంతో ఈ ఏడాది సాగు సాధ్యమయ్యేనా అనే ఆందోళనలో వారిలో నెలకొంది. జూన్ 16వ తేదీన వర్షం పడటంతో మూడెకరాల్లో పత్తి విత్తనాలు నాటించాను. అప్పటి నుంచి నెల రోజులకుపైగా సరైన వర్షం కురవకపోవడంతో పూర్తి స్థాయిలో విత్తనాలు మొలకెత్తలేదు. అరకొర మొలకెత్తినా వేడికి ఎండిపోతున్నాయి. చేసేదేమీ లేక పంటను ట్రాక్టర్తో దున్నేశా. మంచి వర్షాలు మొదలైతే మరోసారి సాగు చేయాల్సిందే. తీవ్ర ఆర్థిక భారం పడనుంది. – జంపని సురేష్, రైతు, గణపవరంఈ ఏడాది ఖరీఫ్లో నాలుగు ఎకరాల్లో కంది సాగు చేయడానికి విత్తనాలు తీసుకొచ్చి దుక్కి దున్ని సిద్ధంగా ఉన్నా. నెల రోజులుగా మంచి వర్షాలు కురవడం లేదు. దీంతో ఎప్పుడు పడుతుందా, సాగు ఎప్పుడు చేస్తానన్న ఆందోళన నెలకొంది. ఇదే వాతావరణం మరో పది రోజులు కొనసాగితే ఖరీఫ్ సాగు చేయడానికి రైతులు ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. – చెవల వెంకటేశ్వర్లు, రైతు, శావల్యాపురం -
మోసపోయాం.. న్యాయం చేయండి
నరసరావుపేటరూరల్: ఆర్థిక, భార్యభర్తల వివాదాలపై పీజీఆర్ఎస్లో అధిక ఫిర్యాదులు వచ్చాయి. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ నిర్వహించారు. నరసరావుపేట డీఎస్పీ ఎం.హనుమంతురావు కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, పలు మోసాలతో పాటు బెదిరింపులు, ఆక్రమణల వంటి అంశాలపై 99 ఫిర్యాదులు అందాయి. ఆర్థిక అంశాలపై 18, భార్యాభర్తల మధ్య వివాదాలపై 16, భూ వివాదాలపై 15, ఆస్తి తగాదాలపై 11 అర్జీలు వచ్చాయి. పీజీఆర్ఎస్లో వచ్చిన మహిళలు, వృద్ధులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి సారించి క్షేత్రస్ధాయిలో విచారణ వేగవంతం చేసి న్యాయం చేయాలని పోలీసు అధికారులకు డీఎస్పీ సూచించారు. పెళ్లి చేసుకుంటాని నా దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశాడు. బ్యూటీపార్లర్ నిర్వహించుకుంటూ నేను నా భర్తతో సంతోషంగా ఉన్నాను. అయితే నాగమణి అనే మహిళ బ్యూటీపార్లర్లో మెలకువలు నేర్చుకునేందుకు నా వద్దకు వచ్చింది. మల్లేష్, నాగమణిలు కలిసి నాపై అనుమానం వచ్చేలా చేసి నా భర్త నుంచి దూరం చేశారు. తరువాత మల్లేష్ నన్ను పెళ్లి చేసుకుంటానని రూ. 4లక్షలు తీసుకున్నాడు. ఇప్పుడు పెళ్లిచేసుకోకపోగా డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదు. – ఓ మహిళ, సత్తెనపల్లి నరసరావుపేట రిక్షాసెంటర్లోని బృందా గ్రాండ్ రెస్టారెంట్ను ముత్యాల శ్రీను, మాలపాటి బ్రహ్మనందం, జాష్టి నాగేశ్వరరావు, వేమా వెంకటేశ్వరరావుల నుంచి నెలకు రూ.75వేలకు అద్దె చెల్లించేలా అగ్రిమెంట్ చేసుకున్నాను. రెస్టారెంట్ డెవలెప్మెంట్కు రూ.15లక్షలు ఖర్చు చేశాను. అయితే జీఎస్టీ, ఇతర లైసెన్స్లు మార్చమని వారిని కోరగా అవి లేవని చెప్పారు. అయితే చట్ట విరుద్దంగా నేను రెస్టారెంట్ నడపనని నా సొమ్ము తిరిగి ఇవ్వమని కోరగా, డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారు. మోసం చేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయగలరు. – కళాసాగర్ రెడ్డి, నరసరావుపేట ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న నాకు గుంటూరుకు చెందిన అశ్విన్, విజయ్కుమార్లు పరిచయమై అటవీ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించారు. ఉద్యోగం కోసం రూ.8లక్షలు డిమాండ్ చేయగా విడతల వారీగా రూ.2లక్షలు చెల్లించాను. ఉద్యోగం ఇప్పించకపోవడంతో డబ్బులు ఇవ్వమని కోరగా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. – షేక్ గౌస్మోహిద్దీన్, నరసరావుపేట -
వినుకొండ సబ్ జైలును తనిఖీ చేసిన న్యాయమూర్తి
వినుకొండ: గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి సయ్యద్ జియావుద్దీన్ సోమవారం వినుకొండ సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఖైదీల ఆరోగ్యం, భోజన సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. వంటగది, స్టోర్ రూమ్లను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల న్యాయవాదిని ఏర్పాటు చేసుకోలేని ఖైదీలకు లోక్ అదాలత్ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్లు పఠాన్ గౌస్ మొహిద్దీన్ ఖాన్, కట్ట కాళిదాస్, లోక్ అదాలత్ సిబ్బంది, జైలు అధికారులు పాల్గొన్నారు. లీకేజీ నీటిని పరిశీలించిన సాగర్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ విజయపురిసౌత్: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మెయిన్ కెనాల్ నుంచి నీటి విడుదల జరిగేటప్పుడు కుడి జల విద్యుత్ కేంద్రంలోకి వస్తున్న లీకేజీ వాటర్ను సాగర్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పి.కాంతారావు ఆధ్వర్యంలో అధికారులు సోమవారం పరిశీలించారు. గతంలో కెనాల్ బెడ్ కొట్టుకుపోవడంతో వాల్ దెబ్బతిందని అధికారులు పేర్కొన్నారు. దీంతో నీరు పవర్ హౌస్లోకి లీక్ అవుతుండటంతో మరమ్మతులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఏపీ జెన్కో ఎస్ఈ వెంకటరమణ, ఇరిగేషన్ శాఖ ఈఈ మల్లికార్జునరావు, వపర్ హౌస్ డీఈఈ రాజారెడ్డి, సాగర్ ప్రాజెక్టు డీఈఈ గోపాలరావు, ఏఈలు శివయ్య, యుగంధర్ పాల్గొన్నారు. దేవదాయ శాఖ ట్రిబ్యునల్ చైర్పర్సన్గా భారతి పెదకాకాని: రాష్ట్ర దేవదాయ శాఖ ట్రిబ్యునల్ చైర్ పర్సన్గా విశ్రాంత న్యాయమూర్తి ఎం.భారతి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా కోర్టు జడ్జిగా విధులు నిర్వహించిన భారతిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల దేవదాయశాఖ ట్రిబ్యునల్ చైర్పర్సన్గా నియమించింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గుంటూరు జిల్లా పెదకాకానిలోని రాష్ట్ర దేవదాయశాఖ ట్రిబ్యునల్ చైర్పర్సన్ పోస్టు ఖాళీగా ఉంది. రెండేళ్ల తర్వాత ఈ పదవిలో భారతి నియమితులయ్యారు. ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ మినహాయించాలి గుంటూరు ఎడ్యుకేషన్: ఇన్ సర్వీసు టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చే విధంగా పార్లమెంటులో చట్ట సవరణ చేయాలని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.థామస్రెడ్డి, రాష్ట్ర కోశాధికారి సిద్దెల ప్రేమ్సాగర్ డిమాండ్ చేశారు. ఇన్ సర్వీసు టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు కోరుతూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మను కలెక్టరేట్లో కలసిన వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయనకు వినతి పత్రం సమర్పించారు. విద్యాహక్కు చట్టానికి సవరణ తెచ్చి, టెట్ నుంచి మినహాయింపు కల్పించాలని కోరారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ప్రభుత్వం దీనిపై ఒత్తిడి తెచ్చి ఉపాధ్యాయుల హక్కులను పరిరక్షించాలన్నారు. కలెక్టర్ను కలసిన వారిలో సంఘ జిల్లా అధ్యక్షుడు పి.శేషిరెడ్డి ఉన్నారు. -
‘ఆహా’ర్టికల్చర్ హబ్ !
ఈ ప్రాంతంలో షేడ్ నెట్ నర్సరీల నిర్వహకులు ఎక్కువ మంది రైతులు కావడం వలన మేలు రకమైన నారు దొరుకుతుందని మాకు నమ్మకం. మా ప్రాంతంలో మిర్చినారును పెంచుకునే విధానంపై అవగాహన లేదు. ఇక్కడ ఎక్కువ నర్సరీలు ఉండటం కారణంగా రెండు, మూడు రకాల మేలు రకాలైన హైబ్రీడ్ మిర్చినారును కొనుగొలు చేసుకోవచ్చు. – వడితే మునినాయక్, తిమ్మాయిపాలెం గ్రామం, నల్గొండ జిల్లా, తెలంగాణ ఈ ప్రాంతంలో సుమారు 54 నర్సరీలు ఏర్పాటు చేయడం వలన రైతులకు అవసరమైన మేలు రకమైన మిర్చినారు కచ్చితంగా దొరుకుతుంది. ఈ నమ్మకంతోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన రైతులు ప్రతి ఏటా ఇక్కడకు వచ్చి మిర్చినారు కొనుగోలు చేస్తుంటారు. సుమారు 600 కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నాం. – బద్దూరి బ్రహ్మానందరెడ్డి, నర్సరీ యజమాని రెంటచింతల: వేసవి కాలంలో రెంటచింతల పేరు వినని వారుండరు. భగభగమని అత్యధిక ఉష్ణోగ్రతలే కాదు.. ఇది మిర్చినారుకు కూడా ప్రసిద్ధి చెందింది. మేలురకమైన మిర్చిపంటకు కావాల్సిన నారుకు కేరాఫ్గా, హార్టికల్చర్ హబ్గా రెంటచింతల పేరు గడిస్తోంది. రాష్ట్రంలోనే ఎక్కడా లేనివిధంగా 54 నర్సరీలు ఏర్పాటు చేశారు. మొదట మూడు, నాలుగు నర్సరీలు ఏర్పాటు చేయగా ఉద్యాన శాఖాధికారులు అవగాహన కల్పించడంతో మూడు సంవత్సరాల్లో నర్సరీల ఏర్పాటుకు రైతులు ఉత్సాహం చూపారు. పలు రకాల మిర్చినారు ఒకే చోట.. గతేడాది పలు రకాలకు చెందిన మొక్కలకు వేర్వేరు రేట్లు పలికాయి. ఒక మొక్కను 80 పైసలు నుంచి రూ.1.75 వరకు రైతులు కొనుగోలు చేశారు. సుమారు 200 ఎకరాల్లో షేడ్ నెట్లలో నర్సరీలు ఏర్పాటు చేయగా ఎకరాకు 18 వేల ట్రేల చొప్పున నారును పెంచుతున్నారు. రైతులకు ఇక్కడ పలు రకాల హైబ్రీడ్ మిర్చి నారు ఒకే చోట దొరుకుతుంది. దీంతో రాష్ట్రంలోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల రైతులే కాక తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, మహబూబాబాద్, వరంగల్ తదితర జిల్లాలకు చెందిన వందలాది మంది రైతులు, కర్ణాటక రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన రైతులు కూడా ఇక్కడ నర్సరీలలో పెంచిన మిర్చినారును కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. కొందరు రైతులు విత్తనాలను ఇచ్చి ఒక్కొక్క ట్రేకి ఇంత నగదు అని ముందుగానే నిర్వహకులతో ఒప్పందం చేసుకుంటారు. రాష్ట్రంలోనే మిర్చి పంట సాగుకు ఈ ప్రాంతానికే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడు నర్సరీల ద్వారా అనేక ప్రాంతాలకు మేలు రకాలైన మిర్చినారును సరఫరా చేసే కేంద్రంగా మారింది. పెద్ద సంఖ్యలో నర్సరీలను ఏర్పాటు చేయడం వలన మండలంలోని పలు గ్రామాలకు చెందిన వందలాది వ్యవసాయ కూలీలకు జీవనోపాధి కూడా లభిస్తోంది. -
మూడు మండలాల్లో వర్షం
నరసరావుపేట: గడిచిన 24 గంటల్లో జిల్లాలోని 28 మండలాల్లో కేవలం మూడు మండలాల్లోనే వర్షం కురిసినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. వెల్దుర్తిలో 3.2 మిల్లీమీటర్లు, రెంటచింతలలో 3.8, ముప్పాళ్లలో 4.6మి.మీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. వినుకొండ: పట్టణ శివారు రజక కాలనీలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. మర్రిపూడి సాయి (19) అనే యువకుడు ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయి తండ్రి వెంకటేశ్వర్లు, తల్లి రమణ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సోమవారం ఉదయం ఇద్దరూ పనులకు వెళ్లగా, ఇంట్లో ఒంటరిగా ఉన్న సాయి ఫ్యాన్కు చీరతో ఉరివేసుకున్నట్లు తెలిపారు. సాయి పట్టణంలోని ఓ వ్యాపార సంస్థలో కూలీగా పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు సాయిని ఉరివేసుకున్న స్థితిలో గుర్తించి బోరున విలపించారు. ఈ ఘటనతో రజక కాలనీలో విషాద వాతావరణం నెలకొంది. వెంకటేశ్వర్లుకు ఇద్దరు కుమారులు కాగా, పెద్ద కుమారుడు చదువుకుంటున్నాడని, రెండో కుమారుడైన సాయి అకారణంగా ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడంతో కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నాదెండ్ల: చిలకలూరిపేట నూతన వ్యవసాయ మార్కెట్ యార్డు పక్కనే షిరిడీ సాయి ఆలయం ఎదురుగా మృతదేహం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..16వ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఓ షెడ్డులో సోమవారం రాత్రి స్థానికులు మృతదేహాన్ని గమనించారు. రూరల్ సీఐ బి.సుబ్బానాయుడు, నాదెండ్ల ఎస్ఐ ఆర్.వెంకటేశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 50 ఏళ్ల వ్యక్తి వారం రోజుల కిందట షెడ్డులో మృతి చెందినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతుడు భిక్షాటన చేసే వ్యక్తిగా స్థానికులు చెబుతున్నారు. మృతదేహం కుళ్లిపోవడంతో దుర్గంధం వ్యాపిస్తోంది. ఆనవాళ్లు గుర్తు పట్టలేని విధంగా మారిందని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. రెంటచింతల: మండల కేంద్రమైన రెంటచింతల గ్రామ సమీపంలో నున్న జాతీయ రహదారి వెంబడి ఉన్న రెస్టారెంట్ వద్ద సోమవారం రాత్రి ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గోలి గ్రామానికి చెందిన ఉప్పిడి నాగేశ్వరరావు బంధువులకు గురజాల మండలం సమాధానపేటకు చెందిన నరసింహానాయక్కు గొట్టిముక్కల మేజర్ కాల్వలో వేసిన దొనే విషయంలో (సాగునీటికి సంబంధించిన) వివాదం ఉంది. ఈ నేపధ్యంలో స్థానిక రెస్టారెంట్ వద్ద నాగేశ్వరరావు టీ తాగుతున్న సమయంలో ఆక్కడకు వచ్చిన నరసింహా నాయక్ వర్గీయులకు నాగేశ్వరరావుకు, ఆయన కుమారుడు వెంకటేశ్వర్లుకు కాల్వ వ్యవహారంపై మాటమాట పెరిగింది. నరసింహా నాయక్ వర్గీయులు చేసిన దాడిలో నాగేశ్వరరావు ఆయన కుమారుడు వెంకటేశ్వర్లుకు గాయాలు కాగా వారిని వెంటనే గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాడేపల్లి రూరల్ : చిన్న వయసులో జూదానికి అలవాటు పడి అప్పుల బాధ తట్టుకోలేక ఓ విద్యార్థి సోమవారం సాయంత్రం కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. చివరకు ప్రాణభయంతో పక్కనే ఉన్న కృష్ణానది లాకులు పట్టుకుని ఉండడంతో సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు సంఘటనా స్ధలానికి వెళ్లి విద్యార్థిని బయటకు తీసుకువచ్చారు. సేకరించిన వివరాల ప్రకారం.. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన విద్యార్థి అమలాపురంలో ఫిజియోధెరపీ చదువుతున్నాడు. ఆన్లైన్లో బెట్టింగ్లు ఆడి అప్పుల పాలు కావడం, ఆ అప్పుల్లో కొంత తీర్చడం, మిగిలిన డబ్బుల కోసం ఒత్తిడి రావడం, ఆ ఒత్తిడి తట్టుకోలేక అమలాపురం నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్దకు వచ్చి కృష్ణానది ఎగువ ప్రాంతంలోని నీటిలోకి దూకాడు. దూకిన వెంటనే ప్రాణభయంతో కృష్ణానది లాకులు పట్టుకుని రక్షించండి అంటూ కేకలు వేశాడు. అది గమనించిన స్థానికులు తాడేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మనోహర్ను రక్షించి తాడేపల్లి పోలీస్స్టేషన్కు తీసుకు వచ్చారు. జరిగిన సంఘటనపై కౌన్సెలింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు సమాచారం అందించి, విద్యార్థిని పంపించివేశారు. -
‘స్థానిక’ ఎన్నికల్లో మాదిగలకు ఎక్కువ సీట్లు కేటాయించండి
జిల్లా కలెక్టర్కు ఎమ్మార్పీఎస్ఎస్ నేతల వినతి నరసరావుపేట: త్వరలో జరగబోయే స్థానిక సంస్థలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, పంచాయతీ సర్పంచ్, గ్రామ వార్డు మెంబర్ల ఎన్నికల్లో జిల్లాలో అధికంగా ఉన్న మాదిగలకు సీట్లు కేటాయించాలని ఎమ్మార్పీఎస్ఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సాధన సమితి) జిల్లా అధ్యక్షుడు చింతిరాల మీరయ్య మాదిగ కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లాకు వినతిపత్రం సమర్పించారు. మీరయ్య మాట్లాడుతూ గత 31 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణను మాదిగలు పోరాడి సాధించుకున్నారన్నారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత తొలిసారిగా స్థానిక సంస్థ ఎన్నికలు జరగబోతున్నాయని, జిల్లాలో ఎస్సీల్లో మాదిగలు అధికంగా ఉన్నందున ఎస్సీ రిజర్వేషన్ ప్రకారం ఎక్కువ సీట్లు మాదిగలకే కేటాయించాలన్నారు. కొన్ని గ్రామాల్లో అగ్రకులస్తులు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు వచ్చినా గాని రాజకీయం పలుకుబడితో రిజర్వేషన్లు మారుస్తున్నారని అన్నారు. చిలకలూరిపేట, గురజాల, దాచేపల్లి, వినుకొండ నియోజకవర్గాల నాయకులు పాల్గొన్నారు. నరసరావుపేట టౌన్: చెల్లని చెక్కు కేసులో నేరం రుజువు అవడంతో దిగువకోర్టు విధించిన ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ. 8 లక్షలు ఫిర్యాదుకి నష్టపరిహారంగా చెల్లించేలా విధించిన శిక్షను స్థానిక 13వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయాధికారి ఎస్. రమేష్ సోమవారం ఖరారు చేశారు. మండలంలోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన రావూరి వెంకట సిద్దయ్య వద్ద నరసరావుపేటకు చెందిన ఒడుగు నాగూర్ బాబు 2017 జనవరి 5వ తేదీన రూ. 3,50,000 అప్పుగా తీసుకున్నాడు. దీనికి గాను ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చారు. చెల్లింపులో భాగంగా అదే ఏడాది అక్టోబర్ 24న రూ. 4 లక్షలకు చెక్కు ఇచ్చాడు. ఫిర్యాది సిద్దయ్య సదరు చెక్కును తన బ్యాంక్ ఖాతాలో వసూలుకు జమచేశాడు. సరిపడా నిధులు లేక చెక్కు బౌన్స్ అయింది. ఈ మేరకు కోర్టులో కేసువేయగా, విచారణలో నేరం రుజువు కావడంతో పై విధంగా అప్పటి నరసరావుపేట రెండవ అదనపు జూనియర్ అధికారి జె.అంజయ్య తీర్పు వెలువరించారు. నిందితుడు నాగూర్ బాబు సదరు తీర్పుపై జిల్లా కోర్టులో అప్పీలు దాఖలు చేసుకున్నాడు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం దిగువ కోర్టు తీర్పును యధాతథంగా ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. -
నాణ్యమైన విద్యాబోధన అవసరం
నరసరావుపేట ఈస్ట్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన అందించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ప్రకాష్నగర్లోని టౌన్హాల్లో పల్నాడు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో షైనింగ్ స్టార్స్– 2026 అవార్డుల ప్రదానోత్సవం సోమవారం నిర్వహించారు. టెన్త్, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.20 వేల నగదు, పతకం, ధ్రువపత్రం అందించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి జిల్లా వ్యాప్తంగా 186 మంది టెన్త్, 38 మంది ఇంటర్ విద్యార్థులు ఈ పురస్కారాలు పొందారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ.... ప్రతిభావంతులను గుర్తించి ప్రోత్సాహంతోపాటు ఆర్థిక సాయం అందించేందుకు అవార్డులను ఇస్తున్నట్టు తెలిపారు. సర్కార్ పాఠశాలలు, కళాశాలల్లో చదివిన వారు ఎంపిక తీరుతో నష్టపోయారనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో టెన్త్ విద్యార్థుల్లో 186 మందిని ఎంపిక చేశారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కేవలం 81 మంది. మిగతావారు ప్రైవేటు బడుల్లో చదివారు. ఇంటర్లోనూ 38 మందిని ఎంపిక చేయగా ప్రభుత్వ కళాశాలల వారు 9 మందేనని పలువురు గుర్తుచేస్తున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ చదలవాడ అరవిందబాబు, జి.వి.ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, రాష్ట్ర నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గంగాధర్, శిల్పకళా సంస్థ చైర్మన్ మంజులరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పి.శ్యాంప్రసాద్, విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు. -
జీవనోపాధిని దెబ్బతీయొద్దు
సత్తెనపల్లి: జిల్లాలో రిజిస్ట్రేషన్ సేవలను ప్రైవేటు వారికి ధారాదత్తం చేసి తమ పొట్టలు కొట్టొదంటూ దస్తావేజు లేఖరులు సోమవారం పెన్డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల, పిడుగురాళ్ల, అమరావతి, క్రోసూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. ఆయా సబ్ రిజిస్ట్రార్లకు వినతి పత్రాలను అందించారు. క్రయ, విక్రయదారులు కూడా మద్దతు పలికారు. సత్తెనపల్లిలో 4, నరసరావుపేట 2, అమరావతిలో 2 స్లాట్లు బుక్ అయినప్పటికీ జిల్లాలో ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖరులు మాట్లాడుతూ సులభరీతిలో రిజిస్ట్రేషన్ సేవల పేరిట రిజిస్ట్రేషన్ సేవ కేంద్రాలు(ఆర్ఎస్కేలు) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రిజిస్ట్రేషన్ సేవలు ఇకపై పబ్లిక్ – ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో చేపడతారన్నారు. సేవలు వేగంగా అందుతాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఉపాధికి ముప్పు వాటిల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దస్తావేజు రాయడం అనేది కేవలం కంప్యూటర్లో డేటా నమోదు చేయడం మాత్రమే కాదని, ఈ బాధ్యతను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే ఆస్తి వివాదాలు పెరిగే అవకాశం ఉందన్నారు. తెల్ల కాగితాలపైనే రిజిస్ట్రేషన్ సేవలు.. ప్రస్తుతం రిజిస్ట్రేషను సేవలకు స్టాంపులు వాడుతున్నారని, గత ప్రభుత్వ హయాంలో డిజిటల్ స్టాంపులను ప్రవేశపెడితే ఎల్లో మీడియా నానా యాగీ చేసిందన్నారు. అమలు చేయని తెల్లకాగితలపై రిజిస్ట్రేషన్ సేవల విధానాన్ని ఎల్లోమీడియా, చంద్రబాబు తెగ ప్రచారం చేసి ప్రజల్లో అయోమయం నింపారన్నారు. ప్రస్తుతం ఆర్ఎస్కేలలో తెల్లకాగితాలపైనే రిజిస్ట్రేషన్ చేసేలా సంస్కరణల పేరుతో ఏర్పాట్లు చేస్తుండటం గమనార్హమన్నారు. ఇప్ప టికై నా ప్రభుత్వం పునరాలోచించి జీవో నంబరు 396 రద్దు చేయాలన్నారు. పెన్డౌన్ కార్యక్రమం ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. -
డీఆర్ఓకు వినతిపత్రం అందజేసిన వ్యవసాయ శాఖ మల్టీపర్పస్ ఉద్యోగులు
నరసరావుపేట: వ్యవసాయ శాఖలో గత 12ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత, జీతాల పెంపు కల్పించాలని ఏపీ మల్టీపర్పస్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అసోసియేషన్ ఉద్యోగులు కోరారు. ఈ మేరకు తమ డిమాండ్ల సాధన కోసం పెన్డౌన్ పాటిస్తున్నట్లు ప్రకటిస్తూ సోమవారం కలెక్టరేట్లో డీఆర్ఓ అద్దెయ్యకు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుల్లగూర అనీల్కుమార్ మీడియాతో మాట్లాడుతూ తమకు గత కొన్నేళ్లుగా రూ.12వేలు జీతం, రూ.3వేలు ఇన్సెంటీవ్ మాత్రమే ఇస్తున్నారన్నారు. ప్రస్తుతం ఉన్న ధరలకు అనుగుణంగా తమ జీతాలు పెంచాలని గత కొన్నేళ్లుగా ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు తమ సమస్యలకు పరిష్కారం లభించలేదన్నారు. ప్రస్తుతం నాలుగు నెలలుగా జీతాలు కూడా అందడం లేదన్నారు. దీంతో తమ కుటుంబాల పోషణ భారంగా మారిందన్నారు. తమకు సమాన పనికి సమాన వేతనం కింద నెలకు రూ.35వేలు జీతం అందజేయాలని, శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని, ఈహెచ్ఎస్ సదుపాయం కల్పించాలని, విధి నిర్వాహణలో మృతిచెందిన వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు నాగవర్దన్, కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, అనీల్, సుభాని, నాయక్, అంజిబాబు, శ్యామ్ పాల్గొన్నారు. మరో ఇరువురికి గాయాలువెల్దుర్తి: రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతిచెందిన సంఘటన మండలంలోని మండాది బోడు మీద సోమవారం ఉదయం జరిగింది. తెలంగాణలోని పెద్దవూర మండలం నుంచి ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లా యర్రగొండపాలెంలో ఉన్న మన్నెం రవీంద్ర వైద్యశాలలో చికిత్స చేయించుకునేందుకు కారులో బయలుదేరి వెళ్తున్న సమయంలో మండాది బోడు మీదకు రాగానే ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి కారు బోల్తాకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న పుల్లమ్మ (70) కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న 108 సిబ్బంది హుటాహుటీన సంఘటనా స్ధలానికి చేరుకొని గాయపడిన వారిని మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పుల్లమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 10 మందికి తీవ్ర గాయాలు విజయపురిసౌత్: ిపచ్చి కుక్క దాడి చేయడంతో పదిమంది తీవ్రంగా గాయపడిన సంఘటన మాచర్ల మండలం విజయపురిసౌత్లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే విజయపురిసౌత్ లోని దేశవరపు క్యాంపు తండాలో పలువురు వ్యక్తులు బయట ఉండగా పిచ్చి కుక్క వారిపై దాడి చేసింది. అక్కడున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం సాగర్ మాత ఆలయం వద్ద ఉన్న ఉన్న ఆరుగురిని అదే పిచ్చికుక్క కరిచి గాయపరచింది. మొత్తం 10 మంది పిచ్చికుక్క దాడిలో గాయపడ్డారు. క్షతగాత్రులకు స్థానిక ప్రాజెక్ట్ ఆసుపత్రిలో చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్య శాలకు తరలించారు. తెనాలి: యునైటెడ్ కింగ్డమ్లోని బర్మింగ్హామ్ భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో ఈనెల 18న నిర్వహించిన గీతాంజలి సర్కిల్ ఫర్ యంగ్ క్రియేటివ్ రైటర్స్ (జీసీవైసీడబ్ల్యు) ఆధ్వర్యంలోని ‘కృష్ణన్ తల్వార్ అవార్డ్ ఫర్ యంగ్ క్రియేటివ్ రైటర్స్‘ కార్యక్రమంలో భారతీయ బాల కవయిత్రులు ప్రణవి బిట్రా, ఇషాన్వి బిట్రా విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. ఈ సోదరీమణులు మంగళగిరికి చెందిన బిట్రా వెంకటేశ్వరరావు, మల్లికల కుమార్తెలు. పదహారేళ్ల ప్రణవి బిట్రా సృజనాత్మక రచనలో ప్రతిభ, ఊహాశక్తి, సాహిత్య నిబద్ధతకు గుర్తింపుగా ‘కృష్ణన్ తల్వార్ అవార్డ్ ఫర్ యంగ్ క్రియేటివ్ రైటర్స్–2026‘ ప్రదానం చేశారు. అదే కార్యక్రమంలో ఆమె సోదరి, 12 ఏళ్ల ఇషాన్వి బిట్రాకు సృజనాత్మక రచనలో చురుకైన భాగస్వామ్యానికి పార్టిసిపేషన్ సర్టిఫి కెట్ను అందజేశారు. డాక్టర్ కృష్ణ కుమార్, చిత్ర కుమార్ స్థాపించిన గీతాంజలి సర్కిల్ ఫర్ యంగ్ క్రియేటివ్ రైటర్స్, ఈ యువ రచయిత్రుల సాహిత్య ప్రతిభను అభినందిస్తూ, భవిష్యత్తులో మరింత సృజనాత్మక రచనలు చేసి ప్రపంచ సాహిత్యానికి విశిష్ట సేవలు అందించాలని ఆకాంక్షించింది. యూకేలోని డెర్బీ పట్టణంలో ఉంటున్న బిట్రా వెంకటేశ్వరరావు రోల్స్రాయిస్ ప్రధాన కార్యాలయంలో ఒక డివిజన్ టీమ్ లీడర్గా చేస్తుండగా, మల్లిక అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిజియోథెరపిస్ట్గా ఉన్నారు. వీరి కుమార్తెలు ప్రణవి 11 క్లాస్ పాసవగా, ఇషాన్వి ఫోర్త్ క్లాస్ చదువుతున్నారు. -
కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య చిలకలూరిపేట: నీట్ పరీక్షా పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి దర్మేంధ్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో జాతీయ రహదారిపై సోమవారం ధర్నా నిర్వహించారు. ఈశ్వరయ్య మాట్లాడుతూ ఢిల్లీలో సోనం వాంగ్చుక్ దాదాపు 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా, ఆయన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గత 12 ఏళ్ల కాలంలో 29 సార్లు వివిధ పేపర్ లీకేజీల కారణంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష పత్రాలు లీకుకు కారణమైన కేంద్ర విద్యాశాఖామంత్రి రాజీనామా చేయాలని, ఈ విషయానికి సంబంధించి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్రమోదీ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
ప్రజా సమస్యల పరిష్కారం ముఖ్యం
నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్కు అధ్యక్షత వహించి 173 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి అర్జీని నిబంధనల ప్రకారం నిర్ణీత కాలపరిమితిలోగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. అన్ని పీజీఆర్ఎస్ కేంద్రాల్లో సిటిజన్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తున్నామని, సేవలు పొందిన అనంతరం కోడ్ను స్కాన్ చేసి అభిప్రాయం నమోదు చేయాలని కోరారు. ప్రజలు సంతృప్తి చెందేలా సేవలు అందించాలని ఆదేశించారు. జేసీ సంజనా సింహ రెవెన్యూ క్లినిక్లో అర్జీలు స్వీకరించారు. డీఆర్ఓ అద్దెయ్య, డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. నాకు 83 సెంట్ల భూమి ఉంది. గత ప్రభుత్వంలో నా ఖాతాలో రైతు భరోసా డబ్బులు పడేవి. ఇటీవల అన్నదాత సుఖీభవ కింద పెట్టుబడి సాయం ఆపేశారు. కారణాలు తెలియరాలేదు. న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. –వీరదాసు ఆనందం, గుమ్మనంపాడు, బొల్లాపల్లి మండలం -
పొజిషన్ సర్టిఫికెట్ ఇప్పించండి
నాకు గ్రామంలో సొంత ఇల్లు లేదు. వితంతువును. కుమారుడు ఉన్నాడు. ఎస్టీ కాలనీ ఏర్పడిన సమయంలో కమ్యూనిటీ హాలు నిర్మాణం చేశారు. దాని పక్కన ఉన్న రెండు సెంట్ల స్థలంలో ఇల్లు వేసుకునేందుకు ప్రయత్నించగా ఓసీ కులానికి చెందిన ద్రోణాదుల రాంబాబు, అనుచరులు వచ్చి తహసీల్దార్ పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారని చెప్పి నన్ను అడ్డుకున్నారు. ఎస్టీ కాలనీలో ఓసీకి స్థలం ఎలా ఇస్తారంటూ నేను ఆర్టీఐ ద్వారా తహసీల్దార్కు సమాచారం కోసం దరఖాస్తు చేయగా... టువంటి సమాచారం లేదంటూ తెలిపారు. నాకు పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వాలని పీజీఆర్ఎస్లో ఇప్పటికే రెండుమార్లు దరఖాస్తు చేసినా ఫలితం దక్కలేదు. వెంటనే ఇచ్చేలా తహసీల్దార్ను ఆదేశించాలి. ఈ మేరకు జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నా. – పాలపర్తి రమణ, ఇరుకుపాలెం, ముప్పాళ్ల మండలం -
విద్యార్థులు, యువతపై లాఠీచార్జి అమానుషం
నరసరావుపేట: ఢిల్లీలో సీజేపీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘చలో పార్లమెంట్‘ కార్యక్రమంలో శాంతియుతంగా నిరసన తెలుపుతు న్న విద్యార్థులు, యువజన సంఘాలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ప్రజా సంఘాలు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ గడియార స్తంభం మీదుగా ఆర్డీఓ కార్యాలయం వరకు కొనసాగింది. అనంతరం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు మాట్లాడుతూ నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు దేశ విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపాయన్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత లేకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఈ పరిస్థితుల్లో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. పార్లమెంట్కు సమీపంలోనే ఆందోళనకారులను అడ్డుకుని బలప్రయోగానికి దిగడాన్ని తీవ్రంగా ఖండించారు. జరిగిన ఘటనలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, నీట్ పేపర్ లీక్ ఘటనకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ అరెస్టులను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. సీఐటీయూ నాయకులు సిలార్ మాసూద్, శివకుమారి, సయ్యద్ రబ్బాని, యూటీఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.మోహనరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్.సుందరరావుతో పాటు వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
విశాఖలో ప్రమాదం.. ఇనిమెళ్లలో విషాదం
● శుభకార్యానికి వెళుతుండగా కబళించిన మృత్యువు ● ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు దుర్మరణం ఈపూరు: విశాఖపట్నం సమీపంలోని పెందుర్తి– ఆనందపురం జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనిమెళ్ల గ్రామంలో విషాదం అలముకుంది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన ముగ్గురు, నరసరావుపేటకు చెందిన డ్రైవర్ మృతి చెందారు. ఇనిమెళ్లకు చెందిన మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. నరసరావుపేటలో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్ అధికారి శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో శుభకార్యం ఏర్పాటు చేశారు. ఇనిమెళ్ల గ్రామానికి చెందిన పాలగాని రామాంజనేయులు, షేక్ మీరావలి, మందపాటి చంద్రశేఖర్, అతని కుమారుడు మందపాటి భవాని శంకర్లు వాహనంలో శనివారం సాయంత్రం అక్కడికి బయలు దేరారు. తెల్లవారుజామున విశాఖ సమీపంలోని ఆనందపురం జాతీయ రహదారిపై వీరి వాహనం ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొంది. పాలగాని రామాంజనేయులు (51), షేక్ మీరావలి (55), మందపాటి భవాని శంకర్ (11) అక్కడికక్కడే మృతి చెందారు. మందపాటి చంద్రశేఖర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనకు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెద్ద దిక్కును కోల్పోయాం... పాలగాని రామాంజనేయులుకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం భార్య, వృద్ధురాలైన తల్లి, ఇద్దరు కుమారులతో కలసి ఆయన ఉంటున్నారు. తనకున్న కొద్దిపాటి పొలంతోపాటు మరికొంత కౌలుకు సాగు చేస్తుంటారు. కుటుంబానికి అండగా ఉండే ఆయన మృతి చెందడంతో పెద్ద దిక్కును కోల్పోయామని బాధితులు కన్నీరుమున్నీరు అయ్యారు. బడికి సెలవు కావడంతో.. మందపాటి చంద్రశేఖర్కు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వారిలో చిన్నవాడైన మందపాటి భవాని శంకర్ ఆరో తరగతి చదువుతున్నాడు. తండ్రి చంద్రశేఖర్ కారులో శుభకార్యానికి వెళుతుండగా ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో వస్తానని చెప్పి తండ్రితోపాటు వెళ్లి మృత్యువాత పడ్డాడు. కుమారుడు మరణించి, భర్త ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో ఉండటంతో బాధిత కుటుంబం విలపిస్తున్న తీరు చూపరులను సైతం కంటతడి పెట్టించింది. ఇక దిక్కెవరు... షేక్ మీరావలికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు కెనడాలో ఉద్యోగి. చిన్న కుమారుడు గతంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం తండ్రికి తోడుగా ఇంటి వద్ద ఉంటున్నాడు. వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. రోడ్డు ప్రమాదంలో ఇంటి పెద్దను కోల్పోవడంతో కుటుంబం విషాదంలో మునిగింది. నిన్నటివరకు తమ కళ్లముందే తిరిగిన వారు ఇలా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడాన్ని గ్రామస్తులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం మృతదేహాల కోసం ఆయా కుటుంబాల వారు కన్నీటితో ఎదురుచూస్తున్నారు. -
లేఖరులపై ప్రైవేటు పిడుగు
పల్నాడుసోమవారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2026సత్తెనపల్లి: కూటమి ప్రభుత్వం ఆస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. రిజిస్ట్రేషన్ సేవ కేంద్రాలు పేరుతో పూర్తిగా వారే సేవలు చేసే ఈ ప్రక్రియ ప్రమాదకరమని, ప్రజల ఆస్తులకు ముప్పు తప్పదని పలువురు ఆందోళన చెందుతున్నారు. దస్తావేజు లేఖరుల ఉనికి కూడా ప్రశ్నార్థకంగా మారిందని పేర్కొంటున్నారు. డాక్యుమెంట్ల తయారీలో లేఖరులదే కీలక పాత్ర. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చే భూమి, ఇళ్లు, వివాహ ధ్రువీకరణ, మార్టిగేజ్ తదితర పత్రాల తయారీలో ఎంతో శ్రమించి పూర్తిస్థాయి సమాచారంతో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందించడంతోపాటు సజావుగా ప్రక్రియ జరిగేలా చూస్తారు. లబ్ధిదారులకు, రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బందికి వారధిగా పనిచేస్తున్నారు. ఎన్నో ఏళ్ల అనుభవంతో పనిచేస్తున్న వీరి పనిని ఇలా పూర్తిస్థాయిలో ప్రైవేటు వారికి అప్పగిస్తే పారదర్శకత లోపించే అవకాశం ఉందని వాదనలు వినిపిస్తున్నాయి. దస్తావేజు రాయడమంటే .. కేవలం కంప్యూటర్లో డేటా నమోదు చేయడమే కాదని పలువురు చెబుతున్నారు. స్థానిక చరిత్ర, పాతలింకు దస్తావేజులు, సరిహద్దులు, హక్కుల వివరాలపై అవగాహన ఉన్న దస్తావేజు లేఖరులు ఇప్పటివరకూ వివాదాలకు అవకాశం లేకుండా డాక్యుమెంట్లు సిద్ధం చేస్తున్నారు. బాధ్యతలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే భవిష్యత్తులో ప్రజా ఆస్తులకు రక్షణ ఉండదని, ఈ విషయంలో వివాదాలు పెరిగే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్టాంపు పేపర్ల స్థానంలో తెల్ల కాగితంపైనే రిజిస్ట్రేషన్ చేయడంతోపాటు ప్రతి రిజిస్ట్రేషన్కు రూ. 2 వేలు వసూలు చేయాలని యోచిస్తోందన్నారు. ఆర్ఎస్కేల ఏర్పాటుపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి ప్రశ్నార్థకంగా దస్తావేజు లేఖరుల జీవనోపాధి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి సర్కారు పనులు ప్రజా ఆస్తుల పరిరక్షణపైనా ఆందోళన నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా లేఖరుల పెన్ డౌన్ ప్రభుత్వ యోచనను వ్యతిరేకిస్తూ జిల్లాలోని నరసరావుపేట, చిలకలూరిపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, క్రోసూరు, అమరావతి, పిడుగురాళ్ల, గురజాల, మాచర్లలోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని దస్తావేజు లేఖరులు ఈ నెలలో రెండు రోజులపాటు పెన్డౌన్ చేపట్టారు. ఆ రెండు రోజుల్లో ప్రభుత్వానికి రూ. 4 కోట్లకుపైగా ఆదాయం గండి పడిందని చెబుతున్నారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రైవేటీకరణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని, కొన్ని దశాబ్దాలుగా దీనిపై ఆధారపడిన దస్తావేజు లేఖరులు, డీటీపీ ఆపరేటర్లు, స్టాంపు వెండర్లు తదితర లక్షలాది మంది జీవనోపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతూ ఈ నెల 20 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పెన్డౌన్ కార్యక్రమానికి దస్తావేజు లేఖరులు పిలుపునిచ్చారు. జీవో నంబర్ 396 కారణంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఎస్కేల ఏర్పాటు మానుకోవాలని, దస్తావేజు లేఖరులు నిరవధికంగా పెన్డౌన్ నిర్వహించనున్నారు. విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం ఆదివారం 513.40 అడుగులకు చేరింది. ఎస్ఎల్బీసీకి 900 క్యూసెక్కులు విడుదలవుతోంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రైవేట్పరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇక రిజిస్ట్రేషన్ కార్యాలయాలు అలంకారప్రాయంగా మారనున్నాయి. చంద్రబాబు సర్కారు పీపీపీ విధానాన్ని తీసుకువచ్చేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. రిజిస్ట్రేషన్ సేవ కేంద్రాలు (ఆర్ఎస్కేలు) ఏర్పాటు చేసి ప్రైవేట్ వ్యక్తులకు పనులను కట్టబెట్టేందుకు సన్నద్ధమవుతోంది. దీంతో ప్రజలకు వేగంగా సేవలు అందుతాయని ప్రభుత్వం చెబుతోంది. జిల్లాలో వేల మందికి ఉపాధి పోతుందని దస్తావేజు లేఖరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ఆస్తుల పరిరక్షణపైనా అనుమానాలు తలెత్తుతున్నాయి. -
గుంటూరు నగరంలో భారీ వర్షం
నెహ్రూనగర్: గుంటూరు నగరంలో ఆదివారం రాత్రి 7.30 గంటలకు భారీ వర్షం కురిసింది. కేవలం గంట వ్యవధిలోనే కురిసిన భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా మూడు వంతెనలు, కొత్తపేట, విద్యానగర్, కొరిటెపాడు, పాతగుంటూరు, అమరావతి రోడ్డులోని ప్రధాన రహదారిపై వరద నీరు భారీగా చేరడంతో చెరువును తలపించింది. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో మోకాలి లోతున నీరు చేరింది. దీంతో ఆయా మార్గాల్లో వెళ్లే వాహనదారులు, ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్లే స్వల్ప వ్యవధిలో కురిసిన వర్షానికే రోడ్లు జలమయం అవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మహంకాళికి నిమ్మకాయల అలంకరణ
దుగ్గిరాల: దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి నిమ్మకాయల దండలతో అలంకరించారు. భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తులు వేలాది సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు స్వీకరించి, మొక్కులు తీర్చుకున్నారు. అసౌకర్యం కలగకుండా ఆలయ ఈఓ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. జాతీయ స్థాయిలో రెండోస్థానం కైవసం గుంటూరు మెడికల్: గుంటూరు మెడికల్ కాలేజ్, గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ పోలవరపు కృష్ణప్రియ క్విజ్ పోటీల్లో జాతీయ స్థాయిలో సత్తా చాటారు. న్యూఢిల్లీలో శనివారం ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులకు జాతీయ స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఏపీ తరఫున గుంటూరు మెడికల్ కాలేజ్ నుంచి పాల్గొన్న డాక్టర్ కృష్ణప్రియ జాతీయస్థాయిలో రెండోస్థానంలో నిలిచారు. ఇటీవల ఏపీలో జరిగిన రాష్ట్రస్థాయి క్విజ్ పోటీల్లో స్టేట్ ఫస్ట్ సాధించిన డాక్టర్ కృష్ణప్రియ జాతీయ స్థాయిలో చేరుకున్నారు. ఆదివారం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్వీ సుందరాచారి, న్యూరాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డా. గాజుల రామకృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అజ్మ, పలువురు పీజీ వైద్య విద్యార్థులు ఆమెకు అభినందనలు తెలిపారు. డాక్టర్ గాజుల రామకృష్ణ 2014లో జాతీయ స్థాయి క్విజ్ పోటీల్లో ప్రథమస్థానం సాధించి రికార్డు సృష్టించగా.. నేడు గుంటూరు వైద్య కళాశాల, గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీకి చెందిన డాక్టర్ కృష్ణప్రియ రెండో స్థానంలో నిలిచారు. తద్వారా గుంటూరు వైద్య కళాశాల పేరు మరోమారు జాతీయస్థాయిలో మారుమోగేలా చేశారు. ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాలలో ఆదివారం రికార్డు స్థాయిలో భక్త బృందాలు సారెను సమర్పించాయి. జగన్మాత దుర్గమ్మను భక్తులు తమ ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా భావించి పసుపు, కుంకుమ, పూజా సామగ్రి, చీర, మిఠాయిలను సమర్పించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు, తిరిగి సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి 9.30 గంటల వరకు సారె సమర్పణలు కొనసాగాయి. దీంతో ఉదయాస్తమాన సేవగా సారె సమర్పణ కార్యక్రమం జరుగుతుందా అనే భావన భక్తుల్లో కలిగింది. ఆషాఢ మాసం తొలి ఆదివారం కావడంతో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిందని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. అన్ని టికెట్ల విక్రయాలు రద్దు.. గతంలో శుక్రవారం, ఆదివారాల్లో కేవలం అంతరాలయ దర్శనాలను మాత్రమే రద్దు చేసేవారు. అయితే ఆదివారం భారీగా భక్తులు తరలిరావడంతో అన్ని టికెట్ల విక్రయాలను రద్దు చేసి ఉచితంగా ఆయా క్యూలైన్ మార్గాల్లో భక్తులను దర్శనానికి అనుమతించారు. ముందుగా ఆన్లైన్లో రూ. 500 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు ప్రత్యేక సమాయాన్ని కేటాయించారు. వారికి మాత్రమే అంతరాలయ దర్శనం కల్పించారు. -
నియామక తేదీ ఆధారంగానే సీనియార్టీ జాబితాలు రూపాందించాలి
ఎస్టీయూ నాయకులు గుంటూరు ఎడ్యుకేషన్: ఉపాధ్యాయుల ఉద్యోగ నియామక తేదీ ఆధారంగానే సీనియార్టీ జాబితాలు రూపొందించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘ (ఎస్టీయూ) నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉగ్గం మహంకాళరావు, జె.శంకర వరప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కంకరగుంటలోని ఎస్టీయూ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కొత్త జిల్లాల వారీగా చేపడుతున్న ఉపాధ్యాయుల కేటాయింపులో భాగంగా రూపొందిస్తున్న జిల్లా సీనియారిటీ జాబితాల్లో ఉపాధ్యాయులందరికీ పూర్తి న్యాయం జరగాలని, వారి అసలు నియామక తేదీని ప్రామాణికంగా తీసుకుని సీనియారిటీని కల్పించాలన్నారు. సుదీర్ఘకాలంగా ప్రభుత్వ సేవలో ఉంటూ విద్యావ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయుల హక్కులను కాలరాసే విధంగా సీనియారిటీ జాబితాల రూపకల్పన ఉండకూడదని పేర్కొన్నారు. ముఖ్యంగా కింది వర్గాల ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. జిల్లా పునర్విభజన అనేది కేవలం ప్రభుత్వ పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన ప్రక్రియ అని, దీని ప్రభావంతో దశాబ్దాలుగా ప్రభుత్వ సేవలో ఉన్న ఉపాధ్యాయులు తమ సీనియారిటీని కోల్పోయే పరిస్థితి రావడం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఏ ఒక్క ఉపాధ్యాయుడికి అన్యాయం జరిగినా ఎస్టీయూ ఊరుకోదని హెచ్చరించారు. విద్యాశాఖ, ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఉపాధ్యాయుల అసలు నియామక తేదీ ప్రకారమే తుది సీనియారిటీ జాబితాలను సిద్ధం చేసి, ఉపాధ్యాయ లోకానికి నమ్మకం కలిగించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్టీయూ గుంటూరు జిల్లా అసోసియేటెడ్ అధ్యక్షుడు కొరివి విజయబాబు, తదితరులు పాల్గొన్నారు. బాపట్ల: ఆషాఢ మాసంలో అత్యంత ప్రీతికరమైన ఆషాఢ శుద్ధ పంచమి (స్కంద పంచమి) పర్వదినాన్ని పురస్కరించుకుని బాపట్ల పట్టణంలో సుబ్రహ్మణ్యస్వామి వారి లలితా త్రిపుర సుందరి పీఠం ఆధ్వర్యంలో ఆదివారం (స్కంద షష్టి) రోజున విశేష పూజలు, సర్పసూక్త హోమం అత్యంత వైభవం నిర్వహించారు. నిర్వాహకులు నెమలికంటి హనుమంతరావు మాట్లాడుతూ ఉదయం కావడి ద్రవ్యాలతో సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేష అభిషేక కార్యక్రమం, అనంతరం హస్త, కృత్తిక, విశాఖ, ఆశ్లేష నక్షత్రాల జాతకుల కోసం, శని, రాహు, కేతు గ్రహ జపాలు జరిగాయి. సుబ్రహ్మణ్యస్వామి వారి మూల మంత్రంతో సర్పసూక్త మహా మంత్ర దివ్య హోమంతోపాటు లక్ష్మీ గణపతి, రుద్ర, మృత్యుంజయ మంత్రాలతో విశేష హోమ క్రతువులు జరిగాయి. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన అఖండ పుష్పార్చన కార్యక్రమంతోపాటు సుబ్రహ్మణ్య స్వామి స్వరూపులైన వేద విద్యార్థులకు, చిన్న పిల్లలకు బ్రహ్మచారుల పూజా కార్యక్రమంలో భక్తులు వేద విద్యార్థులను పూజించారు. పూర్ణాహుతి అనంతరం భక్తులందరికీ స్వామి వారి అన్నసంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో బాపట్ల పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు రొంపిచర్ల కేశవాచార్యులు, శ్రీనివాసుల విఖనస మూర్తి, పరాశరం రఘురామ్, కౌండిన్య, సాయి వెంకట్ పాల్గొన్నారు. -
అద్దె బస్సు డ్రైవర్ల సమ్మె విరమణ
రేపల్లె: బాపట్ల జిల్లా వ్యాప్తంగా ఐదు రోజులుగా కొనసాగుతున్న అద్దె బస్సు డ్రైవర్ల సమ్మెకు ఆదివారం తెరపడింది. నూతన వేతన ఒప్పందం కుదరడంతోపాటు పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ వంటి కార్మిక సంక్షేమ సదుపాయాలను అమలు చేయడానికి అద్దె బస్సు యజమానులు అంగీకరించడంతో డ్రైవర్లు ఆదివారం ఉదయం నుంచి విధుల్లో చేరారు. అద్దె బస్సు యూనియన్ (సీఐటీయూ) డిపో అధ్యక్షుడు జి.వెంకటేశ్వరరావు, గౌరవాధ్యక్షుడు, సీఐటీయూ బాపట్ల జిల్లా కోశాధికారి సిహెచ్.మణిలాల్లు మాట్లాడుతూ చీరాలలో అధిక సంఖ్యలో అద్దె బస్సులు ఉండటంతో చీరాల ఆర్డీవో ఆధ్వర్యంలో ఆర్టీసీ, పోలీసు అధికారులు, అద్దె బస్ యజమానులు, డ్రైవర్లు, సీఐటీయూ నాయకుల మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా ముగిశాయని తెలిపారు. ఒప్పందం ప్రకారం ప్రస్తుతం అమలులో ఉన్న ఓటీ బస్ డ్రైవర్ రోజువారీ వేతనం రూ.1,100 నుంచి రూ.1,200, నైట్ అవుట్ బస్ డ్యూటీ వేతనం రూ.1,200 నుంచి రూ.1,300కు పెంచేందుకు యజమానులు అంగీకరించారన్నారు. ప్రతి డ్రైవర్కు నెలకు సుమారు రూ.1,500 అదనపు ఆదాయం లభించనుందని చెప్పారు. ఈ నూతన వేతన ఒప్పందాన్ని జిల్లా వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారన్నారు. అదనంగా ప్రతి బస్సుకు పనిచేసే ఇద్దరు డ్రైవర్లకు పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ వంటి చట్టబద్ధమైన కార్మిక సంక్షేమ సదుపాయాలను కార్మిక శాఖ సమక్షంలో అమలు చేయడానికి కూడా యజమానులు అంగీకరించినట్లు నాయకులు తెలిపారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కార్మిక సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు డ్రైవర్లు, యజమానులు, ఆర్టీసీ అధికారులు కలిసి క్రమం తప్పకుండా సంయుక్త సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మదర్ థెరిసా అద్దె బస్ డ్రైవర్స్ యూనియన్ (సీఐటీయూ) కన్వీనర్ కె.గోపి, కోశాధికారి జి.రవిబాబు, డ్రైవర్లు భాస్కర్, ఇమ్రాన్, బాషా, రవి, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆధునిక సాంకేతికతతో జీవితంలో విజయం తథ్యం
తెనాలి: ఆండ్రాయిడ్ టెక్నాలజీ సెల్ఫోన్లలో గల వందలాది అప్లికేషన్స్ను విద్యార్థులు నేర్చుకుంటే జీవితంలో విజయం సాధించటం తథ్యమని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇన్చార్జి రెక్టార్ ఆర్.శివవరామప్రసాద్ సూచించారు. పట్టణానికి చెందిన మొవ్వా విజయలక్ష్మి సేవాసమితి ఆధ్యర్యంలో ఆదివారం స్థానిక కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటైన ప్రత్యేక సభకు సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు మొవ్వా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. సభలో ఆర్.శివరామప్రసాద్ ‘విద్యార్థులు–భవిష్యత్ సవాళ్లు’ అంశంపై మొవ్వా విజయలక్ష్మి స్మారక ప్రసంగం చేశారు. సెల్ఫోన్లో అనవసర విషయాలను వీక్షించటం మానుకోవాలని స్పష్టం చేశారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ జీవితంలో ఎదగాలని చెప్పారు. తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ తన ప్రసంగంలో బాల్యం నుండే తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవిస్తూ ఈర్ష్య, అసూయలకు ఆస్కారం లేకుండా ఇతరులకు చేతనైన సేవ చేస్తూ సంతృప్తికరంగా గడపాలని సూచించారు. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే తల్లికి నమస్కరించి చెడు పనులకు దూరంగా ఉంటూ, తోటివారికి సహాయం చేస్తూ, సన్మార్గంలో నడవాలని చెప్పారు. దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి మాట్లాడుతూ తల్లిదండ్రులు, పిల్లలు ప్రతి రోజూ కొంత సమయం మాట్లాడుకోవాలని సలహానిచ్చారు. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ కొలసాని రామ్చంద్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మంచి వ్యక్తిత్వాన్ని అలవరచుకుని క్రియాశీలత, లక్ష్యాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. గత మార్చిలో జరిగిన పదోతరగతి పరీక్షల్లో 550 పైగా మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.5 వేల చొప్పున మొత్తం 60 మందికి రూ.3 లక్షలను బహూకరించి, జ్ఞాపికలను అందజేశారు. బెల్లంకొండ వెంకట్ స్వాగతం పలికిన సభలో డాక్టర్ మొవ్వా ఏసుబాబు, పట్టణ ప్రముఖులు ఈదర వెంకట పూర్ణచంద్, కన్నెగంటి మురళీకృష్ణ, గుత్తా వెంకటరత్నం, నల్లూరి వెంకటేశ్వరరావు, ఓంకార్ ప్రసాద్, కొత్త హరిప్రసాద్, డాక్టర్ వాసిరెడ్డి నాగేశ్వరప్రసాద్, డాక్టర్ ధూళిపాళ్ల రవీంద్రనాథ్, షేక్ బాష, వెంపటి సత్యనారాయణ, మొవ్వా విజయలక్ష్మి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. -
సభ్యసమాజం తలదించుకునేలా టీడీపీ నాయకుడి దుశ్శాసన పర్వం
యడ్లపాడు: రోడ్డు ప్రమాదంలో రెండు బైక్లు ఢీకొన్ని ప్రమాదంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని బోయపాలెం గ్రామంలోని మసీదు వద్ద ఈనెల 17వ తేదీన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యడ్లపాడు పాత రెవెన్యూ కార్యాలయం వద్ద నివాసం ఉండే ఒంటిపులి శ్రీనివాసరావు(34) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం సుమారు రాత్రి 9.50 గంటలకు జరిగిందని, మసీదు సమీపంలోని వాటర్ ప్లాంట్ వద్ద వాటర్ డంబెల్ను స్కూటీపై తీసుకెళ్తున్న క్రమంలో అదే సమయంలో శ్రీనివాసరావు ఆ వైపు రావడంతో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో శ్రీనివాసరావు రోడ్డుపై పడిపోవడంతో తలకు, కంటికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి బాధితుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, 108 వాహనంలో కాటూరు మెడికల్ వైద్యశాలకు తరలించారు. ఆస్పత్రికి చేరుకోగానే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో చిలకలూరిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. భార్య త్రివేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి కారణాలు ఎస్ఐ టి శివరామకృష్ణ ఛేదించారు. బోయపాలేనికి వలస వచ్చిన ఉత్తరాఖండ్ రాష్ట్రం, ఉద్దమ్సింగ్నగర్ జిల్లాకు చెందిన సోనిబ్గా గుర్తించామన్నారు. గ్రామంలోనే సెలూన్షాపులో పనిచేస్తున్న అతన్ని ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. చీరాల రూరల్: అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఓ మహిళ జీవితంపై విరక్తి చెంది రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది. జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య ఆదివారం వివరాలు తెలిపారు. ఒంగోలు మరాఠీపాలేనికి చెందిన అనంత ఇందిరాదేవి (56) కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. మందులు వాడుతున్నప్పటికీ వ్యాధి తీవ్రత తగ్గకపోవడంతో ఇక వ్యాధి ఎప్పటికీ తగ్గదేమోనని భావించి జీవితంపై విరక్తి చెందింది. వేటపాలెం–చినగంజాం రైల్వేస్టేషన్ల మధ్య మూడో లైన్లో గుర్తుతెలియని రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
ప్రత్యేక టెట్లో మార్పులు చేయాలి
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు గుంటూరు ఎడ్యుకేషన్: దసరా సెలవుల్లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం నిర్వహించనున్న ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) లో పలు కీలక మార్పులు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సాంబశివపేటలోని ఏసీ కళాశాలలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన టెట్ తెలుగు అవగాహన తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డీఎస్సీకి అనుసంధానంగా నిర్వహించే టెట్కు, సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు నిర్వహించే టెట్లో మార్పులు లేనట్లయితే అది స్పెషల్ టెట్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. స్పెషల్ టెట్లో కామన్గా అందరికీ పాస్ మార్కు తగ్గింపుగా ఉండాలని, ఆఫ్లైన్ విధానంలోనే పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2ఏ పరీక్షలో ఉపాధ్యాయుడు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు వరకే సిలబస్ ఉండాలని, తనవి కాని సబ్జెక్టును తొలగించాలన్నారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం.కళాధర్ మాట్లాడుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నిర్వహించిన సైకాలజీ, ఇంగ్లీష్, తెలుగు అవగాహన తరగతులు విజయవంతమయ్యాయని, మహిళా ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. టెట్ అవగాహన తరగతులను నిర్వహించేందుకు సహకారం అందించిన ఏసీ కళాశాల యాజమాన్యానికి, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. తరగతుల ముగింపు కార్యక్రమంలో తెలుగు రీసోర్స్ పర్సన్ ఆర్.వెంకటరావును సత్కరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షురాలు ఏఎన్ కుసుమకుమారి, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ టీఎస్ఎల్ఎన్ మల్లేశ్వరరావు, రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు, జిల్లా సహాధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఎండీ షకీలా బేగం, జిల్లా కోశాధికారి ఎండీ దౌలా, యూత్ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
చిలకలూరిపేటలో ఆటో బోల్తా
ఐదుగురికి గాయాలు చిలకలూరిపేటటౌన్: పట్టణంలోని పురుషోత్తమపట్నం వినాయక గుడి వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ముందు వెళ్తున్న ఆటో ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న ఆటో ఢీకొని బోల్తా పడింది. ఆటో డ్రైవర్ వేముల కోటేశ్వరరావుతోపాటు ప్రయాణికులు తోక చెంచు, నాగేంద్రం, మేడికొండి చంద్ర, పలపర్తి మేరీ, పలేపు వెంకాయమ్మలకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన నాగేంద్రంను మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారికి చిలకలూరిపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందుతోంది.బాధితులంతా ఆదివారం ప్రార్థనలు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెనాలిరూరల్: హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ నాజరుపేటలో ఈ నెల 15వ తేదీ పొద్దుపోయాక కొల్లిపర కోటేశ్వరరావును అని తల్లిదండ్రులు భాస్కరరావు, బుల్లెమ్మ, తమ్ముడు మరియదాసు దాడి చేసి హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య జరిగిన నేపథ్యం, దారి తీసిన ఘటనలు వంటి వివరాలను సోమవారం నిర్వహించనున్న విలేకర్ల సమావేశంలో అధికారులు వెల్లడించనున్నారు. గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళాశాలల్లో వ్యవసాయ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు గతంలో ఆన్లైన్లో నమోదు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 21, 22వ తేదీలలో రెండవ విడత వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ డాక్టర్ ఎ.మణి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. మాజీ సైనికుడు గోవిందరావు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ మాజీ సైనిక సంఘాల జేఏసీ ఏర్పాటైంది. ఆదివారం గవర్నర్పేటలోని స్వాతంత్య్ర సమరయోధుల భవనంలో మాజీ సైనిక సంఘాల అఖిలపక్ష సమావేశం జరిగింది. మాజీ సైనికుడు గోవిందరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జేఏసీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సైనికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ శాఖలతో సమన్వయం, పెండింగ్ సమస్యల పరిష్కారం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించామన్నారు. రాష్ట్రంలో మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలను సమర్థంగా పరిష్కరించేందుకు రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేశారన్నారు. మాజీ సైనికులకు ఎలాంటి సమస్య ఎదురైనా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కారం చూపడానికి ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. సమావేశంలో ఏపీ మాజీ సైనిక హక్కుల పోరాట సమితి, ఏపీఎక్స్–సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్, ఏపీఆర్ఎంఎస్ఎస్ఎస్, ఎన్ ఎక్స్ సీసీ, ఏబీపీఎస్ఎస్పీ, ఏఐఈఎస్ఎల్ఎస్, ఎక్స్ సైలర్స్ ఆఫ్ ఇండియన్ నేవీ, రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి మాజీ సైనిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
కరోనా కలకలం
● మంగళగిరిలో ఇరువురికి కరోనా పాజిటివ్ ● తాజాగా బాపట్ల జిల్లావాసికి నిర్ధారణ ● జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు జీజీహెచ్లో ప్రత్యేక వార్డు గుంటూరు జీజీహెచ్లో కరోనా బాధితుల కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గిరిజవోలు దుర్గాప్రసాద్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గుంటూరు జీజీహెచ్లో ప్రత్యేకంగా కరోనా టెస్టింగ్ కేంద్రాన్ని, బాధితుల కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. ఆసుపత్రి మొత్తం ప్రతి పడకకు ఆక్సిజన్ పైపులైను ఏర్పాటు చేయడంతోపాటు, సహజంగా ఆక్సిజన్ తయారు చేసే భారీ ఆక్సిజన్ ప్లాంట్లను సైతం ఆసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఎమర్జన్సీ మెడిసిన్ వైద్య విభాగం వద్ద గతంలో స్టెప్డౌన్ ఐసీయూ వార్డుగా ఉన్న దానిని కరోనా వార్డుగా ఏర్పాటు చేశామని సూపరింటెండెంట్ వెల్లడించారు. -
తాడికొండ గురుకుల పాఠశాలను కొనసాగించాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ లక్ష్మీపురం: తాడికొండలోని బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాలను మూసివేయటాన్ని, దీనిని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన విద్యార్థు తల్లిదండ్రులు, ఎస్.ఎఫ్.ఐ, కె.వి.పి.యస్ సంఘాల నాయకులపై పోలీసులు దౌర్జన్యంగా దాడిచేసి అరెస్టు చేయటాన్ని సీపీఎం జిల్లా కమిటీ ఖండిస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వై.నేతాజీ పేర్కొన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక దశాబ్దాలుగా జిల్లాలోని పేద విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన గురుకుల పాఠశాలను మూసివేయడం వల్ల దళిత, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య దూరమవుతుందని అన్నారు. రాజధానిలో వేల ఎకరాల భూములను సేకరించి అనేక కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా కట్టబెడుతున్నారని, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్కు కూడా అలాగే భూములు కేటాయించి నడపవచ్చని, ఏకపక్షంగా గురుకుల పాఠశాలను తరలించడం సరికాదన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లో నీట్, జేఈఈ కోచింగ్ ఇవ్వడానికి ప్రైవేటు వారిని ఆహ్వానించి వారికి కట్టబెట్టటాన్ని సీపీఎం వ్యతిరేకిస్తుందన్నారు. అమర్యాదగా, దౌర్జన్యంగా ప్రవర్తించిన సీఐపై చర్య తీసుకోవాలని, తాడికొండలో అంబేద్కర్ గురుకుల పాఠశాలను కొనసాగించటానికి ప్రభుత్వం పూనుకోవాలని, సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ అమరావతిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాశం రామారావు, ఎన్.భావన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వివాహిత ఆత్మహత్య
కొల్లూరు: భర్త అనారోగ్య సమస్యలు.. వైద్యం కోసం చేసిన అప్పులతో మానసిక వేదనకు గురవుతున్న ఓ వివాహిత ఉరి పెట్టుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని తోకలవారిపాలెంలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. తోకలవారిపాలేనికి చెందిన వర్రె నాగమల్లేశ్వరరావు పెద్ద కుమార్తె వైష్ణవిని అదే గ్రామానికి చెందిన బంధువు వై. శ్రీనివాసరావుకు ఇచ్చి తొమ్మిదేళ్ల కిందట వివాహం చేశారు. భర్త ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ భార్య, చిన్నారులైన ఓ కుమారుడు, కుమార్తెతో కలసి గుంటూరులో నివసించేవారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్రీనివాసరావు గుంటూరు నుంచి వచ్చి తన తల్లిదండ్రులు, భార్య పిల్లలతో కలసి ఉంటున్నాడు. ఉద్యోగ రీత్యా వెళ్లి వస్తున్న ఆయన అనారోగ్యం కారణంగా వైద్యం కోసం అప్పులు చేయడంతో అప్పులపాలయ్యాడు. ఆవేదనతో వైష్ణవి కొద్ది రోజులుగా మానసికంగా కుంగిపోతుంది. శనివారం మధ్యహ్నం అదే గ్రామంలో ఉన్న తన పుట్టింటికి వెళ్లిన వైష్ణవి తన తండ్రికి అప్పులు, తన భర్త అనారోగ్య సమస్యల గురించి చెప్పి ఆవేదన చెందింది. అన్నీ సర్దుకుంటాయని ధైర్యం చెప్పి పంపారు. సాయంత్రం సమయంలో వైష్ణవి అత్తింటి వద్ద భారీగా జనం ఉండటంతో వెళ్లి చూసిన ఆమె తండ్రి వైష్ణవి ఉరి పెట్టుకొని ఉండటం గమనించాడు. బంధువుల సాయంతో ఆమెను హుటాహుటిన వేమూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తండ్రి ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ కిశోర్బాబు తెలిపారు. -
ఇనుపరాడ్లతో కారు అద్దాలు ధ్వంసం
నరసరావుపేట రూరల్: ఇనుప రాడ్లతో కారు అద్దాలు ధ్వంసం చేసి చంపుతామని బెదిరింపుపై మండలంలోని లింగంగుంట్ల గ్రామానికి చెందిన సాగిరెడ్డి వెంకటరెడ్డి రూరల్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గ్రామంలోని తన ఇంటిపక్కనే తన తండ్రిపేరుపై ఉన్న తొమ్మిది సెంట్ల స్థలం తమది అంటూ సమీపంలో నివాసం ఉండే కందుల మర్రిరెడ్డి, విజయలు గత కొంతకాలంగా తమతో గొడవలు బడుతున్నారన్నారు. దీనిపై అనేకమార్లు గ్రామ పెద్దలతో పంచాయితీ నిర్వహించినా వారు ఆ స్థలం తమదే అంటూ ఆ స్థలంలో చెత్త వేస్తున్నారన్నారు. ఆదివారం తాను ఒక కూలీ సహాయంతో స్థలంలోని చెత్తను శుభ్రం చేస్తుండగా మర్రెడ్డి, ఆయన కుమారుడు ప్రణీత్రెడ్డి అసభ్యపదజాలంతో తిడుతూ ఇనుపరాడ్లతో తన ఇంటిముందున్న కారు ముందు, వెనుకా అద్దాలను పగులకొట్టారన్నారు. దీంతోపాటు తనపై దాడిచేయగా తాను తప్పించుకొని ఇంట్లోకి వెళ్లగా ఈసారి నిన్ను ప్రాణాలతో వదిలేశామని, స్థలం జోలికి వస్తే చంపుతామని బెదిరించారన్నారు. వెంటనే వారిపై కేసు నమోదుచేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు. -
నిర్వీర్యమైన పంటల బీమా పఽథకం
సాక్షి, నరసరావుపేట: ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు నష్టం జరిగిన సమయంలో ఆసరాగా నిలవాల్సిన పంటల బీమా పథకం కూటమి ప్రభుత్వంలో నిర్వీర్యమైందని పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో... అనుకోకుండా సంభవించే ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ పొందటానికి పంటల బీమా అనేది మంచి ఉపశమనం పొందే అవకాశముందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం రైతులకు ఉపయోగపడాల్సిన పంటల బీమా పథకాన్ని పూర్తిగా ఉపయోగపడకుండా చేసిందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కర్షకుల మేలుకోరే ప్రజానాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల పక్షాన బీమాను చెల్లించి వారిని కష్టకాలంలో ఆదుకున్నారన్నారు. అయితే ఆ పథకాన్ని రద్దు చేసి రైతులే ప్రీమియం కట్టేలా నిబంధనలు మార్చి జరిగిన నష్టానికి న్యాయమైన పరిహారం దక్కే హక్కు లేకుండా చేశారన్నారు. గత రెండేళ్లలో వరుస ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయినా వారికి బీమా ధీమాను ఇవ్వలేదన్నారు. దీంతో రైతులు రైతులు బీమా కట్టడానికి ముందుకు రాలేదన్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. గత వైఎస్సార్సీపీ పాలనలో బీమా ప్రీమియం పూర్తిగా ప్రభుత్వమే భరించిందని గుర్తుచేశారు. -
విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ
నరసరావుపేట రూరల్: లింగంగుంట్ల శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా విద్యార్థినులకు 101 సైకిళ్లను పంపిణీ చేశారు. పాఠశాలలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో బ్యాంక్ జోనల్ హెడ్ ఎం.పిచ్చయ్య, రీజినల్ హెడ్ జీవీ రమణారావు, నరసరావుపేట శాఖ మేనేజర్ పి.వెంకట రవికుమార్లు అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థినులను ప్రొత్సహించాలనే ఉద్దేశంతో సైకిళ్లు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు. హెచ్ఎం పార్వతి, ఉపాధ్యాయులు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నరసరావుపేట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకటరామిరెడ్డి జయంతిని పురస్కరించుకొని శనివారం వెంకటరామ్ మెమోరియల్ జీబీఆర్ హాస్పిటల్లో సత్తెనపల్లి సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్భార్గవరెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి భవనం చేసిన సేవలను కొనియాడారు. పలువురు నాయకులు పాల్గొన్నారు. మంగళగిరి టౌన్: విజయవాడ కనకదుర్గ అమ్మవారికి మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో శనివారం సారె సమర్పించారు. ఈ మేరకు మంగళగిరి మెయిన్ బజారులోని ఆర్యవైశ్య కల్యాణ మండపం నుంచి విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవస్థానం వరకు పెద్ద ఎత్తున మహిళలు తరలివెళ్లారు. తొలుత మెయిన్ బజారులోని ఆరవైశ్య కల్యాణ మండపం నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వరకు మహిళా సంఘం ప్రతినిధులు చీర, పూలు, పండ్లు, స్వీట్లతో ఊరేగింపుగా వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ధ్వజ స్తంభం వద్ద కొబ్బరికాయలు కొట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య మహిళ సంఘం ప్రధాన కార్యదర్శి త్రిపురమల్లు అపర్ణ పార్వతి, కోశాధికారి వెంకట కీర్తి, కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య సంఘాల సమైఖ్య అధ్యక్షుడు సంకా బాలాజీ గుప్త హాజరయ్యారు. మంగళగిరి టౌన్: ఆపరేషన్ క్లీన్ స్వీప్ పారిశుద్ధ్య కార్యక్రమంలో మూడు లక్షల జనాభాకు పైబడిన పట్టణ స్థానిక సంస్థల విభాగంలో మంగళగిరి – తాడేపల్లి నగరపాలక సంస్థ రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించింది. ఈ మేరకు గుడివాడలో జరిగిన రాష్ట్రస్థాయి వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఎంటీఎంసీ కమిషనర్ అలీంబాషా అవార్డును, ప్రశంసా పత్రాన్ని శనివారం అందుకున్నారు. స్వచ్ఛత, పారిశుద్ధ్య నిర్వహణలో ఎంటీఎంసీ కనబర్చిన విశిష్ట పని తీరుకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించినట్లు అధికారులు తెలిపారు. నగర పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య కార్యక్రమాల అమలులో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ విజయం సాధించినట్లు పేర్కొన్నారు. -
మద్దిరాల పీఎంశ్రీ జేఎన్వీ విద్యార్థుల ప్రతిభ
యడ్లపాడు: మద్దిరాల జవహర్ నవోదయ విద్యాలయంలో రెండురోజుల వైజ్ఞానిక ప్రదర్శన శనివారం ముగిసింది. జేఎన్ఎస్ హైదరాబాద్ రీజియన్ పరిధిలోని 9 జవహర్ నవోదయ విద్యాలయాలకు చెందిన విద్యార్థులు 60 రకాల ప్రాజెక్టులతో హాజరై ప్రదర్శనలో పాల్గొన్నారు. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని, సృజనాత్మకతను పెంపొందించే లక్ష్యంతో విద్యాలయ ప్రిన్సిపాల్ నల్లూరి నరసింహారావు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో బాల శాస్త్రవేత్తలు రూపొందించిన అంశాలు అందర్నీ ఆకట్టుకుని ఆలోచింపజేశాయి. ముఖ్య అతిథులు చేతుల మీదుగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. తీవ్ర పోటీ నడుమ సాగిన ఈ ప్రదర్శనలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యాలయాల వివరాలు ఇలా ఉన్నాయి. -
ఎరువు... బరువు!
సత్తెనపల్లి: ఎరువులు కావాలంటే రైతులు ముందుగా ఏపీ ఏఐఎంఎస్ యాప్లో నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే రైతులకు ఇబ్బందికరంగా తయారైంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ అన్నదాతల అవస్థలు వర్ణనాతీతంగానే ఉన్నాయి. దీనికి తోడు ఇక మీదట సాగు చేసే పంటలను ముందస్తుగా రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేయించాలని, తర్వాతే ఎంత మేర ఎరువులు ఇవ్వాలో నిర్ణయిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పైగా భూములు వెబ్ల్యాండ్లో ఉంటేనే ఎరువులు ఇస్తామని లేకుంటే ఇవ్వమని తెగేసి చెబుతున్నారు. నమోదైన మేరకే... గత ఏడాదిలో ఏ పంట సాగు చేశారు .. ప్రస్తుతం ఏ పంటను సాగు చేయనున్నారు.. పంట మార్పిడి చేస్తారా.. లేక అదే సాగు చేస్తారా .. అనే వివరాలను రైతు సేవా కేంద్రంలో నమోదు చేయించిన తర్వాతే రైతు పేరు, ఆధార్, భూమి రికార్డులను ఏపీ ఏఐఎంఎస్ యాప్లో సిబ్బంది పొందుపరుస్తారు. అనంతరం వివరాలు తీసుకొని ఏ ఎరువుల దుకాణం వద్దకు వెళ్లినా యాప్ లో నమోదైన మేరకు ఎరువులు ఇస్తారు. అదీ నమోదు చేసిన ఎరువులను ఒక్కసారిగా ఇవ్వరు. మూడు విడతలుగా అందజేస్తారు. ఒక్కో విడతకు 20 రోజుల నుంచి 30 రోజుల వ్యవధి ఉంటుంది. అధికంగా కావాలంటే ఎరువుల దుకాణంలో ఎక్కువ ధరలకు కొనుగోలు చేయాల్సి ఉంటుందని రైతులు వాపోతున్నారు. రైతుల అవసరాలకు అనుగుణంగా ఎరువులు సరఫరా చేయలేకే ప్రభుత్వం ఇప్పుడు యాప్ ఎత్తుగడ వేసిందని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. ఉద్యాన పంటలు సాగు చేసేవారితో పాటు ఏడాది పాటు మూడు పంటలు సాగు చేసే రైతుల కు ఈ ఎరువులు ఏ మూలకు సరిపోవు. ఖరీఫ్ సాగు లక్ష్యం : 1,60,138 హెక్టార్లు ఖరీఫ్కు అవసరమైన ఎరువులు : 1,08,636 మెట్రిక్ టన్నులు అందుబటులో ఉన్న ఎరువులు : 73,359 మెట్రిక్ టన్నులు -
మళ్లీ కరోనా కలవరం
ఆదివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2026పల్నాడులో ముందస్తు చర్యలు శూన్యం నరసరావుపేట టౌన్: జిల్లాకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉన్న నరసరావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి కరోనా పరిస్థితులను ఎదుర్కొనే స్థాయికి సిద్ధంగా లేకపోవటం ఆందోళన కలిగిస్తోంది. అవసరమైన అదనపు పడకలు, ఆక్సిజన్ సౌకర్యం, వెంటిలేటర్లు, అత్యవసర చికిత్సా పరికరాలు అందుబాటులో లేనట్లుగా తెలుస్తొంది. దీంతో పాటు వైద్యులు, సిబ్బందికి అవసరమైన రక్షణ పరికరాలు పీపీఈ కిట్లు, మాస్క్లు, గ్లౌజులు సరిపడినన్ని అందుబాటులో లేవు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో అనుమానితుల కోసం ప్రత్యేక ఐసోలేషన్ వార్డు, ఆర్టీపీసీఆర్ పరీక్షల సౌకర్యం, తగినన్ని పరీక్షా కిట్లు, ఆక్సిజన్ పడకలు, అత్యవసర చికిత్స పరికరాలను ముందుగానే సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈ దిశగా ఇప్పటివరకు స్పష్టమైన ఏర్పాట్లు కనిపించకపోవడం ప్రజల్లో కలవరపాటుకు గురిచేస్తుంది. ముఖ్యంగా ప్రాణవాయువు అందించి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వైద్యశాల్లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ నిర్వహణ లేక మూలకు చేరాయి. వాటిని వెంటనే వినియోగంలోకి తీసుకురాకుంటే అత్యవసర సమయంలో ఇబ్బందులు తప్పవు. ప్రత్యేక వార్డు సిద్ధం చేయాలి ఏరియా ఆస్పత్రిలో కరోనా అనుమానితుల కోసం ప్రత్యేక ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసి, అదనపు పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచాలి. వైద్యులు, నర్సులు, సిబ్బందికి అవసరమైన పీపీఈ కిట్లు, ఎన్–95 మాస్కులు, గ్లౌజులు తగినంతగా అందుబాటులో ఉండాలి. కరోనా లక్షణాలతో వచ్చే వారి నుంచి వెంటనే స్వాబ్లు సేకరించి పరీక్షలు నిర్వహించేలా వీటీఎం కిట్లు, స్వాబ్ కిట్లు, ఆర్టీపీసీఆర్ పరీక్షా సామగ్రిని అందుబాటులో ఉంచాలి. వైరస్ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే వ్యాప్తిని సమర్థంగా అరికట్టే అవకాశం ఉంటుంది. జ్వరాలపై ప్రత్యేక నిఘా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదవుతున్న జ్వరాలపై ప్రత్యేక పర్యవేక్షణ అవసరం. ప్రతిరోజు నమోదవుతున్న జ్వరాల వివరాలను సమీక్షించి, కరోనా అనుమానితులను గుర్తించాలి. వారి నమూనాలను వెంటనే పరీక్షలకు పంపించి, అవసరమైతే కాంటాక్ట్ ట్రేసింగ్ చేపట్టాలి. గ్రామ, వార్డు స్థాయిలో ఆరోగ్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది. తొలి కేసు గుర్తొస్తోంది... కరోనా తొలి దశలో పల్నాడు జిల్లాలో నమోదైన మొదటి కేసు నరసరావుపేటలోనే వెలుగు చూసింది. వరవకట్ట ప్రాంతాన్ని రెడ్జోన్గా ప్రకటించి భారీ స్థాయిలో నియంత్రణ చర్యలు చేపట్టారు. ఆ తర్వాత జిల్లాలో వైరస్ వేగంగా వ్యాపించి అనేక కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఆ చేదు జ్ఞాపకాలు ఇంకా ప్రజల మదిలో చెరిగిపోలేదు. నరసరావుపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాల జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యుల సలహా తీసుకోవాలి. అవసరమైన సందర్భాల్లో మాస్కు ధరించడం, చేతుల పరిశుభ్రత పాటించడం, రద్దీ ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా మళ్లీ వ్యాప్తి చెందే అవకాశాల నేపథ్యంలో కేసులు వచ్చిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే సిద్ధమైతేనే ప్రజల ఆరోగ్యాన్ని సమర్థంగా కాపాడగలమని నిపుణులు సూచిస్తున్నారు. -
అత్తింటికి కన్నం వేసిన అల్లుడు అరెస్ట్
తెనాలి రూరల్: భార్య పుట్టింటికి వెళ్లి రాకపోతుండడంతో అత్తపై కోపం పెంచుకుని అత్తింటికి కన్నం వేసిన అల్లుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నాయబ్రసూల్ వివరాలు వెల్లడించారు. మండలంలోని కొలకలూరు గ్రామానికి చెందిన సుద్దపల్లి సుజాత మనవరాలు మంగళగిరి ఎయిమ్స్లో చికిత్స పొందుతోంది. మనవరాలి వద్దకు కుటుంబమంతా ఈ నెల 8వ తేదీన వెళ్లి, మరుసటి రోజు తిరిగి వచ్చారు. ఇంటికి వేసి ఉన్న తాళం పగలగొట్టి ఉంది. లోపలికి వెల్లి చూడగా ఇంట్లో ఉంచిన రూ. 10 వేల నగదు, సుమారు 70 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. పోలీసులను ఆశ్రయించగా రూరల్ ఎస్ఐ కె. ఆనంద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. చోరీకి పాల్పడింది సుజాత అల్లుడే అని నిర్ధారణకు వచ్చారు. సుజాత కుమార్తె శిరీష తన భర్త, బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనేపూడికి చెందిన అయ్యంకి పసితో కుటుంబ కలహాల నేపథ్యంలో కొలకలూరులోని పుట్టింటికి వచ్చింది. ఎన్నిసార్లు అడిగినా భార్య కాపురానికి రావడానికి నిరాకరిస్తోంది. ఇందుకు అత్త సుజాత కారణమని అల్లుడు కక్ష పెంచుకున్నాడు. 8వ తేదీన ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకుని చోరీకి పాల్పడ్డాడని సీఐ తెలిపారు. నిందితుని నుంచి చోరీ సొత్తు స్వాధీనపర్చుకున్నట్టు వివరించారు. సమావేశంలో ఎస్ఐ ఆనంద్, సిబ్బంది ఉన్నారు. -
యాప్ను సద్వినియోగం చేసుకోండి
మాచర్ల: రాష్ట్రంలో అధికార పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అందర్నీ అణగదొక్కుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నందున ప్రతి కార్యకర్తతో పార్టీ నాయకత్వం అనుసంధానం అయ్యేలా జగన్ 2.0 యాప్ను మాజీ సీఎం జగన్ ప్రవేశపెట్టారని తెలిపారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు దీనిని ఉపయోగించుకోవాలని సూచించారు. శుక్రవారం మాచర్లలోని క్యాంపు కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలసి ఆయన యాప్ పోస్టర్ ఆవిష్కరించారు. తర్వాత విలేకరులతో మాట్లాడుతూ... టీడీపీ నాయకులు అత్యంత దారుణంగా రాజకీయాలు చేస్తూ తమ పార్టీ వారిపై కుట్రలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ కంటెంట్ను డిలీట్ చేసి కుట్రలు పన్నుతున్న నేపథ్యంలోనే జగన్ 2.0 యాప్ను ఆవిష్కరించారన్నారు. అందర్నీ చైతన్యపరచి ఈ యాప్లో భాగస్వాములను చేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు తాడి వెంకటేశ్వరరెడ్డి, యరబోతుల శ్రీనివాసరావు, పల్లపాటి గురుబ్రహ్మం, బోయ రఘురామిరెడ్డి, అబ్దుల్ జలీల్, బూడిద శ్రీను, పోతురెడ్డి కోటిరెడ్డి, నల్ల వెంకటరెడ్డి, మందా సంతోష్, మాచర్ల సుందరరావు, షేక్ మస్తాన్, పిల్లి కొండలు, బూదాల మరియమ్మ, అల్లి జీవన్, మైనార్టీ నాయకులు అబ్దుల్ సత్తార్, చికెన్ బాజి, నాయకులు మోరా రామకృష్ణారెడ్డి, కొంగర సుబ్రహ్మణ్యం, కొండా శివలింగరాజు, ఇంద్ర గౌడ్, బాలమ్మ, అనంతరావమ్మ, కారంపూడి చంద్రశేఖర్రెడ్డి, చిన్న బద్రు, దుర్గ, డేగ శివ, వేల్పుల గురవయ్య, కొమ్ము వెంకటేశ్వర్లు (బొంగురు), పులిమెల మాణిక్యం, సభావత్ రవినాయక్, సుబ్రహ్మణ్యం నాయక్, వై. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. యాప్ డౌన్లోడ్ చేసుకునే విధానం ఇదీ.. గూగుల్ ప్లే స్టోర్లో ‘జగన్ 2.0 సూపర్ యాప్’ అని టైపు చేయగానే వైఎస్ జగన్ చిత్రంతో కూడిన యాప్ కనిపిస్తుంది. దానిని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. అనంతరం సెల్ నంబరు, ఓటీపీ నమోదు చేయాలి. యాప్ వినియోగించే వారి పేరు నమోదు చేసుకుని, ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. తద్వారా ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, ముఖ్యమైన సంఘటనల గురించి తెలుసుకోవచ్చు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి -
మూలాంకురేశ్వరికి విశేష పూజలు
ఫిరంగిపురం: మండలంలోని అమీనాబాద్ గ్రామంలోని మూలాంకురేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాస శుక్రవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఉదయాన్నే అర్చకులు అయ్యన్నశాస్త్రి, కార్తీక్శాస్త్రిలు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం విశేషంగా అలంకరించారు. పసుపు, కుంకుమలతో లలిత అష్టోత్తర, సహస్రనామ అర్చనలు చేశారు. ముఖమండపంలో ఉన్న శ్రీచక్రానికి ఖడ్గమాల స్త్రోత్రంతో కుంకుమార్చనలు నిర్వహించారు. భక్తుల గోత్రనామాలతో పూజలు చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. చందోలు(కర్లపాలెం): బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో ప్రసిద్ధిగాంచిన బగళాముఖి అమ్మవారి ఆలయంలో వారాహి నవరాత్ర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం మూడవ రోజున అమ్మవారు శాఖాంబరి వారాహిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శాఖాంబరి దేవి అలంకరణ కోసం సుమారు 800 కిలోల పలు రకాల కూరగాయలు, పండ్లు వినియోగించారు. మూడవ రోజున రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రదక్షిణలు చేశారు. నవరాత్ర మహోత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు వారాహి హోమం విశేష పూజలు నిర్వహించారు. చందోలు గ్రామానికి చెందిన సుమారు 60 మంది ఆర్యవైశ్య మహిళలు సాంప్రదాయ బద్ధంగా సారెలు, పూజా ద్రవ్యాలు శిరస్సున ధరించి మంగళ వాయిద్యాలతో శోభాయాత్రగా ఆలయానికి చేరుకుని విశేష పూజల అనంతరం అమ్మవారికి సమర్పించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఒంగోలుకు చెందిన తెల్లపాటి శ్రీనివాసరావు, కనకదుర్గ దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు మహాఅన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 20న జగన్నాథ రథయాత్ర తెనాలి టౌన్: ఇస్కాన్ టెంపుల్ తెనాలి ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన పట్టణంలో శ్రీశ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. స్థానిక నాజరుపేటలోని టెంపుల్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ ఇన్చార్జి సింహ గౌరదాస్ వివరాలను తెలిపారు. 20వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు పట్టణ శివాజీచౌక్లో ఇందుకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. 2 గంటల నుండి శ్రీశ్రీ జగన్నాథ రఽథయాత్ర మహోత్సవం ప్రారంభమవుతుందని వెల్లడించారు. శివాజీచౌక్, గాంధీచౌక్, నెహ్రూ రోడ్డు, లక్ష్మీ డీలక్స్ రోడ్డు, మెయిన్ రోడ్డు మీదుగా బోసురోడ్డులోని శ్రీకన్యకాపరమేశ్వరి దేవస్థానం వరకు రథయాత్ర జరుగుతుందని చెప్పారు. దేవాలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రవచనం, 108 పదార్థాలతో భోగ నివేదన, మహా హారతి ఉంటాయని తెలిపారు. అన్నప్రసాద వితరణ ఉంటుందని వివరించారు. ఆలయ కమిటీ సభ్యులు అప్పారావు, శ్రీనివాసరెడ్డి, ప్రసాద్, గోపాలకృష్ణ, కార్తీక్ తదితరులున్నారు. దుర్గమ్మకు ఆషాఢ సారె మంగళగిరి టౌన్: పట్టణంలోని బైపాస్రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలోని శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆంజనేయ కాలనీ భక్తబృందం శుక్రవారం సారె సమర్పించింది. కాలనీలోని ప్రధాన సెంటర్ నుంచి మహిళలు సారెతో ఊరేగింపుగా వచ్చారు. మేళతాళాలు, కనక తప్పెట్ల మధ్య ఊరేగింపు భక్తి శ్రద్ధలతో సాగింది. ఆయా వీధుల్లోని వారు సారెకు భక్తి శ్రద్ధలతో నీరు వారబోశారు. అనంతరం ఊరేగింపు ఆలయం వరకు చేరుకుంది. అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజలు జరిపారు. కార్యక్రమంలో భక్తబృందం ప్రతినిధులు మల్లేశ్వరి, అంజలి, సత్యవతి, లేఖ, సుజాత, వాణి పాల్గొన్నారు. -
నీట్ ఫలితాల్లో శ్రీచైతన్య ప్రభంజనం
గుంటూరు ఎడ్యుకేషన్: నీట్ ఫలితాల్లో శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని సంస్థ ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఈమని దుర్గాప్రసాద్ తెలిపారు. శుక్రవారం గుంటూరు లక్ష్మీపురంలోని సంస్థ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గుంటూరు జోన్ నుంచి అఖిల భారతస్థాయిలో అన్ని కేటగిరీల వారీగా తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు కై వసం చేసుకున్నట్లు తెలిపారు. సీహెచ్ మోహన నాగశ్రీ సాయి అఖిల్ 115వ ర్యాంకు, కె.సిద్ధార్థ 164వ ర్యాంకు, షేక్ నిహాల్ పర్వేజ్ 935వ ర్యాంకు, ఏ. నికేత్ రామ్ చౌదరి 1514వ ర్యాంకు, బి. శశిధర్ 1620వ ర్యాంకుతో పాటు ఐదువేల లోపు 46 మంది, 10వేల లోపు 89 ర్యాంకులతో పాటు 179 మంది విద్యార్థినీ, విద్యార్థులు మెడికల్ సీట్లు సాధించనున్నారని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సంస్థ అకడమిక్ డైరెక్టర్ బొప్పన సుష్మ, ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఈమని దుర్గాప్రసాద్, ఏజీఎం ఎల్టీసీ శ్రీనివాస్, ఆయా క్యాంపస్ల ప్రిన్సిపాల్స్ అభినందనలు తెలియజేశారు. -
పాలకుల దాష్టీకం
తాడికొండ: స్థానిక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో పేద విద్యార్థులు, తల్లిదండ్రులపై చంద్రబాబు ప్రభుత్వం దాష్టీకానికి దిగింది. పోలీసులను ఉసిగొల్పి విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులను బెంబేలెత్తించింది. తమకు చదువు కావాలని బతిమాలుతూ ‘అయ్యా మా పిల్లలను రోడ్డున పడేయకండి.. చదువుకుంటారు. పాఠశాల ఉంచండి..’ అని అడిగినందుకు దళిత తల్లిదండ్రులు, విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు చితకబాదారు. అనంతరం అరెస్టు చేసి స్టేషన్లో బంధించారు. ఇప్పటికే ఈ విషయంపై మూడు సార్లు రోడ్డెక్కి నిరసనలు తెలియజేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఇక కన్నీరే మిగిలింది. పేద విద్యార్థులకు అన్యాయం ఐఐటీ– జేఈఈ, నీట్ ఎక్స్లెన్స్ సెంటర్ల ఏర్పాటు పేరుతో ఇటీవల ప్రభుత్వం మంత్రివర్గ తీర్మానం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న మూడు గురుకుల పాఠశాలలను ఖాళీ చేయించి వాటిలో ఎక్స్లెన్స్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రచారం చేసింది. వీటిని ప్రభుత్వమే నిర్వహిస్తుందా.. అంటే అదీ కాదు. పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది. అనుకున్నదే తడవుగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులు తాడికొండతోపాటు తిరుపతి జిల్లా కోట, విశాఖ జిల్లా మేఘాద్రి గడ్డలోని గురుకుల పాఠశాలలకు చెందిన 1,500 మంది విద్యార్థులను బలవంతంగా బయటకు పంపేందుకు రంగం సిద్ధం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమావేశం ఏర్పాటు చేసి పేరుకు కూడా తెలియజేయలేదు. ఫోన్లు మాత్రమే చేసి ఇక్కడ గురుకుల పాఠశాల సెంటర్ను తీసివేస్తున్నారని, ఐఐటీ సెంటర్ వస్తున్నందున పిల్లలను తీసుకెళ్లాలని హుకుం జారీ చేశారు. రెక్కాడితే కానీ డొక్కాడని పేద విద్యార్థులు విషయం ఏమిటా అని సోమవారం పాఠశాలకు చేరుకొన్నారు. విషయం తెలిసిన తర్వాత ఆవేదనతో నిరసన వ్యక్తం చేశారు. దీంతోపాటు ఆర్డీఓ, జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. తర్వాత విద్యార్థుల సమావేశం ఏర్పాటు చేసి సమాచారం తెలియజేయాలని చెప్పినా నిబంధనలు ఉల్లంఘించి పిల్లలను తీసుకెళ్లాలని తల్లిదండ్రులకు చెప్పడంతో ఏం చేయాలో పాలుపోక రోడ్డెక్కారు. అండగా నిలిచిన వైఎస్సార్సీపీ బాధితులకు వైఎస్సార్సీపీ తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి వనమా బాల వజ్రబాబు అండగా నిలిచారు. గురువారం బాధితులతో కలసి పాఠశాలకు చేరుకొని పాఠశాలను తరలిస్తే సహించేది లేదని, ఐదు ఎకరాల విలువైన స్థలం ఉందని గుర్తుచేశారు. కావాలంటే భవనాలు నిర్మించుకోవాలని, కానీ పేదల ఉసురుపోసుకుంటే ఒప్పుకోబోమని హెచ్చరించారు. గురుకులాలను పూర్తిగా తొలగించి విద్యార్థులను రోడ్డుపాలు చేయడం తగదని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. తల్లిదండ్రులను అమానుషంగా కొట్టి బెదిరించారన్నారు. విద్యార్థులను బయటకు పంపించేశారన్నారు. -
రెడ్బుక్ రాజ్యాంగంతో ప్రాణాలు తీస్తారా
● ఇదేనా ప్రజాస్వామ్యం.. ఎన్నాళ్లీ దుర్మార్గం ● దరియా హుస్సేన్ ఆత్మహత్య చేసుకునేలా పోలీసుల వేధింపులు ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకష్ణారెడ్డి మాచర్ల: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వైఎస్సార్ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని మైనార్టీ నేతలతో కలసి విలేకరులతో మాట్లాడారు. పిన్నెల్లి మాట్లాడుతూ ప్రతి ఒక్కరిపై అక్రమ కేసులు పెట్టి పోలీసులతో వేధింపులకు గురిచేసి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తూ పరోక్ష హత్యలు చేయిస్తున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే పిడుగురాళ్ల పట్టణానికి చెందిన షేక్ దరియాహుస్సేన్ ఆత్మహత్యకు పాల్పడేటట్లు పోలీసులు చర్యలు ఉన్నాయని చెప్పారు. ఆత్మహత్య చేసుకుంటూ దరియా మరణ వాంగ్మూలంలో పిడుగురాళ్ల సీఐ ఆత్మహత్యకు కారణమని చెప్పినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదన్నారు. టీడీపీ వారు దందాలు చేస్తూ వాటిని తప్పించుకునేందుకు నిత్యం ప్రతి నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను అత్యంత దారుణంగా వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ నాయకులను పోలీసు స్టేషన్కు పిలిపించి హింసకు పాల్పడుతున్నారని విమర్శించారు. సివిల్ కేసు కోర్టు పరిధిలో ఉండగా దరియా హుస్సేన్ను ప్రతి రోజూ పిడుగురాళ్ల సీఐ శ్రీరాం వెంకట్రావు పోలీసు స్టేషన్కు పిలిపించి తీవ్రంగా ఇబ్బందులకు గురిచేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారన్నారు. ఈ విధంగా గురజాల నియోజక వర్గంలో దారుణంగా అక్రమ కేసులు పెట్టి పలు గ్రామాల్లో ఉన్న వైఎస్సార్సీపీ నాయకులను తరిమికొట్టేలా పోలీసు రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నా పోలీసు అధికారులు పట్టించుకోకపోవటం దారుణమన్నారు. ఇప్పటికై నా ఈ విషయమై పూర్తి స్థాయిలో విచారణ జరిపి మైనార్టీ ఉద్యోగి దరియా మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకొని అధికార పార్టీ అరాచకాలుపై దృష్టి పెట్టాల్సిన బాధ్యత ఉందన్నారు. దరియా కుటుంబానికి న్యాయం చేసే వరకు వైఎస్సార్ సీపీ మద్దతిస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో షేక్ అబ్దుల్ జలీల్, మస్తాన్వలి, ముస్తాఫా, బాజీ, అబ్దుల్ సత్తార్, చిన్నబద్రు, ట్రాక్టర్ కరిముల్లా, నాగూర్వలితో పాటు పలువురు నాయకులున్నారు. -
సర్ లక్ష్యం ముస్లిం, క్రైస్తవ, దళితుల ఓట్లు తొలగింపే
నరసరావుపేట: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) పేరుతో ముస్లిం, క్రైస్తవ, దళిత, ఆదివాసీ, మహిళల ఓట్లు తొలగించడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని మేలుకో ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ రమేష్ పట్నాయక్ ఆరోపించారు. కుల నిర్మూలనా పోరాట సమితి(కేఎన్పీఎస్) గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో కారంచేడు దళిత మృత వీరుల సంస్మరణ సభ శుక్రవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ విభాగమైన భారత ఎన్నికల కమిషన్ బీజేపీ జేబు సంస్థగా మారి అనేక రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో ఓట్లు తొలగించిందని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్య్రం రాక పూర్వం కేవలం ధనికులకు మాత్రమే ఓటు హక్కు ఉండేదని చెప్పారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాతనే ఒక మనిషికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒక విలువ వచ్చిందన్నారు. ప్రజలు నూటికి నూరు శాతం ఓట్లు వేసే పరిస్థితిని తొలగించి కొద్ది మంది ధనికులకు మాత్రమే ఓటు ఉండే విధంగా ఎన్నికల కమిషన్ పడరాని పాట్లు పడుతుందని దుయ్యబట్టారు. ఓటరు సవరణకు బదులుగా ఓట్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేసిందని విమర్శించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును కాపాడుకోకపోతే ఓట్లు కోల్పోయిన వారి పౌరసత్వం కూడా రద్దయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఓటు రద్దయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావన్నారు. హక్కులు కోల్పోయిన ప్రజలు జీవించడం కష్టతరమైన పని కనుక ప్రజల ఓట్లు తొలగించేందుకు సిద్ధమైన ఎన్నికల కమిషన్ కుట్రలను అడ్డుకుందామని పిలుపునిచ్చారు. కేఎన్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కె.కృష్ణ మాట్లాడుతూ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను బలోపేతం చేస్తున్న పాలకులు పీడిత కులాల ప్రజలపై నిరంతరం దాడులు, దౌర్జన్యాలకు పాల్పడే అగ్రకుల హంతకమూకలకు అండగా ఉంటున్నారని పేర్కొన్నారు. హిందూ రాష్ట్ర స్థాపనే లక్ష్యంగా పని చేస్తున్న బీజేపీ భారత రాజ్యాంగాన్ని మార్చి దాని స్థానంలో ఆధునిక మనుస్మృతిని రాజ్యాంగంగా అమలు చేయాలని ఉవ్విళ్లూరుతుందన్నారు. కేఎన్పీఎస్ జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి బి.కొండారెడ్డి, కేఎన్పీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఓర్సు శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు గొల్లపూడి చిన్నప్రసాద్, సహాయ కార్యదర్శి జక్కా బ్రహ్మయ్య పాల్గొన్నారు. కారంచేడు దళిత మృతవీరుల సంస్మరణ సభలో రమేష్ పట్నాయక్ -
జిల్లా సమస్యలపై ప్రస్తావన శూన్యం
నిమ్మకాయల ధరలు తెనాలి: తెనాలి మార్కెట్యార్డులో శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.2200, గరిష్ట ధర రూ.4000, మోడల్ ధర రూ.3200 వరకు పలికింది. నరసరావుపేట: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా స్థానిక కోడెల శివప్రసాదరావు క్రీడల స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన రుణ వితరణ సభలో జిల్లాలో నెలకొన్న సమస్యలకు స్థానం దక్కలేదు. సభలో మాట్లాడే అవకాశం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుకు దక్కినా ఎక్కడా సమస్యలు ప్రస్తావించలేదు. పరిష్కరించమని అడగలేదు. అలాగే సభ ఒక గంట ఆలస్యంగా ప్రారంభమైంది. షెడ్యూలు ప్రకారం 11.25కు సీఎం నారా చంద్రబాబునాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభా ప్రాంగణానికి రావాలి. కానీ వారు 12.30కు వచ్చారు. సభా ప్రాంగణం 11గంటల సమయంలో కేవలం ముప్పావు వంతే జనాభాతో నిండింది. ఒకవైపు వరుస కుర్చీలు అన్నీ ఖాళీగానే ఉన్నాయి. జనాభా రాలేదనే కారణంతోనో ఏమోగాని శ్రీ చైతన్య కళాళాల నుంచి విద్యార్థులను రప్పించారు. వారందరూ కళాశాల బస్సులు దిగి లైనులో చేరుకున్నారు. 2003 డీఎస్సీ ప్రదాత సీఎంకు ధన్యవాదాలు అంటూ గట్టిగా ఒక 20 మంది వ్యక్తులు బ్యానర్, సీఎం ఫొటోలు పట్టుకొని సీఎం ప్రవేశించేందుకు నిర్దేశించిన మెయిన్గేటు వద్ద నిల్చున్నారు. వాహనంలో వచ్చిన సీఎం వారివైపు కూడకుండానే వెళ్లిపోయారు. అలాగే ఫ్రీ బస్సు సీ్త్ర శక్తి పథకానికి ఉపయోగించే పల్లెవెలుగు బస్సులనే జనాభా తీసుకొచ్చేందుకు ఉపయోగించారు. పట్టణంలో సభ జరుగుతుండగా, పలు వార్డుల నుంచి డ్వాక్రా మహిళలు, టీడీపీ కార్యకర్తలను అక్కడకు తీసుకొచ్చేందుకు బస్సులను ఉపయోగించారు. కిలో మీటరు, లేదా కిలోమీటరున్నర దూరంలో ఉన్న సభా ప్రాంగణానికి కూడా బస్సులు ఉపయోగించటం గమనార్హం. దీంతో గురువారం సాయంత్రం నుంచే ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే కూటమిలో భాగస్వామ్యమైన జనసేన సారథి, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫొటో ఎక్కడా సభాప్రాంగణంపై కన్పించలేదు. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వాములమైన తమ విషయంలో ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించలేదని జనసేన అభిమానులు విమర్శిస్తున్నారు. -
సభకు బస్సులు.. ప్రజలకు కష్టాలు
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో శుక్రవారం నిర్వహించిన రుణమేళా సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు రావడంతో బస్సు ప్రయాణికులకు చుక్కలు కనిపించాయి. సీఎంతోపాటు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. చంద్రబాబు సభకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేయడానికి ఆర్టీసీ బస్సులను కేటాయించారు. నరసరావుపేటలోని సభకు మొత్తం 600 బస్సులు కేటాయించడంతో ప్రయాణికులు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఎక్కడికక్కడ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు ఆర్టీసీ బస్సులను కేటాయించి వాటిలో డ్వాక్రా మహిళలతోపాటు జనాన్ని సమీకరించారు. సీఎం చంద్రబాబు సభ పుణ్యమా అని ప్రయాణికులు, విద్యార్థులకు రోడ్లపై గంటల తరబడి పడిగాపులు తప్పలేదు. దీనికితోడు ఆషాఢ మాసంలోని శుక్రవారం కావడంతో మహిళలు పెద్ద ఎత్తున అమ్మవార్ల దేవాలయాలకు బయలుదేరారు. ఈ క్రమంలో జిల్లాలోని ఏ డిపోలో కూడా ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో వారు కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వైద్యశాలలకు వెళ్లే రోగులు నానా అవస్ధలు పడ్డారు. ముఖ్యమంత్రి సభ సంగతి దేవుడెరుగు తమకు ఈ ఇబ్బందులు ఏమిటంటూ ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
తెనాలి పోలీసులపై క్రమ శిక్షణ చర్యలు
● ఇద్దరు కానిస్టేబుళ్ల బదిలీ, డీఎస్పీ సహా అధికారులకు మెమోలు ● ‘సాక్షి’ కథనానికి స్పందన తెనాలిరూరల్:తెనాలి పోలీసు లపై అక్రమ వసూళ్లు, అవినీతి దందాల ఆరోపణలు హెచ్చుమీరుతున్న నేపథ్యంలో పోలీ సు ఉన్నతాధికారులు చర్యల కు శ్రీకారం చుట్టారు. ‘పేరుకే పోలీసు.. చట్టం అంటే అలుసు’ పేరిట ఈ నెల 10వ తేదీన తెనాలిలో పోలీసుల వ్యవహారాన్ని కళ్లకుకట్టినట్టు చెబుతూ ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. పేకాట దందాలు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న అరోపణలతో వన్ టౌన్ పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ ఎం. రమేష్ను కాకుమాను స్టేషన్కు, తెనాలి రూరల్ పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ డి.రవిని ఫిరంగిపురం బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ వకుల్జిందాల్ శుక్ర వారం ఉత్తర్వులు జారీ చేశారు. తెనాలి డీఎస్పీ బి.జనార్ధనరావు, త్రీ టౌన్ సీఐ ఎస్.సాంబశివరావు, వన్ టౌన్ సీఐ సీహెచ్.రాంబాబు, రూరల్ ఎస్ఐ కె.ఆనంద్లకు చార్జ్ మెమోలు జారీ చేసిన ట్టు తెలిసింది. వేరే మహిళతో సహజీవనం చేస్తూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇల్లు మార్చిన సీఐ ప్రస్తుతం ఎక్కడ అద్దెకు తీసుకున్నారన్న అంశాన్ని విచారిస్తున్నట్టు తెలిసింది. -
రాజధాని రైతుల అభిప్రాయాలకు ప్రాధాన్యం
గుంటూరు వెస్ట్: రాజధాని ప్రాంత రైతుల ప్రయోజనాలను కాపాడుతూ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల సహకారంతో పారదర్శకంగా అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి. నారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ లేదా ల్యాండ్ పూలింగ్ విధానంపై రైతులతో మంత్రి సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ , జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ, సీ ఆర్ డీఏఎ అడిషనల్ కమిషనర్లు భార్గవ్ తేజ, కార్తీక్, సంబంధిత శాఖల అధికారులు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైల్వే శాఖ ప్రారంభంలో మార్కెట్ ధర ప్రకారం భూసేకరణ చేపట్టాలని నిర్ణయించిందన్నారు. అయితే భూసేకరణ వల్ల తాము నష్టపోతామని, దానికి బదులుగా ల్యాండ్ పూలింగ్ విధానంలోనే భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని స్థానిక రైతులు ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. రైతుల విజ్ఞప్తిని ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా, రైతులతో నేరుగా చర్చించి వారి అభిప్రాయం మేరకే ముందుకు సాగాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి వెల్లడించారు. ఆ మేరకు రైతులతో ఉమ్మడి సమావేశం నిర్వహించి, భూసేకరణ, ల్యాండ్ పూలింగ్ విధానాలపై ఉన్న సందేహాలను అధికారులు, ప్రజాప్రతినిధులు సమగ్రంగా నివృత్తి చేశారని చెప్పారు. రైతులందరికీ పూర్తి అవగాహన కల్పించి, వారి అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు త్వరలోనే గ్రామ సభ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. సమావేశంలో డీఆర్వో షేఖ్ ఖాజావలి, ఆర్డిఓ శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావాలి జిల్లా కలెక్టర్ సి.యం.సాయికాంత్ వర్మ రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి పి.నారాయణ -
కనీ్నటి కస్తల
అచ్చంపేట: కస్తల రీచ్లోని ఇసుక అంటే ఓ బ్రాండ్. పెద్ద కట్టడాలు, వంతెనలు, అపార్టుమెంట్లు నిర్మించడానికి ఇక్కడి నుంచే ఇసుక తరలించేవారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిననాటి నుంచి గత రెండేళ్లుగా ఈ రీచ్ మూతపడింది. దీనినే నమ్ముకున్న కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారు. రూ.లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన పడవలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ పాడవుతున్నాయి. ఈ రీచ్ నుంచి హైదరాబాద్, చైన్నె వంటి మహా నగరాలకు ఇసుకను పెద్ద వాహనాల్లో తరలించేవారు. నది లోతుల్లో నుంచి ఇసుకను తోడుకుని వచ్చేందుకు గ్రామస్తులు ఒక్కో పడవను సుమారు రూ.10 లక్షల వ్యయంతో ప్రత్యేకంగా తయారు చేయించుకున్నారు. ఒక్కో పడవలో లారీకి సరిపడా ఇసుకను అంటే 25 నుంచి 30 టన్నుల వరకు నింపవచ్చు. ఇలా తీసుకొచ్చి లారీలకు నింపేవారు. ఈ రీచ్ కేవలం కూలీలలతో మాత్రమే నడిచేది. నిబంధనలకు పాతర ప్రభుత్వ నిబంధనల మేరకు ఇసుక రీచ్లలో యంత్రాలను ఉపయోగించకూడదు. కేవలం కూలీలతోనే ఇసుకను లోడ్ చేయాల్సి ఉంది. అందుకు కస్తల రీచ్లో వేల మంది కార్మికులు అడ్డుపడతారు కాబట్టి ఆ రీచ్ను పరిగణనలోకి తీసుకోకుండా అనధికార క్వారీలకు ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాది కోనూరు, అంబడిపూడి రీచ్లలో భారీ యంత్రాలు, గ్రిడ్జిస్ వినియోగించవచ్చన్న కారణంగా ఆ రీచ్లకు మాత్రమే బహిరంగవేలం నిర్వహించారు. అక్కడ అక్రమార్కుల ఆగడాలు ఎక్కువ కావడం, టీడీపీలోనే రెండు గ్రూపులు ఏర్పడి పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో ఇప్పుడవీ మూతపడ్డాయి. చింతపల్లి రీచ్ నుంచి ఇసుక అక్రమ తరలింపు జరుగుతోంది. బడా రాజకీయ నాయకుల అండదండలతో ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. అధికారులు నామమాత్రపు దాడులకే పరిమితం అవుతున్నారు. ఇసుక రీచ్ను నమ్ముకుని కస్తల గ్రామంలో 200కుపైగా పడవలను గ్రామస్తులు కొనుగోలు చేసుకున్నారు. కూటమి ప్రభుత్వంలోకి రీచ్ పూర్తిగా మూతపడిపోవడంతో పడవలన్నీ ఒడ్డుకే పరిమితమయ్యాయి. రెండేళ్లుగా వీటిని వియోగించకపోవడంతో ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, వరదలు వచ్చినప్పుడు మునిగిపోతూ, చెదలు పట్టి దాదాపు శిథిలావస్థకు చేరుకున్నాయి. వెయ్యి మందికిపైగా పనిచేసే కార్మికులు ఉపాధి లేక వీధులపాలయ్యారు. రీచ్ వెలవెల ఒకప్పుడు వేల మంది ఇసుక కార్మికులతో, నిత్యం వచ్చిపోయే లారీలు, ట్రాక్టర్లుతో కళకళలాడే కస్తల రీచ్ ఇప్పుడు వెలవెలబోతోంది. కస్తల గ్రామానికి చెందినవారే కాకుండా కోనూరు, రుద్రవరం, ఓర్వకల్లు, చిగురుపాడు, కోగంటివారిపలెం, కొండూరు, నిండుజర్ల, ఊటుకూరు తదితర గ్రామాలకు చెందిన వారు ఇక్కడ పనిచేశారు. వారంతా ఉపాధి లేక, ఏం చేయాలో తెలియక, కుటుంబ పోషణ కష్టమై కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషయాన్ని అనేకసార్లు ప్రజా ప్రతినిధులకు, అధికారులకు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా మొర ఆలకించడంలేదని కార్మికులు వాపోతున్నారు. కస్తల రీచ్లో నిరుపయోగంగా పడవలు కస్తల రీచ్ని పునరుద్ధరించకపోవడంతో దీనిపైనే ఆధారపడిన వేల మంది కార్మికులకు ఉపాధి లేక రోడ్డున పడ్డారు. రూ.లక్షల వ్యయంతో పడవలను కొనుగోలు చేసిన యజమానులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. ఇకనైనా రీచ్ పునరుద్ధరించాలి. – షేక్ మహబూబ్ సుభాని, మాజీ సర్పంచ్, కస్తలకూటమి ప్రభుత్వం పుణ్యమా అని కస్తల ఇసుక రీచ్ మూతపడటంతో దీనిని నమ్ముకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన వేల మంది కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారు. పక్క గ్రామాల నుంచి కూడా కార్మికులు వచ్చి ఈ రీచ్లో పనిచేసేవారు. వీరంతా కష్టాల పాలయ్యారు. – గుడేటి సలోమాన్, ఇసుక కార్మికుడు, కస్తల -
రాగి తీగల దొంగలు అరెస్ట్
● 16 ట్రాన్స్ఫార్మర్లలో రూ. 1.5 లక్షల విలువైన 105 కిలోల వైరు చోరీ ● పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు నరసరావుపేట టౌన్: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి అందులోని రాగి తీగలను అపహరిస్తున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు పల్నాడు జిల్లా అడ్మిన్ ఎస్పీ జె.వి.సంతోష్ తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నకరికల్లు మండలం కండ్లగుంట, నరసింగపాడు గ్రామాల పరిధిలో ఇటీవల వరుసగా ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి అందులో విలువైన రాగితీగలను చోరీలకు పాల్పడుతున్న కేసులను డీఎస్పీ ఎం. హనుమంతరావు ఆధ్వర్యంలో నకరికల్లు పోలీసులు ఛేదించారన్నారు. కండ్లగుంట గ్రామానికి చెందిన చండ్రా వెంకటేశ్వర్లు తన పొలంలోని ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం చేసి రాగి వైర్లను దొంగలించినట్లు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారన్నారు. బుధవారం చేజర్ల గ్రామ సమీపంలో ఎన్ఎస్పీ కుడి కాల్వ దగ్గర నకరికల్లు మండలం చేజర్ల గ్రామానికి చెందిన తడపాల సాయిబాబు, ఉరాలశెట్టి మల్లయ్య, చలంచర్ల హనుమంతరావులు అనుమానస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని, విచారించగా.. రాగివైర్లు దొంగతనానికి పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించారన్నారు. నకరికల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో 16 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి అందులో విలువైన కాపర్ వైర్లను అపహరించినట్లు తేలిందన్నారు. కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయగా, పరారీలో ఉన్న మాచర్ల టౌన్కు చెందిన రాజు కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.1.5 లక్షల విలువైన 105 కేజీల రాగి వైరును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎస్పీ హనుమంతరావు, సత్తెనపల్లి రూరల్ సీఐ పి.కిరణ్, నకరికల్లు ఎస్ఐ సతీష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వినుకొండలో పట్టపగలే చోరీలు
ఒకే రోజు నాలుగు ఇళ్లలో..వినుకొండ: వినుకొండ పట్టణంలో గురువారం ఒకే రోజు నాలుగు ఇళ్లలో వరుస దొంగతనాలు జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దొంగలు పట్టపగలే తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని బీరువాలు పగలగొట్టి, భారీగా నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు. స్థానిక కొత్తపేట ఐదో లైను, ట్రాన్న్స్ఫార్మర్ బజారుతో పాటు, కాలువ కట్టపై ఉన్న రెడ్డి నగర్ సమీపంలోని మూడు ఇళ్లలో ఈ చోరీలు జరిగాయి. కొత్తపేటకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆవుల సుబ్బారెడ్డి ఇంట్లోకి చొరబడిన దొంగలు, బీరువా తాళాలు పగలగొట్టి సుమారు పది తులాల బంగారం, లక్ష రూపాయల నగదును అపహరించుకుపోయారు.మరో మూడు ఇళ్లలోనూ దొంగలు అదే పద్ధతిలో తాళాలు, బీరువాలు పగలగొట్టి విలువైన వస్తువుల కోసం వెతికారు. ఇళ్లలోని సామాన్లను, బట్టలను గదుల నిండా చెల్లాచెదురుగా పడేశారు. ఆ ఇళ్లలో జరిగిన నష్టంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఒకే రోజు, అది కూడా పట్టపగలే నాలుగు ఇళ్లలో దొంగతనాలు జరగడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే వినుకొండ పోలీసులు ఘటనా స్థలాలకు చేరుకున్నారు. దొంగతనం జరిగిన ఇళ్లను పరిశీలించి, వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దించి దర్యాప్తును ముమ్మరం చేశారు. -
గుంటూరు వైద్యురాలి ఘనవిజయం
గుంటూరు మెడికల్: గుంటూరుకు చెందిన సీనియర్ న్యూరాలజిస్ట్, లలితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పమిడిముక్కల విజయ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 18 మంది వైద్యులను మాత్రమే ఎంపిక చేసే వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్కు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఎంపికై రికార్డు సృష్టించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్కు ఎంపికై న మొట్టమొదటి వ్యక్తిగా డాక్టర్ విజయ రికార్డు సృష్టించారు. బ్రెయిన్ స్ట్రోక్ బాధితులకు అందిస్తున్న చికిత్సలకు, పక్షవాత బారిన పడకుండా ప్రజలకు కల్పిస్తున్న అవగాహన కార్యక్రమాలకు, బ్రెయిన్ స్ట్రోక్ చికిత్సల్లో వైద్యులు, సిబ్బందికి లలితా పీవీఎస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు చెందిన అంకినీడు స్ట్రోక్ సెంటర్ ద్వారా అందిస్తున్న అత్యుతన్నత వైద్య ప్రమాణాలకు అంతర్జాతీయ గౌరవం లభించింది. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలిగా ఆమె పనిచేసి రికార్డు సృష్టించారు. 1996 నుంచి సేవలు ఉమ్మడి ఏపీలోనే మొట్టమొదటిగా, దేశంలో రెండవదిగా 1996లో గుంటూరులో అంకినీడు స్ట్రోక్ సెంటర్ను డాక్టర్ విజయ ఏర్పాటు చేశారు. పక్షవాత ( బ్రెయిన్ స్ట్రోక్) చికిత్సలో అత్యున్నత ప్రమాణాలు, నాణ్యమైన వైద్యసేవలు అందించటంలో అంకినీడు స్ట్రోక్ సెంటర్ చూపుతున్న నిరంతర కృషికి గాను ఇటీవల జాతీయ అవార్డు లభించింది. వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ ఏజెంల్స్ ఇనిస్టిట్యూట్ డైమండ్ స్టేటస్ అంతర్జాతీయ అవార్డు స్ట్రోక్ సెంటర్కు, డాక్టర్ విజయకు 2020 నుంచి 2025 వరకు వరుసగా ఐదుసార్లు లభించింది. తాత మరణం కలచివేసింది.. ఈ సందర్భంగా డాక్టర్ పి.విజయ ‘సాక్షి’తో మాట్లాడుతూ నేను ఇంటర్ చదువుతున్న రోజుల్లో తాత అంకినీడుకు పక్షవాతం వచ్చి సకాలంలో చికిత్స ఎక్కడా లభించక చనిపోయారని, కళ్లెదుటే ఆయన మరణం చూసి తట్టుకోలేక బ్రెయిన్ స్ట్రోక్ మరణాలు నివారించాలని మనస్సులో గట్టిగా నిర్ణయించుకున్నానని తెలిపారు. తదనుగుణంగా న్యూరాలజిస్ట్గా సేవలు ప్రారంభించానని తెలిపారు. ఉమ్మడి ఏపీలోనే మొట్టమొదటిగా, దేశంలో రెండవదిగా మా తాత అంకినీడు పేరు మీదుగా 1996లో గుంటూరులో పక్షవాత మరణాలు నివారణే లక్ష్యంగా స్ట్రోక్ యూనిట్ ఏర్పాటు చేశామన్నారు. అంకినీడు స్ట్రోక్ సెంటర్ డైరక్టర్గా ఉన్న తాను ప్రతినెలా 100 నుంచి 125 మంది స్ట్రోక్ బాధితులకు చికిత్స అందిస్తూ ప్రాణాలు కాపాడుతున్నామని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వరల్డ్ స్ట్రోక్ అసోసియేషన్కు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఎంపికవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యటించి స్ట్రోక్ మరణాలు తగ్గింపే లక్ష్యంగా చిత్తశుద్ధితో విధులు నిర్వహించి ఇచ్చిన పదవికి దేశానికి గుర్తింపు వచ్చేలా పనిచేస్తానని తెలిపారు. కుటుంబమంతా వైద్యులే.. డాక్టర్ విజయ భర్త పి. వి.రాఘవశర్మ సీనియర్ కార్డియాలజిస్టుగా, కార్డియాలజీ వైద్యుల సంఘం రాష్ట్ర నాయకుడిగా సేవలందిస్తున్నారు. పెద్దకుమారుడు డాక్టర్ అనురాగ్ కార్డియాజిస్ట్గా, పెద్ద కోడలు డాక్టర్ స్రవంతి క్యాన్సర్ వైద్య నిపుణులుగా చిన్న కుమారుడు డాక్టర్ నరేన్ న్యూరాలజిస్ట్గా, చిన్న కోడలు డాక్టర్ సిరి చందన నెఫ్రాలజిస్ట్గా సేవలందిస్తున్నారు. సీనియర్ న్యూరాలజిస్టుగా, స్ట్రోక్ స్పెషలిస్టుగా 35 సంవత్సరాలుగా డాక్టర్ విజయ సేవలందిస్తూ ఎన్నో అవార్డులు, సన్మానాలు పొందారు. నేషనల్ స్ట్రోక్ అసోసియేషన్ (యూఎస్ఏ), వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎస్ఓ), అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ (ఏఏఎన్), యూరోపియన్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ (ఈఎస్ఓ), ఏపీ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ (ఏపీఎన్ఎస్ఏ), న్యూరలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా పనిచేశారు. ఏపీ న్యూరో సైంటిస్ట్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. -
పల్నాడు అడ్డా.. జోరుగా పేకాట
● టీడీపీ నాయకుల అండదండలతో యథేచ్ఛగా పేకాట ● ఐదు జిల్లాల నుంచి వస్తున్న పేకాటరాయుళ్లు ● చిలకలూరిపేట, సత్తెనపల్లిలో పేకాట క్లబ్లు ● నోట్ల కట్టలతో పోలీసుల కళ్లు మూయించినట్లు ఆరోపణలు ● నీకింత .. నాకింత అంటూ అధికార పార్టీ నేతల వాటాల పంపకాలు ● రెండు నియోజకవర్గాల్లో మండిపడుతున్న మహిళలు రూ. లక్షల్లో నిర్వహణ... కాయిన్లతోనే ‘లెక్క’ ! -
హామీలు మరచినారా?
ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమస్యల స్వాగతం శుక్రవారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2026సాక్షి, నరసరావుపేట: హామీలివ్వడం వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వెన్నతో పెట్టిన విద్య. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ఓటర్లను మభ్యపెట్టడం ఆయన నైజం. మెగా రుణమేళా పేరిట నరసరావుపేట కోడెల శివప్రసాద్రావు స్టేడియంలో నేడు నిర్వహించనున్న కార్యక్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొననున్న నేపథ్యంలో ఎన్నికల ముందు బాబు ఇచ్చిన హామీలను ఈ ప్రాంత ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. వరికపూడిశెలకు తట్టెడు మట్టీ ఎత్తలేదు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా హామీలను అమలుచేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పల్నాడు ప్రజల చిరకాల కోరికై న వరికపూడిశెల ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. ఇలాంటి ప్రాజెక్టు చంద్రబాబుకు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకొస్తుంది. అధికారంలోకి వస్తే వరికపూడిశెల ప్రాజెక్టు నిర్మిస్తామంటారు...వచ్చిన తర్వాత ఆ మాటే మర్చిపోతారు. చంద్రబాబు నాయుడు అయితే పల్నాడు వాసుల ఓట్లకోసం వరికపూడిశెలకు ఏకంగా రెండుసార్లు శంకుస్థాపన చేసి ఈ ప్రాంతప్రజలను మభ్యపెట్టేశారు. యువగళం పేరిట పాదయాత్ర చేసిన నారాలోకేష్ వినుకొండ నియోజకవర్గం కొండ్రముట్ల వద్ద వరికపూడిశెల ప్రాజెక్టు హామీనిస్తూ శిలాఫలకాన్ని సైతం ఆవిష్కరించడం గమనార్హం. 2024 ఎన్నికల్లో గెలిస్తే ఆరు నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామని రెండేళ్లు అవుతున్నా కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తలేదంటూ ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. సుమారు 1.25 లక్షల ఎకరాలకు సాగు, లక్షమందికి తాగునీరు అందించే విధంగా డీపీఆర్ను రూపొందించి అవసరమైన కేంద్ర అనుమతులను గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. 2023 నవంబర్లో ఈప్రాజెక్టు పనులను సైతం ప్రారంభించారు. అయితే 2024లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ ప్రాజెక్టు పనులను పక్కన పెట్టారంటూ వైఎస్సార్ సీపీ, కమ్యూనిస్ట్ నేతలు ఆరోపిస్తున్నారు. కౌలు రైతులకు మొండిచెయ్యి మరోవైపు జిల్లాలో నేడు పంపిణీ చేయనున్న రుణాల్లో కౌలు రైతులకు న్యాయం జరగడం లేదు. జిల్లా వ్యాప్తంగా 70 వేల మంది కౌలు రైతులకు సీసీఆర్ కార్డులు పంపిణీ చేయాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 8,057 మందికి మాత్రమే కార్డుల పంపిణీ జరిగింది. దీంతో అర్హులైన కౌలు రైతులు కార్డులు అందక పెట్టుబడి రుణాలు, బీమా, ఇన్పుట్ సబ్సిడీ, వివిధ రాయితీలను కోల్పోతున్నారు. అభివృద్ధి జాడేలేని నరసరావుపేట నరసరావుపేట రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనులు రెండేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. కేంద్రంలో కీలకంగా ఉన్నామని చెప్పుకునే టీడీపీ పార్లమెంటరీ నేత లావు కృష్ణదేవరాయలు ఎంపీగా ఉన్న నరసరావుపేటలో రైల్వే స్టేషన్ పనులను రైల్వే శాఖపై ఒత్తిడి తెచ్చి పూర్తి చేయించడంలో విఫలమవుతున్నారు. ముఖ్యంగా రెండో ఫ్లాట్ ఫామ్లో రైలు ఎక్కడ ఆగుతుందో తెలియక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లు గడుస్తున్నా రెండో ఫ్లాట్ ఫామ్లో డిజిటల్ బోర్డులు సైతం ఏర్పాటు చేయలేకపోతున్నారు. ● ఆటోనగర్ ఏర్పాటు సమస్య పట్టణంలో దీర్ఘకాలంగా ఉంది. గత ప్రభుత్వం కేసానుపల్లి సమీపంలోని ప్రభుత్వ భూములను ఏపీఐఐసీకి అప్పగించి ఆటోనగన్ర్ శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దీని ఊసే ఎత్తడం లేదు. ● శ్రీకృష్ణ చిత్రాలయ థియేటర్ వద్ద ఆర్యూబీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. దీనివల్ల పట్టణంలోని ట్రాఫిక్ సమస్య చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ● మరోవైపు జిల్లా కేంద్రంలో ముఖ్యమైన రహదార్లను విస్తరించకపోవడంతో నిత్యం ప్రజలు తీవ్ర ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఏళ్లుగా భూ హక్కుల కోసం పోరాడుతున్న లింగంగుంట్ల ప్రజల సమస్యను మఠం, కోర్టులతో సంప్రదించి పరిష్కరించాల్సి ఉంది. అయితే ఆ దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం లేదు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో కలసి నేడు నరసరావుపేటలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గుర్తుచేసుకుంటున్న పేట ప్రజలు ఆటోనగర్ ఏర్పాటు హామీపై దృష్టి పెట్టని బాబు సర్కార్ తీవ్ర ట్రాఫిక్ సమస్యలతో సతమతమవుతున్న ప్రజలు రోడ్ల విస్తరణ, ఆర్యూబీ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ కోటప్పకొండ రోప్వేకు 2016లో శంకుస్థాపన నేటికీ అందుబాటులోకి రాని వైనం కోటప్పకొండ గిరిప్రదక్షిణ రోడ్డు మంజూరు చేసినట్టు ప్రకటించి మరచిన కూటమి ప్రభుత్వం -
రోప్వేపై హోప్స్ ఏవీ?
కోటప్పకొండను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, ఇందులో భాగంగా రోప్వేను ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు 2016లో ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించారు. కోటప్పకొండ దిగువున నల్లచెరువు నుంచి కొండ పైకి యాత్రికులు చేరుకునే విధంగా రోప్వేను నిర్మించే పనులకు 2016లో సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. పీపీపీ పద్ధతిలో పలు సంస్థలు రోప్వే ఏర్పాటుకు ముందుకు వచ్చినా టీడీపీ నాయకుల కమీషన్లకు భయపడి ప్రారంభించిన పనులు మధ్యలోనే నిలిపి వెళ్లిపోయారు. ఇప్పుడు మరోసారి సీఎం హోదాలో నరసరావుపేటలో చంద్రబాబు పర్యటించనున్నారు. రోప్వే నిర్మాణంపై చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ ఏడాది జనవరి 22 పర్యటిస్తూ కోటప్పకొండ గిరిప్రదక్షిణ రోడ్డు మంజూరు చేసినట్టు ప్రకటించారు. ఆరు నెలలు గడిచినా ఇప్పటివరకు ఆ పనులు పట్టాలెక్కలేదు. -
దరియాహుస్సేన్ ఆత్మహత్య బాధాకరం
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణానికి చెందిన షేక్ దరియా హుస్సేన్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని వైఎస్సార్ సీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ జానీ అన్నారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయం లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన ఆత్మహత్యకు సీఐ శ్రీరామ్ వెంకట్రావు కారణమంటూ దరియా హుస్సేన్ మరణ వాంగ్మూల లేఖలో పేర్కొన్నారని, దరియా హుస్సేన్ ఆత్మహత్యకు కారకుడైన సీఐ శ్రీరామ్ వెంకట్రావు పై వెంటనే శాఖా పరమైన చర్యలు తీసుకోవాల న్నారు. వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి మాట్లాడుతూ దరియా హుస్సేన్ ఆత్మహత్య చేసుకోవడానికి సీఐ శ్రీరామ్ వెంకటరావు కారణమని, సివిల్ కేసు కోర్టులో ఉండగా దరియా హుస్సేన్ను రోజు పోలీస్స్టేషన్కు పిలిచి చిత్రహింస లకు గురి చేశారన్నారు. చిత్రహింసలు తట్టుకోలేకనే దరియా హుస్సేన్ ఆత్మహత్య చేసుకున్నారన్నారు. సీఐ శ్రీరామ్ వెంకట్రావు పై శాఖాపరమైన చర్యలు తీసుకొని విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ షేక్ మాబూ హుస్సేన్, దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గోర, మైనార్టీ సెల్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ షేక్ ఖాసిం, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు షేక్ ముక్త్యార్, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు షేక్ నాగూర్ బాషా, నాయకులు షేక్ మహిబ్, అలీ ఆజాం, తదితరులు ఉన్నారు. దరియా హుస్సేన్ కుటుంబానికి పరామర్శ పిడుగురాళ్ల: పోలీసుల వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న దరియా హుస్సేన్ కుటుంబాన్ని గురువారం ఆంధ్రప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్, మైనార్టీ హక్కుల పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షులు ఎండీ మహ్మద్ ఫార్కూ షుబ్లీ పరామర్శించారు. దరియా హుస్సేన్ భార్య అమిరుషా బేగం, కుమారులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా కుటుంబాన్ని ఆదుకుంటామని, అండగా ఉంటామని ఆయన చెప్పారు. ఆయన వెంట ముస్లిం పెద్దలు పలువురు పాల్గొన్నారు. దరియా హుస్సేన్ ఆత్మహత్యపై కేసు పిడుగురాళ్ల: పిడుగురాళ్ల పట్టణంలో షేక్ దరియా హుస్సేన్ పోలీసుల వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది. అయితే ఈ కేసులో దరియా వలి భార్య అమిరునిషాబేగం ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. అమిరునిషా బేగంకు ఇల్లు అమ్మిన పులుకూరి లక్ష్మీ, ప్రశాంత్ల వేధింపులతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదు చేయటంతో దాచేపల్లి సీఐ ఖాజావలి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ ఎం. మోహన్తెలిపారు. -
పోలీసులపై కేసులేవి?
మైనార్టీ ఉద్యోగి మరణానికి కారణమైన పిడుగురాళ్ల: సీఐ వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన మైనార్టీ వర్గానికి చెందిన ఉద్యోగి షేక్ దరియా హుస్సేన్ కేసును నీరుగార్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారని పల్నాడు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మండిపడ్డారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘ఆత్మహత్య చేసుకున్న దరియా హుస్సేన్ రాసిన సూసైడ్ లేఖ, మరణవాంగ్మూలం వీడియో ఉన్నాయి. ఇవి ఉంటే నేరుగా కేసు కట్టాలని న్యాయవ్యవస్థే చెబుతోంది. కానీ పిడుగురాళ్ల పోలీసులు ఇద్దరు వ్యక్తులపై కేసుకట్టి చేతులు దులుపుకోవటం దుర్మార్గం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడి ఆత్మహత్యతో పోలీసులకు సంబంధం లేదని మీడియాకు చెప్పాలని, ఇదే విషయమై సంతకాలు పెట్టాలని పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చి బెదిరిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఉన్నతాధికారులు తమను పంపించారని భయపెడుతున్నారని చెప్పారు. చెప్పినట్టు వినకపోతే మీ బిడ్డలపై కేసులు నమోదు చేస్తామని తీవ్రమైన బెదిరింపులకు దిగడం దారుణమన్నారు. ఎమ్మెల్యే యరపతినేని చెబితేనే తాను చేస్తున్నానని, తనపై కేసులు పెడితే ఎవరు ఎవరు ఉన్నారో చెబుతానని సీఐ వెంకట్రావు బహిరంగంగా చెబుతున్నారని ఆరోపించారు. దరియా హుస్సేన్ కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, అతడి ఆత్మహత్యకు కారణమైన పోలీసులపై కేసులు కట్టే వరకు తమ పోరాటం ఆగదని చెప్పారు. ప్రభుత్వం హుస్సేన్ కుటుంబానికి రూ.కోటి నష్టపరిహారం, ఆ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. -
కోవిడ్ కేసులపై భయపడాల్సిన పనిలేదు
మంగళగిరి రూరల్: మంగళగిరిలోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్ )లో కోవిడ్ కేసు నమోదయిందంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ అయిన విషయంపై ఎయిమ్స్ అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ రాకేష్ గురువారం స్పందించారు. కోవిడ్ కేసులపై ఎవరూ భయపడాల్సిన పనిలేదని, ఎయిమ్స్లో ఎవరూ కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. ముందు జాగ్రత్తగా ఔట్ పేషెంట్ విభాగంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని, ఇద్దరు డాక్టర్లను ప్రత్యేకంగా నియమించామన్నారు. కోవిడ్ రోగుల కోసం ముందస్తు జాగ్రత్త చర్యగా 10 బెడ్లతో సపరేటు వార్డు ఏర్పాటు చేశామని తెలిపారు. గుంటూరు మెడికల్: విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తిని నింపేందుకు గుంటూరు వైద్య కళాశాల మెన్స్ హాస్టల్లో టేబుల్ టెన్నిస్ కోర్టును ప్రారంభిస్తున్నట్లు గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి చెప్పారు. గురువారం అమరావతి రోడ్డులోని మెన్స్ మెడికల్ హాస్టల్లో రూ. 2.50 లక్షలతో ఏర్పాటు చేసిన టేబుల్ టెన్నిస్ పరికరాలను ఆయన ప్రారంభించారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ శివగోపాల్, ఫిజికల్ డైరెక్టర్ అజయ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. రెంటచింతల: పూర్వీకులు నిర్మించిన ఆలయాలు మన చరిత్రకు సజీవ సాక్ష్యాలని పల్నాడు జిల్లా దేవదాయ శాఖ అధికారి జీఏవీ శ్రీనివాసు అన్నారు. గురువారం తుమృకోట గ్రామంలోని పాత శివాలయం పునర్నిర్మాణానికి టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మంజూరైన రూ. 15 లక్షల చెక్కును ఆయన ఆలయ కమిటీ వారికి అందజేసి మాట్లాడారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలించిన తుమృకోట గ్రామంలో సుమారు 400 సంవత్సరాల చరిత్ర కిందట నిర్మించిన పాత శివాలయం శిథిలమైనట్లు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యుల కృషి మేరకు రూ. 15 లక్షల నిధులను టీటీడీ శ్రీ వాణి ట్రస్ట్ మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. మండల దేవదాయ శాఖ అధికారి గాదె రామిరెడ్డి, ఆలయ అధ్యక్షుడు జంగాల వెంకటే శ్వర్లు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు ఎడ్యుకేషన్: టెట్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న ఇన్ సర్వీసు ఉపాధ్యాయుల ప్రయోజనార్ధం ఈనెల 19న గుంటూరులోని ఏసీ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి తెలుగు సబ్జెక్టుపై అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్రావు, ఎం.కళాధర్ తెలిపారు. గురువారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో అవగాహన తరగతుల పోస్టర్ విడుదల చేశారు. నెల్లూరుకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు ఆర్.వెంకట్రావు తరగతులు బోధిస్తారని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు పాల్గొని జిల్లాల విభజనపై తాజా సమాచారాన్ని తెలియజేస్తారని పేర్కొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు, జిల్లా సహాధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, బి.ప్రసాద్, కె.రంగారావు, కె.కేదార్నాథ్, శ్రీధర్ పాల్గొన్నారు. -
డీఎస్ఏ స్టేడియంలో వి‘ధ్వంస’రచన
● ఒక్కరోజు సీఎం, కేంద్ర మంత్రి పర్యటన కోసం పలు క్రీడా కోర్టులు కూల్చివేత ● ఆరుచోట్ల స్టేడియం ప్రహరీకి తూట్లు ● డ్రైనేజీ కనిపించకుండా రూ.లక్షల వ్యయంతో పరదాలు ● మళ్లీ స్టేడియంలో సౌకర్యాల కల్పనకు రూ.లక్షల్లో బిల్లులు నరసరావుపేట: క్రీడాకారులు, క్రీడా ప్రేమికులు ఎంతో అనుబంధం పెంచుకున్న జిల్లా స్పోర్ట్స్ అకాడమీ క్రీడల (కోడెల) స్టేడియం.. సీఎం చంద్రబాబు రాకతో ధ్వంసం అవుతోంది. అరకొర సౌకర్యాలున్నా.. నెట్టుకొస్తున్న ఈ స్టేడియానికి చిక్కులు వచ్చి పడుతున్నాయి. శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన కోసం ధ్వంసం చేసి మరీ ఏర్పాట్లు చేశారు. స్టేడియానికి ఎదురుగా ఉన్న ప్రహరీని ఆరుచోట్ల పగలగొట్టి వీఐపీ, పబ్లిక్ అంటూ రాకపోకలకు మార్గాలు ఏర్పాటు చేశారు. స్టేడియం లోపల ఉన్న క్రికెట్ ఆడే పిచ్లు, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్ల కోర్టులను ధ్వంసం చేస్తూ ముఖ్య అతిథులు, కార్యక్రమం కోసం వచ్చే వారు కూర్చునేందుకు పెద్ద జర్మన్ గుడారాలను నిర్మించారు. అలాగే స్టేడియానికి ఎదురుగా రోడ్డు మార్జిన్లో చిరు వ్యాపారాలు ఏర్పాటు చేసుకున్న స్టాళ్లను తొలగించి వారి జీవనోపాధిని దెబ్బగొట్టారు. ఆ మార్గంలో పలు షాపుల ముందు నిర్మించుకున్న మెట్లు, ఇతర కట్టడాలను తొలగించారు. అలాగే స్టేడియానికి పట్టణంవైపున రాకపోకలు చేసే ముఖ్య అతిథులు, ప్రజలకు కత్తవ డ్రైనేజ్ కన్పించకుండా సుమారు రూ.లక్ష వ్యయంతో తెరలు ఏర్పాటు చేశారు. స్టేడియంలోకి సత్తెనపల్లి రోడ్డు నుంచి స్విమ్మింగ్పూల్ వైపున ప్రవేశించే మార్గంలో ఉన్న పెద్దగేటును పెకిలించి స్టేడియం ఆవరణలో పడేశారు. స్టేడియం ఏర్పాటై సుమారు 24ఏళ్లు గడుస్తోంది. ఈ కాలంలో స్టేడియం ఆవరణలో గతంలో ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. వాటికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రులు, ప్రముఖ గాయకుడు బాలసుబ్రమణ్యం లాంటి వీవీఐపీలు ఎందరో పాల్గొన్నారు.. అయితే స్టేడియంలో సౌకర్యాలను మాత్రం ధ్వంసం చేస్తూ ఏర్పాట్లు చేయటం ఇదే తొలిసారని అధికారులు, ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ధ్వంసమైన సౌకర్యాలు మళ్లీ పునరుద్ధరించాలంటే లక్షల ప్రజాధనం ఖర్చు చేయాల్సిందే. ముఖ్యమంత్రి పాల్గొనే ప్రతి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 నుంచి రూ. 6 కోట్లు ప్రజాధనం ఖర్చు చేస్తోందని అధికారులు చెబుతున్నారు. -
అమ్మోనియా భద్రతపై అవగాహన
కొరిటెపాడు(గుంటూరు): జిల్లాలోని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల అమలు, ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఫ్యాక్టరీల శాఖ ఆధ్వర్యంలో గురువారం గుంటూరు జీటీ రోడ్లోని టుబాకో అసోసియేషన్ హాల్లో నిర్వహించిన అవగాహన సదస్సుకు 81 ఫ్యాక్టరీల యాజమాన్యాలు, ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డెప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శివకుమార్రెడ్డి మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజ్లలో వినియోగించే అమ్మోనియా గ్యాస్ అత్యంత ప్రమాదకరమైనదని, అందువల్ల భద్రతా ప్రమాణాలను ఏ మాత్రం విస్మరించరాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా కంప్రెసర్ గదుల్లో ఉన్న అమ్మోనియా నిల్వ ట్యాంకులను బయట ఏర్పాటు చేయడం ద్వారా భారీ ప్రమాదాలను సమర్థంగా నివారించవచ్చని తెలిపారు. గ్యాస్ లీకేజీలు, పేలుళ్లు వంటి ప్రమాదాలు సంభవించకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జీరో ప్రమాద మరణాలే లక్ష్యం.. కోల్డ్ స్టోరేజ్ల అసోసియేషన్ అధ్యక్షుడు సురేంద్రబాబు మాట్లాడుతూ శివకుమార్ రెడ్డి చేపట్టిన అవగాహన కార్యక్రమాలు, శిక్షణల వల్లే పరిశ్రమల యాజమాన్యాల్లో భద్రతపై స్పష్టమైన అవగాహన ఏర్పడిందని చెప్పారు. ఈ చైతన్యమే అమ్మోనియా ట్యాంకుల స్థాన మార్పుతో పాటు భద్రతా ప్రమాణాల అమలుకు దోహదపడిందన్నారు. సదస్సులో కోల్డ్ స్టోరేజ్ అసోసియేషన్ కార్యదర్శి రాఘవయ్య, అసిస్టెంట్ జిల్లా అగ్నిమాపక అధికారి కృష్ణారెడ్డి, వివిధ సంస్థల సేఫ్టీ అధికారులు, పరిశ్రమల యాజమాన్యాలు, భద్రతా ప్రతినిధులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ లీగల్సెల్ రాష్ట్ర కార్యదర్శిగా మణిబాబు
నరసరావుపేట: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సత్తెనపల్లికి చెందిన చిన్నం మణిబాబును లీగల్సెల్ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మాచర్లకు చెందిన మేరాజ్యోత్ హనుమానాయక్ను పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి మాచర్ల: పట్టణంలోని గుర్తు తెలియని వ్యక్తి గురువారం తెల్లవారు జామున బస్టాండ్ ఎదురు వెంగమాంబ కాంప్లెక్స్ వద్ద మృతి చెందాడు. సుమారు 42 సంవత్సరాలు కలిగిన వ్యక్తి అపస్మారక స్థితిలో మృతిచెందినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని పట్టణ పోలీసులు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్టు వారికి తెలుపగా పోలీసుల సహకారంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎవరైనా స్నేహితులు, బంధువులు సంబంధిత వ్యక్తిని గుర్తుపడితే మాచర్ల పట్టణ పోలీసు స్టేషన్ను సంప్రదించాలన్నారు. స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్టు చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రి మార్చురికి చేర్చారు. ద్విచక్ర వాహనాల దొంగలు అరెస్టు నూజండ్ల: ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఇరువురు దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు ఐనవోలు ఎస్సై బి.వి.కృష్ణారావు గురువారం తెలిపారు. పల్నాడు జిల్లా పరిధిలో ఇటీవల ద్విచక్రాల చోరీ అధికమవుతున్నట్లు పలు ఫిర్యాదులు అందుతున్న నేపథ్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడమైందని అన్నారు. సీఐ బి.బ్రహ్మయ్య ఆదేశాలతో సిబ్బందితో కలిసి ముప్పరాజువారిపాలెం గ్రామంలో అనుమానాస్పదంగా ఉన్న ఇరువురు వ్యక్తులను అదుపులోనికి తీసుకుని విచారించటం జరిగిందన్నారు. గ్రామానికి చెందిన దుర్గంపూడి సుబ్బారావు, నందిగం వెంకటశివయ్యలుగా గుర్తించామన్నారు. వివిధ సంఘటనల్లో ఆరు ద్విచక్ర వాహనాలు దొంగిలించినట్లు వారు అంగీకరించటంతో కేసు నమోదు చేసిన ట్లు తెలిపారు. కారెంపూడిలో ఐపీ దాఖలు చేసిన వ్యాపారి కారెంపూడి: ఒక వ్యాపారి రూ. కోటిన్నరకు పైగా ఇన్సాల్వెన్సీ పిటిషన్ (ఐపీ) దాఖలు చేశారని సమాచారం గురువారం రాత్రి సంచలనం రేపింది. సదరు వ్యాపారి 22 మంది వద్ద మొత్తం రూ. 1,52,50,000లు అప్పుగా తీసుకుని వారందరికి ప్రాంసరీ నోట్లు రాసిచ్చారు. వారందరికి కూడా ఐపీ నోటీసులు సిద్ధం చేసినట్లు సమాచారం. అప్పు చెల్లించాలని అడుగుతున్నవారికి అప్పు చెల్లిస్తానని చెబుతూ వచ్చి తీరా ఐపీ దాఖలు చేయడంతో అప్పులిచ్చినవారంతా ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి, పొదుపు పథకాలు నడుపుతున్నాడనే నమ్మకంతో వ్యాపారులు అతనికి కూడా లక్షల్లో అప్పులిచ్చారని తెలుస్తోంది. సినీ రచయిత కోన వెంకట్కు మాతృ వియోగం బాపట్ల: సినీ రచయిత నిర్మాత కోన వెంకట్కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి కోన ధర్మావతి (82 )బుధవారం రాత్రి వైజాగ్లో కన్నుమూశారు. ఆమె మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి వదిన. ధర్మావతి మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
విజ్ఞాన్కు జాతీయ స్థాయిలో స్వయం ఎన్పీటీఈఎల్ ‘ఏఏ’ గ్రేడ్
చేబ్రోలు: మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీకి భారతీయ సాంకేతిక విద్యా రంగంలో ప్రతిష్టాత్మక గుర్తింపుగా నిలిచే ఐఐటీ మద్రాస్ స్వయం– ఎన్పీటీఈఎల్ విడుదల చేసిన జాతీయ స్థాయి ర్యాంకింగ్స్లో ‘ఏఏ’ గ్రేడ్ లభించిందని వైస్ చాన్స్లర్ కేవీ క్రిష్ణకిషోర్ గురువారం తెలిపారు. దేశవ్యాప్తంగా స్వయం–ఎన్పీటీఈఎల్ లోకల్ చాప్టర్ల పనితీరు ఆధారంగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో విజ్ఞాన్ యూనివర్సిటీ 22వ జాతీయ ర్యాంక్ను సాధించి ‘ఏఏ’ గ్రేడ్ను కైవసం చేసుకుందని తెలిపారు. ఎన్పీటీఈఎల్ నిర్వహించిన వివిధ ఆన్లైన్ కోర్సుల్లో విజ్ఞాన్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొత్తం 5,851 కోర్సు సర్టిఫికెట్లను సాధించారని చెప్పారు. 2026 జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఎన్పీటీఈఎల్ విద్యార్థులు ప్రదర్శించిన విశిష్ట ప్రతిభ, కోర్సులలో నమోదు, ఉత్తీర్ణత శాతం, టాపర్ విజయాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ‘ఏఏ’ గ్రేడ్ ప్రదానం చేసినట్లు పేర్కొన్నారు. గ్రేడ్ సాధించేందుకు కృషి చేసిన ఎన్పీటీఈఎల్ లోకల్ చాప్టర్ కోఆర్డినేటర్లు, అధ్యాపకులు, విద్యార్థులు, విభాగాధిపతులను చైర్మన్ లావు రత్తయ్య అభినందించారు. -
భక్తిశ్రద్ధలతో కార్మెల్మాత ఉత్సవాలు
ఫిరంగిపురం: మండల కేంద్రంలో నిర్వహిస్తున్న కార్మెల్మాత ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. కొండపై పలు ప్రాంతాల నుంచి వచ్చిన క్రైస్తవ విశ్వాసులు భక్తిశ్రద్ధలతో కార్మెల్మాతను దర్శించుకున్నారు. కొవ్వొత్తులు వెలిగించి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల సందర్భంగా బాల ఏసుదేవాలయంలో విచారణ గురువులు ఫాతిమామర్రెడ్డి ప్రధాన యాజకులుగా ఉండి దివ్యపూజా నిర్వహించారు. భక్తులకు దేవుని సందేశం వినిపించారు. కొండపై 9గంటలకు ఏర్పాటు చేసిన దివ్యపూజాబలి కార్యక్రమంలో విజయవాడ పీఠాధిపతి టి.రాజారావు పాల్గొని వాక్యోపదేశం చేశారు. కోరిన వరాల నిచ్చే మాతగా కార్మెల్ మాతను భక్తులు విశ్వసిస్తారన్నారు. మాతపై విశ్వాసంతో ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక ప్రశాంతత, అమ్మ అనుగ్రహం లభిస్తాయని చెప్పారు. అనంతరం 10.30 గంటలకు కార్మెల్మాత సమిష్టి దివ్యపూజా బలి కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన యాజకులుగా గుంటూరు మేత్రాసన నూతన అభిషిక్త గురువులు పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు తాగునీరు, అన్నదానం, వైద్యసదుపాయాలు కల్పించారు. పోలీసు సిబ్బంది, వలంటీర్లు భక్తులకు రద్దీలేకుండా చేస్తూ వారిరాకపోకలు పర్యవేక్షించారు. ఉత్సవాలు ప్రశాత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. -
యథేచ్ఛగా పేకాట, గంజాయి రవాణా
సత్తెనపల్లి: బహిరంగంగా పేకాట క్లబ్లు నడుస్తున్నా, గంజాయి విచ్చలవిడిగా అక్రమ రవాణా జరుగుతున్నా పోలీసులకు కనిపించడం లేదా అని వైఎస్సార్ సీపీ సత్తెనపల్లి నియోజక వర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్రెడ్డి విమర్శించారు. పట్టణంలోని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అనకాపల్లి జిల్లాలో పట్టుబడిన 200 కేజీల గంజాయి అక్రమ రవాణా కేసులో సత్తెనపల్లికి చెందిన ఇరువురు పట్టుబడ్డారన్నారు. గంజాయి ప్రస్తుతం విచ్చలవిడిగా లభిస్తున్నందున ఆ మత్తులో యువత ఘర్షణలకు దిగుతున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ నాయకులు, ఎల్లో మీడియా గత ప్రభుత్వంపై అనేక విమర్శలు చేసినా... అధికారంలోకి వస్తే వంద రోజుల్లో గంజాయి ఆనవాళ్లు లేకుండా చేస్తామని కూటమి నేతలు ఊదరగొట్టారన్నారు. అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా పట్టించు కోవడం లేదని చెప్పారు. విద్యార్థులు జీవితాలను గంజాయి మత్తులో నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ఇటీవల గంజాయి మత్తులో ఓ దుకాణదారుడిపై గొడవకు దిగిన వీడియో వైరల్గా మారినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. డీజేలు, వైఎస్సార్ సీపీ చేపట్టే ర్యాలీలకు ఆంక్షలు విధించడం మిగతా విషయాల్లో పోలీసులు సాధించింది శూన్యమన్నారు. సామాన్యులు, వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై ప్రతాపం చూపుతున్నారని మండిపడ్డారు. అనకాపల్లి కేసులోని ఇరువురు అధికార కూటమికి సంబంధించి ఆర్మీ గ్రూపుగా ఏర్పడిన వారిలోని బాధ్యులన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జునయాదవ్పై అక్రమకేసు పెట్టి అరెస్టు చేశారన్నారు. కక్ష సాధించడానికి ఎప్పుడో మాట్లాడిన మాటలను వక్రీకరించి అడ్డగోలుగా కేసులు పెడుతున్నట్లు పేర్కొన్నారు. -
టీటీడీకి రూ.30 లక్షల విరాళం
గుంటూరు మెడికల్: టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు నగరానికి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్, బ్రిందా న్యూరో సెంటర్ అధినేత డాక్టర్ హనుమ శ్రీనివాసరెడ్డి రూ.10,00,116, శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116, బర్డ్ ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించింది. శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు బ్రింద హాస్పటల్ అధినేతలు డాక్టర్ భవన హనుమ శ్రీనివాసరెడ్డి, వసంత సిద్ధార్ధలు ఈ విరాళం డీడీలను అందజేశారు. కార్యక్రమంలో టీటీడీపాలక మండలి సభ్యులు, నాట్కో ట్రస్టు ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో వారాహి నవరాత్రులు ప్రారంభం సత్తెనపల్లి: పట్టణంలోని శ్రీ త్రిశక్తి దుర్గాపీఠంలో వారాహి నవరాత్రులు బుధవారం భక్తిశ్రద్ధలతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించనున్న వేడుకల్లో భాగంగా అమ్మవారికి నవరాత్రులు భక్తిశ్రద్ధలతో చేస్తే శత్రు బాధలు, ఇతర సమస్యలు తొలగిపోతాయని, సకల విజయాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం. బుధవారం శ్రీ త్రిశక్తి దుర్గా పీఠంలో దుర్గామాతను వారాహిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టోత్తర శతనామాలతో అర్చనలు, గాయత్రి మూలమంత్రంతో సామూహిక కుంకుమ పూజలు, గాజులతో పూజలు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ పీఠాధిపతి వెలిదండ్ల హనుమత్ స్వామి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పొంగలి షెడ్డు నిర్మాణానికి విరాళం తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని 17వ వార్డులో ఉన్న శ్రీ గంగానమ్మ ఆలయంలో పొంగలి షెడ్డు నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ తన సొంత నిధుల నుంచి రూ. 1.50 లక్షల విరాళం అందజేశారు. ఆయన తరఫున బుధవారం టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకటరావు ఈ మొత్తాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాడిబోయిన భాస్కర్, గుద్దంటి నాగేశ్వరరావు, ఇట్టా భాస్కర్, నిర్మల, రాంబాబు, గోపి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. కారెంపూడిలో ఈఎఫ్ల చోరీ కారెంపూడి: పల్నాడు జిల్లా కారెంపూడి–2 గ్రామ సచివాలయంలో మంగళవారం రాత్రి దొంగలు పడ్డారు. ప్రధాన ద్వారం తాఽళం, తర్వాత లోపల బీరువా తాళాలు పగలగొట్టి అందులో ఉన్న ఎస్ఐఆర్కు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు ఎత్తుకెళ్లారని తెలుస్తోంది. దాదాపు 50 ఫారాలు దొంగిలించారని ఎంపీడీఓ జి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. అవన్నీ ఆధార్ లింకు కానివని, చిరునామా మార్పు కోసం పెట్టినవిగా పేర్కొన్నారు. సర్ ప్రక్రియ గడువు పొడిగించిన నేపథ్యంలో డేటా రికవరీకి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కేవలం ఈ ఫారాల కోసమే కార్యాలయం మొత్తం దుండగులు వెతికినట్లుగా ఉందన్నారు. మిగతా వారి ఫారాలన్నీ బీఎల్ఓల వద్ద సురక్షితంగా ఉన్నాయని ఎంపీడీఓ తెలిపారు. ఆయనతోపాటు తహసీల్దార్ ఆర్. వెంకటేశ్వర్లునాయక్ ఆదేశాల మేరకు సచివాలయం–2 కార్యదర్శి కె. కోటేశ్వరరావు నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
హక్కులు, చట్టాలపై అవగాహన అవసరం
సత్తెనపల్లి: ప్రతి పౌరుడు వినియోగదారుల హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి సయ్యద్ జియావుద్దీన్ అన్నారు. సత్తెనపల్లి మండలం కంకణాలపల్లి సచివాలయంలో కూలీలకు బుధవారం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. కూలీలు తమ హక్కులు, చట్టపరమైన రక్షణలపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనుకోని ప్రమాదాలు, ఇతర న్యాయ పరమైన సమస్యలు ఎదురైనప్పుడు పారాలీగల్ వలంటీర్లను సంప్రదించాలన్నారు. ప్రతి కుటుంబం జనన, వివాహ తదితర కీలక ధ్రువపత్రాలను తప్పనిసరిగా పొందాలని సూచించారు. ముందుగా పట్టణంలోని సబ్జైల్ను ఆయన సందర్శించారు. రాజీ మార్గమే రాజ మార్గమని, లోక్ అదాలత్ తీర్పు అంతిమం అన్నారు. ఈ సందర్భంగా పలు చట్టాల గురించి వివరించారు. ఆయా కార్యక్రమాలలో ప్యానల్ న్యాయవాది బీఎల్ కోటేశ్వరరావు (సత్తెనపల్లి), కాళిదాసు (గుంటూరు), పారాలీగల్ వలంటీర్లు షేక్ సుభాని, వెంకటేశ్వర రావు, కోర్టు సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
యువతకు ఓటు నమోదు అవకాశం
సత్తెనపల్లి: ప్రజాస్వామ్య ప్రక్రియలో యువత భాగస్వామ్యాన్ని మరింత పెంచడమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. 17 ఏళ్లు నిండిన యువత ముందస్తుగానే ఓటర్ జాబితాలో పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. వారికి 18 ఏళ్లు నిండిన తర్వాతే తుది ఓటరు జాబితాలో పేరు నమోదు అవుతుంది. మారిన నిబంధనలు... గతంలో ఉన్న నిబంధనల ప్రకారం .. కేవలం జనవరి 1 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉండేది. జనవరి 2న 18 ఏళ్ల నిండినా.. ఓటరుగా నమోదు కావడానికి మరో ఏడాది పాటు వేచి చూడాల్సి వచ్చేది. యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రజా ప్రాతినిధ్య చట్టంలో కీలక సవరణలు తీసుకొచ్చింది. దీని ప్రకారం భారత ఎన్నికల సంఘం సంవత్సరానికి నాలుగు అర్హత తేదీలను అందు బాటులోకి తెచ్చింది. జనవరి , ఏప్రిల్ , జూలై , అక్టోబర్ ఒకటో తేదీల్లో పదిహేడేళ్లు నిండి ఉంటే సంబంధిత యువత ఫారం–6 ద్వారా ముందస్తుగా దరఖాస్తు చేసుకోవచ్చు. యువతా మేలుకో.. భారత ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయంతో జిల్లాలో సుమారు 29వేల మందికి పైగా యువతకు సరికొత్తగా ఓటరుగా మారే అవకాశం లభించనుంది. జిల్లాలోని విద్యా సంస్థల గణాంకాలను పరిశీలిస్తే 2023–24 పదో తరగతి విద్యార్థులు 29,423 మంది. 2023–24 విద్యాసంస్థల్లో పరీక్షలు రాసే సమయానికి 15 ఏళ్లు నిండిన విద్యార్థుల వయసు 2026 నాటికి 17 ఏళ్లకు చేరుకుంటుంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం, డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న వేలాది మంది విద్యార్థులు ఇప్పుడు 17 నుండి 18 ఏళ్ల వయసు గ్రూపులోకి వస్తున్నారు. వీరందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సి ఉంది. 17 ఏళ్లు నిండిన తర్వాత ఓటరుగా నమోదు చేసుకోవడానికి వయసు, నివాస ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు పరిశీలిస్తారు. వారు ధ్రువపత్రాలను ఆన్లైన్, వ్యక్తిగతంగా పరిశీలించిన తర్వాత, అర్హులకు ఓటు హక్కు ఇవ్వాలా? లేదా? అనేది నిర్ణయిస్తారు. దరఖాస్తు ప్రక్రియ 17 ఏళ్లకే ప్రారంభమైనప్పటికీ, సదరు యువతకు 18 ఏళ్లు పూర్తిగా నిండిన తర్వాతే వారి పేర్లు తుది ఓటరు జాబితాలో ప్రచురితమవుతాయి. ఈ సరికొత్త విధానంపై అవగాహన పెంచడానికి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లోనే ప్రత్యేక నమోదు శిబిరాలను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. -
ప్రాణాలే బలి.. ఈ ఖాకీని ఏమనాలి?
సాక్షి, నరసరావుపేట: అధికార మదానికి ప్రభుత్వ, పోలీసు పెద్దల సహకారం తోడైతే ఎంతటి అరాచకాలకు పాల్పడతారనే దానికి నిదర్శనం పిడుగురాళ్ల సీఐ శ్రీరాం వెంకట్రావు వ్యవహరిస్తున్న తీరు. ఇప్పటికే పదుల సంఖ్య వైఎస్సార్సీపీ సానుభూతిపరులను అక్రమ కేసులతో వేధించడం, అక్రమ వసూళ్లకు పాల్పడటం అలవాటుగా మారింది. అధికార పార్టీ నేతలు చెప్పిందే చట్టంగా విధులు నిర్వహిస్తూ తీవ్ర వివాదస్పదంగా వ్యవహరిస్తున్నా పోలీసు బాసులు మాత్రం పట్టనట్టు ఉంటూ పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిత్యం పోలీసుస్టేషన్లో సివిల్ పంచాయితీలు చేస్తూ అక్రమార్జనలో కొత్త రికార్డులను సృష్టిస్తున్నాడు. సీఐ వేధింపులు తాళలేక ఓ ఆర్యవైశ్య మహిళ స్టేషన్లోనే కత్తితో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. సరిగ్గా నెల క్రితం దళిత యువకుడు సురేంద్ర నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి ప్రయత్నం చేసి చావుబతుకుల్లోంచి బయటపడ్డారు. అది మరువక ముందే సీఐ సివిల్ పంచాయితీల దాహానికి ఓ మైనారిటీ ఉద్యోగి ఏకంగా ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఇంత జరుగుతున్నా జిల్లా పోలీసులు మాత్రం అతను చనిపోవడానికి కారణాలు తెలియాల్సి ఉందంటున్నారు. అతడే సూసైడ్ నోట్ రాశాడని గ్యారెంటీ ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పిడుగురాళ్ల సీఐ వ్యవహారశైలి తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సానుభూతిపరులే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడుతున్నాడు. పిడుగురాళ్ల పరిధిలోని ఓ గ్రామంలో రాజకీయ నాయకుడి విగ్రహం చేయి విరిగింది. దాంతో ఏమాత్రం సంబంధం లేని వైఎస్సార్సీపీ కార్యకర్తను స్టేషన్కు తీసుకువచ్చి భారీ మొత్తంలో డబ్బులు ఇస్తేనే ఆ కేసులో ఇరికించనని బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. గాలికి అధికారపార్టీ ఫ్లెక్సీ చిరిగినా దానికి కారణం మీరేనంటూ వైఎస్సార్సీపీ నేతలను వేధించి తీవ్రంగా హింసించడంతోపాటు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలున్నాయి. వైఎస్సార్సీపీ సోషల్మీడియా యాక్టివిస్టులే లక్ష్యంగా రౌడీషీట్లు, పీడీ యాక్టులు తెరిచినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సివిల్ పంచాయితీలో తలదూర్చి సీఐ వేధించి నా భర్త మరణానికి కారణమయ్యారు. ప్రతి రోజు స్టేషన్కు పిలిపించి తిట్టడం, మహిళా పోలీసులతో కొట్టిస్తానని భయపెట్టాడు. డబ్బులు కట్టకపోతే గంజాయి కేసు పెడతానని బెదిరించారు. ఎస్పీ ఆఫీస్లో గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. నా భర్త సూసైడ్ నోట్లో వివరాలు రాసి చనిపోయారు. నా కుటుంబానికి న్యాయం చేయాలి. – షేక్ అమిరున్, దరియా హుస్సేన్ భార్య పిడుగురాళ్ల పోలీసుస్టేషన్ సివిల్ పంచాయితీలకు అడ్డాగా సీఐ మార్చాడు. స్థానిక ప్రజాప్రతినిధి అండదండలతో ద్వితీయ శ్రేణి నాయకులు నిత్యం ఆర్థిక వ్యవహారాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు, వైఎస్సార్సీపీ నేతలపై వేధింపులు వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఆర్యవైశ్య వ్యాపారులను అనేక మందిని బలవంతంగా స్టేషన్లో ఉంచి వారితో ఆస్తులను రాయించుకున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాల కంట పడకుండా వెనుక ఉన్న క్వార్టర్ట్స్లో ఈ వ్యవహారాలు చక్కబెడుతున్నారని సమాచారం. గత ఏడాది డిసెంబర్లో ఓ ఆర్యవైశ్య మహిళ పోలీసుల వేధింపులు తాళలేక కత్తితో చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇంత జరిగినా సీఐపై చర్యలు తీసుకోకపోవడంతో ఆర్యవైశ్యులు చంద్రబాబు ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులపై తీవ్రంగా మండిపడుతున్నారు. అక్రమ వసూళ్లతో విసిగిన దళిత యువకుడు సురేంద్ర గత నెల 15వ తేదీన ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇప్పుడేమో మైనార్టీ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సీఐపై చర్యలు తీసుకోకపోతే ఇంకెందరి ప్రాణాలు, ఆస్తులు పోతాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే మన రాష్ట్రంలో ప్రాణాలు తీస్తున్నారు, ఆత్మహత్యలకు ఉసిగొలుపుతున్నారు. దీనికి ఉదాహరణ పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు తీరు. దరియాహుస్సేన్ను స్టేషన్కు తీసుకువెళ్లి రూ.30 లక్షలు కట్టాలని డిమాండ్ చేసి అక్రమకేసులు బనాయిస్తానని బెదిరించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. పుట్టినరోజునే చనిపోయే దుస్థితి తెచ్చారంటే ఎంతటి ఘోరమో ఆలోచించాలి. అన్ని పార్టీలలోని మైనారిటీలు ఆలోచించండి. సీఐపై వెంటనే కేసు నమోదు చేసి, ఆ స్టేషన్ విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నాం. సూసైడ్ నోట్ ఉన్నా కేసు పెట్టకుండా బేరసారాలు చేస్తున్నారు. ఆ కుటుంబానికి కనీసం రూ.కోటి ఇచ్చి ఆదుకోవాలి. జగనన్న ప్రభుత్వం రాగానే ఆర్యవైశ్యులు, దళితులు, మైనార్టీలకు అన్యాయం చేసిన పిడుగురాళ్ల స్టేషన్లోనే కేసు నమోదు చేసి బాధ్యులైన పోలీసులను చట్టప్రకారం అరెస్ట్ చేయిస్తాం. – కాసు మహేష్రెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే -
ఖరీఫ్కు ఎల్నినో గండం
ఎల్నినో ప్రభావంతో సాగు భూములన్నీ బీడు భూములుగా మారుతున్నాయని అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎల్నినోతో వానలు కురవని పరిస్థితి నెలకొన్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ప్రత్యామ్నాయం చూపడం లేదు. కనీసం ఏ పంటలు వేయాలో కూడా అవగాహన కల్పించడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శావల్యాపురం: గత ఏడాది ఇదే సీజన్లో వర్షాలు సకాలంలో కురవడంతో జలాశయాలన్నీ నిండుకుండలను తలపించాయి. పంట కాల్వల్లో నిండుగా నీరు రావడంతో రైతులు ఆనందంగా పంటలు సాగు చేశారు. ఈ ఏడాది మాత్రం అందుకు విరుద్ధంగా వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకోవడం, కర్ణాటక ఎగువ జలాశయాల నుంచి వరద నీటి ఉధృతి లేకపోవడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని కాల్వలన్నీ ఒట్టిపోయి ఉన్నాయి. వర్షాలు లేకపోవడంతోపాటు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రాకపోవడం కూడా రైతులకు శాపంగా మారింది. దానికి తోడు నిత్యం అధిక ఉష్ణోగ్రతల తీవ్రతతో భూమిలో తేమ కోల్పోయి పంట భూములన్నీ బీటలువారుతున్నట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతులు కూలీ పనులకు వెళ్లలేక, మరోవైపు వర్షాలు లేక సాగు చేయలేక అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. నిదర్శనం ఇదిగో... వినుకొండ నియోజకవర్గంలో 23,337 హెక్టార్ల సాగు భూములు ఉండగా, ఇప్పటి వరకు కేవలం బోరు బావుల ఆధారంగా 1,143 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగు చేశారు. ప్రస్తుతం బోరు బావుల్లో ఉన్న నీరు కూడా వేడి గాలులకు ఎండిపోవడంతో ఉన్న కాస్త పంట కూడా దక్కదని రైతులు వాపోతున్నారు. శావల్యాపురం మండలంలో వ్యవసాయ అధికారుల లెక్కల మేరకు ఎకరం కూడా సాగు కాలేదు. వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పాడి పరిశ్రమ కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం గేదెలకు గ్రాసం కొరత ఏర్పడింది. శావల్యాపురం 3,164 00 ఈపూరు 5,478 78 నూజెండ్ల 5,744 80 బొల్లాపల్లి 4,794 790 వినుకొండ రూరల్ 4,157 195 -
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల దరఖాస్తు గడువు పెంపు
డీఈఓ రామారావు నరసరావుపేట ఈస్ట్: రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం– 2026 దరఖాస్తు గడువును ఈనెల 15 నుంచి 20వ తేదీ వరకు పొడిగించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు మంగళవారం తెలిపారు. అర్హులైన వారిని డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గుర్తించి వారు దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించి సంబంధిత అధికారికి దరఖాస్తులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రైవేటు, అన్ఎయిడెడ్ పాఠశాలలు మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేసే పాఠశాలల్లో కనీసం 10 సంవత్సరాల క్రమబద్ధమైన సేవను పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని స్పష్టం చేశారు. అర్హత గల ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను ఈనెల 20వ తేదీ లోగా సంబంధిత డిప్యూటీ డీఈఓ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. పిడుగురాళ్ల: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్వై వార్షిక 2026లో జూనియర్ డాక్టర్స్ నెట్వర్క్(జేడీఎన్) రాష్ట్ర చైర్మన్ 2026–28 పదవికి పిడుగురాళ్ల పట్టణానికి చెందిన డాక్టర్ దూళ్లిపాళ్ల భరత్కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఆయన మంగళవారం తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలను ఐఎంఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ చైర్మన్ డాక్టర్ జీఎస్ మూర్తి అధికారికంగా ప్రకటించినట్లు తెలిపారు. ప్రస్తుతం డాక్టర్ దూళ్లిపాళ్ల భరత్కుమార్ పిడుగురాళ్ల ఐఎంఏ శాఖ అధ్యక్షులుగా, ఐఎంఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా భరత్కుమార్ను పలువురు వైద్యులు అభినందించారు. దాచేపల్లి: గూడ్స్ రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం రాత్రి రాత్రి 8:30 గంటల సమయంలో పొందుగల–నడికుడి రైల్వేస్టేషన్ల మధ్య ఓ మహిళ నడుచుకుంటూ వెళుతోంది. గమనించిన గూడ్స్రైలు లోకో పైలట్ పలు మార్లు గట్టిగా హారన్ మోగించినప్పటికి సదరు మహిళ పట్టాలపై నుంచి పక్కకు తప్పుకోలేదు. దీంతో గూడ్స్రైలు కిందపడి మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి శరీరంపై పింక్ కలర్ పూల డిజైన్చీర, నలుపు రంగు జాకెట్ ఉన్నది. నడికుడి రైల్వే పోలీస్లు మృతదేహాన్ని పరిశీలన చేసి కేసు నమోదు చేసి పోస్ట్మార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు నడికుడి రైల్వే పోలీసుల సెల్ నెంబర్ 92475 85720, 94403 73372 సంప్రదించాలని కోరారు. -
ముద్రగడ మృతి తీరని లోటు
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాఽభం మృతికి పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మంచితనానికి, నిజాయతీకి నిలువెత్తు నిదర్శనం ముద్రగడ అన్నారు. ఆనాడు ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసి ఆదర్శమైన మంత్రిగా మెలిగారన్నారు. ఇటువంటి నిజాయతీ గల వ్యక్తిని కోల్పోవటం దురదృష్టకరం అన్నారు. ఆయన మృతి రాష్ట్ర భవిష్యత్కు, కాపు ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. బాపట్ల: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతికి మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి సంతాపం తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముద్రగడ మృతి తీరని లోటని కోన అభిప్రాయపడ్డారు. ఉద్యమ నాయకుడిగా ఆయన చూపిన ధైర్యం, నిబద్ధత, ప్రజల పట్ల ఉన్న అంకితభావం ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. పొన్నూరు: ప్రముఖ కాపు నేత, రాజకీయ నాయకుడు, సామాజిక ఉద్యమకారుడు ముద్రగడ పద్మనాభం మృతికి వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం కోసం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రేపల్లె: కాపు ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి కాపు జాతికే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ తీరని లోటని వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్కృష్ణ తెలిపారు. మంగళవారం ఆయన ముద్రగడ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. కాపు సమాజానికి న్యాయం జరగాలనే లక్ష్యంతో ముద్రగడ జీవితాంతం పోరాడారని పేర్కొన్నారు.


