గుంటూరు మెడికల్ : కవి, సేవా తత్పరుడు, గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశస్వి రమణ తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకుగాను ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అవార్డు, ప్రశంసా పత్రం అందుకున్నారు.ఽ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి చేతుల మీదుగా హైదరాబాద్లో జరిగిన ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్లో డాక్టర్ యశస్వి రమణ అవార్డు తీసుకున్నారు. థలసీమియా రోగులకు రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేసినందుకు, వాక్ ఫౌండేషన్ ద్వారా సుమారు 30 ఏళ్లకు పైగా వికలాంగులకు కృత్రిమ కాళ్లు, చేతులు ఉచితంగా అందజేసి వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నందుకు, పేదలకు ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నందుకు డాక్టర్ యశస్వి రమణకు ఎన్టీఆర్ ట్రస్టు అవార్డు, ప్రశంసాపత్రం ఇచ్చి సత్కరించినట్లు ఎన్టీఆర్ ట్రస్టు మేనేజర్ శ్రీకాంత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జిల్లా నుండి డాక్టర్ యశస్వి రమణను మాత్రమే ఎంపిక చేసినట్లు వెల్లడించారు. అవార్డు అందుకున్న డాక్టర్ రమణ యశస్వికి గుంటూరు జీజీహెచ్, గుంటూరు వైద్య కళాశాలకు చెందిన పలువురు వైద్యులు, వైద్యాధికారులు, జిల్లాకు చెందిన పలువురు వైద్యులు, ఐఎంఏ నేతలు, రోటరీ క్లబ్ నేతలు, ఇతర స్వచ్చంద సంస్థల ప్రతినిధులు అభినందనలు తెలిపారు.


