కర్లపాలెం: అగ్రహారం గ్రామంలో ఉన్న గంగా గౌరీ సమేత బదరీ కేదారేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ఆదివారం రాత్రి శివపార్వతుల శాంతి కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో భాగంగా శివాలయంలో ఉదయం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అర్చనలు, అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వేద పండితులు శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉంచి పలు రకాల పూలమాలలతో అలంకరించారు. లోక కల్యాణం కోసం శాస్త్రోక్తంగా శివపార్వతుల శాంతి కల్యాణ మహోత్సవం జరిపించారు. స్వామివారి కల్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు చేసి తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు.


