నిప్పుల పగలు.. చలిరాత్రుల గజగజలు.. హిమసోయగ ఉదయాలు వింత వాతావరణ పరిస్థితులపై ప్రజలు ఆశ్చర్యం
యడ్లపాడు: ప్రకృతి తన పరదాలను వింతగా మార్చుకుంది. చిలకలూరిపేట నియోజకవర్గంలో కాలాలు దోబూచులాడుతున్నాయి. పగటి వేళ భానుడు భగభగలాడుతూ సెగలు గక్కుతుంటే, రాత్రి కాగానే వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ‘చలిపులి’ పంజా విసురుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పంటపొలాల పరిసరాల్లో తెల్లవారుజామున దృశ్యాలు కాశ్మీరాన్ని తలపిస్తున్నాయి. తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేస్తోంది. మంచు తెరల వల్ల జాతీయ రహదారిపై ప్రయాణం సాహసంగా మారింది. ఎదురుగా వచ్చే వాహనం ఆనవాలు కూడా తెలియని రీతిలో మంచు ముసుగు పరుచుకోవడంతో వాహనదారులు దీపాలు వెలిగించుకుని అతి జాగ్రత్తగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు మంచు కురుస్తున్న వేళ ప్రకృతి సోయగం కనువిందు చేస్తున్నా, మరోవైపు వాహనదారులకు మాత్రం అది ఒక సవాలుగా మారింది. ఎండలు మండుతున్నా తగ్గని ఈ పొగమంచు తీవ్రత, నియోజకవర్గ ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది. పగలు సెగలు.. రాత్రి హిమపాతం.. వెరసి చిలకలూరిపేట నియోజకవర్గంపై వాతావరణం ఇప్పుడు ఒక అంతుచిక్కని ప్రకృతి కావ్యంలా ఆవిష్కృతం అవుతోంది.


