జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం హాజరైన ఎంపీ లావు, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎస్పీ కృష్ణారావు పలు విభాగాల మహిళా అధికారులకు ఘన సన్మానం
నరసరావుపేట: మహిళా ఆరోగ్యం, అభ్యుదయం ఉంటేనే అభివృద్ధి సాధ్యపడుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని డీఆర్డీఏ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమీపంలోని పెరేడ్ గ్రౌండ్ ఆవరణలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్ర శాసనసభ విప్ జీవీ ఆంజనేయులు, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, జిల్లా పోలీస్ అధికారి బి.కృష్ణారావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థిక పురోగతి గురించి తెలియజేస్తూ ఏర్పాటుచేసిన స్టాల్స్ను పరిశీలించారు. బ్యాంకు ద్వారా మంజూరు చేసిన ఆటోలను జిల్లా కలెక్టర్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవ రాయలు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సీ్త్ర నిధి, మెప్మా గ్రూపులకు రుణ మెగా చెక్కులు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అనేక సదుపాయాలు మహిళల ఆర్థిక పురోగతి కోసం ఏర్పాటు చేసిన తరుణంలో ప్రతి ఒక్క మహిళ ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని ఆర్థికంగా స్థిరపడాలని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్నందున వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చదువు నేర్చుకోవాలని, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ డిజిటల్ ద్వారా జరిగే అంశాలను తెలుసుకోవాలి అంటే తప్పని సరిగా చదువు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పుడు కొంతమంది మాత్రమే వారి వారి ఆర్థిక పురోగతి గురించి తెలిపారని, రాబోయే మహిళా దినోత్సవం నాటికి వందలాదిమంది ఆర్థిక పురోగతి సాధించాలని కోరారు. కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, పలు విభాగాల మహిళా అధికారులతోపాటు పలు రంగాల్లో విశేష సేవలు అందజేస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు. సాంస్కృతిక నృత్య ప్రదర్శన కార్యక్రమాలు అలరించాయి. డీఆర్డీఏ పీడీ ఝాన్సీరాణి, ఏపీఎం కమలకుమారి, డీసీ హెచ్ఎస్ ప్రసూన, ఐ అండ్ పీఆర్ డీడీ దీప్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సుమారు 3 వేల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల సభ్యులు జిల్లా నలుమూలల నుంచి వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు.


