తరలివచ్చిన భక్తులు
దుర్గి: పల్నాట ప్రసిద్ధిగాంచిన నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి 79వ తిరునాళ్ల మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి వేలాదిగా వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు మొక్కుబడులు చెల్లించుకొని, పొంగళ్లు పొంగించారు. ఆలయ అధికారులు భక్తులకు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేశారు. పలువురు దాతలు మజ్జిగ, అన్నదానాన్ని, పులిహోర పంపిణీ చేశారు. స్థానిక శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, పూజారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం అమ్మవారి పటం, నైవేద్యం అందజేశారు. అడిగొప్పల, ఓబులేశునిపల్లె, నరమాలపాడు, దుర్గి నుంచి 25కుపైగా కుంకుమ బండ్లు సాయంత్రం నుంచి ఆలయానికి చేరుకున్నాయి. ఎటువంటి అంతరాయం లేకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. చైర్మన్ యాగంటి వెంకటేశ్వర్లు, సహాయకార్యదర్శి ఆదిశేషు నాయుడు ఆధ్వర్యంలో భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వాధికారులు వారి విధులను సక్రమంగా నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా నిర్వహించారు.


