నరసరావుపేట ఈస్ట్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలను అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా విజయవంతంగా నిర్వహించాలని డీఈఓ పీవీజే రామారావు తెలిపారు. ఈనెల 16 నుంచి పది పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం పీఎన్సీ అండ్ కెఆర్ కళాశాల ఆడిటోరియంలో జిల్లాలోని 128 పరీక్ష కేంద్రాల అధికారులతో సమావేశం నిర్వహించారు. డీఈఓ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సౌకర్యం తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ప్రతి కేంద్రంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. పరీక్ష విధులకు హాజరయ్యే ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రాన్ని నో సెల్ఫోన్ జోన్గా గుర్తించామనీ, సీఎస్తో సహా ఎవరికీ సెల్ఫోన్ను పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదన్నారు. డిప్యూటీ డీఈఓలు షేక్ సుభానీ, వి.ఏసుబాబు, జిల్లా విద్యాశాఖ ఏడీ పి.వెంకటరమణ, డీసీఈబీ సెక్రటరీ ఐ.కృష్ణానాయక్, రిసోర్స్పర్సన్స్ పాల్గొన్నారు.


