చీరాల: యువత భవిష్యత్ను చిదిమేస్తున్న గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలనకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు చీరాల ఒన్టౌన్ సీఐ ఎస్ సుబ్బారావు అన్నారు. జిల్లా ఎస్పీ బీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు వజ్ర ప్రహార్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసులు శనివారం మెగా కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. చీరాల డీఎస్పీ ఎండీ మొయిన్ ఆధ్వర్యంలో చీరాల ఒన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిజిలీపేట, హరిప్రసాద్ నగర్, దండుబాడు ప్రాంతాల్లో శనివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సోదాల్లో భాగంగా ప్రతి ఇంటిని తనిఖీ చేసి సరైన పత్రాలు లేని 24 ద్విచక్రవాహనాలు, రెండు కార్లు, ఒక ఆటోతో సహా మొత్తం 27 వాహనాలను సీజ్ చేశారు. గంజాయిని కూకటి వేళ్లతో పెకలించి గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని చీరాల ఒన్టౌన్ సీఐ ఎస్ సుబ్బారావు అన్నారు.


