నరసరావుపేట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) అర్జీల పరిష్కారానికి ప్రత్యేక దృష్టితో పనిచేయాలని ఆయా శాఖల జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లకు కలెక్టర్తోపాటు జాయింట్ కలెక్టర్ సంజనా సింహ అధ్యక్షత వహించారు. జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన వారి నుంచి 163 అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ క్లినిక్ ద్వారా 24 అర్జీలు స్వీకరించారు. నరసరావుపేట 15, గురజాల 5, సత్తెనపల్లి డివిజన్ నుంచి 4 అర్జీలు అందుకున్నారు. కలెక్టర్ రెవెన్యూ క్లినిక్ శిబిరాన్ని సందర్శించి కొందరు అర్జీదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పీజీఆర్ఎస్కు అర్జీలు అందజేసేందుకు వచ్చిన దివ్యాంగుల వద్దకు స్వయంగా వచ్చి అర్జీలు స్వీకరించారు. సమస్య తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను నాణ్యతగా సకాలంలో పరిష్కరించాలని అన్నారు. ఆయా శాఖల పరిధిలో గ్రీవెన్స్పై ఆడిట్ నిర్వహించాలని, అర్జీదారులతో మాట్లాడాలని, పెండింగ్ ఆడిట్ పూర్తి చేయాలన్నారు. జిల్లా అధికారులు వారి పరిధిలో ఎప్పటికప్పుడు అర్జీలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. డీఆర్ఓ నారదముని, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.


