● జిల్లాలో 128 పరీక్ష కేంద్రాలు
● హాజరు కానున్న 32,585
మంది విద్యార్థులు
● నో సెల్ఫోన్ జోన్లుగా కేంద్రాలు,
144 సెక్షన్ అమలు
● డీఈఓ కార్యాలయంలో
కంట్రోల్ రూం ఏర్పాటు
నరసరావుపేట ఈస్ట్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
● పల్నాడు జిల్లా పరిధిలోని 470 ఉన్నత పాఠశాలల నుంచి 32,585 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో 256 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు 14,193 మంది, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు 12,322 మంది రెగ్యులర్ పరీక్షలకు హాజరవుతుండగా, 512 మంది సప్లిమెంటరీ, 5,558 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 128 కేంద్రాలను ఏర్పాటు చేశారు.
● నరసరావుపేట డివిజన్లో 68, సతైనపల్లి డివిజన్లో 60 పరీక్ష కేంద్రాలలో విద్యార్థులు హాజరు కానున్నారు. వీటిలో ఏడు కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
● పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమకు కేటాయించిన కేంద్రాన్ని ముందురోజు సందర్శించి నిర్ధారించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తద్వారా ఎటువంటి ఆందోళనకు ఆస్కారం ఉండదని చెబుతున్నారు.
● పరీక్షలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు ఆయా కేంద్రాలకు 128 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 128 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇద్దరు అడిషనల్ డీఓలను నియమించారు.
● అలాగే కేంద్రాలను నిరంతరం తనిఖీ చేసేందుకు 6 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు.
● పరీక్షలు ఈనెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తారు.
● ఇప్పటికే పరీక్ష పత్రాలు ఆయా కేంద్రాల సమీపంలోని పోలీస్స్టేషన్లో భద్రపరిచారు. అలాగే జిల్లా స్టోరేజ్ పాయింట్ను కలెక్టర్ బంగ్లా ఎదురుగా ఉన్న కేబీఆర్ కళాశాలలో ఏర్పాటు చేశారు.
● పరీక్షలకు ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా జిల్లాను జోన్లుగా విభజించి రూట్ ఆఫీసర్లును నియమించారు. పరీక్ష జరుగుతున్న సమయంలో వీరు ఆయా కేంద్రాలను సందర్శించి ఏవైనా సమస్యలు తలెత్తితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించేలా ఏర్పాట్లు చేశారు.
● పరీక్ష కేంద్రాలను నో సెల్ఫోన్ జోన్లుగా ప్రకటించారు. కేంద్రాలలోకి సీఎస్ల సహా ఎవరూ సెల్ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. అలాగే కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచేలా ఆదేశాలు జారీ చేశారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
● పరీక్షలను ప్రశాంతంగా, ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా నిర్వహించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. పరీక్షలకు సంబంధించి ఏవైనా సందేహాలు లేదా సమాచారం కోసం కంట్రోల్ రూంను సంప్రదించాలని జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు తెలిపారు. డిప్యూటీ డీఈఓ ఎస్.ఎం.సుభానీ 9963638232, డీసీఈబీ సెక్రటరీ ఐ.కృష్ణానాయక్ 9394884558, డీఈఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ షేక్.ఉమర్ రషీద్ 6302671571, కంట్రోల్ రూమ్ 8341135357 నెంబర్లలో సంప్రదించాలని తెలిపారు.


