నరసరావుపేట టౌన్: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం స్థానిక న్యాయస్థాన భవనాల ఆవరణలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 1670 కేసులు పరిష్కారమైనట్లు మండల న్యాయ సేవాధికార సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. సివిల్, క్రిమినల్, చెల్లని చెక్కు, కుటుంబ, లావాదేవీలు, ముందస్తు వ్యాజ్యం కేసులు మొత్తం కలిపి 1670 పరిష్కారమయ్యాయి. కక్షిదారులకు రూ.8.86 కోట్ల మేర లబ్ధి చేకూరింది. మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, 13వ అదనపు జిల్లా కోర్టు ఇన్చార్జి న్యాయాధికారి శరత్బాబు నేతృత్వంలో న్యాయాధికారులు కె.మధుస్వామి, ఏ సలోమిలు రెండు బెంచ్లుగా ఏర్పడి కేసులు పరిష్కరించారు. లోక్ అదాలత్లో న్యాయవాదులు మేరీ బ్లెస్సీనా, అచ్చి ఏడుకొండలు, నసీమా రాజశేఖర్, ముక్కడాల సుబ్బారావు, వై శ్రీనివాసరెడ్డి, ఎం.హరీష్కుమార్, వై సురేష్బాబు, బి సురేష్, కక్షిదారులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.


