నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (దూరవిద్య) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్ష అభ్యర్థుల హాల్టికెట్లు అందుబాటులో ఉన్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి పీవీజే రామారావు సోమవారం తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను సంబంధిత స్టడీ సెంటర్లు, వాట్సాప్ (9552300009), మన మిత్ర ద్వారా పొందవచ్చని వివరించారు. అలాగే దూరవిద్య వెబ్సైట్ httpr://www.apope nrchoo.ap.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. హాల్టికెట్లో వివరాలు పరిశీలించి ఏవైనా తప్పులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకరావాలని తెలిపారు.
అమరావతి: నదిలో స్నానానికని వెళ్లి విద్యార్థి గల్లంతయిన సంఘటన సోమవారం దిడుగులో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం మేరకు మండల పరిధిలోని దిడుగు గ్రామానికి చెందిన శీలం నందగోపాల్ మధ్యాహ్న సమయంలో తన స్నేహితులతో కలిసి కృష్ణానదిలోకి స్నానానికి వెళ్లారు. స్నానానికి దిగిన ఏడుగురులో శీలం నందగోపాల్ లోతుకు వెళ్లటంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న సీఐ అచ్చియ్య తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించి గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం రాత్రి వరకు ఎంతగా గాలించినా నందగోపాల్ జాడ తెలియలేదు. చీకటి పడి గాలింపు చర్యలు కష్టంగా ఉండటంతో మంగళవారం ఉదయాన్నే మళ్లీ గాలింపు చర్యలు చేపడతామని సీఐ తెలిపారు. నందగోపాల్ కుటుంబ సభ్యులు, బంధువులు నదిఒడ్డున గుండెలవిసేలా విలపించటం గ్రామస్తులను కలచివేసింది.


