విజయపురిసౌత్: భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లి సాగర్మాత అని ఖమ్మం పీఠాధిపతులు మహాఘన డాక్టర్ సగిలి ప్రకాష్ ఉద్బోధించారు. రెండో రోజైన ఆదివారం ఆయన సాగరమాత ఆలయంలోని జపమాల క్షేత్రంలో ఆలయ విచారణ గురువులు పామిశెట్టి జోసఫ్ బాలసాగర్ ఆధ్వర్యంలో జరిగిన సమష్టి దివ్యబలిపూజలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. క్రైస్తవ భక్తులంతా సమాజానికి ఆదర్శవంతంగా నిలవాలన్నారు. సాటివారిని ఆదరించడం, ప్రేమను పంచిపెట్టడం క్రైస్తవ్యంలో ప్రధానమన్నారు. సృష్టికర్త సహితం అమ్మ ద్వారానే ఈ లోకానికి వచ్చాడన్నారు. ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందకరమైన విషయమన్నారు. మరియమాత మన మధ్యలో నిలిచి మనల్ని కాపాడుతోందన్నారు. ప్రతి ఒక్కరూ దేవుని ఆజ్ఞలను ఆచరించాలని సూచించారు. సాగరమాతపై భక్తిభావంతో మెలిగి దైవకృపకు పాత్రులు కావాలని కోరారు. క్రీస్తును నమ్ముకుని సత్ప్రవర్తనతో మెలిగేవారికి సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని చెప్పారు.
● ఉదయం 5 గంటలకు గురుశ్రీ కె.ఎలీషాచే, 6కు గురుశ్రీ బి. మేఘానంద్చే, 7కు గురుశ్రీ రాచకొండ రాజుచే, 8కి గురుశ్రీ గోవిందు బాలస్వామిచే దివ్యబలిపూజ, 9.30 గంటలకు గురుశ్రీ బెన్నీచే భక్తుల ఆహ్వానం, జపమాల, స్తుతి ఆరాధన, వాక్యపరిచర్య, ఉదయం 11.30గంటలకు దివ్యబలిపూజ, మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నదాన కార్యక్రమం, 2 గంటలకు వాక్యపరిచర్య, స్వస్థతా ప్రార్థనలు, సాయంత్రం 4 గంటలకు కోలాటం, 5.30 గంటలకు ఖమ్మం పీఠాధిపతులు మహాఘన డాక్టర్ సగిలి ప్రకాష్చే జపమాల క్షేత్రంలో సమష్టి దివ్యబలిపూజ, రాత్రి 7.30గంటలకు కొవ్వుత్తులతో తేరు ప్రదక్షిణ, 8 గంటలకు సాగర్మాత బృందం వారిచే సాగర్మాత మహిమలు బుర్రకఽథ, 9 గంటలకు శిరిగిరిపాడు కళా నాట్య మండలి ప్రతినిధులచే శిలువ ధారి బైబిల్ నాటకం ప్రదర్శించారు.


