ఘనంగా ప్రారంభమైన హోసన్నా 49వ గుడారాల పండుగలు ప్రత్యేక ప్రార్థనలు చేసిన దైవజనులు అబ్రహాం, జాన్వెస్లీ, రమేష్ తదితరులు లక్షలాది విశ్వాసులతో నిండిన లేమల్లె దయాక్షేత్రం ప్రాంగణం
గుడారాల పండుగల మొదటిరోజు లక్షలాదిగా హాజరై ఆరాధిస్తున్న విశ్వాసులు
అమరావతి: లక్షలాదిమంది విశ్వాసుల స్తోత్రాలతో దైవజనుల ప్రార్థనలతో, ప్రభువైన ఏసుక్రీస్తును కీర్తిస్తూ.. స్తుతి గీతాలాపనల నడుమ గురువారం రాత్రి మండల పరిధిలోని లేమల్లె గ్రామంలో 49వ గుడారాల పండుగలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పల్నాడు జిల్లా లేమల్లె గ్రామంలోని హోసన్నా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో హోసన్నా దయాక్షేత్రం సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసి ప్రత్యేక వేదికపై దైవజనులు ఆశీనులు కాగా స్తుతి గీతాలు వీనుల విందుగా ఆలపించారు. తొలుత హోసన్నా మినిస్ట్రీస్ అధ్యక్షుడు అబ్రహాం మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు జరిగే గుడారాల పండుగకు ప్రసంచవ్యాప్తంగా విచ్చేసిన విశ్వాసులను ప్రభువైన క్రీస్తు ఏసు నిరంతరం కాపాడాలని ప్రార్థిస్తున్నామన్నారు. గుడారాల పండుగలో దేవుడు అద్భుత కార్యాలను జరిగిస్తాడన్నారు. రోగులకు స్వస్థత చేకూరాలని అలాగే సేవకులకు పునరుజ్జీవం కలగాని ప్రార్థిస్తున్నామన్నారు. దేవుడు ఒక్కమాట సెలవిస్తే మనజీవితాలలో అద్భుతాలు జరగుతాయని.. అందుకోసం నిరంతరం విశ్వాసులు దేవుని నామాన్ని స్తుతించాలన్నారు. దయాక్షేత్రంలో అడుగుపెట్టిన రోగులు, వ్యాధిగ్రస్తులకు స్వస్థత కలగాలని క్రీస్తు ఏసును ప్రార్ధిద్దామన్నారు. ఈ నాలుగురోజుల పాటు జరిగే గుడారాల పండుగలో ప్రార్ధనాత్మతో ప్రతి క్షణం దేవుని స్తుతించాలన్నారు.
● హోసన్నా మినిస్ట్రీస్ చీఫ్ పాస్టర్ జాన్ వెస్లీ మాట్లాడుతూ.. గుడారాల పండుగలు గతంలో 17సంవత్సరాలు దైవజనులు ఏసన్న చేతుల మీదుగా లేమల్లె గ్రామంలో నిర్వహించటం జరిగిందన్నారు.
● ఈసందర్భంగా చైన్నెకి చెందిన దైవజనులు మోహన్ సీ లాజరస్ మాట్లాడుతూ విశ్వాసులందరూ ప్రభువైన ఏసు క్రీస్తును పరిశుద్ధాత్మతో స్తుతించాలన్నారు. ఏసుక్రీస్తు మనుషులను పాప సంకెళ్ల నుంచి విడిపించి, స్వతంత్రులుగా చేయటానికి దిగి వచ్చారన్నారు. తొలిరోజు దైవజనులు అబ్రహాం, జాన్వెస్లీ, రమేష్, ఫ్రెడ్డీపాల్, రాజులు స్తుతి గీతాలాపనలు చేశారు. తొలిరోజు ప్రార్థనల్లో రెండు తెలుగు రాష్టాల నుంచే కాక దేశ, విదేశాల నుంచి విశ్వాసులు లక్షలాదిగా తరలివచ్చారు
సౌందర్యపూర్ణుడా పాటల పుస్తకం ఆవిష్కరణ
దక్షిణాఫ్రికాకు చెందిన దైవజనులు పాస్టర్ జాషువా మోజెస్ ప్రత్యేక ప్రార్థనలు చేసి లక్షలాదిమంది విశ్వాసులు సోత్రములు, కరతాళ ధ్వనుల మధ్య జాతీయ పతాకంలోని మూడు రంగుల బెలూన్లను, పావురాళ్లను ఎగురవేసి నాలుగు రోజులపాటు నిర్వహించే గుడారాల పండుగను ప్రారంభించారు. అనంతరం స్తుతిగీతాల పుస్తకమైన హోసన్నా సౌందర్యపూర్ణుడా పాటల పుస్తకాన్ని ఏలూరుకు చెందిన జ్యోతిరాజ్, స్పర్జన్ రాజ్లు ఆవిష్కరించారు. అమెరికాకు చెందిన దైవజనుడు ఎర్నెట్పాల్ ప్రార్థనతో సౌందర్యపూర్ణుడా స్తుతిగీతాల అల్బమ్ను ఆవిష్కరించారు.


