ఉదయం దట్టమైన పొగమంచు.. మధ్యాహ్నం మండుటెండ.. ఒకే రోజులో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచి నరస రావుపేట పట్టణాన్ని దట్టమైన మంచు కమ్ముకుంది. దీంతో రహదారులపై దృశ్యమానత తగ్గి వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడ్డారు. ఉదయం 8 గంటల వరకు మంచు తీవ్రత అలానే ఉంది. అయితే మధ్యాహ్నం 12 గంటల నుంచి ఎండ ఠారెత్తడంతో ప్రజలు ఇంటినుంచి బయటకు వచ్చేందుకు భయపడ్డారు. చలి కాలం నుంచి వేసవి కాలానికి మారే ఈ సమయంలో వాతావరణం స్థిరంగా ఉండదని, అందుకే ఉష్ణోగ్రతలో మార్పులు చోటుచేసుకుంటాయని, ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా లేకుంటే వైరల్ జ్వరాల బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
– నరసరావుపేట టౌన్


