దుర్గి: అడిగొప్పల నిదానంపాటి శ్రీలక్ష్మీ అమ్మవారి హుండీ కానుకలు లెక్కించగా రూ. 21,17,900ల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి, అసిస్టెంట్ కమిషనర్ కె ఆదిశేషనాయుడు తెలిపారు. సోమవారం అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ధర్మకర్త యాగంటి మల్లిఖార్జునరావు, దేవదాయశాఖ సత్తెనపల్లి ఇన్స్పెక్టర్, భక్తులు సమక్షంలో 47 రోజుల పాటు భక్తులు అమ్మవారికి సమర్పించిన హుండీ లెక్కింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంఆర్ సిబ్బంది, అర్చక, పరిచారక, నాయీ బ్రాహ్మణులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
బాపట్లటౌన్: ఒంటరిగా వెళుతున్న మహిళలనే లక్ష్యంగా చేసుకొని చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ వివరాలు వెల్లడించారు. బాపట్ల మండలం ముత్తాయపాలెంలో మహిళా పోలీస్ కర్రి లక్ష్మి ప్రసన్న 2025 అక్టోబర్ 29న స్కూటీపై పోతనకట్టవారిపాలెం వెళ్తుండగా దుండగులు మెడలోని చైన్ లాక్కెళ్ళారు. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు నిర్వహించగా గుంటూరు జిల్లా నల్లపాడులోని చల్లావారిపాలెం గ్రామానికి చెందిన పట్నాల వెంకట దుర్గాప్రభు అలియాస్ అఖిల్, గుంటూరులోని శారద కాలనీకు చెందిన షేక్ రాజాలను గుర్తించి అదుపులోకి విచారించామన్నారు.
విలాసాల కోసమే నేరాలు ..
నిందితుడు అఖిల్ ఎంబీఏ పూర్తిచేసి గుంటూరు పట్టణంలో జిమ్ సెంటర్ నిర్వహిస్తుండేవారు. వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో రాజాతో కలిసి మహిళలనే టార్గెట్ చేసుకొని మెడలో గొలుసులు దొంగలించారు. వీరి నుంచి మొత్తం 129.57 గ్రాముల బంగారం వస్తువులును, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. చైన్ స్నాచర్లను పట్టుకొనడంలో ప్రతిభ చూపించిన బాపట్ల డీఎస్పీ పి.జగదీష్ నాయక్, బాపట్ల రూరల్ సిఐ బి.హరిక్రిష్ణ, సిసిఎస్ సీఐ పి.ప్రేమయ్య, ఎస్.ఐ బాబురావు, కర్లపాలెం ఎస్.ఐ ఎస్.రవీంద్ర, కానిస్టేబుల్ వి.శివ శంకర్, ఐటి కోర్ కానిస్టేబుల్ లు యు.రాజేష్, కె.రాము, కర్లపాలెం హోంగార్డ్ ఎం.రమేష్ లను అభినందించి, నగదు బహుమతి అందించారు.


