గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్లో శుక్రవారం ఢిల్లీకి చెందిన నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) అధికారులు పలు వార్డులను పరిశీలించారు. ఎన్ఐసీ డెప్యూటీ డైరెక్టర్ జనరల్ రవీంద్రకుమార్, జాయింట్ డైరెక్టర్ రాజ్కుమార్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు చెందిన రూపల్ ప్రకాష్, శ్యామల్రావు, హుస్సేన్లు అధికారుల బృందంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల వివరాలు ఆన్లైన్లో నెక్ట్స్జెన్ పేరుతో నమోదు చేసేందుకు కొత్త కార్యక్రమం ప్రారంభించింది. అందులో భాగంగా గుంటూరు జీజీహెచ్లో కాగిత రహిత ఓపీ సేవలు రోగులకు అందించేందుకు పైలెట్ ప్రాజెక్టుగా జీజీహెచ్ అధికారులు నెక్ట్స్జెన్ పేరుతో రోగుల డిజిటల్ హెల్త్ ఐడీ కార్డులను నమోదు చేస్తున్నారు. డిజిటల్ హెల్త్ ఐడీ కార్డులను ఏవిధంగా నమోదు చేస్తున్నారనే విషయాలను ఢిల్లీకి చెందిన కేంద్ర బృందం స్వయంగా పరిశీలించారు. అనంతరం తెనాలి జిల్లా ఆసుపత్రిలో పరిశీలనకు తరలి వెళ్లారు. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ బి.వెంకటేశ్వరరావు, డెప్యూటీ కలెక్టర్, స్పెషల్ అడ్మినిస్ట్రేటర్ సుధారాణి, అడ్మినిస్ట్రేటర్ డి.ప్రవీణ్కుమార్, డెప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ డి.ఎస్.ఎస్.శ్రీనివాస్ ప్రసాద్, తదితరులు కేంద్ర బృందం వెంట ఉండి వారికి సమాచారం అందజేశారు.


