నరసరావుపేట రూరల్: ప్రకృతి వ్యవసాయ విస్తరణలో బయో రిసోర్స్ సెంటర్లు కీలకపాత్ర పోషిస్తున్నారని జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.అమలకుమారి అన్నారు. జిల్లాలోని ప్రకృతి వనరుల కేంద్రం నిర్వాహకులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. అమలకుమారి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 35 ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ ఏడాది లక్ష ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయంలో సాగు జరుపుతున్నట్టు తెలిపారు. రాబోవు రెండు నెలల్లో బయో రిసోర్స్ సెంటర్ల ద్వారా 30 రకాల విత్తనాలతో 15 కిలోల బరువు ఉండే ప్యాకెట్లను సిద్ధంచేసి రైతులకు అందజేస్తామని తెలిపారు. రబీ పంట కోత అనంతరం రైతులు ఈ విత్తనాలను పొలాల్లో చల్లడం ద్వారా వివిద రకాల వేరు వ్యవస్థలు భూమిలో ఏర్పడి భూసారం పెరుగుతుందని వివరించారు. భూమిలో నీటిని నిలుపుకునే సామర్ధ్యం పెరగడంతో పాటు ఎరువులకు అయ్యే ఖర్చు తగ్గుతుందని తెలిపారు. రాబోవు ఆరు నెలల్లో మరో 100 ప్రకృతి వనరుల కేంద్రాలను జిల్లాలో ఏర్పాటుచేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ప్రాజెక్ట్ మేనేజర్ ప్రేమ్రాజు, జిల్లా సిబ్బంది సైదయ్య, అప్పలరాజు, నందకుమార్, మేరి, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.


