నరసరావుపేట రూరల్: భార్యను భర్త హత్య చేసిన ఘటన మండలంలోని ములకలూరులో మంగళవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.... నెల్లూరు జిల్లా వనంతోపు సెంటర్కు చెందిన యాటగిరి వెంకయ్య, అదరత్తమ్మ(41)లు గత ఆరు సంవత్సరాలుగా పట్టణంలో పాతసామగ్రి సేకరించి విక్రయిస్తూ, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో జీవిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ఇస్సపాలెం తిరునాళ్ల సందర్భంగా ఇరువురు గ్రామానికి వెళ్లారు. మంగళవారం ఉదయం ములకలూరు సమీపంలోని వాగు దగ్గర అదరత్తమ్మ మృతదేహన్ని స్థానికులు గుర్తించారు. రూరల్ సీఐ ఎంవి సుబ్బారావు, ఎస్ఐ కిషోర్లు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తలపై గాయం ఉండటాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. భర్త వెంకయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మద్యం మత్తులో అదరత్తమ్మ తలపై రాయితో మోది హత్య చేసినట్టు విచారణలో వెంకయ్య వెల్లడించినట్టు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్ఐ కిషోర్ తెలిపారు.


