నరసరావుపేట: పల్నాడు జిల్లాలో ఈ నెల 17వ తేదీతో పాలకవర్గ కాలం ముగియనున్న పలు పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేడ్–2 పురపాలక సంఘాలైన పిడుగురాళ్ల, మాచర్ల, గురజాల, సత్తెనపల్లి, వినుకొండలకు వరుసగా గుంటూరు ఆర్డీఎంఏ, గురజాల ఆర్డీఓ, సత్తెనపల్లి ఆర్డీఓ, డాక్టర్ కేఎల్ రావు సాగర్ పులిచింతల ప్రాజెక్ట్ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్, చిలకలూరిపేట సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీకి జిల్లా జాయింట్ కలెక్టర్ను ప్రత్యేక అధికారులుగా నియమించారు. వీరందరూ ఆరు నెలలు లేదా నూతన పాలకవర్గం ఏర్పడే వరకు వాటికి ప్రత్యేకాధికారులుగా వ్యవహరించనున్నారు.
నకరికల్లు: మండలంలోని రూపెనగుంట్ల గ్రామంలో వినాయకుని విగ్రహం ధ్వంసం చేసిన ప్రాంతంలో క్లూస్టీం, డాగ్స్క్వాడ్ మంగళవారం ఆధారాలు సేకరించాయి. గుర్తుతెలియని దుండగులు విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన పాఠకులకు విదితమే. మంగళవారం గ్రామస్తుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. సత్తెనపల్లి డీఎస్పీ ఎం.హనుమంతరావు, రూరల్ సీఐ పి.కిరణ్, ఎస్ఐ కె.సతీష్, సిబ్బంది గ్రామానికి చేరుకొని విగ్రహం ధ్వంసం చేసిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. డ్వాగ్స్క్వాడ్ సహాయంలో పలు వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా సీఐ పి.కిరణ్ మాట్లాడుతూ ఘటనపై ముమ్మర దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.


