తాడేపల్లి రూరల్: దేశంలో సగానికి పైగా ఉన్న బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించి.. వారి సమగ్ర అభివృద్ధికి పాలకుల ప్రణాళికలు చేయాలని జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ రమణ డిమాండ్ చేశారు. ఆదివారం ఉండవల్లిలో ఏర్పాటు చేసిన జాతీయ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు. బీసీ రమణ మాట్లాడుతూ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ లేక 80 శాతం బీసీ కులాలు చట్టసభల్లో అడుగుపెట్టడం లేదని అన్నారు. దీంతో ఆయా వర్గాలు విద్య, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య, సామాజిక రంగాల్లో ఎంతో వెనుకబడి ఉన్నారని పేర్కొన్నారు. బహుజన పోరాట వీరుడు కాన్షీరాం జయంతిని ఘనంగా నిర్వహించి, ఆయనకు భారతరత్న అవార్డు ప్రకటించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని 175 నియోజకవర్గాల్లో బీసీ భవనాలకు రెండు ఎకరాల స్థలం కేటాయించాలని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలను ప్రత్యక్షంగా కలిసి వినతిపత్రాలు అందజేస్తామని తెలిపారు. బీసీలను చైతన్యం చేయడమే సభ్యత్వ నమోదు కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీ, తెలంగాణ, కర్ణాటక ముఖ్య బీసీ నాయకులు పాల్గొన్నారు.


