చంద్రబాబు ప్రభుత్వంపై దశలవారీ ఆందోళన
ఎస్టీయూ నాయకులు
నరసరావుపేట ఈస్ట్: ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో వైఫల్యం చెందిన చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) ఆధ్వర్యంలో దశల వారీ ఆందోళన కార్యక్రమం చేపడుతున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్.వి.రామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.ఏమండీ తెలిపారు. మూడు దశల ఆందోళన కార్యక్రమం కరపత్రాన్ని మంగళవారం సాయంత్రం సంఘం కార్యాలయంలో ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసి 30 శాతం ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. సీపీఎస్ రద్దు రోడ్మ్యాప్, రూ.34వేల కోట్లు బకాయిలు చెల్లింపులు, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు వంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దశల వారీ ఆందోళనలో భాగంగా ఈనెల 30న మండల కేంద్రాలలో వినతిపత్రాల సమర్పణ, ఫిబ్రవరి 10న అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నా, ఫిబ్రవరి 25న ఛలో విజయవాడ రాష్ట్రస్థాయి ధర్నా కార్యక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్ర సంఘం కార్యాచరణ రూపొందించినట్టు వివరించారు. దశల వారీ ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఉపాధ్యాయులను కోరారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా గౌరవాధ్యక్షుడు కోలా యేసయ్య, జిల్లా ఆర్ధిక కార్యదర్శి షేక్ సుభానీ, కార్యదర్శి ఈ.రామకోటయ్య పాల్గొన్నారు.


