కొండవీడు ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు
యడ్లపాడు: ప్రజల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని పల్నాడు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు చెప్పారు. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో జరిగే ఉత్సవాల నేపథ్యంలో బందోబస్తు విషయంపై శుక్రవారం చిలకలూరిపేట రూరల్ సీఐ బి సుబ్బానాయుడు, యడ్లపాడు ఎస్ఐ టి శివరామకృష్ణలతో కలిసి క్షేత్రస్థాయి సందర్శన చేశారు. కోటలోని చారిత్రక కట్టడాలు, చెరువులు, హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్ ప్రదేశాలను స్వయంగా పరిశీలించారు. అనంతరం కొండవీడు సమీప ప్రాంతాల నుంచి ప్రజలు రాకపోకలు సాగించే మార్గాలను తనిఖీ చేశారు. రద్దీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. సందర్శకుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు ఏర్పాట్లపై అధికారులకు ఎస్పీ దిశానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ కొండవీడు ఉత్సవాలను అత్యంత ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పల్నాడు జిల్లా పోలీస్శాఖ సిద్ధంగా ఉందన్నారు. ఉత్సవాల పర్యవేక్షణ కోసం డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర పెట్రోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వాహనాల రద్దీ పెరగకుండా ముందస్తు ప్రణాళికతో ట్రాఫిక్ నియంత్రించి, పార్కింగ్ ప్రదేశాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదకరమైన మలుపులు, లోతైన చెరువుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రధానంగా మహిళలు, పిల్లలు, వృద్ధుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రెవెన్యూ, పర్యాటక తదితర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వర్తించాలని తెలిపారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కోటను సందర్శించిన పల్నాడు జిల్లా
ఎస్పీ బి కృష్ణారావు


