ప్రతిష్టాత్మకంగా కోటప్పకొండ తిరునాళ్ల ఏర్పాట్లు
దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరునాళ్ల ఏర్పాట్లపై కోటప్పకొండలో సమీక్ష ఈ ఏడాది నుంచి వీఐపీ దర్శనానికి టికెట్
నరసరావుపేట రూరల్: మహాశివరాత్రి పర్వదినాన కోటప్పకొండలో నిర్వహించే తిరునాళ్ల మహోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. తిరునాళ్ల ఏర్పాట్లపై మూడవ సమీక్షా సమావేశం మంగళవారం కోటప్పకొండలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి ఆనంతో పాటు జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, చదలవాడ అరవిందబాబు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గొనుగుంట్ల కోటేశ్వరరావు, దేవదాయ శాఖ కమిషనర్ రాంచంద్ర మోహన్, జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు, డీఎఫ్ఓ కృష్ణప్రియలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి ఆనం మాట్లాడుతూ గత ఏడాది స్వామి వారిని లక్ష మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని, ఈ ఏడాది ఈ సంఖ్య 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం వలన దర్శనానికి వచ్చే మహిళల సంఖ్య అధికంగా ఉంటుందని, అంచనాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పండుగ హోదాలో ఈ ఏర్పాట్లకు రూ.30 లక్షలు మంజూరు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు.
ఆన్లైన్లో వీఐపీ టికెట్ అమ్మకాలు
దేవదాయ శాఖ కమిషనర్ రాంచంద్రమోహన్ మాట్లాడుతూ.. తిరునాళ్ల రోజు స్వామివారి దర్శనానికి వచ్చే వీఐపీ భక్తుల కోసం ఈ ఏడాది నుంచి టికెట్ విధానం తీసుకువస్తున్నట్టు తెలిపారు. ధరను రూ.300గా నిర్ణయించినట్టు తెలిపారు. ఈ నెల 10 వ తేదీ నుంచి ఆన్లైన్లో ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. ప్రతి రోజు 1500 టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తామని తెలిపారు. టికెట్ తీసుకున్న యాత్రికులు సూచించిన టైమ్స్లాట్లో దర్శనానికి రావాల్సి ఉంటుందని సూచించారు. ఉచిత దర్శనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ప్రజాప్రతినిధుల సిఫార్స్ లెటర్ల మేరకు ఆలయ ఆవరణలో తిరునాళ్ల రోజు వీఐపీ టికెట్లు విక్రయిస్తామని తెలిపారు. భక్తులను చేరవేసేందుకు 618 బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. 95 బస్సులు కింద నుంచి కొండమీదకు నడపుతున్నట్టు వివరించారు.


