రూ. కోటితో ఉడాయించిన ఆర్పీ
డ్వాక్రా మహిళల నుంచి సేకరించిన డబ్బులు బ్యాంక్కు జమ చేయని వైనం ఏడాదిగా ప్రతి నెలా 30 గ్రూప్ల నుంచి రూ. లక్షల్లో వసూళ్లు రెండు నెలల క్రితం ఇంటికి తాళం వేసి పరారీ డబ్బులు జమ చేయాలని బ్యాంక్ నుంచి డ్వాక్రా మహిళలపై ఒత్తిడి న్యాయం చేయాలని రోడ్డెక్కిన బాధిత మహిళలు
నరసరావుపేట టౌన్: డ్వాక్రా మహిళల డబ్బులతో ఉడాయించిన ఆర్పీపై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళలు రోడ్డెక్కారు. బుధవారం సత్తెనపల్లి స్టేడియం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు బాధిత మహిళలు మాట్లాడుతూ చంద్రబాబునాయిడు కాలనీలో ఆర్పీగా పనిచేస్తున్న చల్లా కోటేశ్వరి 30 గ్రూప్ల వద్ద సుమారు రూ. కోటి వరకు సేకరించి బ్యాంక్లో జమ చేయలేదన్నారు. ఏడాదిగా ఇలా చేస్తున్నా విషయం రెండు నెలల క్రితం తమకు తెలిసి ఆమెను అడిగేందుకు వెళ్లగా ఆర్పీ ఇంటికి తాళం వేసి ఉందన్నారు. డ్వాక్రా రుణాలకు సంబందించి డబ్బులు చెల్లించాలని బ్యాంక్ల నుంచి నోటీసులు అందాయన్నారు. బ్యాంక్ ప్రతినిధులు ఇళ్ల వద్దకు వచ్చి డబ్బులు జమచేయాలని ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్, మెప్మా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. నెల అవుతున్నా ఎటువంటి న్యాయం జరగలేదన్నారు. దీంతో తామంతా రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తున్నట్లు తెలిపారు. నరసరావుపేట – సత్తెనపల్లి ప్రధాన రహదారిపై బైటాయించి ధర్నా చేయటంతో రాకపోకలు స్తంభించాయి. సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ సీహెచ్ ప్రభాకర్ సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులతో చర్చించారు. జరిగిన మోసంపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవటంతోపాటు న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.


