లారీ ఢీకొని బాలుడు మృతి
దాచేపల్లి: లారీ ఢీకొని బాలుడు మృతిచెందిన సంఘటన బుధవారం జరిగింది. దాచేపల్లి బస్టాండ్ సెంటర్లో అతివేగంతో వస్తున్న లారీ ఢీకొట్టటంతో గురజాల మండలం దైద గ్రామానికి చెందిన రూవ్వ మహేష్(7) దుర్మరణం చెందాడు. సేకరించిన వివరాల ప్రకారం.. గోపి, నందిని దంపతులకు కుమార్తె అంజలి, కుమారుడు మహేష్ సంతానం. తెలంగాణలోని అడవిదేవులపల్లిలో నివాసం ఉంటున్న గోపి అనారోగ్యంతో నాలుగేళ్ల క్రితం మృతిచెందాడు. దీంతో కుమార్తె, కుమారుడిని తల్లిదండ్రుల స్వగ్రామమైన దైదలో ఉంచి చదివిస్తోంది. ఈ క్రమంలో నారాయణపురంలోని ఓ లాడ్జిలో పనిచేస్తూ నందిని దాచేపల్లిలో ఉంటోంది. మహేష్కి జ్వరం వస్తుండటంతో అమ్మమ్మ పురం భూలక్ష్మి దాచేపల్లిలో ఉంటున్న కుమార్తె వద్దకు తీసుకువచ్చింది. హస్పిటల్లో చికిత్స అనంతరం తల్లి, అమ్మమ్మలతో కలిసి లాడ్జి వద్దకు మహేష్ వచ్చాడు. ఈక్రమంలో తెలిసిన వ్యక్తి మహేష్ను ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని బస్టాండ్ సెంటర్ వద్దకు వచ్చాడు. మహేష్ నడుచుకుంటూ రోడ్డు దాటుతున్న క్రమంలో వేగంతో వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో మహేష్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని లారీని ఆపేసి పోలీసులకు సమాచారం అందించారు. కుమారుడి మరణవార్త తెలుసుకున్న నందిని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుంది. అప్పటివరకు తనతో ఉన్న కుమారుడు మృత్యువాతపడటంతో బోరున విలపించింది. మృతిచెందిన కుమారుడిని ఒడిలోకి తీసుకుని నందిని ఏడుస్తున్న తీరు చూపరులచే కంటతడి పెట్టించింది. మహేష్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
కిసాన్ సభ ఎగ్జిబిషన్ను జయప్రదం చేయండి
ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సూర్యనారాయణ
లక్ష్మీపురం: అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు సందర్భంగా నేటి సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఎగ్జిబిషన్ జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సూర్యనారాయణ కోరారు. గుంటూరు బ్రాడీపేటలోని రైతు సంఘం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అఖిల భారత కిసాన్ సభ జాతీయ కౌన్సిల్ సమావేశాలు సందర్భంగా 29 నుంచి ఫిబ్రవరి 1 వరకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగుతాయన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ డాక్టర్ ఆర్.శారద జయలక్ష్మి దేవి ప్రారంభిస్తారని తెలిపారు, అనంతరం వికసిత్ భారత్ 2047 అనే అంశంపై ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్, మాజీ ఎంపీ మధు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, రిటైర్ ప్రొఫెసర్ ఎన్.వేణుగోపాలరావు, ఆర్.వీర రాఘవయ్య తదితరులు పాల్గొని ప్రసంగిస్తారన్నారు. అనంతరం జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించడానికి ప్రజా కళాకారుడు వంగపండు దుష్యంత్ వస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే వేమన సాంఘిక నాటకాన్ని ప్రదర్శించడం జరుగుతుందన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
వాడరేవు తీరంలో మృతదేహం లభ్యం
చీరాల: వాడరేవు సముద్రతీరంలో బుధవారం ఓ వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు ఈపూరుపాలెం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఈపూరుపాలెం ఎస్ఐ ఎ.చంద్రశేఖర్ మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మీడియా గ్రూపుల్లో పోస్టు చేయడంతో వృద్ధుడి వివరాలు లభించాయి. మృతుడు గ్రంధి గణపతిరావు (70) రామకృష్ణాపురం పంచాయతీ కొత్తపాలెం వాసిగా గుర్తించారు.
లారీ ఢీకొని బాలుడు మృతి


