అంతర్ జిల్లాల గేదెల దొంగలు అరెస్ట్
బెల్లంకొండ: వివిధ జిల్లాల్లో గేదెలను దొంగతనం చేసి, విక్రయిస్తున్న దొంగల ముఠాను గుర్తించి అరెస్టు చేసినట్లు పెదకూరపాడు సీఐ పి.సురేష్ తెలిపారు. సోమవారం బెల్లంకొండ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అద్దంకి, రావులపాలెం, ఫిరంగిపురం, బెల్లంకొండ ప్రాంతాలలో గేదెలను దొంగతనం చేసే పిడుగురాళ్లకు చెందిన కుంచపు దుర్గాప్రసాద్, కోనంకికి చెందిన పెద్దిరెడ్డి మహేశ్వర్ రెడ్డి, బండారు వెంకట్రావుతో పాటు మరో ఇద్దరిని గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులు వివిధ ప్రాంతాలలో గేదెలను దొంగతనం చేసి ఈనెల ఒకటిన విక్రయించేందుకు టాటా ఏసీ వాహనంలో తరలిస్తుండగా బెల్లంకొండ క్రాస్ రోడ్డు వద్ద స్థానిక ఎస్ఐ పి.గోపి గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. కుంచపు దుర్గాప్రసాద్ గతంలో పశువుల దొంగతనం, ఇళ్లలో చోరీలు, చైన్ స్నాచింగ్ వంటి 25 కేసుల్లో అరెస్టయి బెయిల్ పై తిరుగుతూ, మళ్లీ గేదెల దొంగతనం చేస్తూ పట్టుబడినట్లు సీఐ తెలిపారు. నిందితుల వద్ద సుమారుగా రూ.3.50 లక్షల విలువ గల తొమ్మిది గేదెలను, ఏపీ39 వీబీ5004 నంబర్ గల వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. వీరిపై పలు కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు పేర్కొన్నారు. సీఐ వెంట బెల్లంకొండ ఎస్ఐ గోపి, సిబ్బంది వెంకటరావు, మల్లికార్జునరావు, షణ్ముఖరావు, ఎల్.వెంకటేశ్వరరావు, ఎస్బీ హెడ్ కానిస్టేబుల్ మల్లికార్జునరావు, కోటి ఉన్నారు.


