హోరాహోరీగా ఎడ్ల బండలాగుడు పోటీలు
●న్యూకేటగిరీలో ప్రథమస్థానం కై వసం చేసుకున్న ఇర్లపాడు ఎడ్లు
●ఆరు పళ్ల విభాగంలో పెదకాకాని ఎడ్లకు
ప్రథమస్థానం
నాదెండ్ల: మండల కేంద్రమైన నాదెండ్లలో కొలువైయున్న నందికుంట విఘ్నేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరుగుతున్న ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు బుధవారం హోరాహోరీగా సాగాయి. ప్రేక్షకుల ఈలలు, కేరింతలతో ఎడ్ల యజమానులను ఉత్సాహపరిచారు. మంగళవారం రాత్రి ఆరు పళ్ల విభాగంలో పోటీలు పూర్తయ్యాయి. మొత్తం ఎనిమిది జతలు పాల్గొనగా గుంటూరు జిల్లా, పెదకాకాని ఆలా రాజేష్ యాదవ్, ఖాదర్ మస్తాన్కు చెందిన ఏఆర్వై అండ్ ఎంకేఎం బుల్స్ 3,500 అడుగుల దూరాన్ని లాగి ప్రథమస్థానాన్ని కై వసం చేసుకున్నాయి. ప్రత్తిపాడు పమిడి అంజయ్యచౌదరి ఎడ్ల జత 3,396 అడుగుల దూరంలాగి రెండో స్థానం, నరసరావుపేట మండలం రావిపాడు వై మనోజ్చౌదరి ఎడ్ల జత 3250 అడుగుల దూరం లాగి మూడోస్థానం, పత్తిపాడు పమిడి అంజయ్యకు చెందిన మరో ఎడ్ల జత 2,754 అడుగుల దూరం లాగి నాలుగోస్థానం, బాపట్ల జిల్లా దరవాడికొత్తపాలెం మంచాల రమాదేవి ఎడ్ల జత 2750 అడుగుల దూరం లాగి ఐదోస్థానం, కాకుమాను మండలం కొండబాలవారిపాలెం పెద్ది రవీంద్రబాబు ఎడ్ల జత 1988 అడుగుల దూరం లాగి ఆరోస్థానంలో నిలిచాయి. విజేతలకు నగదు బహుమతులు, షీల్డులు అందించారు.
న్యూకేటగిరి విభాగంలో...
బుధవారం ఉదయం న్యూకేటగిరి విభాగంలో హోరాహోరీగా జరిగిన పోటీల్లో పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం ఇర్లపాడు గ్రామ సర్పంచ్ మంగు రమాదేవి, ఏడుకొండలు ఎడ్ల జత 4,783 అడుగుల దూరం లాగి ప్రథమస్థానాన్ని కై వసం చేసుకున్నాయి. ఈ పోటీల్లో 14 ఎడ్ల జతలు పాల్గొనగా, బాపట్ల జిల్లా వేటపాలెంకు చెందిన ఆర్కే బుల్స్ అత్తోట రామకృష్ణ ఎడ్ల జత 4,507 అడుగుల దూరం లాగి రెండో స్థానం, కృష్ణాజిల్లా, ఘంటసాలకు చెందిన ఎంకేఎం బుల్స్ మేకా కృష్ణమోహన్ ఎడ్ల జత 4,231 అడుగుల దూరం లాగి మూడోస్థానంలో నిలిచాయి. విజేతలకు నగదు బహుమతులు, షీల్డ్లను అందించారు. బుధవారం సాయంత్రం వరకూ న్యూకేటగిరీలో జరిగిన పోటీల్లో వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు మండు ఏడుకొండలు ఎడ్ల జత ప్రథమస్థానంలో నిలవటంతో అభిమానులు కేరింతలతో సందడి చేశారు. గురువారంతో సబ్ జూనియర్స్, జూనియర్స్ విభాగాల్లో, చివరిరోజు శుక్రవారం జాక్పాట్ విభాగంలో పోటీలతో ముగియనున్నాయి.


