మెడికల్ ఎగ్జిబిషన్ ప్రారంభం
●ప్రతి ఒక్కరూ సందర్శించి అవగాహన పెంచుకోవాలి
●ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్
గుంటూరు మెడికల్: గుంటూరు వైద్య కళాశాలలో 30 సంవత్సరాల తరువాత ఏర్పాటు చేసిన మెడికల్ ఎగ్జిబిషన్ను బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంతో ప్రతి ఒక్కరికి శరీర అవయవాలపై అవగాహన పెరుగుతుందన్నారు. ఆరోగ్యంపై అవగాహన ఏర్పడడంతోపాటు, అనారోగ్యం బారిన పడకుండా ఎలా ఉండాలో కూడా తెలుస్తుందన్నారు. భవిష్యత్తులో వైద్య వృత్తిలోకి పిల్లలు వచ్చేందుకు ఎగ్జిబిషన్ ప్రేరణ ఇస్తుందన్నారు. పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తప్పనిసరిగా వీక్షించాలన్నారు. గుంటూరు వైద్య కళాశాల పెథాలజీ వైద్య విభాగంలో స్పెసిమెన్స్ ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ఈ ఎగ్జిబిషన్ను వీక్షించడం ద్వారా పలు విషయాలు తెలుసుకోవచ్చన్నారు. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, ఇతర బోధనా సిబ్బందిని మంత్రి అభినందించారు.
జింకానా దేశానికే ఆదర్శం
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గుంటూరు వైద్య కళాశాల పూర్వ విద్యార్థులు జింకానా పేరుతో మాతృ సంస్థ అభివృద్ధికి సేవలు చేస్తున్నారని, జింకానా దేశానికే ఆదర్శమని మంత్రి సత్యకుమార్ చెప్పారు. పూర్వ విద్యార్థులు అంకిత భావంతో కళాశాలకు చేస్తున్న సేవ ఎంతో విలువైనదని, అలాంటి గుంటూరు వైద్య కళాశాల ఏపీకే గర్వకారణమన్నారు.
క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టాలి
ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది క్యాన్సర్ బారిన పడి ప్రతి రోజూ మరణిస్తున్నారని, క్యాన్సర్ మహమ్మారిని తరిమి కొట్టేలా ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ప్రభుత్వం క్యాన్సర్ నివారణకు చేస్తున్న సేవల గురించి మీడియాకు వివరించారు. గుంటూరు జీజీహెచ్లో నాట్కో ట్రస్టు సహకారంతో అంతర్జాతీయ స్థాయిలో ఉచిత క్యాన్సర్ చికిత్సలు అందిస్తున్నట్లు వెల్లడించారు. తొలుత మంత్రి ఎగ్జిబిషన్ను గంటకుపైగా తిలకించారు. ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గల్లా మాధవి, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. వి. సుందరాచారి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, డాక్టర్ మాధవి, పలు వైద్య విభాగాధిపతులు, వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.
మెడికల్ ఎగ్జిబిషన్ ప్రారంభం
మెడికల్ ఎగ్జిబిషన్ ప్రారంభం


