రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీల విజేత వేటపాలెం
పిడుగురాళ్ల: మాచవరం మండలంలోని మోర్జంపాడు గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి 70వ తిరునాళ్లను పురస్కరించుకొని గురువారం రెండు పళ్ల విభాగం ఎడ్ల బలప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు. ఈ ఎడ్ల బలప్రదర్శనలో బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం గ్రామానికి చెందిన అత్తోట శిరిషాచౌదరి, శివకృష్ణ చౌదరికి చెందిన ఎడ్లు 3800 అడుగుల దూరం లాగి మొదటి బహుమతి రూ. 25 వేలను గెలుచుకున్నాయి. మోర్జంపాడుకు చెందిన తొగట వీరక్షత్రియ సంఘం ఆధ్వర్యంలో మొదటి బహుమతి అందించారు. మాచవరం మండలం మల్లవోలు గ్రామానికి చెందిన గంటా రమ్యానాయుడుకు చెందిన ఎడ్లు 3593 అడుగులు లాగగా.. చిలకలూరిపేట మండలం కావూరి లింగంగుట్ల గ్రామానికి చెందిన మౌలా త్రివేణి నాయుడుకి చెందిన ఎడ్లు 3305 అడుగులు దూరం లాగాయి. ఈ రెండీటికి కలిపి ద్వితీయ బహుమతిని కేటాయించారు. వీరికి రూ. 20 వేల నగదును నీలం శ్రీనివాసరావు, బడిగుంచ్చల వెంకట నర్సయ్య, కొరముట్ల వెంకట నర్సయ్య, కొలిశెట్టి శ్రీనివాసరావులు అందించారు. అలాగే చిలకలూరిపేట మండలంలోని గోవిందాపురం గ్రామానికి చెందిన గుత్తా వెంకాయమ్మలకు చెందిన ఎడ్ల జత 3000 అడుగుల దూరం లాగి మూడవ స్థానాన్ని కై వసం చేసుకున్నాయి. వీరికి గాను రూ.15 వేల నగదును బడిగుచ్చల వెంకటేశ్వర్లు అందించారు. తాటికొండ మండలం ముక్కాముళ్ల గ్రామానికి చెందిన కొర్ర వెంకయ్య ఎడ్ల జత 2800 అడుగుల దూరం లాగి నాల్గొ స్థానంలో కై వసం చేసుకున్నాయి. రూ. 10 వేలను జోకా అమరలింగేశ్వరరావు, నరేష్లు అందించారు. నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామానికి చెందిన నల్లూరి నరసింహారావుకి చెందిన ఎడ్ల జత 2270 అడుగుల దూరం లాగి 5వ స్థానం సాధించాయి. వీరికి గాను రూ.8 వేలను బొమ్మళ్ల నాగరాజు, నవీన్లు అందించారు. అదేవిధంగా ఏడోస్థానం వరకు నిలిచిన ఎడ్లకు బహుమతులు లభించాయి. ఎడ్ల ప్రదర్శన తిలకించేందుకు రాష్ట్రంలోని పలు గ్రామాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.


