16,163 వ్యవసాయ క్షేత్రాల్లో భూసార పరీక్షలు
నరసరావుపేట రూరల్: జాతీయ సహాజ వ్యవసాయ మిషన్ కార్యక్రమంలో జిల్లాలోని 16,163 వ్యవసాయ క్షేత్రాల్లో భూసార పరీక్షలు నిర్వహిస్తున్నట్టు జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు తెలిపారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి భూసార పరీక్షలపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం సోమవారం బృందావనం మీటింగ్ హాల్లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జగ్గారావు మాట్లాడుతూ భూసార పరీక్షల ద్వారా రైతులు తమ భూములకు అనువైన పంటలు, భూమిలో సేంద్రీయ కర్భనస్థాయి సమాచారం లభిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డీపీఎం అమలకుమారి మాట్లాడుతూ రైతు సేవా కేంద్రం సిబ్బంది, గ్రామస్థాయి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది కలిసి భూసార పరీక్షలకు అవసరమైన మట్టి నమూనాలను సేకరిస్తారని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమిలో కర్భన శాతం ఎలా పెరుగుతుందో రైతులకు తెలుస్తుందన్నారు. కర్భన శాతం పెరగడం వలన పంటల్లో చీడపీడల ఉధృతి తగ్గి, భూమి ఉత్పాదక శక్తి పెరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర రీసోర్స్ పర్సన్ మధుమోహన్, అదనపు ప్రాజెక్ట్ మేనేజర్ ప్రేమ్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
కొల్లూరు: మద్యం తాగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కొల్లూరులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. బాపట్ల జిల్లా ఆవులవారిపాలేనికి చెందిన సనక రామకృష్ణ(40) కుటుంబం కొన్నేళ్ల క్రితం కొల్లూరు బోస్నగర్ సమీపంలోని అయ్యప్పస్వామి ఆలయం వద్ద స్థిర పడింది. ఇటుకరాయి లోడింగ్ వంటి కూలి పనులు చేస్తున్న రామకృష్ణకు మద్యపానం అలవాటుంది. ఆదివారం కొల్లూరు లాక్ సెంటర్ ప్రాంతంలో మద్యం తాగి వినాయకుడి ఆలయం పక్క వీధిలోని సిమెంట్ రోడ్డుపై మత్తులో పడుకున్నాడు. గమనించిన స్థానికులు పక్కనే ఉన్న అరుగుపై పడుకోపెట్టారు. సోమవారం ఉదయం అతడిని లేపాలని ప్రయత్నించగా పరిశీలించి మృతి చెందినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో మృతుడి తల్లి, భార్య మృతదేహాన్ని ట్రాలీ ఆటోలో తమ గృహానికి తరలించారు. ఇటీవల ఇటుక బట్టీలలో పనిచేసేందుకు వచ్చిన అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన వలసకూలీ మద్యం తాగి అపస్మారక స్థితిలో వంతెన పై నుంచి పడి మృతి చెందడం, తాజాగా సనక రామకృష్ణ మృతితో మందుబాబులలో ఆందోళన నెలకొంది.
16,163 వ్యవసాయ క్షేత్రాల్లో భూసార పరీక్షలు


