మార్చి 14న జాతీయ లోక్ అదాలత్
నరసరావుపేట టౌన్: మార్చి 14న జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు న్యాయమూర్తులు తెలిపారు. జాతీయ లోక్ అదాలత్కు సంబంధించి వివిధ శాఖల అధికారులతో జిల్లా న్యాయమూర్తులు వై.నాగరాజు, సీహెచ్వీఎన్ శ్రీనివాసరావు, వి. శరత్బాబు, డీఎల్ఎస్ఏ కార్యదర్శి జియావుద్దీన్లు మంగళవారం 13వ అదనపు జిల్లా కోర్టు ప్రాంగణంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సివిల్ కేసుల పరిష్కారంలో తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. ఇరుపక్షాల వారిని కోర్టుకు రప్పించినట్లయితే న్యాయాధికారులు చట్టపరంగా అన్ని అంశాలను వారికి వివరించి కేసు రాజీమార్గం ద్వారా పరిష్కారమయ్యేందుకు కృషి చేస్తారన్నారు. సివిల్ కేసులు పెద్ద సంఖ్యలో పరిష్కారం అయ్యేలా న్యాయవాదులు తమ క్లైంట్లకు తగు సూచనలు ఇచ్చి సహకరించాలని కోరారు. అనంతరం నరసరావుపేట సబ్ డివిజన్లోని పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. క్రిమినల్ కేసుల పరిష్కారానికి సంబంధించి పోలీస్ అధికారులు లేవనెత్తిన సాంకేతికపరమైన పలు అంశాలను న్యాయాధికారులు నివృత్తి చేశారు. సమావేశంలో న్యాయధికారులు కె.మధుస్వామి, ఎన్. వణ్య, రెడ్డిపోగు ఆశీర్వాదం పాల్, ఆవుల సలోమి, ఏపీపీ నల్లమోతు కల్పన, డీఎస్పీ ఎం హనుమంతరావు, సీఐలు ఫిరోజ్, ఎం.వి.సుబ్బారావు, లోకనాథం, ఎస్సైలు, న్యాయవాదులు, వివిధ ఆర్థిక సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
సమీక్షించిన న్యాయమూర్తులు


