అంబటి రాంబాబుకు ప్రాణహాని
పిడుగురాళ్ల: కాపునేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ప్రాణ హాని ఉందని గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి అన్నారు. ఆదివారం విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో ఆయన మాట్లాడుతూ...కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక పూర్తిగా విఫలమైందని, ఇవి కప్పి పుచ్చుకునేందుకు రాష్ట్రంలో ఇటువంటి భౌతిక దాడులకు పాల్పడుతున్నారన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై దాడి, అక్రమ అరెస్టు దుర్మార్గమన్నారు. ఆనాడు ప్రశ్నించినందుకు విజయవాడ నడిబొడ్డున వంగవీటి మోహన్రంగాని చంపించింది చంద్రబాబునాయుడేనని ఆరోపించారు. ఒకరి నాయకుల ఫ్లెక్సీలు మరోక నాయకులు వేసే సాంప్రదాయం ఎప్పుడైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. వేరే పార్టీ వాళ్ల ఫ్లెక్సీలు హేళన చేస్తూ వేయటం చంద్రబాబునాయుడు రాజకీయం కాదా అని ప్రశ్నించారు. దీని మీద అంబటి రాంబాబు ప్రశ్నిస్తే చంపటానికి వెళ్లారని, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్రెడ్డిని అయ్యన్నపాత్రుడు, పట్టాభి, చివరికి చంద్రబాబునాయుడు, లోకేష్, పవన్ కల్యాణ్ ఎన్ని బూతులు మాట్లాడలేదు, ఇప్పుడు ఏదో సత్యహరిచంద్రుల్లా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత రాజశేఖర్రెడ్డి గురించి మాట్లాడ లేదా అని ఆయన ప్రశ్నించారు. జగన్మోహన్రెడ్డిని సోనియాగాంధితో కలిసి జైలులో పెట్టించింది చంద్రబాబునాయుడు కాదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలను రక్షించాల్సిన ప్రభుత్వం చివరికి మాజీ మంత్రులకే రక్షణ లేకుండా పోతుందన్నారు. అంబటి రాంబాబుకి బయట రక్షణ లేదని, ఇప్పుడు అరెస్టు చేసి జైలుకి తీసుకెళ్లారని, జైల్లో కూడా రక్షణ ఉంటుందో లేదో అని ఆందోళనగా ఉందన్నారు. రాజకీయాల్లో నేతలు ఒకరిపై ఒకరు బూతులు, అనుచిత వ్యాఖ్యలు చేయ డం సరికాదని, చంద్రబాబు, లోకేష్, పవన్కల్యాణ్లే కారణమని పేర్కొన్నారు. ప్రజల దృష్టి ని మళ్లించడానికి చంద్రబాబు ఇలాంటి దాడులు చేస్తున్నారని, దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేయబోతుందని తెలిపారు.
రక్షణ కల్పించాల్సిన బాధ్యత
ప్రభుత్వానిదే
మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి


