అర్ధాకలి చదువులు
● గుంటూరు జిల్లాలో కలెక్టర్ ఆదేశాలతో గత నెల నుంచి అల్పాహార పంపిణీ ప్రారంభించారు. అయితే పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఇంకా ప్రారంభించలేదు. జెడ్పీ నుంచి నిధులు విడుదల చేసిన తరువాతే అల్పాహార పంపిణీ చేసేందుకు విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. ఈ విధంగా పల్నాడు జిల్లాలో 16,020, బాపట్ల జిల్లాలో 4,965 మంది విద్యార్థులు అల్పాహారం కోసం ఎదురు చూస్తున్నారు.
● గత ఏడాది మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు అల్పాహారాన్ని అందించేందుకు నిధులు కేటాయించిన జిల్లా పరిషత్, పరీక్షలకు కేవలం నెల రోజులు ముందు దానిని అమలు పర్చింది. వంద రోజుల ప్రణాళికలో భాగంగా డిసెంబర్ మొదలు జనవరి, ఫిబ్రవరి నెలల్లో అదనపు తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు పరీక్షలకు ముందుగా అదీ కేవలం నెల రోజుల పాటు అల్పాహారాన్ని అందించడం వల్ల పెద్దగా ప్రయోజనం కనిపించ లేదు. విద్యార్థికి రూ.7.50 చొప్పున కేటాయించిన నిధులు వారి కడుపు నింపేందుకు ఉపయోగపడలేదు.
● ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 16 నుంచి జరగనున్న టెన్త్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు అల్పాహారాన్ని అందించేందుకు ఇప్పటి వరకు ఎటువంటి ప్రతిపాదనలు సిద్ధం కాలేదు. ప్రతి పాఠశాల నుంచి నూరు శాతం ఉత్తీర్ణత పేరుతో వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అంటూ హడావుడి చేస్తున్న విద్యాశాఖాధికారులు విద్యార్థులకు అల్పాహారాన్ని అందించే విషయమై కనీస ఆలోచన చేయడం లేదు.
అర్ధాకలితో తరగతులకు హాజరు కావడం, హాజరైనా బోధనపై ఎంత వరకు దృష్టి కేంద్రీకరించగలరనే అంశాలను క్షేత్రస్థాయిలో విస్మరిస్తున్నారు. మరోవైపు నూరు శాతం ఉత్తీర్ణత అంటూ అధికారుల హెచ్చరికలు, ఆకస్మిక తనిఖీలతో ఉపాధ్యాయులు బెంబేలెత్తుతున్నారు.
టెన్త్ పబ్లిక్ పరీక్షలకు నెలన్నరే వ్యవధి అల్పాహారానికి నోచుకోని విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత లక్ష్యంతో నూరు రోజుల ప్రణాళిక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకధాటిగా తరగతులు గుంటూరు మినహా పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కడుపు మాడ్చుకుని చదువుతున్న విద్యార్థులు
గుంటూరు ఎడ్యుకేషన్: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి సన్నద్ధమవుతున్న విద్యార్థులకు అల్పాహారం కరువైంది. మార్చి 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా, విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏకధాటిగా నిర్వహిస్తున్న రెగ్యులర్, అదనపు తరగతులకు హాజరవుతున్న విద్యార్థులు మధ్యాహ్న భోజనంతో సరిపెట్టుకుని, సాయంత్రం అదనపు తరగతులు ముగిసే వరకు ఖాళీ కడుపులతో చదువుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి 32,276 మంది విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు.
ఉదయం ఏడు గంటలకే పాఠశాలలకు పయనం
పట్టణ, మండల కేంద్రాల్లోని ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలలకు దూర ప్రాంతాల నుంచి వ్యయ, ప్రయాసలకోర్చి ఉదయం 7 గంటలకే వస్తున్న విద్యార్థులు సాయంత్రం వరకు చదువులో నిమగ్నమై ఉంటున్నారు. టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో ఎస్సీఈఆర్టీ ద్వారా నూరు రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించిన ప్రభుత్వం పాఠశాలల్లో నిర్భంధంగా అమలు చేస్తోంది.