స్నేహితురాలి పథకం ప్రకారమే దోపిడీ
పిడుగురాళ్ల: స్నేహితురాలే దోపిడీకి పథకం రచించి అమలు చేసినట్లు తేలిందని గురజాల డీఎస్పీ జగదీష్ తెలిపారు. పట్టణ పోలీస్స్టేషన్లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పిడుగురాళ్ల మండలం వీరాపురం గ్రామంలో ఈ నెల 24వ తేదీన జరిగిన చైన్ స్నాచింగ్ కేసును ఛేదించామని తెలిపారు. దాచేపల్లి నుంచి వీరాపురం గ్రామానికి కూలి పనుల నిమిత్తం వెళ్తున్న సీతమ్మను గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి కత్తితో బెదిరించి బంగారు గెలుసుతోపాటు ఆమె పక్కనే స్నేహితురాలు కొల్లి శిరీష ఫోన్ను లాక్కుని వెళ్లిపోయారు. సీతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అనుమానంతో శిరీషను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం వెలుగుచూసింది. ఆమెకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. తనతోపాటు పొలానికి వచ్చే సీతమ్మ మెడలో బంగారు గొలుసు చూసి దోపిడీకి పథకం రచింంచింది. అందులోభాగంగా తెల్లవారుజామున ఐదు గంటలకు సీతమ్మను తన వెంట పొలానికి తీసుకొని వెళ్లింది. స్నేహితుడు వినుకొండ సురేష్, వినుకొండ అశోక్ల సహకారంతో సీతమ్మ నోరుమూసి బంగారు గెలుసు దోచుకెళేల్లా పథకం అమలు చేసింది. అనుమానం రాకుండా శిరీషకు చెందిన్ సెల్ ఫోన్ కూడా లాక్కెళ్లారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. పిడుగురాళ్ల పట్టణ సీఐ శ్రీరాం వెంకట్రావు, ఎస్ఐలు మోహన్, శివనాగరాజు, సిబ్బంది సమావేశంలో ఉన్నారు.


