ఇంటర్ ప్రాక్టికల్స్కు సర్వం సిద్ధం
సత్తెనపల్లి: జిల్లాలో ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో 131 జూనియర్ కళాశాలల్లో 34,371 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఎంపీసీ, బైపీసీకి సంబంధించి ప్రాక్టికల్స్కు హాజరయ్యే విద్యార్థులు 12,604 మంది ఉన్నారు. వీరి కోసం 77 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెగ్యులర్ విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి. ఒకేషనల్ విద్యార్థు లకు ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలో ఒకేషనల్ విద్యార్థులు 2,082 మంది ఉన్నారు. విద్యార్థులకు ఈసారి సెల్ఫ్ సెంటర్లలోనే పరీక్షలు నిర్వహించనున్నారు. ఏదైనా కళాశాలలో 50 మంది లోపు విద్యార్థులు ఉంటే సమీపంలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ కళాశాలలో ప్రాక్టికల్స్కు హాజరు కావలసి ఉంటుంది. సెల్ఫ్ సెంటర్లు కలిగిన ప్రైవేట్ కాలేజీలు ర్యాంకులే లక్ష్యంగా అవకతవకులకు పాల్పడుతున్నాయని ఏటా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఈసారి ప్రతి సెంటర్లో సీసీ కెమెరాల నిఘాలో నిర్వహించేందుకు బోర్డు చర్యలు చేపట్టింది. కెమెరాలు నేరుగా కమిషనర్ కార్యాలయానికి అనుసంధానమై ఉంటాయి.


