వైభవం.. సాయిబాబా మందిర వార్షికోత్సవం
పెదవడ్లపూడిలో భగవాన్ శ్రీ సత్యషిరిడీసాయిబాబా మందిరం 20వ వార్షికోత్సవం పోటెత్తిన భక్తులు..అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
మంగళగిరి టౌన్: దక్షిణ షిరిడీగా ప్రసిద్ధి గాంచిన మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో వున్న భగవాన్ శ్రీ సత్యషిరిడీసాయిబాబా మందిరం 20వ వార్షికోత్సవం ఆలయ కమిటీ చైర్మన్ పాతూరి నాగభూషణం ఆధ్వర్యంలో మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. బాబాను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉదయం బాబాకు క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం రామినేని ఫౌండేషన్ చైర్మన్ ధర్మప్రచారక్ ఆధ్వర్యంలో స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించారు. పలువురు ప్రముఖులు వార్షికోత్సవానికి హాజరై బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సుమారు 70 వేల మందికి పైగా భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. చిన్నారులకు, పెద్దలకు వినోదాన్ని అందించేందుకు ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, రాష్ట్ర పద్మశాలీ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, హ్యాండ్ల్యూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ప్రధాన కార్యదర్శి సిసోడియా, మెడికల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీహరిరావు, రాజ్యసభ మాజీ సభ్యులు గరికపాటి మోహనరావు, ఏపీ స్పెషల్ రిప్రజెంటేటివ్ ఫర్ నార్త్ అమెరికా కోమటి జయరాం, రిటైర్డ్ డీజీపీ మాలకొండయ్య, గంగాధర్ నాదెళ్ళ, బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పంతల సురేష్, ఎన్ఆర్ఐలు యలమంచిలి జగదీష్బాబు, కావూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. స్వామివారి కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించి జయప్రదం చేసిన భక్తులందరికీ ఆలయ కమిటీ చైర్మన్ పాతూరి నాగభూషణం ధన్యవాదాలు తెలిపారు.
వైభవం.. సాయిబాబా మందిర వార్షికోత్సవం


