వైఎస్సార్సీపీలో పలువురు నాయకుల నియామకం
నరసరావుపేట: వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాలోని పలువురు నాయకులను వివిధ హోదాల్లో నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు స్టూడెంట్ వింగ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మాచర్లకు చెందిన పొట్టిపోగు రూత్బాబు, ఐటీ వింగ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా గురజాలకు చెందిన బొడ్డపాటి రాజశేఖరరెడ్డి, మహిళా విభాగ జిల్లా ఎగ్జిక్యూటీవ్ మెంబర్గా గురజాలకు చెందిన వజ్రాల భ్రమరాంబ, సత్తెనపల్లి నియోజకవర్గ వాలంటీర్ల వింగ్ అధ్యక్షులుగా సత్తెనపల్లికి చెందిన యడలపురపు శ్రీనాథ్ నియమితులయ్యారు.
రైలు కిందపడి పెయింటర్ ఆత్మహత్య
సత్తెనపల్లి: కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సత్తెనపల్లి మండలం భీమవరం రైల్వే గేటు వద్ద శుక్రవారం జరిగింది. వివరాలు... పట్టణంలోని సంఘం బజార్కు చెందిన పెయింటర్ గైక్వాడ గోపీనాథ్ (29) మద్యం తాగుతుంటాడు. ఈ క్రమంలో భార్య పుట్టింటికి వెళ్లింది. మద్యం మానేసినప్పటికీ తిరిగి రావడం లేదని, మానసిక పరిస్థితి బాగాలేక పోవటంతో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అల్లుడి పెద్దకర్మ సరుకుల కోసం వెళ్తూ
అత్త మృతి
సత్తెనపల్లి: అల్లుడి పెద్దకర్మ సరుకుల కోసం వస్తూ అత్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన సత్తెనపల్లి మండలం బృగుబండ నుంచి పాకాలపాడు శివారు మార్గంలో శుక్రవారం జరిగింది. వివరాలు... క్రోసూరు మండలం గుడిపాడుకు చెందిన సిద్దిల మరియమ్మ అలియాస్ మేరమ్మ (50)కు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు వ్యవసాయ పనులు చేస్తూ జీవనం వెళ్లదీస్తున్నాడు. కుమార్తెను సత్తెనపల్లి మండలం బృగుబండ గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అల్లుడు ఈ నెల 7న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందాడు. పెద్దకర్మకు సంబంధించిన సరుకులు కొనుగోలు చేసేందుకు శుక్రవారం తన వరుసకు చెల్లి, మరిది అయిన ఇరువురితో కలిసి మరియమ్మ ద్విచక్ర వాహనంపై సత్తెనపల్లి వస్తోంది. అదే సమయంలో మట్టి ట్రాక్టర్ పాకాలపాడు శివారు వద్ద ఢీకొంది. మరియమ్మ తలపై నుంచి ట్రాక్టరు టైర్ వెళ్లడంతో మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వైఎస్సార్సీపీలో పలువురు నాయకుల నియామకం


